మధ్యాహ్నానికల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఫలితాలు

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం (ఆగస్టు 14) వెలువడనున్నాయి. ఈ ఉప ఎన్నికలను తెలుగుదేశం, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సార్వత్రిక ఎన్నికలకు మించిన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓ రేంజ్ లో సాగాయి. ముఖ్యంగా పిలివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ సందర్భంగా యుద్ధవాతావరణం కనిపించింది. అయితే పోలింగ్ రోజునే వైసీపీ చేతులెత్తేసి ఓటమిని అంగీకరించేశామంటూ పరోక్షంగా అంగీకరించేసిందని పరిశీలకులు ఆ పార్టీ నేతల ప్రకటనలు, ఆరోపణలను ఉదహరిస్తూ విశ్లేషిస్తున్నారు. ఆఖరికి వైసీపీ అధినేత జగన్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేయడంతోనే.. ఆ పార్టీ మానసికంగా ఓటమికి సిద్ధమైపోయిందని అవగతమైపోయందని అంటున్నారు. ఏది ఏమైనా గురువారం (ఆగస్టు 14) ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికి ఫలితం వెలువడుతుంది. ఈ నేపథ్యంలో  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీస్థానాలలో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రమైన కడపలో అన్ని ఏర్పాట్లూ చేశారు.   కడపలోని  పాలిటెక్నిక్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. పులివెందులలో మొత్తం పది వేల 601 ఓట్లకు గాను 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి.  ఇక ఒంటిమిట్ట విషయానికి వస్తే.. ఈ జడ్పీటీసీ స్థానం ఓట్ల లెక్కింపునకు కూడా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా, పోలైనవి 20 వేల 681. 

తిరుమల గెస్ట్‌హౌస్‌ పేరిట ఫేక్ వెబ్‌సైట్లు..వాటిని నమ్మొద్దు : పోలీసులు

  తిరుమలలో  శ్రీవారి దర్శనం, వసతుల పేరిట ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లు పెరుగుతున్నాయి. వాటిని నివారించడానికి తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు తిరుమల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతులు కల్పిస్తామంటూ ఇంటర్నెట్‌లో 30కిపైగా నకిలీ వెబ్‌సైట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సెర్చ్‌ ఇంజిన్‌ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 28 నకిలీ వెబ్‌సైట్లను తొలగించినట్లు పేర్కొన్నారు. భక్తులు ఎవరైనా తిరుమలలో వసతుల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసినప్పుడు.. సప్తగిరి గెస్ట్‌హౌస్‌, నందకం గెస్ట్‌హౌస్‌, పద్మావతి గెస్ట్‌హౌస్‌.. ఇలా కొన్ని గెస్ట్‌హౌస్‌ల పేరుతో వెబ్‌సైట్లు కనిపిస్తే అవి నకిలీవిగా గుర్తించాలని పోలీసులు తెలిపారు.  తిరుమల శ్రీవారి దర్శనం, వసతులు, సేవల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.orgను మాత్రమే సందర్శించాలని చెప్పారు. వాట్సప్‌ కాల్‌, క్యూఆర్‌ కోడ్‌ పంపించి పేమెంట్‌ చేయాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దన్నారు. ఇలాంటివి అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌/100/టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004254141ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.  

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ  ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  వరద నీటిని సద్వినియోగం చేయండి ఎగువ నుంచి వస్తున్న నీటిని  సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్ధ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని.. ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణా పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు.  గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని  అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.  అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్..ఎందుకంటే?

  మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి  సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు  నిర్దోషిగా ప్రకటించింది. సిబిఐ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. సీబీఐ అధికారులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది..  సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆమెపై విచారణకు ఆదేశించాలని హైకోర్టుని కోరింది.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది..ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని   హైకోర్టు లో సీబీఐ సవాల్ చేసింది.. సబితతోపాటు మాజీ ఐఎస్ఐ అధికారి కృపానందంపైనా కూడా సీబీఐ పిటిషన్‌ వేసింది.  సిబిఐ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. కేసు విచారణ వాయిదా వేసింది..ఓఎంసీ కేసులో సబిత, కృపానందంలను గతంలో నిర్దోషులు గా ప్రకటించిన సీబీఐ కోర్టు..గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతర నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు గతంలోనే తీర్పించింది..  ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఆదేశం జారీ చేసింది.. ఇప్పుడు సబిత, కృపానందం ల కేసు పైన హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  

స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్‌కు అవమానం

  తమిళనాడులోని ఎంఎస్‌యూ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఆర్.ఎన్. రవి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించేందుకు ఓ విద్యార్థిని నిరాకరించారు. గవర్నర్‌ను దాటుకుని నేరుగా వైస్-ఛాన్సలర్ వద్దకు వెళ్లి ఆమె డిగ్రీని స్వీకరించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.  తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి 650 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వేదికపై ఉన్న గవర్నర్ ఆర్.ఎన్. రవి నుంచి విద్యార్థులు ఒక్కొక్కరిగా పట్టాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నాగర్‌కోయిల్‌కు చెందిన పరిశోధక విద్యార్థిని జీన్ జోసెఫ్ వంతు వచ్చింది. ఆమె వేదికపైకి వెళ్లి గవర్నర్‌ను పట్టించుకోకుండా దాటి వెళ్లిపోయారు.  నేరుగా వైస్-ఛాన్సలర్ ఎన్. చంద్రశేఖర్ వద్దకు వెళ్లి ఆయన చేతుల మీదుగా తన పీహెచ్‌డీ పట్టాను స్వీకరించారు.తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య పెండింగ్‌ బిల్లులతోపాటు పలు అంశాలపై విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ భార్య అయిన పీహెచ్డీ విద్యార్థిని జీన్ జోసెఫ్ ఇలా వ్యవహరించింది. గవర్నర్‌ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు దారి మళ్లింపు

  శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో పలు విమానలు అధికారులు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు ఐదుకు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.  

ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ

  దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులో ఈడి విచారణ కొనసాగుతున్నది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ లను ఈడి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈరోజు సినీనటి మంచు లక్ష్మి ని కూడా ఈడి విచారణ చేస్తు న్నారు. మంచు లక్ష్మి గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా అధికా రులు గుర్తించారు. ఈజీగా డబ్బు సంపాదించుకో వచ్చు అంటూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ప్రమో షన్లు చేసినట్టుగా గుర్తించిన ఈ డి ఆమెకు నోటీసులు జారీ చేశారు.  ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతం లో ఈడి కార్యాల యానికి చేరుకు న్నారు. ఇంకా విచారణ కొనసా గుతున్నది. మంచు లక్ష్మి yolo 247 బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన ట్లుగా ఆరోపణలు నేపథ్యంలో అధికారులు వాటి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల వివ రాలు సేకరిస్తు న్నారు.. మంచు లక్ష్మిపై పలు ప్రశ్నల వర్షం కురిపిస్తు న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాల యాల్లో ఈడి సోదాలు చేసింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్, మదురై తదితర 15 ప్రాంతాల్లో సోదాలు చేసి....అంతర్జాతీయ స్పోర్ట్స్, బెట్టింగ్ సంస్థ పరిమ్యాచ్ పేరుట అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తు న్నట్లుగా ఈడి గుర్తించింది.  దాదాపు 2000 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నట్లుగా ఈడి ప్రాథమిక దర్యాప్తులో వెల్ల డైంది.దీంతో ఈడి దేశవ్యాప్తంగా బెట్టింగ్ ఆప్ కేసులో పలువురిని  విచారణ చేస్తుంది..  ఈ క్రమంలోనే 1XBET యాప్ ప్రమోట్ చేసినం దుకు క్రికెటర్ సురేష్ రైనాను అధికారులు ఢిల్లీలో విచారిస్తు న్నారు. ఇప్పటికీ రణధీర కపూర్, కపిల్ వర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్ లతోపాటు పలు వురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసింది. అధికారులు క్రికెటర్ యువరాజ్ సింగ్,  హర్భజన్ సింగ్ , సినీ నటుడు సోను సూద్ లను త్వరలో విచారించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలో అనుమతించినందుకు ఫేస్బుక్ (మెటా) గూగుల్ సంస్థలకు కూడా ఈడి సమన్లు జారీ చేసింది.

రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం : మంత్రి శ్రీధర్ బాబు

  పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో వివక్ష చూపించి, రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందంటూ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మండిపడ్డారు.  ‘ప్రపంచ స్థాయి అధునాతన సిస్టమ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 10 ఎకరాల భూమి కేటాయించాం. అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపాం. రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చాం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పెట్టేందుకు సదరు ఇన్వెస్టర్ సిద్ధంగా ఉన్నారు. అయినా... కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని విమర్శించారు.  * కనీస సంసిద్ధత లేని ఏపీకెలా కేటాయిస్తారు..?   అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్ బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముంది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదు. అందుకే ఈ నిర్ణయాన్ని మరోసారి పున:పరిశీలించాల్సిన అవసరముంది. వాస్తవ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి’ డిమాండ్ చేశారు.  *కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. న్యాయం జరిగేలా చొరవ చూపాలి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికీ స్పందించకపోతే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.  

పులివెందుల పులి.. పిల్లి కూతలు

నా ఘోష ఎవరికీ పట్టదా అంటూ జగన్ బేల మాటలు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నారు చలం. ఆయనే ఇప్పుడు బతికి ఉంటే కృష్ణశాస్త్రి బాధ కాదు, జగన్ బాధ ప్రపంచానికి బాధ అని అని  ఉండేవారు. ప్రపంచం అంతా తనకు మద్దతుగా నిలవాలనీ, అందరూ తనకు సానుభూతి చూపాలనీ, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల వల్లే జనం మద్దతు దండిగా ఉన్నా గత ఏడాది ఎన్నికలలో తనకు ఘోర పరాజయం ఎదురైందనీ జగన్ బాధపడటమే కాదు... అందరూ, అన్ని పార్టీల వారూ కూడా తనకు మద్దతుగా ఆ బాధపడాలని గట్టిగా కోరుకుంటారు. అలా తనకు మద్దతుగా నిలవని వారంతా చంద్రబాబుకు దగ్గర అనీ, ఆయనతో కుమ్మక్కు అయ్యారనీ గట్టిగా నమ్మడమే కాకుండా ప్రపంచం కూడా నమ్మాలని కోరుకుంటారు జగన్.  తన అడ్డా అనుకున్న పులివెందులలో వైసీపీ చతికిల పడటం, తన ఖిల్లా అనుకున్న పులివెందుల బీటలు వారడంతో ఆయన ఇక తనకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవన్న నిర్వేదంలో పడిపోయారు  జగన్.  ఇప్పుడు ఆయన  ప్రపంచం అంతా తనపై పగబట్టిందన్న భ్రమల్లో మునిగిపోయారు. దీంతో కోడిగుడ్డుకు, బోడిగుండుకు ముడిపెడుతున్న చందంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ బుధవారం (ఆగస్టు 13) మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ తనకూ, తన పార్టీకీ అన్యాయం జరుగుతున్నా ఎవరూ వచ్చి  ఖండించడం లేదని ఆక్రోశం వెలిబుచ్చారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ఎవరూ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని, పులివెందులలో తన పార్టీ పట్టు కోల్పోవడాన్ని ఎందుకు ఖండించడం లేదని నిలదీస్తున్నారు. ఇంత కాలం తాను దత్తపుత్రుడిగా సహకారం అందించిన ప్రధాని మోడీసైతం మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతే కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు తన పరిస్థితికి కానీ, వైసీపీ పతనానికి కానీ కారణం తానేనన్న విషయాన్ని ఇసుమంతైనా గుర్తించడానికి నిరాకరిస్తూ.. తనకు మద్దతుగా నిలవని వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. అయితే పిల్లి శాపనార్ధాలకు ఉట్టితాళ్లు తెగిపడవన్న సమెతను గుర్తుకు తెచ్చేలా మాట్లాడుతున్నానని గ్రహించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చంద్రబాబుతో నిత్యం హాట్ లైన్ లో మాట్లాడుకుంటూ.. తన పతనానికి కుట్రలు చేస్తున్నారని పులివెందుల ఎమ్మెల్యే యువజన శ్రామిక రైతు పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన సొంత చెల్లి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిత్యం జగన్ పై చేస్తున్న విమర్శలకు జగన్ ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.   అయినా జగన్ కు ఎవరైనా ఎందుకు మద్దతుగా నిలుస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ గత ఏడాది ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అయితే అదే  బీజేపీయేతర పార్టీలు మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు జగన్ ఇసుమంతైనా మద్దతు ఇవ్వలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  అంతే కాదు.. ఇప్పుడు పులివెందులలో రిగ్గింగు, పోలింగ్ బూత్ ల మార్పు అంటూ గగ్గోలు పెడుతున్న జగన్.. రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా హస్తినలో చేపట్టిన ఆందోళనలో పాల్గొనడం అటుంచి కనీసం మద్దతు కూడా ప్రకటించలేదన్న విషయం ఎలా మరచిపోయారు?

కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు

  సుప్రీంకోర్టు సంచలన తీర్పు  ఇచ్చింది.  గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీ ఖాన్ నియామకం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. తమ అభ్యర్థిత్వాన్ని  గవర్నర్ వ్యతిరేకించడం కొత్తగా వీరిని నియమించడాన్ని సవాల్ చేస్తు బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.  తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఖళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడే ఉంటాయిని సుప్రీం పేర్కొన్నాది. వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే, వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025 జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు.  విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. * ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ * మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు.  ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. * సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు : మంత్రి శ్రీధర్ బాబు  ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.  

చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు జప్తు నోటీసు

  హైదరాబాద్‌లో చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు విద్యుత్ శాఖ అధికారులు జప్తు నోటీసులు జారీ చేశారు. రూ. 31,829  కరెంట్ బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది. 2015 జులై 23వ తేదీన మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్‌ను మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంది. ఆ తర్వాత ఆ ఏజెన్సీ వెళ్లిపోయింది.  2021 డిసెంబరు నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో కోసం పని చేసిన ఈ ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును గుర్తించడానికి జప్తు నోటీసును విద్యుత్ సంస్థ అధికారులు చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌‌లో అంటించారు. విద్యుత్ కనెక్షన్‌కు రూ.31,829 బకాయిలు తీసుకున్న థేల్స్ కంపెనీ అడ్రస్ తెలియకపోవటంతో  జప్తు నోటీసును మెట్రో స్టేషన్‌కు ఇచ్చారు  

డిసెంబర్ 31 లోగా జిల్లాల పేర్లు, సరిహద్దులు ప్రకటన

  అమరావతి  సచివాలయంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఇవాళ తొలిసారిగా సమావేశం నిర్వహించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని మంత్రుల భేటిలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి మంత్రుల బృందం వినతులు స్వీకరించనున్నారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్ కు పంపించవచ్చుని వారు తెలిపారు.  సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్వీభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల  మార్పులు ప్రక్రియ ముగిస్తామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు  కోసం కసరత్తు చేస్తామని వారు పేర్కొన్నారు.  రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల  బృందం పని చేస్తుందని వెల్లడించారు. నియోజకవర్గాల జోలికి వెళ్లబోమన్న మంత్రి అనగాని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని...అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అన్న  మంత్రి అనగాని తెలిపారు.ఈ సమావేశానికి  మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గోన్నారు.

ఏపీ లిక్కర్‌ కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

  ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ విజయవాడ  ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో వారి రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో నిందితులను సిట్‌ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య, దిలీప్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ .. గుంటూరు జిల్లా కారాగారంలో నవీన్‌ కృష్ణ, బాలాజీకుమార్‌ యాదవ్‌ రిమాండ్‌లో ఉన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మిథున్‌రెడ్డి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ముగియటంతో మిథున్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. 

పులివెందులలో రీపోలింగ్.. తాడేపల్లిలో వైసీపీ అభ్యర్థి!

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. ఈ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు రంగంలోకి దిగడంతోనే ఇంత కాలం మా కంచుకోట, అడ్డా.. ఇక్కడ మాకు ఎదురే లేదు అంటూ వైసీపీ పలుకులన్నీ ఉత్త డొల్లేనని అవగతమైపోయింది. మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవం వినా ఎన్నిక అంటూ జరగని ఈ స్థానంలో ఎన్నిక జరగడమే ప్రజాస్వామ్య విజయంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. అసలు ఎన్నిక జరగడమే వింత అనుకుంటే ఉప ఎన్నిక ప్రచార పర్వం నుంచీ వైసీపీ బేలతనం అక్కడ ఆ పార్టీకి తిరుగులేని బలం ఉందన్నదంతా ఉత్తుత్తి ప్రచారార్భాటమే అని తేలిపోయిం దంటున్నారు. ఇక పోలింగ్ రోజున అక్రమాలు, అధికార పక్షం దాష్టీకం అంటూ ఆరోపణల పర్వానికి దిగడంతోనే అక్కడ వైసీపీ పరాజయాన్ని అంగీకరించేదిందని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అయినా దింపుడు కళ్లెం ఆశతో రీపోలింగ్ కు డిమాండ్ చేసి రెండు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేయించుకున్న వైసీపీ తీరా రీపోలింగ్ ప్రారంభమైన తరువాత బహిష్కరణ అంటూ చేతులెత్తేయడం వింతల్లోకల్లా వింతగా చెబుతున్నారు. అయితే వీటన్నిటికీ మించిన వింత ఏమిటంటే ఓ వైపు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నహేమంత్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యక్షమైపోయారు. అక్కడ జగన్ మీడియాతో మాట్లాడుతుంటే.. ఆయన పక్కన ఒదిగి ఒదిగి కూర్చోవడం కనిపించింది.  

గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై హాట్ హాట్ చర్చలు!

గత ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా‌ జయదేవ్ కుటుంబం మళ్ళీ తెలుగుదేశంలోకి  రీఎంట్రీ పై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఏపి రాజకీయాలలో ఉద్దండుడు. రెండు సార్లు చిత్తూరు ఎంపీగా గెలిచారు. చంద్రబాబు నాయుడికి సైతం మొదట్లో రాజకీయంగా ఎదగడానికి సాయపడ్డారంటారు. అలాంటి రాజగోపాల్ నాయుడి వారసురాలిగా అయన ఎకైక కూమార్తె  గల్లా అరుణ 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్  నుంచి చంద్రగిరి  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గల్లా అరుణ టిడిపి తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పట్లో పార్టీ మారి వచ్చిన ఆమెను తెలుగుదేశం వారే  ఓడించారనే ప్రచారం జరిగింది. తర్వాత తెలుగుదేశం రాష్ట ఉపాధ్యక్షురాలిగా , పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసినప్పటికీ ఎన్నికల్లో  పోటీకి గల్లా అరుణ దూరంగా ఉండిపోయారు.  అయితే ఆ కుటుంబానికి చెందిన అమె కూమారుడు గల్లా జయదేవ్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గానే కాకుండా సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా కూడా తనను తాను నిరూపించుకున్నారు . 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు మార్లు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో మోడీ ని సూటిగా ప్రశ్నించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు గల్లా జయదేవ్. వైసీపీ తోనూ ఢీ అంటే ఢీ అనే లా జయదేవ్ పోరాడారు. అంత వరకు బాగానే ఉన్నా..  వైసీపీ హయాం సాగిన ఐదేళ్లూ  గల్లా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.   ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని అమర రాజా సంస్థపై వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. పొల్యూషన్ బోర్డు అధికారులు రంగంలోకి దిగి అమరరాజా సంస్థకు వరుస నోటీసులు ఇచ్చారు. ఈ సంస్థ వెదజల్లుతున్న కాలుష్యం ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని నీరు కలుషితం అవుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపణ.  చివరకు ఈ వ్యవహారం కాస్తా అమర్ రాజా సంస్థకు క్లోజర్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళింది. దీంతో అమరరాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా తవణం పల్లి మండలం దిగువ మాఘం గల్లా కుటుంబం స్వగ్రామం. గల్లా కుటుంబంపై జగన్ హయాంలో అక్కడ భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. తమ భూములు ఆక్రమించారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి తదితరులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. గుంటూరులో కూడా ఎంపి జయదేవ్ ఉహించని విధంగా వైసీపీ కార్యకర్తలు, పోలీసుల దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని అంటున్నారు. మిస్టర్  ప్రై మినిస్టర్ అనేంత  ధైర్యం ఉన్న జయదేవ్ జగన్ ప్రభుత్వ కక్షసాధింపులతో విసిగిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికలలో పోటికి సైతం  దూరంగా ఉన్నారు.  అయితే గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో పాటు గుంటూరు నుండి గెలిచిన పెమ్మసాని ఎకంగా కేంద్ర మంత్రి అవ్వడంతో గల్లా జయదేవ్ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారనే భావనలో గల్లా శ్రేయోబిలాషులు ఉన్నారంట. ఇదే విషయాన్నిసన్నిహితుల వద్ద గల్లా కూడా పలు మార్లు చెప్పుకొచ్చినట్లు సమాచారం. మరో ఏడాదిలో రాజ్యసభ స్థానాల భర్తీ ఉండటంతో ఇదే సరైన సమయంగా  భావించిన గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై తన కోరికను బయటపెట్టారనే ప్రచారం సాగుతోంది. గల్లా కుటుంబం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతామంటే  తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాదనే పరిస్థితి లేదంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా కాణిపాకంలో  దేవుడి అనుగ్రహం, నా అవసరం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెద్దలతో చర్చిస్తున్నానంటూ గల్లా జయదేవ్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జయదేవ్ వ్యాఖ్యలు తెలుగుదేశంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే రాజ్యసభ కు ఇప్పటికే పోటి ఎక్కవగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో పరిచయాలు ఉన్న జయదేవ్ వస్తే పార్టీకి మరింత మేలే జరుగుతుంది అనే భావన కొందరు పార్టీ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. అయితే జయదేవ్ ను వ్యతిరేకించే వాళ్ళు కూడా పార్టీలో లేకపోలేదు.  పార్టీ కష్ట సమయాల్లో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో దూరంగా ఉండడం పై గల్లా కుటుంబంపై కొద్ది మంది నేతలు విమర్శలు చేస్తున్నారు.  అప్పుడు వ్యాపార అవసరాల కోసం పూర్తి స్థాయిలో సైలెంటై,  ఇప్పుడు అధికారంలో ఉన్నామని తిరిగి ఎంట్రీ ఇవ్వాలనుకోవడంపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నారంట.

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రెండు వేరు, వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఓ ఘటనలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు. మృతుడ్ని 53వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్‌‌గా గుర్తించారు.  రెండవ ఘటనలో కూలిన చెట్టును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. విజయవాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నది, బుడమేరు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇక, భారీ వర్షాల కారణంగా అచ్చంపేట-మాదిపాడు రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అమరావతి- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బుధ, గురువారం రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అల‌ర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ప్రకటించారు. ఖమ్మం, భ‌ద్రాద్రి, మెద‌క్‌, వికారాబాద్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లాల‌కు రెడ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే కామారెడ్డి, జ‌న‌గామ‌, కుమురం భీం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌, మంచిర్యాల‌, న‌ల్గొండ‌, రంగారెడ్డి, సిద్ధిపేట‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల జిల్లాల‌కు ఆరెంజ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిపారు.  రాష్ట్ర‌ వ్యాప్తంగా రేపు కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డొచ్చ‌ని నాగ‌ర‌త్న తెలిపారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ ఏరియాలో 20 సెంమీటర్ల వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు  

వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి నీటి విడుదల

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది  వరద నీటితో పోటెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న అన్ని డ్యామ్ ల గేట్లనూ ఎత్తి అధికారులు లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఇప్పటికే మూడు సార్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తాజాగా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి మరోసారి కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల 12, శ్రీశైలం 4, నాగార్జున సాగర్ 24, టైల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులుఎత్తివేశారు. దీంతో దిగువన విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజి వద్దకు భారీగా వరద నీరు చేరింది  బెజవాడ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ప్రకాశం బ్యారేజీ  గేట్లు ఎత్తివేసి దిగువకు విడుదల చేశారు.  దీంతో  విజయవాడ దిగువన ఉన్న లంక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికారులు  లంకగ్రామ ప్రజల  అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరించారు.  

ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం

  ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఓ షాపు యజమానిపై  గంజాయి మత్తులో కొందరు పోకిరీలు దాడి చేశారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశారు. రోడ్డు పక్కన ఉన్న షాపులపైనా దాడి చేసి హల్‌చల్ చేశారు. అల్లరిమూక కిరాణం షాపు, టూ వీలర్లపై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో దుకాణదారులు అడ్డుకోబోగా వారిపై దాడికి దిగారు.  ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. గంజాయి మత్తులో పిల్లలు, మహిళల పైనా దాడికి యత్నించారు. గతంలోనూ ఇదే అల్లరి మూక దాడికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా పోలీసులు  గంజాయి బ్యాచ్‌‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.