రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చకు తెరలేపిన ఆలోచనాపరుల సంఘం సూచనలు

ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలన్న  నినాదంతో ఆలోచనపరుల వేదిక ఆధ్యర్యంలో ఈ నెల 4 నుంచి 6 వరకు శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మితమైన ప్రాజెక్టులపై అధ్యాయనం జరిగింది. అలా అధ్యయనానికి వెళ్లి వచ్చిన ఆలోచనాపరుల సంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. సూచనలు అనడం కంటే ఆ మేధావుల సంఘం పలు డిమాండ్లు  వినిపించింది. అదేమంత ఆషామాషీ కమిటీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపధ్యంలో వారి సూచనలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆ ప్రతినిధి బ‌ృందంలో రిటైర్ట్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రైతు సేవా సమితి అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల రంగం విశ్లేషకులు టి. లక్షినారాయణ, నల్లబోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు క‌ృష్ణమూర్తినాయుడు వంటి మేథావులు ఉన్నారు. దీంతో తమ అధ్యయనం తరువాత వారు ఇచ్చిన  సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆలోచనపరుల వేదిక పలు సూచనలు చేసింది.  ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ అలాగే  నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులను సూచిస్తూ..  రైతుల అవసరాలు తీర్చడానికి  నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ఈ సూచనలు ఎంతగానో దోహదపడతాయంటున్నారు.  ముఖ్యంగా, ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ,  నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులను సూచిస్తూ, రైతుల అవసరాలు తీర్చడానికి, నీటి వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ఆ సూచనలు మేలు చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని,  తక్కువ ఖర్చుతో కూడిన, సమర్ధవంతమైన నీటిపారుదల పద్ధతులను ఉపయోగించాలని,  స్థానికుల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించాలని ఆలోచనపరుల సంఘం సూచింది. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒక స్పష్టమైన సమయపాలన ఉండాలంది. ఆ క్రమంలో ప్రాజెక్టుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని,  నీటిపారుదల వ్యవస్థలను ఎప్పటికప్పుడు పరిశీలించి, మరమ్మతులు చేయాలని డిమాండ్ చేసింది. నీటి వనరులను సమర్ధవంతంగా నిర్వహించడానికి సాంకేతికతను ఉపయోగించాల్సి అవసరాన్ని గుర్తు చేసింది.  రైతులకు శిక్షణ ఇస్తే..  వారు నీటిని పొదుపుగా ఉపయోగించుకుంటారనీ, నీటిని వృధా చేయకుండా, పొదుపుగా ఉపయోగించాలని పేర్కొంది. బిందు సేద్యం, స్ప్రింక్లర్ సేద్యం వంటి ఆధునిక నీటిపారుదల పద్ధతులను ఉపయోగించాలని గైడ్ చేసింది.  పంటల ఎంపికలో నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని,నీటిపారుదల వ్యవస్థలను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆలోచనపరుల సంఘం మేధావులు అంటున్నారు.  ఇక రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఒక సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేయడం అత్యవసరమని  పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి..  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిని అరికట్టాలంటూ  ఈ సూచనలను పాటించడం ద్వారా, సాగునీటి ప్రాజెక్టులను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చని ఆలోచనపరుల సంఘం సూచిస్తోంది.  ఇంకా పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో యుద్దప్రాతిపకన పూర్తి చేయడానికి అవసరమైన రూ.5000 కోట్ల నిధులను వ్యయం చేస్తే ఈ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుకు ఫలితం ఉంటుందని పేర్కొంది. శ్రీశైలం ఆధారంగా నంద్యాల జిల్లా పరిధిలో నిర్మించిన , నిర్మాణంలో ఉన్న ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు - నగరి సుజల స్రవంతి, కేసీ కెనాల్, చెన్నైకి తాగు నీరు తరలించే, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బసకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు రిజర్వాయర్, హంద్రీ - నీవా స్రవంతికి నీటిని తరలించే మాల్యాల, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్భించిన ఆలోచనపరుల సంఘం వివిధ సూచనలు చేసింది. ఎస్పార్బీసీని పూర్తి చేయడానికి రూ.250 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించింది.  ఆ క్రమంలో పోలవరం - బనకచెర్ల , రాయలసీ ఎత్తిపోతల పథకాలను విరుమించుకోవాలని కాస్త గట్టిగానే సూచించింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులను కూడా సందర్శించి, అధ్యయనం చేసి ప్రజలకు వివరాలు తెలియచేస్తామని వెల్లడించింది. మొత్తానికి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర మేధావులు వెల్లడించిన అంశాలు అందరిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీ శున‌క పురాణం

ఢిల్లీలో ఒక్క కుక్క కూడా రోడ్లపై క‌నిపించ‌కూడ‌దు. ఎనిమిది వారాల్లోగా వాటిని షెల్ట‌ర్ల‌కు చేర్చండి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాల జారీ వెన‌క అస‌లు స్టోరీ ఏంటి? ఎందుక‌ని సుప్రీం కోర్టు అంత క‌ఠిన‌మైన ఆదేశాలు జారీ చేసింది? అని చూస్తే ఢిల్లీలో నానాటికీ కుక్క‌ల బెడద తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న దృశ్యం క‌నిపిస్తోంది.  దేశ రాజధాని  ఢిల్లీ అంతటా, కుక్క కాటు కేసులు పెరుగుతూనే ఉండటం, ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం తరచూ వార్తలకెక్కుతూనే వస్తోంది. కొందరు కుక్కే కదా కరిచిందని లైట్ తీస్కోవడం వల్ల.. ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రానురాను కుక్కల బెడద పెను ప్రమాదంగా పరిణమిస్తున్న పరిస్థితి నెలకొంది.  ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ డేటా ప్రకారం ఢిల్లీలో కుక్క కాటు కేసులు 2022లో 6,691 నుంచి.. 2023లో 17,874కి, 2024లో 25,210కి పెరిగాయి. అంటే కేవలం రెండేళ్లలోనే కుక్కకాటు బాధితుల సంక్య  277% పెరిగింది. దీంతో ఢిల్లీ వాసుల గుండెలదరిపోతున్నాయ్.   ఈ ఏడాది ఒక్క జనవరిలోనే కుక్కకాటుకు గురైన వారి సంఖ్య 3,196 అంటే పరిస్థితి ఊహించుకోవచ్చు ప్రభుత్వం నిర్వహించే అతిపెద్దదైన సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ డేటా ప్రకారం, 2021 లో 63,361 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. జూలై 2025 నాటికి, ఈ సంఖ్య  91,009కి పెరిగింది, ఇది గతేడాది వార్షిక గణాంకాలను బట్టీ చూస్తే 43.6 శాతం అధికం.  అంటే ప్రతిరోజూ 430 మందికి పైగా కుక్కకాటుకు గురౌతున్నారన్నమాట.  రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఏప్రిల్ 2022- మార్చి 2023 మధ్య 39,216 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2023- మార్చి 2025 మధ్య ఈ కేసుల సంఖ్య  45,432కి పెరిగింది. అంటే పదమూడు శాతం పెరుగుదల నమోదైందన్న మాట. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డిల్లీ అధ్వర్యంలో నడిచే బారా హిందూరావు ఆస్పత్రిలో ఈ ఏడాది జూలై వరకు చూస్తే.. 4,861 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 3,468 కేసులతో పోలిస్తే ఇది 40% ఎక్కువ. ఢిల్లీ సరిహద్దుల బయట కూడా సమస్య తీవ్రంగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో..  ఈ ఏడాది జనవరి- మే మధ్య కాలంలో 74,550 కుక్క  కాటు ఘటనలు నమోదయ్యాయి.  కుక్క కాటు రెండు ప్రధాన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. కేవలం గాయంతో పోయేది కాదిది. ఇన్ ఫెక్షన్  సోకుతుంది. వెంటనే చికిత్స చేయకపోతే చిన్న కాటు వల్ల నరాలు దెబ్బతినడం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అసలైన సమస్య ఏంటంటే మెదడు నాడీ వ్యవస్థపై ఈ ఇన్ ఫెక్షన్  దాడి చేస్తుంది. దీంతో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కాటు ద్వారా కుక్క లాలాజనం మనిషి నరనరాల్లోకి పాకుతుంది. తద్వారా రేబిస్ వస్తుంది. ఈ వ్యాధికి వెంటనే పోస్ట్ ఎక్స్ పోజర్ టీకాలు ఇవ్వడం అత్యంసరం.   చిన్న కాటే కదాని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స చేయక పోతే అది ప్రాణాల మీదకువ స్తుంది. యూపీకి చెందిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ సోలంకి గత జూలైలో రేబిస్ సోకి మరణించారు. సుమారు మూడు నెలల క్రితం బ్రిజేష్ సోలంకీ ని తన పెంపుడు కుక్క పిల్ల కరిచింది. దాన్ని చిన్న గాయంగా పరిగణించిన బ్రిజేష్.. రేబిస్ ఇంజక్షన్ తీసుకోలేదు. దీంతో ఆయన చనిపోయారు. ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2022–23లోనే భారత్ లో రేబిస్ వ్యాధి సుమారు 5,700 మందిని పొట్టనపెట్టుకుంది. దీన్ని బట్టీ రేబిస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇదంతా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం కారణంగా జరుగుతూ వస్తోంది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ కింద స్టెరిలైజేషన్, టీకా డ్రైవ్ లు చేస్తున్నట్టు ఎన్జీవోలు ఇతర పౌర సంస్థలు చెప్పుకుంటున్నాయి. కానీ, గ్రౌండ్ లెవల్లో ఇదంతా జరగలేదని నానాటికీ పెరిగిపోతున్న కుక్కల బెడదను బట్టి అర్ధం అవుతోంది. 2022- 24 మధ్య కాలంలో ఢిల్లీలో లక్షకు పైగా స్టెరిలైజేషన్స్ జరిగినట్టు చెబుతాయి గణాంకాలు. అయితే కుక్కల బెడద మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.  వీధి కుక్కల బెడద ఎదుర్కునే వారు..  ఎంసీడీ-311 యాప్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ 155305 ద్వారా తాము ఎదుర్కుంటున్న సమస్యలను రిపోర్ట్ చేయవచ్చు. అంతే కాదు స్టెరిలైజేషన్ వంటి డీటైల్స్ కూడా వీటిలో నమోదు చేయవచ్చు. అయితే దీని ద్వారా ఢిల్లీలోని వీధి కుక్కల సమస్య ఎంత మేర అధిగమించగలం అన్నది ప్రశ్నార్ధకంగానే మిగిలింది. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు.  2023లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను బంధించి ఎలాగోలా కట్టడి చేశారు. ఎప్పుడైతే ఈ సమావేశం ముగిసిందో తిరిగి వీధి కుక్కలను వదిలేశారు. దీంతో గూండా రాజ్ లా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో డాగ్ రాజ్ రాజ్యం చేస్తోంది. వీటికి స్టెరిలైజేషన్ లేదు, షెల్టర్ల ఏర్పాటు అంతకన్నా లేదు. శాశ్వత పరిష్కారం చూపించడమూ లేదు. ఇక పోతే విశ్వనగరం అయిన మన హైదరాబాద్ పరిధిలో ఈ మధ్య వీధి కుక్కల వల్ల తలెత్తుతున్న సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నారుల పై వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే..  పసి పిల్లలు కుక్కల దాడిలో మరణించారు కూడా.  దీంతో  ప్రజలు తమ పిల్లలను రోడ్లపై ఆటలకు పంపేందుకు కూడా భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఏ వీధి కుక్క వచ్చి దాడి చేస్తుందో అన్న భయంతోనే ఆడుకోవల్సిన పిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తున్నారు. మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా? అయితే, టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని జీహెచ్ఎంసీ ఓ ప్రకటన ద్వారా తెలియ చేసింది. విదేశాల్లో అలాక్కాదు. ఇక్కడి వారికి  ఒకింత జంతు ప్రేమ ఎక్కువే. ఆ మాటకొస్తే మానవ హక్కులకన్నా జంతు హక్కులు ఒకింత కఠినంగానే ఉంటాయిక్కడ. వదిలేసిన పెంపుడు జంతువులు కూడా ఇక్కడ వివిధ షెల్టర్లలో హాయిగాసేద తీరుతుంటాయి. వీటికి స్టెరిలైజేషన్ చేసి మైక్రో చిప్ జత చేసి.. దత్తత తీసుకోవడానికి వీలుగా వీటిని మెయిన్ టైన్ చేస్తారు. ఒక వేళ ఎవరూ ముందుకు రాకుంటే ప్రభుత్వాలే.. వాటిని సకల సౌకర్యాలతో సంరక్షిస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచం సమస్త జంతు జాలానిది. ఈ భూమిపై నివసించడానికి మనకెంత హక్కుందో- వాటికీ అంతే హక్కుందని విశ్వసిస్తారక్కడ.

ఎస్ఎల్ బీసీ కూల‌డానికి క్షుద్ర పూజ‌లు.. కోమ‌టిరెడ్డికి పూజ‌ల పిచ్చి ప‌ట్టిందా?

ఒక‌ప్ప‌టి కోమ‌టిరెడ్డికి ఇప్ప‌టి కోమ‌టిరెడ్డికి చాలానే తేడా ఉన్న‌ట్టుంది చూస్తుంటే. ఆయ‌నకు ఇచ్చిన శాఖ‌ల్లో సినిమాటోగ్ర‌ఫీ శాఖ కూడా ఉంది. ఒక ప‌క్క అక్క‌డ సినీ  కార్మిక లోకం వ‌ర్సెస్ నిర్మాత‌లుగా బీభ‌త్సమైన యుద్ధం జ‌రుగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు సంధించు కుంటున్నారు.  మూడేళ్ల‌య్యింది మాకు జీతం పెంచి  అని కార్మికులు అంటుంటే, మీక‌స‌లు టాలెంటే లేదు. మేం ఐటీ  ఎంప్లాయిస్ క‌న్నా ఎక్కువ వేత‌నాలిస్తున్నాం అని నిర్మాత‌లంటున్నారు. తొలి నుంచి సినీ ప‌రిశ్ర‌మ అవినీతి అడ్డా, అక్ర‌మాల పుట్ట అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ కి  చెంద‌ని నిర్మాత విశ్వ ప్ర‌సాద్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు .  ఒక వేళ కోమ‌టిరెడ్డి ఏదైనా స‌మ‌స్య తీస్కుని పోరాడాల్సి ఉంటే..  సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అంశం ఏదైనా తీస్కుని దాన్ని సాల్వ్ చేయాలిగానీ.. ఎస్ఎల్ బీసీ కూల‌డానికి క్షుద్ర పూజ‌లు చేశారంటూ ఆరోపణలేంటో అర్ధం కావ‌డం లేదంటారు కొంద‌రు. ఒక వేళ కేసీఆర్ అండ్ కో కోరుకున్నారన్నదే ఆ ఆరోపణల అయితే అందులో హేతువు కనిపించదు. ఎందుకంటే కేసీఆర్ అండ్ కో కూలాలని కోరుకోవడం అంటూ జరిగితే ఎస్ ఎల్ బీసీ కాదు.. ఏకంగా రేవంత్ సర్కారే ప్ర‌భుత్వ‌మే కూలాల‌ని కోరుకుంటారు కానీ ఎక్క‌డో ఉన్న ఎస్ఎల్బీసీ కూలితే వారికేమి వ‌స్తుంది? అర్ధం కావ‌డం లేదని అంటారు కొంద‌రు.  మొన్న కూడా ఇలాగే రేవంతే సీఎంగా ప‌దికాలాల పాటు ఉండాల‌ని గ‌ణ‌ప‌తి పూజ చేయించానంటారు కోమ‌టిరెడ్డి. కంటి ముందున్న ప‌ని ప‌క్క‌న పెట్టి.. ఈ పూజ‌ల పిచ్చేంద‌ని పరిశీలకులు సైతం బుర్రలు గొక్కుంటున్నారు.  ఒక ప‌క్క త‌మ్ముడు చూస్తే మంత్రి ప‌ద‌వి కావాలంటూ మారాం చేస్తున్న చిన్న పిల్లాడిలా క‌నిపిస్తుంటే. మ‌రో ప‌క్క అన్న చూస్తే ప్ర‌తిదానికీ పూజ‌ల‌కు లింకుబెట్టి మాట్లాడ్డం క‌నిపిస్తోంది.. ఏంటిదంతా? ఎందుకిలా  జ‌రుగుతోంది. ఉన్న స‌మ‌స్య‌ను ప‌క్క‌న బెట్టి ఈ టాపిక్ డైవ‌ర్ష‌నేంట‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ ఎస్ఎల్బీసీకి చెందిన ఇరిగేష‌న్ శాఖ కూడా ఆయ‌న‌ది కాదు. ప్ర‌స్తుతం త‌న శాఖ‌కు సంబంధించిన శాఖ సినిమాటోగ్రఫి. సినీ పరిశ్రమలో ఇంత లొల్లి జ‌రుగుతుంటే అది పట్టకుండా  కోమ‌టిరెడ్డి ధోర‌ణి ఇలా ఉందేమిటన్నది  ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

టి కాంగ్రెస్ లో కోమటి రెడ్డి సెగ.. రోజుకో ట్వీట్ తో అధిష్టానానికి తలనొప్పి!

 రేవంత్ కు పొగ పెడుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెగ పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా   రోజుకో ట్వీట్ పెడుతూ కాకరేపుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాని ఇప్పడు మోసం చేశారని రగిలిపోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలను తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ పై అసంతృప్తితో ఉన్న నాయకులంతా ఆయనకు అంతర్గతంగా మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిన తరువాత తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా రాజగోపాలరెడ్డి కి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు  తెలిపారు. ఇంతకాలం మౌనంగా ఉన్న భట్టి తాజాగా రాజగోపాల్ కు అనుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ లో తొలి నుంచి ఉన్న తమను కాదని రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించడం,  ఆ తరువాత ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం  సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని వివిధ సందర్భాల్లో  పరోక్షంగా తమ విముఖతను, వ్యతిరేకతనూ వ్యక్తం చేస్తూ వస్తున్నారు.  ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి ఏకంగా ఒకడుగు ముందుకేసి నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. వరంగల్ జిల్లాకు చెందిన  కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కమిటీ వెంటనే స్పందించింది. అటువంటిది నేరుగా ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేసినా కనీసం క్రమశిక్షణ కమిటీ నుంచి చర్యలు లేకపోవడం చూస్తే రేవంత్ కు పొగ పెడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ లో తొలి నుంచీ ఉన్నదే.. అయితే సోనియా గాంధీ ఎఐసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతికి దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో పాత సంస్కృతిని మళ్లీ తీసుకువస్తారా అనే అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 

ఓట‌ర్లు మీకే ఓటేస్తామ‌ని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్

వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ల మార్పుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల ఓటర్లు సమీపంలోని బూత్ లలో కాకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలోని బూత్ కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తున్నదని పేర్కొంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి  హైకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.   ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఎన్నికల అధికారుల, వైసీపీ తరఫు న్యాయవాదుల వాదనలు నమోదు చేసింది. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం ఈ దశలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.  ఓటర్లు అంతా మీకు అనుకూలమనీ, మీకే ఓట్లు వేస్తారనీ ఎలా నిర్ధారిస్తారని వైసీపీని నిలదీసింది. దీనిపై   వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్న ఈ దశలో పోలింగ్ బూత్ ల మార్పుపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చి చెబుతూ వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చింది.   

పులివెందులలో ఘర్షణ వాతావరణం.. అంతటా టెన్షన్ టెన్షన్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది. మంగళవారం (ఆగస్టు 12) ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను ఏరపాటు చేశారు. పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులున్నారు. అయితే పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.   ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఎర్రిపల్లిలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. కాగా పోలింగ్ ప్రారంభానికి కొద్ది సేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడప తరలించారు. అలాగే తెలుగుదేశం, వైసీపీలకు చెందిన కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. మొత్తం మీద పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందా అన్నట్లుగా టెన్షన్ వాతావరణం ఉంది.  

తెలంగాణ బీజేపీ చీఫ్ హౌస్ అరెస్ట్.. ఎందుకంటే?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) హౌస్ అరెస్ట్ చేశారు. అసలింతకీ రామచందర్ రావును పోలీసులు ఎందుకు హౌస్ అరెస్టు చేశారంటే.. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కూల్చివేతలపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం (ఆగస్టు 12) పెద్దమ్మగుడి వద్ద కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెచ్చరిల్లే అవకాశం ఉందన్న భావనతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావును హౌస్ అరెస్టు చేశారు. ఇలా ఉండగా రామచందర్ రావు హౌస్ అరెస్టును బీజేపీ నేతలు ఖండించారు.ఇలా ఉండగా పెద్దమ్మగుడి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.  

ప్రలోభాలు, బెదరింపులతో వైసీపీ స్వైర విహారం.. బీటెక్ రవి

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేసిందని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. వైసీపీ నేతలు ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేశారనీ, పోలింగ్ ప్రారంభమైన తరువాత కూడా ఈ పంపిణీ సాగుతోందని పేర్కొన్న ఆయన.. అవినీతి సొమ్మును జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని విమర్శించారు.   జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించారనీ, వైసీపీకి అనుకూలంగా పని చయకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించానీ బీటెక్ రవి చెప్పారు.  ముందు ఓటర్లను ప్రలోభపెట్టారు. ఫలితం కనిపించకపోయే సరికి బెదరింపులకు దిగారని అన్నారు. మూడున్నర దశాబ్దాలలో పులివెందులలో తొలి సారిగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతన్నాయన్న ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి ఓట్లు రావన్న భయంతో ఇష్టారీతిగా తెలుగుదేశంపైనా, ప్రభుత్వంపైనా దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారన్నారు.  అయితే పులివెందుల ప్రజలు అన్నీ గ్రహించారనీ, తెలుగుదేశంవైపే నిలిచారని బీటెక్ రవి అన్నారు.  

వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని కడపకు తరలించారు.  అలాగే తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. అదే విధంగా వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్ది సేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కడపకు తరలించారు. అలాగే తెలుగుదేశం, వైసీపీకి చెందిన పలువురు నేతలను కూడా అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పులివెందులలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144వ సెక్షన్ విధించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు, ఓటర్లు తన ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు.  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా పులివెందుపైనే ప్రధాన పార్టీలు రెండూ దృష్టి సారించాయి. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం కూటమి, వైసీపీ కూడా ఈ జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇరు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచార సమయంలోనే ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా.. పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి రంగంలో ఉండగా, వైసీపీ అభ్యర్థిగా  హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో సహా మొత్తం 11 మంది బరిలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.  

పులివెందుల జడ్పీటీసీ ఉపపోరు ముందు వైసీపీకి బిగ్ షాక్

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పుపై జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం(ఆగస్టు 11) ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమంటూ స్పష్టం చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది.    జడ్పీటీసీ ఉప ఎన్నికలో  ఆరు పోలింగ్ బూత్‌లు మార్చాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. అయితే మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నదనీ, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందంటూ ఈసీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న ఏపీ హైకోర్టు.. ప్రస్తుతం పోలింగ్ బూత్ ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతొ హైకోర్టులో వైసీపీకి చుక్కెదురైనట్లైంది.   ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. మండల కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లుతోపాటు ఇతర పోలింగ్ సామాగ్రి చేరుకుందని పేర్కొన్నారు.  మంగళవారం పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని ఆరు గ్రామ పంచాయతీల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.  మొత్తం 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  ఇక పులివెందుల జడ్పీటీసీ పరిథిలోని గ్రామాలు సమస్యాత్మకం కావడంతో.. దాదాపు 700 మందితో భద్రతా ఏర్పాట్లు చేసింది.  

పన్నులు తెలంగాణకు.. సమస్యల తలనొప్పులు ఏపీకీనా?

తెలుగు చిత్రపరిశ్రమ తీరు పట్ల ఏపీలో ఆగ్రహం  మీ ఇంటికొస్తే ఏమిస్తావ్.. మాయింటి కొస్తే ఏం తెస్తావ్ అన్నట్లుగా ఉంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల తీరు. ఔను తెలుగు సినీ పరిశ్రమ తీరు అడ్డగోలుగా ఉంది. పన్నులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతాం.. మా సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలంటూ దబాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  . ఉండేది తెలంగాణ రాజధానిలో ... టాక్స్ లు  కట్టేది అక్కడి ప్రభుత్వానికి, ఎనభై శాతం షూటింగ్ లు జరిపేది కూడా అక్కడే.  పనిచేసే కార్మికులు కూడా80 శాతం మంది తెలంగాణ వారే.  అక్కడ కార్మికులకు కడుపు కాలి ధర్నాలు చేస్తే.. ఏపీ సర్కార్ చర్చలు జరిపి పరిష్కరించాలని కోరుకుంటున్నారు.  అసలు తెలంగాణలో సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీకి సండంధం ఏమిటి; ఆ తలనొప్పి ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అంట గట్టాలని చూస్తున్నారు? అన్నది అర్థం కాని పరిస్థితి.   వాస్తవంలోకి వెళ్తే సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్ లోనే ఉంది. సినిమా వాళ్ళంతా ఉండేది ,జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, మణికొండ తదితర ప్రాంతాల్లోనే.  నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ,క్యారెక్టర్ ఆర్టిస్టులు  మొత్తం హైదరాబాద్ లోనే మకాం వేసి ఉన్నారు. కట్టే టాక్స్ లు కూడా ఎనభై శాతానికి పైగా  తెలంగాణ ప్రభుత్వానికే కడతారు. కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైపు చూస్తారు. అక్కడి సినీ పరిశ్రమకు కష్టం వస్తే..  హైదరాబాదులో సినీ కార్మికులు ధర్నాలు చేస్తుంటే..  ఏపీ ఈ వ్యవహారం పై  ఏపీ ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  తాజాగా  సినీ పరిశ్రమంలో సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు తెలంగాణలో  మకాం వేసి ఉంటారు?  ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ,ఏపీలోకి వచ్చి  హడావుడి చేసి వెళ్ళిపోతుంటారు.  ఇలాంటి వ్యవహార శైలి ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ పెద్దలకు ఎక్కువైపోయింది. తాజాగా ఏపీ ప్రభుత్వం దగ్గరకు నిర్మాతల బృందం వచ్చింది. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కావాలి..   మా సమస్యలు మొత్తం ఏకరువు పెట్టి తెలంగాణలో వచ్చిన సమస్య పరిష్కరించమని  కోరుకుంటామంటూ ఏపీ సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తలెత్తిన సమస్య గురించి సీఎం దృష్టికీ, డిప్యూటీ సీఎం దృష్టికీ తీసుకువెడతానని హామీ ఇచ్చారు. అయితే అసలు ఎక్కడో హైదరాబాదులో జరుగుతున్న ధర్నాలు,సమ్మెల వ్యవహారానికి ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అసలు ఏదైనా సరే ఎందుకు చేయాలి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడో ఒక సారి వారి అవసరాల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాలలో షూటింగ్ లు జరుపుకుని వెళ్లిపోడం వినా.. ఇక్కడ మకాం వేయడం కానీ, ఇక్కడ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు ఏమైనా నిర్మించడానికి కనీసం ప్రతిపాదలైనా చేశారా? అగ్ర హీరోల దగ్గర నుండి ,నిర్మాతల వరకూ మొత్తం హైదరాబాద్ లోనే..  సినిమా రీలీజుల సమయంలో మాత్రం  టికెట్ల రేట్లు పెంచి..  ఏపీ ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడతాం అనుమతించండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరడం వినా, వీరు ఏపీకి చేసిందేమిటి?  తమ నివాసాల దగ్గర నుంచి సినీమా వ్యవహారాలు, వ్యాపారాలూ అన్ని హైదరాబాద్ లో చేసుకుంటూ.. టాక్సులు కూడా అక్కడి ప్రభుత్వానికే కడుతూ.. మస్య రాగానే ఏపీ సర్కార్ వద్దకు పరుగులెత్తుకుంటూ వస్తారు.  సమస్య రాగానే ఏపీ, ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు.  . అటువంటి వారి పట్ల ఏపీ ప్రభుత్వం ఎందుకు సానుకూలతతో, సానుభూతితో ఉండాలి? ఎందుకు బాధ్యత తీసుకోవాలి అన్నదే ఇప్పుడు సగటు ఆంధ్రుడి ప్రశ్న. ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు ప్రకటించి... మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకున్నట్లు బిల్డప్ లు ఇవ్వడం తప్ప,  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఏపీకి నయాపైసా ప్రయోజనం ఏముందని సగటు ఆంధ్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.   ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకునే విషయంలో  ఏపీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి.    , సినీ పరిశ్రమ ఏపీకి  వచ్చే విధంగా,  ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు నెలకొల్పే విధంగా షరతు విధించాలి. అలా కాకుండా పన్నులు కట్టేది తెలంగాణలో.. సమస్యలు పరిష్కారం అయ్యేది ఆంధ్రప్రదేశ్ లో అన్నట్లుగా వ్యవహరిస్తామంటే మాత్రం పరిశ్రమ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వం  జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

పులివెందుల సమరం.. పీక్స్ కు చేరిన టెన్షన్లు

 పులివెందుల తీర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కావడానికి ఇక కొన్ని గంటలే ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో పోలింగ్ హీట్ పీక్స్ కు చేరింది. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నిక ఫలితంపై పులివెందుల, కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఏదో ఒక మండలానికి చెందిన ఎన్నికలా కాకుండా ఈ ఉప ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపించేంత ఉద్రిక్తత, ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం (ఆగస్టు 12)   జరగనున్న ఈ ఉప పోరును తెలుగుదేశం కూటమి ,వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది.  ఇప్పటికే ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరగడంతో ఇక పోలింగ్ ఇప్పటికే ప్రచార సందర్భంగా పోలింగ్ దాడులు జరగడం తో పోలింగ్ రోజున పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు  వ్యక్తమౌతున్నాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ సైన్యం దిగితే... తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పార్టీలు ప్రైవేటు సైన్యాన్ని  దించారన్న ప్రచారం   ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పులివెందులలో దౌర్జన్యానికి పై చేయి అవుతుందా? ప్రజాస్వామ్యానిదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది.   ఇప్పటికే తెలుగుదేశం కూటమి, వైసిపి నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.  ప్రచార ఘట్టంలోనే హింసాత్మక ఘటనలు జరగడంతో  పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇదిలా ఉంటే పోలింగ్ రోజు తమకు అనుకూలంగా ఓటింగ్  జరుపుకునేందుకు బయట వ్యక్తులు పులివెందులకు చేరుకున్నారన్న ప్రచారంతో స్థానికులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసులు పోలింగ్ ముందు రోజు నుంచే కొత్త వ్యక్తులు పోలింగ్ జరిగే పులివెందులలో కానీ ఒంటిమిట్టలో కానీ ఉండకూడదని   హెచ్చరించారు.  ఇక ప్రలోభాల పర్వం కూడా పెద్ద ఎత్తున  సాగుతోందంటున్నారు.  పోటాపోటీగా, ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నకలో ఓటు చాలా కాస్టీగా మారిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.  ఓటుకు పది వేల చొప్పున ఇస్తున్నారంటూ తెలుగుదేశం కూటమి, వైసీపీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒంటిమిట్టలో కూడా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా పులివెందుల స్థానం అంత కాకపోయినా.. ఓటుకు నోటు భారీగానే ఇస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం రెండు  జట్పీసీలకు కలిపి..దాదాపు పాతిక కోట్ల పంపిణీ జరుగుతోందని అంచనా వేస్తున్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఇంత కాస్టీగా మారడం ఇదే ప్రథమం అంటున్నారు.  ఇక పులివెందుల బరిలో స్థానానికి వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా  బిటెక్ రవి సతీమణి  లతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్ధి రంగంలో ఉన్నారు. మరి కొందరు స్వతంత్రులు కూడా రంగంలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉంది.  ఇక   ఒంటిమిట్ట జడ్.పి.టి.సి అభ్యర్థిగా వైసీపీ తరఫున ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయభాస్కర్ తో పాటు మరో 8 మంది స్వంతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడా పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.  

రాజధాని నిర్మాణానికి రూ. 2లక్షల 116లు విరాళం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఓ  వృద్దురాలు తన వంతుగా విరాళం అందజేశారు. నరసరావుపేటకు చెందిన కాసా నాగేంద్రమ్మ అనే వృద్ధురాలు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ రెండు లక్షల నూట పదహారు రాపాయల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో సోమవారం (ఆగస్టు 11)న స్వయంగా కలిసి ఈ విరాళం చెక్కును అందించారు.  రాజధాని నిర్మాణానికి విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి రూ.2,00,116 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రమ్మకు   కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఆమెను అభినందించారు. రాష్ట్ర రాజధాని అత్యంత గొప్పగా చరిత్రలో నిలిచిపోయేలా నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో ఆబాట గోపాలం రాజధాని నిర్మాణం పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్నారనడానికి కాసా నాగేంధ్రమ్మ తన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయం వరకూ వచ్చి విరాళం అందించడమే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.  

ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులతో నిర్మాతల భేటీ.. ఎందుకంటే?

గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌, ఫిలిం ఫెడరేషన్‌ మధ్య వేతనాల సమస్య రోజురోజుకీ జటిలం అవుతోంది. పీట ముడులు పడుతోంది. దీనికి పరిష్కారం కోసం పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. దీంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలను, రాజకీయనేతలను శరణుజొచ్చుతున్నారు నిర్మాతలు. ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫి మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలు, కార్మిలకు డిమాండ్ లు, ఆందోళనకు సంబంధించి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతలు కలిశారు.   కాగా నిర్మాతలతో భేటీపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్  సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేయడానికి కలుస్తామంటూ కొందరు నిర్మాతలు చెబితే రమ్మన్నాం.. అంతే తప్ప ఈ భేటీకి ప్రత్యేకమైన అజెండా ఏమీ లేదని తేల్చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమస్యలకు సంబం ధించి నిర్మాతలు, కార్మికులు చెప్పే అంశాలను విని, వాటిని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెడతాం. వారి స్థాయిలోనే ఏం చేయాలన్న నిర్ణయం ఉంటుందని కందుల  చెప్పారు. అంతే కాకుండా   ఆంధ్రప్రదేశ్‌లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సినిమా నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనకు  కృషి చేస్తాం, రాష్ట్రంలో స్టూడియోలు, రీరికార్డింగ్‌ థియేటర్లు, డబ్బింగ్‌ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు. కాగా కందుల దుర్గేష్‌ను నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కె.ఎల్‌.నారాయణ, డి.వి.వి.దానయ్య, రవిశంకర్‌, నాగవంశీ, భరత్‌, విశ్వప్రసాద్‌, చెర్రీ, సాహు గారపాటి, యువి క్రియేషన్స్‌ వంశీ, బన్నీ వాసు, వివేక్‌ కూచిభొట్ల తదితరులు  కలిశారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని  ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు, బాపినీడు, ఫిలిం ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌, సుప్రియ, జెమినీ కిరణ్‌ తదితరులు కలిశారు. 

ఎన్నికల జాప్యం.. పంచాయతీలకు శాపం !

ఆలస్యం అమృతం విషం ఈ నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే  అది ఇదే.  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ..   కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన  కేంద్ర నిధులు  రాకుండా ఆగి పోతాయి. అంతే కాదు..  నిర్దిష్ట గడువు ముగిస్తే అవి మురిగి  పోతాయి కూడా.   అవును..  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1992లో తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీలు కొలువు తీరి ఉన్నప్పడు మాత్రమే  పంచాయతీలకు  కేంద్ర నిధులు అందుతాయి. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీల గడువు 2024 జనవరిలోనే ముగిసింది. ఇక అక్కడి నుంచి  కారాణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ముడి పడలేదు. ఈ కారణంగా ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం  2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావలసిన రూ.1,550 కోట్లను రిలీజ్ చేయకుండా  విత్ హెల్డ్  లో పెట్టింది. అంటే..  నిధుల విడుదలను నిలుపుదల  చేసింది. అలాగే ప్రస్తుత   ఆర్థిక సంవత్సరానికి సంబందించి   రూ.1,450 కోట్లు కూడా విడుదల కాలేదు.  అంటే..  పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వలన రాష్ట్రంలోని గ్రామ  పంచాయతీలు ఇంచుమించుగా రూ.3000 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  మరో వంక నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రాణప్రదంగా భావించే  కేంద్ర నిధుల విడుదల కావాలంటే..   స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించడం మినహా మరో మార్గంలేదన్నది పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమాచారం. మరోవంక..  స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని   హై కోర్టు గడువు విధించింది. ఈ అన్నిటినీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని  బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే .. అంటూ రాజకీయ హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో  గండం నుంచి గట్టెక్కేదారి కనిపించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తికమక పడుతోంది. ఇతర అంశాలు ఎలా ఉన్నా..  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఫేస్  చేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ముందు కేంద్ర గ్రాంట్స్ తెచ్చుకోవడం పై దృష్టి పెట్టాలి,  లేదంటే,  పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన స్థితికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల అవుతాయనే నమ్మకం లేదనీ, గడువు ముగిసిన గత సంవత్సరం నిదుల విడుదల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచక్షణాదికార పరిధిలోకే వస్తుందనీ,  సో ..గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల కేంద్రం దయ .. మన ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే..  గతంలో   ఎన్నికలు నిర్వహించిన వెంటనే విత్ హెల్డ్  లో పెట్టిన నిధులను విడుదల చేసిన అనుభవాల ఉన్నాయి కాబట్టి  ఎన్నికలు జరిగితే గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబందించిన రూ. 3000 కోట్లు విడుదలవుతాయనే విశ్వాసాన్ని పంచాయతీ శాఖ అధికారాలు వ్యక్తం చేస్తున్నారు.   అలాగే.. ఈలోగా ఎన్నికలు జాప్యానికి కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాస్తే, కేంద్ర నిధులు  విడుదల అవుతాయని  కొందరు అధికారులు అంటున్నారు  అయితే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రోజురోజుకూ మరింత జటిలం అవుతున్న నేపధ్యంలో, ఈ చిక్కు ముళ్ళు వీడి, పంచాయతీ ఎన్నికల జరగడం  ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పాక్ అణుబాంబులు భ‌య‌పెట్ట‌డానికేనా?

సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా?  కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది? ఈ విష‌యం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మ‌ర‌చిపోతే ఎలా? మొన్న‌టి యుద్ధంలో భార‌త్ పాక్ ని భ‌య‌పెట్ట‌కుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వ‌లున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది.  జ‌స్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్ర‌హ్మోస్ లు వ‌దిలినందుకే త‌ల్ల‌డిల్లిపోయింది పాక్.  ఈ ఎయిర్ బేస్ కి ద‌గ్గ‌ర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్ట‌ర్ తో పాటు అటు అణు నిర్వ‌హ‌ణ చేసే నేష‌న‌ల్ క‌మాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్క‌డ భార‌త్ బాంబులు ప‌డ్డంత‌నే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్‌.. జ‌డుసుకుని బంక‌ర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మ‌ళ్లీ బీరాలు ప‌లుకుతున్నాడు. సింధూన‌ది మీద ప్రాజెక్టు క‌డుతున్నందుకే ఇలా అంటుంటే మ‌రి బ్ర‌హ్మ‌పుత్రా న‌ది మీద చైనా క‌డుతున్న ప్రాజెక్టు ప‌రిస్థితి ఏంటి? సింధూన‌ది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మ‌రి చైనాపై కూడా భార‌త్ అణు బాంబులు వేయాలా? మొన్న ప‌హెల్గాం దాడి త‌ర్వాత ఇదే సింధూజ‌లాల‌ విష‌యం వెలుగులోకి వ‌స్తే మేం అణుబాంబులు వేస్తామ‌ని అన్నారు పాక్ దేశ నాయ‌కులు. తీరా భార‌త్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయ‌డం మానేసి.. బంక‌ర్ల‌లో దాక్కున్నారు. ఇరాన్ ద‌గ్గ‌ర అణుబాంబులు ఉంటే..  ప్ర‌పంచానికే అతి పెద్ద విప‌త్తుగా భావించిన అమెరికా.. పాక్ విష‌యంలో ఎందుకో వెన‌క‌డుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భార‌త్ ని భ‌య‌పెట్టి ఆయుధాలు కొనిపించాల‌న్న యోచ‌న అమెరికాది. అందుకే ఆ దేశ గ‌డ్డ‌పై నుంచి ఇలాంటి బీరాలు ప‌లికిస్తోంద‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువ‌డుతున్నాయ్.  మేం పోతే స‌గం ప్ర‌పంచాన్ని లాక్కెళ్లిపోతామ‌ని మీరు భ‌య‌పెడ‌తారేమో.. కానీ భార‌త్ మొన్న‌టిలా చేసి చూపిస్తుంది.  అయినా యుద్ధం జ‌రుగుతుంటే మ‌న ద‌గ్గ‌ర ప్లాన్స్ లేవు ప్రేయ‌ర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భార‌త్ ను భ‌య‌పెట్టేందుకు ప్రయత్నించడం  ఆశ్చ‌ర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాక‌ట్టి పెట్టి బ‌తుకుతున్న మునీర్  సైన్యాధ్య‌క్షుడంటే ఆసియాకే అవ‌మాన క‌రంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.

ఓట్ల చోరీ.. రాహుల్ ఆరోపణలు.. ఈసీ ఖండనలు!

తాజాగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పులకుప్పగా  మారిందంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయనీ, తాను, తన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు. అయితే ఆయన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతే సాధికారికంగా ఖండించింది.  తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో రాహుల్ చేసిన కొన్ని ఆరోపణలు, వాటికి ఈసీ ఖండనలూ ఇలా ఉన్నాయి..    బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ  స్థానంలో ఒక్కటి వినా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ విజయం సాధించినా, కేవలం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో  ఓట్ల చోరీ కారణంగా సెంట్రల్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఆరోపణను ఈసీ ఆధారాలను చూపుతూ ఖండించింది.  బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఏడింటిలో మెజారిటీ సాధించిందన్నది అవాస్తవం.  ఆ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. రాహుల్ పేర్కొన్నట్లుగా బీజేపీ ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీతో లోక్ సభ స్థానాన్ని గెలుచిందనడం పూర్తిగా అవాస్తవం అని ఈసీ పేర్కొంది.  అదే విధంగా నకిలీ ఓట్ల గురించి రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో   శ్రీవాస్తవ అనే వ్యక్తికి ఏకంగా మూడు రాష్ట్రాలలో  ఓటర్ ఐడీ ఉంది. ఆ మూడు రాష్ట్రాలూ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక. ఈ మూడు రాష్ట్రాలలోనూ శ్రీవాస్తవ ఓటు వేశాడు. ఆయన తన ఓటును బీజేపీకే వేశారంటూ ఉదాహరణగా చూపారు. అయితే ఈ ఆరోపణను కూడా ఈసీ నిర్ద్వంద్వంగా ఖండించింది. శ్రీవాస్తవ అనే వ్యక్తి మూడు రాష్ట్రాలలోనూ ఓటు వేశారనడం అబద్ధమని సాక్ష్యాలతో సహా పేర్కొంది. అయినా శ్రీవస్తవ అనే వ్యక్తి బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా చెప్పగలరని నిలదీసింది. వాస్తవానికి శ్రీవాస్తవక 2011లో యూపీలో, 2016లో మహారాష్ట్రలో నివశించారనీ, ప్రస్తుతం కర్నాటకలో ఉంటున్నారనీ పేర్కొన్న ఈసీ.. ప్రతి సారీ కూడా ఆయన చట్టబద్ధంగా తన ఓటర్ ఐడీని మార్చుకున్నారని, ఒకే సారి మూడు రాష్ట్రాలలో ఓటు వేయలేదనీ ఈసీ విస్పష్టంగా తేల్చేసింది. ఇక ఒకే చిరునామాలో 80 మంది ఓటర్లు నమోదయ్యారన్న ఆరోపణకు కూడా ఈసీ స్పష్టమైన వివరణతో సమాధానం ఇచ్చింది.  వాస్తవానికి రాహుల్ చెప్పిన చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే సత్రాలుఆ చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే చావళ్లు. అంటే సత్రాలలాంటివన్న మాట.  అక్కడ పనివాళ్లు, సెక్యూరిటీ గార్డులు  తాత్కాలికంగా వచ్చి ఉంటారు. తర్వాత అక్కడ నుంచి మారిపోతారు. అలాంటి చావళ్లను  అడ్రస్ ప్రూఫ్‌గా   ఉపయోగించుకుని ఓటరు ఐడిలు  పొందారు కానీ అక్కడ వారు నివసించడంలేదు. అంత మాత్రాన అవన్నీ నకిలీ ఓట్లు ఎలా అవుతాయని ఈసీ నిలదీస్తోంది. అంతే కాకుండా వారంతా బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నిస్తోంది.  మొత్తం మీద ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేపట్టిన ఆందోళన, ఉద్యమం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మొత్తం మీద రాహుల్ ఆరోపణలు, ఈసీ ఖండనలు నోటీసులతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. 

నీతా అంబానీ గ్యారేజ్‌లో దేశంలోనే ఖరీదైన రూ.100 కోట్ల కారు

అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు  బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.  ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ  గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ   ఓ  కారు మాత్రం వార్తల్లో నిలుస్తోంది.  దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన ఆ కారు ఖరీదు, అందులోని ఫీచర్ల గురించి ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కారు దేశంలోనే అత్యంత ఖరీదైనదని అంటున్నారు.  ఆ కారు పేరు ఆడీ ఏ9 చమేలియన్ . ఈ కారు ఖరీదు అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఈ కారులో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయట. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే,  ఈ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చుకోగలదట.  ఈ కారు ఎప్పటికప్పుడు తన రంగులను మార్చుకుంటుందట. ఒక్క బటన్ నొక్కితే చాలు,  కారు రంగు మారిపోతుందట. ఈ కారు పెయింటింగ్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 11 మాత్రమే ఉన్నాయట.ఈ కారు సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్‌తో స్పేష్ షిప్‌లా కనిపిస్తుంది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు అయిన ఈ ఆడి ఏ9 చమేలియన్ రెండు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ కారులో 4.0-లీటర్ V8 ఇంజిన్‌ అమర్చారు. ఇది  600 సీసీ హార్స్‌పవర్‌ కారు. కేవలం మూడున్నర సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల   వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. అందుకే నీతా అంబానీకి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది.