ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి?

ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మరో నాలుగైదు రోజుల్లో అంటే  ఆగష్టు 21తో నామినేషన్ల గడువు, ముగుస్తుంది. అయినా.. అధికార విపక్ష  కూటమి అభ్యర్ధులు ఎవరన్నది ఇంకా  తేలలేదు. అధికార ఎన్డీయే కూటమిలో అభ్యర్ధి ఎవరన్నది మాత్రమే తేలవలసి వుంది. కానీ.. విపక్ష ఇండియా కూటమి అయితే..  అసలు పోటీ చేస్తుందా? లేక ఎటూ ఓటమి తప్పదు కాబట్టి పోటీకి దూరంగా ఉంటుందా? అన్న విషయంలో ఇంత వరకూ స్పష్టత లేదు. అయితే..  కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  అయితే..  గెలుపు ఓటములతో సంబంధం లేకుండా  ఇడియా కూటమి అభ్యర్ధిని బరిలో దించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.   నిజానికి ఇటీవల రాహుల్ గాంధీ నూతన అధికార నివాసం బంగ్లా నెంబర్ 5 , సునేహ్రీ బాగ్ లో  ఇండియా కూటమీ నాయకులకు విందు ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జన ఖర్గే, కూటమి కీలక నేతలు   శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ థాకరే, కనిమొళి సహా ఇంచుమించుగా   40 మంది వివిధ పార్టీల ముఖ్యనాయకులు  హజరైన ఈ విందు సమావేశంలో..   ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఇండియా కూటమి పోటీ చేసే విషయంపైనే  ప్రధానంగా  చర్చించినట్లు తెలుస్తోంది.  కూటమి ఐక్యతను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని నిలబెట్టాలనే విషయంలో సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే.. కూటమి అభ్యర్ధి విషయంలో మాత్రం ఎలాంటి చర్చ జరగలేదనీ.. అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎవరన్నది తేలిన తర్వాత, మరోమారు అభ్యర్ధి విషయం చర్చిద్దామని ఇండియా కూటమి నేతలు  నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.   అదలా ఉండగా..  అధికార  ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను, కూటమి భాగస్వామ్య పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు  అప్పగించిన నేపధ్యంలో   ఆదివారం (ఆగస్టు 17) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో  ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న రాజీనామా చేయగా,  కేంద్ర ఎన్నికల సంఘం  నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆగష్టు 8 న ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకవేళ ఎన్నికకు పోటీ జరిగితే..  సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పార్లమెంట్ హౌస్ మొదటి అంతస్తులో పోలింగ్ జరుగుతుంది.  కాగా..  ఇండియా కూటమి సీరియస్ గా ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగడం ఇంచుమించుగా ఖారారు అయిన నేపధ్యంలో  ఉపరాష్ట్రతి ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. అయితే  ఎలా చూసిన కూడా  ఎన్డీఎదే పైచేయి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.  ప్రస్తుత లెక్కల ప్రకారం ఉపరాష్ట్రపతి ఎలెక్టోరల్ కాలేజీలో(నామినేటెడ్ సహా పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు) మొత్తం 788 ఓట్లున్నాయి. వాటిలో  5 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఒక లోక్ సభ  సీటు ఖాళీగా ఉంది. మిగిలిన 782 ఓట్లలో ఎన్డీఎకి 427  (293 లోక్ సభ. 134 రాజ్యసభ) ఓట్లున్నాయి. ఇండియా కూటమికి లోక్ సభలో 236, రాజ్యసభలో 87  మొత్తం కలిపి 323 ఓట్లున్నాయి. అలాగే..  ఉభయ సభల్లో కలిపి ఏ కూటమిలోనూ లేని తటస్థ సభ్యుల సఖ్య  సుమారు 30 వరకు ఉంటుంది.  సో.. ఈ లెక్క తప్పకుండా ఎవరి ఓట్లు వారికి పోలైనా..  ఎన్డీఎ కూటమి గెలుపు నల్లేరుపై బండి అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

వ్యాయామం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన అసదుద్దీన్ ఓవైసీ

  యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండడమే కాకుండా... ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటూ ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచిస్తున్నారు. ఒకవైపు తన ప్రసంగంతో ప్రజల్ని ఆకర్షిస్తూనే... మరోవైపు ప్రతిరోజు ఎక్సైజ్ చేస్తూ యువతకు ఓవైసీ ఆదర్శంగా నిలిచారు.  ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని తాడ్ బన్ ప్రాంతంలో ఓ వ్యక్తి జిమ్ పెట్టాడు. ఈ జిమ్ ప్రారంభోత్సవానికి అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం ఓవైసీ ఎక్ససైజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. అసదుద్దీన్ ఓవైసీ కి జిమ్ చేయడంలో ప్రావీణ్యం ఉంది... అయితే ఓవైసీ జిమ్ చేస్తున్న సమయం లో ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా  మారి చక్కర్లు కొడుతుంది.

అమెరికాకు బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు బయలుదేరారు. పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి ఎమ్మెల్సీ కవిత అమెరికాకు బయల్దేరిన ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులో భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెండాఫ్ ఇచ్చారు. చిన్న కుమారుడని కాలేజీలో చేర్పించేందుకు వెళ్లున్నా కవిత 15రోజులు పాటు అక్కడే ఉండనున్నారు.మళ్లీ కవిత సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.  నిన్న ఎర్రవళ్లి ఫామ్ హౌస్‌లో నిన్న కవిత, కేసీఆర్ కలిసేందుకు వెళ్లారు. అయితే గులాబీ బాస్ కూతురితో మాట్లాడలేదని సమాచారం. ఇంటి ప్రధాన ద్వారం వద్దే ఆమె ఉండిపోగా..కేసీఆర్, ఆర్యను తన గదికి పిలిపించుకొని 10 నిమిషాల పాటు మాట్లాడి, ఆశీర్వదించి పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫామ్ హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, హారీశ్‌రావు ఇతర నేతలు కవితతో మాట్లాడలేదని సమాచారం.

పులివెందులలో రిగ్గింగ్ అంటూ అంబటి ఫేక్ వీడియో.. నెటిజన్ల ట్రోలింగ్ మామూలుగా లేదుగా

అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు వైసీపీకి అలవాటే. దొరికిపోయిన ప్రతిసారీ నెటిజన్ల ట్రోలింగ్ కూడా ఆ పార్టీ నేతలకు కొత్తేం కాదు. అధికారంలో ఉన్నప్పటి నుంచీ కూడా వైసీపీ చేస్తున్నది ఇదే. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాలు, దుష్ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోతో చెలరేగిన తీరు సామాన్య జనానికి కూడా వెగటు పుట్టించింది. గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి  ఈ తీరు కూడా ఒక కారణమనడంలో సందేహం లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి, కనీసం విపక్ష హోదా లేని పరిస్థితుల్లో కూడా మళ్లీ పుంజుకోవాలంటూ ఫేక్ తీరు శరణ్యమని వైసీపీ భావిస్తున్నట్లు ఉంది. అయినా గత ఎన్నికలలో ఓటమి కంటే ఘోరమైన పరాజయం ఆ పార్టీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎదురైంది. సహజంగానే ఈ ఓటమి వైసీపీ అధినేత జగన్ సహా.. ఆ పార్టీ నేతలు, శ్రేణుల నైతిక స్థైర్యం పాతాళానికి పడిపోయింది. ఓటమిని జీర్ణించుకోలేక కక్కలేకా, మింగలేకా అన్నట్లుగా ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఉంది. రిగ్గింగు, అరాచకాలు అంటూ అధికార తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది. కానీ కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా పులివెందుల జడ్పీటీసీలో ఎదురైన ఓటమికి ఏం చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.   ఈ నేపథ్యంలోనే  మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా పులివెందులలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ, తన ఆరోపణలకు రుజువిదిగో అంటే ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే ఆయన ఇలా ఆ వీడియో పోస్టు చేసి పులివెందుల రిగ్గింగ్ కు సాక్ష్యం అన్నారో.. ఆ క్షణం నుంచీ నెటిజనులు అంబటిపై ఓ రెంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంబటిగారూ పులివెందులలో పోలింగ్ జరిగితే.. పశ్చిమబెంగాల్ లో రిగ్గింగు అంటారేంటండీ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.  ఇంతకీ విషయమేంటంటే.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగుకు రుజువిదుగో, తెలుగుదేశం పులివెందుల జడ్పీటీసీ ఎన ఉప ఎన్నికలో అక్రమాలకు పాల్పడిందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా అంటూ అంబటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఓ ఫేక్ వీడియో.  పశ్చిమ బెంగాల్ లో గతంలో ఎప్పుడో జరిగిన పోలింగ్ కు సంబంధించిన వీడియో.. దానిని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిందేనని నమ్మబలుకుతూ అంబటి రెచ్చిపోయారు. అయితే స్వల్ప వ్యవధిలోనే ఆయన బండారం బయటపడిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురయ్యారు పాపం.  ఇంతకీ అంబటి నకిలీ గుట్టు ఎలా బయటపడిందో తెలుసా? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఉపయోగించిన గులాబి రంగు బ్యాటెల్ పత్రాలు. కానీ అంబటి షేర్ చేసిన వీడియోలో పసుపు రంగు బ్యాటెల్ పత్రాలు కనిపించాయి. తెలుగుదేశం జెండా రంగు పసుపు కదా.. అంతా నమ్మేస్తారని భ్రమించినట్లున్నారు అంబటి.  ఆ భ్రమలు పటాపంచలైపోవడమే కాదు..పులివెందులలో ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందనీ, అక్రమాలకు రుజువులు చూపడం చేతకాకే నకిలీలపై పడ్డారని పరిశీలకులు అంటున్నారు.  

సరోగసి కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు

  సృష్టి కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే..మరో అక్రమ సృష్టి బయటపడింది. మహిళలను అంగట్లో సరుకుల మార్చి అమ్మత నాన్ని అమ్ముకుంటు న్నారు.అమాయకమైన మహిళలను టార్గెట్ చేసుకొని వారి దందా కొనసాగిస్తూ లాభాలు గడిస్తున్నారు.ఇప్పడు తాజాగా మేడ్చల్ కేంద్రంగా చేసుకొని అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్న కిలాడి ఎస్ఓటి బృందం చేతికి చిక్కిన విషయం తెలిసిందే... ఈ కేసులో సంచలన మైన విషయాలు  బయటపడుతున్నాయి. నిన్న ఎస్ఓటి బృందం మేడ్చల్ జిల్లా పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సరోగసి దందా కొనసాగిస్తున్న నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  అంతేకాకుండా పోలీసులు సరోగసి తల్లులకు నోటీ సులు కూడా పంపించారు. అయితే నింది తురాలు లక్ష్మి గతంలో పిల్లల విక్రయాలు సరోగసి కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి తన కుమారుడు నరేందర్ రెడ్డి మరియు కూతురు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు... నగరాన్నికి వచ్చిన నిందితురాలు లక్ష్మి మళ్ళీ అదే దందా కొనసాగించింది. లక్ష్మి పలు ప్రవేట్ హాస్పిటల్స్ మరియు ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది ఎవరైనా దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లల కోసం హాస్పటల్స్ సెంటర్లను ఆశ్రయించగా వాళ్ల ఏజెంట్లు లక్ష్మికి సమాచారం ఇస్తారు. ఆ విధంగా లక్ష్మి  ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్ల దంపతుల వివరాలు ఏజెంట్ల ద్వారా సేకరించేది. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బలవం తంగా సరోగసికి ఒప్పించేది. ఆ తర్వాత పిల్లల కోసం తాపత్రయం పడుతున్న దంప తులను టార్గెట్‌గా చేసుకొని... వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి 20 నుండి 25 లక్షల వరకు డబ్బులు వసూలు చేసేది. కానీ సరోగసి తల్లులకు మాత్రం ఐదు నుండి నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చేది. అంతేకాకుండా నిందితురాలు లక్ష్మి సరోగసి తల్లులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ బాండ్ రాయించు కునేది.  ఇలా ఇప్పటివరకు ఎనిమిది మంది సరోగసి తల్లుల చేత ప్రామిసరీ బాండ్ రాయించుకున్నది. ఇప్పుడు పోలీసులు వారందరికీ నోటీ సులు జారీ చేశారు. లక్ష్మి మరియు ఆమె కుమారుడ్ని పోలీసులు అరెస్టు చేసి... ఇంట్లోఉన్న  ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు  గర్భాదారణ మందులు  హార్మోన్ ఇంజక్షన్లు లతో పాటు  హెగ్డే హాస్పిటల్ తో సహా అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవిఎఫ్ ,ఫర్టి కేర్ ,శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన కొన్ని రిపోర్ట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు పలు ఐ వి ఎఫ్ హాస్పిటల్స్ తో లక్ష్మి కి ఉన్న సంబంధాల పై ఆరా తీస్తున్నారు.

యూరియా కోసం రైతుల పడిగాపులు

  యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని పీఏసీఎస్‌ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో తెల్లవారు జామునుండే పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ టోకెన్లు ఇస్తుండటంతో గందర గోళం నెలకొంది. యూరియా నిలువలు తక్కువగా ఉండటంతో తమదాకా అందుతాయోలేదోనంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.  రాత్రి రెండు గంటల నుండే యూరియా కోసం లైన్ లో నిల్చున్నామని చెబుతున్న మహిళా రైతులు  యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్‌ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ మానుకొని సరఫరా కేంద్రాల వద్ద రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్‌ డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. కిలోమీటర్ పొడవునా క్యూ లైన్ లో రైతులు ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్‌లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నరు. ఒక్కో బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ నిద్రాహారాలు మాని నిరీక్షిస్తున్నారు.యూరియా పంపిణి కోసం గూడూరు సీఐ, గూడూరు ఎస్సై, 20 మంది పోలీసులు పహారా కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్  గూడూరు పిఏసిఎస్ కు చేరుకొనున్నారు.  దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.ప్రస్తుతం గూడూరు లో హై టెన్షన్ నెలకొంది.

చందానగర్ జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి

  హైదారాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీకి ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. నకిలీ నెంబర్ ప్లేట్లతో చోరీకి వచ్చి దొంగతనం తర్వాత నంబర్ ప్లేట్లను మార్చుకున్నారని, 10 కేజీల వెండి ఆభరణాలు దోపిడీ చేశారని డీసీపీ తెలిపారు. ఈ బీహార్ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇదేనని, గతంలో కోల్‌కత్తా, బీహార్, కర్ణాటకలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు.  ఈ ఏడుగురు బీహార్ కి చెందిన వ్యక్తులని పేర్కొన్నారు. వీరిపై ఆ రాష్ట్రంలో  4, 5 కేసులు నమోదు అయ్యాయి. ఒక నిందితుడి పై 10 కేసులు ఉన్నాయిని డీసీపీ తెలిపారు.20 రోజుల క్రితం నగరానికి వచ్చారని  ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహా అనే ఇద్దరు నిందితులను పూణేలో అరెస్ట్ చేశామని తెలిపారు.చోరీ జరిగిన 24 గంటలలో నిందితులను గుర్తించామన్నారు. బీహార్ నుండి వెపన్స్ కొనుగోలు చేశారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నిక

  ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా  మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సంఘ సభ్యులంతా చిన్నిని ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించారు. అయితే, ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆయనే మరోసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ACA ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఏసీఏ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు.. మరో 34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది.గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు  

క‌డ‌ప రెడ్డెమ్మ కుర్చీలాట‌

రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వి రెడ్డి అంటే అదో బ్రాండింగ్ అన్న‌ట్టు..  స్టేజి మీద చేరి క‌న్ను గీటినా.. తనకు కుర్చీ వేయ‌లేదు   అంటూ మైకు గిరాటేసినా.. ఆమెకే చెల్లిందని అంటారు.  ఆమె మాజీ మంత్రి రెడ్డెప్ప‌గారి రాజ‌గోపాల్ రెడ్డి కోడ‌లు, కాంట్రాక్ట‌ర్ శ్రీనివాసులు రెడ్డి స‌తీమ‌ణి. అంతే కాదు ఎంఏ వ‌ర‌కూ చ‌దివిన విద్యావంతురాలు కూడా. కానీ ఆమె కుర్చీ ప్రొటోకాల్ విష‌యంలో మాత్రం ఒక్క‌సారిగా చిన్న‌పిల్ల‌లా మారిపోతారని చెబుతారు. అదేదో సినిమాలో ఒక  కేరెక్ట‌ర్.. నాకు బ‌ర్త్ డే కేక్ పెట్ట‌లేదు నున్వు! అంటూ గొడ‌వ చేసే పాత్రలా ఉంటుందామె తీరు. మొన్న 2024లో మున్సిప‌ల్ స‌ర్వ స‌భ్య స‌మావేశంలో  కూడా కుర్చీ వేయ‌లేదంటూ నానా ర‌భ‌స చేశారు రెడ్డెప్ప‌గారి మాధ‌వీరెడ్డి. ఇక్క‌డ వైసీపీ లీడ‌ర్లు త‌న‌కు వ్య‌తిరేకంగా కుర్చీలాట మొద‌లు పెట్టారంటూ ధూం ధాం అన్నారు. ఒక ఎమ్మెల్యే అయిన త‌న‌కంటూ వేదిక‌పై  కుర్చీ వేయ‌లేదంటూ ఆ స‌మావేశమంతా నిల‌బ‌డి నిర‌సన చేశారు. ఇప్పుడు చూస్తే.. క‌డ‌ప పేరెడ్ గ్రౌండ్ లో నిర్వ‌హించిన స్వాతంత్ర దినోత్స‌వ వేదిక‌పై త‌న‌కు కుర్చీ వేయ‌లేదంటూ తీవ్రంగా మండి ప‌డ్డారు. తాను ఎమ్మెల్యే అయినా   ప్రోటోకాల్ ప్ర‌కారం కుర్చీ వేయ‌లేదంటూ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం  చేశారు. అధికారుల‌కు ముందు వరుసలో కూర్చీ వేసి.. ఎమ్మెల్యే అయినా తనను పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మేడం పంద్రాగస్టు వంటి కార్యక్రమాలకు అలాంటి ప్రోటోకాల్  ఉండదు, ప్లీజ్ అర్ధం చేసుకోండి అంటూ అధికారులు ఎంత న‌చ్చ చెప్పినా,  క‌డ‌ప రెడ్డెమ్మ మాత్రం కుర్చీ మే స‌వాల్ అంటూ వారిని అట్టుడికించారు. అదేంటో గ‌త కొంత కాలంగా ఈ రెడ్డెమ్మ‌కు కుర్చీతో పెద్ద కీచులాటే వ‌చ్చిన‌ట్టుంది. ఆమె మ‌న‌సులో ఈ విష‌యం ఒక ఆందోళ‌న‌తో కూడిన- కుట్ర‌లో భాగ‌మైన- ఒక వ్య‌వ‌హారంగా గూడుక‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌డ‌ప మున్సిప‌ల్ స‌మావేశంలో మొద‌లైన ఈ కుర్చీ కాన్ స్పిర‌సీ థియ‌రీ.. ఎక్క‌డికెళ్లినా ఆమెను వెంటాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.  నేను ఒక ఎమ్మెల్యే కాబ‌ట్టి నాకంటూ ఒక కుర్చీ వేసి.. దానికంటూ ఒక‌ ట్యాగ్ త‌గిలించి.. ఆ నీట్ వైట్ చైర్ ని అన్ని కుర్చీల మ‌ధ్య‌లో వేసి.. అలా ఖాళీగా పెట్టి ఉంచితేనే ఆమె  సంతృప్తి పడతారనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకండీ మేడంగారూ  కుర్చీ అంటూ  మీరంత‌ ఫైర్ అయిపోతున్నార‌ని.. ఆమె అంత‌రంగిక వ‌ర్గాల వారు వారిస్తున్న‌ట్టుగా అడిగితే.. మ‌నం ఇంత చేసి గెలిచింది ఈ కుర్చీ కోస‌మేగా.. నీకేం తెలీదు ఊర్కో అంటున్నార‌ట క‌డ‌ప ఎమ్మెల్యే రెడ్డెప్ప‌గారి మాధ‌వీ  రెడ్డి.  ఇంట్లో కూడా ఆమె కూర్చునే కుర్చీలో భ‌ర్త, పిల్ల‌లు, ఇత‌ర బంధుమిత్రులు ఎవ్వ‌రూ  కూర్చోర‌ట‌. కార‌ణం అది ఎమ్మెల్యేగారి కుర్చీ. మ‌నం ఆ సీట్లో కూర్చోవ‌ద్ద‌ని వారికి వారు ఫిక్స‌య్యార‌ట‌. అది కూడా మున్సిప‌ల్ స‌మావేశం త‌ర్వాత ఈ జ్ఞానోద‌యం అయ్యి.. అలా ఒక ఆచారం పాటిస్తున్నార‌ట‌. ఎందుకంటే బ‌య‌ట ఆమెకంటూ క‌నీస గౌర‌వంతో కూడిన కుర్చీ వేయ‌డం లేదు. దీంతో ఆమెకు ముక్కు మీద కోపం వ‌చ్చేస్తోంది. ఇంట్లో కూడా అలాంటి సీన్ చూడ్డం ఇష్టం లేక ఇంట్లో వారు అలాంటి అల‌వాటు ఒక‌టి చేసుకున్నార‌ట‌.  అక్క‌డ మొద‌లైన ఈ కుర్చీలాట ఆమె మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయి పోయింద‌ని.. ఇంటా బ‌య‌టా ఆమె కోసం ప్ర‌త్యేకంగా వేసిన కుర్చీ క‌నిపించ‌కుంటే ఒంటికాలిపై లేస్తార‌న్న టాక్ వైల్డ్ గా స్ప్రెడ్ అవుతోంది.  అయితే కొన్ని కొన్ని స‌మ‌యా స‌మ‌యాల్లో మాత్ర‌మే కుర్చీ ప్రోటోకాల్ ఉంటుంది. అంతేగానీ అన్ని చోట్లా కుర్చీ- కుర్చీ- కుర్చీ అంటూ కుర్చీనామ‌జ‌పం చేయ‌రాద‌ని.. కాస్త ఎవ‌రైనా చెప్పండ‌య్యా ఆమెకు అంటున్నార‌ట‌ అధికారులు. మ‌రి చూడాలి.. మేడంగారి మ్యూజిక‌ల్ చైర్ గేమ్ ఇంకెంత కాలం న‌డుస్తుందో !

మోడీ దీవాళీ ధమాకా ఆఫ‌ర్.. జీఎస్టీలో సవరణలు

దేశ రాజధాని ఢిల్లీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం (ఆగస్టు 15) ఘనంగా జరిగాయి. ఎర్రకోట వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని మోడీ  జాతీయ జెండాను ఎగురవేశారు. ఉదయం ఏడున్నర గంటల సమయంలో.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దీవాళి గిఫ్ట్ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే జీఎస్టీ సంస్కరణలు దేశానికి దీపావళి కానుకగా కోబోతున్నాయని ప్రధాని మోడీ పంద్రాగస్టు వేడుకల సాక్షిగా ప్రకటించారు. ఈ దీపావళికి దేశ ప్రజలకుగానూ.. డబుల్‌ దీపావళి కానుక ఇస్తున్నట్టు ప్రకటించారు మోడీ. దేశ పౌరులకు పెద్ద బహుమతి అందుతుందనీ,  తాము నెక్స్ట్‌ జెనరేషన్ జీఎస్టీ సంస్కరణలను తీసుకువస్తున్నామనీ చెప్పారు. ఈ సంస్కరణలతో దేశవ్యాప్తంగా పన్ను భారం తగ్గుతుందన్నారు. ఇది దీపావళికి ముందే   అందించే బహుమతిగాఅభివర్ణించిన ఆయన.. ఈ సంస్కరణలు  దేశ ప్రజల దిల్ ఖుష్ అయ్యే శుభవార్త అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అనేక సంస్కరణలు చేపట్టామని అందులో జీఎస్టీ ప్రధానమైనదనీ గుర్తు చేసిన మోడీ,  గతంతో పోలిస్తే జీఎస్టీ విధానం ద్వారా పన్నుల భారం తగ్గించామని.. ట్యాక్సేషన్ ప్రక్రియను సులభతరం చేశామని చెప్పారు.  సరిగ్గా 2017 జులై 1న, జీఎస్టీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పడు ఆ నిబంధనలు అమలులోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్బంగా వీటిని సమీక్షించే సమయం ఆసన్నమైందన్నారు.  ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి.. రాష్ట్రాలతో చర్చలు జరుపుతామన్నారు. ఇప్పటికే కొత్త జీఎస్టీ సంస్కరణలను సిద్ధం చేశామని వివరించారు. సామాన్యులపై పడే వస్తు సేవల భారం.. కొత్త సంస్కరణ ద్వారా గణనీయంగా తగ్గుతుందన్న తీపి కబురు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద లాభం కలుగుతుందన్న హ్యాపీ న్యూస్ అందించారు.  నిత్యవసర వస్తువులు చౌకగా లభిస్తాయనీ.. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మోడీ అన్నారు.  దేశంలో తక్షణ డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే యూపీఐ  సేవలను ఎర్రకోట వేదికగా ప్రశంసించారు  ప్రధాని. ఈ రోజు ప్రపంచం యూపీఐ అనే ఒక అద్భుతాన్ని చూస్తోందనీ.. రియల్‌ టైమ్ లావాదేవీలలో 50 శాతం  భారత్‌లోనే యూపీఐ ద్వారా జరుగుతున్నాయన్నారు.  సోషల్ మీడియా, క్రియేటివ్ రంగాల్లో అన్నీ మనవే ఎందుకు కాకూడదని.. యువతకు సవాల్ విసిరారు.    

నాలుగు రోజుల పాటు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం రద్దు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగాపెరిగింది. వరుస సెలవు రావడం, అలాగే శ్రావణమాసంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోవడం శుభప్రధమన్న భక్తుల విశ్వాసం కలిసి శ్రీశైల క్షేతం భక్త జనసంద్రంగా మారింది. దీంతో  మల్లన్న స్పర్శ దర్శనాలను నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం (ఆగస్టు15) ఆగస్టు18 వరకు మల్లన్న స్పర్శ దర్శనాలు, గర్భాలయ, అభిషేక, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక వైపు శ్రీశైలం డ్యాం గేట్లు తెరిచి ఉండడం, మరోవైపు వరుస సెలవు దినాలు కావడం, ఈ రెంటికీ తోడు  శ్రావణ మాసం కావడంతో మల్లన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది.   వచ్చిన భక్తులందరికీ మల్లన్న అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తులు శీఘ్ర, అతి శీఘ్ర టికెట్లైన 150, 300, 500 రూపాయల టికెట్లను తీసుకొని ఆయా క్యూ లైన్ ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ, నిలిపివేసిన సేవలు వినా మిగతా ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయని అధికారలు తెలిపారు.  స్వామివారి ఆలయంలో హోమాలు,  స్వామి వారి కళ్యాణం యథావిథిగా జరుగుతాయన్నారు.  

సృష్టి కేసులో నమ్రత బెయిల్ పిటిషన్ డిస్మిస్

తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో  డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.  నమ్రత తప కుమారుడి పెళ్లి ఉందని... అందుకే బెల్ మంజూరు చేయాలంటూ సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  నమ్రత తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమె కుమారుడి పెళ్లి పత్రికను సైతం కోర్టుకు సమర్పించారు. అయితే..   నమ్రత నుండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందనీ,  నమ్రత ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా నమ్రత నడిపించిన అక్రమ దందా కంపెనీలపై దర్యాప్తు జరపాల్సి ఉందని, ఈ  కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయని, పోలీసుల తరఫున న్యాయవాది తన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ దశలో ఆమెకు  బెయిల్ మంజూరు చేస్తే బయటికి వెళ్లి... సాక్షులను ప్రభావితం చేసే, బెదిరించే అవకాశాలు ఉన్నాయని, అందుచేత నమ్రతకు బెయిల్ మంజూరు చేయ వద్దంటూ పోలీసుల తరఫున న్యాయ వాది కోర్టును కోరారు. వాద ప్రతి వాదనలు విన్న అనంతరం సికింద్రాబాద్ కోర్టు నమ్రత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.

శ్రీవాణి టికెట్ల విక్రయంలో గందరగోళం

సరైన ప్రణాళిక, కార్యాచరణ, ఏర్పాట్లూ  లేకుండా శ్రీవాణి టికెట్ల విక్రయానికి తిరమల తిరుపతి దేవస్థానం ఉపక్రమించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి టీటీడీ శనివారం (ఆగస్టు 16) ఉదయం పదిన్నర గంటలకు శ్రీవాణి టికెట్ల విక్రయాన్ని ఆరంభిస్తామంటూ ప్రకటించింది. ఇందు కోసం ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసింది. శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో శుక్రవారం (ఆగస్టు 15)రాత్రి నుంచే క్యూలో నిలుచోవడంతో టీటీడీ అధికారలు, అర్ధరాత్రి నుంచే టికెట్ల విక్రయాలను ఆరంభించేశారు. ఈ సమయంలో భక్తుల మధ్య స్వల్ప తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. దీంతో టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసనకు దిగారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులకు సర్ది చెప్పడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.  

రాజుకుంటున్న బనకచర్ల.. రేవంత్ వర్సెస్ చంద్రబాబు.. మోడీ మౌనం

ఏపీ ప్రభుత్వం నిర్మించ సంకల్పించిన  బనకచర్ల ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం..  వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఆ జలాలను  మళ్లించేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే దిగువ రాష్ట్రమైన ఏపీ నిర్మిస్తామంటున్న ప్రాజెక్టుపై ఎగువ రాష్ట్రం తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్లతో ఎగువ రాష్ట్రాలకు నష్టమేంటని నిలదీశారు. అలాగే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో బనకచర్ల అంశం ఇప్పుడు మరోసారి హీటెక్కి హాట్ టాపిక్ గా మారింది.  గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది. రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దానికి నిధుల కోసం  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో  సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే చర్చించారు. బనకచర్ల ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది. అయితే బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. బనకచర్ల  ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది. బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పంద్రాగస్టు వేడుకల్లో కౌంటర్ ఇచ్చారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా దక్కించుకుంటామని నిక్కచ్చిగా చెప్పారు. మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తామన్నారు. అయితే సీఎం చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదనీ,  సముద్రంలోకి వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామనీ, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటి? అని పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు ప్రశ్నలు సంధించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని నిలదీశారు. కాగా రాయలసీమను నీటితో సశ్యశామలంగా చేసేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే . అయితే దీనికి తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో వివాదం రాజుకుంది. చంద్రబాబు మాత్రం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.  మరి చూడాలి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుందో?

పంద్రాగస్టున జెండా ఆవిష్కరణకు దూరంగా జగన్?

అధికారంలో ఉన్నామా? లేదా? ఈ  పార్టీయా? ఆ పార్టీయా? అన్న విషయాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులంతా పంద్రాగస్టు రోజున జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దేశ  స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొని దేశ భక్తిని చాటుకుంటారు. పార్టీలు, అధికారం వంటి విషయాలను స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలతో ముడి  పెట్టరు. అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రూటే సెపరేటు. ఆయన ఈ సారి  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. కనీసం తన నివాసంలో జెండా ఆవిష్కరించడానికి కూడా ఆయన ముందుకు రాలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన లేరు సరే.. కనీసం బెంగళూరులోని తన నివాసంలో కూడా ఆయన జెండా ఎగురవేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన జెండా ఆవిష్కరిస్తున్న ఫొటో మీడియాలో కానీ, వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక వైపు దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు, నాయకులు, సామాన్య ప్రజలూ కూడా ఘనంగా పంద్రాగస్టు వేడుకలలో పాల్గొన్నారు. అయితే విచిత్రంగా జగన్ మాత్రం పంద్రాగస్టునాడు కనీసం జెండా ఆవిష్కరణ కూడా చేయలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంటే 2019- 2024 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం పంద్రాగస్టు నాడు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎన్నడూ పార్టీ కార్యాలయంలో, తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. ఆనవాయితీని భగ్నం చేయలేదు. అయితే మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం జెండా ఆవిష్కరణ చేయలేదు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ఓటమి బాధనుంచి తేరుకోలేదా? అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉంటే మాత్రమే పంద్రాగస్టుకు జెండా ఆవిష్కరిస్తారా? అధికారం కోల్పోతే దేశంపై భక్తి ఉండదా? అంటూ నిలదీస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ బాటలో హస్తిన.. ఏపీలో అన్న క్యాంటిన్లు.. ఢిల్లీలో అటల్ క్యాంటిన్లు

ఢిల్లీ సీఎం రేఖాగుస్తా పేదలను అదుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ను ఫాలో అవుతున్నారు.   పేదల ఆకలి తీర్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లను ఏపీ సీఎం చంద్రబాబు ఏర్పాటు చేస్తే.. ఢిల్లీ సీఎం హస్తినలోనూ అదే ఒరవడిని ఫాలో అవ్వాలని  నిర్ణయించుకున్నారు.  పేదలకు మూడు పూట్లా నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా అదే బాటలో హస్తినలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె పంద్రాగస్టు వేడుకలలో ప్రకటించారు. ఢిల్లీ వ్యాప్తంగా తొలి విడతలో వంద చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, అటల్ బీహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.  అటల్ క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపారు.  నిరుపేదలు, విద్యార్థులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులందరికీ అటల్ క్యాంటిన్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని రేఖా గుప్తా తెలిపారు.  

రజనీకాంత్ కు చంద్రబాబు అభినందనలు ఎందుకంటే..?

సూపర్ స్టార్  రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో అర్ధ శతాబ్దం పాటు సినీ పరిశ్రమలో అద్భుత కెరీర్  పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు అని  పేర్కొన్నారు. మీ ఐకానిక్ నటనతో లక్షలాది మంది ప్రేక్షకులను అలరించారు. అసంఖ్యాకంగా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, మీ సినిమాల ద్వారా సమాజంలో సామాజిక అవగాహనను పెంచారని చంద్రబబాబు  ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.    ఇలా ఉండగా 50 ఏళ్ల పాటు సూపర్ స్టార్ గా వెలుగొందుతూ అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న రజనీకాంత్ కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు  చేశారు. 

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలూ చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడం లేదు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వార్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలలో వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా ఉండగా శనివారం (ఆగస్టు 16) కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో  కురుస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని  పేర్కొంది. ఈ  నేపథ్యంలోనే శనివారం  (ఆగస్టు 16) రాష్ట్రంలోని పలు జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచీ ముసురు పట్టి ఉంది. కొన్ని  ప్రాంతాలలో వర్షం పడుతోంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జయంశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డితో పాటు సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న  వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ పలు జిల్లాలలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ముఖ్యంగా  శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాలలో వర్షం ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది.