కమలం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే బాలరాజు

  నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కమలం గూటికి చేరారు. ఇవాళ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్‌రావు  కాషాయ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షణీయమని  రామచందర్‌రావు అన్నారు. అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలన, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు నచ్చే బీజేపీలో చేరానని అన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అన్నారు. గువ్వల బాలరాజు కూడా ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి రావడం అభినందనీయమని అన్నారు.  అచ్చంపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభివృద్ధికి గువ్వల బాలరాజు కృషి చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీనీ విమర్శించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఓటమి తప్పదనే విషయాన్ని రాహుల్ ముందే గుర్తించారని.. అందుకే ఈసీపై, మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ మండిపడ్డారు.

నిజంగానే పెమ్మ‌సాని..ఈవీఎం ట్యాంప‌ర్ చేయించారా?

  ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ కామెంట్లు ను బ‌ట్టీ చూస్తే... ఏపీ పైనా కొంద‌రు గురి పెట్టి.. ఇక్క‌డ ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశారు. అందుకు ప్ర‌ధాన కార‌కుడు గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు ప్ర‌జ‌ల‌కు క‌నీసం తెలియ‌ని ఇత‌డికి మూడున్న‌ర ల‌క్ష‌ల పై చిలుకు మెజార్టీ ఎలా వ‌చ్చింద‌ని గ‌ట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. అస‌లు పోలింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియ ఎలా జ‌రుగుతుంది? దాని పూర్వాప‌రాలు ఏంట‌ని ఒక సారి చూస్తే..   పోలింగ్ క్లర్కు, పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్.. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్ మ్యానేజ్‌మెంట్, ట్రైనింగ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, లైసనింగ్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్, ర్యాండమైజేషన్, కౌంటింగ్ రూమ్ ఇలా పోలింగ్ క‌మ్ కౌంటింగ్ లోని వివిధ స్థాయిల‌లో ఉంటారు అధికారులు.  ఆ ప్ర‌క్రియ‌లు కూడా అంతే స‌మానంగా పెద్ద ఎత్తున ఉంటాయి.  గ్రామపంచాయతీ సర్పంచ్-  డైరెక్ట్/ ఇండైరెక్ట్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మండల ప్రెసిడెంట్-  డైరెక్ట్ /ఇండైరెక్ట్, జెడ్పీటీసీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన వారు చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. ఇది అత్యంత క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. విప‌రీత‌మైన క్రాస్ చెక్ చేస్తుంటారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తేడా జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త వ‌హిస్తుంటారు. ఈవీయం లు అంటే,  కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్  లు.. ఇవి అంత తేలిగ్గా హ్యాకింగ్ కు గురికావు. వాటికి సిగ్నల్ రిసీవింగ్, ట్రాన్స్మిషన్ చేసే పరికరాలు, నెట్ కనెక్టివిటీ లాంటివి ఏమీ ఉండవు. ఇవ‌న్నీ క‌ల్పిత గాథ‌లు. ఎలక్షన్ కమిషన్ నియమించిన అబ్జర్వర్స్ సమక్షంలో మూడు స్థాయిల్లో జరిగే ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ అధికారులు / ఉద్యోగులు, ఈవీయం వివిధ ప్రత్యేక నంబర్లను కలిగి ఉన్న ఈ మూడు పరికరాలు  లు అనగా ఏ కంట్రోల్ యూనిట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ వీవీ ప్యాట్ లు ఏ ప్యాటర్న్ లో, ఏ పోలింగ్ స్టేషన్ కు వెళతారో / యో అలాట్ చేసిన వారికే తెలియదు.  అక్కడ, ఆ పోలింగ్ స్టేషన్ లో ఎందరు ఓటర్లు ఉంటారో కూడా ఈవీయం కు సంబంధించిన డేటాలో ఉండదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉండే సమాచారం మాత్రమే మొత్తం ఓటర్ల సంఖ్య చెబుతుంది. పోలైన ఓట్ల సంఖ్య తెలియజేస్తుంది. ఆ సంఖ్యకు అనుగుణంగా పార్టీలు / అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంటింగ్ సమయంలో తెలుస్తుంది. పోలింగ్ పూర్తి కాగానే పోలింగ్ ఏజెంట్ల, అబ్జర్వర్ లు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు .. సమక్షంలో బ్యాటరీని ఆఫ్ చేసి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ లను సీల్ చేసి రిసెప్షన్ సెంటర్ కు పోలీసు బందోబస్తు మధ్యన తీసుకొస్తారు. అక్కడినుంచి అదేబ‌రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ కు తరలించి పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా గళ్ళు వేసి ఉంచిన స్ట్రాంగ్ రూం లో తాళం వేసి, సీలు వేసి భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూంకు సీలువేసే సమయంలో కూడా పోటీ చేసిన అభ్యర్థులు / ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వీడియోగ్రఫీ చేస్తారు. ఒకే తలుపు ఉండి, అన్ని కిటికీలను మూసేసి  ప్లైవుడ్ లేదా ఇటుకలతో కట్టిన నిర్మాణం చేసి సీల్ చేస్తారు, లైట్లు ఆఫ్ చేసి- షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ రూం కు ఇరవైనాలుగు గంటలూ పోలీసు పహారా ఏర్పాటు చేస్తారు. ఆ తలుపు ఉండే ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్ ను తిరిగి కౌంటింగ్ రోజున మాత్రమే అందరి సమక్షంలో తెరుస్తారు. మూసివేసే సమయంలోనూ, తిరిగి తెరిచే సమయంలోనూ వీడియోగ్రఫీ చేస్తారు. బ్యాటరీ ఆఫ్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. కంట్రోలు యూనిట్ వాడుకునే కరెంట్ అతి తక్కువ.  కంట్రోలు యూనిట్ లో ఓటును అలాట్ చెయ్యగలం అంతే. బ్యాలెట్ యూనిట్ లో ఓటు వినియోగం తరువాతే మరోసారి కంట్రోలు యూనిట్ పని చేసేందుకు సిద్ధం అవుతుంది. ఎప్పుడైతే కంట్రోలు యూనిట్, బ్యాలెట్ యూనిట్ ల మధ్య ఉన్న కేబుల్స్ తొలగించగానే రెండు కూడా ఏ రకమైన చర్యలు చేయడానికి వీలులేకుండా ఉండిపోతాయి. అందువల్ల‌  ఒక్క ఓటు కూడా పోలింగ్ స్టేషన్ బయట వేసేందుకు వీలులేదు.ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఎన్ని ఓట్లు పోలైనాయో ఉంటుంది. ఏజెంట్లు అక్కడ సంతకం చేస్తారు. ఆ ఓట్ల సంఖ్య ఫైనల్. ఆ పైన అదనంగా ఓట్లు క‌నిపించవు. అది అసాధ్యం. ఈవీయంలను మ్యానేజ్ చేసే విధానమే ఉంటే అధికారంలో ఉన్న పార్టీ పోటీదారులు వందశాతం గెలవాలి. అన్ని పోలింగ్ స్టేషన్లలో మెజారిటీ ఆ అధికార పార్టీకే రావాలి కదా... మరి అలా జరగటం లేదు కదా. ఫలితాలు తలకిందులై అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయి వేరే పార్టీలు యంయల్ఏ, యంపీ ఎలక్షన్ల ద్వారా రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తున్నాయి అంటే ఈవీయంలు చక్కగా పని చేస్తున్నాయనే క‌దా అర్ధం. ఇక్క‌డ మ‌రో లాజిక్ కూడా చాలా మందికి పీకుతూనే ఉంది. ఒక వేళ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి నిజంగానే ఈవీఎంల‌ను టాంప‌ర్ చేసి గెలిచి ఉంటే.. మ‌రి కేంద్రంలో బీజేపీ కూడా అఖండ మెజార్టీతో విజ‌యం సాధించాలిగానీ.. 420 సీట్లు టార్గెట్  పెట్టుకుంటే 240కి ప‌రిమితం కావ‌డ‌మేంట‌న్న‌ది మ‌రి కొందరి ప్ర‌శ్న‌. మ‌రో మాట కూడా ఇదే విష‌యంలో రాసుకోవ‌చ్చు. గ‌తంలో ఏపీలో జ‌గ‌న్ మోహ‌న రెడ్డి సైతం 151 సీట్ల అఖండ మెజార్టీతో గెలిచిన‌పుడు బాబు ఇలాగే అన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ ఆ వాయిస్ అందుకుంది. మ‌రి 151 సీట్లు వ‌చ్చిన‌పుడు రాని ఈవీఎం డౌట్ ఇప్పుడే రావ‌డంలో అర్ద‌మేంటి. పెమ్మ‌సాని వంటి వారి ముక్కూ మొహం ఓట‌ర్ల‌కు తెలీదంటున్న‌పుడు జ‌గ‌న్ హ‌యాంలో గెలిచిన వారి ముక్కూ మొహం మాత్రం ఎవ‌రికి తెలుసు? పెమ్మ‌సాని అన్నా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవల్లో బ‌యో టెక్ బిజినెస్ చేసిన బిజినెస్ మెన్. మ‌రి నందిగం సురేష్ వంటి వారు ఎంపీ అయిన‌పుడు ఇదే ప్ర‌శ్న వీరంద‌రికీ ఎందుకు రాలేదు? ఇలా లాజిక్కులు లాక్కుంటూ పోతే.. తెగేది లేదు తెల్ల‌వారేది లేద‌న్న‌ది ఒక విశ్లేష‌ణ‌గా తెలుస్తోంది. మ‌రి మీరేమంటారు???    

మట్టి మనుషుల అరణ్యరోదన!

జై జవాన్.. జై కిసాన్.. జైహింద్.. నినాదాలకే పరిమితమా? కర్షకులకు, శ్రామికులకు సరైన ఆదాయం లేక విలవలలాడుతున్న జన భారతం. వివరాల్లోకి వెడితే.. ఆరు దశాబ్దాల కిందట భారతావని వరుస కరువు కాటకాలతో ఆకలి కేకలతో అల్లాడి, తల్లడిల్లిపోయింది. విదేశాల నుంచి ధాన్యం వస్తే తప్ప మన పొయ్యిలోని పిల్లి లేవని దుస్థితి. నాడు ఓడ వస్తేనే నోట్లోకి ముద్ద వెళ్లేది అనే నానుడి దేశ ప్రతిష్ఠకు మచ్చలా మారింది.  అలాంటి దుర్భర, దీనావస్థ నుంచి అనతి కాలంలోనే ఆహార ధాన్యాల దిగుబడిలో స్వావలంబన సాధించగలిగే స్థాయికి భారత దేశం చేరుకోగలిగింది. హరిత విప్లవం పితామహుడు, ఎంఎస్ స్వామినాథ్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త నార్మన్ బోర్లాంగ్ సహకారంతో 1960లో మొదలైన హరిత విప్లవం భారత జాతి తలరాతను మార్చివేసింది. ఆధునిక దిగుబడి ఇచ్చే వంగడాల వినియోగం, నీటి వనరుల సమర్థ వాడకం, చీడపీడ నివారణల పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో హరిత విప్లవం ప్రారంభమైన ఐదేళ్లలోనే దేశీయంగా గోధుమ ఉత్పత్తి దాదాపు రెట్టింపైంది. రెండున్నర దశాబ్దాలలో వరి ఉత్పాదకతలో మూడు రెట్లు వృద్ధి నమోదైంది. హరిత విప్లవం దరిమలా జన భారతానికి ఆహారభద్రత లభించినప్పటికీ.. సాగుదారుల ఆదాయాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. రైతు సంక్షేమానికి ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు బుట్లదాఖలయ్యాయి. సిఫారసులు ఆచరణలోకి తీసుకురావడంపై ప్రభుత్వాలు దృష్టి సారించినప్పుడే సాగురంగ రుషి అయిన ఎంఎస్ స్వామినాథన్ కు ఘనమైన నివాళి.  అన్నదాతలు, మట్టిమనుషులకి వ్యవసాయం అంటేనే వ్యయం చేయడం, సాయం అడగడం పరిపాటి అయిపోయింది. నేటి రైతు దుస్థితికి ప్రభుత్వ విధానాలు కారణమైతే.. ప్రకృతి వికృతి రూపం కారణం. రైతే దేశానికి వెన్నెముక అంటారు. సకలచరాచర జీవకోటికి అన్నంపెట్టే అన్నదాత.. ఆర్తనాదాలు లేని గ్రామాలే లేవంటే అతిశయోక్తి కాదు. కారణాలు అనేకం. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. పండించిన పంటలను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు లేవు. రైతులకు  సకాలంలో ఎరువులు, క్రిమి సంహారక  మందులపై సబ్సిడీ అందుబాటులో ఉండటం లేదు. క్రిమి సంహారక మందుల ధరలు ఏటాటా అడ్డూ అదుపూ లేకుండా పెస్టిసైడ్స్ కంపెనీలు పెంచుకుంటూ పోతుంటే..కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రులు లంచాలవతారులై  రైతు వెన్ను విరుస్తున్నారు. నకిలీ పెస్టిసైడ్స్, విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అమ్మేవారిపైన కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం ఫలసాయం అవుతుంది.. వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు సృష్టించడంలో మన శాస్త్రవేత్తలు వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా ప్రభుత్వమే సేకరించి  రైతులకు తక్షణమే ప్రభుత్వ మద్దతు ధరతో చెల్లించే ప్రక్రియ లేనే లేదు. మధ్య దళారీ వ్యవస్థ వల్ల అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నారు. ఈ మధ్య కాలంలో రాయలసీమలో తోతాపురి మామిడి రైతుల దుస్థితి చూశాము. అదే విధంగా పక్కనే ఉన్న మెట్రోపాలిటిన్ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మొదలైన నగరాలలో తోతాపురి మామిడి కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకూ అమ్మడం జరిగింది. కనీసం రైతులకు కేజీకి ఎనిమిది రూపాయలు కూడా గిట్టుబాటు కాలేదు. దీనికి కారణం ఎవరు? మన పాలకుల విధి విధానాలే. ఇలాగా అన్ని పంటల దుస్థితి ఇలాగే దాపురించింది. ప్రభుత్వాలు మేలుకోకపోతే దేశంలో భవిష్యత్ లో వ్యవసాయం చేసే వారే కరువౌతారు. తస్మాత్ జాగ్రత్త.!

అమెరికన్ జనంపై.. ట్రంప్ టారిఫ్ దెబ్బ!

  అవును. మీరు కరెక్ట్ గానే చదివారు. మీరు చదివింది నిజమే. అయినా,అమెరికా అధ్యక్షుడు. డోనాల్డ్ ట్రంప్‌పై తమ దేశ ప్రజలపైనే టారిఫ్ భారం మోపడం ఏమిటి ? టారిఫ్’ కొరడా  ఝులిపించడం ఏమిటి ? అనే అనుమానం రావచ్చును, కానీ, జరిగింది, జరుగుతున్నది    అదే., ఎలాగంటే..  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’కు తెలుగు సామెతలు తెలియక పోవచ్చును,కానీ, ఆయన, తీసుకుంటున్న నిర్ణయాలు, అయ్యవారిని చేయబోతే కోతి అయింది’ వంటి   సామెతలను గుర్తుకు తెస్తున్నాయి.  నిజం. ఒక్క టారిఫ్ విషయంలోనే కాదు, కాల్పుల విరమణ విషయంలో నేనే...నేనే..నేనే  ట్రంప్ నేనులను పనిగట్టుకుని లెక్కపెట్టిన రాహుల్ జీ లెక్క ప్రకారం 30 సార్లు) చేశా అంటూ ట్రంప్ చేసిన గోల విషయంలో కానీయండి,మరో విషయంలో కానీయండి, ట్రంప్’ తీసుకుంటున్న ‘సంచలన’ నిర్ణయాలు, ఏదో అనుకుంటే ఇంకేదో  జరిగింది అన్నట్లుగా, బ్రూమ్రాంగ్’ అవుతున్నాయి. అంటే, గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ముఖాన్ని, ముద్దాడుతున్నాయి.ఈ విషయం ఎవరో చెప్పడం కాదు, కాదు, అమెరికన్’ ప్రజలు, పార్లమెంటేరియన్స్’ చెపుతున్నారు. అవును. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం,మన దేశం చేసిన మహాపరాధం అని భావించిన ‘ శ్రీ’  ‘ట్రంప్’ మన దేశం పై ఎడాపెడా,సుంకాలు విధించారు. ముందు 25 శాతం అన్నారు, ఆ తర్వాత మరో పాతిక కలిపి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్’ చేశారు. ఇలా  ఎడాపెడా టారిఫ్’లు పెంచి భారత దేశాన్ని దారికి తెచ్చుకోవాలని, శ్రీమాన్ శ్రీ ట్రంప్’ ఆశించారు, కావచ్చును. కానీ,  డామిట్’ కథ అడ్డం తిరిగింది. తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు అన్నట్లు, ట్రంప్ ఒకటి తలిస్తే, మోదీ ఇంకొకటి తలిచారు. భారత ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశ్నే లేదని కుండ బద్దులు కొట్టారు.  దాంతో, డామిట్ కథ అడ్డం తిరిగిందని తల పట్టుకోవడం ట్రంప్’ వంతైంది. సరే, జరిగిందేదో జరిగింది, ట్రంప్ టారిఫ్’ వలన అమెరికా ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగిందా, అంటే  అదీలేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు అన్నట్లు, భారత ఆర్థిక వ్యవస్థ పై పెద్దగ భారం పడలేదు, పడే పరిస్థితి ప్రస్తుతానికి లేదనే, అంటున్నారు. కానీ, ఇంతలోనే అమెరికా ప్రజలు నెత్తిన  ధరల భరం మాత్రం గట్టిగ పడింది. నిజానికి ట్రంప్. టారిఫ్’ల ప్రభావం ఇంకా  పూర్తిగా అములులికి రాలేదు,అయినా, ఇంతలోనే అమెరికా ప్రజల ఇతీ బాధలు. ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయని అక్కడి ప్రజలు సోషల్ మీడియా కోడై కూస్తోంది.  కాగా,ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మెర్సిడెస్ చాండ్లర్,వాల్‌మార్ట్‌లో ధరలు ఎలా పెరిగాయో వివరిస్తూ రిలీజ్ చేసిన వీడియో భయంకరంగా వైరల్ అవుతోంది. ‘ట్రంప్ టారిఫ్స్ ఆర్ ఇన్  ఫుల్ స్వింగ్‌’ అనే క్యాప్షన్తో రిలీజ్ చేసిన వీడియోలో  మెర్సిడెస్ చాండ్లర్ వాల్‌మార్ట్ ‘లోని బట్టల సెక్షన్‌లో తిరుగుతూ, పాత ధరల ట్యాగ్‌లను కొత్త ధరలతో ఎలా రీప్లేస్ చేశారో చూపించారు. కొన్ని ట్యాగ్‌లు కొత్త ధరల స్టిక్కర్లు అతికించి ఉన్నాయి. ఫ్రెండ్స్, టారిఫ్స్ ఇప్పుడు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయంటూ చాండ్లర్ చెప్పుకొచ్చారు.  ఉదాహరణకు ఒక చిన్న షర్ట్ ధర $6.98 నుంచి $10.98కి పెరిగింది. అలాగే, ఒక బ్యాక్‌ప్యాక్ $19.97 నుంచి $24.97కి చేరింది. అంటే 4 డాలర్లు పెరిగిందని ఆమె ఆశ్చర్యంగా చెప్పింది. మీరు నమ్మకపోతే, మీ దగ్గరలోని వాల్‌మార్ట్ లేదా టార్గెట్‌కి వెళ్లి స్వయంగా చెక్ చేయాలని సవాల్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ట్రంప్ సుంకాలను విమర్శిస్తున్నారు. చివరకు ట్రంప్’ ను జోకర్ అనే స్థాయిలో విమర్శలు ఉంటున్నాయి, అందుకే అమెరికన్లు,  ట్రంప్’ దురాశ దుఖానికి చేటు’ అంటున్నారు.  

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఓటుకు రూ.10000

  ఈ నెల 12న జరిగే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇరు పార్టీలు నువ్వా నేనా అనేలా వ్యూహాలు రచిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కంచుకోటైన  పులివెందుల స్ధానంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఓటుకు రూ.10000 ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సిద్దమైనట్లు సమాచారం. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీలను గతంలో వైసీపీనే గెలవగా తిరిగి కైవసం చేసుకోవడాని తీవ్ర కసరత్తు చేస్తోంది.  ఓటింగ్ దగ్గరపడుతుండటంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. దానికి తోడు పులివెందుల ఉప ఎన్నిక మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ డబ్బును మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడానికి సిద్ధమైంది. పులివెందులలో ఓటుకోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు వైసీపీ సిద్దమైంది. వైసీపీ అధినేత జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ఒక్కో ఓటు కోసం ఏకంగా 10 వేల రూపాయలు పైనే ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. ఎంత ఖర్చు చేసైనా సరే పులివెందుల స్థానాన్ని గెలవాలన్న కసిలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. ఇప్పుడు రెండు కాకపోయినా.. సొంతగడ్డ పులివెందులైనా గెలిచి తీరాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.

మహా సాగరంలో అరుదైన ఖనిజాల వేట ముమ్మరం!

మానవుడు తన మనుగడ కోసం, తన అవసరాల, తన స్వార్థం, విలాసవంతమైన సౌకర్యాల కోసం మహా సాగరాలను కూడా చెరబడుతున్నాడు.  భూగోళంపై 71శాతం నీరే కాబట్టి భూమి మీద కన్నా సముద్రగర్భంలోనే రెండు రెట్లు అధికంగా ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి,   సాంకేతికంగా ముందున్న దేశాలు సముద్ర గర్భం నుంచి అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ పడుతున్నాయి. ఈ ఖనిజాల వేట మహా సాగర జలాలను కలుషితం చేసి.. సాగర జీవులకు ముప్పు తెస్తున్నాయి. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి. అసలే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని మరింత ఎక్కువ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ప్రజలకి   జీవనాధారం  సముద్ర తీర   ప్రాంత వనరులపై ఆధారపడి ఉంటుంది. వాళ్లందరి జీవనభృతికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది.   సముద్రంలో 5,580 రకాల జీవజాతులుండగా, వాటిలో 430 జీవ జాతులను మాత్రమే ఇప్పటి వరకూ మనం గుర్తించగలిగాం. సముద్ర గర్భంలో  ఖనిజ కణికల కోసం చేపట్టే అన్వేషణ భారీ నష్టాన్ని కలిగిస్తుంది  కాబట్టి అరుదైన ఖనిజాల అన్వేషణ తక్షణం ఆపాలని ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్, చిలీ, కోస్టారికా దేశాలు కోరుతున్నాయి.  మానవ మనుగడ, అవసరాలు, నూతన ఆవిష్కరణలైన ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల పరిశ్రమల ఉత్పత్తుల కోసం లిథియం, కోబాల్ట్, టైటానియం, గాలియం, రాగి, నికేల్, మ్యాంగనీస్ వంటి అరుదైన లోహాలు అవసరం ఏంతైనా ఉంది. వీటి అన్వేషణ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి.  సముద్రగర్భంలో 600 కోట్ల టన్నుల మ్యాంగనీసు, 27 కోట్ల టన్నుల నిఖీలు, 23 కోట్ల టన్నల రాగి, 5 కోట్ల టన్నుల కోబాల్ట్ నిక్షేపాలున్నాయనీ, వీటిని వెలికి తీస్తే, అరుదైన లోహాల కోసం చైనాపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుందని పాశ్చ్యాత్త దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం హవాయి నుంచి మెక్సికో వరకూ పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించిన క్లారియం, క్లిప్పర్టన్ క్యాప్చర్ జోన్  (సీసీజడ్ )లో  అరుదైన ఖనిజాల కోసం వేట ముమ్మరమైంది.  సముద్రాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తే.. జీవజాతులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది. దీనిని నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఛత్రం కింద కుదిరిన సముద్ర చట్టం ఒప్పందం 1994 నవంబర్ 16 నుంచి అమలులోకి వచ్చింది. దీని కింద ప్రతి దేశానికి తమ తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్లు (22.22 కిలోమీటర్లు) దూరం వరకూ ఉన్న జలాలపై సార్వభౌమ హక్కు ఉంటుంది. వీటిని అంతర్గత జలాలు అంటారు. ఖండపు అంచుల నుంచి 220 నాటికల్ మైళ్లు (370.4 కిలోమీటర్లు) వరకూ విస్తరించిన ప్రాదేశిక జలాలను ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా పిలుస్తారు. అంతర్గత, ప్రాదేశిక జలాల పరిధికి అవతల ఉన్నదంతా అంతర్జాతీయ జలాలే. అంటే..  ఏ దేశానికి ఆ దేశ సముద్ర గర్భంలోని అరుదైన ఖనిజాల అన్వేషణపై సమన్వయం పాటించాలన్నమాట. వాస్తవానికి సముద్ర గర్భ అన్వేషణకు ఐఎస్ఏ (అంతర్జాతీయ సముద్రగర్భ ప్రాధికారిక సంస్థ) నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఐఎస్ఏలో  170 సభ్య దేశాలు ఉన్నాయి.

పులివెందుల వైసీపీలో భయం.. క్యాడర్ లో అయోమయం

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక భయం పట్టుకుంది. పులివెందుల పులి.. పులివెందులలో తిరుగే లేదు అని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఓటమి ఖాయమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైతే.. ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. ఎందుకంటే..పులివెందుల అంటే వైఎస్ కంటుకోట.. వైఎస్ తదననంతరం జగన్ కంచుకోట అని ఇంత కాలం చెప్పుకుంటూ తిరిగిన వైసీపీ నేతలకు ఇప్పుడు అక్కడే ఎదురు గాలి వీచడం జీర్ణం కావడం లేదు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం, అదీ ఆరునెలలు మాత్రమే ఉండే పదవి కోసం వైసీపీ యంత్రాంగం మొత్తం పులివెందులలో తిష్ట వేసింది. అయినా విజయం పట్ల ధీమా కరవై కంగారెత్తిపోతున్నది. పులివెందుల జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగి దశాబ్దాలు దాటిపోయింది. ఇక్కడ జగన్ కు, ఆయన పార్టీకి ప్రత్యర్థులుగా రంగంలోకి దిగడానికే భయపడే పరిస్థితి  ఉండేది. దాదాపుగా ఇక్కడ స్థానిక ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇక్కడ తెలుగుదేశం కూటమి అభ్యర్థిని నిలపడమే కాదు, గెలిపించుకుంటామని కూడా ధీమాగా ఉంటే.. ఇంత కాలం ఇక్కడ తమదే రాజ్యమని విర్రవీగిన వైసీపీయులు తమపై దాడులు జరుగుతున్నాయంటూ డ్రామాలు ఆరంభించేశారు. ఈసీ వద్దకు వెళ్లి రక్షణ కావాలని మొరపెట్టుకుంటున్నారు. రిగ్గింగు చేసుకునే అవకాశం లేకుండా పోలింగ్ స్టేషన్లను మార్చేశారని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇక్కడి జనం మాత్రం ఇన్నాళ్లకు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పరిశీలకుల విశ్లేషణల ప్రకారం వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఆయనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో పరాజయం ఎదురైతే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై పడుతుందని జగన్ కూడా భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తాను స్వయంగా పులివెందులలో ప్రచారానికి రాకపోయినా.. బెంగళూరు ప్యాలస్ నుంచి నిరంతరం ప్రచార తీరును పరిశీలిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు.  ఎంతగా దిశానిర్దేశం చేసినా పరిస్థితి అనుకూలంగా కనిపించడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇక భయపెట్టి గెలిచేద్దామనుకుంటే.. పటిష్ట పోలీసు బందోబస్తు ఆ అవకాశం లేకుండా చేస్తున్నది. ఏది ఏమైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి వ్యతిరేకంగా వస్తే..పార్టీ నుంచి వలసలు ఊహించని స్థాయిలో మొదలౌతాయన్న భయం పార్టీ అగ్రనాయతక్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత

  గుంటూరు ప్రజల సెంటిమెంట్ బ్రిడ్జిగా చెప్పుకునే,  శంకర్ విలాస్ బ్రిడ్జిని అధికారులు కూల్చివేశారు... గుంటూరు తూర్పు,  గుంటూరు పశ్చిమ నియోజకవర్గలను కలిపే ఈ బ్రిడ్జ్,  పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరింది ...ఈ బ్రిడ్జ్ దాదాపుగా 70 సంవత్సరాలు పాటు గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందించింది... 1950 ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభించుకున్న ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి,  గడిచిన  పాతికేళ్లుగా పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుంటుంది.   దీంతో స్పందించిన కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ బ్రిడ్జి స్థానంలో టాప్ క్లాస్ బ్రిడ్జి నిర్మాణం చేయించాలని పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా 110 కోట్ల రూపాయలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ,ఈ బ్రిడ్జిని నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 70 ఏళ్లుగా గుంటూరు ప్రజలతో మమేకమైపోయిన శంకర్ విలాస్ బ్రిడ్జి, అనేక ధర్నాలకు, ర్యాలీలకు, వేడుకలకు, వేదికయింది  

ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద సినీ కార్మికులు నిరసన

  ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద 24 యూనియన్లకు చెందిన సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున కార్మికులు నినాదాలు చేశారు.  నిరసనలో 24 యూనియన్ల సినీ కార్మికులు  పాల్గొన్నారు.  శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలు చర్చలు జరపగా మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. న్యాయమైన పద్దతిలో వేతనాలు పెంచలని డిమాండ్ చేస్తున్నాయి. రేపటి నుంచి చిత్రీకరణలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు ఫిల్మ్ ఫేడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు. ఇప్పటికే షేడ్యూల్ ఉంటే 2 రోజులు సమయమిస్తామని, ఆతర్వాత అవి కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. నిన్న జరిగిన  సమావేశంలో నిర్మాతలు రెండు రకాల వేతన పెంపు విధానాలను ప్రకటించారు. రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 5 శాతం, మూడవ ఏడాది మరో 5 శాతం చొప్పున వేతనం పెంచడానికి సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా, రోజుకు రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు మొదటి ఏడాది 20 శాతం, మూడవ ఏడాది 5 శాతం పెంచనున్నట్లు తెలిపారు. అయితే, వీరికి రెండవ ఏడాది వేతన పెంపు ఉండదని స్పష్టం చేశారు.

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక టోల్‌ ఛార్జ్‌ రూ.15లే

  దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న ఆగస్టు 9న ఒక కీలక ప్రకటన చేశారు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు. ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం రూ. 15కే టోల్ ప్లాజాను దాటగలరని, ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు.  వార్షిక ఫాస్ట్‌ ట్యాగ్‌ పాస్‌ ధర రూ.3000  వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ ఈ పాస్ ధర రూ.3000గా నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చని చెప్పారు. ఇక్కడ 'ఒక ప్రయాణం' అంటే ఒక టోల్ ప్లాజాను దాటడం. ఈ లెక్క ప్రకారం.. రూ.3000కి 200 టోల్‌లను దాటడం అంటే టోల్‌కు కేవలం రూ.15 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు. సాధారణంగా, మీరు ఏదైనా టోల్ ప్లాజా గుండా ఒకసారి వెళ్ళడానికి సగటున రూ.50 చెల్లిస్తే, 200 టోల్ ప్లాజాలను దాటడానికి మీరు మొత్తం రూ.10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్‌ని ఉపయోగించడం ద్వారా మీరు నేరుగా రూ.7000 వరకు ఆదా చేయవచ్చు.  వార్షిక పాస్ ప్రయోజనాలు:  కొత్త వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్ట్ ట్యాగ్‌ను తరచుగా రీఛార్జ్ చేసుకోవాలి. అయితే వార్షిక పాస్‌ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఈ వార్షిక పాస్ జారీ చేసిన తర్వాత ప్రజలు టోల్ చెల్లించడానికి పొడవైన క్యూలలో నిలబడే ఇబ్బంది నుండి కూడా బయటపడతారు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ఆగస్టు 15, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఇది జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర రహదారులపై దీని ఉపయోగం చెల్లదు. ఈ చొరవ రవాణాను మరింత సౌకర్యవంతంగా, ఆర్థికంగా మారుస్తుందని భావిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఆగస్టు 15 నుండి ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్‌మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా  అధికారిక వెబ్‌సైట్ (www.nhai.gov.in) లేదా www.morth.nic.in లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.  ఇది తప్పనిసరియా?  ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదా? ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదు. అయితే, రోజువారీ ప్రయాణికులు చెల్లించే టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం. వార్షిక పాస్ కొనడానికి ఇష్టపడని వారికి, వారి ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ యథాతథంగా పనిచేస్తుంది. టోల్ ప్లాజాలలో వర్తించే విధంగా వినియోగదారులు దీనిని సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

వారం రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు

తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ మహానగరం అయితే వర్షాలకు చిగురుటాకులా వణికి పోతున్నది. ఇక ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఆదివారం (ఆగస్టు 10) నుంచి వారం రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడం ఏర్పడిందనీ, దీనికి తోడు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 13వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, తెలంగాణలో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తుల నిత్యం పోటెత్తుతుంటారు. వారాంతంలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. ఆదివారం (ఆగస్టు 10) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని మొత్తం 84 వేల 404 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 6 లక్షల రూపాయలు వచ్చింది. ఇలా ఉండగా ఆదివారం (ఆగస్టు 10) ఉదయం చిరుజల్లులతో తిరుమలలో వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది. చిరుజల్లులలో తిరుమల గిరుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ తన్మయు లౌతు న్నారు. 

బెంగళూరులో కొత్త క్రికెట్ స్టేడియం.. సీఎం సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విషాద సంఘటన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాట. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయం తరువాత చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణాలు సంభవించాయి. ఈ విషాద సంఘటన తరువాత నగరం నడిబొడ్డున ఉన్న స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణ, జనాలను కంట్రోల్ చేయడం కష్టమని భావించిన కర్నాటక ప్రభుత్వం  బెంగళూరు శివార్లలోని  బొమ్మసాంద్ర ప్రాంతంలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి  శ్రీకారం చుట్టింది.  1650 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 80 వేల మంది ప్రేక్షకుల కూర్చునే కెపాసిటీతో భారీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.   ఈ మెగా క్రికెట్ స్టేడియం ప్రాజెక్ట్ కు పాలనాపరమైన అనుమతులే కాకుండా, నిధుల విడుదలకూడా జరగడంతో త్వరలోనే   నగరం నడిబొడ్డున ఉన్న చిన్నస్వామి స్టేడియం నుండి శివార్లలో ఉన్న బొమ్మసాంద్రలోని కొత్త స్టేడియంకు క్రికెట్ మ్యాచ్ లు తరలిపోనున్నాయి. ఈ కొత్త స్టేడియం   దాదాపు 80,000 మంది కూర్చునే సామర్థ్యంతో. ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది. చిన్న స్వామి స్టేడియం సామర్థ్యం 40 వేలు మాత్రమే.. అంటే ఈ కొత్త స్టేడియంలో అంతకు రెట్టింపు మంది ప్రేక్షకులు మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తుంది.   

మంగళగిరి మహిళలే తోబుట్టువులు.. జన హృదయాలను గెలిచిన లోకేష్

నారా లోకేష్ ప్రజల మనిషిగా గుర్తింపు పొందుతున్నారు. జనంలో మమేకం కావడం, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా.. వారిలో తానూ ఒకడినేనని తన చర్యలు, మాటలతో చాటుతున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా లోకేష్ శుక్రవారం (ఆగస్టు 9) మంగళగిరిలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి జాతీయ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా ముఖ్యంమంత్రి చంద్రబాబుతో పాటు మన్యం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొనాల్సి ఉంది. అయితే.. తన సొంత నియోజకవర్గం అయిన మంగళగిరిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్న లోకేష్ మన్యం పర్యటనను స్కిప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నియోజకవర్గ మహిళలతో ఆయన రాఖీలు కట్టించుకున్నారు.  మంగ‌ళ‌గిరి నేత చీర‌ల‌ను కానుక‌గా అందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్..  తన‌కు తోబుట్టువులు లేరనీ, అందుకే  తపపే గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించి, అఖండ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి మహిళలే తనకు అక్క చెల్లెళ్లనీ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఈ ఒక్క మాటతో ఆయన మంగళగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. లోకేష్ మంగళగిరిని ఓన్ చేసుకోవడం కాదు. మంగళగిరి ప్రజలే లోకేష్ ను ఓన్ చేసుకున్నారు. ఇందుకు నిదర్శనం.. నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో మహిళలు మంగళగిరి కార్యాలయానికి వచ్చి లోకేష్ కు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున క్యూలో నిలుచున్నారు. అలా తనకు రాఖీ కట్టేందకు వచ్చిన వారెవరినీ లోకేష్ నిరాశ పరచలేదు. గంటల తరబడి ఓపికగా నిలుచుని వారందరికీ తనకు రాఖీ కట్టేందుకు అవకాశం ఇచ్చారు.

హైదరాబాద్‌లో కుండ‌పోత వ‌ర్షం

  హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో  భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్  ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌,  సికింద్రాబాద్, తార్నాక‌, రామాంత‌పూర్‌, అంబ‌ర్‌ఫేట్, అమీర్‌పేట్‌, ఎర్ర‌గ‌డ్డ‌, కూక‌ట్‌పల్లి, మియాపూర్, గ‌చ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.  దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. శనివారం రాత్రి సైతం హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో.. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.  

చెప్పు తెగే వరకు కొడతా..కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

  తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని ఎ. కొండూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడకల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి కొలికపూడి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎ. కొండూరు మండలంలో వాటర్ సరఫరాపై జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిముఖ్య అనుచరుడిని టార్గెట్ చేశారు కొలికపూడి. గిరిజనులకు మరుగుదొడ్లు కట్టించేందుకు గతంలో కాంట్రాక్ట్‌ తీసుకున్న టీడీపీ నేత రమేష్‌రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 320 మరుగుదొడ్లు కట్టించేందుకు బిల్లులు తీసుకున్నారన్నారు. అటువంటి వారి వెనుక  తిరుగుతారా? అంటూ గిరిజనును నిలదీశారు. అసలు మీకు సిగ్గుందా? గిరిజనులపై సైతం నోరు పారేసుకున్నారు కొలికపూడి.  

జగన్ అడ్డా టీడీపీ కంచుకోట కాబోతుంది

  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డా పులివెందుల టీడీపీ కి కంచుకోట కాబోతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం పులివెందులలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప, పులివెందులకు ఐదేళ్లలో  ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం కొప్పర్తికి రూ.1,500 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బును దారి మళ్ళించారని ఆరోపించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దోచుకోవడంతోనే సరిపోయింది అన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు.  మరోవైపు పులివెందుల ఓటర్లలో ఆనందం వెల్లవిరించింది.  1995 తరువా తొలిసారి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటేయబోతున్న సంతోషం పండగ వాతావరణం గ్రామాల్లో తలపిస్తున్నాయి. పులివెందుల్లో తొలి నుంచి వైఎస్ కుటుంబం ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. తొలిసారి వైఎస్ కోటలో బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాంభూపాల్ రెడ్డి విజయం సాధించారు. తొలిసారి టీడీపీ నేతల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులవెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు.  ఈ ఎన్నికలు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో రెండు కూడా తమ ఫోకస్‌ అంతా అక్కడే పెట్టాయి. ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి టీడీపీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులివెందులలో వరుసగా రెండురోజుల పాటు టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందులలో ఉప ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది  

ఏపీలో 5, తెలంగాణలో 13 పార్టీలను డీలిస్ట్ చేసిన ఈసీ

  దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలను జాబితాను తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలో అయిన పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసీ డీలిస్ట్ చేసిన పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలోనూ బరిలోకి దిగకపోవడంపై వాటిపై ఈసీ వేటు వేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 2,854 గుర్తింపు పొందిన పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా చర్యలతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం డీ లిస్ట్ చేసిన పార్టీల జాబితాతతో ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 13 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ఆప్, నేషనల్ పీపుల్స్ పార్టీలకు మాత్రమే ఈసీ జాతీయ పార్టీల గుర్తింపు లభించింది.

మూడు విడతలుగా సినీ కార్మికుల వేతనాలు పెంపు

  సినీ కార్మికుల ఆందోళనపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు విడతలుగా వేతనలు పెంచలని నిర్ణయించారు. రోజుకు రూ.2000 లోపు ఉన్నవారికి తొలి విడతలో 15 శాతం, రెండో వితలో 5 శాతం, మూడో విడతలో 5శాతం పెంచలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 1000 లోపు ఉన్న కార్మికులకు 20శాతం ఒకేసారి పెంచుతమని వెల్లడించారు. తాము పెట్టిన నిబంధనలకి ఒప్పుకుంటే వేతనలు పెంచడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్ఫష్టం చేశారు. మరోవైపు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశంలో, సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంపుపై తాను హామీ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఫిలిం ఫెడరేషన్‌కు చెందిన కొందరు సభ్యులు తనను కలిశారనీ... వారి డిమాండ్లకు తాను అంగీకరించి, షూటింగ్స్ త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చాననీ... మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని  మెగాస్టార్ తన ప్రకటనలో తెలిపారు. "నేను ఫెడరేషన్ నుంచి ఎవరినీ కలవలేదు. అసలు వాస్తవాలు వెల్లడించడానికే ఈ ప్రకటన చేస్తున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.