మిలటరీ ట్రైనింగ్ : గర్ల్ ఫ్రెండ్స్ కోసం బ్యాంకుల్ని దోచేశాడు

  మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ ప్రాంతానికి చెందిన అనిల్ రజావత్ అనే ప్రబుద్ధుడు మాజీ సైనికోద్యోగి. సైన్యంలో ఏడేళ్ళు పనిచేశాడు. మిలటరీ ట్రైనింగ్‌లో భాగంగా ఈయనగారికి గ్యాస్ కట్టర్లని వాడి బలమైన తలుపులని ఎలా బద్దలు చేయొచ్చో నేర్పించాడు. ఈ విద్యని బాగా నేర్చుకున్న అనిల్ మిలటరీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనకి వచ్చిన విద్యని బ్యాంకుల తలుపులని బద్దలు కొట్టడం కోసం వినియోగించాడు. అది కూడా తనకున్న ముచ్చటగా ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ని సంతోషంగా వుంచడానికి! గర్ల్ ఫ్రెండ్స్ కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చడానికి అనిల్ రజావత్ తొమ్మిది బ్యాంకుల తలుపులు బద్దలు కొట్టి బోలెడంత సొమ్ము కొట్టేశాడు. లేటెస్ట్ గా షియోపూర్ యూకో బ్యాంక్‌ తలుపులు బద్దలు కొట్టి దాదాపు 37 లక్షలు కొట్టేశాడు. మొత్తంమీద పోలీసులు ఈయనగారిని పట్టుకుని జైల్లో వేశారు.

రంపచోడవరంలో జగన్ పార్టీకి షాక్

  తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జగన్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత ఉదయ భాస్కర్ తన అఫిడవిట్‌లో తాను షెడ్యూలు తెగలకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే ఆయన గిరిజనుడు కాదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనంత ఉదయ భాస్కర్ నామినేషన్‌ని తిరస్కరించారు. ఉదయ భాస్కర్ గిరిజనుడు కాదని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయడంతో కమిషన్ ఈ అంశాన్ని పరిశీలించి ఉదయ భాస్కర్ గిరిజనుడు కాదని నిర్ధారించుకుని నామినేషన్ తిరస్కరించింది. ఈ నియోజకవర్గంలో ఉదయ భాస్కర్ నామినేషన్‌తో కలిసి మొత్తం 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వైకాపా అభ్యర్థి ఉదయ్ భాస్కర్ నామినేషన్ తిరస్కరణకి గురికావడం ఇది మొదటిసారి కాదు. 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా నామినేషన్ వేయగా, అప్పుడు కూడా ఆయన నామినేషన్‌ని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.

కెప్టెన్ అమరీందర్ సింగ్ నోరు జారాడు : సిక్కుల ఆగ్రహం

  1984లో ఇందిరాగాంధీ హత్య సందర్భంగా సిక్కులపై జరిగిన మారణకాండ విషయంలో సిక్కులకు జగదీష్ టైట్లర్ మీద ఆగ్రహం వుంది. ఆయన కారణంగానే సిక్కులను ఊచకోత కోశారన్న బలమైన అభిప్రాయం వుంది. అయితే అమృత్‌సర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో వున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 1984 సిక్కుల ఊచకోత విషయంలో జగదీష్ టైట్లర్‌ అమాయకుడని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ సింగ్ ఇలా మాట్లాడాడు. నోరుజారి చేసిన ఈ కామెంట్ సిక్కులలో ఆగ్రహాన్ని నింపింది. అమరీందర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ పలువురు సిక్కులు, అకాలీదళ్ కార్యకర్తలు అమృత్‌సర్‌లో వున్న కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేశారు. ఢిల్లీలోని సిక్కులు, అకాలీదళ్ కార్యకర్తలు అక్కడి కాంగ్రెస్ కార్యాలయం మీద దాడికి దిగారు. ఆందోళన చేస్తున్న సిక్కుల మీద పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమరీందర్ సింగ్ వ్యాఖ్యలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిపోయింది. సిక్కు ఓటు బ్యాంకు నుంచి కాంగ్రెస్‌కి వచ్చే ఓట్లు చాలా తక్కువ. ఇప్పుడు అవికూడా రాకుండాపోయే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జగన్ అనుకూల సర్వేల గోల!

  ఈ ఎన్నికలలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో జగన్ పార్టీ అడ్రస్ గల్లంతు అయిపోవడం ఖాయమని, ఎన్నికల తర్వాత జగన్ చంచల్ గూడా జైల్లో పర్మినెంట్‌గా సెటిలవ్వక తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయి మీడియా సంస్థలు జరుపుతున్న సర్వేల్లో కూడా ఈ ఎన్నికలలో జగన్ పార్టీ ఊడబొడిచేది ఏదీ వుండదని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజులుగా న్యూస్ పేపర్లలో కొన్ని విచిత్రమైన సర్వేలు వస్తున్నాయి. సీమాంధ్రలో జగన్ దుమ్ము దులిపేస్తాడని, తెలంగాణలో అదరగొట్టేస్తాడని ఆ సర్వేల సారాంశం. అడ్రస్ లేని సర్వే సంస్థలు జగన్ పార్టీకి ఇస్తున్న సీట్ల సంఖ్య చూసి కాకలు తీరిన రాజకీయ పరిశీలకులకు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. కాస్తంత రాజకీయ పరిజ్ఞానం వున్నవాళ్ళక్కూడా ఇవన్నీ జగన్ సొంతగా చేయించుకున్న సర్వేలని తెలిసిపోతున్నాయి. ఈ సర్వేలని చూసి జనం నవ్వుకుంటారని తెలిసి కూడా వీటిని జనం మీద వదులుతున్న జగన్ తెంపరితనాన్ని ఏమనాలి?

జగన్ మోహన్‌రెడ్డి సీమాంధ్ర ముఖ్యమంత్రి అవడం ఖాయం : మేకపాటి జోస్యం

  మామూలుగా అందరికీ చిలక జోస్యం గురించి తెలుసు. కానీ, మేక జోస్యం గురించి తెలుసా? తెలియదు కదూ? ఇంతకీ మేక జోస్యం అంటే ఏమిటంటే, వైఎస్సార్సీపీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పే జోస్యం. ఇంతకీ మేకపాటి చెప్పిన మేక జోస్యంలోని పాయింట్లు ఏమిటో చిత్తగించండి. సీమాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. సీమాంధ్రలోని అన్ని పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు జగన్ పార్టీ గెలుచుకుంటుంది. తెలంగాణలో కూడా జగన్ పార్టీకి బోలెడన్ని అసెంబ్లీ స్థానాలు వస్తాయి. తెలంగాణలో జగన్ పార్టీ మూడు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుంది. అవి మహబూబాబాబ్, ఖమ్మం, మల్కాజిగిరి. కేంద్రంలో కూడా జగన్ చక్రం తిప్పబోతున్నాడు.

సూర్యాపేటలో చంద్రబాబు కామెడీ

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నల్గొండ జిల్లా సూర్యాపేటలో భలే కామెడీ చేశారు. పాపం రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంట్ స్థానాలకు వేలాది మంది అభ్యర్థుల్ని పరిశీలించి, వడపోసి, ఎంపికచేసి, నిర్ణయించి... ఇలా నానా తంటాలు పడిన ఆయన బుర్రలో బోలెడన్ని పేర్లు మిక్సయిపోయినట్టున్నాయి. అందుకే ఆయన గుర్తుంచుకోవాల్సిన వాళ్ళ పేర్లు మర్చిపోతున్నారు. మొన్నీమధ్య సూర్యాపేటలో ప్రచారానికి వెళ్ళిన చంద్రబాబు ప్రసంగిస్తూ వుండగానే ఆయన పక్కనే వున్న అసెంబ్లీ అభ్యర్థి పేరు మరచిపోయారు. ‘ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ...’’ అని ఆగిపోయి అసెంబ్లీ అభ్యర్థి పేరు పక్కనే వున్న అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డినే  కనుక్కుని మైకులో ఎనౌన్స్ చేశారు. అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరునే మరచిపోయిన చంద్రబాబును చూసి అప్పుడు అందరూ నవ్వుకున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా దీని గురించి చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మైండ్ బాగా పనిచేయాలంటే కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి. ఎన్నికల సమయంలో రెస్టు ఎలాగూ వుండదు. ఎన్నికల తర్వాత ఆయన రెస్టు తీసుకుంటారో లేదో చూడాలి.

రాహుల్ గాంధీ మహబూబ్‌నగర్ సభ విశేషాలు

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే పార్లమెంట్ స్థానాల మీద భారీగా ఆశలు పెట్టుకున్న రాహుల్ గాంధీ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాటల సారాంశం చూద్దాం. 1- తెలంగాణ అరవై ఏళ్ళ కల ఫలించింది. 2- తెలంగాణ కల నెరవేరడానికి కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పాత్ర పోషించింది. 3- తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ తెలంగాణకి అడుగడుగునా అడ్డుపడ్డాయి. 4- తెలంగాణ బిల్లు రూపకల్పనలోగానీ, ఆమోదం పొందడంలోగానీ టీఆర్ఎస్‌కి ఎలాంటి సంబంధం లేదు. 5- తెరాసకి అధికారం ఉంటే చాలు. మరేమీ అక్కర్లేదు. ప్రజల సంక్షేమం అక్కర్లేదు. 6- తెలంగాణ ఇస్తే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మాట తప్పారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మరోసారి మాట తప్పాలని అనుకుంటున్నారు. 7- ఎన్నికలలో చేసిన వాగ్దానాలు ఆ తర్వాత తెరాస మరచిపోతుంది. 8- తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమతుల్యమైన అభివృద్ధి చేస్తాం. 9- తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో పదేళ్ళపాటు పన్ను మినహాయింపు ప్రకటిస్తాం. 10- ప్రాణహిత చేవెళ్ళను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం. 11- కాంగ్రెస్ దేశం కోసం చాలా చేసింది. ప్రతిపక్షాలు దేశాన్ని పేద, ధనిక భాగాలుగా విడదీస్తున్నాయి. 12- తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ‘మేడిన్ తెలంగాణ’ వస్తువులు రావాలి. 13- మహిళాబిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.

ఆశ్చర్యపోయే తీర్పు ఖాయం: రఘువీరా రెడ్డి

  మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో బహుశః కాంగ్రెస్ వారిని మించినవారు మరొకరు ఉండరేమో! పార్టీ ఇచ్చిన టికెట్లను కూడా విసిరికొట్టి, అభ్యర్ధులు వేరే పార్టీలలోకి మారిపోయినా కూడా, తమ పార్టీ టికెట్స్ కోసం విపరీతమయిన పోటీ ఉందని, సీమాంధ్రాలో ఉన్న 175 స్థానాలకు ఏకంగా 2000 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పుకొన్నారు. అంతేకాక ఈ ఎన్నికలలో ప్రజలు కనీవినీ ఎరుగనిరీతిలో కాంగ్రెస్ అనుకూలమయిన తీర్పు ఇవ్వబోతున్నారు. అది ఏవిధంగా ఉంటుందంటే, అది 1978 నాటి రికార్డు తిరగవ్రాయబోతోంది అని చెప్పారు. ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలన్నీ కనబడకుండా మాయమయిపోతాయని జోస్యం చెప్పారు. సమైక్యాంధ్ర పేరిట పార్టీని పెట్టి, నేటికీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రజలను మభ్యపెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డే రాష్ట్ర విభజనకు అసలు కారకుడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్న రఘువీరా రెడ్డి, ఆ విధంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో అసహజమూ లేదు. అయితే ఆయన చెప్పిన మాటలలో కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పిన దాంట్లో నూటికి నూరు శాతం నిజముందని అంగీకరించవచ్చును.

ఆమ్ ఆద్మీ పార్టీ కుష్టువ్యాధితో సమానం: బాదల్

  అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రోజు రోజుకీ ప్రజల్లో ఆదరణ కోల్పోతోంది. రాజకీయ పక్షాలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాయి. అసలే దేశంలో రాజకీయాలు నాశనమైపోయాయని అనుకుంటూ, వాటిని ఇంకా నాశనం చేయడానికి కేజ్రీవాల్ కృషి చేస్తున్నాడన్న విమర్శులు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా వుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఇప్పటి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీని ఎవరూ తిట్టని విధంగా, ఘోరాతి ఘోరంగా తిట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన కుష్టువ్యాధితో పోల్చారు. కుష్టువ్యాధి మనిషిని ఎలా క్రమంక్రమంగా, మెల్లగా చంపేస్తుందో, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కుష్టువ్యాధి సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని అలా క్రమక్రమంగా, మెల్లగా చంపేస్తుందని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవదని ప్రకాష్ సింగ్ బాదల్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.

తెలుగుదేశం కోసం నందమూరి మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడు?

  నందమూరి, నారా కుటుంబాలు ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్, బాలకష్ణ, కళ్యాణ్‌రామ్, తారకరత్న... వీళ్ళందరూ ఇంటిపట్టున వుండకుండా ఎన్నికల ప్రచారం పనుల్లో పూర్తిగా నిమగ్నమై వున్నారు. మరి ఈమధ్యే ఓటు హక్కు కూడా వచ్చిన నందమూరి తారకరామ మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడు. బయటకి వచ్చి ప్రచారం చేయబోతున్నాడా? తెలుగుదేశం పార్టీ బలపడటం కోసం తనవంతుగా ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలు నందమూరి, నారా అభిమానుల్లో వున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. మిగతా అందరూ పాత పద్ధతులలో వెళ్తూ తెలుగుదేశానికి ప్రచారం చేస్తుంటే, మోక్షజ్ఞ మాత్రం హైటెక్ పద్ధతులలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నాడట. అది కూడా సోషల్ మీడియా ఆధారంగా! మోక్షజ్ఞ సోషల్ మీడియాలో నిపుణులైన కొంతమందిని ఒకచోట చేర్చి తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయించే కార్యక్రమంలో నిమగ్నమై వున్నాడట. గత నెల రోజులుగా మోక్షజ్ఞ ఇదే ప్రాజెక్టులో తలమునకలుగా వున్నట్టు సమాచారం. దీన్నిబట్టి అర్థమవుతున్నదేంటంటే, నందమూరి వంశంలో మోక్షజ్ఞ కూడా ముదురే!

మలేసియా విమానం ఎమర్జెన్సీ లాండింగ్ : కుట్ర ఏమైనా వుందా?

  మలేసియా నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 166 మంది ప్రయాణికులతో వున్న విమానాన్ని లాండ్ చేయడం ఏదనా కుట్రలో భాగమా? ఈ కోణంలో మలేసియా పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. అసలే విమానం మాయమైపోయిన విషాదంలో వున్న మలేసియా ఏ చిన్న అనుమానం వచ్చినా ఉలిక్కి పడుతోంది. ముఖ్యంగా విమానా విషయంలో చాలా జాగ్రత్తగా వుంటోంది. 166 మంది ప్రయాణికులతో మలేసియా నుంచి బెంగుళూరుకు బయల్దేరిన ఎంహెచ్ విమానాన్ని టేకాఫ్ తీసుకోగానే ఎమర్జెన్జీ లాండింగ్ చేశారు. టైరు పేలిపోవడం, ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో ఈ విమానాన్ని కిందకి దించేశారు. విమానం బయల్దేరేసరికి అందులో ఎవరైనా కుట్రదారులు ఉన్నారేమో దర్యాప్తు చేస్తున్నట్లు మలేసియా ఐజీపీ తెలిపారు.

మెక్సికోలో విమాన ప్రమాదం 8 మంది మృతి

  విమానాలు జనాన్ని మింగేస్తున్నాయి. మొన్నామధ్య 259 మందితో మాయమైపోయిన మలేసియా విమానం ఆధారాలు ఎంత వెతికినా దొరకడం లేదు. నెల రోజులు అయిపోయినా ఈ విమానం ఆచూకీ కనుక్కోవడం ఎవరివల్లా కావడం లేదు. ఈ ప్రమాదం విషయం ఇలా వుంటే, మరో మలేసియా విమానం నిన్న దాదాపు రెండు వందల మందితో ప్రయాణిస్తూ సాంకేతిక లోపానికి గురైంది. విమానంలో ప్రయాణిస్తున్న వారి టైమ్ బాగుండి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇదిలా వుంటే ఉత్తర మెక్సికోలో ఇద్దరు పైలెట్లతో కలిపి ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందీ మరణించారు. విమానశ్రయంలో దిగబోతున్న ఈ విమానం అదుపు తప్పి దగ్గర్లో వున్న ఒక బిల్డింగ్‌ని ఢీకొని కుప్పకూలింది.

రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించే సీన్ లేదు: నరేంద్ర మోడీ

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని గెలిపించాలని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిన్న అమేథీ నియోజకవర్గ ప్రజలను కోరడంపై బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గం అమేథీనే సరిగా చూసుకోలేని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేశానికి ఎలా నాయకత్వం వహిస్తారని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబ అక్రమ ఆస్తులను, రాబర్ట్ వాద్రా రాజ్యాంగేతరశక్తిగా మారి ఆస్తులు సంపాదించుకోవడాన్ని మోడీ తీవ్రంగా దుయ్యబట్టారు. తల్లీకొడుకులు, అల్లుడు కలసి దేశాన్నినాశనం చేశారని విమర్శించారు. మహిళల భద్రతపై రాహుల్‌గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో మహిళలపై ఎక్కువ నేరాలు జరిగిన పది రాష్ట్రాల్లో ఏడు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలేనని మోడీ ఆరోపించారు.

ఢిల్లీ హైకోర్టు పీఠంపై తెలుగు తేజం : జస్టిస్ రోహిణి ప్రమాణ స్వీకారం

  రాష్ట్రంలో తెలుగువాళ్ళు ప్రాంతీయ విభేదాలతో పాతాళానికి పడిపోతున్నా, ఢిల్లీలో మాత్రం తెలుగు తేజం గౌరవప్రదమైన స్థానాన్ని చేరుకుంది. అది కూడా ఒక తెలుగు మహిళ. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హైదరాబాద్‌కి చెందిన మహిళ జస్టిస్ రోహిణి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా, తొలి తెలుగు మహిళగా జస్టిస్ రోహిణి ఘనతను సొంతం చేసుకున్నారు. జస్టిస్ రోహిణి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు.

మరోసారి రాజకీయ సన్యాసానికి కిరణ్ రెడీ

  శాసనసభ తిరస్కరించిన విభజన బిల్లుని యధాతదంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లయితే తాను రాజకీయ సన్యాసం తీసుకొంటానని సవాలు విసిరిన మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పని చేయకపోగా గంపెడు ఆశలతో వేరు కుంపటి పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ కనీసం తనుకూడా గెలిచే అవకాశం లేదని గ్రహించడంతో, ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకొని తన స్థానంలో తమ్ముడు కిషోర్ రెడ్డిని పీలేరు నుండి బరిలో దింపి మరోమారు అస్త్ర సన్యాసం చేసారు. అయితే నేటికీ ఆయన తన సమైక్య గానం కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో నిన్న ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మళ్ళీ మరోమారు రాజకీయ సన్యాసం ప్రతిజ్ఞ చేయడం విశేషం. తను గనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకొంటానని ప్రకటించారు.   తనకు పదవులు మీద ప్రేమ లేదు గనుకనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చానని అన్నారు. చంద్రబాబు, జగన్ తదితరులందరికీ చాలా పదవీ కాంక్ష ఉందని, అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు వారు అనేక ఆచరణ సాధ్యం కాని అనేకానేక వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. వారికి ప్రజల మీద నిజమయిన ప్రేమ కలిగి ఉంటే, తనతో కలిసి సమైక్య పోరాటానికి రాగలరా? అని సవాలు విసిరారు.   నిజమే! చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా తాము ముఖ్యమంత్రులు కావాలనే కోరికను ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. సరికదా ఇరువురూ తాము అధికారం చెప్పట్టగానే తాము ఏ ఏ ఫైళ్ళ మీద మొదటి సంతకాలు చేస్తారో కూడా గొప్పగా చాటింపు వేసుకొంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తనకా ఆ ఆవకాశం ఎంతమాత్రం లేదని గ్రహించినందునే, ఆయన పోటీ నుండి తప్పుకొన్నారు. అందుకే ఆచరణ సాధ్యం కానీ సమైక్యం కోసం ప్రత్యర్ధులు పోరాడగలరా? అని సవాలు విసురుతున్నారు. అదే సాకుతో రేపు తన రాజకీయ సన్యాసానికి కూడా ఇప్పటి నుండే మార్గం సుగమం చేసుకొంటున్నారు. అటువంటప్పుడు ఇంకా ఈ మండుటెండల్లో పడి తిరుగుతూ ఈ వృదా ప్రయాస ఎందుకు? దానివలన ఫలితం ఏమిటి? ఆయనకే తెలియాలి.

తుమ్మితే ఊడే ముక్కు తెదేపా-బీజేపీల పొత్తులు

  తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తులు తెగిపోతాయనుకొన్న సమయంలో ఇరు పార్టీల కృషివల్ల మళ్ళీ కలిసికొనసాగేందుకు సిద్దపడ్డాయి. అయితే నేటికీ వాటి పొత్తులు తుమ్మితే ఊడిపోయే ముక్కు చందాన్నే కొనసాగుతున్నాయి. కారణం తెలుగుదేశం సూచించిన విధంగా కొన్ని నియోజక వర్గాలలో బీజేపీ తన అభ్యర్ధులను మార్చినప్పటికీ, బీజేపీకి కేటాయించిన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మరియు కడప అసెంబ్లీ సీట్లకు తెదేపా అభ్యర్ధులు నామినేషన్లు వేసారు. వారికి చంద్రబాబే స్వయంగా బీ-ఫారంలు అందజేయడం, బీజేపీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. వారిరువురి చేత వెంటనే నామినేషన్లు ఉపసంహరింపజేయమని బీజేపీ ఒత్తిడి తెస్తోంది. మరో రెండు రోజుల్లో ఎన్డీయే భాగస్వాములతో కలిసి నరేంద్ర మోడీ హైదరాబాదులో నిర్వహించే భారీ బహిరంగ సభలో చంద్రబాబు కూడా పాల్గొనవలసి ఉంది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన ఆ సభలో పాల్గోనకపోవచ్చును. అందువల్ల బీజేపీ కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అయితే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయాలనుకొన్న ఆ రెండు పార్టీల మధ్య నేటికీ సరయిన సయోధ్య లేకపోగా, వాటిలో అవే కొట్లాడుకోవడం వల్ల ప్రత్యర్ధులకు వరంగా మారుతోంది. మరి ఇటువంటి పొత్తుల వలన ఆ రెండు పార్టీలు ఏవిధంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాయో వాటికే తెలియాలి.

నేడు శ్రీకాకుళంలో బాలయ్య ఎన్నికల ప్రచారం

  మొట్టమొదటిసారి హిందూపురం నుండి ఎన్నికలలో పోటీ చేయబోతున్ననందమూరి బాలకృష్ణ, తన నియోజక వర్గంలో ఇప్పటికే ఒకసారి ప్రచారం నిర్వహించారు. పార్టీలో మంచి ప్రజాకర్షణ గల ఆయన కేవలం హిందూపురంకే పరిమితం అవలేరు కనుక సీమాంధ్రలో అన్ని జిల్లాలలో కూడా ప్రచారం చేయనున్నారు. మొదటగా ఆయన ఈరోజు శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు హైదరాబాదు నుండి విమానంలో విశాఖ కు చేరుకొని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సారవకోట చేరుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. ఈరోజు ఆయన పోలాకి, ఉర్లాం, ఆముదాలవలస, భ్రుజ కొల్లివలస, సింగుపురం, శ్రీకూర్మం, శ్రీకాకుళం పట్టణంలో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ నందమూరి లెజెండ్ ప్రచారానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా, ఆయనకున్న ప్రజాకర్షణ కారణంగా ప్రజలు ఆయనను చూసేందుకు, ఆయన చెప్పే డైలాగ్స్ వినేందుకు భారీ ఎత్తున తరలిరావడం తధ్యమని చెప్పవచ్చును.

తెలంగాణా ప్రజలపై రాహుల్ ప్రభావం చూపగలరా?

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోనున్నారు. మళ్ళీ 25వ తేదీన మరోమారు ప్రచారానికి వస్తారు. ఈ ఎన్నికలలో తెలంగాణాలో అన్ని యంపీ సీట్లు తన ఖాతాలో వేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీమాంధ్రలో పార్టీని, తమ నేతల భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ, కేసీఆర్ మాట తప్పడంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. తెలంగాణాలో అవలీలగా గెలవగల స్థితి నుండి నేడు చెమటోడ్చినా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్నడూ రాష్ట్రంలో అడుగు పెట్టని జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేత, టీ-కాంగ్రెస్ కి అండగా నిలబడి పార్టీ తరపున కేసీఆర్ తో పోరాటం చేయవలసి వస్తోంది. నిజానికి కాంగ్రెస్ లో తెరాస విలీనమయినా లేక ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నా ఇంత ప్రయాసపడవలసిన అవసరముండేదే కాదు. కానీ కేసీఆర్ పదవీ కాంక్ష వలన వాటి మధ్య పొత్తులు పొసగలేదు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలు సైతం ఆయనను డ్డీ కొనేందుకు దిగిరావలసి వస్తోంది.   ఇక రాహుల్ గాంధీ తన ప్రచారంలో ప్రజలకు ఏమి చెప్పబోతున్నారో తేలికగానే ఊహించవచ్చును. ఆయన కూడా తన తల్లి సోనియాగాంధీ చెప్పినట్లే తెలంగాణా ఏర్పాటులో కేసీఆర్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమని, తన తల్లి తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, ఆమె పట్టుదల కారణంగానే తెలంగాణా ఏర్పడిందని చెప్పవచ్చును. అదేవిధంగా తనకు పక్కలో బల్లెంలా తయారయిన నరేంద్ర మోడీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ, దేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్న అటువంటి వ్యక్తితో చంద్రబాబు పొత్తులు పెట్టుకొన్నారని ఆక్షేపించవచ్చును. అయితే తనను ప్రధానిని చేయడం కోసమే బలమయిన ఆంద్ర రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన సంగతి ఆయన అంగీకరించరు.   ఈసారి ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్న కారణంగా ఆయన ఎంత గొప్పగా మాట్లాడినా, అది ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపలేవు. అదే పనిని టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా చేయగలిగితే మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.