వైభవంగా... భక్తి శ్రద్ధలతో మనగుడి...

  జీర్ణోద్ధరణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించేందుకు, హిందూ మత ప్రచారానికి టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమాన్ని అద్దంకి సమీపంలోని శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. టిటిడి వారు పంపించిన శ్రీవేంకటేశ్వరస్వామి నామంతో పూజా ద్రవ్యాలతో దేవాలయంలో పూజలు నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర స్వామి పూజ ఆసాంతం గోవిందనామ స్మరణతో నిర్వహించారు. టిటిడి వారు భక్తులకోసం పంపించిన ప్రసాదం, కుంకుమ తదితర వస్తువులను భక్తులకు పంచిపెట్టారు. గత మూడు రోజులుగా జరుగుతున్న మనగుడి కార్యక్రమాన్ని చివరిరోజు వీక్షించేదుకు, పూజలో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుండి వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.

నేతాజీకి భారతరత్న వద్దు... అదృశ్యంపై దర్యాప్తు సంగతేంటి....

  భారత ప్రభుత్వం ఈసారి ఐదుగురికి అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఐదుగురిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా వున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో నేతాజీ కుటుంబం ఈ అంశం మీద స్పందించింది. నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ స్పందిస్తూ, ‘‘నేతాజీకి భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనను మా కుటుంబంలోని 60 మంది పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నేతాజీకి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అదృశ్యం వెనుక వున్న మిస్టరీని ఛేదించి, మా కుటుంబానికి, ఆయన అభిమానులకు ఒక స్పష్టత ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 1945 నుంచి నేతాజీ ఆచూకీ తెలియడం లేదు. ఆయనకు మీరు ‘మరణానంతరం భారతరత్న పురస్కారం’ ప్రదానం చేస్తున్నారంటే.. ఆయన ఎప్పుడు చనిపోయారో చెప్పాలి. కానీ, ఆయన చనిపోయారనడానికి ఆధారం ఎక్కడుంది? ఆయనను గౌరవించే సరియైున మార్గమేంటంటే.. నేతాజీ అదృశ్యం వెనుక ఉన్న నిజాన్ని తెలిపే ప్రభుత్వ ఫైళ్లను బయటపెట్టడమే’ అని చంద్రకుమార్‌ బోస్‌ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఆ పదం ఉపసంహరించుకొంటే మేలు: వెంకయ్యనాయుడు

    గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ‘ఫాసిస్టు’ అని అనడాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్న హైదరాబాదులో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి వంటి అత్యున్నత వ్యక్తిని ఉద్దేశించి కేసీఆర్ ఆవిధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమని, ఆయన తన మాటలు వెనక్కు తీసుకోవాలని కోరారు. పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదించిన బిల్లులో అంశాలను అమలు చేయడం ఏవిధంగా ఫాసిజమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో అన్నిఅంశాల గురించి పూర్తిగా ఎరిగి ఉన్నప్పటికీ కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆనాడు ఇదే బిల్లును పార్లమెంటు ఆమోదించినపుడు హర్షించిన కేసీఆర్, నేడు ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో ఈవిధంగా ఘర్షణపడే బదులు, పరస్పర సహకారంతో తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కేసీఆర్ ను కోరారు. అదేవిధంగా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఇకనయినా తమ కలహాలను పక్కన బెట్టి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొంటూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషిచేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని తెలంగాణా పట్ల ఎటువంటి వివక్ష చూపదని ఆయన అన్నారు.

ఈరోజు ఆంద్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం

  రెండు నెలల క్రితం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వీలయినంత త్వరగా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేందుకు ఇంచుమించుగా ప్రతీ పదిరోజులకీ ఒకసారి మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా మళ్ళీ మరో మారు ఆయన అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది.   గత సమావేశంలో మంత్రుల పనితీరును సమీక్షించిన ఆయన, వారిలో చాలామందికి పనితీరు మెరుగు పరుచుకోమని హెచ్చరికలు జారీ చేసారు. ప్రతీ మంత్రి తమ శాఖల పనితీరుని మెరుగుపరిచి, తాము కొత్తగా అమలుచేయబోయే కార్యక్రమాలను, సంక్షేమ పధకాల అమలు గురించి ముఖ్యమంత్రి నివేదికలు కోరుతున్నారు. కనుక ఈ రోజు సమావేశంలో మంత్రుల పనితీరుపై కూడా మరో మారు సమీక్ష జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకొన్న ఏడు ప్రాధాన్య రంగాల ( వ్యవసాయం, విద్య, ఉపాధి, మౌలిక వసతులు, పర్యాటకం, పరిశ్రమలు, మానవవనరుల అభివృద్ధి మరియు స్కిల్ డెవెలప్ మెంటు) పై ఈ సమావేశంలో లోతుగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చును. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎక్కడ నిర్వహించదలచుకొందో ప్రకటించలేదు. ఈరోజు సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకొని సమావేశం ముగియగానే ప్రకటించవచ్చును. ఇక ఈ నెల 18 లేదా 20 తేదీల నుండి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కనుక సమావేశాల షెడ్యూల్ కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలోనే ఖరారు చేయవచ్చును. రాష్ట్రంలో గిరిజనులకు ప్రత్యేకంగా రంప చోడవరం కేంద్రంగా ఒక ప్రత్యేకజిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బహుశః దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చును.

పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కృషి

  పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కృషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పంట రుణాల మాఫీ కోసం తెర వెనుక ముమ్ముర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ ఆదాయ మార్గాల ద్వారా రూ.10, 000 కోట్లు మిగిల్చి దీనికోసం పక్కన పెట్టిన ప్రభుత్వం, మరో 28000 కోట్ల అప్పు కోసం వివిధ ఆర్ధిక సంస్థలు, రెండు బ్యాంకులతో చర్చిస్తున్నట్లు తాజా సమాచారం. ఒకటి రెండు నెలల్లో ఈ మొత్తం సమకూరే అవకాశమున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇక రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ససేమిరా అంటున్న ఆర్.బీ.ఐ. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా మరియు నెల్లోఒరు జిల్లాలలో రైతులు తీసుకొన్న రూ.5,000 కోట్ల పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసింది. గనుక అన్నీ అనుకొన్నట్లు సవ్యంగా సాగినట్లయితే త్వరలోనే రుణాల మాఫీ వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చును.

నేతాజీ, వాజ్ పేయిలకు భారతరత్న?

    ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోడీ ప్రభుత్వం దేశంలో అత్యునత పురస్కారం అయిన భారతరత్న అవార్డును నేతాజీ సుబాష్ చంద్ర బోస్ మరియు మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయిలకు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ఏడాదిలో ముగ్గురుకి మించకుండా ఈ అత్యున్నత పురస్కారం ఈయవచ్చును గనుక ప్రముఖ క్రీడాకారుడు స్వర్గీయ ధ్యాన్ చంద్ లేదా ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు స్వర్గీయ మదన మోహన్ మాల్వీయలలో ఎవరో ఒకరికి ఈ అవార్డు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ పేరుకూడా వినిపిస్తోంది. బహుశః ఆగస్ట్ 15లోగానే మోడీ ప్రభుత్వం ఎవరెవరికి ఈ అత్యున్నత పురస్కారాలు ఈయబోతోందనే సంగతి తెలియవచ్చును.

వైకాపాకు జూపూడి రాజీనామా..!

వైస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకర రావు వైసీపీకి గుడ్‌ బై చెప్పనున్నారు. జూపూడి గత కొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే వుంటున్నారు. గత ఎన్నికల్లో కొండెపి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీనుంచి వీడటానికి గల కారణాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడంలేదనీ, గత ఎన్నికల్లో ఓటమికి పార్టీ నేతలే కారణమని జూపూడి ఆరోపిస్తున్నారు. తన ఓటమికి గల కారణాల్ని వివరిస్తూ అధినేత జగన్‌కి లేఖ రాసినా, దాన్ని జగన్‌ పట్టించుకోలేదన్నది జూపూడి ఆరోపణ.

గవర్నర్ కు కూడా అదే చెప్పారు..!

ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కే అధికారాలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేయడంపై తెలంగాణ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు కూడా తెలియజేసినట్లు సమాచారం.శనివారం ఉదయం రాజీవ్ శర్మ..గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టాలన్న కేంద్రం నిర్ణయం తరువాత వీరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఏం చర్చించారన్నది తెలియరాలేదు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలో కేంద్రం జోక్యంపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ పై అధికారాన్ని వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని గవర్నర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ కబుర్లు

  ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దాదాపు భూస్థాపితం చేసిన యువరాజవారి నాయకత్వం, సమర్ధత గురించి ఇప్పుడు బయటవారే కాదు పార్టీలో నేతలు సైతం తెగ ఇదయిపోతున్నారు. ఆ ఇది కారణంగానే రాజావారు లోక్ సభలో పార్టీకి నాయకత్వం వహించేందుకు నో చెప్పేసి వెనుక బెంచీలలో కమ్మగా కునుకు తీయడం అలవాటు చేసుకొన్నారు. ఆయన మానాన ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పడుకొన్నప్పటికీ గిట్టనివాళ్ళ నోళ్ళు ఊరుకోవు కదా? ఆయనలో రాజకీయ నాయకుడుకి ఉండాల్సిన ‘ఫైర్’ లేదంటూ ఏవో అవాకులు చవాకులు వాగి ఆయనకు నిద్రాభంగం చేసారు. దానితో ఆయన నిజంగానే లోక్ సభలో ఏదో ఎఫైర్ మీద చర్చ జరుగుతుంటే ఫైర్ అయిపోయారు. తోటి యంపీలు సభలో ఏవో నినాదాలు చేస్తుంటే యువరాజవారు కూడా వారి ముందు నిలబడి తను గొంతు సవరించుకొన్నారు. అయితే ఆ ఫైర్ తనకు నిద్రాభంగం కలిగించినందుకా లేక తనలో ఆ ఫైర్ ఉందని నిరూపించుకోనేందుకా? అనే డౌట్ మళ్ళీ లేవనేత్తేసేసరికి నిజంగానే యువరాజవారికి ఆవేశం వచ్చేసింది. ఎన్నికలలో గెలిచి ఉండి ఉంటేనా...నా తడాఖా చూపించేవాడిని...అని మనసులోనే అనుకొన్నారు.   కానీ పార్టీలో అందరూ ఇప్పుడు ఆయనను పక్కన బెట్టి అక్కయ్య ప్రియాంక భజన అందుకోవడంతో రాజావారి పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. పోనీ వారి కోరిక ప్రకారం అక్కయ్యనే కాంగ్రెస్ పార్టీని ఏలుకోమని చెపుదామంటే, తను ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి. అలాగని తనను ఎన్నికలలో చెయ్యి పట్టుకొని నడిపించిన అక్కయ్యను పార్టీ వ్యవహారాలలో కలుగజేసుకోవద్దని చెప్పడమూ కష్టమే.   ఈ సందిగ్ధంలో యువరాజావారు నలిగిపోతుంటే, అదేమీ పట్టని కాంగ్రెస్ జనాలు, “ఆమె వచ్చేస్తోంది...ఆమె వచ్చేస్తోంది...మనల్ని చల్లగా చూసుకొనేందుకు ఆమె వచ్చేస్తోదంటూ..ఎక్కడికక్కడ .ప్రియంకక్క పోస్టర్లు తగిలించి మరీ భజన జోరు పెంచేశారు. అది చూసి మీడియావాళ్ళు కూడా ఆవురావురుమంటూ గబగబా నాలుగు కమ్మటి కధలు అల్లేసి జనాలను రంజింప జేయడం మొదలుపెట్టేసారు. ఇదంతా చూసి చివరికి ప్రియంకమ్మే మీడియాను పిలిచి, ‘నేను రాజకీయాలలోకి రావట్లేదు,’ అని సింగల్ లైన్ స్టేట్ మెంటు ఒకటి ఇచ్చేసి బ్రాతాశ్రీకి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసారు. కానీ ఈ కాంగ్రెసోళ్ళు ఆయనను ఆ చిన్నపాటి ఆనందానికి కూడా నోచుకోకుండా చేస్తున్నారు.   పదేళ్ళ పాటు పవర్ లో ఉంటేనే దిక్కు లేకుండాపోయింది. ఇప్పుడు ఐదేళ్ళపాటు ప్రతిపక్ష బెంచీలలో కునుకు తీసేందుకు సిద్దమయిపోయిన రాజావారి శల్యసారద్యంలో కాంగ్రెస్ పార్టీ ఏమయిపోతుందో...ఆయనను నమ్ముకొంటే మా బ్రతుకులు ఏమయిపోతాయో...అంటూ భారంగా నిటూర్పులు విడుస్తున్నారు. తమ్ముడు చేతిలో నుండి అక్కయ్య పగ్గాలు తీసుకోకపోతే, ఆయన కాంగ్రెస్ పార్టీని కనబడకుండా మాయం చేసేస్తారని వాళ్ళు ఓ..ఒకటే తెగ ఇదయిపోతున్నారు. ప్చ్...ఈ కాంగ్రెసోళ్ళ కష్టాలు ఏమిటో..అవెప్పుడు తీరేనో...యువరాజవారు ప్రధానమంత్రి ఎప్పుడు అయ్యేనో ఏమిటో...ఎవరికీ అర్ధం కావడం లేదు...ప్చ్..ప్చ్..

కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని సహించం..!

  గవర్నర్‌కు ఉమ్మడి రాజధాని అధికారాలపై కేంద్ర ప్రభుత్వం పరిధి దాటి వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం రాజకీయ కుట్ర... ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం లేఖపై మిగితా రాష్ర్టాల సీఎంలను కలిసి చర్చిస్తామన్నారు.   తెలంగాణ సర్కారు పాలనను చూసి కేంద్రం ఓర్వలేకపోతుందనని ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. అన్ని రాష్ర్టాల సీఎంలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేకాధికారాలపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని డిప్యూటీ సీఎం రాజయ్య తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. కేంద్రం నిరంకుశ నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు.

పంట రుణాల రీ షెడ్యూల్ కు ఆర్.బీ.ఐ. అంగీకారం

  గత రెండు నెలలుగా పంట రుణాల రీ షెడ్యూల్ పై రోజుకో మాట మాట్లాడుతున్న ఆర్.బీ.ఐ. ఆంద్ర ప్రదేశ్ లో నాలుగు జిల్లాలలో, తెలంగాణాలో మూడు జిల్లాలలో మాత్రమే పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా మరియు నెల్లూరు జిల్లాలలో రైతులు తీసుకొన్న రూ.5000 కోట్ల పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే బంగారు ఆభరణాలపై తీసుకొన్న రుణాలను మాత్రం రీ షెడ్యూల్ చేసేందుకు నిరాకరించింది. ఆర్.బీ.ఐ. తీరు చూసిన తరువాత ఇక దాని సహాయంపై ఆశలు వదిలేసుకొన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది కొంత ఉపశమనం ఇస్తుంది. ప్రభుత్వం గత రెండు నెలలలో వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఇప్పటికే రూ.10,000 కోట్లు కూడబెట్టి దానిని రైతుల రుణమాఫీకి వినియోగించేందుకు పక్కన ఉంచింది. మరొకటి రెండు నెలలలో మరో రూ.10,000 కోట్లు కూడబెట్టగలమనే ధీమాతో ఉంది. ఇప్పుడు ఆర్.బీ.ఐ స్వయంగా 5000 కోట్లు రీ షెడ్యూల్ చేసేందుకు అంగీకరిస్తోంది గనుక త్వరలోనే ఈ రుణభారం నుండి బయటపడగాలనని ప్రభుత్వం ధీమాతో ఉంది.

అభివృద్ధిలో పోటీపడడానికి సిద్దం: బాబు

విద్వేషాలు ఎంత రెచ్చగొట్టినా తెలుగుజాతిని రక్షించే శక్తి తెలుగుదేశానికి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ...వివాదాలు మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. అభివృద్ధిలో పోటి పడాలని కేసీఆర్ అన్నారని, అభివృద్ధిలో పోటీ పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాబు తెలిపారు. అభివృద్ధి అంటే ఏంటో హైదరాబాద్ లో చేసి చూపించానని సీఎం తెలిపారు. కాంగ్రెస్ చేసిన విభజనతీరువల్ల రెండు రాష్ట్రాల్లో కష్టాలు పెరిగాయని ఆరోపించారు. విభజనలో హేతుబద్ధత లేకపోవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందని అన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కూర్చుని చర్చిద్దామని చంద్రబాబు కేసీఆర్ కు సూచించారు.

కేసీఆర్ తో పోటీకి చంద్రబాబు సై!

  అభివృద్ధిలో తనతో పోటీపడమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విసిరినా సవాలును ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. తను ఇటువంటి ఆరోగ్యకరమయిన పోటీకి ఎప్పుడూ సిద్దమేనని, ఐదేళ్ళ తరువాత రెండు రాష్ట్రాలలో ఎక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగిందనే విషయం ప్రజలే స్వయంగా చూడబోతున్నారని ఆయన ధీటుగా బదులిచ్చారు. తాను కేసీఆర్ కంటే అన్ని విధాల మిన్నగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని, దానిని చూసి వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా తమ పార్టీకే పట్టడం కట్టడం ఖాయమని అప్పుడు తెలంగాణాను కూడా అభివృద్ధి చేస్తానని అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలను మరింత రెచ్చగొట్టడం, విడగొట్టడం తగదని ఆయన కేసీఆర్ కు హితవు పలికారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలే తప్ప శత్రువుల్లా పోరాడుకోవడం వలన ప్రయోజనం ఉండదని అన్నారు. నేటికీ తన ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉందని ఆయన తెలిపారు.

త్వరలో జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి

  టాలివుడ్ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోబోతోంది. జనసేన పార్టీ నమోదు విషయంలో ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయాలని ఎన్నికల కమీషన్ ఒక ప్రకటన చేసింది. అంటే ఈ నెల 23 తరువాత ఏ సమయంలోనయినా జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తారని, పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో యం.యల్యే.కోలనీలో స్పేస్ వ్యూ, ప్లాట్ నెంబర్: 91 చిరునామాలో ఉన్నట్లు పవన్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.   పవన్ కళ్యాన్ ఎన్నికల తరువాత మళ్ళీ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. కానీ త్వరలోనే పార్టీ నిర్మాణం చేసుకొని మళ్ళీ ప్రజలలోకి వస్తానని ఆనాడే చెప్పారు. కనుక జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత, ఆయన మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చును. ముందుగా ఆయన తన ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేయగల వ్యక్తులను ఎంచుకొని వారితో పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, వారి సహకారంతో పార్టీని బలోపేతం చేసుకోగలుగుతారు. అయితే జనసేన పార్టీ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే మిత్రపక్షమయిన తెలుగుదేశం పార్టీతో ఏవిధంగా వ్యవహరిస్తుందనేది చాలా ఆసక్తికరమయిన విషయం కావచ్చును. ఎందువలన అంటే తను తెదేపా-బీజేపీలకు ఎన్నికలలో మద్దతు ఇచ్చినప్పటికీ, అవసరమయితే ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఆయన ముందే చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా ఇప్పటికే ఆ పని చేస్తోంది. ఇక జనసేన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా లేక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కు ప్రధాని మోడీతో ఉన్న సాన్నిహిత్యం ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వానికి ఏమయినా జనసేన సహకరిస్తుందా? వేచి చూడాలి.

భూ కుంభకోణం కేసులో మాజీ గవర్నరు బెనీవాల్

  గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు మిజోరాం గవర్నరు పదవి పోగొట్టుకొన్న కమలా బెనీవాల్ ను ఇంకా అవినీతి కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెపై జైపూరు కోర్టులో భూ ఆక్రమణకు పాల్పడినట్లు సంజయ్‌ అగర్వాల్‌ అనే ఒక సామాజిక కార్యకర్త కేసు వేసారు. దాదాపు వెయ్యి కోట్లు విలువ గల ఈ భూ ఆక్రమణ కేసును దర్యాప్తు చేసిన వైశాలి నగర్ పోలీసులు కమలా బెనీవాల్ తో పాటు మరో 16మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇంతవరకు ఆమె గవర్నరు హోదాలో ఉన్నందున ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకొనే అవకాశం పోలీసులకు కలగలేదు. కానీ ఆమె ఇప్పుడు ఆ పదవి పోగొట్టుకోవడంతో త్వరలోనే ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. అత్యంత ఉన్నతమయిన గవర్నరు పదవిని నిర్వహించిన వ్యక్తులు సైతం ఇటువంటి భూ కుంబకోణాలలో నిందితులుగా పేర్కొనబడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

కేంద్రంతో పోరాటానికి రెడీ: కేసీఆర్

  మరో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాదు పరిధిలో శాంతి భద్రతల బాధ్యతలు, సర్వాధికారాలు గవర్నరు నరసింహన్ కు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ తెలంగాణా ప్రభుత్వానికి నిన్న జారీచేసిన మార్గదర్శకాలను తెలంగాణా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ మార్గదర్శకాలు తమకు ఎంతమాత్రం అంగీకారంకావని తెలియజేస్తూ కేంద్రానికి వెంటనే ఒక లేఖ వ్రాసారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రభుత్వ అధికారాలను కేంద్రం ఈ విధంగా కబళించదాన్ని తాను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాని, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తమ ప్రభుత్వం పట్టించుకొబోదని స్పష్టం చేసారు. దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ లేఖ ప్రతులను పంపించి, రాష్ట్రాధికారాలను హరిస్తున్న కేంద్రంపై పోరాటానికి తమతో కలిసిరావలసిందిగా ఆహ్వానిస్తామని తెలిపారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఉద్యమిస్తామని తెలిపారు.

హైదరాబాదు పరిధిలో గవర్నరుకే సర్వాధికారాలు

  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాదులో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత, సర్వాధికారాలు గవర్నరుకు కట్టబెడుతూ రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దానికి తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతుండటంతో, గవర్నర్ నరసింహన్ తన అధికారాలు, బాధ్యతలపై మరింత వివరణ కోరుతూ కేంద్రానికి ఒక లేఖ వ్రాసారు. దానిపై కేంద్రం స్పందిస్తూ రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నరుకు శాంతిభద్రతల పర్యవేక్షణాధికారాలు కల్పించేవిధంగా తెలంగాణా ప్రభుత్వం తన నియమనిబంధనలు మార్చుకోవలసిందిగా కోరుతూ ఒక లేఖ వ్రాసింది. కానీ అందుకు తెలంగాణా ప్రభుత్వం నిరాకరించడంతో, ఇక కేంద్రమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోకతప్పలేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ పరిధిలో గవర్నరుకు సర్వాధికారాలు కట్టబెడుతున్నట్లు తెలియజేస్తూ తెలంగాణా ప్రభుత్వానికి నిన్న లేఖ పంపింది.   ఆ లేఖలో మార్గదర్శకాల ప్రకారం ఇక నుండి హైదరాబాదులో శాంతి భద్రతల పర్యవేక్షణాధికారాలన్నీ గవర్నరుకే సంక్రమిస్తాయి. హైదరాబాదు పరిధిలో పోలీసు వ్యవస్థ అంతా గవర్నరుకే జవాబుదారీగా ఉంటుంది తప్ప తెలంగాణా ప్రభుత్వానికి కాదు. అందువల్ల ఇకపై పోలీసు అధికారులు అందరూ గవర్నరు ఆదేశాల ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. వారి బదిలీలు, పదోన్నతులు అన్నీ కూడా గవర్నరు చేతిలోనే ఉంటాయి. అవసరమనుకొంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులను, అధికారులను హైదరాబాదులో నియమించుకొనే అధికారం గవర్నరుకు ఉంటుంది. అవసరమనుకొంటే హైదరాబాదు పరిధిలో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులతో ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయవచ్చును.

కేబుల్ ఆపరేటర్లకు మంత్రి జవదేకర్ హెచ్చరిక

తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాలను కొందరు ఎమ్.ఎస్.ఓలు నిలిపివేయడంపై కేంద్ర ప్రసారాలశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశానని జవదేకర్ చెప్పారు. ఛానెళ్ల నిలిపివేతపై తమ ప్రమేయం లేదని టీ. సీఎం కేసీఆర్ బదులుగా సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. అందువల్ల ఇప్పుడు మేం తీసుకోబోయే చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదనుకుంటానని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేదిలేదని ఆయన హెచ్చరించారు. ఎంఎస్‌వోలపై చర్యలు తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడదని జవదేకర్ స్పష్టం చేశారు.