పట్టు విడిచిన కేసీఆర్.. మెట్రో పనులు చకచక...

  హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో పట్టుదలగా వున్న కేసీఆర్ తన పట్టుదలను సడలించినట్టు కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు లైనులు భూ గర్భంలోంచి వేయాలని కేసీఆర్ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు సూచించారు. అయితే ఎల్ అండ్ టీ సంస్థ అందుకు అవకాశం లేదని తెలిపింది. అయితే కేసీఆర్ అందుకు అంగీకరించకపోవడంతో మెట్రో పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజీకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. బుధవారం నాడు ఏర్పాటు చేసిన మెట్రో రైలు సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోలీసులతో సమన్వయం చేసుకుని మెట్రో రైలు పనులు సాగించాలని ఆయన ఆదేశించారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్ గాడ్గిల్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెట్రో రైలు భూగర్భ లైను గురించి కేసీఆర్ ప్రస్తావించనట్టు తెలుస్తోంది. అంటే ఈ విషయంలో కేసీఆర్ తన పట్టు సడలించినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే మెట్రో రైలు ట్రైల్ రన్ కూడా జరిగింది.

సంపులో పడి బాలుడు మృతి

  ప్లే స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ళ బాలుడు నీటి సంపులో పడి మరణించాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఈ దారుణం జరిగింది. వనస్థలిపురంలోని ఓ ప్లే స్కూల్‌లో వచన్ రెండున్నరేళ్ళ బాలుడిని తల్లిదండ్రులు చేర్పించారు. బుధవారం ఉదయం వచన్ స్కూలు సంపులో పడిపోయాడు. అయితే ఆ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో బాలుడు మరణించాడు. ఆ తర్వాత గుర్తించిన స్కూలు యాజమాన్యం వచన్‌ని ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్కూలు యజమానులు స్కూలుకు తాళం వేసి పారిపోయారు.

లోక్‌సభలో పోలవరంపై ప్రకటన...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుంది ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా ఆ దిశగా ముందుకు వెళ్తోంది. ఇటీవలే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నప్పటికీ రాజీపడకుండా ముందుకు వెళ్తోంది. తాజాగా బుధవారం నాడు లోక్ సభలో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 276, ఒరిస్సాలోని 8, ఛత్తీస్‌ఘడ్‌లోని 4 గ్రామాలు ముంపుకు గురవుతాయని ఆయన లోక్ సభలో ప్రకటించారు. అలాగే మొత్తం 3,427 హెక్టార్ట అటవీ భూమి కూడా మునిగిపోతుందని లోక్‌సభకు తెలిపారు.

హై కోర్టులో సమగ్ర సర్వే కేసు... రేపటికి వాయిదా...

  ఈనెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర సర్వే మీద అనేక వివాదాలు ముసురుకున్నాయి. తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలు కూడా ఈ సర్వేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద హైదరాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని అడిగినప్పుడు ప్రభుత్వ న్యాయవాది సర్వేకి సంబంధించి ఇంకా సవరణలు వున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించబోయే సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు, సవరణలతో గురువారం నాడు కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేస్తూ, హైకోర్టు కేసును వాయిదా వేసింది.

నగ్నంగా ఊరేగించారు.. దారుణం...

  చేతబడి చేస్తోందన్న ఆరోపణలతో బీహార్‌లో ఓ యువతిని నగ్నంగా ఊరేగించారు. బీహార్‌లోని కతిహార్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కనియాదేవి అనే యువతిని గ్రామస్థులంతా తిట్టి, కొట్టి, ఆమెను తీవ్రంగా అవమానించారు. గ్రామంలో ఓ బాలుడు మరణించడంతో ఈమే చేతబడి చేసిందన్న అనుమానంతో ఈ పనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు. బీహార్లోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై చేతబడి ముద్ర వేసి వారిని చిత్రహింసలు పెట్టడం ఎప్పటినుంచో ఉంది. దీనిపై కఠిన చట్టాలు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎప్పుడో ప్రతిపాదించింది. బీహార్ మానవహక్కుల కమిషన్ కూడా దీనిపై స్పందించింది.

సినీ నటుడు మాదాల రవి అరెస్టు...

  సినీ నటుడు మాదాల రవిని సిసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తనను మాదాల రవి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు మాదాల రవిని అరెస్టు చేశారు. మాదాల రవి ప్రముఖ సినీ నటుడు, కమ్యూనిస్టు నాయకుడు మాదాల రంగారావు కుమారుడు. రష్యాలో చదువుకున్నారు. ‘నేను సైతం’ సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అయితే సినిమా రంగంలో ఆయన రాణించలేకపోయారు. ఇటీవలి కాలంలో ఆయన ఒక టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా కూడా పనిచేస్తున్నారు. కమ్యూనిజం బ్యాక్ గ్రౌండ్ వున్న మాదాల రవి ఇలా మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టు కావడం సినిమా పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించింది.

విజయవాడ రాజధానా... నేనొప్పుకోనంతే...

  వైసీపీ నాయకుడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని బలంగా కోరుకుంటున్నారు. అదేదో రాయలసీమ ప్రజల మీద ప్రేమతో అలా కోరుకుంటున్నారని అనుకోవద్దు... రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడ తన హవా నడిపించవచ్చన్నది జగన్ ఆలోచన. అందుకే రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని గొడవ చేయండంటూ తన పార్టీ నాయకులకు కీ ఇచ్చి వదులుతున్నారు. తాజాగా విజయవాడను ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా ప్రకటించడంతో వైసీపీ రాయలసీమ నాయకులు రంగంలోకి దిగారు. విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని నడుపుతానని వైసీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి హెచ్చరించేశారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజలు ఆందోళన చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని ఇసుమంత కూడా పట్టించుకోవడం లేదన్నారు. పాపం భూమా వారు చంద్రబాబు నాయుడిది కూడా రాయలసీమేనని మరచిపోయినట్టు్న్నారు. తన ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలన్న సంకుచిత భావం చంద్రబాబు లేదన్న విషయాన్ని భూమా నాగిరెడ్డి గుర్తించనట్టున్నారు.

టీడీపీ, తృణమూల్ కూల్ కూల్... ప్రణబ్...

  పార్లమెంట్‌లో రూమ్‌ విషయంలో గొడవపడుతున్న తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు శాంతంగా వుండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హితబోధ చేశారు. బుధవారం నాడు పార్లమెంట్‌లో జరిగిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ రెండు పార్టీల ఎంపీలకు సర్దిచెప్పి వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ అంశంలో రెండు పార్టీల ఎంపీలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌కి వున్న గౌరవాన్ని సభ్యులు కాపాడాలని కోరారు. స్వాతంత్ర్య సమరానికి ప్రతీకగా పార్లమెంటు నిలుస్తుందని, తొలిసారి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు మెట్ల మీద శిరస్సు వంచి ప్రణమిల్లడం తన గుండెను తాకిందని రాష్ట్రపతి చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయానికి ఉన్న పవిత్రతకు ఇది నిదర్శనమన్నారు.పార్లమెంటు భవనంలోని గ్రౌండుఫ్లోర్ ఐదో నెంబరు గది కోసం తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ సభ్యులు వాదులాడుకున్న విషయం తెలిసిందే.

మోడీ సర్కారుపై కేటీఆర్ మాటల దాడి

  కేంద్రంతో సంబంధాల విషయంలో తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తెగేదాకా లాగే ధోరణి అవలంబిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అనేక విషయాలలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణాత్మక ధోరణిని ప్రదర్శిస్తూ వస్తోంది. కేంద్రంతో నువ్వా.. నేనా అన్నట్టు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గతంలో అధికారంలో వున్న యుపీఏ ప్రభుత్వం చేసిన తప్పులనే చేస్తోందని, అందువల్ల ఈ ప్రభుత్వానికి ఎన్డీయే ప్రభుత్వం అని కాకుండా ‘యుపిఎ-3’ ప్రభుత్వం అని పేరు పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కి అధికారాలు కల్పించే విషయంలో సోనియా తప్పు చేసిందని, ఆ తప్పును సరిదిద్దాల్సిన మోడీ కూడా అదే తప్పు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సర్వే మీద కూడా కేటీఆర్ స్పందించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు మిగతావాళ్ళకి ఇచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

ములాయంతో చేతులు కలిపేదే లేదు.. మాయావతి

  మొన్నామధ్య జరిగిన ఎన్నికలలో నరేంద్రమోడీ ధాటికి కకావికలు అయిపోయిన కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ ఇప్పుడు షాక్ నుంచి తేరుకుని కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నాయి. మొన్నటి వరకు నోటికొచ్చినట్టు తిట్టుకున్న పార్టీలన్నీ బీజేపీ హవా పుణ్యమా అని ఇప్పుడు ముక్తకంఠంతో స్నేహగీతం పాడుతున్నాయి. మొన్నటి ఎన్నికలలో బీహార్‌లో తన్నుకుని తలకలు పోసుకున్న నితిష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ పార్టీలకి బీజేపీ ధాటికి జాయింట్‌గా బ్యాండ్ పడింది. దాంతో త్వరలో బీహార్‌లో జరగబోతున్న శాసనసభ స్థానాల ఉప ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు జట్టుకట్టాయి. పనిలోపనిగా చావుతప్పి కన్ను లొట్టపోయిన కాంగ్రెస్‌ని కూడా కలుపుకున్నాయి. అత్యంత కృత్రిమంగా వున్న ఈ మూడు పార్టీల కూటమిని చూసి బీహార్ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇది ఒక ‘దుష్ట గ్రహ కూటమి’ అని బాహాటంగానే అంటున్నారు.   ఇదిలా వుంటే, మొన్నటివరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకున్న ఈ మూడు పార్టీలూ భుజాల మీద చేతులు వేసుకోవడం చూసి ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ ‌ యాదవ్‌కి కూడా ఇలాంటి ఐడియానే వచ్చింది. తను, తన పార్టీ మొన్నటి వరకూ తిట్టిపోసిన మాయవతి పార్టీతో దోస్తీ చేయాలన్న ఆలోచన ములాయం సింగ్‌కి వచ్చింది. ములాయం సింగ్ ఏ దుర్ముహూర్తంలో తన పుత్రరత్రం అఖిలేష్ యాదవ్‌కి ముఖ్యమంత్రి సీటు ఇచ్చారోగానీ, అప్పటి నుంచి కష్టాలే కష్టాలు.. ఎవరికీ? ములాయం ఫ్యామిలీకి కాదు.. ఉత్తర ప్రదేశ్ ప్రజలకి! అయ్యగారు అఖిలేష్ యాదవ్ గద్దెని ఎక్కినప్పటి నుంచి యు.పి.లో నేరాలే నేరాలు, ఘోరాలే ఘోరాలు. ఈసారి వచ్చే ఎన్నికలలో అఖిలేష్‌కి, ములాయం‌కి గుండుకొట్టాలన్న ఉద్దేశంలో ఉత్తర ప్రదేశ్ ప్రజలు వున్నారు. ఆల్రెడీ మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికలలో వీరికి అరగుండు కొట్టేశారు. దాంతో భయపడిపోయిన ములాయం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాయావతి పార్టీతో కలసి పోటీ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే మాయవతి పార్టీతో చేతులు కలపడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే తమ స్నేహానికి మధ్యవర్తిగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వుండాలని షరతు విధించారు.   అయితే యు.పి.కి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న మాయావతి ములాయం ప్రతిపాదనకు ఛీ కొట్టారు. నీ పార్టీతో స్నేహం చేసే ఛాన్సే లేదని చెప్పేశారు. దాంతో ములాయం ఆశల మీద నీళ్ళు కురిశాయి. అయినప్పటికీ ములాయం తన స్నేహహస్తాన్ని వెనక్కి తీసుకోలేదు. ములాయం పార్టీ గుర్తు సైకిల్, మాయావతి పార్టీ గుర్తు ఏనుగు.. సైకిల్ వెళ్ళి ఏనుగుకి డ్యాష్ ఇచ్చినా, ఏనుగు వచ్చి సైకిల్‌కి కిక్ ఇచ్చినా రిపేరు వచ్చేది సైకిల్‌కే! ఈ విషయాన్ని ములాయం సింగ్ ఆలోచించుకుంటే మంచిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణ సర్వే డౌటే?!

  ఈనెల 19న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించాలని, ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సర్వే మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమను వేధించడానికే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి సర్వే చేపట్టిందని తెలంగాణలోని సీమాంధ్రులు విమర్శిస్తుంటే, ఈ సర్వే తమకు పెద్ద తలనొప్పిగా మారిందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. మొత్తమ్మీద అటు తెలంగాణలోని సీమాంధ్రులకు గానీ, తెలంగాణ ప్రజలకు గానీ, ఈ సర్వే ఎంతమాత్రం ఇష్టం లేదన్న విషయం స్పష్టమవుతోంది. అది కూడా ఒక్క రోజులోనే సర్వే చేస్తామని, ఆరోజు అందరూ తప్పకుండా ఇంట్లోనే వుండాలని అనడం, సర్వేలో వివరాలు ఇవ్వకపోతే లెక్కలో లేనట్లే అని బెదిరించడం కూడా పలు విమర్శలకు కారణమవుతున్నాయి. అయితే ప్రజల్లో వ్యతిరేకత వుందని తెలిసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేయాలన్న నిర్ణయంతోనే ముందుకు వెళ్తోంది.   ఈ నేపథ్యంలో 19న జరుప తలపెట్టిన తెలంగాణ సర్వే జరిగే అవకాశాలు లేనట్టేనన్న అభిప్రాయాలను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించడం వీలు కాదని వారు చెబుతున్నారు. చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ హక్కు లేదని అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సర్వే నిర్వహించి తీరాలని పట్టుదల మీద వుంటే, దానికోసం ముందుగా చట్టపరంగా ఎంతో కసరత్తు చేయాల్సి వుంటుందని, అవేవీ లేకుండా సర్వే నిర్వహించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ అంశం మీద అనేకమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి చట్టపరమైన స్పష్టత లేకుండా, హడావిడిగా నిర్వహించ తలపెట్టిన ఈ సర్వేకి కోర్టు బ్రేక్ వేసే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు. అలాగే ఈ అంశం మీద ఇప్పటికే కేంద్ర హోం శాఖ దృష్టిని కేంద్రీకరించింది. కేంద్ర హోంశాఖ కూడా సర్వేకి బ్రేక్ వేసే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద చూస్తే 19న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే జరగకపోవచ్చన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ సమగ్ర సర్వే... కేంద్ర హోంశాఖ ఆరా...

  ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. తాను సర్వే వివరాలు తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. ఈ సర్వేపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర హోంశాఖకి ఫిర్యాదు చేశారు. సర్వే రోజున అందరూ తప్పనిసరిగా ఇంటి వద్దే ఉండాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రానికి ఎంపీలు తెలిపారు. దీంతో కేంద్ర హోంశాఖ సర్వే వివరాలు కోరింది. ఇప్పటికే అనేక అంశాలతో కేంద్రంతో విభేదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తన ప్రతిస్పందనను ఎలా తెలియజేస్తుందో చూడాలి.

రాబిన్ విలియమ్స్... బెల్ట్‌తో ఉరి...

  ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాబిన్ విలియమ్స్ మరణం గురించి మొదట్లో రకరకాల కథనాలు వచ్చాయి. రాబిన్ విలియమ్స్ ముఖానికి ప్లాస్టిక్ కవర్ కట్టుకోవడం వల్ల ఊపిరి ఆడక మరణించారని మొదట్లో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణం అనుమానాస్పదంగా వుందన్న వదంతులూ వినిపించాయి. తాజాగా మారిన్ కౌంటీ పోలీసులు రాబిన్ విలియమ్స్ మరణం మీద క్లారిటీ ఇచ్చారు. రాబిన్ విలియమ్స్ నిరాశ, నిస్పృహల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా తన బెల్టుతో ఉరి వేసుకుని మరణించారు. ఆత్మహత్యకు ముందు రాబిన్ ఏవైనా విష పదార్ధాలు తీసుకున్నారా లేదా అనేది పోస్టుమార్టం నివేదిక బయటకి వచ్చాక వెల్లడి అవుతుంది. రాబిన్ మరణం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంతాపం ప్రకటించారు. గొప్ప నటుడిని, స్నేహితుడిని కోల్పోయానని పేర్కొన్నారు.

విష గుళికలు తిని 20 జింకలు మృతి

  మన దేశంలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వన్యప్రాణులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఒకపక్క అడవులు తగ్గిపోతూ వుండటంతోపాటు వన్యప్రాణులను వేటాడేవారు చట్టానికి దొరక్కపోవడం కూడా వన్యప్రాణులు తగ్గిపోతూ వున్నాయి. ఇలాంటి అనేక కారణాతోపాటు రైతులు పొలాల్లో వుంచుతున్న విష పదార్ధాలను తినడం వల్ల కూడా వన్యప్రాణులు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. మొన్నామధ్య తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలంలో జల్లిన పురుగుమందులు కలిపిన ఆహారం తినడం వల్ల ఒకేసారి దాదాపు 40 నెమళ్ళు చనిపోయాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని తిప్పాయిపల్లి దగ్గర ఒక మొక్కజొన్న పంటలో వుంచిన విషపు గుళికలు తినడం వల్ల 20 జింకలు మరణించాయి. విషపు గుళికలు తినడం వల్ల 20 జింకలూ వెంటనే అక్కడికక్కడే మరణించాయి. దాంతో పొలంలో ఎక్కడ చూసినా జింకల కళేబరాలే కనిపిస్తున్నాయి. సాధారణంగా మొక్కజొన్న పంటని అడవిపందులు కబళిస్తూ వుంటాయి. రాత్రికిరాత్రే మొక్కజొన్న పంటని నేలమట్టం చేస్తూ వుంటాయి. అడవిపందులను చంపడానికి పెట్టిన విషపు గుళికలను జింకలు తినడంతో అవి మరణించాయి.