కారం నీళ్ళతో స్వామీజీకి అభిషేకం
సాధారణంగా కొంతమంది స్వామీజీలు భక్తుల కోరిక మేరకు పూలూ గట్రాలతో అభిషేకం చేయించుకుని అనుగ్రహిస్తూ వుంటారు. అయితే తమిళనాడులోని ఓ స్వామీజీ మాత్రం తన భక్తుల చేత కారం నీళ్ళతో అభిషేకం చేయించుకున్నాడు. ఆ కారం కూడా యాభై గ్రాములో వంద గ్రాములో కాదు.. ఏకంగా 31 కిలోల కారం పొడి కలిపిన నీళ్లు. తమిళనాడులోని వేలూరు ప్రాంతంలో వున్న గంగమ్మ ఆలయానికి సంబంధించిన తోటలో గత నాలుగు నెలలుగాల ఓ స్వామీజీ నివసిస్తున్నాడు. ఆయన పేరు, వివరాలు ఎవరికీ తెలియదు. ప్రత్యంగరా దేవిని పూజించే స్వామీజీ తమిళ, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషలను అనర్గళంగా మాట్లాడతాడు. ఆయన దగ్గరకి భక్తుల రాకపోకలు వుండేవి. మంగళవారం నాడు స్వామీజీ ప్రపంచ శాంతి కోసం తాను కారం నీళ్ళతో అభిషేకం చేయించుకోవాలని అనుకుంటున్నానని ప్రకటించారు. కొంతమంది భక్తులు వారించినా ఆయన మనసు మార్చుకోలేదు. 31 కిలోల కారంపొడి కలిపిన నీళ్ళతో ఆయన అభిషేకం చేయించుకునే ముందు ప్రత్యంగరా దేవిని పూజించారు. ఆ తర్వాత నాన్ స్టాప్గా కారం నీళ్ళను మీద పోయించుకున్నారు. అయితే కారం నీళ్ళు మీద పోసే సమయంలోగానీ, ఆ తర్వాతగానీ ఆయన ఒళ్లు మండుతోందని అనకపోవడం విశేషం. ఈ అభిషేకాన్ని వేలాదిమంది తిలకించారు.