ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్
పలువురు ప్రజా నాయకులు, కవులు, కళాకారులు నిర్వహించ తలపెట్టిన ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ (ఎం) పార్టీ ఆవిర్భవించి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల నేతలు, సానుభూతి కార్యకర్తలు రాజధానిలో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సభలో పాల్గొనడానికి వచ్చిన జార్ఖండ్ రాష్ట్ర ప్రజా గాయకుడు జీత్ మరాండీ, పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆదివారం హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభకు అటు పోలీసు శాఖ అనుమతించలేదు. దీంతో వరవరరావు హైకోర్టును ఆశ్రయించగా సభ నిర్వహణకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వాహకులు, విరసం నేతలు ప్రకటించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా బలగాలు మోహరించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, సభ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.