కేసీఆర్ జూలో పెద్దపులి: రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని నిరంతరం విమర్శిస్తూ వుండే తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ని పులితో పోల్చారు. సాధారణంగా ఏ మనిషినైనా పులితో పోల్చామంటే అది ఆయన్ని పొగిడినట్టే అర్థం. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ని పులితో పోల్చడం వెనుక ఆంతర్యం ఏమై వుంటుంది? పొగడ్డం మాత్రం కాదు. వివరాల్లోకి వెళ్తే, కేసీఆర్ తన బంధువు మైహోం జూపల్లి రామేశ్వరరావుకు భూములు కేటాయించే విషయంలో ఆయనపై ధ్వజమెత్తుతున్న రేవంత్ రెడ్డి బుధవారం కూడా దీనికి సబంధించి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ జూలో పులి ముందు పడిన యువకుడి గురించి ప్రస్తావిస్తూ, ‘‘ఢిల్లీ జూలో పులిముందు పడిన యువకుడి లాంటి వ్యక్తి మా తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు. ఆ యువకుడి ఎదురుగా వున్న పులి కేసీఆర్. ఆ పులిమీద రాళ్ళు విసిరి రెచ్చగొట్టేది మైహోమ్ రామేశ్వరరావు’’ అన్నారు. గతంలో ప్రాంతీయవాదంతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ఇప్పుడు కులవాదంతో ఎర్రబెల్లి దయాకర్ రావుని మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను దోపిడిదారులైన దొరలను విమర్శిస్తున్నాను తప్పితే, తాను ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించడం లేదని రేవంత్ రెడ్డి వివరించారు.