మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్న చంద్రబాబు!

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మంత్రివర్గంపై అసంతృప్తితో ఉన్నారా అంటే ఉన్నారనే వార్తలే వినిపిస్తున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. అసలు ఏపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత వరకూ పని చేస్తున్నారు అన్న నేపథ్యంలో చంద్రబాబు సర్వే చేయించారట. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు త్వరలో మంత్రివర్గం మార్చే దిశగా ఆలోచనలో ఉన్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో దసరా తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని రాజకీయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి.   ఈ వార్తలు అలా వచ్చాయో లేదో అప్పుడే మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. కాగా ఇప్పటికే ఇద్దరు మంత్రుల పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకూ ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు.. అయితే ఇప్పుడు ముస్లిం వర్గం నుండి ఎవరూ లేకపోవడంతో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంఎ షరీఫ్‌కు మంత్రివర్గంలో చోటు ఖాయం కాబోతుందని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీల నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ కోటాలో పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణిని ఎంపిక చేశారు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటీవలె ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటుగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్ విషయంలో పార్టీ కేడర్‌లో మొదటి నుంచి సానుకూలత ఉంది. అయితే మంత్రివర్గంలో ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు? ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు? అనేది త్వరలో తెలుస్తోంది.

27 మంది ఎంపీల సస్పెన్షన్

  పార్లమెంట్ ఉభయ సభలు వాడీవేడీగా జరుగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునుండే విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ సభలు అట్టుడికిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు సభను సరిగా జరగకుండా ఆరోపణలు చేస్తూనేఉన్నారు. లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభ ప్రారంభమైన దగ్గర నుండి ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రెండు సార్లు సభ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన కూడా తిరిగి అదే పరిస్థితి కొనసాగింది. మంత్రులు రాజీనామా చేసే వరకూ సభను సాగనివ్వబోమని.. విపక్ష ఎంపీలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. సభకు అందరూ సహకరించాలని కోరినా కూడా వినకపోవడంతో 377 రూల్‌ ప్రకారం 27 మంది ఎంపీలను 5 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేస్తే ఎవరు చెప్పారు?

  ఓటు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై సర్వీసు ప్రొవైడర్లను కాల్ డేటా ఇవ్వాలని సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించగా వారు మళ్లీ హైకోర్టును ఆశ్రయించి ఏపీ అధికారులు కాల్ డేటా ఇవ్వాలనం సబబుకాదని వాదించారు. కాని హైకోర్టు మాత్రం కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని.. వారితో పాటు మాకు కూడా ఇవ్వాలని చెప్పింది. దీంతో ఎట్టకేలకు సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు కాల్ డేటాను సమర్పించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేశామని పత్యక్షంగా చెపుతున్నా మాత్రం చర్యలు తీసుకునేవాళ్లు మాత్రం లేరు. అయితే గతంలో ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏపీ అధికారుల ఫోన్లు ట్యాప్ చేశారని లాయర్ల జెఏసి జూన్ 28న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశాల ఆధారంగా పోలీసులు టెలిగ్రాఫిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు.   ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నేర పరిశోధన విభాగం పోలీసు అధికారులు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేస్తే ఎవరు ఇలా ట్యాపింగ్ చేయాలంటూ ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని నోటీసులు జారీ చేశారు. కానీ తమ ఫిర్యాదులో సర్వీస్ ప్రొవైడర్లు, కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటూ ప్రస్తావించారని, ప్రజాప్రతినిధుల పేర్లు లేకపోవడంతో దర్యాఫ్తు ఆలస్యమవుతుందని సిసిఎస్ అధికారులు చెబుతున్నారు.

మోహన్ బాబుకు పద్మశ్రీ ఊరట

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ఎట్టకేలకు పద్మశ్రీ వివాదంలో ఊరట లభించింది. ఒక చిత్రంలో మోహన్ బాబు పేరుతో పద్మశ్రీ కూడా కలిపి వేశారని.. పద్మశ్రీ అవార్డును మోహన్ బాబు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై మోహన్ బాబు చిత్ర నిర్మాత తన ప్రమేయం లేకుండా టైటిల్స్ లో పద్మశ్రీని వేశారని.. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయబోమంటూ గతంలో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చి మోహన్‌బాబుకు పద్మశ్రీ యథాతథంగా కొనసాగుతుందని తీర్పునిచ్చింది. సుప్రీం ఇచ్చిన తీర్పుతో మోహన్ బాబుకు కొంత ఊరట లభించింది.

ఆ పరిస్థితికి కారణం తనే అంటున్న ఇలియానా

  గోవా భామ ఇల్లీ భామ దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన నడుము సోయగాలతో కుర్రకారును మత్తెక్కించి టాప్ పొజిషన్ దక్కించుకుంది. టాలీవుడ్ లో మొట్టమొదట అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నభామ కూడా ఈ గోవా బ్యూటీనే. అయితే గత కొంత కాలంగా ఈ అమ్మడు సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. బర్ఫీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానాకి ఆసినిమా విజయం సాధించిన తరువాత ఇంకేముంది టాలీవుడ్ నుండి పాగా ఎత్తేసి.. బాలీవుడ్ లో కూడా దున్నేయెచ్చు అనుకుంది. కానీ బర్ఫీ సినిమా తరువాత రెండు మూడు సినిమాలు చేసిన తరువాత ఆఫర్లు కరువయ్యాయి. అయితే ఇప్పుడు ఈఅమ్మడు తన ఈ పరిస్థితి కారణం తనే అంటుంది. బర్ఫీ విజయం తరువాత చాలా ఆపర్లు రావల్సింది కానీ బాలీవుడ్ కి కొత్త కావడం వల్ల ఆసినిమా విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను.. ఆ విషయంలో తప్పు నాదే.. ఇప్పటి నా పరిస్థితికి నేనే కారణం అంటూ బాధ వెల్లకక్కిందట. పాపం ఉన్నదీ పోయింది.. ఉంచుకున్నదీ పోయింది అన్నట్టు ఉంది ఇలియానా పరిస్థితి.

పోర్న్ సైట్ల నిషేదం.. స్పందించిన వర్మ

  కేంద్ర ప్రభుత్వం సుమారు 5000 పైగా అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అన్నిటిపై స్పందించి విమర్శలు చేసే విమర్శల వర్మ రాంగోపాల్ వర్మ యధావిధిగానే దీనిమీద కూడా తన శైలిలో స్పందించి ట్వీట్లు పడేశారు. కేంద్ర ప్రభుత్వ పోర్న్ సైట్లపై నిషేదం విధించడమన్నది తిరోగామి చర్య అంటూ.. లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైబ్ సైట్లను నిషేదించినంత మాత్రాన నేరాలు జరగకుండా ఆపలేమని అన్నారు. ఇలా నిషేదించడం వల్ల అది ఇంకా బలం పుంజుకుంటుందని.. వ్యక్తుల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే అది ఆ దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుందని అన్నారు. పోర్న్‌ సైట్లపై నిషేధం విధించడం కన్నా.. ఆ కంటెంట్‌ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రభుత్వం చూడాలన్నారు.

ప్రధానిపై దాడి..జస్ట్ మిస్

  ఏకంగా ఓ దేశ ప్రధాని ప్రాణాలనే తీయాలని ప్రయత్నించాడు ఓ మాజీ సైనికుడు. అలా ప్రధాని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి ఇస్లామాబాద్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఆయన వెళ్తున్న కాన్యాయ్ పై రిటైర్ట్ ఎయిర్ కమాండర్.. మాజీ అధికారి హఫీజ్ ఉర్ రెహ్మాన్ ఒక్కసారిగా దాడికి దిగారు. ముందుగా రెహ్మాన్ ప్రధాని కారును ఓవర్ టేక్ చేసి.. ఆ తరువాత షరీఫ్ ఉన్న కారును తన కారుతో బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో షరీఫ్ కుటుంబానికి ప్రాణాపాయం తప్పి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు రెహ్మాన్ ను అదుపులోకి తీసుకొని ఒక ప్రధానిపై తాను దాడి చేయడానికి గల కారణాలు ఏంటి.. అసలు ప్రధానిపై అతనికి ఎందుకంత కసి అనే వివరాల తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీడీపీలోకి డొక్కా!

  కాంగ్రెస్ పార్టీనుండి ఇప్పటికే చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత కొద్ది రోజులు మౌనంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తరువాత తాను వైఎస్సార్ పార్టీలోకి వెళుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ తాను మాత్రం ఏ పార్టీలోకి చేరడంలేదంటూ చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా డొక్కా టీడీపీలోకి చేరేందుకు రాయపాటి సాంబశివరావు రాయబారిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాయపాటి డొక్కా టీడీపీ లోకి చేరడం వల్ల పార్టీకి కలిగే ప్రయోజనాలకు పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబుకు వివరించినట్టు.. దానికి చంద్రబాబు కూడా అంగీకరించినట్టు రాజకీయ విశ్లేషకులు అనకుంటున్నారు. కాగా ఈ నెల 15వ తేదీన డొక్కా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని.. ఇందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు.

ఏపీని బీహార్ తో కలపొద్దు

  దేశంలోని ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపిన సంగతి తెలిసిందే. బీహార్ తో పాటు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో ఇప్పటికే ఏపీలో నిరసనలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై ఎంపీ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ కు సంబంధించనవి అని ఏపీకి దీనితో సంబంధం లేదని అన్నారు. రాష్ట విభజన వల్ల ఏపీకి చాలా నష్టం జరిగిందని.. ఏపీని బీహార్ తో పోల్చి చూడవద్దనిన ఆమె అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. కాగా మరోవైపు బీజేపీ చేసిన ఈ ప్రకటనను ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తుందని... అందుకే సభ జరగనివ్వడం లేదని అన్నారు.   మరోవైపు ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాము రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమని రాజమండ్రి పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ అన్నారు. ఇప్పటికిప్పుడు తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే అందుకు కూడా తాము సిద్ధమని అభిప్రాయపడ్డారు.  

అందుకయితే రాజీనామాకి సిద్దం:మురళీ మోహన్

  దేశంలో మరే రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో తెదేపా, బీజేపీలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఉద్యమాలు ఊపందుకొంటున్నాయి. ఎంపీ మురళీ మోహన్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకి వాస్తవిక పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేసారు.   “ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. అది ఎవరి మద్దతుపై ఆధారపడి లేదు. అందువలన మేము రాజీనామాలు చేసినా దానిపై ఎటువంటి ఒత్తిడి, ప్రభావం ఉండదు. కనుక మేము ఎంపీలుగా ఉన్నప్పుడే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మేము రాజీనామా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటే మేము ఈ క్షణమే రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నాము. కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించడం వలన మరింత నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర విభజన వలన తీవ్రంగా నష్టపోయిన మన రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావలసిందే. అందుకోసమే మేము కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ప్రత్యేక హోదా కోసం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాము” అని తెలిపారు.

వారిద్దరు ఇంకా ఐ.యస్. ఉగ్రవాదుల చెరలోనే!

  ఐదు రోజుల క్రితం లిబియాలో ఐ.యస్.ఐ.యస్.ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన హైదరాబాద్ కి చెందిన బలరాం కిషన్, గోపీ కృష్ణ ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు తాజా సమాచారం. వారిని విడిపించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతవారం 29వ తేదీన వారు హైదరాబాద్ తిరిగి వస్తుండగా సిర్సత్ పట్టణం సమీపంలో కిడ్నాప్ చేయబడ్డారు. కిడ్నాప్ అయిన నలుగురిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం విడిచిపెట్టారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలికి చెందిన టి. గోపీకృష్ణని, హైదరాబాద్ కి చెందిన బలారంకిషన్ న్ని ఇంతవరకు విడిచిపెట్టలేదు.   గత వారం రోజులుగా వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వాల తరపున మంత్రులు వారికి దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిరువురూ ఈ రోజు విడుదలవవచ్చని విదేశాంగ శాఖ అధికారులు ఆశిస్తున్నారు. కానీ ఉగ్రవాదుల చెరలో విడుదలయ్యే వరకు ఎవరూ కూడా ఖచ్చితంగా హామీ ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉంది.

సుమారు 5000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసిన కేంద్రం

  ఇప్పుడు ఇంటర్నెట్ సెల్ ఫోన్లకు కూడా విస్తరించడంతో దాని వలన ఎన్ని లాభాలు చేకూరుతున్నాయో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతోంది. ఇంటర్నెట్ లో వేలాదిగా అశ్లీల వెబ్ సైట్స్ వలన దేశంలో యువత పెడమార్గం పట్టుతోంది. అంతేకాదు అటువంటి వాటిని చిత్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల వలన సమాజంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే కేంద్రప్రభుత్వం అశ్లీల వెబ్ సైట్లపై కొరడా జులిపించింది. వివిధ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఇంత వరకు సుమారు 5000 అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసింది.   మొత్తం 32 మంది సర్వీస్ ప్రోవైడర్లను ఈ అశ్లీల వెబ్ సైట్లను నిషేదించమని కోరగా ఇంతవరకు కేవలం 8 మంది మాత్రమే స్పందించారు. దీని వలన న్యాయపరమయిన వివాదాలలో చిక్కుకొన వలసి వస్తుందనే ఉద్దేశ్యంతో మిగిలినవారిలో కొందరు తమకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే వాటిని నిలిపివేస్తామని స్పష్టం చేసారు. బ్లాక్ చేయబడిన అశ్లీల వెబ్ సైట్లు మళ్ళీ కొత్త ఐ.పి అడ్రస్ మరియు సరికొత్త పేర్లతో తమ కార్యక్రమాలను కొనసాగిస్తుండటంతో వాటిని కూడా నిషేదించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

విమాన ప్రమాదంలో బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతి

  ఒకప్పటి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ తల్లి, సోదరి, సోదరి భర్త ముగ్గురూ కూడా ఇంగ్లాండ్ లో నిన్న రాత్రి జరిగిన ఒక విమాన ప్రమాదంలో మరణించారు. వారు ఇటలీలోని మిలన్ నుండి బ్రిటన్ లోని హాంప్ షైర్ కి ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానంలో వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఏమ్బ్రియర్ ఫీనం-300 జెట్ విమానం రన్ వే మీద దిగే ముందు బ్లాక్ బుష్ విమానాశ్రయం పక్కనే ఉన్న కార్ల వేలం వేసే కంపెనీ మీద కూలి పేలిపోయింది. ఆ ప్రమాదంలో విమాన పైలెట్ తో సహా ముగ్గురూ మరణించారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వాళ్ళ జరిగిందా లేక ఏదయినా కుట్ర జరిగిందా లేక వేరే ఇతర కారణాలేమయినా ఉన్నాయా అనే విషయం దర్యాప్తులో తేలుతుంది. బ్రిటన్ దర్యాప్తు బృందాలు ఘటాన స్థలికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టాయి.

ప్రత్యేక హోదా వచ్చే వరకూ ప్రయత్నిస్తాం.. చంద్రబాబు

  దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పడంతో ఏపీ రాష్ట్రానికి బాంబు పేల్చినంత పైనంది. ఎప్పటినుండో ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్న ఏపీ రాష్ట్రానికి కేంద్రం చెప్పిన మాటతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఈవిషయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిందని.. అందుకే రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నామని అన్నారు. అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాష్ట్రాలతో ఏపీని పోల్చవద్దని.. ఏపీది ప్రత్యేక పరిస్థితి అని.. ఏపీకీ ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల ఆర్ధిక లోటు చాలా ఉందని.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వననడం సబబు కాదని వెల్లడించారు. అన్ని రాష్ర్టాలతో పోటీపడే స్థాయికి వచ్చేవరకు కేంద్రం సహకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

యాకుబ్ భార్యకు రాజ్యసభ సీటు.. పదవికి వేటు

  వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సమాజావాదీ పార్టీ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు ఓ నేత. ముంబై జంట పేలుళ్ల కేసులో యాకుబ్ మెమెన్ ను గురువారం ఉరితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సమాజ్ వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు ఫరూక్ ఘోసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమస్యలను అధిగమించాలంటే వారి తరపు మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలని.. సభలో వారి వాదనను వినిపించేందుకు ఒక గొంతు కావాలని.. ఈ నేపథ్యంలో యాకుబ్ మెమెన్ భార్య రహీన్ కు రాజ్యసభకు నామినేట్ చేయాలని పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాశారు. ముస్లింల తరపున ఆమె పోరాడుతుందని లేఖలో పేర్కొన్నారు. అంతే ఈయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫరూక్ ను వెంటనే పార్టీనుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ హోదా.. చీర, పూలు, జాకెట్లతో నిరసన

  ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని నిన్న లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల చర్చలో కేంద్రమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పై రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో టిడిపి పూర్తిగా విఫలమయ్యిందని.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఇంటిముందు ఏఐవైఎఫ్‌ నాయకులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా చీర, పూలు, జాకెట్లతో నిరసన తెలిపారు. మరోవైపు ఉరవకొండలో ప్రజలు ఇంకొంచం వెరైటీగీ నిరసన తెలిపారు. మొహాలకు ముసుగులు వేసుకొని బూట్లను పాలిష్ చేస్తూ తమ నిరసనను తెలిపారు.

68 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వాతంత్ర్యం

భారతదేశం.. మనం ఈ దేశంలో ఇప్పుడు ఇంత స్వేచ్చగా.. ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే దీనికి ఎంతోమంది బలిదానాలు ప్రతిఫలమే. ఎందరో మహనీయుల త్యాగఫలమే. వారు సలిపిన నిర్విరామ పోరాటమే ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్చా, స్వాతంత్ర్యాలు. ఇప్పుడు స్వతంత్యం వచ్చి మనకు 68 సంవత్సరాలు అవుతున్నా... ఇప్పుడు మళ్లీ 68 సంవత్సరాల తరువాత కొంతమంది భారతీయులకు స్వతంత్ర్యం వచ్చింది. అదేలా అంటారా.. తలాతోక లేకుండా సాగిన దేశ విభజన ఫలితంగా భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులు అడ్డదిడ్డంగా రూపొందాయి. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా ఈ సరిహద్దు గురించి ఇరు దేశాల మధ్య ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ గొడవలకు సమగ్ర పరిష్కారం కనుగొనేందుకు సాగిన ప్రయత్నాల వల్ల ఫలశ్రుతిగా 2011 సెప్టెంబరులో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య 'ప్రొటోకాల్‌' కుదిరింది. దీంతో వివాదాస్పద భూభాగాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలను మన్నిస్తూ, వారెవరూ ఉన్నచోటును వదిలిపెట్టి నిర్వాసితులై వెళ్లిపోవాల్సిన అవసరం లేకుండా  ఒప్పందం కుదరగా ఆ మేరకు 2013నాటి బిల్లు రూపొందింది. బంగ్లాదేశ్ లోని నాలుగు జిల్లాల పరిధిలో 111 గ్రామాల్లో కలిపి మొత్తం సుమారు 15000 మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో ఎవరి భూభాగంలోని పరగణాలు వారికే చెందేలా తీర్మానించిన బిల్లు- పరాధీనంలో ఉన్న ప్రాంతాల పంపకాల్నీ నిర్దేశించింది.   ఈ మేరకు భారత్ - బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు మధ్య ఒప్పందం కుదిరి.. సరిహ‌ద్దు ఒప్పందం పత్రాలపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు కూడా చేశారు. దీంతో 41 ఏళ్ల పాటు కొనసాగిన సరిహద్దు వివాదానికి ముగింపు పలికారు. తాజా సరిహ‌ద్దు ఒప్పందంతో భారత్ భూభాగంలోకి 51 గ్రామాలు, బంగ్లాదేశ్ లోకి 111 గ్రామాలు వెళ్లనున్నాయి. దీంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 14 వేలమంది బంగ్లాదేశీయులకు నిన్న అర్ధరాత్రి భారత పౌరసత్వం లభించింది. దీంతో గ్రామాల్లో  సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా భారత జెండా రెపరెపలాడుతున్నాయి. ఈ విభజనతో సరిహద్దు ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కొత్త భారత పిన్ కోడ్ సంఖ్యలు రానున్నాయి. ఈ నేపథ్యంలో 14 వేల మంది ఉన్న ప్రాంతాలకు నేడు పిన్ కోడ్ సంఖ్యలను అందించనున్నట్టు కూచ్ బెహర్ కలెక్టర్ ఉళగనాథన్ వెల్లడించారు. ఉద్యోగాలకు పోటీ పడేందుకు యువత అర్హత పొందుతుంది.

ఇంకేం చేయాలి.. బట్టలూడదీసుకొని తిరగాలా

  దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని నిన్న లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల చర్చలో కేంద్రమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం నీళ్లు చల్లినంత పని చేసింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి ఆర్ధిక లోటు చాలా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదాపైనే చాలా ఆశలు పెట్టుకుంది. అసలు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా కల్సిస్తామని హామీ ఇచ్చిన తరువాతే రాష్ట్ర విభజనకు ఒప్పుకోవండం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా ఒక్కమూటలో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంపై బీజేపీ తీరును ఏపీ ఎంపీలు తప్పుబడుతున్నారు.   ఈ విషయంపై ఎంపీ తెలుగుదేశం పార్టీ పార్లెమంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు స్పందించి ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తుందని.. గతంలో రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని.. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ తప్పుచేస్తుందని విమర్శించారు. ఈ విషయంలో టిడిపి, బిజెపిలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతలో మీడియా ప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయి.. ప్రత్యేక హోదా కోసం ఇంకేం చేయమంటారు.. బట్టలూడదీసుకుని తిరగమంటారా అని మాట్లాడారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవ్ కళ్యాణ్ ముందండి నజిపిస్తే తాము కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని రాయపాటి అన్నారు.

తెలంగాణలో ఈతచెట్లు.. 5 కోట్లు

  తెలంగాణలో కల్తీ కల్లు తాగి చాలా మంది చనిపోతున్నారని సీఎం కేసీఆర్ చాలా బాధపడుతున్నట్టున్నారు అందుకే తెలంగాణ చెరువు కట్టల మీద ఐదు కోట్ల ఈతచెట్లను పెంచాలని ఆదేశించారట. ఈ బాధ్యతను ఎక్సైజ్ శాఖ తీసుకోవాలని ,ఈత నర్సరీలను తయారుచేయాలని ఆయన సూచించారట. తెలంగాణలో చాలా చోట్ల కల్తీ గుడుంబా వల్ల ప్రజలు చనిపోతున్నారని.. ఈ పరిస్థితిని అరికట్టాలని ఈయన అన్నారు. దీనిలో భాగంగానే మంచి కల్లు కోసం ఈత చెట్లను పెంచాలని.. కాయకష్టం చేసుకుని వచ్చిన శ్రామికులు విశ్రాంతి కోసం మద్యం తీసుకుంటారని అందువల్ల వారి ఆరోగ్యానికి నష్టం లేని విధంగా మంచి మద్యం అందించాలని కెసిఆర్ సూచించారట.