ఇప్పుడు ఏమంటావ్ కేసీఆర్

  నోటు ఓటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో మొదటి నుండి ఏపీ ముఖ్యమంత్రి సహా పలువురి అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మేం ఫోన్లు ట్యాపింగ్ చేయలేదంటూ వాదిస్తూ వచ్చాయి. కానీ విజయవాడ కోర్టులో హాజరైన సర్వీసు ప్రొవైడర్లు తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు వాటికి సంబధించిన సమాచారం ఇవ్వాలని కోరగా సర్వీసు ప్రొవైడర్లు మాత్రం అందుకు నిరాకరించారు. ఆ సమాచారం ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించిందని.. కాల్ డేటా అందించవద్దని చెప్పిందని కోర్టుకు చెప్పారు . కానీ కోర్టు అవన్నీ తోసిపుచ్చి కాల్ డేటా ఇవ్వాల్సిందేనని తీర్పు నిచ్చింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. అలాంటి పప్పులేమి ఉడకవు కాల్ డేటా ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పింది. దీంతో సర్వీసు ప్రొవైడర్లు వారం రోజులు గడువు కోరారు.   ఇప్పుడు దీనిపై టీడీపీ యువనేత.. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారాలోకేశ్ స్పందించి కేసీఆర్ పై ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.. ఇప్పుడు టెలికాం కంపెనీలు కూడా ఒప్పుకున్నాయి.. ఇప్పుడు కేసీఆర్ మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పెదొకటి చేసేదొకటి అని.. వారు అవునంటే కాదని.. కాదంటే అవునని విమర్శించారు. గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతో విద్యార్ధులను బలిచేశారు.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను బలి చేశారని ట్విట్టర్లో మండిపడ్డారు.  

రాహులు జగన్ టూర్ సీక్రెట్ ఎంటీ?

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. దానికి ముందు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా అనంతపురం జిల్లాలో పర్యటించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఒకే సమయంలో యాత్రలు చేపట్టంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్, జగన్‌లు అనంతపురం జిల్లాలో రహస్యంగా కలిశారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరిద్దరూ కావాలనే ఒకేసారి పర్యటనలో పాల్గొన్నారని.. రహస్యంగా కలిసి మంతనాలు జరిపారని పలు రాజకీయ విశ్లేషకులు చెవులుకొరుక్కుంటున్నారు. అసలు ఇంతకు ముందే పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్సార్ పార్టీలోకి వెళ్లి జగన్ ను కాంగ్రెస్ లోకి తీసుకొస్తారేమో అని పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు దీనిలో భాగంగా రాహుల్ గాంధీ, జగన్ నిజంగానే కలిశారా? కలిస్తే ఏం మాట్లాడుకున్నారు? అనే ప్రశ్శలు మొదలవుతున్నాయి.   ఇదిలా ఉండగా పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడని రాహుల్ గాంధీ అక్కడి నుండి అనంతపురం వచ్చి ఇక్కడ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం చాలా ఆశ్యర్యంగా ఉంది. జగన్ కూడా ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా ఏ కారణంతో ప్రతిపక్షపార్టీని విమర్శించాలన అని చూడటమే తప్ప ప్రత్యేక హోదా గురించి ఎక్కువ మాట్లాడింది లేదు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు ఇద్దరు నేతలపై మండిపడుతున్నారు. ఇద్దరు కూడబలుక్కొని అనంతపురంలో పర్యటించారనే ఆరోపిస్తున్నారు. తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏం చేయలేరని టీడీపీ వర్గాలు తెలిపాయి.

పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి, 9మంది పౌరులు మృతి

  ఈరోజు తెల్లవారు జామున పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు చేసిన దాడిలో పౌరులు, పోలీసులు కలిపి మొత్తం 9మంది మరణించారు. ఉగ్రవాదులు మొదట అమ్రిత్ సర్ వెళుతున్న బస్సులో ప్రయాణికులపై విచక్షణారహితంగా కాలుపులు జరిపారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ పై దాడి జరిపారు. ఒక హోటల్ యజమానిని బెదిరించి అపహరించుకొని వచ్చిన మారుతీ కారులో వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొన్నారు. వారందరూ సైనిక దుస్తులు ధరించి చేతిలో అత్యాధునిక ఆయుధాలతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి విచాక్షానా రహితంగా పోలీసులపై కాల్పులు జరుపడంతో అక్కడికక్కడే 9మంది మరణించారు. ఈ సంగతి తెలుసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అదనపు బలాలను అక్కడికి పంపించి ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. అంతకు ముందు పఠాన్ కోట్-గురుదాస్ పూర్ రైల్వే ట్రాక్ పై ఉగ్రవాదులు ఐదు బాంబులను కూడా అమర్చారు. కానీ భద్రతా దళాలు సకాలంలో వాటిని గుర్తించి తొలగించడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.

అలాగయితే నేను క్రికెట్ ఆడేవాడినే కానేమో? శ్రీశాంత్

  క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ మరియు అజిత్ చండిలా ముగ్గురూ 2013 సం.లో జరిగిన ఐ.పి.యల్. మ్యాచ్ లలో స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ డిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి ముగ్గురిపై చార్జ్ షీట్లు దాఖలు చేసారు. వారిలో శ్రీశాంత్ కి కి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సబందాలు కూడా ఉన్నాయని డిల్లీ పోలీసులు ఆరోపించారు. వారు ముగ్గురూ 2013సం.లోనే బెయిలుపై విడుదలయినప్పటికీ వారిపై ఇంతవరకు ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కేసులను విచారించిన డిల్లీ హైకోర్టు, వారు ముగ్గురూ ఆ నేరం చేసినట్లు డిల్లీ పోలీసులు సరయిన ఆధారాలు చూపలేకపోయినందున వారిని నిర్దోషులుగా ప్రకటించింది.   ఈ కేసులో నిర్దోషిగా బయటపడిన తరువాత శ్రీశాంత్ డిల్లీ నుండి తన స్వస్థలమయిన కేరళలో కొచ్చి చేరుకొన్నప్పుడు విమానాశ్రయంలో ఆయనకి ఆహిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తనకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లయితే అసలు క్రికెట్ ఆడేవాడినేకాదేమో! అతనిలాగే నేను కూడా ఏ దుబాయ్ లోనో దాక్కోవలసివచ్చేది. కానీ క్రికెట్ పై ఉన్న మక్కువతోనే పట్టుదలగా ఆడి ఈ పేరు, డబ్బు, అభిమానులను సంపాదించుకోగలిగాను. నాపై ఆరోపణలు వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసారు. కానీ ఆ కష్టకాలంలో నా కుటుంబ సభ్యులు, అభిమానులు నాకు అండగా నిలబడ్డారు. వారి ప్రార్దనలు, ఆశీస్సుల కారణంగానే నేను ఈ కేసు నుండి నిర్దోషిగా బయటపడగాలిగాను. అందుకు వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మళ్ళీ క్రికెట్ పై దృష్టి కేంద్రీకరించి పూర్వ వైభవం సాధించేందుకు గట్టిగా కృషి చేస్తానని” ఆయన అన్నారు.

12 రోజుల్లో 11.29 కోట్ల మంది పుష్కరస్నానాలు!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో అత్యంత వైభవంగా నిర్వహించిన గోదావరి పుష్కరాలు నిన్న శనివారం సాయంత్రం హారతి కార్యక్రమంతో ముగిసాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4.89కోట్లు, తెలంగాణా రాష్ట్రంలో 6.4కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ మహా పుష్కరాల గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ఏర్పాట్లు, ప్రచారం చేయడంతో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 11.29 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసారు.   ఈ పుష్కరాలను ఆదిపుష్కరాలు అంటారు. కనుక నేటి నుండి మరొక 12రోజుల పాటు ఉండే అంత్యపుష్కరాల సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు చేసినా అదే ఫలితం ఉంటుందని పండితులు చెపుతున్నారు. ఈ పుష్కరాల రద్దీ సమయంలో పుణ్య స్నానాలు చేయలేక పోయినవారు ఈ 12రోజులలో ఎప్పుడయినా పుణ్యస్నానాలు చేసినా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెపుతున్నారు.

సంపూర్ణ తెలంగాణ రాలేదు

  ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు హైకోర్టు విభజన.. ఉద్యోగులు విభజనపై వివాదం జరుగుతుంది. అయితే ఈ రెండింటిలో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలే పడ్డాయి. హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ వాదులు కోర్టులో ఆరోపించినా ఇప్పట్లో విభజించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవింగ్ చేస్తానంటుంటే మరో వైపు కేంద్రం అలాంటి పప్పులేమి ఉడకవు వాళ్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.   ఈనేపథ్యంలో తెలంగాణ న్యాయవాదులు కలిసి హైకోర్టు విభజన కోసం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినా ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదని.. హైకోర్టు, ఉద్యోగుల విభజన కోసం ఆగష్టు 6 తర్వాత ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించినట్టు హైకోర్టు కోసం కూడా ఉద్యమం చేయాలని సూచించారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్ ఒక్క న్యాయవాదులకే పరిమితం కారాదాని చెప్పిన ఆయన, ఇందు కోసం తెలంగాణ సమాజం ఉద్యమబాట పట్టాలని అన్నారు.

మందుబాబులకు మంచులక్ష్మీ క్లాస్

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అటు చిత్రరంగంలోనే కాదు ఇటు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. పదిమందికి ఉపయోగపడే నాలుగు మంచి మాటలను చెప్పడానికి ఆమె తనంతట తాను చొరవ చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంచు లక్ష్మీతో మందుబాబులకు కౌన్సిలింగ్ ఇప్పించాలనుకుంటున్నారట. ఇదేంటి అనుకుంటున్నారా.. అంటే తాను స్వయంగా కలిసి కౌన్సిలింగ్ చేస్తారని కాదు.. మంచు లక్ష్మితో ఓ ప్రకటనను చేయించనున్నారట. మంచు లక్ష్మీతో మాట్లాడించి ఆప్రకటనను మద్యం తాగి వాహనం నడిపే మందు బాబులకు చూపిస్తారట. మరి ఎన్ని చెప్పినా మారని మందుబాబులు లక్ష్మీ మాటలకు మారుతారో లేదో చూడాలి..

చిరంజీవికి అర్హత లేదు..

  గోదావరి మహాపుష్కరాలు చివరి రోజు కావడంతో పలువురు ప్రముఖులు రాజమండ్రి పుష్కరఘాట్లో స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంపీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చిరంజీవిపై మండిపడ్డారు. గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో మొదటిరోజు జరిగిన తొక్కిసలాటకు కారణం చంద్రబాబే అంటు అనవసరమై విమర్శలు చేస్తున్నారంటూ.. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ పెట్టి దానిని నడపడం చేతకాక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి చంద్రబాబును విమర్శించే హక్కులేదని ఎద్దేవ చేశారు. కైకలూరులో పుష్కర యాత్రికులకు మంత్రి ఆహారపొట్లాలను పంపిణీ చేశారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, డాలర్‌ శేషాద్రి సహా పలువురు ప్రముఖులు పుణ్యస్నానమాచరించారు.

ఓటుకు నోటు.. ఏసీబీ వరుసబెట్టి నోటీసులు

  ఓటు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు వరుసపెట్టి అందరికీ నోటీసులు జారీ చేసే పనిలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నుండి మొదలు పెట్టి ఈ కేసులో సంబధం ఉందంటూ ఇప్పటివరకూ ఎంతో మందికి నోటీసులు జారీ చేశారు. మొదట టీడీపీ నేతలు సండ్ర వెంకట వీరయ్య.. వేం నాగేందర్ రెడ్డిక నోటీసులు జారీ చేశారు. తరువాత వేం నరేందర్ రెడ్డి కొడుకుకి.. ఆతరువాత కారు డ్రైవర్లకి కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాక రేవంత్‌ రెడ్డి అనుచరులు అల్లూరి నారాయణరాజు, సైదులికి విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యలయంలో వారు విచారణలో పాల్గొన్నారు. సుమారు ఏడు గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ఇంకా కొంతమందికి ఏసీబీ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో సంబంధం ఉన్నా లేకపోయిన అందరినీ వరుసపెట్టి విచారించే పనిలో పడింది.

అవును...ఏపీ ఫోన్లు ట్యాపింగ్ చేసాము

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా కొందరు మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు టెలిగ్రాఫిక్ చట్టంలో సెక్షన్: 5క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేయమని తెలంగాణా ప్రభుత్వ సంస్థలు తమను కోరాయని, దాని ఆదేశాలు పాటిస్తూ కొన్ని ఫోన్లను ట్యాపింగ్ చేసామని ఐడియా, ఎయిర్ టెల్ మరియు రిలయన్స్ సంస్థలు సుప్రీంకోర్టుకి తెలిపినట్లు సమాచారం. కానీ అవి అధికారిక రహస్యాలు కనుక వాటిని బయటపెట్టవద్దని, బయటపెడితే ప్రాసిక్యూట్ చేస్తామని తమను హెచ్చరించినట్లు వారు సుప్రీంకోర్టుకి తెలిపారు. కానీ ఆ వివరాలను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు తమను కోరుతుండటంతో ఏమి చేయాలో పాలుపోకనే సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లు వారు తెలిపారు.   వారి పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు ఆ వివరాలను సీల్డ్ కవర్లో పెట్టి వారం రోజుల్లోగా విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి అందజేయవచ్చని, వారికి తమ అనుమతి ఉంది కనుక తెలంగాణా ప్రభుత్వం నుండి ఎటువంటి న్యాయపరమయిన సమస్యలు రావని హామీ ఇచ్చింది. కనుక మిగిలిన అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ చేసిన కాల్ డాటాని విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి సమర్పిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చును.

సునీల్ జాక్ పాట్.. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా చెల్లి

  సునీల్ కమెడియన్ గా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యి ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు. తరువాత హీరోగా మారి ఎన్నో వైవిద్యమైన పాత్రల‌లో నటించాడు. ఆ తరువాత జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ కొట్టేసి మర్యాద రామన్న చిత్రంలో నటించి హిట్ అందుకున్నాడు. అనంతరం పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే కొన్నిరోజులుగా గ్యాప్ తీసుకున్న సునీల్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సునీల్ క‌థానాయ‌కుడిగా, ర‌క్ష ఫేమ్ వంశి కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లి మ‌న్నార్ చోప్రాతో జతకట్టే జాక్ పాట్ కొట్టేశాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

దశలవారీగా ఏపీ రాజధాని.. అయోమయస్థితిలో ఏపీ రైతులు

  ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఇంకా ప్రారంభంకూడా కాలేదు. కానీ అమరావతిపై అంచనాలు మాత్రం చాలా పెరిగిపోయాయి. ఆంధ్ర ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ పేరుతో ఫోటోలు విడుదల చేయడం.. అమరావతికి 100 శాతం వాస్తు కుదరడం.. అంతేకాక రాజధానిలో ఆహాశహర్మ్యాలు నిర్మించే దిశగా ప్రయత్నాలు జరగడం ఓరకంగా ఇవన్నీ అమరావతిపై భారీ అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. అసలు అమరావతి నిర్మాణం పూర్తయ్యేసరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం నిజంగానే అలా ఉంటుందేమో అని అనిపిస్తుంది.   అంతా బానే ఉంది కానీ సింగపూర్ ప్రభుత్వం ఏపీ రాజధాని ఇచ్చిన ప్లాన్ లో ఈ అమరావతి పనులు దశలవారీగా పూర్తవుతాయని పేర్కొంది. 2035 వరకు పూర్తవుతాయని.. 2018 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని పేర్కొంది. అయితే సింగపూర్ ప్రభుత్వం చెప్పిన దానికి ఏపీ రైతులు అయోమయస్థితిలో పడిపోయారు. రాజధాని తొలిదశ పనులు 2018 నాటికి పూర్తవుతాయి అంటే ఏపీ సీడ్ క్యాపిటల్ అవ్వచ్చు.. మరి మిగిలిన భూముల సంగతి ఏంటి.. వాటిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు..తమకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఎప్పుడు ఇస్తారు అని రాజధానికి భూమి కేటాయించిన రైతులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి భూసమీకరణ చేపట్టినప్పుడు ప్రతిపక్షాలు పలు రకాలుగా వాదనలు చేసిన రైతులు మాత్రం చంద్రబాబునాయుడిపై నమ్మకం ఉంచి.. ఆయన ఏపీ రాజదానిని ఓమహాద్భుతంగా నిర్మించగలరని విశ్వాసం ఉంచి తన భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి ముందే ప్లాట్ల విభజన పూర్తవుతుందని, ఏ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఆ ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని చెప్పారు. అయితే దశలవారీగా నిర్మాణం అనేసరికే రైతులకు సందేహాలు ముసురుకుంటున్నాయి.

టీ సర్కార్ కు కేంద్రం ఝలక్.. ఏపీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి

  రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలలో విభేధాలు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ శాఖలకు సంబంధించి.. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల రిలీవింగ్ గురించి గొడవలు పడుతూనే ఉన్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏపీ విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులను రిలీవ్ చేస్తానంటుంటే.. మరోపక్క ఏపీ ప్రభుత్వం దీనికి నిరాకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఉద్యోగులు విభజన పై ఏర్పాటు చేసిన కమల్ నాథ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని లేదా.. ఉమ్మడిగా ఇరు రాష్ట్ర ఇంధన సంస్థలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ ఏడాది మార్చి 20న కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో ఇరు రాష్ర్టాల విద్యుత్ సంస్ధలు సమావేశమయ్యి ఒప్పందం చేసుకున్న మేరకు విభజన ప్రక్రియ జరగాల్సిఉంది. అంతేకాని తెలంగాణ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా తనకు ఇష్టమొచ్చినట్టు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదని తెలిపింది.   ఇప్పుడు ఐ.వై.ఆర్‌.కృష్ణారావు రాసిన లేఖకు కేంద్రం కూడా మద్ధతు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. తెలంగాణ విద్యుత్ సంస్ధల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేస్తూ టీ సర్కార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరికాదని.. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉద్యోగుల సర్దుబాటుకు సముఖత చూపునినట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్లో ఎంత మందిని తెలంగాణకు పంపిస్తే, అంతే సంఖ్యలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కు పంపిచే విధంగా సర్దుబాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని గతంలో అన్నా దానికి సంబంధించిన వార్తలు ఇప్పడు వినిపించడంలేదు. కాగా ఈ నెల 31న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇరు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంధన శాఖ కార్యదర్శులు, ట్రాన్స్‌కో సీఎండీలు సమావేశం కావాల్సి ఉంది.

నేటితో గోదావరి మహాపుష్కరాలు సంపూర్ణం

  రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా సాగిన గోదావరి మహా పుష్కరాలు ఈరోజుతో ముగుస్తాయి. కనుక చివరి రోజయిన ఈరోజు పుష్కర స్నానాలు చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివస్తుండటంతో రెండు రాష్ట్రాలలో పుష్కర ఘాట్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం రెండు రాష్ట్రాలలో అన్ని ఘాట్ల వద్ద గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తారు.   ఈ మహా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కర ముగింపు వేడుకలను కూడా అంతకంటే ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతోంది. కన్నులకింపుగా నిర్వహిస్తున్న గోదావరి హారతితో బాటు సాయంత్రం లేజర్ లైట్ల ప్రదర్శన, రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో వెయ్యి మంది కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన, సుప్రసిద్ధ గాయకుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణచే కర్నాటక గాత్ర సంగీత కచేరీ మొదలయిన అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసు ఆగస్ట్ 21కి వాయిదా

  అక్రమాస్తుల కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏ-2 ముద్దాయిగా ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఇంకా అనేక మందిపై సీబీఐ 11 చార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాటన్నిటినీ వేర్వేరుగా కాకుండా అన్నిటినీ కలిపి ఒకేసారి విచారణ చేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి తదితరులు సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిని సీబీఐ కోర్టు నిన్న విచారణకు చేప్పట్టినప్పుడు సీబీఐ తరపున వాదించిన న్యాయవాదులు వారి వేసిన పిటిషన్ న్ని తిరస్కరించాలని కోర్టుని కోరారు. ఈ 11 కేసుల్లో ఒకే రకమయిన నేరం జరిగినప్పటికీ అందులో అనేక మంది నిందితులు వేర్వేరు లక్ష్యాలతో ఈ కుట్రలకు పాల్పడ్డారని కనుక అన్ని చార్జ్ షీట్లను కలిపి విచారించడం సబబు కాదని వాదించారు. కొందరు కొన్ని కేసులలో ముద్దాయిలుగా ఉండగా, జగన్, విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు కొందరు అన్ని కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని, వారు వివిధ మార్గాలలో, వేర్వేరు ప్రయోజనాలని ఆశించి ఈ నేరాలకి పాల్పడ్డారు కనుక 11 చార్జ్ షీట్లను కూడా వేర్వేరుగానే విచారించాలని, కనుక జగన్మోహన్ రెడ్డి తదితరులు వేసిన పిటిషన్ న్ని కొట్టివేయాలని సీబీఐ న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకట రమణ ఈ కేసుని ఆగస్ట్ 21కి వాయిదా వేశారు.

ఆపన్నహస్తం అందించిన 'తెలుగువన్ ఫౌండేషన్'

  కుటుంబ బాధ్యత వహించాల్సిన కొడుకు రెండు చేతులు కాలిపోయి ఏం చేయలేని స్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే తన రెండు చేతుల్ని ఏమాత్రం కదపలేని స్థితిలో ఉండే వ్యక్తి జీవితం ఎంత దర్భరంగా ఉంటుందో వేరే చెప్పక్కరలేదు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది తెలుగువన్ ఫౌండేషన్. కన్నా రామంజనేయులు అనే కుర్రాడిది బసవవానిపాలెం.. కోడూరు మండలం. అతనికి 7 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు జరిగిన అగ్నిప్రమాదంలో అతని రెండు చేతులు పూర్తిగా కాలిపోయి శరీరానికి అంటుకుపోయాయి. కనీసం చేతులు రెండూ ఏమాత్రం కదపలేని పరిస్థితిలో 10 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నాడు. అతను తెలుగువన్ ఫౌండేషన్ అధినేత శ్రీ రవిశంకర్ కంఠమనేని ని కలిసి తన పరిస్థితిని వివరించినప్పుడు అతని స్థితికి చలించిపోయిన శ్రీ రవిశంకర్ గారు ముందుకొచ్చి అతని చేతులకు ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు తను తన ఒక చేతిని కదపగలుగుతున్నాడు.. మరో చేతి ఆపరేషన్ మరో ఆరు నెలల్లో చేయించనున్నారు.

50 ఏళ్లైనా కాంగ్రెస్ కు అధికారం దక్కదు.. అచ్చెన్నాయుడు

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రైతు భరోసా యాత్రపై టీడీపీ నేత ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడదీసి.. తెలుగు ప్రజల మధ్య విబేధాలు ఏర్పడేలా చేసి ఇప్పడు ఏ మొహం పెట్టుకొని రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల తమ పార్టీకి ప్రయోజనం ఉంటుందని ఆశించి సోనియాగాంధీ అతి దారుణంగా రాష్ట్రాన్ని విడదీశారని.. కానీ తెలుగు ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పారని ఎద్దేవ చేశారు. ఇంకా 50 ఏళ్ల పాటు పోరాడినా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కదని కూడా అచ్చెన్న జోస్యం చెప్పారు.

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

  ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల పర్యవేక్షణకు వెళ్లిన చంద్రబాబు లాంఛీకి ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం... శుక్రవారం చంద్రబాబు, మంత్రులు ఉన్నతాధికారు దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక బోటులో గోదావరి పర్యటించి పుష్కర ఘాట్లను పర్యవేక్షించడానికి వెళ్లగా.. వారితో పాటే ఇంకో బోట్ లో మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే టూరిజం బోటు ప్రాంతం నుంచి విఐపి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీ ఘాట్‌లను పరిశీలించి కొవ్వూరు వస్తుండగా అదే సమయంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న లాంచీని మీడియా లాంచ్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు కానీ మీడియా బోటు స్వల్పంగా దెబ్బతింది. కాగా కోటి లింగాల రేవు ఘాట్ వద్ద కూడా సీఎం లాంచి మట్టిలో చిక్కుకొని ఓవైపు ఒరిగిపోయింది.