తన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సుప్రీంకు రోజా...

  వైసీపీ ఎమ్మెల్యే రోజా తనపై విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో ఆమె హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో.. ఆమె హైకోర్టులోని సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే దీనిపై ఈ నెల 8వ తేదీన వాదనలు వింటామని సింగిల్ బెంచ్ చెప్పింది. దీంతో వాదనలు విన్న సింగిల్ బెంచ్ హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని కౌంటర్ పిటిషన్‌కు ఆదేశించింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో సమావేశమై, హైకోర్టుకు నివేదిక అందించారు. దీనిపై బుధవారం కేసు తీర్పు వెల్లడి కానుంది. కాగా మార్చి 5 నుంచి ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ సస్పెన్షన్ కారణంగా ఎమ్మెల్యే రోజాను అనుమతించడం లేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

బైక్ నడుపుకుంటూ పార్లమెంట్ కు వచ్చిన మహిళా ఎంపీ...

ఈ రోజు మహిళా దినోత్సవం సందర్బంగా ఈ రోజు పార్లమెంట్లో మహిళా ఎంపీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలువు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీ మాత్రం వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. బిహార్ ఎంపీ రంజీత్ రంజన్ హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై వచ్చి అందరూ అవాక్కయ్యేలా చేశారు. మహిళలు ప్రతి అంశంలోనూ ముందంజలో ఉన్నారన్న విషయాన్ని ఆమె మరోసారి రుజువు చేశారు. కాగా బీహార్‌లోని రంజీత్ రంజన్‌ సుపౌల్ నియోజకవర్గానికి చెందిన వారు. ఆమె భర్త పప్పూ యాదవ్ కూడా ఎంపీనే.

ఐఫోన్ కోసం పసికందుని అమ్మిన తండ్రి

  ఐఫోన్‌ కొనుక్కునేందుకు డబ్బుల్లేక కిడ్నీలు అమ్ముకున్న వార్తలు విన్నాము, రక్తాన్ని అమ్ముకున్న విషయాలు చదివాము. కానీ ఐఫోన్‌ పిచ్చిలో పడి కన్నకూతురినే అమ్ముకున్న ఓ వార్త ఒకటి ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. చైనాలోని ఫుజియాన్ అనే ప్రాంతానికి చెందిన ఒక 19 ఏళ్ల వ్యక్తి... మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఐఫోను, బండి కొనుక్కునేందుకు తన 18 రోజుల పాపను దాదాపు రెండు లక్షలరూపాయలకు అమ్మేశాడట. ఈ అమ్మకం ఆన్‌లైన్లోనే జరిగినప్పటికీ అటుతిరిగీ ఇటుతిరిగీ విషయం పోలీసుల వరకూ చేరడంతో, పాప తల్లిదండ్రులిద్దరినీ అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసుని విచారించిన సదరు న్యాయమూర్తికి చిరాకేసి తండ్రికి మూడు సంవత్సరాలు, తల్లికి రెండున్నర సంవత్సరాల కారాగార శిక్షను విధించాడు. ఇంత జరిగినా పసిపాప తల్లి పెద్దగా బాధపడకపోవడం పోలీసుకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘పిల్లల్ని పెంపకం కోసం ఎవరికో ఒకరికి ఇవ్వడంలో తప్పులేదనీ, అది చట్టవ్యతిరేకం అని తనకు తెలియదనీ’ సదరు మాతృమూర్తి పేర్కొంటో్ందట. కలికాలం!

ఈపీఎఫ్ పై పన్ను ఉపసంహరణ... నా ఒత్తిడి వల్లే అంటున్న రాహుల్..

  కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్ పై పన్ను విధించడాన్ని ఉపసంహరిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా వల్లే.. మోడీ ప్రభుత్వం ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకుందంటూ చెబుతున్నారు. అరుణ్ జైట్లీ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో.. ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణ 40శాతం మించితే పన్ను విధిస్తామని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగుల నుండి విమర్శలు కూడా వచ్చాయి. ఇక రాహుల్ గాంధీ కూడా దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించారు. దీంతో అరుణ్ జైట్లీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో.. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటున్నారు. కేంద్ర మధ్యతరగతి ప్రజల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసింది.. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చా.. నా ఒత్తిడి ఫలించింది..అని అన్నారు.

తునిఘటనలో వైకాపా పాత్ర బయటపడిందా!

  ఈ ఏడాది జనవరి 31న తునిలో జరిగిన కాపు గర్జన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ రోజున తునిలో శాంతియుతంగా సాగుతున్న సమావేశం కాస్తా ఊహించని మలుపు తీసుకోవడం నిఘావర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనలో వందలాదిమంది గాయపడగా, అటువైపుగా వస్తున్న రత్నాచల్‌ రైలు అగ్నికి ఆహుతైపోయింది. అదీఇదీ అని విచక్షణ లేకుండా ఆందోళనకారులు కనిపించిన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేసిపారేశారు. తుని యావత్తూ వారం రోజులపాటు భయంతో మునిగిపోయింది. ఈ విధ్వంసం అనుకోకుండా జరిగింది కాదనీ, దీని వెనుక వైకాపా హస్తం ఉందనీ మొదటినుంచీ తెదెపా ఆరోపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. వైకాపాకు చెందిన ముఖ్యనేత భూమన కరుణాకరరెడ్డి, ముద్రగడతో తరచూ సంభాషించేవారనీ, తుని ఘటన జరిగిన రోజున భూమన స్వయంగా 40 మంది వ్యక్తులను తునికి పంపారనీ విచారణలో తేలినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజిలనీ, కాల్ డేటాలనీ ఈపాటికే పోలీసులు సేకరించారట. ఈ విషయమై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు త్వరలో భూమన కరుణాకరరెడ్డిన సీఐడీ పోలీసులు విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

టీవీ చానెల్ యాంకర్ కు 370 కోట్లు నష్టపరిహారం

టీవీ చానెల్ యాంకర్ కు నష్టపరిహారంగా దాదాపు రూ.370 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇంత నష్టపరిహారం కొట్టేసిన ఆ యాంకర్ ఎవరనుకుంటున్నారా.. అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ చానెల్ యాంకరైన ఎరిన్.. వివరాల ప్రకారం..  ఎరిన్ ఆండ్రూస్ కు గొప్ప ఊరట లభించింది. 2008లో ఈఎస్‌పీఎన్ చానెల్‌కు పనిచేస్తున్నప్పుడు ఎరిన్ ఓ ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కవర్ చేయడం కోసం వెళ్లింది. అయితే అక్కడ ఆమె అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ సమీపంలోని మారియట్ నేష్‌విల్లే హోటల్‌లో బసచేసింది. ఈ నేపథ్యంలో తాను దుస్తులు మార్చుకుంటుండగా మైకేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి రహస్యంగా వీడియో తీశాడు. అంతేకాదు అక్కడితో ఆగకుండా దానికి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. కానీ ఈ పని ఎరినే కావాలని చేసిందని.. ఫ్రీ పబ్లిసిటీ కోసం తాను ఇదంతా చేసిందని విమర్శలు తలెత్తాయి. దీంతో ఎరిన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఇన్ని సంవత్సరాలకు గాను ఎరిన్ కు కోర్టులో ఊరట లభించింది. తనను ఇన్ని సంవత్సరాలు మానసిక క్షోభకు గురిచేసినందుకుగాను  నష్టపరిహారంగా ఎరిన్ కు 55 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.370 కోట్లు) చెల్లించాలని తీర్పుచెప్పింది.

కన్నయాను నిలదీసిన ప్రొఫెసర్‌!

  మకరంద్‌ పరాంజపేయ్‌- జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆంగ్లోపన్యాసకుడు. పరాంజపేయ్ ఒక కవి కూడా! ఆయన నిన్న విద్యార్థులతో మాట్లాడుతూ జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయాకుమార్‌ మీద నేరుగా విరుచుకుపడ్డారు. పరాంజపేయ్‌ ఉపన్యాసానికి కన్నయా తదితరులు తరచూ అడ్డుతగులుతూనే ఉన్నా ఆయన తను అనాలనుకున్న నాలుగు మాటలనూ అనేసి కూర్చున్నారు. కన్నయాకుమార్‌ విడుదలైన తరువాత చేసిన ఉత్తేజపూరతి ప్రసంగంలో చాలా చారిత్రక అసత్యాలు ఉన్నాయని పేర్కొన్నారు పరాంజపేయ్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత గోల్వార్కర్‌, ఇటలీ నియంత ముస్సోలినీని కలిశారని కన్నయా చెప్పడం అలాంటి అసత్యాలలో ఒకటని అన్నారు పరాంజపేయ్. ఒక వ్యక్తిని తీవ్రవాదం అనే ఆరోపణ మీద ఉరితీసినందుకు ఇంతగా మండిపడుతున్న మీకు, రష్యాను స్టాలిన్‌ పాలించే రోజుల్లో ఎన్ని లక్షల మందిని నిరాధారంగా చంపేశారో గుర్తుందా అంటూ నిలదీశారు. కమ్యూనిస్టులు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారని తరచూ చెప్పే కన్నయాకుమార్‌ అందుకోసం ఏదన్నా సాక్ష్యం చూపించగలరా అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు పాలించే చైనాలో కనీసం ఒక ఊరేగింపుని నిర్వహించే స్వాతంత్ర్యం కూడా లేదని, మరి ప్రజాస్వామ్యం మన దేశంలో కాకుండా మరెక్కడ ఉందని నిలదీశారు. మరి కన్నయాకుమార్‌ ఈ ప్రశ్నలకు ఏమని బదులిస్తాడో!

అమితాబ్ సంచలన వ్యాఖ్యలు... నేను క్షయవ్యాధిని

తాను ఒక క్షయవ్యాధిని అని.. ఆ వ్యాధి నుండి సురక్షితంగా బయటపడ్డాను అని అంటున్నాడు ఓ బాలీవుడ్ సూపర్ స్టార్. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరునుకుంటున్నారా.. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్..ప్రపంచ ట్యూబర్కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్షయవ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు అమితాబ్ నడుంకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాధికి నువ్వెందుకు సేవలు అందిస్తున్నావని చాలా మంది అడుగుతున్నారు.. దీనికీ ఓ హిస్టరీ ఉందని.. 2000లో నాకు ఈ వ్యాధి వచ్చింది.. దాదాపు సంవత్సరంపాటు చికిత్స చేయించుకొని నేను ఈ వ్యాధి నుండి బయటపడ్డానని అన్నారు.   అంతేకాదు నాకు ఈ వ్యాధి వచ్చినప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం చేస్తున్నాను.. అప్పుడు సరిగా కూర్చోలేకపోయేవాడిని.. ఆ బాధను బరించలేక రోజుకు 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని అని చెప్పారు. అయితే తాను ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి గల కారణాలు కూడా చెప్పారు.  ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది అని అన్నారు.

ఆటగాడి కోసం... అభిమానిని చంపేశాడు!

  అది ముంబైలోని మహేష్‌ అపార్ట్‌మెంట్స్‌- అందులోని ఒక ఫ్లాట్‌లో ఉండే దురుంచక్వా అనే నైజీరియా జాతీయుడిది మొన్న ఆదివారం పుట్టినరోజు. ఆ సందర్భంగా మరో నైజీరియా మిత్రుడైన నువాబుతో కలిసి పార్టీ చేసుకోవడం మొదలుపెట్టాడు. మాటల సందర్భంగా తమకు ఇష్టమైన ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇద్దరూ. పోర్చుగల్‌ తరఫున ఆడే రొనాల్డోనే గొప్ప ఆటగాడు అని ఒకరంటే, కాదు అర్జెంటీనా ఆటగాడైన మెస్సీనే గొప్ప అని మరొకరు వాదించారు. తాగింది తలకెక్కిందో ఏమో కానీ, వాదన మాత్రం హద్దులు దాటడం మొదలుపెట్టింది. దురుంచక్వా తన చేతిలో ఉన్న మందుగ్లాసును నువాబు మీదకు విసిరాడు. దాంతో కోపం తెచ్చుకున్న నువాబు, పగిలిన అద్దం ముక్కతో దురుంచక్వా గొంతుకోశాడు. అలా దురుంచక్వా పుట్టినరోజు వేడుక కాస్తా అతని ప్రాణాలను బలిగొంది. అభిమానం వెర్రితలలు వేస్తే, పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది.

ఒక్కసారే 150 మంది ఉగ్రవాదులు హతం..

  ఉగ్రవాదులపై అమెరికా సైన్యం ఉక్కుపాదం మోపింది. నిన్న మొన్నటి వరకూ ఇరాక్, సిరియాల్లో ఉన్న ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసిన ఈ సైన్యం..ఇప్పుడు ఆఫ్రికా గడ్డ మీద వైమానిక దాడులు చేసింది. గత కొద్ది కాలంగా తమ దాడులతో సొమాలియాను వణికిస్తున్న అల్ షబాబ్ సంస్ధపై కూడా అమెరికా సైన్యం వైమానికి దాడులు చేసింది. దీంతో దాదాపు 150 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో అంతమయ్యారని అమెరికా రక్షణ శాఖ విభాగం పెంటాగాన్ అధికారులు తెలిపారు. కాగా సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షణా బలగాల మీద దాడులు చెయ్యడానికి 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తున్నదని అమెరికా సైన్యం గుర్తించి.. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న స్థావరాల మీద అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది.

తాను చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ వివరణ.. అందరూ ఎంజాయ్ చేశారుగా..

సావిత్రి ఆడియో ఫంక్షన్లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఆడవారిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన బాలకృష్ణ తన చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకు స్త్రీలంటే ఎంతో గౌరవం.. నా వ్యాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి అంటూ కోరారు. నా సినిమాల్లో మహిళలను కించపరిచే సంభాషణలు ఉండవు అన్నారు. ఓ ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత నాకు తెలుసు అని.. అయినా నేను మాట్లాడుతుంటే స్టేజ్ మీద అందరూ ఎంజాయ్ చేశారు అంటూ వ్యాఖ్యానించారు.   కాగా సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ.. అమ్మాయిల వెంటపడే పాత్రలు తాను చేస్తే ఒప్పుకోరు కదా అంటూ ప్రశ్నిస్తూనే.. ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేయాలి.. అంతే కమిట్ అయిపోవాలి అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలసిందే.

జగన్ పై విరుచుకు పడుతున్న అధికార పార్టీ నేతలు.. కౌంటర్ కు ప్రతి కౌంటర్లు

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన.. రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారు.. మహిళా ఎమ్మార్వోపై దాడి చేసిన ఎమ్మెల్యేపై కేసులు లేవు.. అంగన్ వాడీ కార్యకర్తలపై దాడులు చేస్తే కేసులు లేవు.. విద్యార్ధి రితికేష్వరీ కామాంధులకు బలైపోయింది ఆ కేసుకు సంబంధిచిన వారిపై కేసులు లేవు.. నిజంగా రాష్ట్రంలో మహిళలను గౌరవిస్తున్నామా..? అని ప్రశ్నించారు.   దీంతో జగన్ మాటలకు మళ్లీ అచ్చెన్నాయుడు స్పందించి ఆయనకు గట్టిగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిపై విమర్శలకు దిగే నీచ స్థాయికి జగన్ వచ్చారు.. పాత విషయాలే ప్రస్తావిస్తున్నారు.. కొత్త విషయం ఒక్కటైనా ఉందా..? ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు.. సలహాలు, సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాం అని అన్నారు. దీంతో జగన్ మీరు చేసే అన్యాయాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మైకే కట్ చేసి తిట్టిస్తారా అని అన్నారు.   అంతేకాదు రావెల సుశీల్ అంశాన్ని కూడా జగన్ ప్రస్థావించారు. దీంతో రావెల స్పందించి.. తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే.. నా కుమారుడు సుశీల్ తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమే.. పరిటాల హత్య కేసులో జగన్ నిందితుడు.. అని వ్యాఖ్యానించారు.. దీనికి జగన్.. కొడుకు తప్పు చేస్తే నన్ను నిందిస్తున్నారు.. ఓ శాసనసభ్యుడి మాటలపై నేషనల్ ఛానెళ్లలో చర్చు జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. 

బీజేపీ పొత్తుపై పీడీపీ ఆసక్తికర వ్యాఖ్యలు.. బీజేపీతో పొత్తు నా తండ్రి వీలునామా..

  పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సయీద్ భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంపై గత కొద్ది రోజుల నుండి వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. ఒకానొక సందర్భంలో పీడీపీ, బీజేపీతో పొత్తు విరమించుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మెహబూబా ముఫ్తీ సయీద్ పొత్తుపై మాట్లాడుతూ బీజేపీతో పొత్తు అనేది తన తండ్రి దివగంత ముఫ్తీ మహ్మద్ సయీద్ జీవించివుండగా రాసిపెట్టిన వీలునామా అని..  తన తండ్రి మాట శిలాశాసనం లాంటిదని, ఆయన మాట జవదాటబోమని అన్నారు. బీజేపీతో సంకీర్ణ సర్కారు అన్నది మా తండ్రి తీసుకున్న నిర్ణయం అని.. ఒక తండ్రి పిల్లలకు వీలునామా రాశాడంటే... దాన్ని అమలుపరచడం ద్వారా వాళ్లు నాశనమైపోయినా సరే... దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని..ఈ పొత్తువల్ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా నాశనమైనప్పటికీ అధైర్యపడి వెనుకంజ వేయబోమని స్పష్టంచేశారు. దీంతో పీడీపీ, బీజేపీ తో పొత్తు ఓకే అయినట్టు తెలుస్తోంది.

మరో వివాదంలో స్మృతీ ఇరానీ.. చేతులు జోడించినా వెళ్లిపోయారు..

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వచ్చిపడుతున్నాయి. రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మరో వివాదంలో స్మృతీ ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. స్మృతీ ఇరానీ శనివారం రాత్రి యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా ఆమె కాన్వాయ్ ద్విచక్రవాహనంను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన కుమార్తె స్మృతీ పై సంచలనమైన ఆరోపణలు చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత వైద్య సహాయం అందించడానికి మంత్రి ముందుకు రాలేరని.. కారు దిగి బయటకు వచ్చారని, రక్తం కారుతున్న స్థితిలో తాను చేతులు జోడించి తాము ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించాలని వేడుకుంటే ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. పిల్లలు సహాయం కోసం అర్థిస్తున్నా మంత్రి స్మృతి ఇరానీ చూసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె సోదరుడు అభిషేక్‌ ఆరోపించాడు. దీంతో అభిషేక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు.   ఇదిలా ఉండగా జరిగిన ఈ ఆరోపణలకు మంత్రి కార్యాలయం స్పందించి.. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని.. మంత్రి కారు వల్ల ప్రమాదం జరగలేదని ఎస్‌ఎస్‌పీ రాకేష్‌ సింగ్‌ తెలిపారు.

జగన్, అచ్చెన్నాయుడు మధ్య వాగ్వాదం.. మాట్లాడే హక్కు లేదు..

  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. మంత్రి అచ్చెన్నాయుడు కి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. బొగ్గు నుంచి కరెంట్ వరకు రాష్ట్రంలో కుంభకోణం జరిగిందని.. ఎల్ఈడీ బల్పుల కొనుగోలులో స్కాం జరిగిందని అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందించి.. విద్యుత్ ఆదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బుల ఉపయోగాన్ని పెంచామని, వీధి దీపాలు పెట్టామని.. అన్నారు. జగన్, వైసిపి నేత బొత్స సత్యనారాయణ వంటి వారికి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు లేదని.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.