విజయ్ మాల్యాపై వర్మ కామెంట్లు.. క్యాలెండర్‌ గర్ల్స్‌ను ఇస్తే సరిపోతుంది..

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలు.. వివాదాస్పద వ్యాఖ్యలు అంటేనే రాంగోపాల్ వర్మ.. టాపిక్ ఏదైనా కానీ.. వ్యక్తి ఎవరైనా కానీ ఏదో ఒకటి అననది రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. తాజాగా ఆయన దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న విజయ్ మాల్యాపై కూడా నాలుగు కామెంట్లు విసిరారు. బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్‌ గర్ల్స్‌ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకుకు ఇవ్వాలని, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అన్నాడు. అక్కడితో ఆగాడా.మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్‌ గర్ల్స్‌ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే మరి వారు రుణం తీర్చాలి కదా.. అని మాల్యా ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించకపోవచ్చు.. కాని బ్యాంకర్లు అంగీకరిస్తారు.. అంటూ చురకలేశారు.

నారాయణ సంచలన వ్యాఖ్యలు.. విజయ్ మాల్యాను చంపబోయి మాగంటిని చంపారు

సిపిఐ నాయకుడు నారాయణ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయడం పరిపాటే. ఇప్పుడు తాజాగా విజయ్ మాల్యా వ్యవహారంలో కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌మాల్యాకు, మాగంటి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని.. నక్సలైట్లు విజయ్ మాల్యాను చంపాలని ప్రయత్నించి వీలుకాక మాగంటి సుబ్బిరామిరెడ్డిని చంపారని అన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శల బాణాలు సంధించారు. బ్యాంకర్లకు, విజయ్‌మాల్యాకు మధ్య గతంలో కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నడిపిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మాగుంట సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారని ఆరోపించారు. 

ఐశ్వర్యరాయ్ ది గుంటూరు జిల్లానా..!

ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు తప్పిదాలు చేస్తుంటారు అది సహజం.. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకంది. హెల్త్ కార్డు ఒక ఫ్యామిలీ ఫొటోకు బదులు బాలీవుడ్ నటి అందాల తార ఐశ్వర్యరాయ్ ది వచ్చి చేరింది. వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవల హెల్త్ కార్డు ఇస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గంగుపల్లి తాండాకు చెందిన బాణావత్ బాద్యుకు కూడా హెల్త్ కార్డు మంజూరైంది. కాకపోతే తమ ఫ్యామిలీ ఫొటోకి బదులు ఐశ్వర్యరాయ్ ఫొటో రావడం చూసి ఖంగుతిన్నారు. దీంతో ఆ కుటుంబసభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇదే నిదర్శనమని అంటున్నారు.

కొరియాను కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం చిక్కబడుతోంది. ఈ ఏడాది మొదట్లో ఉత్తర కొరియా అణ్వాస్త్రాన్ని పరీక్షించడంతో మొదలైన ఈ ఉద్రక్తత ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియా దూకుడుని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి పలు ఆంక్షలను విధించినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్‌ మరిన్ని సవాళ్లకు సిద్ధపడుతున్నారు. తరచూ పలు క్షిపణులను పరీక్షించడమే కాకుండా, ఆ క్షిపణులకి అణ్వాస్త్రాలను మోసుకుపోయే శక్తి కూడా ఉందంటూ కవ్విస్తున్నారు. దాంతో దక్షిణ కొరియాకు మిత్రరాజ్యమైన అమెరికా రంగంలోకి దిగింది. తన యుద్ధ విమానాలు కొన్నింటిని ఇప్పటికే దక్షిణ కొరియాకు పంపింది అమెరికా. ఆ ప్రాంతంలో ఇరు దేశాల బలాన్ని చాటేందుకు ఇప్పడు దక్షిణ కొరియా తీరంలో తన నౌకలను కూడా మోహరించింది. ఈ నౌకలు మరో రెండు నెలల పాటు దక్షిణ కొరియా తీరంలో కవాతుని నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు ఉత్తరకొరియా కూడా తాను యుద్ధానికి సదా సిద్ధం అంటోంది. తమ నేత కిమ్ జోంగ్‌ ఆదేశాలివ్వడమే ఆలస్యం, ప్రత్యర్థుల మీద విరుచుకుపడిపోతామని ఆ దేశ సైన్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తమ అణ్వాయుధాలన్నీ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా వాటిని ఉపయోగిస్తామని అంటున్నారు.

భర్త చేసినా అత్యాచారమే.. వారిని శిక్షించాలి..

రేప్ ఎవరు చేసినా అది రేప్ అవుతుంది.. అది భర్త అయినా ఇంకెవరయినా కానీ.. అలాంటి వారికి శిక్ష వేయాల్సిందే అంటున్నారు జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు రేఖా శర్మ. భారతీయుల విషయంలో భార్యాభర్తల సంబంధాలను అత్యాచారంగా పరిగణించడం సరికాదని.. భార్యాభర్తల మధ్య అత్యాచార ఘటనగా పరిగణించలేమని రాజ్యసభలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంపై ఆమె స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. కనీసం జంతువుల సంరక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి.. అలాంటిది ఆడవాళ్లకు రక్షణ వద్దా.. వివాహాం అనే ముసుగులో భార్యను భర్త చిత్ర హింసలు పెట్టడం అమానుషం.. ఎవరు అత్యాచారం చేసినా అత్యాచారమే. భర్త అయినా మరొకరయినా ఒకే శిక్ష వేయాలి' అని రేఖా శర్మ ట్వీట్ చేశారు.

యువతిని వేధిస్తున్న కేసులో జనసేన పార్టీ సభ్యుడి అరెస్ట్..

ఓ యువతిని వేధిస్తున్నాడు అంటూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వైనం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్టణానికి చెందిన చంద్రశేఖర్ సాకేటి సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఫేస్ బుక్ లో  హైదరాబాదు నగరానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో హైదరబాద్ వచ్చినప్పుడల్లా చంద్రశేఖర్ ఆమెను కలిసేవాడు. అయితే ఆ అమ్మాయి చనువును అవకాశంగా తీసుకున్న అతను మొదట ప్రేమ, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో చంద్రశేఖర్ వారిద్దరూ కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలు, అసభ్యకరమైన మెసేజ్ లు.. కామెంట్లు పోస్ట్ చేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని పట్టుకున్నారు.

బ్యాంకులకు కాస్త రిలీఫ్.. ఇంకా రూ.5,500 కోట్ల ఆస్తులు

విజయ్ మాల్యాకు అప్పులిచ్చి ఇరకాటంలో పడ్డ్ బ్యాంకులకు కాస్త ఊరట లభించే విషయం ఒకటి బయట పడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తన ఆస్తలు గ్యారంటీగా పెట్టి అప్పులు తీసుకున్న విజయ్ మాల్యాకు ఇంకా రూ.5,500 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయన్న విషయం తాజాగా వెలుగు చూసింది. దీంతో బ్యాంకులు కొంచం రిలీఫ్ అయ్యాయి. ఇప్పటికే మాల్యా తమకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను విక్రయించిన బ్యాంకులు రూ. 1,200 కోట్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఆస్తులను కూడా బ్యాంకులు అటాచ్ చేసి కొంత మేర రుణాలను రాబట్టుకునే ప్రయత్నాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాకట్టు పెట్టని ఆస్తులను స్వాదీనం చేసుకునే హక్కు లేకపోయినా కోర్టును ఆశ్రయించి తద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.   ఇక మాల్యా కూడా ఎలాగూ దేశం విడిచిపోయినట్టు తెలుస్తోంది కాబట్టి కోర్టు ఆ ఆస్తులను జప్తులను చేసి..వేలం వేసి వచ్చిన సొమ్ముతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్ బకాయిలు తీర్చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

చనిపోయిన భార్య- టీవీలో కనిపించింది

మొరాకో దేశంలో నివసించే అబ్రగ్‌ మొహమ్మద్‌ భార్య రెండేళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చిన అబ్రగ్, వైద్యానికి అయ్యే ఖర్చులను పోగేసుకుని ఆసుపత్రికి చేరుకునేసరికి, భార్య చనిపోయిందని చెప్పారు వైద్యులు. చెప్పడమే కాదు, అతని భార్యదేనంటూ ఓ శవపేటికను కూడా అందించారు. అబ్రక్‌ దానిని తన సొంత ఊరికి తీసుకువెళ్లి సమాధి చేసేశాడు కూడా! కానీ ఈమధ్య ఓ టీవీ కార్యక్రమంలో తన భార్య కనిపించడంతో అబ్రగ్‌కి మతిపోయింది. తప్పిపోయినవారిని తిరిగి తమ బంధువుల దగ్గరకు చేర్చే ఆ కార్యక్రమంలో, తాను రెండేళ్ల క్రితం తన భర్త నుంచి దూరమయ్యానంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి భార్యాభర్తలు ఇద్దరూ ఓ చోటకి చేరినప్పటికీ... రెండేళ్ల క్రితం ఏం జరిగి ఉంటుందన్నది మాత్రం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. అన్నింటికీ మించి అబ్రగ్‌ పాతిపెట్టిన శవం ఎవరిదంటూ ఇప్పుడు పరిశోధన మొదలైంది.

టీఆర్ఎస్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..

టీడీఎల్పీనేత రేవంత్ రెడ్డి అదికార పార్టీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. గతంలో ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునే రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నాలుగో వరసలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  సభలో విపక్ష నేతగా తనకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నాలుగో వరుసలో కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే తనపై కక్ష్య సాధిస్తుందని.. మాకూ మంచి రోజులు వస్తాయి అని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకూ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇంక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

చంద్రబాబుపై అప్పుడే ఎర్రబెల్లి సంచలన కామెంట్లు..

ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరి ఆపార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. స్పీకర్ కూడా వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించారు. అయితే ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేసింది పార్టీ ఫిరాయింపు కాదని.. పార్టీ శాసనసభాపక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేశామని తెలిపారు. అయినా గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావును గద్దె దించి చంద్రబాబు సీఎం అయిన తీరుతో పోలిస్తే... మేం చేసింది ఎంత? అని ఆయన మీడియాకే ఎదురు ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ లోకి వస్తానంటూ తాను ఏ ఒక్క నేతకు కూడా ఫోన్ చేయలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు పొరపాటే.. తాపీగా సీబీఐ

  ఒకపక్క పార్లమెంట్లో విజయ్ మాల్యా వ్యవహారంపై అధికార.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అంతేకాదు విజయ మాల్యా దేశం విడిచి పారిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే సహరించిందని విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాల్యా దేశం విడిచిపోతుంటే సీబీఐ చోద్యం చూస్తుందా అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. అందరూ విమర్శలు చేస్తుంటే ఇప్పుడు తాపీగా సీబీఐ ఓ విషయం చెబుతుంది. అసలు విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు జారీ చేయడమే తమ పొరపాటని..  కింది స్థాయి అధికారి వల్ల జరిగిన ఓ పొరపాటు కారణంగా విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగిందని.. డిసెంబర్ 9, 10వ తేదీలలో ఢిల్లీలో, డిసెంబర్ 12వ తేదీన ముంబైలో ప్రశ్నించినప్పుడు మాల్యా తమకి సహకరించాడని సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల మంటలపై ఇంకా ఆజ్యం పోసినట్టు అయింది. ఇప్పటికే సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే దీనికి తోడు ఆసమయంలో ఈవ్యాఖ్యలు చేసి మరింత దుమారానికి దారి తీశారు. మరి ప్రతిపక్షనేతలు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూడాలి.

అధార్ చట్టబద్దత వల్ల ఉపయోగాలే.. బిల్లును పరిశీలనకు పంపాలి

ఆధార్ చట్టబద్దత కు లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ అధార్ చట్టబద్దత వల్ల ఉపయోగాలే కాని.. నష్టాలు లేవని చెబుతున్నారు. పౌరులకు ప్రభుత్వ సబ్సడీలు, ప్రయోజనాలు, సేవలు పారదర్శకంగా అందించేందుకు ఆధార్ కు చట్టబద్దత కల్పించేందుకు బిల్లును రూపొందించినట్టు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం బిల్లును పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. దానికి ప్రభుత్వం మాత్రం.. 2010లో యూపీఏ ప్రభుత్వం ఆధార్ బిల్లును ఆమోదించి సభలో ప్రవేశపెట్టిందని, అప్పుడు అధ్యయనం చేశారు.. కావున ఇప్పుడు మళ్లీ పంపించాల్సిన అవసరం లేదని.. యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులో లోపాలను సవరించి తాము కొత్తగా ఇప్పుడు మళ్లీ ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

పారిపోయిన విజయ్ మాల్యా.. అల్లరి నరేశ్ కి చిక్కాడు..!

వేల కోట్లు రూపాయలు బ్యాంకులకు టోకరా వేసి.. పార్లమెంట్లో దుమారానికి కారణమైన విజయమాల్యా ప్రస్తుతం దేశం విడిచిపోయారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినీ నటుడు అల్లరి నరేశ్ విజయ్ మాల్యాతో ఫొటో తీసుకొని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎవ్వరికి చిక్కని విజయ్ మాల్యా నాకు చిక్కాడు అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. అదేంటీ అల్లరి నరేశ్ కు విజయ్ మాల్యా ఎక్కడ చిక్కారనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఇటీవల మాల్యా విదేశాలకు వెళ్లే క్రమంలో అల్లరి నరేశ్ కు తారసపడగా అక్కడ నరేశ్ సెల్పీ తీసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ మాల్యా వ్యవహారం దేశం మొత్తం హాట్ టాపిక్ కాగా నరేశ్ ఇలా ఫొటో పోస్ట్ చేసి అందరికి షాకిచ్చి.. కామెడీ చేసేశాడు.

కన్నయ్యకు బెదిరింపుల పోస్టర్.. నేను కాలుస్తాను

  జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ పై ఇప్పటికే దేశద్రోహి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అతనికి చంపేస్తే రూ.11 లక్షలు ఇస్తామంటూ గతంలో పోస్టుర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బెదిరింపులతో కూడిన పోస్టర్లు వస్తున్నాయి.  కన్నయ్యకుమార్‌, విద్యార్థులు ఉమర్‌ ఖలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలు దేశ ద్రోహులు.. వారిని కాల్చి చంపడం జాతి ధర్మం.. దేశంలో ఉంటూ దేశానికి వెన్ను పోటు పొడిచేవారు.. ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు వారిని నేను కాలుస్తాను అంటూ పోస్టర్ ఒకటి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కనిపించినట్టు చెబుతున్నారు. అంతేకాదు ఈ పోస్టర్ బల్బీర్‌ సింగ్‌ భారతీయ అనే పేరుతో ఉంది. పోస్టర్‌లో అతడి ఫోన్‌ నెంబరు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో కూడా ఉంది. పోలీసులు ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా..  ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి తాను యమునా బజార్‌లో దుకాణం నిర్వహిస్తానని, నిన్న జంతర్‌మంతర్‌ వద్దకు వచ్చానని మాత్రమే చెప్పాడని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతన్నామని తెలుపుతున్నారు.

ఇస్లాం మతంపై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా అంటే గిట్టదు..

అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇస్లాం మతం.. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోమారు నోరు జారారు. సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన.. ఇస్లాం మతానికి అమెరికా అంటే గిట్టదని నాకు అనిపిస్తోంది.. అమెరికన్లను వ్యతిరేకించే వారిని దేశంలోకి అనుమతించరాదని..  తీవ్రవాద భావజాలాన్ని నింపే ఇస్లాంపైనే అమెరికా యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఏమనుకున్నాడో ఏమో.. రాడికల్ భావాలున్న ఇస్లాం గురించి తాను చెపుతున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో తన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న ట్రంప్.. ఇప్పుడు ఈవ్యాఖ్యలతో ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో.

రోజాకు మళ్లీ చుక్కెదురు.. మేము విచారించలేము

వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సస్పెన్షన్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా రోజాకు నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. రోజా పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా.. రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు ప్రారంభించడానికి నిలబడగానే... ‘‘ఈ కేసును మేము విచారించలేము.. సోమవారం వేరే బెంచ్‌ విచారిస్తుంది’’ అని న్యాయమూర్తి ఖెహర్‌ బదులిచ్చారు. దీనికి ఇందిరా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితమే కేసు విచారణకు వస్తుందనుకున్నాము కానీ రాలేదని తెలిపారు. కాగా స్పీకర్ తనపై విధించిన సస్పెషన్ ను సవాల్ చేస్తూ రోజా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆమెకు చుక్కెదురవడంతో సుప్రీం ను ఆశ్రయించిన సంగతి విదితమే. మొత్తానికి రోజాకు స్టే వచ్చేసరికి అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోతాయేమో..

ప్రారంభమయిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 2700 పోస్టులకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కరువు, రైతు సమస్యలపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలో వేలాది పోస్టులు ఖాళీలున్నాయి.. విద్యా ప్రమాణాలు పెంచాలంటే ఆ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.   దీనికి ఈటెల రాజేందర్ స్పందించి.. ఏడాది లోపు ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తాం.. 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. కార్పోరేషన్లలో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం.. ఉద్యోగాల భర్తీని డబ్బుల కోణంలో ప్రభుత్వం చూడటం లేదు.. రెసిడెన్షియల్ స్కూళ్లలో 2700 పోస్టులకు ఆమోదం తెలిపాం అని అన్నారు.

రాజీవ్‌ను చంపడం తప్పే... ఎల్టీటీఈ నేత పశ్చాత్తాపం

‘భారత మాజీప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టనపెట్టుకోవడం తాము చేసిన అతి పెద్ద తప్పు’ అని ఒకనాటి ఎల్టీటీఈ నేత బాలసింగం పేర్కొన్నారు. తను చనిపోయే ముందు ఈ విషయాన్ని నార్వే దౌత్యవేత్త ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. తాము రాజీవ్‌గాంధిని చంపిన విషయం ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ తొలుత అంగీకరించలేదని, కానీ తరువాత వారు ఒప్పుకోక తప్పలేదని చెప్పుకొచ్చారు బాలసింగం. అసలు రాజీవ్‌ను చంపాలన్న నిర్ణయం ప్రభాకరన్ ఎందుకు తీసుకున్నారో కూడా బాలసింగం వెల్లడించారు. 1987-90ల మధ్య కాలంలో రాజీవ్‌గాంధి శ్రీలంకలో శాంతిని స్థాపించేందుకు కొంత సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం చేతిలో చాలామంది ఎల్టీటీఈ తీవ్రవాదులు హతులైపోయారు. మళ్లీ రాజీవ్‌గాంధి కనుక ప్రధానమంత్రి పదవిని చేపడితే ఆనాటి సంఘటనలు పునరావృతం అవుతాయన్న భయంతో, ఆయనను పొట్టనపెట్టుకున్నామన్నది బాలసింగం మాట. ఈ విషయాలన్నీ కూడా మార్క్ సాల్టర్ అనే రచయిత తన ‘టు ఎండ్ ఏ సివిల్ వార్’ పుస్తకంలో పేర్కొన్నాడు. 549 పేజీల సుదీర్ఘమైన ఈ పుస్తకంలో శ్రీలంకలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన తమిళ-సింహళీయుల మధ్య పోరాటాన్ని, దానికి ముగింపు పలికేందుకు నార్వే నేతృత్వంలో సాగిన శాంతి ప్రక్రియ వివరాలనీ పొందుపరిచారు. రాజీవ్‌ను చంపాలన్న ఆలోచన తప్పని, అప్పుడే ఎల్టీటీఈ నేతల మనసుకి తట్టి ఉంటే ఎంత బాగుండేదో!