గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది.. దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ రైలు

  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలును ప్రారంభించారు. ఈ హైస్పీడు రైలు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలు హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ నుంచి ఆగ్రా స్టేషన్‌ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకుంటుంది. అయితే ఈ రైలు ఒక్క శుక్రవారం తప్పా మిగిలిన అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది.     కాగా గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలులో  ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

చంద్రబాబు తొక్కేస్తున్నారు అంటున్న బీజేపీ నేతలు..

  పేరుకు  టీడీపీ- బీజేపీ పార్టీలు మిత్రపక్షాలు.. కానీ ఈ పార్టీల మధ్య విబేధాలు బయటపడుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించడం.. మొదట సెలైంట్ గా ఉన్నా ఆ తరువాత టీడీపీ నేతలు కూడా తిరిగి బీజేపీ నేతలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అప్పటినుండి ఇప్పటి వరకూ ఏదో ఒక విషయంలో తరుచూ వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక ఈ రెండు పార్టీలు కలిసి ఉండబోవని కూడా అనుకున్నారు. కానీ ఇప్పటివరకైతే కలిసే ఉన్నాయి. అయితే టీడీపీ పై బీజేపీ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉందని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే విజయవాడలో బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు టీడీపీ వైఖరిపై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఉద్దేశ్యపూర్వకంగా టిడిపి దుష్ప్రచారం చేస్తోందని.. దీనిని తిప్పికొట్టకపోతే బిజెపి శ్రేణుల్లో అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇంకా బిజెపి వారిని టిడిపి తొక్కేస్తోందని, తొక్కించికుంటూ ఇంట్లో పడుకుందామా, జనంలోకి వెళ్దామా అని మరికొందరు ఘాటుగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ఐడియా ఆదిరింది..! ఆర్టీసీ బస్సులో కూలర్లంట

  వేసవి కాలం వచ్చేసింది, రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ప్రజలు అడుగుతీసి అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. మరి ఇలాంటి ఎండలో దూర ప్రాంతాలకు ప్రయాణం సాగించేవారి పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. ఆర్టీసీ స్థాపించినప్పటి నుంచి బస్సు వివిధ రకాలుగా రూపాంతరం చెందాయి. ప్యాసింజర్,ఎక్స్‌ప్రెస్‌ల నుంచి ప్రయాణం సుఖంగా సాగడానికి డీలక్స్, సెమీ లగ్జరీ, లగ్జరీ, ఫుష్ బ్యాక్ ఇలా చాలా రకాలుగా బస్సులున్నాయి. అయితే వీటిలో సామాన్యులు ప్రయాణించడానికి వారి ఆర్థిక పరిస్థితులు సహకరించవు. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న ప్రయోగం చేసింది.   సాధారణ ప్యాసింజర్ బస్సులో కూలర్లు ప్రవేశ పెట్టారు అధికారులు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డిపోకు చెందిన సిబ్బంది తమ సొంత ఖర్చు 30 వేల రూపాయల వ్యయంతో బస్సులో ఎయిర్ కూలర్లను అమర్చారు. ఏసీ అంత ఫీల్ రాకున్నా..ఎండ వేడిమి నుంచి కాస్తలో కాస్త ఉపశమనం పొందడానికి ఈ ప్రయత్నం మాత్రం విజయవంతమయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సు జగిత్యాల నుంచి హైదరాబాద్‌కి వస్తుంది. ఈ బస్సులో ప్రయాణించడానికి ప్రయాణికులు క్యూకడుతున్నారు.

అదంతా భారత్ ఆడిన డ్రామా.. పాకిస్థాన్

  పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి గురించి పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని పాకిస్థాన్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం పర్యవేక్షించి పఠాన్ కోట్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అసలు తమ దేశానికి చెందిన వారేనని చెప్పే ఆధారాలను భారత్ తమకు అందజేయలేదని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు భారత ఎన్ఐఏ అధికారులు తమకు కేవలం 55 నిమిషాలు మాత్రమే ఎయిర్ బేస్లోకి అనుమతించారని, కేవలం నడిచేందుకు సరిపోయింది తప్ప ఆధారాలు సేకరించేందుకు వీలుకాలేదని చెప్పింది.   ఇప్పుడు మరోసారి పాకిస్థాన్ మీడియా ఇండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఉగ్రదాడి ఘటన భారత్ ఆడిన నాటకమని.. భారతే ఈ దాడికి పాల్పడిందని.. పాకిస్థాన్ పై విష ప్రచారం చేసేందుకే ఇండియా నాటకమాడుతుందంటూ..  పాకిస్థాన్ దర్యాప్తు బృందం చెప్పిందంటూ ఓ ప‌త్రిక పేర్కొంది. ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే సాయుధులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయని, అయితే అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి, ప్రపంచం ముందు పాక్ ను ఉగ్రవాద దేశంగా చిత్రించడం కోసమే మూడురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించార‌ని పాక్ మీడియా పేర్కొంది. దాడి చేసిన వారు పాకిస్థాన్ నుంచి వచ్చినట్టుగా భారత్ నిరూపించలేకపోయిందని పాక్ సంయుక్త దర్యాప్తు బృందం అభిప్రాయపడినట్టు పత్రిక పేర్కొంది. మరి పాకిస్థాన్ మీడియా చేసిన ఈ వ్యాఖ్యలకు భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

లోకేశ్ ను.. రాహుల్ లా కాదు కేటీఆర్ లా తీసుకురావాలి

  ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. తండ్రి బాటలోనే తాను కూడా మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లోకేశ్ గతంలో కంటే ఇప్పుడు కాస్త బెటరే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా లోకేశ్ ను  ఏపీ కేబినెట్లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు కూడా చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.జూన్ నెలలో ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో అప్పుడు లోకేశ్ ను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.   ఇదిలా ఉండగా లోకేశ్ రాకపై టీడీపీ నేతలు బాబుకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విషయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన తప్పిదాన్ని లోకేష్ విషయంలో జరగకుండా చూడాలని కొందరు పార్టీ సీనియర్లు సీఎం చంద్రబాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎందుంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అంతంగా పట్టించుకోలేదని.. అధికారపీఠానికి కాస్త దూరంగా ఉన్నారని.. అలా కాకుండా ముందే నుండే ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండి ఉంటే రాహుల్ రాజకీయ స్థాయి పెరిగి ఉండేదని.. ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు అధికార బాధ్యతలు చేపడితే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. అంతేకాదు కేసీఆర్.. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా తన కొడుకు, కూతురు, మేనల్లుడిని ముందు నుండే ప్రభుత్వంతో మమేకం చేశారు.. ఇప్పడు వారికి జనాదారణ కూడా పెరిగింది..  అందుకనే రాహుల్ లా కాకుండా కేసీఆర్ లా ముందునుండే లోకేశ్ ను ప్రభుత్వలోకి తీసుకురావాలని సూచించారట. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

వరుస ఆత్మహుతి దాడులు.. 34 మంది మృతి

  ఈమధ్య కాలంలో ఇరాక్ లో ఆత్మహుతి దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈ ఆత్మహుతి బాంబు దాడుల వలన అతలాకుతలమైపోతున్న ఇరాక్ లో మరోసారి సోమవారం వరుస ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు జరుగాయి. ఈ దాడుల్లో  20 మంది మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. మరోచోట ధీ ఖార్‌ ప్రావిన్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందగా, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ వరుస దాడుల వలన మొత్తం 34 మంది మృతి చెందగా 87 మంది గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా ఇరాక్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో జరిగిన దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్టు గతంలోనూ ఐఎస్‌ ప్రకటించింది.

47 మంది పోలీసులకు జీవిత ఖైదు.. ఎక్కడ..?

సాధారణంగా హత్య చేసినప్పుడు కానీ..ఇంకా ఏదైనా నేరం చేసినప్పుడు కానీ నిందితులకు జీవిత ఖైదు విధిస్తారు. కానీ ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 47 మంది పోలీసులకు జీవిత ఖైదు పడింది. అదేంటీ పోలీసులకు జీవిత ఖైదు పడటం ఏంటీ అనుకుంటున్నారా.. నకిలీ ఎన్ కౌంటర్ చేసినందుకు గాను ఉత్తరప్రదేశ్ లోని 47 మంది పోలీసులకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. వివరాల ప్రకారం..  జూలై 12, 1991న  సిక్కు యాత్రికుల బస్సును అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. యాత్రికుల్లో ఉగ్రవాదులు ఉన్నారంటూ 10 మందిని ఎన్ కౌంటర్ చేశారు. ఆ మరుసటి రోజు ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపామంటూ ప్రకటించారు. అయితే ఎన్‌కౌంటర్‌పై తీవ్ర దుమారం రేగడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. టైస్టుల్ని చంపితే వచ్చే అవార్డులు, గుర్తింపు కోసమే  హత్యాకాండకు పోలీసులు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. కాగా మొత్తం మొత్తం 57మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 10 మంది విచారణ మధ్యలోనే మరణించారు. 47 మందిపై విచారణ జరిపి వారికి జీవిత ఖైదు విధించారు.

శిల్పా పై భుమా ఫిర్యాదు.. అతని పద్ధతేం బాలేదు..

టీడీపీలో ఉన్న విభేధాలు అప్పుడప్పుడు ఏదో ఒక రకంగా బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవలే భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి మధ్య ఉన్న విభేధాలు బయటపడుతున్నాయి. మామూలుగానే వీరిద్దరి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. మొన్నీ మధ్యనే శిల్పా మోహన్ ముఖ్య అనుచరుడుపై దాడి జరుగగా.. దానికి భూమా అనుచరులే కారణమంటూ శిల్పా మోహన్.. అతని అనుచరులు మండిపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే భూమా నాగిరెడ్డి శిల్పామోహన్ పై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన హత్యాయత్నాలకు, తనకు సంబంధం లేదని.. కర్నూలు జిల్లాలో  శిల్పా మోహన్ రెడ్డి వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందని ఫిర్యాదు చేశారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి సైతం ఇప్పటికే భూమాపై చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. తమను టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. మరి ముందు ముందు ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయో చూడాలి.

ప్రియాంక చోప్రాపై మేనేజర్ సంచలన వ్యాఖ్యలు.. కాళ్ల మీద పడితే వదిలేసానన్న తల్లి

  టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదంతంతో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నసంగతి కూడా తెలిసిందే. అది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందంటూ మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో రెండు మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. ప్రియాంక చూడటానికి చాలా స్టాంగ్ ఉమెన్ గా కనిపించవచ్చు. కానీ ఆమె మానసికంగా చాలా వీక్ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే దీనిపై ప్రియాంక చోప్రా తల్లి స్పందిస్తూ మేనేజర్ ప్రకాష్ జాజుపై మండిపడ్డారు. ట్వీట్టర్లో ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మేనేజర్‌గా ప్రకాష్ జాజు 2014 లో ప్రియాంక మేనేజర్ గా ఉండేవాడని.. తరువాత అతని కాంట్రాక్ట్ ముగిసిపోయిన తరువాత ప్రియాంక వేరే మేనేజర్ ను అపాయింట్ చేసుకుందని.. అతన్ని ఎందుకు కొనసాగించలేదో తెలియదని తెలిపింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని.. గతంలో కూడా ఇలానే చేసి జైలుకు వెళ్లాడని.. అప్పుడు వారి తల్లిదండ్రులు ప్రియాంక కాళ్ల మీద పడి ప్రాధేయపడటంతో వదిలేసామని చెప్పారు. ఇప్పుడు కూడా కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అన్నారు. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి.

విరాట్‌ విశ్వరూపానికి ఐసీసీ ఫిదా..వరల్డ్ టీ20 కెప్టెన్‌గా కోహ్లీ

  తన ఆట తీరుతో సామాన్యుల నుంచి క్రికెట్ దిగ్గజాల వరకు అందరి ప్రశంసలు అందుకున్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి తాజాగా ఐసీసీ కూడా ఫిదా అయిపోయింది. టీ20 ప్రపంచకప్ ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు కోహ్లీ. వెస్టిండీస్‌ చేతిలో ఓటమి అనంతరం అతన్ని ఓదార్చాడం ఎవ్వరి తరము కాలేదు. ఈ టోర్నిలో విశ్వరూపం చూపించిన కోహ్లీ మూడు హాఫ్ సెంచరీల సాయంతో 273 పరుగులు చేశాడు. అతని ప్రదర్శనకు గానూ టోర్ని ఆఫ్ ద ప్లేయర్ అవార్డును ప్రకటించిన ఐసీసీ కోహ్లీకి ఇంకా ఏదైనా చేయాలనుకుంది. దానిలో భాగంగా ప్రపంచంలోని బెస్ట్ టీ20 ప్లేయర్స్‌తో జట్టును ఎంపిక చేసి దానికి కోహ్లీని కెప్టెన్‌గా చేసింది. భారత్ నుంచి విరాట్‌తో పాటు సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు చోటు దక్కింది. వరల్డ్ టీ20 టీమ్: విరాట్ కోహ్లి(భారత్, కెప్టెన్) జాసన్ రాయ్(ఇంగ్లండ్) డికాక్(దక్షిణాఫ్రికా) జో రూట్(ఇంగ్లండ్) బట్లర్(ఇంగ్లండ్) షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా) ఆండ్రీ రస్సెల్(వెస్టిండీస్) మిచెల్ సాంట్నార్(న్యూజిలాండ్) డేవిడ్ విల్లే(ఇంగ్లండ్) శామ్యూల్ బద్రి(వెస్టిండీస్) ఆశిష్ నెహ్రా(భారత్) ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్)

మీడియాకు కాళ్లు చూపించిన సామ్యూల్స్.. మాబోర్డు కంటే బీసీసీఐ బెటర్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో వెస్టీండీస్  టి-20 ప్రపంచ కప్ ను గెలిచింది. ఓడిపోతుందనుకున్న సమయంలో కార్లోస్ బ్రాత్ వైట్ వరుసగా నాలుగు సిక్సులు కొట్టి విజయానికి కారకుడయ్యాడు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా విజయం తరువాత వెస్ట్టిండీస్ ఆటగాళ్ల తీరుపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ సామ్యూల్స్.. మైకులు పెట్టే టేబుల్ పైన రెండు కాళ్లూ ఎత్తి పెట్టుకుని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పాడని విమర్శలు వస్తున్నాయి.     ఇదిలా ఉండగా వెస్టిండీస్ డాషింగ్ ఆల్రౌండర్ డ్వెన్ బ్రావో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విమర్శలు చేశాడు. వెస్టిండీస్ బోర్డు కంటే బీసీసీఐ చాలా మద్దతుగా నిలిచిందని.. విండీస్ బోర్డు పగ్గాలు సరైన వ్యక్తుల చేతిలో లేవనిబ్రావో అన్నాడు. అంతేకాదు తాము కప్ గెలిచినా కూడా ఎవరూ ఫోన్ చేయలేదని.. తాము ప్రపంచ కప్ గెలుస్తామని బోర్డు అధికారులు నమ్మలేదని, గెలవాలని కోరుకోలేదని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు బ్రావో వ్యాఖ్యలపై విమర్శలు తలెత్తుతున్నాయి.

బ్యాంకులకు నచ్చని మాల్యా ఆఫర్..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి కింగ్ పిషర్ అధినేత ఉడాయించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది వేల కోట్లు రూపాయలు బకాయిలు పడ్డ విజయ్ మాల్యా ఎన్నో ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు సెప్టెంబర్ లోపు 4 వేలకోట్లు చెల్లిస్తానని చెప్పాడు. అయితే మాల్యా చెప్పిన మాటాల్లో స్పష్టత లేదని.. ఆయన బకాయి పడిన డబ్బుతో పోలిస్తే, బ్యాంకుల దృష్టిలో ఇది చాలా చిన్న మొత్తమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం పెదవి విరిచింది. ఇప్పటికే బ్యాంకుల వద్ద తనఖాలో ఉన్న ఆయన కంపెనీల వాటాలనే రూ. 2 వేల కోట్లుగా చూపించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కనీసం రూ. 8 వేల కోట్ల ప్లాన్ తో వస్తేనే మాల్యాతో చర్చించాలని కన్సార్టియం నిర్ణయించినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి వివరించారు.

ఐసీయూలో ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్

  ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈమె ఆత్మహత్యపై ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ప్రత్యూషా ఫ్రెండ్స్ కూడా రాహుల్ పై పలు ఆరోపణలు చేశారు. రాహుల్ రాజ్సింగ్తో ప్రత్యూషకు విభేదాలున్నాయ‌ని.. రాహుల్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్తో కలసి ప్రత్యూషను మోసం చేశాడని, చాలాసార్లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా రాహుల్ ను విచారిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని.. ప్రత్యూష చనిపోవడంతో రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.. దీంతో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడని.. ఇదే పరిస్థితి కొనసాగితే బ్రెయిన్ హ్యుమరేజ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్యులు తెలిపారని ఆయన తరపు లాయర్ తెలిపారు.

దారుణం.. న్యాయవాదిని కత్తులతో పొడిచి చంపారు

  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. న్యాయవాదిని కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ అనే న్యాయవాది ఏలూరు వన్ టౌన్ లోని దుకాణంలో ఉండగా నలుగురు వ్యక్తులు కత్తులతో ఆయనపై దాడి చేశారు. ఈ దాడి వలన తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ, న్యాయవాది హత్య కేసులో నలుగురు నిందితులున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

డబ్బు దాచుకున్న వారిలో ఐశ్వర్యా రాయ్.. అంతా అబద్దం

  పనామా పేపర్స్ అనే పత్రిక దేశాల్లో డబ్బు దాచుకున్న వారి జాబితాలోని పేర్లను బయటపెట్టి అందరికి షాకిచ్చారు. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు బయటపెట్టి అందరికి షాకిచ్చింది పనామా పేపర్స్. అయితే ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ 500 మందిలో 140 మందికి పైగా రాజకీయ నాయకులు, 200 మంది వరకూ వ్యాపారవేత్తలు, 12 మంది రాష్ట్రాధినేతలు, సెలబ్రిటీల పేర్లను పనామా పేపర్స్ విడుదల చేసింది. దీనిలో బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేర్లు ఉండటం ఆశ్చర్యం. ఐశ్వర్యా రాయ్, ఆమె తల్లిదండ్రులు, సోదరులు బ్రిటన్ లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్ట్ నర్స్ లిమిటెడ్ లో డైరెక్టర్లని, ఆ సంస్థ ద్వారా బ్లాక్ మనీని నిర్వహించారని పేర్కొంది. అమితాబ్ నాలుగు విదేశీ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారని ఈ కంపెనీలు 5 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మూలధనం నిల్వలను కలిగినప్పటికీ, మిలియన్ల విలువైన డీల్స్ చేశాయని పేర్కొంది. అయితే దీనిపై ఐశ్యర్యరాయ్ స్పందిస్తూ..బ్లాక్ మనీ కుంభకోణంలో తన పేరుండటం షాక్ ను కలిగించిందని, ఇదంతా పచ్చి అబద్ధమని, పూర్తి అవాస్తవమని పేర్కొంది.

మరోసారి తన వక్ర బుద్ధి చూపిన పాకిస్థాన్..

  ప్రత్యర్ద దేశమైన పాకిస్థాన్ ను అంత తేలిగ్గా నమ్మడానికి లేదని మరోసారి రుజువు చేసింది. గతంలో మాట మార్చిన మాదిరిగానే ఇప్పుడు కూడా మాటమార్చి తన నైజాన్ని మరోసారి నిరూపించుకుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పఠాన్ కోట్ దాడికి కారణమైన జైషే మహ్మద్ చీఫ్ అయిన మసూద్ అజార్‌ను మొదట పాకిస్థాన్ అరెస్ట్ చేశామని.. గృహనిర్భందంలో ఉంచామని చెప్పినా ఆతరువాత అందంతా వత్తిదే అని చెప్పి మాటమార్చింది. ఇప్పుడు పఠాన్ కోట్ పై దాడి నిమిత్తం దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొంతమంది అధికారులు మార్చి 29న పఠాన్ కోట్ ఎయిర్ బేస్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఉన్నంత సేపు ఏం మాట్లాడని పాక్ దర్యాప్తు బృందం సొంత దేశంలో కాలు పెట్టగానే మాత్రం నోరు విప్పింది. పఠాన్ కోట్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అసలు తమ దేశానికి చెందిన వారేనని చెప్పే ఆధారాలను భారత్ తమకు అందజేయలేదని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది.   అంతేకాదు భారత ఎన్ఐఏ అధికారులు తమకు కేవలం 55 నిమిషాలు మాత్రమే ఎయిర్ బేస్లోకి అనుమతించారని, ప్రధాన మార్గం నుంచి కాకుండా ఏదో ఇరుకైనా మార్గం నుంచి తమను తీసుకెళ్లారని, వారిచ్చిన ఆ గడువు కేవలం నడిచేందుకు సరిపోయింది తప్ప ఆధారాలు సేకరించేందుకు వీలుకాలేదని అన్నట్లు తెలుస్తోంది. కానీ ఎన్ఐఏ అధికారులు మాత్రం పాకిస్థాన్ బృందానికి ఘటన స్థలాన్ని మొత్తం చూపించామని.. వారు కొన్ని ఆధారాలు కూడా సేకరించారని అంటున్నారు.  

అమెరికాకు చాలా కష్టాలుంటాయి.. అప్పంతా తీర్చడమే నా లక్ష్యం.. ట్రంప్

  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పెట్టింది పేరుగా తయారయ్యారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకూ భారత్.. చైనా..ఇంకా పలు విషయాలపై వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా అమెరికాపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో అమెరికా తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. అంతేకాదు.. అమెరికాలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, దేశం అతిపెద్ద మాంద్యం దిశగా వేగంగా పడిపోతోందని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అత్యంత క్లిష్టపరిస్థితి ఎదురుకానుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా అమెరికా 19 ట్రిలియన్ డాలర్ల రుణాలను పలు దేశాలకు, సంస్థలకు ఇవ్వాల్సి వుందని.. వచ్చే ఎనిమిదేళ్లలో అప్పంతా తీర్చడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రచారంలో తాను దూకుడుగానే వెళతానని, అదే తన బలమని చెప్పిన ట్రంప్, ఒంటరిగా వెళ్లి అధ్యక్ష పీఠాన్ని చేపడతానన్న నమ్మకముందని అన్నారు.

ప్రత్యూష బెనర్జీ గర్భవతా..?

ప్రత్యూష బెనర్జీ కేసులో రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఇది హత్యా లేక ఆత్మహత్యా అని తెలుసుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు.. చనిపోయే సమయానికి ప్రత్యూష రెండు నెలల గర్భిణీ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ఆమె గర్భవతి కావొచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. వారు శాంపిల్స్‌ను జేజే ఆసుపత్రికి పరీక్షల కోసం పంపించారు. అయితే దీనిపై పోలీసులు ధ్రువీకరించినా, పోస్టు మార్టం నివేదిక అందిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా ముంబైలోని తన సొంతింటిలో ప్రత్యూష ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాను సీరియల్స్ నిర్మాత, నటుడు రాహుల్ రాజ్ సింగ్ తో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తుంది.