శ్రీనగర్ నిట్ లో దారుణం.. తరగతులకు రాకుంటే అత్యాచారమే..

  శ్రీనగర్ లోని నిట్ లో పరిస్ధితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఇండియా ఓడిన పోయిన నేపథ్యంలో మొదలైన అల్లర్లు రోజు రోజుకి హింసాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే నిట్ లో చదువుతున్న స్థానికేతర విద్యార్దులు తమను ఇంటికి వెళ్లనివ్వాలని.. ఇక్కడ కాకుండా వేరే చోటికి మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అలా ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. వెంటనే తరగతులకు రాకుంటే, స్థానికులతో అత్యాచారం చేయిస్తామని సహ విద్యార్థినిలు బెదిరిస్తున్నారని ఇతర రాష్ట్ర అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. తమలో అభద్రతా భావం పెరిగిపోయిందని చెప్పిన బీహార్ విద్యార్థిని, తమకు న్యాయం జరిగేంత వరకూ నిరసనలు ఆపబోమని హెచ్చరించింది.

ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్న చంద్రులు

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిన్న రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన చంద్రబాబుకు, కేసీఆర్ ఎదురుపడటంతో ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు గవర్నర్ ప్రసంగిస్తూ శ్రీదుర్ముఖి నామ సంవత్సరంలో తెలుగువారికి అన్ని శుభాలే కలుగుతాయని తెలిపారు. మంచి వర్షాలు కురిసి, ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల్లోని మంత్రులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.

ప్యాంట్లు వేస్తే పోటుగాళ్లు కాదు.. అసదుద్దీన్ కామెంట్స్

మెడ మీద కత్తి పెట్టినా భారత్‌ మాతాకీ జై అనను అంటు చేసిన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా వివాదానికి తెరదీసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాల తేనే తుట్టెను కదిపారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అసదుద్దీన్ తన బద్ధ శత్రువు అర్ఎస్ఎస్ పై నిప్పులు చేరిగారు. 1952లో ఏర్పాటైన ఆర్ఎస్ఎస్ అప్పుడు నిక్కర్లతో ఏర్పాటై..ఇప్పుడు ప్యాంట్లు వేసుకుందని, నిక్కర్లు వదిలి ప్యాంట్లు వేసుకున్నంత మాత్రన వారు పెద్దమనుషులు అవ్వలేరని ఆరోపించారు.ఎంఐఎం మతతత్వపార్టీ కాదని..మస్లిం, దళిత సోదరుల పార్టీ అన్నారు. తమను మతతత్వ పార్టీగా చిత్రీంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని అసుదుద్దీన్ అన్నారు.

రోజా సస్పెన్షన్ పై అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు..

  వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీలో జరిగే వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని.. ఆహక్కు కోర్టులకు లేదని తెలిపారు. దీనికి రోజా తరపు న్యాయవాది అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవన్నది నిజమే అయినా..  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు తేలితే జోక్యం చేసుకునే హక్కు ఉందని వాదించారు. దీంతో సుప్రీం ఏకీభవించి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ.. ఆలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మాల్యా పై మండిపడ్డ సుప్రీం.. ఇండియాకు ఎప్పుడు వస్తారంటా..

  కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి.. ఆతరువాత సెప్టెంబర్ లోగా 4వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కడతానని కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాల్యా వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు మండిపడింది. మాల్యా ఇచ్చిన ఆఫర్ కు బ్యాంకులు అసంతృప్తిగానే ఉన్న నేపథ్యంలో కన్సార్టియం స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సుప్రీం అసలు మాల్యా ఎప్పుడు ఇండియాకు రావాలని అనుకుంటున్నారని అడిగింది. ఈనెల 21లోగా, ఆయన ఆస్తిపాస్తుల వివరాలన్నీ కోర్టుకు అందించాలని ఆదేశించింది. నగదును డిపాజిట్ చేయమంటే ఏ మేరకు డబ్బు కట్టగలరో తెలపాలని కోరుతూ కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.

ఈ రైలు మనుషులకి కనిపించదు

  జపాన్ దేశీయులు ఏం చేసినా అందరికంటే విభిన్నంగా చేస్తారు. బుల్లెట్ రైలు, రోబోలు ఇలా ఏం చేసినా సరే అది ఒక విచిత్రమే. తాజాగా వారు మరో ప్రయోగాన్ని చేశారు. అదే కనపడని రైలు. సాధారణ రైళ్లలాగా ఇది కంటికి కనిపించదు. సెయిబ్ గ్రూప్ వందో వార్షికోత్సవం సందర్భంగా ఆ కంపెనీ వాళ్లకి  వెరైటీ ఆలోచన వచ్చింది. ఐడియా తట్టిందే తడవుగా ప్రముఖ ఆర్కిటెక్ట్ కజుయో సెజిమాను సంప్రదించడంతో వారు ఈ ట్రైన్‌ను రూపొందించారు. ఈ రైలు కనిపించకుండా ఉండేందుకు బోగీలన్నింటికీ ఒక సెమీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేశారు. దాంతో అది వస్తున్నట్టుగానే కనిపించదు.   దాదాపుగా లివింగ్ రూమ్‌లో ఉండే సౌకర్యాలతో ఒక డిజైన్ కావాలని సెజిమాను ఆ గ్రూప్ కోరింది. దాంతో ఈ సరికొత్త డిజైన్‌ను ఆయన తయారు చేయగా, పరిమిత సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకి దీన్ని అందించారు. మార్పులు చేర్పులతో 2018 నుంచి ఈ రైలు పట్టాల మీద పరుగులు పెడతాయని అధికారులు చెబుతున్నారు. దీని ప్రత్యేకత వల్ల ప్రజలకు, జంతువులకు ప్రమాదం అంటున్నారు నిపుణులు. రైలు రావడం లేదని ఎవరైనా పట్టాలమీదకు వెళ్తే ప్రాణాలు కోల్పోవలసి వస్తుందంటున్నారు. ఏది ఎమైనా వీరి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే.

వేదికపైనే పాము కరిచి చనిపోయిన పాప్ సింగర్..

  వేదికపై ప్రదర్శన ఇస్తూనే చనిపోయేవాళ్లని చాలామందిని చూశాం. అయితే ప్రమాదవశాత్తు పాము కరిచి వేదికపై ప్రదర్శన ఇస్తూనే మరిణించింది ఓ పాప్ సింగర్. ఇలాంటి ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాప్ సింగర్ ఇమ్రా బులే అనే పాప్ సింగర్ పాటలు పాడుతూనే మధ్యలో కొండచిలువలు, నాగుపాములు వంటి విష సర్పాలను ఆడిస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే వెస్ట్ జావాలోని కారవాంగ్ గ్రామంలో ఇమ్రా ఓ ప్రదర్శన ఇస్తూ ఈ సందర్భంగా పాటలు పాడుతూ రియాంటీ అనే విషసర్పంతో విన్యాసాలు చేసింది. అలా చేస్తున్న నేపథ్యంలో పొరపాటున ఆ పాము తోకను తొక్కింది ఇమ్రా. అంతే, అది ఒక్కసారిగా బుసకొట్టి ఆమె తొడమీద కాటేసింది. అంతే ఇమ్రా అక్కడిక్కడే మరణించింది. దీంతో అప్పటివరకూ ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం కాస్త విషాదకరంగా మారింది.

భారీగా పెరిగిన ఐఐటీ ఫీజులు.. 90 వేల నుండి 2 లక్షలకు

ప్రస్తుత రోజుల్లో చదువుకుంటున్నాం అనడంకంటే.. చదువుకొంటున్నాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చదివే చదువులకు చెల్లిస్తున్న ఫీజులు అంత రేంజులో ఉంటున్నాయి. ఇప్పుడు అది కూడా చాలదన్నట్టు.. మరింత భారీగా పెంచేశారు ఐఐటీ విద్యాసంస్థలు. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 90 వేలు కాగా.. ఇప్పుడు అది కాస్తా రూ. 2 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ముందు ఈ ఫీజులను 3 లక్షలకు పెంచాలని బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవాంగ్ ఖాకర్ అధ్యక్షతన ఏర్పడ్డ ఉప సంఘం ప్రతిపాదించగా, అంత మొత్తం పెంచితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతో రూ. 2 లక్షలకు ఫీజుల పెంపు పరిమితం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఐఐటీ విద్య మరింత ప్రియమైపోయింది.

బీఎస్పీ ఎంపీ కొడుకు, భార్య అరెస్ట్.. వరకట్నం కోసం వేధించారు

  ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బీఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రివాల్వర్ తో కాల్చుకుని హిమాని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఆయన భార్యని.. కుమారుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హిమాని తల్లిదండ్రులు ఫిర్యాదు మేరుకు వారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ కుటుంబ సభ్యులు హిమానిని వరకట్నం కోసం వేధించారని, ఫార్చ్యూనర్‌ ఎస్‌యూవీ కావాలని డిమాండ్‌ చేశారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేశామని..అయితే ఆమెది హత్యా, ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉందని.. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని ఘజియాబాద్ ఎస్పీ సల్మాన్‌ తాజ్‌ తెలిపారు.

బాంబు పెట్టింది ఎవరికోసం.. చింటూ కోసమా..? లేక ఎమ్మెల్యే కోసమా..?

  చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలడంతో కలకలం రేగింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చింటూను ఈ రోజు కోర్టుకు తీసుకొచ్చిన నేపథ్యంలో బాంబు పేలడంతో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. మేయర్ దంపతుల హత్య విచారణలో భాగంగా  పోలీసులు చింటూను కోర్టుకు తీసుకొచ్చారు. అయితే చింటూ కోర్టులో ఉండగానే పేలుడు జరిగింది. ఈ ఘటనలో కోర్టు గుమాస్తా కుడికాలు తెగిపడగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఇంకా మూడు వాహనాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.   అయితే ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంతకీ ఎవరిని టార్గెట్ చేసుకొని బాంబు పెట్టారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇదే రోజు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కూడా ఓ కేసు నిమిత్తం మరికాసేపట్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఈ బాంబు పేలింది. ఈ నేపథ్యంలోనే బాంబు చింటూ కోసం పెట్టారా.. లేక మాజీ ఎమ్మెల్యే కోసం పెట్టారా అని అనుకుంటున్నారు. పోలీసులు కూడా ఇదే కోణంలో ఆరా తీస్తున్నారు. లాయర్ దుస్తుల్లో ఎవరైనా వచ్చి ఈ బాంబుని పేల్చారా? లేక కక్షిదారులే ఈ బాంబుని పేల్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు

దారుణం.. బ్లాగర్ తల నరికి.. తుపాకితో కాల్చి చంపారు

  దేశాలను గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు రాక్షసత్వానికి హద్దులు లేకుండా పోతున్నాయి. తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు అతికిరాతకంగా వారిని చంపేసి అక్కసు వెళ్లగక్కుకుంటారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు చేసేవాళ్లని చాలామందినే చంపారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోలో బ్లాగర్స్‌ హత్యల పరంపరలో మరో ఘటన వెలుగుచూసింది. నజిముద్దీన్ సమద్ అనే కుర్రాడు అత్యంత దారుణంగా చంపబడ్డాడు. వివరాల ప్రకారం.. నజిముద్దీన్ సిల్హెట్ నుంచి ఇటీవల ఢాకా వచ్చి జగన్నాథ యూనివర్సిటీలో అతను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. అయితే అతనిపై నలుగురు దాడి చేసి ఒకడు కత్తితో అతని తల నరికేయగా, మరొకడు పిస్టల్‌తో కాల్చి చంపారు. దీంతో నజిముద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయితే నజిముద్దీన్ తన ఫేస్ బుక్ లో దేశం గురించి.. చట్టాల గురించి.. ఇస్లామిక్ గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతనిని చంపారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా దీనిపై ఇంతవరకు బాధ్యత ప్రకటించుకోలేదని ఢాకా మెటోపాలిటన్ డీసీపీ సయెద్ నురుల్ ఇస్లాం తెలిపారు.   ఇందిలా ఉండగా వరుస బ్లాగర్ల హత్యలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. 2013 ఫిబ్రవరి 5న రాజిబ్ హైదర్‌ అనే సెక్యులర్ బ్లాగర్‌ను ఆయన ఇంటికి సమీపంలోనే దారుణంగా హతమార్చారు. 2015లో మరో నలుగురు బ్లాగర్లు అవిజిత్ రాయ్‌, వశీకర్ రహ్మన్ బాబు, అనంత బిజోయ్‌, నీలోయ్‌ ఛటర్జీలను అతి కిరాతకంగా చంపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. వారానికి ఐదు రోజులే

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాదు.. కేవలం.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలివచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. గతకొంత కాలంగా సచివాలయ ఉద్యోగులు వారానికి ఐదురోజులు మాత్రమే పనిదినాలు ఉండాలని కోరుతున్నారు. దీంతో దీనిపై చర్చించి ఏపీ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. జూన్ నెలకల్లా వీరంతా ఏపీకి తరలివస్తారు కాబట్టి అప్పటి నుండి ఈ వారానికి ఐదు రోజులపాటు పనిదినాల వెసలుబాటు కల్పించనున్నారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతికి తరలివచ్చే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనివిధాలా చర్యలు చేపట్టిందని అన్నారు.. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంతో పాటు ఉద్యోగుల పిల్లలకు స్థానికతను వర్తింపజేయాలన్నవిజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున కేంద్రానికి సీఎం లేఖ రాస్తారని మంత్రి వెల్లడించారు.

ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ కు షాక్.. కేసును వాదించనన్న లాయర్

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రోజుకో అంశం వెలుగుచూస్తుంది. ఇక ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ పై రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. ఇప్పటికే రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న రాహుల్ కు షాకిచ్చాడు అతని తరపు లాయర్. ఈ కేసులో భాగంగా తనకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోర్టుకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో, కేసును తాను వాదించబోనంటూ న్యాయవాది నీరజ్ గుప్తా స్పష్టం చేశారు. ఇంకా అతను ఈ కేసులో రాహుల్ నిజాలను దాస్తున్నాడని, తనకు అన్ని విషయాలనూ చెప్పడం లేదని ఆరోపించారు. కాగా రాహుల్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పై నేడు విచారణ జరుగనుంది.

తాను ఇచ్చిన స్టేట్ మెంట్ పై మోహన్ బాబు నిలబడతాడా..?

  సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రీఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో చర్చలు ఎక్కువయ్యాయి. తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని.. తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ సన్నిహితులేనని.. అయితే తాను ఏ పార్టీలో చేరుతానన్న విషయం మాత్రం త్వరలో చెబుతానని తన పుట్టిన రోజునాడు చెప్పారు మోహన్ బాబు. అయితే తాను అలా చెప్పాడో లేదో.. అప్పటినుండి ఆయన ఏపార్టీలోకి చేరుతారబ్బా అని ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు.   అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ.. ఆతరువాత కాస్తో కూస్తో బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీనే. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కూడా అయితే టీడీపీ లేదా.. వైసీపీలో మాత్రమే చేరే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల్లోనే ఏ పార్టీలో చేరుతారన్నది ప్రధాన చర్చ. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీలో ఉన్న మోహన్ బాబు ఆ తరువాత.. అదే పార్టీనుండి రాజ్యసభనుండి కూడా ఎన్నికయ్యారు. ఇక ఆతరువాత టీడీపీ నుండి బయటకు వచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా అనగానే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   మరోవైపు మోహన్ బాబు వైసీపీలో చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగూ మోహన్ బాబుకి జగన్ తో మంచి సత్సంబంధాలే ఉన్నాయి.. ఇంకా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెతో తన పెద్ద కుమారుడు విష్ణుకు వివాహం జరిగింది కాబట్టి ఆపార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు అని రాజకీయ పెద్దలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ముద్రగడ కాపు గర్జన సందర్భంగా ముద్రగడ పద్మనాభాన్ని విష్ణు కలిసినందుకుగాను ఆయన వైసీపీలో చేరుతారేమో అన్న పలు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. మోహన్ బాబు రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలను బట్టి తాను టీడీపీలోనే ఉంటారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులు చేయడమంటే ఎంగిలి మెతుకులు తిన్నంత పని అని అన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు తాను గతంలో ఉన్న పార్టీలోనే కొనసాగుతారు.. వైసీపీలో చేరరు అని అంటున్నారు. మరి ఇన్ని అనుమానాలకు బ్రేక్ వేస్తూ మోహన్ బాబు ఏపార్టీలో చేరుతారో.. సైకిలెక్కుతారో.. లేక ఫ్యాన్ ఎక్కుతారో తెలియాలంటే ఆగాల్సిందే.