జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే.. ఉసిరికాయలో ఇదొక్కటి మిక్స్ చేసి రాయాలి..! జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలని కోరుకోని వారు ఉండరు. అయితే జుట్టు పెరుగుదల ఇప్పట్లో చాలా అరుదుగా కనిపిస్తోంది. కొందరు జుట్టు పెరుగుదల జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంటారు. కానీ జుట్టు పెరుగుదలకు తగిన జీన్స్ ఉన్నా కొన్ని కారణాల వల్ల జుట్టు పెరుగుదల సరిగా ఉండదు. కాలుష్యం, ఆహారం సరిగా తీసుకోక పోవడం, జుట్టు సంరక్షణ చర్యలు పాటించకపోవడం, జుట్టుకోసం చాలా హానికరమైన రసాయనాలున్న ఉత్పత్తులు వాడటం. ఇలా చాలా విషయాలు జుట్టు పెరగకపోవడానికి కారణం అవుతాయి. అయితే ఉసిరికాయలో ఒక్క పదార్థం మిక్స్ చేసి రాస్తే చాలు.. జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందట. ఉసిరి, కొబ్బరినూనె.. ఉసిరికాయ పొడి సాధారణంగా హెన్నా, హెయిర్ మాస్క్ మొదలైన వాటిలో ఉపయోగిస్తుంటారు. ఉసిరికాయ పొడిలో కొబ్బరినూనె కలిపి రాస్తే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుందట. దీన్ని రెండు విధాలుగా రెఢీ చెసుకోవచ్చు. ఉసిరి రసం, కొబ్బరినూనె.. తాజా ఉసిరికాయలు అందుబాటులో ఉన్నవారు దీన్ని ట్రై చేయవచ్చు. ఉసిరికాయలను తురిమి రసం తీసుకోవాలి. ఈ రసానికి సమాన పరిమాణంలో కొబ్బరినూనె తీసుకోవాలి. ఈ రెండింటిని ఇనుప కడాయిలో వేసి సన్నని మంట మీద మరిగించాలి. రసం అంతా ఇగిరిపోయిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. నూనె చల్లారిన తరువాత గాజు సీసాలో పోసి భద్రపరుచుకోవాలి. ఈ నూనెను తల స్నానం చేయడానికి గంట ముందు తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. కుదిరితే నూనెను డబుల్ బాయిల్ పద్దతిలో వేడి చేసి గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. గంట తరువాత గాఢత లేని షాంపూ లేదా శీకాయ లేదా కుంకుడుకాయ పొడితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. వారంలో రెండు సార్లు దీన్ని అప్లై చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి పొడి, కొబ్బరినూనె.. తాజా ఉసిరికాయలు అందుబాటులో లేనప్పుడు ఉసిరికాయ పొడిని ఉపయోగించవచ్చు. కల్తీ లేని ఉసిరికాయ పొడిని తీసుకుని అందులో సమాన పరిమాణంలో కొబ్బరి నూనె కలపాలి. దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. లేకపోతే ఉసిరికాయ పొడిలో కొబ్బరినూనె వేసి దీన్ని సన్నని మంట మీద ఉడికించి తరువాత వడగట్టి కూడా వాడవచ్చు. ఉసిరికాయను ఇలా కొబ్బరినూనెతో కలిపి వాడుతుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది. అయితే జుట్టు పెరుగుదలకు సహకరించే బయోటిన్, బీటా కెరోటిన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, విటమిన్-సి వంటివి ఉన్న ఆహారాలు. గుమ్మడి గింజలు పుష్కలంగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. *రూపశ్రీ.
ప్రతి అమ్మాయి తన హ్యాండ్బ్యాగ్లో ఉంచుకోవాల్సిన 5 బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవే..! నేటి రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో, మనం ఎప్పుడూ చాలా విషయాల గురించి గందరగోళంలో ఉంటాము. వీటిలో ఒకటి మేకప్ ఉత్పత్తులు. అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఇష్టపడతారని మనందరికీ తెలుసు. కానీ మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, మన రూపాన్ని కాపాడుకోవడానికి, మనం ఎల్లప్పుడూ కొన్ని వస్తువులను మన బ్యాగ్లో ఉంచుకోవాలి. సహజంగానే మొత్తం మేకప్ కిట్ను బ్యాగ్లో అన్ని సమయాలలో ఉంచుకోలేము. అటువంటి పరిస్థితిలో, మన బ్యాగ్లో ఎల్లప్పుడూ ఉండవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల జాబితా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సన్స్క్రీన్: సన్స్క్రీన్ మీ చర్మాన్ని UVA UVB నుండి రక్షిస్తుంది. అంటే సూర్యుని హానికరమైన కిరణాలు, కాలుష్యం నుండి కూడా రక్షిస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా, కనీసం 5 నుండి 10 నిమిషాల ముందు సన్స్క్రీన్ అప్లై చేసి, కొన్ని గంటల తర్వాత మళ్లీ అప్లై చేయండి. మీరు సన్స్క్రీన్ను ఇండోర్, అవుట్డోర్లో ఉపయోగించవచ్చు. కాజల్ పెన్సిల్: కాజల్ పెన్సిల్ మహిళల రూపాన్ని తక్షణమే పెంచడానికి పనిచేస్తుంది. ఇది మీ కళ్లను అందంగా మార్చడం ద్వారా మీ ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది. మీరు స్నేహితుడిని కలవాల్సి వచ్చినా లేదా ఎవరితోనైనా డిన్నర్ కు వెళ్లాల్సి వచ్చినా ఎల్లప్పుడూ స్మడ్జ్ ప్రూఫ్, వాటర్ప్రూఫ్ కాజల్ని ఉపయోగించండి. వెట్ వైప్స్: మీ బ్యాగ్లో వెట్ వైప్స్ చిన్న ప్యాకెట్ ఉంచడం మర్చిపోవద్దు. మీరు ఆఫీసుకు, కాలేజీకి లేదా బయట ఎక్కడికైనా వెళితే, మీ ముఖంలోని మురికిని శుభ్రం చేయడంలో ఇది సహాయపడుతుంది. మీరు జిడ్డుగల లేదా పొడి చర్మం కలిగి ఉన్నారా, ఇది అందరికీ పని చేస్తుంది. కాంపాక్ట్: టచ్-అప్ల కోసం మీ బ్యాగ్లో చిన్న అద్దంతో కూడిన మేకప్ కాంపాక్ట్ తప్పనిసరిగా ఉండాలి. తరచుగా టచ్అప్లతో, మీరు మీ మేకప్ను అతుక్కొని ఉంచుకోవచ్చు. లిప్ బామ్: మన పెదవులకు ఎల్లవేళలా పోషణ, తేమ అవసరం. మారుతున్న సీజన్లో, మన పెదాలు చాలా పొడిగా, పగిలిపోయేలా చేస్తాయి. కాబట్టి దీనిని నివారించడానికి, మీరు తప్పనిసరిగా మీతో లిప్ బామ్ను ఉంచుకోవాలి. లిప్ బామ్లు పర్యావరణ కాలుష్యం నుండి మీ పెదాలను రక్షించడంలో కూడా సహాయపడతాయి.
జుట్టుకు రంగు వేస్తుంటారా...ఈ జాగ్రత్తలు మీ కోసమే! జుట్టుకు రంగు వేయడం ఇప్పట్లో చాలా సాధారణం. చాలావరకు తెల్లజుట్టును కవర్ చేయడానికి జుట్టుకు రంగు వేస్తుంటారు. మరికొందరు జుట్టు రాగి రంగు లేదా ఇతర రంగులు వేసుకుంటూ ఉంటారు. అయితే ఫ్యాషన్ మీద అభిరుచి ఉన్నవారు ఒక వైపు తెల్ల జుట్టును కవర్ చేస్తూనే ఫ్యాషన్ ఐకాన్ గా కనిపించడం కోసం నలుపును కాకుండా ఇతర రంగులను ఎంచుకుంటూ ఉంటారు. నలుపు అయినా, ఇతర రంగులు అయినా జుట్టుకు వేసిన తరువాత అవి వీలైనంత తొందరగా పోతుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టుకు రంగు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. స్టైలిష్ లుక్ ను కూడా ఇస్తుంది. మరికొన్ని సార్లు జుట్టుకు వేసే రంగుల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వీటి గురించి తెలుసుకుంటే.. జుట్టుకు రంగు వేయడానికి ఉపయోగించే రంగులలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టును నిర్జీవంగా మారుస్తాయి. జుట్టు తొందరగా పొడిబారి, సాధారణ సమయాలలో టెంకాయ పీచులా చాలా రఫ్ గా అనిపిస్తుంది. ఈ సమస్యలు ఉండకూడదంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. జుట్టుకు రంగు వేసిన తరువాత చాలామంది వెంటనే తలస్నానం చేస్తుంటారు. మరికొందరు ఒకరోజు అలా గ్యాప్ ఇచ్చి తలస్నానం చేస్తుంటారు. కానీ జుట్టుకు రంగు వేసిన తరువాత మూడు రోజుల పాటు అలాగే ఉండాలి. ఆ తరువాతే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు వేసుకున్న రంగు ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. జుట్టుకు రంగు వేసిన తరువాత తలస్నానం చేసేటప్పుడు రసాయనాలు లేని షాంపూను ఉపయోగించాలి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టుకు వేసుకున్న రంగు తొందరగా వదిలిపోకుండా నిలిపి ఉంచుతుంది. జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది. కొందరికి రోజూ తలస్నానం చేయడం లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. కానీ షాంపూతో ప్రతి రోజూ తలస్నానం చేస్తుంటే జుట్టు రంగు తొందరగా వదిలిపోతుంది. జుట్టు కూడా దెబ్బతింటుంది. తలస్నానం తరువాత జుట్టుకు కండిషనర్ పెట్టడం కొందరికే అలవాటు ఉంటుంది. కానీ కండీషనర్ ఉపయోగించడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది. ఎక్కువసేపు తలను తడపడం వల్ల కూడా తలకు పెట్టుకున్న రంగు తొందరగా వదిలిపోతుంది. అందుకే జుట్టును నీటిలో ఎక్కువసేపు పదే పదే కడగకూడదు. అలాగే ఎక్కువ వేడిగా ఉన్న నీటిని కూడా ఉపయోగించకూడదు. జుట్టుకు రంగు వేసుకోవడం పట్ల ఇష్టం ఉన్నా సరే.. పదే పదే రంగు వేయకూడదు. ఇది జుట్టును బలహీనపరుస్తుంది. జుట్టు రాలిపోవడానికి, పలుచగా మారడానికి కారణం అవుతుంది. *రూపశ్రీ.
మీ హైట్ తక్కువా? ఇలా చీర కడితే పొడవుగా కనిపిస్తారు..! మనిషి రూపం మనిషి అందాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా అందానికి మారు పేరుగా చెప్పే అమ్మాయిలు అందంగా కనిపించే విషయంలో ఎక్కడా రాజీ పడరు. శరీరంలో ఏం తక్కువైనా సరే.. ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి చూపరులను ఆకట్టుకుంటారు. కొందరు అమ్మాయిలు చాలా పొట్టిగా ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి దుస్తులు వేసినా చిన్న పిల్లల్లా కనిపిస్తారు. ముఖ్యంగా పెద్దరికానికి మారు పేరుగా చెప్పుకునే చీరను ధరించాలంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు సతమతం అవుతారు. కానీ చీర కట్టుకుని అందంగా మెరిసిపోవడం ప్రతి అమ్మాయి కల. అయితే పొట్టిగా ఉన్న అమ్మాయిలు కొన్ని టిప్స్ పాటిస్తూ చీర కడితే వారి హైట్ ను హైడ్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుంటే.. ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు చీరల సెలక్షన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కంటికి బాగా కనిపించడం కాదు.. తమ ఒంటికి ఏవి నప్పుతాయో.. తమ హైట్ ను ఏవి బాగా కవర్ చేస్తాయో తెలుసుకోవాలి. హైట్ తక్కువగా ఉన్నవారు బోల్డ్ గా ఉన్న చీరలు, పెద్ద ప్రింట్లు ఉన్న చీరలు ధరించకూడదు. ఇలాంటి చీరలు పొట్టిగా ఉన్న అమ్మాయిలను మరింత పొట్టిగా కనిపించేలా చేస్తుంది. పొట్టిగా ఉన్న అమ్మాయిలు షిపాన్ ఫాబ్రిక్ చీరలు ఎంపిక చేసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అతుక్కున్నట్టు ఉంటాయి. అందంగా కనిపించేలా చేస్తాయి. బొమ్మకు కట్టినట్టు చక్కగా ఇమిడిపోతాయి. వేరే చీరలు అయితే కుచ్చిళ్లు, కొంగు, నడుము భాగంలో సరిగా సెట్ కావు. ఇవి బాగా లావుగా కనిపించేలా చేస్తాయి. దీని కారణంగా అప్పటికే ఉన్న పొట్టిదనం ఇంకా పొట్టిగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి పొట్టిగా ఉన్నవారు షిఫాన్ ఫాబ్రిన్ ఎంచుకోవాలి. షిఫాన్ చీరలు కేవలం సాధారణ సమయాలలోనే కాదు.. వేసవి కాలంలో కూడా బాగా సెట్ అవుతాయి. ఈ ఫాబ్రిక్ తేలికగా ఉంటుంది కాబట్టి వేసవిలో చిరాకు, అసహనానికి దారితీయవు. పైగా ఈ చీరలు ఎత్తు ఎక్కువగా కనిపించడంలో సహాయపడతాయి. షిఫాన్ చీర మాత్రమే కాకుండా జార్జెట్ చీర కూడా పొట్టిగా ఉన్నవారికి బాగా సెట్ అవుతుంది. ఎత్తు తక్కువగా ఉన్నవారు చిన్న ప్రింట్లు ఉన్న చీరలను ఎంచుకుంటే మంచిది. పొట్టిగా ఉన్నవారు బనారసీ సిల్క్, ఆర్ట్ సిల్క్, అస్సాం సిల్క్ వంటి చీరలు కట్టుకోకపోతేనే బెస్ట్. ఇవి చాలా హెవీగా ఉంటాయి. హైట్ ను హైడ్ చేయడానికి బదులు ఆ బరువు చీరలు ఇంకా పొట్టిగా కనిపించేలా చేస్తాయి. ఒక వేళ సిల్క్ చీరల మీద ఇష్టం ఉంటే పేపర్ సిల్క్ చీరలను ఎంచుకోవడం బెస్ట్. *రూపశ్రీ.
అరటిపండుతో ఇలా ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి.. ముఖం మెరిసిపోతుంది..! అమ్మాయిలు చర్మ సంరక్షణ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో చాలా ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఫేస్ ప్యాక్ లు. కొందరు శనగపిండి, పసుపు, పెరుగు వంటి వంటింటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ వేస్తుంటారు. మరికొందరు పండ్లతో ఫ్రూట్ ఫేస్ ప్యాక్ వేస్తుంటారు. పండ్లతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకుని వేసుకోవడం వల్ల ముఖ చర్మానికి పోషణ లభిస్తుంది. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది. అరటి పండుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడితే అద్బుతమైన ఫలితాలు ఉంటాయట. అరటిపండుతో ఎన్ని రకాల ఫేస్ ప్యాక్ లు వేసుకోవచ్చు? వాటిని ఎలా తయారు చేసుకోవాలంటే.. అరటిపండు- తేనె ఫేస్ ప్యాక్.. అరటిపండును బాగా గుజ్జులాగా చేసి అందులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత కడిగెయ్యాలి. ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మానికి బాగా నప్పుతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, మెరిచేలా చేస్తుంది. అరటిపండు- పెరుగు.. బాగా పండిన అరటిపండులో రెండు చెంచాల పెరుగు వేయాలి. దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం మీద మచ్చలు తగ్గిస్తుంది. చర్మాన్ని టోన్ చేస్తుంది. అరటి పండు- ఓట్స్.. అరటిపండు, ఓట్స్ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. పండిన అరటిపండులో 2 చెంచాల ఓట్స్ పౌడర్ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా కూడా మారుతుంది. అరటిపండు-అలోవెరా.. అరటిపండు, అలోవెరా ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం చికాకులు తగ్గిస్తుంది. పండిన అరటిపండులో రెండు చెంచాల అలోవెరా జల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పేస్ ప్యాక్ వేసుకుని 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటిపండు- పసుపు.. అరటిపండు, పసుపు ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. చర్మం మీద మచ్చలను తగ్గిస్తుంది. పండిన అరటిపండులో అరటీస్పూన్ పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. అరటిపండు- బాదం.. ఈ ఫేస్ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి చాలా మంచిది. చర్మానికి పోషణ ఇస్తుంది. పండిన అరటిపండులో నానబెట్టి తొక్క తీసి మిక్సీ వేసిన బాదం పేస్ట్ వేయాలి. లేదంటే పండిన అరటిపండుతో కలిపి నానబెట్టిన బాదం ను మిక్సీ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం చాలా రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. తలకు పెట్టుకునే నూనె నుండి, షాంపూ, కండీషనర్ వాడటం వరకు. విడిగా తమకంటూ టవల్ ఉపయోగించడం నుండి.. తల స్నానం తరువాత జుట్టును ఆరబెట్టడం వరకు.. ఇలా ప్రతి దశలో చాలా కేర్ తీసుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవారు దువ్వెన విషయంలో మాత్రం పప్పులో కాలు వేస్తుంటారు. ఉపయోగించే దువ్వెన కూడా జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో కొందరు చెక్క దువ్వెనలు వాడుతున్నారు. ఇవి కూడా మేలు రకం చెక్కతో, ఆయుర్వేదం సూచించిన కలపతో తయారుచేసినవి ఉపయోగిస్తుంటారు. ఇంతకీ చెక్క దువ్వెనలు ఉపయోగించడం వల్ల జరిగేదేంటంటే.. ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువసేపు రబ్ చేసినప్పుడు అందులో నుండి విద్యుత్ పుట్టడం గమనించే ఉంటాం. ప్లాస్టిక్ దువ్వెనలు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. ప్లాస్టిక్ దువ్వెనతో తలలో దువ్వెటప్పుడు అవి ఉత్పత్తి చేసే విద్యుత్ కారణంగా జుట్టు, తల చర్మం దెబ్బ తింటుంది. ఇది జుట్టు బలహీనం కావడానికి, జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. కానీ చెక్క దువ్వెనలతో ఈ సమస్య ఉండదు. పైగా చెక్క దువ్వెనల దంతాలు పెద్దవిగా ఉండటం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. చెక్క దువ్వెన ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. ఇది తలలో తేమ నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. చెక్క దువ్వెన వెడల్పుగా, పెద్దగా ఉన్న దంతాలు కలిగి ఉంటుంది. దీంతో దువ్వుడం వల్ల తలకు తేలిక పాటి మసాజ్ చేసినట్టు ఉంటుంది. అంతే కాదు.. జుట్టు చిక్కులను కూడా సులువుగా వదిలిస్తుంది. ఈ కారణంగా ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల స్కాల్ప్ నుండి డెడ్ స్కిన్, చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. చెక్క దువ్వెనలు జుట్టుకు సహజ నూనెలు సమాంతరంగా పంపిణీ అయ్యేలా చేస్తాయి. ఇది జుట్టు ఆరోగ్యంగా, షైనింగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. చెక్క దువ్వెనలో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇవి కొన్ని ఆయుర్వేదం సూచించిన కలపతో తయారవుతాయి. కాబట్టి ఇవి తల చర్మానికి మేలు చేస్తాయి తప్ప చర్మాన్ని దెబ్బతీయవు. కాబట్టి అలర్జీలు వచ్చే అవకాశం తక్కువ. ఆయుర్వేదంలో చెక్క దువ్వెనకు చాలా ప్రాముఖ్యత ఉంది. పైగా చెక్క దువ్వెనలు ఉపయోగించడం పర్యావరణానికి కూడా మంచిది. ప్లాస్టిక్ దువ్వెనతో పోలిస్తే చెక్క దువ్వెనలు చాలా కాలం మన్నిక వస్తాయి. *రూపశ్రీ.
ఈ సీరమ్ ఇంట్లోనే తయారుచేసుకుని వాడండి.. ముఖం బంగారంలా మెరుస్తుంది..! అందం కోసం ఆరాటపడని అమ్మాయి ఉండదు. ఉన్న వయసు కంటే చిన్నగా కనిపించాలని, ముఖం మీద ఎటువంటి ముడతలు, మచ్చలు లేకుండా చర్మం క్లిస్టర్ క్లియర్ గా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దీనికోసం చాలా రకాల చిట్కాలు కూడా ఫాలో అవుతుంది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే క్రీములు, సీరమ్ లు ఈ కాలం అమ్మాయిలు చాలా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వల్ల కలిగే ఫలితాలు అంతంత మాత్రం గానే ఉంటాయి. కానీ ఇంట్లోనే సీరమ్ ను తయారు చేసుకుని వాడితే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి. ఇంతకీ అదేం సీరమ్.. దాన్ని ఎలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి? తెలుసుకుంటే.. టర్మరిక్ సీరమ్.. పసుపు చర్మానికి అద్బుతంగా పనిచేస్తుంది. ప్రాచీన ఆయుర్వేదం నుండి నేటి కాలం శాస్త్రీయ వైద్యం వరకు పసుపు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పచ్చి పసుపును సౌందర్య సాధనంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. చర్మం బంగారంలాగా మెరవాలంటే టర్మరిక్ సీరమ్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు.. కావలసిన పదార్థాలు.. పసుపు సీరమ్ తయారు చేసుకోవడానికి.. ఒక చెంచా బాదం నూనె.. రెండు స్పూన్ల అలోవెరా జెల్.. గ్లిజరిన్.. ఒక చెంచా.. స్వచ్చమైన పసుపు.. అర చెంచా.. రోజ్ వాటర్.. కొద్దిగా విటమిన్-ఇ క్యాప్సూల్.. ఒకటి తయారీ విధానం.. పసుపు సీరమ్ ను తయారు చేయడానికి ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా బాదం నూనె వేయాలి. అందులోనే రెండు స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి. దీంట్లోనే స్వచ్చమైన పసుపు అర చెంచా వేయాలి. ఒక చెంచా గ్లిజరిన్ కలపాలి. ఇందులో ఒక క్యూప్సూల్ విటమిన్-ఇ నూనెను కలుపుకోవాలి. వీటన్నింటిని మిక్స్ చేసి ఈ మిశ్రమం సీరమ్ లాగా ఉండేలా అందులో రోజ్ వాటర్ కొద్దిగా కలపాలి. మిశ్రమం బాగా మిక్స్ చేశాక సీరమ్ రూపంలోకి వచ్చిందని అనిపించాక దీన్ని ఒక కంటైనర్ లో వేసుకుని భద్రపరుచుకోవాలి. పసుపు సీరమ్ వాడటానికి రెఢీగా ఉన్నట్టే.. ఎలా వాడాలి? పసుపు సీరమ్ వాడటం చాలా సులభం. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత ముఖాన్ని తడి లేకుండా పొడి టవల్ తో తుడుచుకోవాలి. రెండు చుక్కల పసుపు సీరమ్ ను ముఖ చర్మం మీద డ్రాప్స్ లాగా వేసుకుని ముఖమంతా అప్లై చేసుకోవాలి. రాత్రంతా దీన్ని అలాగే ఉంచుకుని ఉదయాన్నే సాధారణంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ప్రయోజనాలు.. పసుపు సీరమ్ ను రాత్రి సమయంలో ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటే ముఖం మీద మచ్చలు, మొటిమలు, మంగు, ముఖం మీద ఉన్న గుంటలు వంటివన్నీ మెల్లగా తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా బంగారం లాగా మెరుస్తుంది. ఎంత ఖరీదైన క్రీములు వాడినా ఇవ్వని ఫలితాలను ఇది ఇస్తుంది. *రూపశ్రీ.
అధికశాతం మంది ఫాలో అయ్యే ఈ బ్యూటీ టిప్స్ తో చాలా డేంజర్..! అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు అందంగా కనిపించడం ఇష్టం. అబ్బాయిలు కూడా తామేమీ తీసిపోవట్లేదని నిరూపిస్తూ ఫేష్ వాష్ లు, బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. చాలామంది అమ్మాయిలు సూర్యకిరణాల వల్ల నలుపెక్కిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నో బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. మరికొందరు వాణిజ్య ఉత్పత్తులలో ఉన్న రసాయనాలకు భయపడి ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. ఇవి మాత్రమే కాకుండా మొటిమలు, మచ్చలు, కాంతి వంతమైన చర్మం, కళ్ల కింద నల్లటి వలయాలు, ముడుతలు తగ్గించడం ఇలా చాలా వాటికి ఇంటి చిట్కాలు ఫాలో అవుతారు. అయితే చాలా మంచివి అనుకుంటూ అమ్మాయిలు ఇంట్లో వాడే కొన్నిహోం రెమిడీస్ చర్మాన్ని దారుణంగా దెబ్బతీస్తాయట. అవేంటో తెలుసుకుంటే.. శనగపిండి.. భారతదేశంలో ఎక్కువ మంది అమ్మాయిలు ఉపయోగించే సౌందర్య సాధనం శనగపిండి. వంటిట్లో ఉండే ఈ పిండిని ఫేస్ ప్యాక్ గా వేయడం నుండి ఫేష్ వాష్ గా కూడా వాడుతుంటారు. చిన్న పిల్లలకు శనగపిండి స్నానపు పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే శనగపిండి చర్మాన్ని చికాకు పరిచే అవకాశం ఉంటుంది. ట్యాన్ తొలగించడానికి బదులు చర్మం మీద ర్యాషెస్, దద్దుర్లు రావడానికి దారితీస్తుంది. వాల్నట్ స్క్రబ్.. చాలామంది అమ్మాయిలు ముఖం మీద మృతకణాలు, మచ్చలు, చర్మం గుంటలు పోవడానికి వాల్నట్ స్క్రబ్ ఉపయోగిస్తారు. అయితే ఇది మఖ చర్మాన్ని పాడుచేస్తుంది. ముఖ చర్మం సున్నితంగా అయ్యేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి వాల్నట్ స్క్రబ్ అస్సలు మంచిది కాదు. వాల్నట్ స్క్రబ్ కు బదులుగా పెరుగు ఉపయోగించవచ్చు. డెడ్ స్కిన్ ను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. నిమ్మరసం.. ముఖ చర్మం కాంతివంతంగా మారడం కోసం చాలామంది నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఇతర సిట్రస్ పండ్లు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా అయితే చేస్తుంది కానీ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. సూర్యకిరణాల ధాటికి చర్మం తొందరగా నల్లబడటం, చర్మ సమస్యలకు తొందరగా గురికావడం జరుగుతుంది. కాంతివంతమైన చర్మం కావాలని అనుకుంటే విటమిన్-సి సీరమ్ వాడాలి. ఆపిల్ వెనిగర్.. ఆపిల్ వెనిగర్ ను చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది ఘాడత ఎక్కువ ఉన్న కారణంగా తొందరగా చర్మాన్ని సున్నితంగా మార్చేస్తుంది. దీని బదులు లాక్టిక్ యాసిడ్ సీరమ్ అప్లై చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
కళ్ల చుట్టూ నల్లని వలయాలున్నాయా? ఈ టిప్స్ పాటించి చూడండి! అమ్మాయిలను చూడగానే ఇట్టే ఆకట్టుకునేది వారి ముఖమే. ముఖంలో కూడా ఎక్కువగా కనులు ఆకర్షిస్తాయి. కానీ నేటికాలంలో జీవినశైలి, ఆహారపు అలవాట్లు, రాత్రిసమయం ఎక్కువగా మేలుకోవడం, గంటల తరబడి డెస్క్ ముందు పనిచేయడం వంటి కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటినే డార్క్ సర్కిల్స్ అని అంటారు. వీటిని తగ్గించుకోవడానికి అధికశాతం మంది మార్కెట్లో దొరికే బ్యూటీ ఉత్పత్తులను వాడతారు. కానీ ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో అయితే కళ్ల కింద ఉన్న నల్లని వలయాలను సులువుగానే తొలగించుకోవచ్చు. కోల్డ్ కంప్రెస్.. కళ్లమీద చక్రాల్లా కోసిన కీర దోసకాయలు చల్లని స్టీలు స్పూన్లు, చల్లనీళ్లలో ముంచి తీసిన వాష్ క్లాత్ వంటివి కళ్లమీద ఉంచాలి. ఇవి కళ్ల చుట్టూ ఉబ్బిన చర్మాన్ని సాదారణంగా మారుస్తాయి. కళ్లచుట్టూ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఫలితంగా కళ్లచుట్టూ రక్తనాళాలను చురుగ్గా పనిచేస్తాయి. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి. టీ బ్యాగ్స్.. గ్రీన్ టీ ఇప్పట్లో చాలామంది వాడుతున్నారు. వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్ లో ఉంచాలి. అవి చల్లబడిన తరువాత కళ్లమీద పెట్టుకోవాలి. టీ బ్యాగ్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ కళ్ల చుట్టూ ఉన్న చర్మ రంగును మార్చడంలో సహాయపడాయి. కళ్లచుట్టూ ఉన్న చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఇందుకోసం చమోమిలే లేదా గ్లీన్ టీ బ్యాగ్స్ ఉపయోగించవచ్చు. బంగాళాదుంప ముక్కలు.. కీరదోస ముక్కల్లానే బంగాళాదుంప ముక్కలను కూడా కళ్లమీద ఉంచుకోవచ్చు. బంగాళాదుంపలలో ఉండే ఎంజైమ్ లు, విటమిన్-సి వాపులను, నలుపును తగ్గిచడంలో సహాయపడుతుంది. బాదం నూనె.. రాత్రి పడుకునేముందు కొన్ని చుక్కల బాదం నూనెను కళ్లచుట్టూ రాసుకుని సున్నితంగా మసాజ్ చెయ్యాలి.. బాదం నూనెలోని విటమిన్-ఇ కళ్ల కింద ఉన్న సున్నితమైన చర్మానికి పోషణ ఇచ్చి నల్లని వలయాలు తగ్గడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్.. చాలా తేలికగా లభించేది, అన్ని రకాల బ్యూటీ ట్రీట్మెంట్లల ఉపయోగించేది రోజ్ వాటర్. రోజ్ వాటర్ అలసిన కళ్లను తిరిగి తాజాగా మార్చడంలో సహాయపడుతుంది. కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిస్తుంది. కలబంద.. మంచి నాణ్యత కలిగిన అలోవెరా జెల్ కళ్లకింద ఉన్న నలుపును పోగొట్టడంలో సహాయపడుతుంది. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. పాలు.. చల్లారిన పాలలో కాటన్ ప్యాడ్ లు ఉంచి వాటిని కాస్త పిండి తేమగా ఉన్నట్టే మూసిన కన్నులపై ఉంచుకోవాలి. సుమారు 15నిమిషాలు ఇలా ఉంచుకున్న తరువాత తీసేయాలి. పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీవనశైలి ముఖ్యం.. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు నివారించడానికి లేదా తగ్గించడానికి జీవనశైలి కూడా చాలా ముఖ్యం. రోజూ తగినంత నిద్ర, పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా పొందడం, రోజూ సరిపడినంత నీరు తాగడం, తీవ్రమైన సూర్యుడి కిరణాలకు కళ్లు నేరుగా ఎక్స్పోజ్ కాకుండా చూడటం ద్వారా కళ్ల కింద నల్లని వలయాలను పరిష్కరించుకోవచ్చు. *నిశ్శబ్ద.
పెడిక్యూర్ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి.. బ్యూటీ పార్లర్ అక్కర్లేదు..! మగువలు శరీరంలో ప్రతి భాగం గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వెంట్రుకల నుండి పాదాల వరకు ప్రతీదీ వారి సౌందర్య సంరక్షణలో భాగమే.. ముఖ్యంగా పాదాలు చాలా తొందరగా ప్రభావానికి గురవుతూ ఉంటాయి.దుమ్ము,ధూళి, కాలుష్యం, ఎక్కువ తేమ తగలడం వంటి కారణాల వల్ల పాదాలు పగలడం, గరుకుగా మారడం, కళ కోల్పోవడం, పాదాల చర్మం పొట్టులాగా లేవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది బ్యూటీ పార్లర్ కు వెళ్లి పాదాలకు పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు. కానీ కేవలం నిమ్మకాయ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ చేసుకోవచ్చు. కావసిన పదార్థాలు.. ఇంట్లోనే పెడిక్యూర్ చేయడానికి 2, 3 నిమ్మ తొక్కలు 1 షాంపూ సాచెట్ ఆముదం బేబీ ఆయిల్ బేకింగ్ సోడా అవసరం అవుతాయి. పెడిక్యూర్ పేస్ట్.. 1 గ్లాసు నీటిని వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో నిమ్మ తొక్కలు వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఒక పెద్ద పాత్రలో వేసి ఎక్కువ నీరు కలపాలి. దీనివల్ల పాదాలకు సరిపడినంత నీరు సమకూరుతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన నిమ్మతొక్కకు స్క్రబ్ మిశ్రమం వేసుకుని పాదాలను బాగా రబ్ చేసుకోవాలి. దీని తరువాత, నిమ్మ తొక్కతో గోర్లు, ముఖ్యంగా గోర్ల మూలలను శుభ్రం చేయాలి. తర్వాత నీళ్లతో పాదాలను శుభ్రంగా కడగాలి. స్క్రబ్ ఎలా చేసుకోవాలంటే.. ఒక గిన్నెలో 1 టీస్పూన్ బేబీ ఆయిల్, 1 టీస్పూన్ ఆముదం, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్టే ను పాదాలకు స్ర్కబ్ లాగా ఉపయోగించాలి. *రూపశ్రీ.
అవాంఛిత రోమాలను శరీరంలో ఏ భాగం నుండి ఎలా తొలగించాలంటే..! అవాంఛిత రోమాలు సాధారణంగా అమ్మాయిలను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందమైన దుస్తులు ధరించాలంటే కనీసం కాళ్లు చేతుల మీద కూడా వెంట్రుకలు లేకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవాలంటే అండర్ ఆర్మ్ లో అవాంఛిత రోమాలు తొలగించుకోవాల్సిందే.. ముఖం మీద.. కొందరికి పెదవుల మీద.. మరికొందరు బికినీ ఏరియాలో అవాంఛిత రోమాలు తొలగిస్తుంటారు. ఇప్పట్లో అవాంఛిత రోమాలు తొలగించడానికి హెయిర్ రిమూవల్ క్రీములు, రేజర్ లు అందుబాటులో ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండానే వాటిని తొలగిస్తుంటారు. కానీ ఏ ప్రాంతంలో అవాంఛిత రోమాలను ఎలా తొలగించాలో చాలామందికి తెలియదు. చర్మ సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెప్పారో తెలుసుకుంటే.. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి సురక్షితమైన మార్గం షేవింగ్. ఇప్పట్లో మార్కెట్లో చాలా రేజర్ లు మాత్రమే కాకుండా చిన్నపాటి ఫేషియల్ హెయిర్ రిమూవర్ బ్లేడ్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. పై పెదవులు, కనుబొమ్మల దగ్గర వెంట్రుకలను తొలగించడానికి థ్రెడింగ్ ఉత్తమ మార్గం. ఇది చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో షేపింగ్, వ్యాక్సింగ్ చేయరాదు. అండర్ ఆర్మ్ హెయిర్ తొలగించడానికి వాక్సింగ్ ఉత్తమ మార్గం. బికినీ ప్రాంతం కోసం కత్తెరతో హెయిర్ ను చిన్నగా కత్తిరించండి లేదా ట్రిమ్మర్ని ఉపయోగించండి. చేతులు, కాళ్ళ నుండి అవాంఛిత రోమాలను తొలగించడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్లను ఉపయోగించవచ్చు. మీరు చేతులు. కాళ్ళపై వెంట్రుకలు చాలా వేగంగా పెరిగే సమస్య ఉంటే, అప్పుడు ట్రిమ్మర్ ఉపయోగించవచ్చు. శరీరంలోని ఏ భాగానైనా అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించడానికి లేజర్ హెయిర్ రిమూవల్ చేయవచ్చు. సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ మార్గదర్శకత్వంలో ఎల్లప్పుడూ లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి. హెయిర్ ను బట్టి అనుగుణంగా లేజర్ శక్తిని వినియోగిస్తారు. డెర్మటాలజిస్టులు చెబుతున్న పద్ధతులు వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. షేవింగ్ గురించి మాట్లాడటం, షేవింగ్ చేయడం సులభం. పార్టీకి వెళ్లవలసి వస్తే లేదా ఏదైనా పని ఉంటే చివరి నిమిషంలో దీన్ని చేయవచ్చు. అంతేకాదు షేవింగ్ చేయడం వల్ల నొప్పి ఉండదు. జాగ్రత్తగా షేవింగ్ చేయడం ముఖ్యం లేకపోతే చర్మంపై కోతలు ఏర్పడవచ్చు, లేదా రేజర్ బర్న్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు షేవింగ్ చేయడం వల్ల ఇన్గ్రోన్ హెయిర్ సమస్య కూడా వస్తుంది. వ్యాక్సింగ్ చేస్తే జుట్టు చాలా వారాల వరకు తిరిగి పెరగదు. వ్యాక్సింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంత నొప్పి ఉంటుంది. మైనం చాలా వేడిగా ఉంటే అది చర్మాన్ని కమిలిపోయేలా చేస్తుంది. అందుకే వ్యాక్సింగ్ చేసేటప్పుడు లేదా చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. హెయిర్ రిమూవల్ క్రీమ్తో హెయిర్ రిమూవ్ చేస్తుంటే ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడాలి. *రూపశ్రీ.
ఇంట్లోనే తయారు చేసే ఈ క్రీములు వాడితే పాదాలు కోమలంగా మారతాయి..! స్త్రీలు తమ శరీరంలో ప్రతి భాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చేతి వేళ్ల నుండి పాదాల వరకు అన్ని విషయాల్లో శ్రద్ద తీసుకుంటారు. సాధారణంగా వర్షాకాలంలో పాదాల సమస్యలు పెరుగుతాయి. పాదాల మడమలు పగిలి నొప్పి పెడతాయి. మరికొన్ని సార్లు బ్యాక్టీరియా, ఫంగస్ కారణంగా పుండ్లు కూడా వస్తాయి. వీటికోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీమ్ లు కొనుగోలు చేసి వాడుతుంటారు. వీటికి బదులు ఇంట్లోనే పాదాల క్రీమ్ లను తయారు చేసుకుని వాడవచ్చు. కొబ్బరినూనె, షియా బటర్ క్రీమ్.. సమాన పరిమాణంలో కొబ్బరినూనె, షియా బటర్ క్రీమ్ ను తీసుకుని రెండింటిని కలపాలి. ఈ క్రీమ్ ను రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. రోజూ రాత్రి ఇలా చేస్తుంటే పాదాలు మృదువుగా మారతాయి. తేనె, కలబంద క్రీమ్.. 1టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ మిక్స్ చేయాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి 15-20 నిమిషాల పాటూ ఉంచాలి. ఆ తరువాత కడిగేయాలి. తేనె చర్మానికి మృదుత్వాన్ని, పగిలిన పాదాలకు ఓదార్పును ఇస్తుంది. కలబంద చర్మాన్ని హీలింగ్ చేస్తుంది. అవకాడో, బనానా క్రీమ్... పండ్లతో తయారు చేసుకునే క్రీమ్స్ చర్మాన్ని చక్కగా ట్రీట్ చేస్తాయి. అవకాడో, పండిన అరటిపండు రెండింటిని కలిపి క్రీమ్ లాగా చేసుకోవాలి. దీన్ని పగిలిన పాదాలకు పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది చీలమండల నొప్పి నుండి తొందరగా ఉపశమనం ఇస్తుంది. విటమిన్-ఇ, లావెండర్ ఆయిల్ క్రీమ్.. విటమిన్-ఇ క్యాప్సూల్ ఆయిల్, కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు పాదాలకు అప్లై చేయాలి. చాలా చక్కని ఫలితం ఉంటుంది. టీట్రీ ఆయిల్, పెప్పర్ మెంట్ క్రీమ్.. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్, పెప్పర్ మెంట్ ఆయిల్ తీసుకోవాలి. దీనికి ఒక స్పూన్ కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి సున్నితంగా మర్థనా చేసుకోవాలి. పగుళ్ల దగ్గర మరింత ఎక్కువ రాసుకోవాలి. ఇది చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. పాలు, తేనె క్రీమ్.. పాలు, తేనెను సమాన పరిమాణంలో తీసుకుని మిక్స్ చేయాలి. కొన్ని నీటిలో ఈ మిశ్రమం వేసి కలపాలి. ఈ నీళ్లలో పాదాలను ముంచి 15 నిమిషాల పాటూ నానబెట్టాలి. ఇది పాదాలకు చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. షీ బటర్, లెమన్ జ్యూస్.. షీ బటర్ ను కరిగించి అందులో నిమ్మరసం కలపాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి కొన్ని నిమిషాల తరువాత కడిగేయాలి. రోజ్ వాటర్, గ్లిజరిన్.. చాలా సులువుగా, చవకగా చేసుకోదగ్గ క్రీమ్ ఇది. సమాన మొత్తంలో రోజ్ వాటర్, గ్లిజరిన్ తీసుకుని మిక్స్ చేయాలి. రోజూ నిద్రపోయే ముందు పాదాలకు అప్లే చేయాలి. కొన్ని రోజుల్లోనే పాదాలు మృదువుగా కోమలంగా మారతాయి. *రూపశ్రీ.
పండుగలు, పూజలు, శుభకార్యాలు, ఫంక్షన్లు అంటే అమ్మాయిలకు చెప్పలేనంత ఇష్టం. వీటి సందర్భంగా అందంగా ముస్తాబు అవ్వచ్చు. అందరికీ తమ స్పెషాలిటీ ప్రెజెంట్ చేయవచ్చు. అయితే ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు చాలా మంది బ్యూటీ పార్లర్స్ కు పరుగులు పెడుతూ ఉంటారు. అక్కడ చేసే ఫేషియల్, మసాజ్, స్క్రబ్ మొదలైనవాటికి వందలాది రూపాయలు ధారపోస్తుంటారు. అయితే అలాంటి అవసరం లేకుండా.. ఇంటి పట్టునే శనగపిండితో స్ర్కబ్ తయారుచేసుకోవచ్చు. దీన్ని వాడితే ముఖం మెరిసిపోతుంది. ఇంతకీ శనగపిండితో స్ర్కబ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. శనగ పిండి, పెరుగు.. ఈ స్క్రబ్ చేయడానికి, ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని, అందులో తగినంత పెరుగు వేసి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమానికి సగం నిమ్మకాయ రసాన్ని జోడించవచ్చు. ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసి టాన్ అయిన చర్మంపై అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై కూడా అప్లై చేసి కొంత సమయం పాటు ఉంచుకోవచ్చు. దీని తరువాత చర్మాన్ని బాగా కడగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. టానింగ్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ స్క్రబ్ని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించడం వల్ల చర్మం క్లిస్టర్ క్లియర్ అవుతుంది. శనగ పిండి, పసుపు.. ఈ స్క్రబ్ టానింగ్ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీనికి 4 నుండి 5 చెంచాల శనగ పిండిని అర చెంచా పసుపు, నీరు లేదా పెరుగుతో అవసరాన్ని బట్టి కలిపి పేస్ట్ను సిద్ధం చేయాలి. దీనికి నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. టానింగ్ ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ అప్లై చేయాలి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేయాలి. శనగ పిండి, పాలు.. గ్లోయింగ్ స్కిన్ పొందడానికి, చర్మంలోని మృతకణాలను తొలగించడానికి శనగపిండిలో పాలు, నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారుచేయాలి. 4 చెంచాల శనగ పిండికి ఒక చెంచా నిమ్మరసం, పాలు అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు. దీన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళపై అప్లై చేయాలి. వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ స్క్రబ్ను చర్మంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది. శనగ పిండి, దోసకాయ.. ఈ స్క్రబ్ తయారు చేయడం చాలా సులభం. స్క్రబ్ చేయడానికి, దోసకాయ రసాన్ని 2 చెంచాల శనగ పిండిలో కలపాలి. ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం జోడించాలి. ఈ పేస్ట్ను బాగా మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి. లైట్ స్క్రబ్ తీసుకున్న తర్వాత చర్మంపై సుమారు 20 నుండి 25 నిమిషాలు అలాగే ఉంచి ఆపై దానిని కడగాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అయినా చర్మంపై రాసుకుంటే, ట్యానింగ్ను తగ్గించడంలో ప్రభావం కనిపిస్తుంది. *రూపశ్రీ.
తెల్లజుట్టు ఎక్కడైనా కనబడగానే చాలామంది గాభరా పడిపోతారు. ఒకే ఒక్కటి ఉంటే దాన్ని లాగేయడం చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉంటే వాటిని కవర్ చేయడానికి నానా తంటాలు పడతారు. అయితే తెల్లజుట్టును కవర్ చేయడానికి వాడే చాలా వాణిజ్య ఉత్పత్తులలో రసాయనాలుంటాయి. ఇవి జుట్టుకు రంగును తాత్కాలికంగా ఇస్తాయి కానీ మెదడులోపలి నరాలను చాలా దెబ్బతీస్తాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును నల్లగా మార్చే ఆకులు ఉన్నాయి. అవే గోరింట, నీలిమందు.. గోరింట.. గోరింట సాధారణంగా అందరికీ తెలిసిందే. ఇది చేతులకు మాత్రమే కాకుండా తెల్లజుట్టు కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా సహజమైన కలర్ గా పేర్కొనబడుతుంది. నీలిమందు.. సాధారణంగా నీలిమందును బట్టలకు వాడటమే తెలిసి ఉంటుంది. కానీ నీలిమందును గోరింటలో కలిపి జుట్టుకు పెట్టుకుంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. గోరింట, నీలిమందు హెయిర్ డై.. జుట్టు పరిమాణాన్ని బట్టి గోరింట పొడిని తీసుకోవాలి. ఈ గోరింట పొడిలో టీ పొడి ఉడికించిన నీటిని వేసి పేస్ట్ లాగా కలపాలి. ముదురు రంగు రావడం కోసం ఇందులో కాస్త నిమ్మరసం కూడా కలపవచ్చు. గోరింట మిశ్రమాన్ని రాత్రంతా ఒక ఇనుప బాండిలోనే ఉంచాలి. మరుసటి రోజు గోరింట మిశ్రమంలో గోరింట పొడి కంటే ఎక్కువ నీలి మందు పొడి వేయాలి. దీన్ని పేస్ట్ లా చేసుకోవడానికి ఇందులో పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ఓ గంటసేపు అలాగే వదిలేయాలి. ఆ తరువాత దీన్ని జుట్టును పాయలు పాయలుగా తీసుకుంటూ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. కనీసం రెండు నుండి మూడు గంటల పాటూ దీన్ని ఉంచుకోవాలి. ఈ హెయిర్ డై ని 15 నుండి 20 రోజులకు ఒకసారి జుట్టుకు అప్లై చేస్తుంటే మూడు లేదా నాలుగు సార్లకే తెల్లజుట్టు పూర్తీగా నలుపురంగులోకి మారుతుంది. ఇది కేవలం జుట్టును నల్లగా మార్చడమే కాదు.. గోరింటలోని గుణాలు, నిమ్మరసం, టీ డికాషన్ ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. *నిశ్శబ్ద.
పెదవులు గులాబీ రేకుల్లా కనిపించాలంటే ఇంట్లోనే ఇలా లిప్ బామ్ రెఢీ చేసుకోండి..! పెదవులు అందంగా, కోమలంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే చాలామంది పెదవులు అంత అందంగా ఉండవు. వీటికి లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్, లిప్ గ్లాస్ వంటివి వేసి అందంగా తయారుచేస్తుంటారు. కానీ ఇవన్నీ రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి కాకుండా పెదవులను సహజంగా కోమలంగా, అందంగా మార్చేందుకు ఇంట్లోనే లిప్ బామ్ ను తయారచేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. గరుకుగా, పొడిగా, నిర్జీవంగా వాడిపోయినట్టు ఉండే పెదవుల కోసం ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. దీన్ని వాడితే పెదవులు మృదువుగా, గులాబీ రంగులోకి మారతాయి. గులాబీ రంగు పెదాలు కావాలంటే బీట్ రూట్ లిప్ బామ్ తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి ఏం కావాలంటే.. పెట్రోలియం జెల్లీ.. ఒకటిన్నర స్పూన్. బీట్ రూట్ రసం.. అర టీ స్పూన్ తేనె.. అర టీ స్పూన్. తయారీ విధానం.. మొదట పెట్రోలియం జెల్లీ , తెనె ఒక చిన్న కంటైనర్ లో వేయాలి. అందులో బీట్ రూట్ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని మైక్రో ఓవెన్ లో 30 సెకెన్లు ఉంచాలి. మైక్రో ఓవెన్ లేనివాళ్లు దీన్ని డబుల్ బాయిల్ మెథడ్ లో వేడి చేయవచ్చు. వేడి చేసిన తరువాత ఈ లిప్ బామ్ లిక్విడ్ ను ఒక కంటైనర్ లో వేయాలి. దీన్ని ఫిజ్ లో ఉంచి అరగంట తరువాత బయటకు తీయాలి. ఇప్పుడు బీట్ రూట్ లిప్ బామ్ ఉపయోగించడానికి సిద్దంగా ఉన్నట్టే.. ఈ లిప్ బామ్ ను రోజూ పెదవుల మీద అప్లై చేస్తుంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది పెదవుల మీద మృతకణాలను తొలగిస్తుంది. పెదవుల నలుపు పోయేలా చేస్తుంది. పెదవుల చర్మాన్ని రిపేర్ చేస్తుంది. పెదవులు అందంగా, నాజూగ్గా, గులాబీ రంగులోకి మారేలా చేస్తుంది. *రూపశ్రీ.
అమ్మాయిలూ.. రోజ్ వాటర్ ను ఇలా అస్సలు వాడకండి! రోజ్ వాటర్ అమ్మాయిలు చాలా ఎక్కువగా ఉపయోగించే సౌందర్య సాధనం. నేరుగా ముఖానికి పట్టించాలన్నా, టోనర్ గా వాడాలన్నా, మేకప్ తొలగించిన తరువాత ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచాలన్నా, ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించాలన్నా రోజ్ వాటర్ చాలా విరివిగా ఉపయోగిస్తారు. బోలెడు బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయనే కారణంతో చాలామంది అమ్మాయిలు రోజ్ వాటర్ ను వివిధ పదార్థాల కాంబినేషన్ లో ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖం చాలా చండాలంగా మారుతుంది. అకారణంగా ముఖం మీద దద్దుర్లు, మచ్చలు రావడం. ముఖ చర్మం పాడైపోవడం జరుగుతుంది. అసలు రోజ్ వాటర్ వల్ల కలిగే లాభాలేంటి? దీన్ని ఎలా వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఎలా వాడకపోవడం మంచిది? పూర్తీగా తెలుసుకుంటే.. గులాబీ రేకులను ఆవిరి చెయ్యడం ద్వారా గులాబీ నీరు తయారు చేస్తారు. ఇది ముఖం మీద గీతలు, మచ్చలు తొలగించడమే కాకుండా ముడుతలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే రోజ్ వాటర్ లో కొన్ని రకాల పదార్థాలను కలపడం వల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది. రోజ్ వాటర్ లో నూనె పదార్దాలు కలిపి రాయకూడదు. రోజ్ వాటర్ నీటి గుణం కలిగి ఉంటుంది, నూనె రోజ్ వాటర్ లో సరిగా కలవదు. ఈ కారణంగా ముఖం మీద నీరు, నూనె గందరగోళం సృష్టించి మచ్చలు రావడానికి కారణం అవుతుంది. మొదట శుభ్రమైన ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేసి ఆరిన తరువాత దానిమీద ఫేస్ ఆయిల్ అప్లై చెయ్యాలి. విటమిన్-సి అధికంగా ఉండే నిమ్మరసం, నారింజ రసం వంటివి రోజ్ వాటర్ లో కలపకూడదు. ఇది చర్మాన్ని చికాకు పెడుతుంది. ర్యాషెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కొందరికి టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి వాడే అలవాటు ఉంటుంది. అయితే ఆల్కహాల్ ఆధారిత టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి అస్సలు వాడకూడదు. మరీ ముఖ్యంగా సున్నిత చర్మం ఉన్నవారు, పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా నష్టం కలిగిస్తుంది. రోజ్ వాటర్ ను ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తుంటారు. సున్నిత చర్మం, పొడిచర్మం ఉన్నవారు దీన్ని వాడకపోవడం మంచిది. ముల్తానీ మట్టిలో PH స్థాయిలు ఉంటాయి. ఇవి ముఖాన్ని పాడు చేస్తాయి. *నిశ్శబ్ద.
ముఖం పై బ్లీచ్ ను ఎంతసేపు ఉంచుకోవాలి ! ముఖం గ్లో పెంచడానికి మహిళలు ఫేషియల్ తర్వాత బ్లీచింగ్ ట్రీట్మెంట్ మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ బ్యూటీ ట్రీట్మెంట్ తో ముఖంపై అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. బ్లీచింగ్ పద్ధతి చాలా సులభం అయినప్పటికీ కొన్నిసార్లు ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అందుకే బ్లీచ్ చేసుకునే ముందు లేదా చేయించుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖం మీద బ్లీచ్ను ఎంతకాలం ఉంచాలో.. ఇతర జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. ఏం చేయాలి.. ముఖం మీద బ్లీచ్ ను 10 నిమిషాలు మాత్రమే ఉంచాలి. దీని కంటే ఎక్కువ సమయం ఉంచితే అది చర్మానికి హాని కలిగిస్తుంది, ఇది చర్మానికి హాని కలిగించే క్లోరిన్ వినియోగాన్ని పెంచుతుంది. అలెర్జీలు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది. రాత్రిపూట బ్లీచ్ వేయడం ఉత్తమం. ఇది సహజ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్లీచ్ తొలగించిన తర్వాత ముఖంపై మరే ఇతర క్రీమ్ ఉపయోగించకూడదు. ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. చర్మం నుండి అదనపు నూనె, మురికిని తొలగించడానికి మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడానికి బ్లీచింగ్ చేయడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఏం చేయకూడదు.. బ్లీచింగ్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. బ్లీచింగ్ చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. ఎండలోకి వెళితే సూర్య కిరణాలు ఈ సున్నితత్వాన్ని పెంచుతాయి. కుదిరితే బ్లీచింగ్ తరువాత 48 గంటల పాటూ ఎండ తగలకుండా ఉండటం మంచిది. దద్దుర్లు లేదా చికాకును నివారించడానికి కళ్ళు లేదా పెదవుల వంటి సున్నితమైన ప్రదేశాలలో బ్లీచ్ను పూయడం మానుకోవాలి. *రూపశ్రీ.
డార్క్ స్పాట్స్ ను ఇంట్లోనే ఇలా ఈజీగా తగ్గించేయండి..! డార్క్ స్పాట్స్ అమ్మాయిల అందాన్ని చాలా పాడు చేస్తాయి. ముఖం మీద వృత్తాకారంలో నల్లగా కనిపించే ఈ డార్క్ స్పాట్స్ ను చాలావరకు మేకప్ తో కవర్ చేస్తుంటారు. అయితే ఇంటి పట్టునే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. అలోవెరా జెల్.. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది. అలోవెరా జెల్ని డార్క్ స్పాట్స్కి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఒక వారం పాటు అప్లై చేస్తే తేడా కనిపిస్తుంది. నిమ్మ, తేనె.. నిమ్మరసం, తేనె రెండూ హైపర్పిగ్మెంటేషన్కు సహజ నివారణలు. నిమ్మరసం, తేనె రెండూ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. సన్స్క్రీన్ .. సూర్యరశ్మి వల్ల డార్క్ స్పాట్లు అధ్వాన్నంగా ఉంటాయి. సూర్యుని కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి తగిన సన్స్క్రీన్ను అప్లై చేయడం అవసరం. నీరు .. చర్మాన్ని హైడ్రేటెడ్, ఆరోగ్యంగా ఉంచడానికి రోజంతా తగినంత నీరు త్రాగాలి. మజ్జిగ.. మజ్జిగ చర్మంలోని మృతకణాలను తొలగించి నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. నల్లటి మచ్చల మీద మజ్జిగ అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్ మాస్క్.. ఆరెంజ్ పీల్ స్కిన్ టోన్ కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ముఖానికి నారింజ మాస్క్ను అప్లై చేసి 10-12 నిమిషాలు ఆరనివ్వాలి. ఆపై ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పసుపు, పెరుగు.. పసుపు చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగు చర్మానికి ఓదార్పు ఇస్తుంది. 2 టేబుల్ స్పూన్ల పెరుగులో చిటికెడు పసుపు పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి, చేతులకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడిగి మెత్తని టవల్తో తుడుచుకోవాలి. *రూపశ్రీ.