ఒత్తైన జుట్టు రహస్యం ఈ ఆయిల్ సొంతం! అమ్మాలకు ఒత్తైన, పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం. జుట్టు పెరగదు కాబట్టి అలా ఉంటారు కానీ.. అందంగా ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉన్న జుట్టు పెరుగుతుంటే ఎవరు మాత్రం మాకొద్దు అని అంటారు చెప్పండి. నడుము వరకు పొడవాటి మందపాటి జుట్టు కావాలనుకుంటే మంచి హెయిర్ ఆయిల్ వాడాలి. మార్కెట్లలో బోలెడు హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. ఇంత పెద్ద జుట్టు, ఇంత ఒత్తైన జుట్టు అంటూ ఒకటే ప్రమోషన్లు ఊదరగొట్టేస్తాయ్. వాళ్లకు మార్కెట్ పెరుగుతుంది తప్ప.. మీ తలలో జుట్టు కనీసం ఒక ఇంచ్ అయినా పెరగదు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడం కోసం కొంచెం ఓపిక తెచ్చుకుని ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారుచేసుకుంటే.. చాలా చక్కని ఆలోచన కానీ.. యూట్యూబ్ లలో చూపించే బోలెడు చిట్కాల కారణంగా ఈ హెయిర్ ఆయిల్ సొంతంగా తయారుచేసుకోవడంలో కూడా కాస్త కన్ఫ్యూజనే.. అలాంటి కన్ఫ్యూజన్ తప్పించి ఒక క్లారిటీతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకునేవిధానం మీకోసం… ఈ హెయిర్ ఆయిల్ గురించి చెప్పే ముందు.. అసలు ఇది ఎందుకు వాడాలి. చాలామందికి జుట్టు పలుచగా.. పొట్టిగా ఎందుకు ఉంటుంది?? అనే విషయం కూడా తెలుసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రెండు రకాలుగా పోషకాలు అందాలి. ఒకరి ఆహారం ద్వారా కడుపుకు తీసుకోవడం అయితే.. రెండవది బయటి నుండి జుట్టుకు పోషకాలు అందించడం. హెయిర్ ప్యాక్ లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ మసాజ్ ఇవన్నీ జుట్టుకు పోషకాలు అందించేవే.. కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా జుట్టు మరింత సమస్యలొకి జారుకుంటుంది. జుట్టుకు ఇలాంటి సమస్యలన్నీ తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు.. కొలతలతో సహా కావలసిన పదార్థాలు.. తయారీ విధానం ఇదిగో ఇక తెలుసుకోండి. కావలసిన పదార్థాలు.. 2 టేబుల్ స్పూన్లు మెంతులు 2 టేబుల్ స్పూన్లు నల్ల విత్తనాలు(కలోంజి సీడ్స్) 20 బాదంపప్పులు 10 నుండి 20 మందార ఆకులు 2 మందార పువ్వులు -20 నుండి 25 కరివేపాకు రెండు తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు కొబ్బరి నూనె. ముందుగా బాదం, మెంతి, కలోంజి గింజలను మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి, ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద చిన్న పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడి అయ్యాక అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మిక్సీ పట్టిన పౌడర్ వేయాలి. ఆ తరువాత పేస్ట్ చేసిన ముద్ద వేసి కాస్త సిమ్ మీద ఉడికించాలి. మిశ్రమం అంతా ఉడికి నూనె పైకి తేరిన మూమెంట్లో గ్యాస్ ఆఫ్ చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత, ఒక చిన్న ప్లాస్టిక్, లేదా గాజు సీసా తీసుకుని, దానిపై కాటన్ క్లాత్ వేసి వడగట్టుకోవాలి. దీన్ని డబల్ ఫిల్టర్ చేస్తే నూనె చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇక ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ రెడి అయినట్టు. ఇది మీకు వాసన వస్తుంది అనిపిస్తే దీంట్లొకి రోజ్ మేరీ ఎసెంటియల్ ఆయిల్ లేదా లావెండర్, రోజ్ ఇలా ఏదైనా వాడచ్చు. ఈ ఆయిల్స్ కలపడం వల్ల ఈ నూనె జుట్టుకు అప్లై చేసినప్పుడు తలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వారానికి ఒకసారి తలకు బాగా మసాజ్ చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో.. గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఎంతో అద్భుతంగా పెరుగుతుంది. ◆నిశ్శబ్ద.
ఈ టిప్ ఫాలో అయితే.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు సాఫ్ట్ గా మారతాయి..! చలికాలం మొదలవగానే పాదాల మడమలు పగలడం మొదలవుతాయి, అలాంటి పరిస్థితుల్లో పాదాలకు నూనె రాసుకున్నా లేదా వేరే క్రీములు రాసుకున్నా పగిలిన మడమలు మానడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల చలికాలంలో చాలా రోజులు ఈ మడమల వల్ల ఏర్పడిన పగుళ్ల నొప్పితో బాధపడతారు. కానీ పగిలిన మడమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలుసా..? కింద చెప్పుకోబోయే చిట్కాను పాలో అయితే ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయమవుతాయి. ఇందుకోసం కేవలం రెండు పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడం ఎలాగో తెలుసుకంటే.. క్రాక్ క్రీమ్ కోసం కావలసిన పదార్థాలు.. కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు గ్లిజరిన్ - 1 టీస్పూన్ విటమిన్ ఇ క్యాప్సూల్ - 1 (పై పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకుని క్రాక్ క్రీమ్ తయారు చేసుకుంటే క్రీమ్ ఎక్కువ తయారవుతుంది. దీన్ని నిల్వ చేసుకోవచ్చు కూడా.) తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 చెంచాల కొబ్బరి నూనె, 1 చెంచా గ్లిజరిన్, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపాలి. పగిలిన మడమలను నయం చేసి పాదాలను అందంగా మార్చే క్రీమ్ సిద్ధంగా ఉన్నట్టే. ఈ క్రీమ్ ను రాత్రిపూట ఉపయోగించాలి. క్రాక్ క్రీమ్ ను ఉపయోగించే ముందు ఒక బకెట్లో వేడి నీళ్లు పోసి అందులో పాదాలను 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాల సమయం ముగిసిన తర్వాత నీటి నుండి పాదాలను తీసి పొడ టవల్ తో శుభ్రంగా తుడవాలి. పాదాలు పొడిగా మారిన తరువాత సిద్ధం చేసిన క్రీమ్ను అప్లై చేసి, ఆపై కాటన్ సాక్స్ వేసుకుని నిద్రిపోవాలి. ఉదయానికల్లా పగుళ్లు ఏర్పడిన మడమల స్థానంలో మృదువుగా మారిన మడమలు ఉంటాయి. మొదటిసారే చాలా మార్పు కనిపిస్తుంది. ఈ విధంగా వరుసగా ఒక మూడు నాలుగు రోజులు చేశారంటే పాదాలు కోమలంగా మారిపోతాయి. ఈ క్రాక్ క్రీమ్ ఇచ్చే ఫలితాలు చూసి పక్కాగా షాకవుతారు. *రూపశ్రీ.
చలికాలంలో చర్మానికి భలే ప్రొటెక్షన్.. ఇంట్లోనే బాతింగ్ పౌడర్ ఇలా..! వాతావరణానికి తొందరగా ఎఫెక్ట్ అయ్యేది మొదట చర్మమే.. ప్రతి సీజన్ లోనూ దాని పర్యావసానం చూస్తూనే ఉన్నారు ప్రజలు. వేసవి అంటే భగ్గున మండటం ఎలా ఉంటోందో.. చలికాలం అలా మొదలయ్యిందో లేదో చాలా దారుణంగా చలి ఉంటోంది. దీని కారణంగా చర్మం చాలా తొందరగా పగుళ్లు వచ్చి ఇబ్బంది పెడుతుంది. పగిలిన చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్మ సంబంధ సమస్యలు మొదలవుతాయి. సాధారణంగా చలికాలం రాగానే సోప్, ఫేస్ వాష్ అన్నీ మార్చేస్తుంటారు. వాటికి బదులు ఇంట్లోనే బాతింగ్ పౌడర్ తయారు చేసుకుంటే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది నేచురల్ పౌడర్ కావడంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బాతింగ్ పౌడర్.. కావలసిన పదార్థాలు.. శనగపిండి.. లేదా శనగపప్పు.. పెసరపప్పు.. పసుపు.. 2 స్పూన్లు బియ్యం.. నాలుగు స్పూన్లు. షీకాయ పొడి లేదా కుంకుడు పొడి.. రెండు స్పూన్లు. తయారీ విధానం.. శనగపిండి ఒక కప్పు తీసుకోవాలి. లేదంటే ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో నాలుగు స్పూన్ల బియ్యం వేసి ఈ మూడింటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పొడి అయిన పిండిలో రెండు స్పూన్ల పసుపు, రెండు స్పూన్ల షీకాయ పొడి లేదా కుంకుడు కాయల పొడి వేసి మరొక్క సారి మిక్సీ తిప్పాలి. ఇలా చేస్తే అన్ని పదార్థాలు బాగా కలుస్తాయి. ఇలా మిక్సీ వేసుకున్న పిండిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఎలా వాడాలంటే.. తయారు చేసుకున్న పిండిని ఒక చిన్న కప్పులో ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీరు కలిపి మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఉన్న పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చేతిలోకి తీసుకుని తడి శరీరం మీద రుద్దుతూ సోప్ లాగే రాసుకోవాలి. ఈ పిండిలో కాస్త రవ్వలాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. సాధారణ చర్మం ఉన్నవారికి ఇది చక్కగా పనిచేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు ఇందులో నీటికి బదులు పాలు కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. చర్మ సంబంధ సమస్యలు పోవాలన్నాచర్మం సహజంగా నిగారింపు రావాలన్నా కూడా ఈ పొడి చక్కగా పనిచేస్తుంది. కనీసం వారానికి ఒకసారి శరీరానికి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె రాసుకుని గంట ఆగిన తరువాత ఈ పొడితో స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి. ఈ పొడిలోకి కాస్త పాలు, కొంచెం తేనె వేసి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఇందులో షీకాయను మినహాయించడం మంచిది. *రూపశ్రీ.
బంగాళదుంప గురించి మీకు తెలియని నిజం.. ఇలా ముఖానికి రాస్తే..! బంగాళదుంప ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఏ కర్రీలోకి అయినా ఇట్టే ఇమిడిపోతుంది. బంగాళదుంపల చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ మొదలైనవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే బంగాళదుంపలను ముఖానికి కూడా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా బంగాళదుంపను కింద చెప్పుకున్నట్టు ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోతుందట. బంగాళదుంపల స్టార్చ్.. బంగాళదుంపల నుండి పిండిని తయారు చేసి దాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మెరిసిపోతుందట. వందలు, వేలు ఖర్చు పెట్టిన క్రీములు ఇవ్వని ఫలితాన్ని బంగాళదుంపల స్టార్చ్ వల్ల లభిస్తుందట. బంగాళదుంప ముఖానికి ఎందుకంత ఎఫెక్ట్.. బంగాళాదుంపలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంపై మచ్చలను తేలికపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్లు చర్మం ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. బంగాళాదుంప పిండి బంగాళాదుంప రసం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి, నల్లటి వలయాలను తగ్గించడానికి, టానింగ్, పిగ్మెంటేషన్, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కావసిన పదార్థాలు.. బంగాళదుంప రసం - 1 గిన్నె నిమ్మరసం - 1/2 టీస్పూన్ పాలపొడి - 1 టీస్పూన్ తయారు విధానం.. ముందుగా కొన్ని బంగాళదుంపలను తీసుకుని తురుముకోవాలి. రసం తీసి ఆ రసాన్ని గిన్నెలో ఉంచుకోవాలి. ఒక గాజు గిన్నెలో 1-2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత గిన్నె అడుగున తెల్లగా పేరుకుపోయినట్లు మీరు కనిపిస్తుంది. ఇప్పుడు బంగాళాదుంప రసాన్ని గిన్నె వంకరగా వంచుతూ రసాన్ని వేరే గిన్నెలో పోయాలి. గిన్నె దిగువన తెల్లటి పదార్థం కనిపిస్తుంది. దానిలో ఒక చెంచా బంగాళాదుంప రసాన్ని అలాగే ఉంచాలి. అడుగున ఉన్న ఈ తెల్లని పిండే బంగాళదుంప స్టార్చ్. ఇప్పుడు ఈ గిన్నెలో కొన్ని చుక్కల నిమ్మకాయ రసం, ఒక చెంచా పాలపొడి వేసి బాగా కలపాలి. ముఖాన్ని కాంతివంతం చేసి డార్క్ స్పాట్లను లైట్ చేసే ఫేస్ ప్యాక్ రెడీ అయినట్టే. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖం కడుక్కోవాలి. మొదట సారి వాడన తరువాతే చాలా మార్పు కనిపిస్తుంది. *రూపశ్రీ.
బాబోయ్.. తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఇంత సులువా! తెల్లజుట్టు ఇప్పట్లో చాలా మందికి సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యకు బాధితులు అవుతున్నారు. అయితే తెల్లజుట్టును వదిలించుకోవడం అంత సులువు ఏమీ కాదు.. దీని బాధ భరించలేక కొందరు హెయిర్ డైతో సరిపెట్టేస్తుంటారు. కానీ తెల్లజుట్టును కవర్ చేసే ఈ హెయిర్ డై వల్ల జుట్టు మరింత తెల్లగా మారుతుంది. రంగు వెలిసిపోయినప్పుడు అది చాలా దారణంగా కనిపిస్తుంది. పైగా ఇందులోని రసాయనాల వల్ల మెదడు లోపలి నరాలు చాలా బలహీనం అవుతాయి. చిన్నతనంలోనే మతిమరుపు సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా నేచురల్ గా తెల్ల జుట్టును మాయం చేసే చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అలాంటి చిట్కా ఒకటి ఇప్పుడు చెప్పుకుంటే.. ఆయుర్వేదంలో చాలా మంది మహర్షులు, ఋషులు చాలా రకాల వైద్య విధానాలను, మొండి రోగాలను కూడా పోగొట్టే చికిత్సలను తెలియజేశారు. వీరిలో బాలరాజ మహర్షి ఒకరు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి బాలరాజ మహర్షి చెప్పిన సింపుల్ చిట్కా ఉంది. దీనికి ఖర్చు కూడా తక్కువ. కానీ ఫలితం మాత్రం ఉహించనంత అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా తెల్లజుట్టును తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారడానికి బాలరాజ మహర్షి చెప్పిన నూనె చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. ఈ నూనె తయారీ కోసం కావలసిన పదార్థాలు.. ఆవాల నూనె.. ఒక కప్పు.. గోరింటాకు.. ఒక కప్పు.. తయారీ విధానం.. ఒక మందంగా ఉన్న కడాయి తీసుకుని దాన్ని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. ఇందులో కప్పు ఆవాల నూనె పోయాలి. కప్పు గోరింటాకును కచ్చాపచ్చాగ దంచుకోవాలి. కచ్చాపచ్చాగ దంచుకున్న గోరింటాకును ఆవాలనూనెలో వేయాలి. దీన్ని సన్న మంట మీద బాగా ఉడికించాలి. నూనెలో గోరింటాకు బాగా ఉడికి ఆకులు నల్లగా మారిపోయిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. ఆ తరువాత దీన్ని వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారంలో రెండు సార్లు తలకు పెడుతుంటే చాలా గొప్ప మార్పులు ఉంటాయి. తలకు పెట్టుకుని వీలును బట్టి గంట సేపు.. వీలున్నవారు రెండు గంటల సేపు తలకు ఉంచుకుని కెమికల్స్ లేని షాంపూ లేదా షీకాయతో స్నానం చేయాలి. లేదంటే రాత్రి సమయంలో ఈ నూనెను తలకు పెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే తల స్నానం కూడా చేయవచ్చు. ఈ నూనెను వాడుతూ నువ్వులు, పల్లీలు, బెల్లం, పాలు, గుడ్లు, గుమ్మడి విత్తనాలు మొదలైనవి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. వీటిని ఆహారం నుండి మిస్ చేసుకోకుండా ఉంటే ఎంత వయసు పెరిగినా జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా వరకు ఉండదు. *రూపశ్రీ.
వేలాది రూపాయల ఖరీదైన క్రీమ్ కూడా దీని ముందు దిగదుడుపే..! చర్మ సంరక్షణ ఎప్పటికీ పాతబడని అంశం. కాలం మారే కొద్ది చాలామంది చర్మం సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇంటి టిప్స్ నుండి మార్కెట్లో దొరికే వాణిజ్య ఉత్పత్తుల వరకు చాలా రకాలు ఉపయోగిస్తారు. వీటిలో రెటినోల్ కూడా ఒకటి. రెటినోల్ అంటే విటమిన్-ఎ1. ఇది చర్మంలో కొల్లాజెన్ నష్టాన్ని నిరోధిస్తుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ ఇది చాలా ఖరీదైనది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఇలాంటి క్రీములు కొనే బదులు ఇంట్లోనే దానికి సమానమైన ఫలితాలు ఇచ్చే క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు.. తయారీ విధానం గురించి తెలుసుకుంటే.. విటమిన్ ఎ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. విటమిన్ ఎ మరింత ప్రభావవంతమైన రూపం రెటినోల్. వృద్దాప్యం కనిపించకుండా చర్మం యవ్వనంగా ఉంచడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఇంట్లోనే రెటినోల్ వంటి క్రీమ్.. ఇంట్లోనే సాలిసిలిక్ యాసిడ్ ఎలా తయారు చేయాలో కింద చెప్పబడింది. వంటగదిలో లభించే వస్తువుల నుండి రెటినోల్ను ఎలా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. బియ్యం పిండి - 2 స్పూన్లు తాజా కలబంద జెల్ - 1 టీస్పూన్ రైస్ సీరం - 3-4 చుక్కలు(రైస్ సీరమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు) నీరు - 1 గ్లాసు తయారీ విధానం.. ముందుగా పాన్ తీసుకుని అందులో నీటిని పోసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో బియ్యప్పిండి వేసి చిక్కని పేస్ట్ తయారయ్యే వరకు ఉడికించాలి. దీని తర్వాత ఆ పేస్ట్లో రైస్ సీరమ్, కలబంద జెల్ వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే తెల్లటి పేస్ట్ సిద్ధం అవుతుంది. హోమ్ మేడ్ రెటినోల్ క్రీమ్ తయారైనట్టే.. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటుంది. ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే.. బియ్యంతో తయారు చేసిన ఈ రెటినోల్ క్రీమ్ను ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతం అవ్వడమే కాకుండా గ్లాస్ స్కిన్ లభిస్తుంది. చర్మం అద్భుతంగా మారుతుంది. చర్మం మీద ఉండే పెద్ద రంద్రాలను తగ్గించి చర్మపు రంగును సమం చేస్తుంది. *రూపశ్రీ.
మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలంటే.. ఇలా చేయండి..! అమ్మాయిల అందాన్ని మరింత పెంచడంలో సహాయపడేది మేకప్. ఇప్పట్లో చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరూ కొద్దో, గొప్పో మేకప్ అప్లే చేస్తూనే ఉన్నారు. ఇక పార్టీలు, పంక్షన్ల సమయంలో మేకప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మేకప్ అనేది చాలా వరకు ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. మేకప్ వాడకుండా అందంగా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మంచి క్లెన్సర్ తో ముఖాన్ని కడుక్కోవాలి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ క్రమం తప్పకుండా అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కూడా హానికరమైన రసాయనాలు లేకుండా ఉన్నదే వాడాలి. వారానికి ఒకసారి ముఖాన్ని పూర్తీగా, లోతుగా శుభ్రం చేసుకోవాలి. ఇది మృతకణాలను తొలగించడంలోనూ, చర్మంలో పేరుకున్న మలినాలు తొలగించడంలోనూ సహాయపడుతుంది. ఇందుకోసం ఫేషియల్, స్ర్కబ్బింగ్, ఎక్స్పోలియేషన్ చేసుకోవాలి. ఇంటి చిట్కాలతో దీన్ని ఆరోగ్యకరమైన రీతిలో చేసుకోవచ్చు. ఎండలోకి వెళ్లైముందు సురక్షితమైన సన్ స్క్రీన్ ను అప్లై చేయాలి. నీరు పుష్కలంగా తాగాలి. ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాి. సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఇది చర్మం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలలో ఫైబర్, నీటి శాతం బాగా ఉన్నవి తీసుకోవాలి. ఇవి చర్మానికి మెరుపును ఇస్తాయి. శరీరం డీహైడ్రేషన్ కు లోను కాకుండా ఉంటుంది. జుట్టు సంరక్షణ కూడా ముఖం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తలలో చుండ్రు, పుండ్లు, జుట్టు పొడిబారి ఉండటం, లేదా జిడ్డుగా ఉండటం వంటివి జరిగితే అది ముఖ చర్మం మీద ర్యాషెస్, గుల్లలు, మొటిమలు, దద్దుర్లు వంటివి రావడానికి కారణం అవుతుంది. చర్మం పైన మచ్చలు, వడదెబ్బలు, వేడి గుల్లలు వంటివి వస్తే వాటిని తగ్గించుకోవడానికి అలోవెరా జెల్, విటమిన్-సి సీరమ్ వంటి తేలికపాటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడాలి. ఇవి చర్మానికి హాని చేయకుండా సమస్య తగ్గిస్తాయి. *రూపశ్రీ
చలికాలంలో కాలి మడమల పగుళ్లు తగ్గించే సూపర్ టిప్స్..! వింటర్ సీజన్ దగ్గరయ్యే కొద్దీ చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ముఖ్యంగా మడమలు చాలా పగుళ్లు వస్తాయి. పగిలిన మడమలు అసహ్యంగా కనిపించడమే కాకుండా వాకింగ్ చేసేటప్పుడు బట్టలు, కార్పెట్తో పదేపదే తగలడం వల్ల నొప్పి పెరుగుతుంది. ఈ పరిస్థితి అనుభవించే ప్రతి మహిళ శీతాకాలంలో తన పాదాలు సాధారణ సీజన్ లో లాగా మృదువుగా ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా వాడతారు. కానీ వీటి వల్ల ఫలితాలు పెద్దగా ఉండవు. అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోని వస్తువుల సాయంతో వాటిని చక్కదిద్దుకోవచ్చు. పగిలిన మడమలను నయం చేయడానికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇందుకోసం ఏ టిప్స్ ఫాలో కావాలి తెలుసుకుంటే.. కొబ్బరినూనెతో మడమలకు క్రీమ్ తయారుచేయడం.. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నూనె శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించబడుతోంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తాయి. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడానికి కిందిపదార్థాలు అవసరం. కొబ్బరి నూనె - 4 టీస్పూన్లు పెట్రోలియం జెల్లీ - 1 టీస్పూన్ విటమిన్ ఇ క్యాప్సూల్- 1 కర్పూరం పొడి - 1/2 టీస్పూన్ తయారు విధానం.. ముందుగా ఒక గిన్నెలో 4 చెంచాల కొబ్బరి నూనె వేసి వేడి చేసి అందులో ఒక చెంచా పెట్రోలియం జెల్లీ వేసి బాగా కలపాలి. దీని తరువాత కరిగించిన నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్, అర టీస్పూన్ కర్పూరం పొడి వేసి బాగా కలపాలి. ఇది పేస్ట్ లాగా మారేవరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో నింపి చల్లారనివ్వాలి. పాదాల పగుళ్లను నయం చేయడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ పాదాలకు రాసుకుంటే మంచిది. స్క్రైబ్.. మడమలు రీసెంట్ గానే పగుళ్లు ప్రారంభమైనట్లయితే, వాటిని ఎప్పటికప్పుడు స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఇందుకోసం ఓట్స్ స్క్రబ్ని ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి కింది పదార్థాలు అవసరం. ఓట్స్ - 3 స్పూన్లు పాలు - 1 చిన్న గిన్నె గ్లిజరిన్ - 1 టీస్పూన్ తయారీ విధానం.. ముందుగా ఓట్స్ గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పాలు, గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. హీల్స్ డెడ్ స్కిన్ను శుభ్రం చేసే స్క్రబ్ రెడీ అయినట్టే. దీన్ని మడమల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఈ స్క్రబ్ పగిలిన మడమలను నయం చేయడంలో మాత్రమే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. *రూపశ్రీ.
మేకప్ రిమూవర్ లేకుండా మేకప్ తొలగించడానికి సింపుల్ టిప్స్ ఇవీ..! మేకప్ ఇప్పటి అమ్మాయిలకు చాలా సాధారణ విషయం. పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళలో మాత్రమే కాకుండా సాధారణంగా బయటకు వెళ్లేటప్పుడు కూడా ఫౌండేషన్, లిప్స్టిక్, కాజల్, ఐ లైనర్ వంటివి అప్లై చేస్తారు. అయితే వీటిని శుభ్రంగా తొలగించాలంటే మేకప్ రిమూవర్ అవసరం అవుతుంది. మేకప్ రిమూవ్ చేయకుండా అలాగే ఉంచి పడుకుంటే చర్మం పాడైపోతుంది. కానీ మేకప్ రిమూవ్ చేయడానికి మేకప్ రిమూవర్ లేకపోతే కొన్ని సింపుల్ మార్గాలలో మేకప్ తొలగించవచ్చు. కొబ్బరినూనె.. ముఖం మీద మేకప్ తొలగించడానికి కొబ్బరినూనె ఉపయోగించడం ఉత్తమ మార్గం. మేకప్ రిమూవర్ లేదు అనే చింత లేకుండా కొబ్బరినూనెతో మేకప్ ను తొలగించవచ్చు. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుస్తూ, మృదువుగా చేస్తుంది. అదే సమయంలో చర్మం మీద మేకప్ ను కూడా చాలా క్లియర్ గా తొలగిస్తుంది. బాదం నూనె.. బాదం నూనె కూడా మేకప్ తొలగించడంలో బాగా సహాయపడుతుంది. కాకపోతే బాదం నూనె చాలా ఖరీదైనది. కానీ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ముఖ చర్మం మీద ఉండే డల్ నెస్ ను తొలగించడంలో సహాయపడతాయి. ఆలివ్ నూనె.. ఆలివ్ ఆయిల్ వంటల్లోనే కాదు జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది. ముఖం మీద దుమ్ము, ధూళిని మాత్రమే కాకుండా.. వాటర్ ఫ్రూఫ్ మేకప్ ను కూడా సులభంగా తొలగించడంలో ఆలివ్ నూనె సహాయపడుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్.. ఈ నూనె ముఖం నుండి మేకప్ తొలగించడంలో గొప్పగా సహాయపడుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ ల విటమిన్-ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకున్నప్పుడు రిమూవర్ లేకపోతే.. పై నూనెలను ఉపయోగించి ముఖానికి మేకప్ ను తొలగించవచ్చు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి కూడా. చర్మానికి ఎలాంటి హాని చేయవు. *రూపశ్రీ.
హెర్బల్ స్కిన్ కేర్ రొటీన్ ఎప్పుడైనా ఫాలో అయ్యారా.. హెర్బల్.. దీన్ని తెలుగులో మూలిక అని అంటారు. మూలికలు ఆయుర్వేదంలో భాగంగా చెబుతారు. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. పూర్తీగా సహజమైన పదార్థాలు , చర్మానికి నష్టం కలిగించని పదార్థాలు ఉంటాయి. అందుకే హెర్బల్ ఉత్పత్తులకు కూడా ఆదరణ పెరిగింది. ఇప్పటి కాలంలో అమ్మాయిలు స్కిన్ కేర్ రొటీన్ బాగా ఫాలో అవుతుంటారు. అయితే హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుందట. ఇంతకీ ఇందులో ఏమేమి వాడాలో తెలుసుకుంటే.. రోజ్ వాటర్ చర్మానికి చాలా మంచిది. కానీ దీన్ని ఎక్కువగా వాడరు. రోజ్ వాటర్ లేదా పసుపుతో చేసి ఫేస్ వాష్ వంటి తేలికపాటి హెర్బల్ ఫేస్ వాష్ తో చర్మాన్ని శుభ్రపరచాలి. ఇది ఉదయాన్నే చేయాలి. రోజు ఉదయం దీనితో చర్మాన్ని శుభ్రం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. రాత్రి వరకు చర్మానికి కలిగిన అలసట పోతుంది. చర్మం మీద మురికి, జిడ్డు వంటివి పోతాయి. చర్మం తాజాగా ఉంటుంది. చర్మానికి టోనర్ వాడటం చాలా మంచిది. చర్మ రంధ్రాలను కవర్ చేసి చర్మాన్ని తాజాగా ఉంచే రోజ్ వాటర్ లేదా కీర దోసకాయ వంటి పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ టోనర్లను వాడాలి. ఫేస్ సీరమ్ కూడా చర్మానికి మేలు చేస్తుంది. అలోవెరా, విటమిన్-సి, వేప వంటి హెర్బల్ సీరమ్ లు ఎంచుకోవాలి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మం మీద మచ్చలు,మొటిమల తాలూకు గుర్తులు ఉంటే పసుపు, వేప, తులసి రసం వంటివి అప్లై చేయాలి. ఇవన్నీ మచ్చలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో మాయిశ్చరైజర్ చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం తేనె, అలోవెరా, ఆర్గాన్ ఆయిల్ వంటి హెర్బల్ మాయిశ్తరైజర్లను ఎంచుకోవాలి. బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ ను వాడటం తప్పనిసరి. అయితే సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి గ్రీన్ టీ లేదా జియోలిన్ వంటి హెర్బల్ సన్ స్క్రీన్ లను ఉపయోగించుకోవాలి. పై హెర్బల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ఇది చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది. *రూపశ్రీ.
చర్మ సంరక్షణ అమ్మాయిల లైఫ్ స్టైల్ లో చాలా ముఖ్యమైపోయింది. ఆహారం దగ్గర అయినా రాజీ పడతారేమో కానీ.. చర్మ సంరక్షణ దగ్గర ఏమాత్రం తగ్గేది లేదంటారు ఈ కాలం అమ్మాయిలు. అయితే ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలన్నా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలన్నా చర్మానికి సీరమ్ చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా విటమిన్-సి సీరమ్ అయితే చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, చర్మం మెరుస్తూ ఉండాలన్నా విటమిన్-సి సీరమ్ ను ఎంచుకోవడం తెలివైన మార్గమని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. ఇంతకీ విటమిన్-సి సీరమ్ వాడటం వల్ల కలిగే మేలు ఏంటో తెలుసుకుంటే.. విటమిన్-సి సీరమ్ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ మెలనిన్ ఎక్కువ అయితే ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ వంటివి వస్తాయి. అదే మెలనిన్ ఉత్పత్తి తగ్గితే చర్మం క్లియర్ గా ఉంటుంది. అంతే కాదు.. చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా, దృఢంగా ఉంచడంలో కూడా విటమిన్-సి సీరమ్ సహాయపడుతుంది. విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్.. ఇది చర్మాన్ని రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మం దెబ్బతినే సమస్యను తగ్గిస్తుంది. విటమిన్-సి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. సన్ స్క్రీన్ తో పాటు విటమిన్-సి సీరమ్ వాడుతుంటే హానికరమైన సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు. విటమిన్-సి యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని సాగేలా చేస్తుంది. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం మీద కొన్ని మచ్చలు వస్తాయి. ఇవి మెలిస్మా, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యల వల్ల వస్తాయి. ఇవి తగ్గిపోవడంలోనూ, చర్మం తిరిగి సాధారణ రంగులోకి వచ్చి కాంతివంతంగా మారడంలోనూ విటమిన్-సి సహాయపడుతుంది. ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత టోనర్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం PH స్థాయి బ్యాలెన్స్ గా ఉంటుంది. దీని తరువాత ముఖానికి విటమిన్-సి సీరమ్ ను కొన్ని చుక్కలు తీసుకుని అప్లై చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మానికి సీరమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే చర్మం రోజంతా మృదువుగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. పగటి సమయంలో విటమిన్-సి సీరమ్ ను ముఖానికి అప్లై చేస్తే గనక దాని తరువాత ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ ను అప్లే చేయాలి. 10-15% విటమిన్-సి ఉన్న సీరమ్ ను ఉపయోగించాలి. ఇది చర్మం చికాకును, వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. *రూపశ్రీ.
చలికాలంలో పాదాలు చల్లగా ఉంటున్నాయా...ఇలా వెచ్చగా ఉంచుకోండి..! చలికాలం చర్మానికి పరీక్ష కాలం. ఉదయం నుండి రాత్రి వరకు బయటకు వెళ్ళాలన్నా, తిరగాలన్నా పాదాలే ఆధారం. ముఖ్యంగా వాష్ రూమ్ వెళ్లాలంటే చాలా మంది భయపడతారు. దీనికి కారణం పాదాల చల్లదనం. కాళ్లకు ఏ మాత్రం నీరు తగిలినా చాలు.. మంచులో ముంచి తీసినట్టు పాదాలు చాలా చల్లగా అవుతుంటాయి. శరీరాన్ని కవర్ చేయడానికి వెచ్చగా ఉన్న దుస్తులు వేసుకుంటారు. స్వెట్టర్లు గట్రా వేసుకుని వెచ్చదనాన్ని అనుభూతి చెందుతారు. కానీ పాదాలు, చేతులు మాత్రం చలికి బుక్ అయిపోతాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తగిలే శరీర భాగాలలో కాళ్లు, చేతులే ఎక్కువ ఉంటాయి. భారతీయులు అయితే బాత్రూమ్ కు వెళితే కాళ్లు, చేతులు కడగనిది బయటకు రారు. దీనివల్ల మరీ ఇబ్బంది ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ చలికాలంలో పాదాలు వెచ్చగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. శరీరం వెచ్చగా ఉంటే పాదాలు, చేతులు చాలా వరకు వెచ్చదనంగా ఉంటాయి. సీజన్ కు తగ్గట్టు ఈ చలికాలంలో మందంగా ఉన్న దుస్తులు, ఉన్ని, బొచ్చుతో కూడిన దుస్తులు, ఊలు దుస్తులు ధరించాలి. ఇవన్నీ ఇప్పట్లో ఫ్యాషన్ తో కూడుకుని మరీ డిజైన్ చేస్తున్నారు, కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా వీటిని ధరించవచ్చు. అలాగే రాత్రి నిద్రపోయే సమయంలో లేదా ఒకే చోటు కూర్చుని వర్క్ చేసుకునే సమయంలో కాళ్లకు మందం పాటి సాక్స్ ధరించాలి. ఇంట్లో కూడా అటు ఇటు తిరిగేటప్పుడు సాక్స్ ధరించవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి పాదాలను ఆ నీటిలో నానబెట్టాలి. సుమారు 20 నిమిషాలు ఇలా నానబెట్టిన తరువాత పాదాలను శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచి పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే పాదాలు వెచ్చగా ఉంటాయి. చలి కారణంగా పాదాలు పగుళ్లు రావడం, దెబ్బతినడం జరగదు. ఒక వేళ పాదాలను నీటిలో నానబెట్టడం కుదరకపోతే పాదాలను నూనెతో మసాజ్ చేయాలి. ఇందుకోసం ఆవాల నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి. ముఖ్యంగా ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆవాల నూనె వేడి గుణం కలిగి ఉంటుంది. దీంతో పాదాలకు మర్దనా చేస్తే పాదాలలో రక్తప్రసరణ పెరిగి పాదాలు వెచ్చగా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియాలు వంటి పదార్థాలలో వేడి గుణం ఉంటుంది. అల్లం పాలు, మిరియాల పాలు, పసుపు పాలు వంటివి తాగాలి. ఇవి తాగితే శరీరం, పాదాలు వెచ్చగా ఉంటాయి. వ్యాయామం శరీరానికి గొప్ప ఔషధం లాంటిది. శరీరంలో కొన్ని జబ్బులు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. చలికి పాదాలు చాలా ఇబ్బందిని అనుభవిస్తుంటే హాట్ ప్యాక్ బ్యాగ్ తీసుకుని పాదాల మీద ఉంచుకోవచ్చు. వెచ్చని దుప్పటిని పాదాలకు కవర్ చేయవచ్చు. పాదాలు చలికి గురి కాకూడదు అంటే పదే పదే నీటిలో తడవకూడదు. వంటింట్లో పనులు ఏవైనా ఉంటే అవన్నీ చలి లేని సమయంలో మధ్యాహ్నం వంట చేసిన సమయంలో కడుక్కోవాలి. దీని వల్ల వంట చేసిన వేడి గదిలోనే ఉండి పెద్దగా ఎఫేక్ట్ పడదు. *రూపశ్రీ.
నిద్రపోయేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ లాస్ పెరుగుతుంది..! హెయిర్ లాస్.. చాలా మంది పొడవాటి జుట్టు కలను నాశనం చేసే సమస్య ఇది. హెయిర్ లాస్ ఎక్కువగా ఉన్న అమ్మాయిలు వారికి తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళుతుంటారు. హెయిర్ లాస్ కు చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తెలిసీ తెలియక అమ్మాయిలు చేసే కొన్ని పనులు జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునేముందు చేసే కొన్ని పనులు జుట్టు రాలే సమస్యను అధికం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. తడి జుట్టు.. రోజంతా అలసిపోయినప్పుడు రాత్రి పూట స్నానం చేయడం చాలామంది అలవాటు. రాత్రి తల స్నానం చేయడం వల్ల తొందరగా తడి ఆరదు. కొందరు తడి జుట్టుతో అలాగే నిద్రపోతుంటారు. మరికొందరు వర్షం కారణంగా వర్షంలో తడిచి తల పూర్తీగా ఆరక ముందే తడి జుట్టుతో పడుకుంటూ ఉంటారు. తడి జుట్టుతో నిద్రపోయినప్పుడు జుట్టు తొందరగా విరిగిపోతుంది. దిండు కవర్.. దిండు కవర్ విషయంలో జాగ్రత్తలు పాటించేవారు చాలా తక్కువగా ఉంటారు. సిల్క్ లేదా శాటిన్ దిండు కవర్లు వాడితే అవి జుట్టు రాపిడిని చాలా తగ్గిస్తాయి. కానీ ఇవి కాకుండా కాటన్ తో సహాఇతర దిండు కవర్లు వాడితే అవి జుట్టును చిక్కులు పడేలా చేయడంలో ఎక్కువ పాత్ర పోషిస్తాయి. జుట్టు వదిలేయడం.. ఇప్పటి ఫ్యాషన్ కారణంగా చాలా మంది జడ వేసుకోవడం మరచిపోయారు. ఎనీ టైం జుట్టు వదులుగా ఉంచుతారు. మహా అయితే పోనీ టైల్ వేసుకుంటారు. జుట్టు వదులుగా ఉంచి నిద్రపోతే జుట్టు చాలా తొందరగా చిక్కులు పడుతుంది. అందుకే జుట్టును జడ వేసుకుని అది కూడా మరీ గట్టిగా బిగించకుండా జడ వేసుకుని పడుకోవాలి. నూనె.. జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. వారంలో కనీసం రెండుసార్లు అయినా జుట్టుకు నూనెతో మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఆ తరువాత ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు పోషణ ఇస్తుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది. చిక్కులు.. సాధారణంగా జుట్టు చిక్కులు పడటం సహజం. ప్రతిరోజూ రెండు పూటలా జుట్టును చిక్కులు లేకుండా ఆరోగ్యంగా సున్నితంగా దువ్వుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. *రూపశ్రీ.
శీతాకాలంలో జుట్టు బాగా రాలుతుందా.. ఇలా చెక్ పెట్టండి! చలికాలంలో చర్మ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే కేవలం చర్మ సంబంధ సమస్యలు మాత్రమే కాకుండా జుట్టు సంబంధ సమస్యలు కూడా చలికాలంలో ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చుండ్రు సమస్య ఎక్కువ కావడం, జుట్టు రాలడం ప్రధానంగా ఉంటుంది. చల్లని గాలుల కారణంగా తల చర్మం చాలా పొడిగా మారుతుంది. జుట్టు కూడా పొడిగా తయారవుతుంది. పైగా ఈ చలికాలంలో నీరు తాగడం తగ్గుతుంది. ఈ కారణంగా తల చర్మం పొడిబారి తొందరగా జుట్టు బలహీనం అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చలికాలంలో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆయిల్ మసాజ్.. కనీసం వారానికి ఒకసారి తలకు ఆయిల్ మసాజ్ చేయాలి. దీని వల్ల తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. జట్టు పొడిబారడాన్ని నిరోధిస్తుంది. ఇందుకోసం కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె మొదలైన నూనెలతో జుట్టుకు మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లలోకి నూనె ఇంకడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నూనెలు జుట్టుకు పోషణను ఇస్తాయి. జుట్టును బలంగా మారుస్తాయి. తలస్నానం.. తలస్నానం చేయడంలో చాలామంది చేసే తప్పు నీరు ఎంచుకునే విధానం. చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేస్తుంటారు. దీని వల్ల తల చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. అందుకే ఎంత చలిగా ఉన్నా తల స్నానానికి గోరు వెచ్చగా ఉన్న నీటిని మాత్రమే వాడాలి. కండీషనింగ్.. కండీషనింగ్ అనేది జుట్టును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ చేసుకోవాలి. ఇది జుట్టుకు తేమను అందించి జుట్టును మృదువుగా ఉంచుతుంది. జుట్టు పొడిబారే సమస్యకు చెక్ పెడుతుంది. హెయిర్ మాస్క్.. జుట్టు రాలడాన్ని ఆపాలన్నా, జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారాలన్నా హెయిర్ మాస్క్ లు చక్కగా సహాపడతాయి. ఇందుకోసం గుడ్డు, పెరుగు, తేనె లేదా కలబందతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ను అప్లై చేయాలి. ఇవి జుట్టుకు పోషణను ఇచ్చి దృఢంగా మారుస్తాయి. ఆహారం.. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తీసుకునేది శాకాహారం అయినా, మాంసాహారం అయినా శరీరానికి తగిన పోషణ అందేలా జాగ్రత్త పడాలి. ఇది జుట్టు ఆరోగ్యానికి చక్కగా సహాయపడుతుంది. ఒత్తిడి.. మంచి ఆహారం, కేశ సంరక్షణ తీసుకున్నా సరే.. జుట్టు రాలుతోందంటే అది మానసిక ఒత్తిడి వల్ల అనే విషయాన్ని గ్రహించాలి. ఏ విషయాల వల్ల అయినా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోగ, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడికి కారణమయ్యే విషయాలు, వ్యక్తులకు కాస్త దూరంగా ఉంటూ యోగ, ధ్యానం చేస్తుంటే తొందరగా దాన్నుండి బయటపడతారు. ప్రొటెక్షన్.. చలికాలంలో చల్లని గాలులు జుట్టును, చల చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తలను, జుట్టును కప్పి ఉంచాలి. ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయ నేటికాలంలో జుట్టు సంరక్షణ కోసం చ ాలా రికమెండ్ చేయబడుతోంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తుంటే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు నల్లగా, మందంగా మారుతుంది. కనీసం వారానికి ఒకసారి అయినా జుట్టుకు ఉల్లిపాయ రసం పెట్టుకోవాలి. చలిగాలుల కారణంగా ఇబ్బంది పడేవారు కాస్త ఎండ ఉన్న సమయంలో పెట్టుకుని ఒక అరగంట నుండి గంట సేపు ఎంత సమయం వీలైతే అంతసేపు పెట్టుకుని తరువాత జుట్టు కడిగేయాలి. ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. *రూపశ్రీ.
యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్.. వారానికి రెండుసార్లు వేసుకుంటే చాలు.. యవ్వనంగా కనిపిస్తారు! యవ్వనంగా ఉండాలన్నది ప్రతి అమ్మాయి కల. కానీ ఇంకా పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకనే ముసలి వారిలాగా ముడతలు, గీతలు పడిన చర్మంతో కనిపిస్తుంటారు కొందరు. దీన్ని అధిగమించడానికి మార్కెట్లో దొరికే బోలెడు ఉత్పత్తులను కూడా వాడుతుంటారు. అయితే వీటి వల్ల తాత్కాలిక ఫలితం తప్ప దీర్ఘకాలిక ఫలితం ఉండదు. ఇందుకోసం యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ లు బాగా సహాయపడతాయి. చర్మ సంరక్షణ నిపుణులు సూచించిన యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తుంటే చాలు.. ఏ ఫేస్ క్రీములు అవసరం లేదని.. చర్మం యవ్వనంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ ఫేస్ మాస్క్ ఏంటో తెలుసుకుంటే.. కేవలం రెండు పదార్థాలతో.. కేవలం రెండు పదార్థాలతో ఇంట్లోనే అద్బుతమైన యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చట. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం ఎప్పుడు హైడ్రేట్ గా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరుగుస్తుంది. చర్మం రంగు మెరుగవుతుంది. చర్మానికి తగినంత యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ముఖ్యంగా చర్మం చాలా స్లిమ్ గా స్మూత్ గా మారుతుంది. ఫ్రెంచ్ గ్రీన్ క్లే.. గ్రీన్ టీ.. ఈ మధ్యకాలంలో ఫ్రెంచ్ గ్రీన్ క్లే చాలా వైరల్ అవుతోంది. ఆకుపచ్చ రంగులో ఉంటే ఇది ముల్తానీ మట్టిని పోలి ఉంటుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. ఈ ఫేస్ మాస్క్ ఎలా చేయాలంటే.. రెండు స్పూన్ల ఫ్రెంచ్ గ్రీన్ క్లే.. ఒక స్పూన్ గ్రీన్ టీ ఆకులతో గ్రీన్ టీ తయారుచేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో ఫ్రెంచ్ గ్రీన్ క్లే పౌడర్ వేసి అందులో గ్రీన్ టీ నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని పేస్ ప్యాక్ పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఫ్రెంచ్ గ్రీన్ క్లే టోనింగ్ తో గట్టిపడుతుంది. ఇది చర్మం మీద ఆరిపోయే కొద్దీ చర్మ రంధ్రాలను బిగుతుగా మారుస్తుంది. ముఖ చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మంచి ఆకారంలోకి మారుతుంది. ఫ్రెంచ్ గ్రీన్ క్లే ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటే చర్మం ముడుతల బారిన పడదు. చర్మం మీద అప్పటికే ఉన్న ముడతలు, గీతలు తగ్గుతాయి. గ్రీన్ టీ లో కూడా యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. గ్రీన్ టీ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖం మీద మచ్చలను తగ్గిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ఫేస్ మాస్క్ ను వాడుతుంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. ఒక వేళ పొడి చర్మం ఉన్నవారు అయితే ఫ్రెంచ్ గ్రీన్ క్లే లోకి గ్రీన్ టీ పాటు కొద్దిగా పాలు వేసుకోవాలి. లేకపోతే కొంచెం తేనెను వేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. *రూపశ్రీ.
ఈ బయోటిన్ పౌడర్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..! జుట్టు రాలే సమస్య అందరినీ వేధిస్తోంది. కానీ కారణాలు అందరికీ భిన్నంగా ఉండవచ్చు. కొందరికి నీటి వల్ల జుట్టు రాలిపోతే, మరికొందరికి చుండ్రు వంటి పోషకాల కొరత వల్ల జుట్టు రాలిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సమస్యకు కొన్ని రకాల ఇంటి నివారణలు, ఔషధాలను ప్రయత్నించారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి చిట్కాలు: జుట్టు రాలడాన్ని తగ్గించడానికి.. మీ జుట్టును ఒత్తుగా మార్చడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. విటమిన్ B7, కొన్నిసార్లు విటమిన్ H లేదా బయోటిన్ అని పిలుస్తారు.ఇది జుట్టును బలపరిచే, జుట్టు రాలడాన్ని తగ్గించే సప్లిమెంట్ బయోటిన్ కొత్త కణాల నిర్మాణం రేటును పెంచుతుంది. జుట్టు పల్చబడడాన్ని నివారిస్తుంది. సహజంగా జుట్టు తంతువులను బలోపేతం చేయడానికి మృదుత్వాన్ని పెంచుతుంది. బయోటిన్ లోపం: బయోటిన్ లోపం అసాధారణం అయినప్పటికీ..అది లోపించినప్పుడు జుట్టు రాలుతుంది. సమతుల్య ఆహారం తీసుకునేవారిలో లోపం చాలా అరుదు. ఇంట్లోనే బయోటిన్ పౌడర్ను తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక సాధారణ పద్ధతి ఉంది.అవేంటో చూద్దాం. వీటిని ఆహారంలో చేర్చుకుంటే: కాయధాన్యాలు, సోయాబీన్స్, ఇతర చిక్కుళ్ళు బయోటిన్ను అందిస్తాయి. వోట్స్, బార్లీ, హోల్ వీట్ వంటి తృణధాన్యాలు బయోటిన్ యొక్క మంచి మూలాలు. బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్ వంటి నట్స్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. సాల్మన్, ట్యూనాతో సహా కొన్ని రకాల చేపలలో బయోటిన్ ఉంటుంది.వీటిని పొడిరూపంలో కూడా తీసుకోవచ్చు. ఇంట్లోనే బయోటిన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి? కావలసినవి: ½ కప్ బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గింజ, వాల్నట్ పౌడర్ ½ కప్ వోట్స్ లేదా బార్లీ ½ కప్పు శనగపిండి, చిక్పీస్ ½ కప్పు చియా గింజలు ½ కప్పు అవిసె గింజలు తయారీ విధానం: పై పదార్థాలన్నింటిని గ్రైండర్ లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడొక జార్ తీుసకుని ఆ పొడిని అందులో వేసుకోవాలి. ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. దీనిని మీరు స్మూతీ లేదా టీలో కానీ కలుపుని తీసుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ బయోటిన్ పౌడర్ కలుపుకుని తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం తాగుతే మంచి ఫలితం ఉంటుంది.
చలికాలంలో ఈ ఒక్క పని చేస్తే చర్మం మెరిసిపోతుంది! చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, తామర, చర్మం తెల్లబడటం, చర్మం పొలుసుగా పైకి లేవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా శరీరంలో తేమ లేకపోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు తదితర సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, గోరువెచ్చని ఉప్పు నీటితో స్నానం చేయడం చాలా సహాయపడుతుంది. రోజూ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు, చర్మం మెరుపు సంతరించుకుంటాయి. చలికాలంలో చాలా సార్లు పరిశుభ్రత లేకపోవడం, తడి బట్టలతో ఉండటం. చలికారణంగా శరీరంలో దద్దుర్లు, దురదలు, తామర వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి ఉప్పు సహాయపడుతుంది. ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటికి చర్మంపై ఉండే బ్యాక్టీరియా, క్రిములను తొలగించే శక్తి ఉంటుంది. ఇది చర్మసంబంధ వ్యాధులను నివారిస్తుంది. సాధారణంగా వేసవి కాలంతో పోలిస్తే శీతాకాలంలో చర్మం మెరుపు తగ్గడం ప్రారంభమవుతుంది. దీనికి మొదటి కారణం చలి వల్ల నీరు సరిపడినంత తీసుకోకపోవడం. శరీరంలో నీటి శాతం లోపిస్తే చర్మ సమస్యలు సులభంగా వస్తాయి. చర్మం కూడా నిర్జీవంగా మారుతుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సమస్య అధికంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఇది చర్మ రంధ్రాలలో ఉండే మురికిని తొలగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీన్ని ఫాలో అయితే అందం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడేవారికి కూడా ఉప్పునీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు కండరాలు ఉద్రిక్తంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు మంచి పరిష్కారంగా మారుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది. అలసట తొలగిపోతుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. *నిశ్శబ్ద.
ముఖం మీద మచ్చలు తగ్గాలంటే.. కొబ్బరినూనెలో వీటిని కలిపి రాయండి..! మచ్చలేని చర్మం ప్రతి అమ్మాయి కల. కానీ చాలామందికి ముఖం మీద మచ్చలు మొటిమలు, మొటిమల తాలూకు గుర్తులు.. వీటితో ముఖం అంతా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఎంత అందంగా ఉన్న అమ్మాయిలను అయినా ఈ మచ్చలు, మొటిమలు, వాటి తాలూకు గుర్తులు వికారంగా కనిపించేలా చేస్తాయి. వీటిని తొలగించుకోవడం కోసం చాలా రకాల వాణిజ్య ఉత్పత్తులు వినియోగిస్తూ ఉంటారు. అయితే మచ్చలేని చర్మం కోసం వందలు, వేలు ఖర్చు చెయ్యక్కర్లేదు.. ఇంట్లోనే ఉండే కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలు కలిపి రాస్తుంటే చాలు.. కొబ్బరినూనెను రోజూ ముఖానికి రాసుకుని ఫేస్ మసాజ్ చేసుకుంటూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖం మీద మచ్చలు, గీతలు క్రమంగా తగ్గిపోతాయి. ఒక వేళ మచ్చలు, ముడతలు, గీతలు చాలా ఎక్కువగా ఉంటే కొబ్బరినూనెలో కలబంద జెల్ కలపి వాడాలి. ఒక స్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ కొబ్బరినూనె కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రాత్రిపూట ముఖానికి పట్టించాలి. ముఖానికి పట్టించాక కొన్ని నిమిషాలు ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. తరువాత రాత్రంతా దీన్ని అలాగే వదిలేయాలి. మరుసటిరోజు ఉదయాన్నే చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే ముఖం మీద మచ్చలు, ముడతలు, గీతలు, మొటిమల తాలూకు గుర్తులు అన్నీ మాయమవుతాయి. కొబ్బరినూనెలో కలబంద మాత్రమే కాకుండా పసుపు రాసి ముఖానికి పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం రెండు నుండి మూడు స్పూన్ల పసుపును తీసుకుని ఒక పాన్ మీద వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. నల్లగా మారే వరకు పసుపును వేయించిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. పసుపును ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన పసుపులోకి కొద్దిగా కొబ్బరి నూనెను వేసి పేస్ట్ లా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖం మీద అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఈ చిట్కా పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. *రూపశ్రీ.





















