English | Telugu
రెండు నెలలకు ఓ చిత్రం... ప్రభాస్ ప్లానింగ్!
Updated : Feb 22, 2023
బాహుబలి ఫ్రాంచైజీతో దేశ విదేశాలలో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు చిత్రాలు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన చేతిలో ఆరేడు చిత్రాలున్నాయి. మొదటగా మూడింటిని పూర్తి చేయనున్నారు. ఆది పురుష్ ని ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ గ్రాఫిక్స్ లో ఆలస్యం కావడం వల్ల జూన్ 16 కి షిఫ్ట్ చేశారు. ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ సలార్. ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫ్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. సలార్ ని ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక మరో చిత్రం విషయానికొస్తే అది ప్రాజెక్ట్ కే. ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాశంతో సూపర్ హీరో మూవీ గా రూపొందుతుంది. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. అమితాబచ్చన్, దీపికా పడుకొని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారని అధికారికంగా పోస్టర్ విడుదల అయింది. ఈ విధంగా చూసుకుంటే ప్రభాస్ ఏడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు విడుదలవుతాయని చెప్పాలి.
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా డీలక్స్, సలార్ 2, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ బాలీవుడ్ ఫిలిం చేస్తున్నారు. వీటన్నిటిని 2024, 2025లో టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం జూన్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 12 వరకు అంటే ఏడెనిమిది నెలల్లోపు మూడు చిత్రాలు ప్రభాస్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఇది జరిగేనా? ప్రభాస్ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడా? మేకర్స్ ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ లకి సినిమాలను విడుదల చేస్తారా? అనేది వేచి చూడాలి.