English | Telugu
అటు 'ఆది', ఇటు 'సింహాద్రి'.. గందరగోళంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
Updated : Apr 11, 2023
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ పీక్స్ కి వెళ్ళిపోయింది. పలువురు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో మళ్ళీ విడుదలై అలరిస్తున్నాయి. దీంతో అభిమానులు థియేటర్ల దగ్గర తెగ హంగామా చేస్తున్నారు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఒకేసారి పలు సినిమాలను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తుండటంతో ఏ సినిమా చూడాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. మెజారిటీ అభిమానులు మాత్రం ఈసారి 'సింహాద్రి'కే తమ ఓటు అంటున్నారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న 'సింహాద్రి' సినిమాని భారీస్థాయిలో రీరిలీజ్ చేయాలని అభిమానులు నిర్ణయించారు. అసలుసిసలు మాస్ సెలబ్రేషన్స్ అంటే ఏంటో చూపించి, రీరిలీజ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తామని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ నటించిన ఇతర సినిమాలు కూడా రీరిలీజ్ అవుతున్నట్లు ప్రకటనలు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. 'ఆది' సినిమాని మే 20 నుంచి మే 28 వరకు ప్రదర్శించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ 'నిన్ను చూడాలని'ని మే 19న ప్రదర్శిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలను కూడా రీరిలీజ్ చేస్తున్నట్లు ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రకటిస్తుండటంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. "అసలు ఇదేం ప్లానింగ్?.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రకటిస్తున్నారు.. ఇంకానయం ఇప్పటిదాకా ఎన్టీఆర్ నటించిన 29 సినిమాలు ఒకేసారి రీరిలీజ్ చేస్తామని ప్రకటించలేదు" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎన్నయినా రీరిలీజ్ చేసుకోండి, తాము మాత్రం ఈసారికి 'సింహాద్రి' చూడాలని ఫిక్స్ అయ్యామని మెజారిటీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం 'సింహాద్రి', 'ఆది' రెండు సినిమాలు చూస్తామని అంటున్నారు. మరి అభిమానుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతానికి మిగతా సినిమాల రీరిలీజ్ ని వాయిదా వేస్తారేమో చూడాలి.