English | Telugu
మళ్ళీ అదే గొడవ.. మా హీరోనే గొప్ప!
Updated : Sep 17, 2023
ఎస్.ఎస్. రాజమౌళి ఏ ముహూర్తాన 'ఆర్ఆర్ఆర్' తీశారో కానీ, ఆ సినిమా వచ్చినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ హీరోకి, తమ హీరో నటించిన సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది, తమ హీరో చిందేసిన పాటకి ఆస్కార్ వచ్చిందని.. ఎవరికివారు ఆనందపడాల్సింది పోయి.. తమ హీరోనే గొప్ప అంటూ ఎదుటి హీరోని చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వచ్చి ఏడాది దాటిపోయినా ఇప్పటికీ ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా సైమా అవార్డ్స్ మళ్ళీ వీరి గొడవకి కారణమైంది.
'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ గొప్పగా నటించారు. కానీ అభిమానులు మాత్రం తమ హీరోనే గొప్పగా నటించాడు, తమ హీరోనే మెయిన్ హీరో అంటూ.. మరో హీరోని ట్రోల్ చేస్తుంటారు. అప్పుడు ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ నామినేట్ అయ్యే అవకాశముందని న్యూస్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. తీరా నామినేషన్స్ లో ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. నేషనల్ అవార్డు ఈ ఇద్దరికీ కాకుండా 'పుష్ప' చిత్రానికి గానూ అల్లు అర్జున్ గెలుచుకోవడంతో.. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరగలేదు. ఇక తాజాగా సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు అందుకోవడంతో మళ్ళీ రచ్చ షురూ అయింది. మెయిన్ హీరో, బెస్ట్ యాక్టర్ మా హీరోనే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వంగా చెబుతుంటే.. ఈవెంట్ కి హాజరయ్యే వాళ్ళకే ఆ అవార్డు ఇస్తారని, తమ హీరో హాజరైతే అవార్డు వచ్చేదని చరణ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే రాజమౌళి, యశ్ వంటి వారికి ఈవెంట్ కి రాకుండానే అవార్డ్స్ ప్రకటించారని.. గతంలో ఎన్టీఆర్ కి కూడా ఈవెంట్ కి రాకపోయినా, షూట్ లోకేషన్ కి వెళ్ళి మరీ అవార్డు ఇచ్చారని గుర్తు చేస్తూ చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. మొత్తానికి సైమా అవార్డ్స్ మూలంగా మరోసారి ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ గొడవ తెరపైకి వచ్చింది.