English | Telugu
రవితేజ 'ఛాంగురే బంగారు రాజా' రివ్యూ.. బోరింగ్ రాజా!
Updated : Sep 15, 2023
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన మాస్ మహారాజా రవితేజ.. ఆర్టీ టీం వర్క్స్ అనే బ్యానర్ ని స్థాపించి యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం 'ఛాంగురే బంగారు రాజా'. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా సతీష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఊళ్ళో బైక్ మెకానిక్ గా పనిచేసే బంగార్రాజు(కార్తీక్ రత్నం).. వారసత్వంగా వచ్చిన పొలాన్ని చూసుకుంటూ జీవితం సాగిస్తుంటాడు. ఆ ఊరు రంగురాళ్ళకి ప్రసిద్ధి. వర్షం కురిసిందంటే చాలు.. ఊళ్ళో వాళ్ళంతా రంగురాళ్ళ వేటకు వెళ్తారు. అలా వెళ్ళిన సమయంలో ఒకసారి బంగార్రాజుకి, ఒక కుర్రాడికి మధ్య గొడవ జరుగుతుంది. అయితే ఆ మరుసటి రోజే.. గొడవపడిన కుర్రాడు హత్యకి గురవుతాడు. దీంతో ఆ హత్య కేసు బంగార్రాజుపై పడుతుంది. అసలు ఆ హత్య చేసింది ఎవరు? ఆ హత్య కేసులో బంగార్రాజుని ఎవరైనా కావాలని ఇరికించారా? ఆ కేసు నుంచి అతను బయటపడగలిగాడా? అనేది మిగిలిన కథ.
ఒక హత్య జరగడం, ఆ హత్య వెనక ఉన్నది ఎవరో కనిపెట్టడం.. ఈ తరహా కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాలకు కథనమే ప్రధానం. ప్రతి సన్నివేశం.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను కలిగించాలి. కథలోకి వెళ్లే కొద్దీ పలు పాత్రల మీద అనుమానం కలుగుతూ, చివరికి ఆ హత్య ఎవరు చేశారో రివీల్ అయినప్పుడు ఆడియన్స్ సర్ ప్రైజ్ అవ్వాలి. కానీ 'ఛాంగురే బంగారు రాజా' విషయంలో ఆ మ్యాజిక్ జరగలేదు. రంగురాళ్ళ నేపథ్యం తప్ప సినిమాలో ఎలాంటి కొత్తదనం లేదు. కథాకథనాలు పేలవంగా ఉన్నాయి. ఈ మర్డర్ మిస్టరీని పలు కోణాల్లో నాలుగు చాప్టర్లుగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో సీన్స్ పదే పదే రిపీట్ అవ్వడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. పేరుకి క్రైమ్ కామెడీ అయినప్పటికీ కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కామెడీకి, థ్రిల్లింగ్ కి స్కోప్ ఉన్నప్పటికీ.. రైటింగ్ వీక్ గా ఉండటంతో తేలిపోయింది. మొత్తానికి మాస్ రాజా నిర్మించిన 'ఛాంగురే బంగారు రాజా' పెద్దగా మెప్పించలేకపోయిందని చెప్పొచ్చు.