కిరణ్ కు చంద్రబాబు బహిరంగ సవాల్

  విశాఖజిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. గాంధీనగర్ లో జరిగిన బహిరంగ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ... తొమ్మిది సంవతసరాలుగా నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ లు గుర్తుకువచ్చారా? ఎస్సీ. ఎస్టీలకు కేటాయించిన భూములను, నిధులను, ఇతర సౌకర్యాలను దిగమింగి ఇప్పుడు సబ్ ప్లాన్ అంటూ నాటకం ఆడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ కిరణ్ కుమార్ అబద్ధాలు చెబుతున్నారని, తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ లో తొంభై శాతం మంత్రులు అవినీతిపరులుగా ముద్రపద్దారని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, తమ హయాంలో డీఎస్సీల ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని కానీ ప్రస్తుత ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ల పేరుతొ ఉద్యోగాలను అమ్ముకుంటున్నదని కిరణ్ కుమార్ పై విరుచుకుపడ్డారు.

బోస్టన్ లో వరుస బాంబు పేలుళ్లు,100 గాయాలు

        అమెరికాలోని బోస్టన్‌లో సోమవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.ముందుగా మారథాన్ ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మరో రెండు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. ఆ తరువాత జేఎఫ్‌కే లైబ్రెరీ వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో క్షతగాత్రులైన వారిని సమీప ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ పేలుళ్లకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ఈ ఘటనతో అమెరికాలోని ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

తెలంగాణ యంపీలకు కాంగ్రెస్ షాక్

  తెలంగాణ కాంగ్రెస్ యంపీలు కోరుకోన్నట్లే, వారు తెరాస అధినేత కేసీఆర్ తో జరుపుతున్న రహస్య సమవేశాల గురించి కాంగ్రెస్ అధిష్టానం చెవుల్లో పడింది. అయితే వారు ఆశిస్తున్నట్లు డిల్లీ నుండి వారిని బుజ్జగించేందుకు ఎవరూ బయలు దేరబోవడం లేదు, కానీ “మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరయినా ఎప్పుడయినా పార్టీలు మారొచ్చు. అందులో అభ్యంతరం పెట్టేందుకు ఏమీ లేదు” అని ఒక పిడుగులాంటి సందేశం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషిద్ అల్వీ నోటి ద్వారా తాజాగా వెలువడింది. మరో విధంగా చెప్పాలంటే, ‘ఉంటే ఉండండి పోతే పొండని’ ఆయన మాటలకి అర్ధం.   ఇంతవరకు వచ్చిన తరువాత వారు ఇప్పుడు పార్టీలోనే ఉన్నా వారికి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్స్ ఇస్తుందని నమ్మకం లేదు. కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా మారిన నిజామాబాద్ యంపీ మధు యాష్కీ సహచర యంపీలతో సమావేశం అయినప్పటికీ, తానూ పార్టీని వీడేదిలేదని స్పష్టం చేసారు. ఇక రాజయ్య, మంద జగన్నాథ రావు, కే.కేశవ్ రావు ముగ్గురూ కూడా తాము కాంగ్రెస్ పార్టీని వీడేoదుకే నిశ్చయించుకొన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇక మిగిలిన యంపీలు పొన్నాల ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు మరియు శాసనసభ్యులు కోమటి రెడ్డి సోదరులు ఇంకా అయోమయ స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుండి వారు ఎంత త్వరగా బయటపడి నిర్ణయం తీసుకొంటె అంత మంచిది. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో వారికి గౌరవం తగ్గితే, అప్పుడు కేసీఆర్ దృష్టిలో కూడా వారు పలుచన అవడం ఖాయం. అప్పుడు వారి పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది.

టి.ఆర్.ఎస్.పై కాంగ్రెస్ విసుర్లు

  కెసిఆర్ టి. కాంగ్రెస్ నేతలను మభ్యపెట్టి, తన మాయమాటలతో టి.ఆర్.ఎస్. లోకి ఆహ్వానిస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ కెసిఆర్ పై మండిపడుతున్నారు. టి. కాంగ్రెస్ నేతలకు టి.ఆర్.ఎస్.లోకి చేరడానికి డెడ్ లైన్ విధించడం ఏమిటని? తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం తానొక్కడే పాతుపడుతున్నాడని ఫోజులు పెట్టడం, తెలంగాణాపై మాట్లాడేందుకు తమకు మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయని కెసిఆర్ భావిస్తున్నారని, తెలంగాణా సీనియర్ నేత కె. కేశవరావు వంటివారు కెసిఆర్ మాయమాటలు ఎలా నమ్ముతున్నారని కెసిఆర్ పై ధ్వజమెత్తారు.  కాంగ్రెస్ ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే  తూర్పు జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టి.కాంగ్రెస్ నేతలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి నష్టం వాటిల్లదని, పెద్దపల్లి ఎంపి వివేక్ కాంగ్రెస్ ను వీడుతారనే వార్తలలో సత్యం లేదని తాను భావిస్తున్నట్లు, కెసిఆర్ టి.కాంగ్రెస్ మంత్రులను తన మాయాజాలంలో ఇరికించుకుంటున్నారని టి.కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ను నమ్మవద్దని హితవు పలికారు.

తెలంగాణ కాంగ్రెస్ యంపీలలో మళ్ళీ భేదాభిప్రాయలు

గతంలో తెలంగాణ కాంగ్రెస్ యంపీలు ‘తెలంగాణ కోసం త్యాగాలు-పార్టీకి రాజీనామాలు’ అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ, తరువాత ఒకరితో ఒకరు విభేదాలంటూ అందరూ తమ పదవుల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ విషయంలో చెప్పుకోవాలంటే మధు యాష్కీ మరియు పొన్నం ప్రభాకర్ కొంత నిజాయితీగా ప్రవర్తించారని చెప్పవచ్చును. తమ అధిష్టానం ఈ రోజు కాకపోయినా రేపయినా తెలంగాణ తప్పకుండా ఇస్తుందని నమ్ముతున్నందునే రాజీనామాలు చేయబోమని వారు స్పష్టం చేసారు.    మిగిలిన యంపీలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. కానీ వారే ఒకప్పుడు తమని సన్నాసులని, తెలంగాణ ద్రోహులని నోటికొచ్చినట్లు తిట్టిపోసిన కేసీఆర్ పార్టీ టికెట్స్ ఇస్తామని పార్టీలోకి ఆహ్వానించగానే నిర్లజ్జగా ఆయన వెనక వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కానీ, అలాగా వెళ్లేందుకు కారణం మాత్రం తాము తెలంగాణ కోసం త్యాగం చేస్తున్నట్లు చెప్పుకోవడం విశేషం. తమ పార్టీ తెలంగాణ ఇవ్వనందుకే పార్టీని విడిచి పెడుతున్నాము తప్ప, ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ఆఫర్ చేస్తున్నదుకు మాత్రం కాదని ప్రజలని నమ్మమంటున్నారు. తెరాసతో చేతులు కలిపితే తెలంగాణ ఉద్యమం బలోపేతం అవుతుందని చెప్పుకొస్తున్నారు. రేపు ఆ పార్టీలో చేరిన తరువాత, తాము ఇంత కాలం భజన చేసుకొస్తున్న ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలను కేసీఆర్ తిడితే మరి వారు భరించగలరో లేదో వారికే తెలియాలి.   ఇక ఈ రోజు తెలంగాణ యంపీలు జి.వివేక్ ఇంట్లో సమావేశం అయ్యారు. ఈసారి మందా జగన్నాథం, కే.కేశవ్ రావు మాత్రం పార్టీని వీడి తెరాస తీర్ధం పుచ్చుకోవాలని సంకల్పం చెప్పుకొని సిద్దం అవగా, వివేక్, రాజయ్య మాత్రమే ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోమరికొంత కాలం వేచిచూద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ,లిద్దరూ కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకొని ఉండాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. మందా మరియు కేశవ్ రావులు ఈ నెల 27న ఆర్మూరులో జరగనున్న తెరాస 12వ ఆవిర్భావ సభలో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.

చీలిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్

  సిబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో నాలుగవ ముద్దాయిగా రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేరును జతచేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ రెండుగా చీలిపోయింది. సబితా ఇంద్రారెడ్డిని దాల్మియా సిమెంట్స్ కు సానుకూలంగా ఫైళ్ళపై సంతకాలు చేశారని సిబీఐ ఆరోపించింది. ఈ విషయంలో సబితా ఇంద్రా రెడ్డికి వెన్నుదన్నుగా కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి, జె.గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ బాసటగా నిలిచారు. సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి అని, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే ఆమె ఆ ఫైళ్ళపై సంతకాలు చేశారని వీరు అంటుండగా, జె.సి. దివాకర్ రెడ్డి మాత్రం ఛార్జిషీట్లలో ఉన్న మంత్రుల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని, వై.ఎస్. రాజశేఖరా రెడ్డి చెప్పినంత మాత్రాన మంత్రులు ఫైళ్ళపై సంతకాలు చేయడం తప్పుపడుతున్నారు. తాను వై.ఎస్. క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా ఇలాంటి ఫైళ్ళపై సంతకాలు చేయడానికి నిరాకరించి ఫైళును వెనక్కు పంపినట్లు తెలిపారు. అలాగే సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని, రాజీనామా చేయాలో వద్దో హోమమంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించుకోవాలని అంటున్నారు.

నివాళులు అర్పించడంలో కూడా రాజకీయం

  ఆదివారం 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన టిడిపి నేత మోత్కుపల్లి నరశింహ, ఎర్రబెల్లి దయాకర్ లకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ కు నివాళులు అర్పించిన తరువాత మోత్కుపల్లి నరసింహ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాము ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తే తమను కోదండరాం అవమానించారని, తెలంగాణా జెఎసి చైర్మన్ కోదండరాం ఉద్యమం పేరిట కోట్లాది రూపాయలు దండుకున్నారని, ప్రొఫెసర్ గా ఉండి ఒక్క విద్యార్థికీ పాఠం చెప్పని కోదండరాం ఉద్యమం చాటున కొన్ని పార్టీలను బలోపేతం చేసేందుకే పనిచేస్తున్నారని, దళితులను ఉద్యమానికి దూరం చేస్తున్న కోదండరాం కు వ్యతిరేకంగా ఎస్సీలంతా ఏకం కావాలని, గతంలో దళితమంత్రిని కూడా కించపరిచేలా కోదండరాం మాట్లాడిన విషయం గమనించాలని, అంబేద్కర్ విగ్రహానికి దండ వేసే అర్హత కోదండరాం కు లేదని, అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించే సందర్భంగా రాజకీయాలకు పాల్పడిన ఘనత కోదండరాంకే దక్కుతుందని మోత్కుపల్లి కోదండరాంపై విరుచుకుపడ్డారు.

అనం మాటల యుద్ధం అందుకే మొదలు పెట్టారా

  ఆర్ధిక మంత్రి రామనారాయణరెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డిపై అతని కుటుంబ సభ్యులపై చేసిన తీవ్రవిమర్శలు ఊహించినట్లే కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్య మంటలు రేపాయి. దానికి కాంగ్రెస్ నేతలు ఒకరొకరిగా తమవంతు వ్యాక్యానాలు, విమర్శలు జోడిస్తూ ఆ మంటలు చల్లారకుండా చూస్తున్నారు. అయితే ఇది యాదృచ్చికంగా మొదలుపెట్టిన యుద్ధం మాత్రం కాదని చెప్పవచ్చును. తీవ్ర సమస్యలలో చిక్కుకొని ప్రతిపక్షాల దాడికి విలవిలలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తనకి బాగా అబ్బిన విద్యనే మళ్ళీ మరో మారు లాఘవంగా ప్రదర్శించి ఊహించిన ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చును.   పెరిగిన కరెంటు చార్జీలపై ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా ప్రభుత్వంపై చేస్తున్నపోరాటాన్నిఅలాగే దీర్ఘకాలం కొనసాగిస్తే ప్రజలలో అది మరింత ప్రభుత్వ వ్యతిరేఖత పెంచుతుందని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల, మీడియా, మరియు ప్రతిపక్షాల దృష్టిని మళ్ళించగల అంశం కోసం ఎదురు చూస్తుంటే, సీబీఐ చార్జ్ షీటు నెత్తి మీద పిడుగులా పడింది. దానితో కాంగ్రెస్ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి దూకినట్లయింది. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన నాటి నుండి ఒక సమస్య నుండి మరో సమస్యలోకి పయనిస్తున్నకాంగ్రెస్ ప్రభుత్వం, నెత్తిన పిడుగులా పడిన ఊహించని ఈ సమస్యకు మొదట దిగ్భ్రాంతి చెందినా, తరువాత మెల్లగా కోలుకొని తన కాంగ్రెస్ మార్క్ తెలివి తేటలు ప్రదర్శించింది.   ఈ ఆంశంలోనే డా.రాజశేఖర్ రెడ్డి, అతని కొడుకు జగన్ మోహన్ రెడ్డి అవినీతి భాగోతాలు కూడా ఇమిడి ఉండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు వారిని విమర్శించడం ద్వారా ప్రతిపక్షాలన్నిటికీ పని కల్పించడమే కాకుండా, అందరి దృష్టిని మళ్లించగలిగింది. ఇప్పుడు అందరి దృష్టీ మంత్రి ఆనం రామి నారాయణ రెడ్డి చేసిన తీవ్రవిమర్శల మీద, దానికి వస్తున్న ప్రతిస్పందన మీద ఉంది తప్ప, దీనికి ప్రధాన కారణమయిన ‘సీబీఐ చార్జ్ షీటు-హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని పదవి నుండి తొలగించాలనే డిమాండ్’ మీద లేదిప్పుడు.   ఇదే విధంగా ఆమె విషయం మరికొంత కాలం నాన్చగలిగితే ఆ తరువాత ఆమెను కూడా ధర్మాన ప్రసాదరావులాగే వెనకేసుకు రావడం పెద్ద కష్టమేమి కాదని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. దీనిని బట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించలేదేమో కానీ, తన సమస్యలను మాత్రం ఈ విధంగా చాలా తెలివిగా చాకచక్యంగా పరిష్కరించుకోగలదని అర్ధం అవుతుంది.

ఉపఎన్నికలు లేనట్టే ..

ఢిల్లీలోని ఎపిభవన్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ, కేంద్రమంత్రి పసబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ నిర్ణయాధికారాలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలేదని, సాధారణంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తరువాత ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపుతారని, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది గడువుండగా శాసనసభ స్థానాలకు ఖాళీ ఏర్పడితే ఉప ఎన్నికలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2006 - 2011 మధ్యకాలంలో 76 ఉపఎన్నికలు వచ్చాయని, మొత్తం 294 స్థానాల్లో మూడోవంతు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయని, పదేపదే ఉపఎన్నికలు రాకుండా అడ్డుకునే అధికారాలు ఎన్నికల సంఘానికి లేవనీ, దీనికి సంబంధించి ఏదైనా చట్టం కేంద్రం రూపొందించాలని తెలిపారు.

100 మంది అభ్యర్థుల ఎంపికలో లోక్ సత్తా సమాలోచనలు

  2014 ఎన్నికలకు లోక్ సత్తా పార్టీ నుండి కనీసం 100 మంది అభ్యర్థులను నిలపాలని పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కసరత్తు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్, కటారి శ్రీనివాసరావు లు పాల్గొన్నారు. వీలైనంత త్వరలో 40,50 స్థానాలకు అభ్యర్థులకు గుర్తించాలని, ఈసారి కనీసం  వంద స్థానాల్లో పోటీ చేయాలని, ఎంపికైనవారు ఎన్నికలనాటికి పార్టీ అంచనాలను అందుకోలేకపోతే మార్పుచేర్పులు చేద్దామని, మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి త్యాగానిరతులైన నేతలు ఇప్పుడూ ఉన్నారని నిరూపిద్దామని, పార్టీ లక్ష్యసాధనకు, దేశ నిర్మాణానికి ఈ ఏడాది విజయనామ సంవత్సరం కావాలని జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. కటారి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధ్యక్షుడు సూచించిన మేరకు లక్షమంది క్రియాశీల, పదిలక్షల సాధారణ సభ్యత్వాల లక్ష్యాన్ని రెట్టింపు చేయగాలామనే ఆశాభావాన్ని, చట్టసభల ఎన్నికల్లో భారీ ఫలితాల సాధనకు కృషి చేస్తామని, ప్రజాసమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు.

వైఎస్సార్సీపీ లోకి సమైక్యవాది అడుసుమిల్లి

  అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతున్న వైఎస్సార్సీపీ లోకి మరొక మాజీ టిడిపి, కాంగ్రెస్ అభిమాని అడుసుమిల్లి జయప్రకాష్ చేరుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. టిడిపి ఆవిర్భావంతోటే (1983)విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన అడుసుమిల్లి జయప్రకాష్ త్వరలోనే వైఎస్సార్సీపీ లో చేరనున్నట్లు సమాచారం. 1994 నుంచి టిడిపి అర్భన్ అధ్యక్షుడిగా, 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేసిన అడుసుమిల్లి జయప్రకాష్ నాదెండ్ల టిడిపిలో నుంచి బయటకు వచ్చేసిన తరువాత కొన్ని రోజుల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. హరికృష్ణ ప్రోద్భలంతో తిరిగి టిడిపిలో చేరినా ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపికి అవకాశం ఇవ్వడంతో అలిగిన అడుసుమిల్లి కాంగ్రెస్ అభిమానిగా, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు అడుసుమిల్లి జయప్రకాష్. తాజాగా కాంగ్రెస్ కు కూడా గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ లో చేరనున్నట్లు తెలుస్తుంది. 

కెసిఆర్ వలలో టి.కాంగ్రెస్ నేతలు

  కెసిఆర్ తెలంగాణా కాంగ్రెస్ నేతలను తన మాటలగారడీలో పడేస్తున్నారా ...? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. శనివారం మందా జగన్నాథం కెసిఆర్ కెసిఆర్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. తాజాగా ఆదివారం తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె. కేశవరావు ఇంటికి వెళ్ళి కెసిఆర్ చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా కెసిఆర్ టి.కాంగ్రెస్ నేతలను టి.ఆర్.ఎస్. లో చేరాలని, మీ స్థానాలు పదిలంగా ఉంటాయని, ప్రత్యేక తెలంగాణా కోరుకునే వారంతా ఒక తాటిపైకి రావాలని కె.కేశవరావును కోరినట్లు తెలిసింది. కెసిఆర్ తో చర్చల వివరాలను కేశవరావు వెల్లడిస్తూ కెసిఆర్ టి.కాంగ్రెస్ నేతలను టి.ఆర్.ఎస్. లోకి ఆహ్వానించారని, కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వదు కాబట్టి, తెలంగాణా రాష్ట్రం కోరుకునే వారంతా తమ పార్టీలో చేరమన్నారని, దీనిపై టి.కాంగ్రెస్ నేతలంతా సమావేశమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రజలతో డబల్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్

  ఆర్ధిక శాఖా మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన తరువాత, కాంగ్రెస్ మంత్రులు ఒకరొకరిగా ఆయనతో గొంతు కలుపుతున్నారిప్పుడు. మంత్రి ఆనం జగన్ మోహన్ రెడ్డి జైలు నుండే పార్టీని చక్క బెడుతున్నాడని ప్రకటించిన తరువాత, తెదేపా ఆయన మాటలు తము చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తున్నాయని, ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని జగన్ మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న చంచల్ గూడా జైలు సిబ్బందిపై, ముఖ్యంగా జైలు సుపరిండెంట్ సైదయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఈ విషయంలో స్పందించలేదు. కానీ, తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కూడా తెదేపా ఆరోపణలను దృవపరుస్తూ జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలును తన పార్టీ కార్యాలయంలా మార్చేశాడని ఆరోపించారు. అదే సమయంలో, వైకాపా డబ్బు మదంతో మిడిసిపడుతోందని, ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వచ్చేది దోపిడీ రాజ్యమని తీవ్ర విమర్శలు కూడా చేసారు.   ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిని అతని కుటుంబ సభ్యులను, అతని పార్టీని ప్రజల ముందు తీవ్రంగా విమర్శిస్తూనే, మరో పక్క అతనికి జైల్లో రాచమర్యాదలకు లోటు లేకుండా చూసుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు, నేడు కాకపోతే రేపయినా జగన్ మోహన్ రెడ్డి అవసరం తమ పార్టీకి ఉంటుందనే దూరాలోచనతోనే ఈ విధంగా ప్రజలతో డబల్ గేమ్ ఆడుతున్నారేమో.

కాంగ్రెస్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి

  హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు అవడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో కళoకితులుగా ముద్రపడిన తమ మంత్రులను వదులుకోవాలా లేక వారిని కాపాడుకోవడానికి తమ పార్టీ పరువు పణంగా పెట్టాలా అనే విషయాన్నీ తేల్చుకోలేక కాంగ్రెస్ పార్టీ చాలా సతమతమవుతోంది. వారిని సీబీఐకి బలిఇస్తే ఆ ప్రభావం మిగిలిన మంత్రుల మీద పడుతుంది. అంతే కాకుండా కాంగ్రెస్ తన అవినీతిని తానే స్వయంగా అంగీకరించినట్లవుతుంది. పార్టీ తమను కాపాడదనే భావం మిగిలిన మంత్రులలో కూడా కలిగితే, ఏ ఫైలు మీద సంతకం చేస్తే ఏమి మెడకు చుట్టుకొంటుందో అనే భయం మంత్రులలో ఏర్పడి అది ప్రభుత్వపనితీరు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక, దైర్యంచేసి వారిని వెనకేసుకు వద్దామననుకొన్నా, ప్రతిపక్షాలు వారిని పదవుల నుండి తొలగించమని చేస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టమే. వారి ఒత్తిడిని ఎలాగో భరించినప్పటికీ, ‘కాంగ్రెస్ అవినీతి-కళoకిత మంత్రుల’ గురించి ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న ప్రచారం వలన, ప్రజలలో ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఉన్నవ్యతిరేఖత మరింత పెరిగే అవకాశం ఉంది. అందువలన ఈ సమస్య నుండి ఏదోవిధంగా బయట పడకపోతే వచ్చే ఎన్నికలలో అసలుకే ఎసరు రావచ్చును. అయితే అందుకు కాంగ్రెస్ వద్ద ఉపాయం ఏది లేదు. కానీ, ఈ అంశంపై నుండి ప్రజల దృష్టిని మళ్ళించే విధంగా ఏదో ఒక సరికొత్త నాటకం మొదలుపెట్టే అవకాశం ఉంది.

మందా జగన్నాథాన్ని వెళ్ళిపోమన్న అరుణ

        కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలనుకునేవారు ఎంత త్వరగా వెళితే అంత మంచిదని మంత్రి డికె అరుణ అన్నారు. జిల్లాలోని గద్వాల్‌లో ఆదివారం డికె అరుణ బస్సు యాత్ర ప్రారంభమైంది. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం పార్టీని వీడతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుందని చెప్పారు. పార్టీని విడిచి పెట్టి వెళ్లాలనుకునే వారు త్వరగా వెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసే విషయంలో తాము వెనుకబడ్డామన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకే తాను ఈ బస్సు యాత్ర చేపట్టానని అరుణ తెలిపారు. ప్రచారంలో వెనుకబడినందునే తాను యాత్ర చేస్తున్నానన్నారు. జిల్లాలో తాను ఏడు రోజుల పాటు ఈ యాత్ర చేస్తానన్నారు.

కోదండరామ్ కు ఆ అర్హత లేదు

      అంబేద్కర్ జయంతి సంధర్బంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన టిడిపి నేత నరసింహులు, తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విగ్రహానికి పూల మల వేయడానికి వచ్చిన టిడిపి నేతలకు వ్యతిరేకంగా ఐకాస కార్యకర్తలు నినాదాలు చేశారు.   అంబేద్కర్ విగ్రహానికి వద్దకు వచ్చే అర్హత కోదండరామ్ కు లేదని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు.  ఒక్క రోజు కూడా పాఠం చెప్పకుండా, లక్ష రూపాయల జీతం తీసుకుంటూ కోదండరామ్ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ లోకి మందా జగన్నాధం!

        మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాధం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. శనివారం పాలమూరుకు వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మూడున్నర గంటలపాటు భేటీ అయ్యారు. ఆయన ఈ నెల 27న ఆర్మూర్ లో జరగనున్న టీఆర్ఎస్ ఆవిర్బావ సభలో పార్టీలో చేరతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా మరికొంత సమయం పట్టవచ్చని, కాకపోతే ఆయన పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. గత మూడేళ్లుగా తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడుతున్న మందా కాంగ్రెస్ తెలంగాణను పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు త్వరలో కేసీఆర్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.