కనబడిపోవడానికి రాలేదు: పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ స్థాపించిన తరువాత కనబడకుండా పోయిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మళ్ళీ చాలా రోజుల తరువాత కర్ణాటకలో రాయచూర్ లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో కనబడ్డారు. అక్కడ స్థిరపడిన తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ “ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఇలా హెలికాఫ్టర్ లో నుండి దిగి నాలుగు ముక్కలు చెప్పేసి, మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు మొహం చూపించకుండా మాయమయిపోయే రాజకీయ నేతల వంటివాడిని కాను నేను. ఈ దేశంపట్ల నాకూ బాధ్యత ఉందని భావించి ప్రజల తరపున పోరాడేందుకే జనసేన పార్టీ స్థాపించాను. మన దేశాన్నిసరయిన మార్గంలో నడిపించగల బలమయిన నాయకుడు నరేంద్ర మోడీయేనని నేను దృడంగా నమ్మినందునే, ఆయనను సమర్ధిస్తున్నాను. ఆయనకు వెనుక ఆస్తులు ఏవీ లేవు. రాజకీయాలలోకి తీసుకొని వచ్చేందుకు ఆయనకు బంధువులు లేరు. అందువలన ఆస్తులు సంపాదించుకోవాలనే యావ ఆయనకి లేదు. ఆయన జీవితం ఈదేశం కోసమే పూర్తిగా ధార పోశారు. మంచి పరిపాలనా దక్షుడు, సమర్ధుడు, అనుభవశాలి, గుండె దైర్యం ఉన్నవాడు అయిన మోడీ వంటి వారి నేతృత్వంలోనే మన దేశం అభివృద్ధి పధంలో పయనించగలదు. అందుకే అటువంటి నాయకుడిని ఎన్నుకోవలసిన అవసరం ఉందని చెప్పేందుకే మీ ముందుకు వచ్చాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్, టిడిపి మధ్య ఘర్షణ

      నల్గొండలో తెలుగుదేశం కార్యకర్తలకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. హుజూర్ నగర్ టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి స్వామి గౌడ్ తన డోర్ పోస్టర్లలలో పవన్ కళ్యాణ్ పోటో ముద్రించి, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో లేకపోవడంతో ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించి౦ది. దీనిపై వెంటనే స్వామి గౌడ్ ను వివరణ కోరేందుకు జూనియర్ అభిమానులు ఆయన ఇంటికి వెళ్లారు. పోస్టర్లలలో ఎన్టీఆర్ పోటో ఎందుకు ముద్రించలేదని..పార్టీ సభ్యత్వం లేని పవన్ ఫోటో ఎలా ముద్రిస్తారని ప్రశ్నించారు? అక్కడే వున్న డోర్ పోస్టర్లలను బయటకు తెచ్చి దహనం చేయబోతుండగా టిడిపి కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు వున్న పోస్టర్లను మీరు ఎలా దహనం చేస్తారని వారిపై ఎదురుదాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. వెంటనే సమాచారం ఆ పట్టణ ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకోని కొందరు టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేశారు.

పవన్ ను కాదని నానికే బాబు సీటు

      తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది అనే దానిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆఖరికి కేశినేని నానికే విజయవాడ ఎంపీ సీటును టిడిపి అధినేత బాబు ఖరారు చేశారు. దీంతో కేశినేని భవన్ వద్ద టిడిపి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేశినేనికే ఎంపీ సీటు దక్కుతుందని భావిస్తున్న తరుణంలో సడన్ గా పవన్ కల్యాణ్ సిఫార్సుతో రంగంలోకి వచ్చిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ నాని పరిస్థితిని గందరగోళంలో పడేశారు.   వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని మీడియాలో వార్తలు రావడంతో కేశినేని నానికి షాక్ తగిలింది. ఆ తరువాత బాబుతో ఆయన భేటి అవ్వగా ఒత్తిళ్ల కారణంగా సీటును ఇవ్వలేకపోతున్నానని, అర్థం చేసుకుని అసెంబ్లీకి పోటీ చేయాలని  బాబు చెప్పిన నాని వినలేదు. విజయవాడ స్థానం నుంచే పోటీ చేస్తానని భీష్మించారు. ఆయనకు సర్ది చెప్పాలని బాబు ప్రయత్నించినప్పటికీ కేశినేని నాని దారిలోకి రాలేదు. నానీని మార్చడం సరికాదంటూ చంద్రబాబుపై స్థానిక నేతల నుంచి ఒత్తిడి, మీడియాలో కూడా పార్టీకి వ్యతిరేక వార్తలు రావటంతో సీను మారింది.  దీంతో సాయంత్రం నానితో చర్చలు జరిపిన బాబు ఆయనకే సీటు ఇస్తానని చెప్పడంతో కథ సుఖాంతమైంది.

జయమ్మకు కోపం వచ్చింది

  మన దేశంలో ప్రధానమంత్రి కావాలని కోరుకొనే రెండు డజన్ల మంది నేతలలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత కూడా ఒకరు. ఆ కారణంగానే అటువంటి కోరికున్న నేతలందరూ కలిసి పెట్టుకొన్న థర్డ్ ఫ్రంటులో ఆమె కూడా చేరారు. కానీ అంత మందితో వేగడం కంటే, తనకి బాగా పట్టున్న తన స్వంత రాష్ట్రంలో ఉన్న మొత్తం 40 యంపీ సీట్లు సంపాదించుకొంటే, అప్పుడు ‘మీరే ప్రధాని కావాలని’ కోరుతూ వారందరూ తన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారని జయలలిత భావించారు. అందుకే ఎంతో కష్టపడి థర్డ్ ఫ్రంట్ వేదికని నిర్మించిన లెఫ్ట్ పార్టీలతో కూడా పొత్తులకు ఆమె ‘నో’ చెప్పేసి షాక్ ఇచ్చేసారు. అటువంటప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీకో, లేకపోతే మోడీని ప్రధాని అభ్యర్ధిగా చెప్పుకొంటున్న బీజేపీతోనో ఆమె పొత్తులు పెట్టుకొంటారని ఆశించడం అవివేకమే అవుతుంది.   అయినప్పటికీ, బీజేపీ శాస్త్రం ప్రకారం ఆమెను కూడా ఓసారి కదిపి చూసింది, కానీ ఊహించినట్లే వారికి కూడా ఆమె ‘నో’ చెప్పేశారు. రెండాకుల పార్టీకి అధినేత అయిన ఆమే బీజేపీని పొమ్మని చెపుతున్నపుడు, ఆమెకంటే నాలుగాకులు ఎక్కువే చదివిన తాము మాత్రం కాంగ్రెస్, బీజేపీలను ఎందుకు చేరదీయాలని అనుకొన్న డీయంకే అధినేత కరుణానిధి కూడా వాటికి ‘నో’ చెప్పేయడంతో పాపం చేసేదేమీలేక ఆ రెండు జాతీయ పార్టీలు తమిళనాడులో వీదికొకటి చొప్పున ఉండే చిన్న చితకా పార్టీలను పోగేసుకొని ఎన్నికలు ఎదుర్కోవడానికి నానా తిప్పలు పడుతున్నాయి.   అయితే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని ఎవరో సిమ్కార్డ్ అమ్ముకొనే వాళ్ళు చెప్పిన సంగతి గుర్తుకురావడంతో బీజేపీ, తమిళనాట ఆ రెండు పార్టీలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్, మంచి ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ కి ఏకంగా వలేసేపట్టేసింది. దానితో కంగారు పడిన జయమ్మ, కాకి మీద పిల్లి మీద పెట్టి తిట్టిన్నట్లు బీజేపీని, పనిలోపనిగా ఆ నోటితోనే తన ప్రియమయిన ముసలి శత్రువు కరుణానిధిని కలిపి, కావేరీ నది జలాల పంపకం వంక పెట్టి తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్లు లంఖించుకొన్నారు.   గత నాలుగయిదు దశాబ్దాలుగా ఆమెతో నిరవధికంగా ‘టామ్ అండ్ జెర్రీ షో’ నడిపిస్తూ తమిళ ప్రజలందరికీ మంచి వినోదం కల్పిస్తున్న కరుణానిధికి ఆమె బాధ ఏమిటో అర్ధమయింది, కానీ అరవం ఒక్క ముక్క కూడా అర్ధం కానీ బీజేపీ నేతలు మాత్రం ఆమె అంత తీయతీయగా తమిళంలో తిట్టి పోస్తుంటే, రజనీకాంత్ తో తాము దోస్తీ చేసినందుకు ఆమె తమను తిడుతోందో లేక పోగుడుతోందో తెలియక వెర్రి నవ్వులు నవ్వుతున్నారు.

మోడీకి అంత సీను లేదు: బీజేపీ నేత జోషి

  బీజేపీ నరేంద్ర మోడీని తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత నుండే ఆ పార్టీకి దేశంలో మంచి ఊపు వచ్చింది. నాటి నుండి నేటి వరకు మోడీ విస్తృతంగా చేస్తున్న ప్రచారం వలన నానాటికి ఆయన రేటింగ్, దానితో బాటే పార్టీ రేటింగ్ కూడా బాగా పెరిగింది. ఇది కాంగ్రెస్ నేతలు కూడా కాదనలేని సత్యం. అయితే ఆయన కోసం తన వారణాసి సీటుని వదులుకోవలసివచ్చిన మురళీ మనోహర్ జోషీ మాత్రం అలా భావించడం లేదు. దేశంలో అందరూ చెప్పుకొంటున్నట్లు మోడీ ప్రభంజనమేమీ లేదని అధికేవళం బీజేపీ ప్రభంజనమని దాని వలన మోడీయే లబ్ది పొందుతున్నారని అన్నారు. అంతే కాక మోడీ కేవలం పార్టీలో ఒక ముఖ్యమయిన పదవికి ఎంపిక చేయబడిన వ్యక్తి మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుంటే, ఇటువంటి అతి కీలకమయిన సమయంలో స్వంత పార్టీకి చెందిన మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ నేతే వ్యక్తిగత కారణాలతో మోడీకి అంత సీను లేదని కించపరుస్తూ మాట్లాడటం వలన పార్టీకే కాదు, ఆయనకీ నష్టమే కలిగిస్తుంది. ప్రత్యర్ధ కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవలసిన ఈ తరుణంలో ఆయన స్వంత పార్టీ ప్రధాని అభ్యర్ధి మీదే బాణాలు ఎక్కుపెడితే అందుకు కాంగ్రెస్ కూడా చాలా సంతోషిస్తుంది.

సోనియాగాంధీకి ముద్దు : వెల్లువెత్తిన విమర్శలు

  ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంటే వున్నారు. వాళ్లు సోనియాగాంధీని ఎంతో ఇష్టపడుతున్నారన్న కలరింగ్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక చీప్ ట్రిక్‌కి దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నామధ్య సోనియాగాంధీ కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ ఆమె తన సెక్యూరిటీ సిబ్బంది నుంచి దూరంగా వెళ్ళిపోయి జనంలో కలిసిపోయారు. మహిళలు ఆమెను ఎంతగానో ఆదరించారు. అప్పుడు కొంతమంది ముస్లిం మహిళలతో సోనియాగాంధీ ముచ్చటిస్తూ వుండగా, ఒక ముస్లిం అమ్మాయి సోనియాగాంధీకి ముద్దు పెట్టేసింది. అక్కడే వున్న మిగతా ముస్లిం మహిళలు ఈ దృశ్యాన్ని ఆనందంగా గమనిస్తున్నారు. ముస్లిం యువతి చేత ముద్దు పెట్టించుకున్న సోనియా కూడా సంతోషించారు. దీనిని ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటోని దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఇది చూడటానికి మామూలుగా అనిపించవచ్చుగానీ, ఇది దేశంలోని ముస్లింలను ఆకట్టుకోవడానికి, వారి ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక ట్రిక్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్లకోసం దేనికైనా దిగజారే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి ఇది ఒక ఉదాహరణ అని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.

విమాన ప్రమాదం : మాయావతి బతికిపోయింది!

  ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో వున్న మాయావతి ఒక చార్టర్ ఫ్లయిట్ ఉపయోగిస్తున్నారు. ఆదివారం నాడు మాయావతి మహారాష్ట్రలో ప్రచారం ముగించుకుని విమానంలో లక్నోకి తిరిగి వచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లయిట్ లక్నో ఎయిర్‌పోర్ట్ లో లాండ్ అయ్యే సమయంలో విమానం ముందు చక్రం తెరుచుకోలేదు. దాంతో విమానం పైలెట్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్‌కి సన్నాహాలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే మాయావతిని కాపాడటానికి అంబులెన్స్ ని కూడా రన్ వే దగ్గరకి పిలిపించారు. చివరికి పైలెట్ విమానాన్ని సేఫ్‌గా లాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పిల్లల బుర్రతిన్న హేమమాలిని: కేసు నమోదు

  మధుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో వున్న బాలీవుడ్ నటి హేమమాలిని మీద ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. మధురలోని ఓ విద్యాలయంలో హేమమాలిని ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ప్రసంగం చేశారు. నియోజకవర్గంలో ప్రచారానికి హేమమాలిని అనుమతి తీసుకున్నప్పటికీ స్కూల్‌లో ప్రసంగించడానికి మాత్రం అనుమతి తీసుకోలేదు. తమ స్కూలుకి వచ్చిన హేమమాలినిని చూసి సదరు స్కూలు పిల్లలు ఆనందించినప్పటికీ, ఆమె ప్రసంగం ఒక్క ముక్క కూడా అర్థంకాక నోళ్ళు వెళ్ళబెట్టారు. స్కూలు పిల్లల దగ్గర రాజకీయ ప్రసంగం చేసిన హేమమాలిని మీద ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.

కేసిఆర్ కి రాములమ్మ తిట్లు, శాపనార్ధాలు

      టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన కాంగ్రెస్ మెదక్ శాసనసభ అభ్యర్ధి విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసిఆర్ కు మోసం చేయడం తప్ప పరిపాలించడం చేతకాదని అన్నారు. ఓటమి భయంతోనే కెసిఆర్ మహబూబ్ నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారన్నారు. తెరాసకు అధికారమిస్తే దోచుకుతింటుందన్నారు. తెరాస దొరల పార్టీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారన్నారు. తెరాస దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారి నైజం, కెసిఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలననే కొనసాగిస్తారని విమర్శించారు.

ఆమ్‌ ఆద్మీ నాయకులని చావగొడుతున్నారు

  ఎన్నికల ప్రచారంలో వున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కి ఎక్కడకి వెళ్ళినా చెంపదెబ్బలు పడుతూనే వున్నాయి. ఈ కొట్టుడు కార్యక్రమం కేజ్రీవాల్‌తో మాత్రమే ఆగటం లేదు. ఆయన పార్టీ కార్యక్తలకు కూడా తన్నులు పడుతున్నాయి. ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మి మధ్యప్రదేశ్‌లోని కమల్ చౌక్ అనే ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొంతమంది రాళ్ళతో దాడులు చేసి బుర్ర పగిలేలా చేశారట. రాళ్లు విసిరినవారు మోడీకి మద్దతుగా, కేజ్రీవాల్‌కి అనుకూలంగా నినాదాలు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ దీనిని ఎవరూ నమ్మడం లేదు. అలాగే బీహార్‌లోని నలందా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి ప్రణబ్ ప్రకాష్ మీద కూడా దాడి జరిగింది. కారులో వెళ్తున్న ఆయన్ని కొంతమంది కారులోంచి బయటకి లాగి లాఠీతో ఎడాపెడా కొట్టి పారిపోయారట. ఈ సంఘటనలో ప్రణబ్ ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడట. ఈ రాజకీయాలేంటో.. ఈ చావగొట్టుకోవడాలేంటో!

మోడీకి మద్దతు : పవన్, నాగ్‌కి రజనీకాంత్ షాక్!

  స్టార్ అంటే ఎలా వుండాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో రజనీకాంత్‌ని చూసి నేర్చుకోవాలి. ఎన్నో సందర్భాలలో ఎందరికో మార్గదర్శకుడిలా నిలిచిన రజనీకాంత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి, అక్కినేని నాగార్జునకి స్టార్ అంటే ఎలా వుండాలో చెప్పకనే చెప్పేశాడు. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తూ వుండటంతో తెలుగులో టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, నాగార్జున గబగబా నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ తీసుకుని, గుజరాత్‌కి వెళ్ళి మోడీని కలుసుకుని, కౌగిలించుకుని వచ్చారు. మోడీకే మా మద్దతు అని ప్రకటించారు. అలాగే రజనీకాంత్‌కి కూడా మోడీ నచ్చాడు. మోడీకి మద్దతు ఇవ్వాలని ఆయనకి అనిపించింది. అయితే రజనీకాంత్ గబగబా మోడీ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు... తెలివిగా ఆలోచించి, తన స్టార్‌డమ్‌కి తగిన పని చేశాడు. మోడీనే తన దగ్గరకి వచ్చేలా చేసుకున్నాడు. దేశమంతా మోడీ వైపు చూస్తుంటే, మోడీని కలవాలని దేశంలోని ప్రముఖులందరూ ప్రయత్నిస్తుంటే మోడీ స్వయంగా చెన్నై వెళ్ళి రజనీకాంత్‌ని కలిశారు చూశారా.. అదీ స్టార్‌డమ్ అంటే. ఇదిలా వుంటే, రజనీకాంత్‌లాగా మా హీరో ఎందుకు తన స్టార్‌డమ్‌ని చూపించలేకపోయాడని పవన్ కళ్యాణ్, నాగార్జున అభిమానులు ఫీలవుతున్నారు. ఈ అంశం సదరు హీరోల అభిమానులకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా షాక్ ఇచ్చి వుండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

విజయవాడ ఎంపీ టిక్కెట్ : పవన్ కళ్యాణ్ మనస్తాపం?

  విజయవాడ తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ వ్యవహారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని మనస్తాపానికి గురిచేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టడానికి, బహిరంగ సభలు నిర్వహించడానికి వెన్నుదన్నుగా నిలిచిన పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ తెలుగుదేశం టిక్కెట్ ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడు కూడా దీనికి సానుకూలంగా స్పందించాడు. అప్పటి వరకూ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వున్న కేశినేని నానిని పక్కన పెట్టి పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి అంగీకరించారు. అయితే చంద్రబాబు నిర్ణయం కేశినేని నానితోపాటు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలకు రుచించలేదు. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని బహిరంగంగానే విమర్శించడం ప్రారంభించారు. కేశినేని నాని కూడా నిరసన గళాన్ని వినిపించడం, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ‘సౌండ్’ ఇవ్వడంతో సదరు సీటు కేశినేని నానికే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఈ ఇష్యూలో విజయవాడ తెలుగుదేశం కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ని ఘాటుగా విమర్శించారు. మధ్యలో దూరిపోయి కేశినేని నానికి అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. టోటల్‌గా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణే ముద్దాయిలా నిలిచాడు. దీంతో పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించడానికి ముందే స్థానిక తెలుగుదేశం క్యాడర్‌ని ఒప్పించి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి వుండేది కాదని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది.

కేశినేని నానికే విజయవాడ ఎంపీ టిక్కెట్!

  కేశినేని నానికే విజయవాడ పార్లమెంట్ స్థానానికి టీడీపి టిక్కెట్ ఖారారు అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని బాబు భావించారు. అయితే ఎప్పటి నుంచో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా అందరూ భావిస్తున్న కేశినేని నానికి ఈ నిర్ణయంతో షాక్ తగిలింది. అయితే ఆయన దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడ స్థానం నుంచే పోటీ చేస్తానని భీష్మించారు. ఆయనకు సర్ది చెప్పాలని బాబు ప్రయత్నించినప్పటికీ కేశినేని నాని దారిలోకి రాలేదు. రెబల్ అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశాలు కనిపించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేశినేని నానినే విజయవాడ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మోడీ భార్యకి భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ లీడర్ వెటకారం

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైవాహిక జీవితం మీద కాంగ్రెస్ నాయకుల దాడి నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. స్వయానా రాహుల్ గాంధీ కూడా నిన్నటి వరకూ దాడి చేసి, సదరు దాడి తనమీదే రివర్స్ అవుతూ వుండటంతో నోరు మూసుకున్నాడు. అయితే మిగతా కాంగ్రెస్ నాయకులు మాత్రం మోడీ మీద మాటల తూటాలు వదులుతూ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అస్సాం ముఖ్యమంత్ర తరుణ్ గొగోయ్ బోలెడంత వెటకారంతో కూడిన ప్రకటన చేశాడు. ‘మోడీ తనను ఎంతమాత్రం పట్టించుకోకపోయినా ఆమె ఎంతో ఓర్పుగా ఉన్నారు. సహనానికి ప్రతీకగా తన బాధని భరిస్తున్నారు. అంచేత నేను మోడీ భార్యకి ‘సహనం’ విభాగంలో భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాను’ అన్నారు. యశోదాబెన్‌కి భారతరత్న ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి హాదాలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నట్టు తరుణ్ గొగోయ్ ప్రకటించాడు. సహనం విషయంలో యశోదాబెన్ భారతదేశానికి మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికీ ఆదర్శం అని గొగోయ్ అన్నాడు.

ప్రియాంకకి పిన్ని వార్నింగ్!

      వరుణ్‌గాంధీ బీజేపీ నాయకుడు. మొన్నీమధ్య రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగిందని నోరుజారి చెప్పి తన తల్లిచేత తలంటు పోయించుకున్నాడు. పాపం ఇతనేమో రాహుల్ గురించి పాజిటివ్‌గా మాట్లాడితే, ప్రియాంక మాత్రం అతని గురించి వెటకారంగా మాట్లాడింది. ‘‘వరుణ్‌గాంధీ నా సోదరుడు. కానీ, పాపం అతనికి బొత్తిగా లోకజ్ఞానం లేదు. తప్పు దారిలో నడుస్తున్న అతన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం వుంది’’ అని సోనియాగాంధీ గారాలపట్టి ప్రియాంక చేసిన కామెంట్లను వరుణ్ గాంధీ తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తీవ్రంగా ఖండించడంతోపాటు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ‘‘వరుణ్ తప్పు దోవలో నడుస్తుంటే, దేశమే అతన్ని సరైన దారిలో నడిపిస్తుంది. నీ సలహాలు అవసరం లేదు’’ అని మేనక స్పందించారు.

బీజేపీకి ప్రచారం : ఆలోచించి చెప్తానన్న పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్‌జీ ఎన్నికల ప్రచారానికి రండి.. బీజేపీని బలపర్చండి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని సోమవారం స్వయంగా కలసి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటకలో కూడా పార్టీకి ప్రచారం చేయాల్సిందిగా కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కిషన్ విజ్ఞప్తిని విన్న పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో ఈ విషయం మీద చర్చించి రెండు రోజుల్లో ప్రచారం విషయంలో నిర్ణయం తీసుకుంటానని కిషన్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. నరేంద్రమోడీ విధానాలు నచ్చిన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చారని, త్వరలో ప్రచారం చేస్తారని భావిస్తున్నామని అన్నారు. పవన్ చేసే ప్రచారం బీజేపీతోపాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగపడే అవకాశం వుందని ఆయన అన్నారు.

మోడీ పెళ్ళి ఇష్యూ: ఎవరికి ఎంతమంది భార్యలు?

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తనకు పెళ్ళి అయిన విషయం తాను స్వయంగా ప్రకటించలేదని, సొంత భార్య విషయమే బయటపెట్టని వ్యక్తి దేశానికి ఏం న్యాయం చేస్తాడని ఇటు యుపిఎ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తోపాటు యుపిఎ మిత్రపక్ష పార్టీలు మోడీమీద దాడి మొదలుపెట్టాయి. ఈ దాడిని బీజేపీ వర్గాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి.   మోడీ వ్యక్తిగత జీవితం, ఎప్పుడూ చిన్నప్పుడు జరిగిన పెళ్ళి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న పార్టీలకు బీజేపీ నాయకులు కీలెరిగి వాత పెడుతున్నారు. ఉత్తరభారదేశంలో దీనికి టిట్ ఫర్ టాట్ అని రియాక్ట్ అవుతున్నారు. ఉత్తరభారతదేశంలో ఈ అంశం మీద బీజేపీ అతికిస్తున్న వాల్ పోస్టర్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆ వాల్ పోస్టర్లలో యుపిఎ భాగస్వామ్య పార్టీల్లో ఎవరికి ఎంతమంది భార్యలున్నారో ప్రకటించారు. ఈ వాల్ పోస్టర్‌లో ప్రధానంగా జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వనితకు ముద్దు పెడుతున్న ఫొటో వుంది. అలాగే భార్యల లిస్టు విషయానికి వస్తే దిగ్విజయ్ సింగ్‌కి, ములాయం సింగ్ యాదవ్‌కి ఇద్దరేసి భార్యలు వున్నారట. శశి థరూర్‌కి ముగ్గురు భార్యలు. సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆజమ్‌ఖాన్‌కి మొత్తం ఆరుగురు భార్యలున్నారు. ఇంతమంది భార్యలున్న వీళ్ళు బెటరా? దేశానికి సేవ చేయడం కోసం వైవాహిక జీవితాన్ని వదులకున్న మోడీ బెటరా అనే అర్థం వచ్చేలా ఆ పోస్టరుంది. ఈ పోస్టర్ మీద యుపిఎ భాగస్వామ్య పార్టీకు కిక్కురుమనడం లేదు.

పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలుస్తారా?

      పవన్ కళ్యాణ్ కళ్యాణాల హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ప్రేమించి పెళ్ళాడిన నందినికి దూరమైన పవన్ కళ్యాణ్ తనతో ‘బద్రి’లో నటించిన రేణూ దేశాయ్‌కి చేరువయ్యాడు. ఆ తర్వాత నందినికి విడాకులిచ్చేశాడు. రేణూ దేశాయ్‌తో కొంతకాలం సహజీవనం, మరికొంతకాలం వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. కాలక్రమేణా రేణూ దేశాయ్‌తో వైవాహిక జీవితాన్ని ముగించేసి, ‘సెటిల్’ చేసుకున్నాడు.   ఇప్పుడొక విదేశీయురాలిని పెళ్ళాడాడు. ఈ హిస్టరీ ఇలా వుంటే, పవన్ కళ్యాణ్ నుంచి దూరమైపోయి తన స్వస్థలమైన పూణే వెళ్ళిపోయిన రేణు దేశాయ్ ఒక హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తూ బిజీగా వున్నారు. అయితే  తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ గురించి చేసిన పాజిటివ్ కామెంట్లు దీనికి బలాన్నిస్తున్నాయి. రేణు దేశాయ్ పవన్ గురించి ఫేస్ బుక్‌లో చేసిన కామెంట్లు చాలా ఆసక్తికరంగా వున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా ఉన్నత ఆశయాలున్న వ్యక్తి అట. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదైనా చేయాలని నిరంతరం తపించే వ్యక్తి అట. తమమధ్య అభిప్రాయ భేదాలు వుండటం, వాటివల్ల తాము విడిపోవడం జరిగినప్పటికీ, పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో గౌరవమట. రేణు దేశాయ్ సడన్‌గా ఇలా పబ్లిగ్గా పవన్ కళ్యాణ్‌ని పొగడ్డం చూస్తుంటే వీరిద్దరూ మళ్ళీ చేరువవుతారేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి.