పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మోడీ ప్రభుత్వం ఈ సమావేశాలలో తమ తొలి ఆర్ధిక మరియు రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 8న రైల్వే బడ్జెట్, 9న ఆర్ధిక సర్వే, 10న ఆర్ధిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టబడతాయి. ఆర్ధిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే బడ్జెట్ ను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెడతారు. రెండు బడ్జెట్లపై ఈ నెల 30వరకు చర్చలు జరిగి అదే రోజు ఆమోదించబడతాయి. పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 14న ముగుస్తాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని అఖిలపక్ష భేటిలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది.

రాష్ట్ర యంపీలతో చంద్రబాబు సమావేశం

  మళ్ళీ 18ఏళ్ల తరువాత అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల యంపీలతో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి, అందరినీ ఆహ్వానించింది. పార్లమెంటు సమావేశాలకు ముందు పార్టీలకు అతీతంగా రాష్ట్ర యంపీలు అందరూ ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరయ్యి, పార్లమెంటులో ప్రస్తావించవలసిన రాష్ట్ర సమస్యల గురించి, కేంద్రం నుండి రాబట్టవలసిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పధకాల గురించి చర్చించేవారు. నిన్న హైదరాబాద్ సీయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన యంపీల సమావేశంలో కూడా ఇంచుమించు అదేవిధమయిన చర్చ జరిగింది.   ఈ సమావేశంలో పాల్గొన్న యంపీలు వివిధ అంశాలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వారికి అనేక సూచనలు చేసారు. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన ఆర్ధిక సహాయం, రాజధాని నిర్మాణం కోసం నిధుల విడుదల, రాష్ట్ర లోటు బడ్జెటుని పూడ్చేందుకు అదనపు నిధులు, పెండింగులో ఉన్న వివిధ ప్రాజెక్టులు, వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో ఉన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం వంటి మొత్తం 35అంశాలను ఈ సమావేశంలో గుర్తించారు. వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, వాటి సాధన కోసం యంపీలు అందరూ కృషిచేయాలని నిర్ణయించుకొన్నారు. వైకాపాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలపైనే ఆసక్తి కనబరుస్తోందని అందుకే ఈ సమావేశానికి హాజరు కాకుండా తప్పించుకొందని, రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  ఈరోజు నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. సమావేశాల మొదటిరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు వంటివి సభలో ప్రతిపాదించబోతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి యం.వెంకయ్య నాయుడు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేఖించాలని తెరాస యంపీలకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు గనుక సమావేశాలు తొలిరోజు నుండే సభలో యుద్ద వాతావరణం నెలకొనబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ధరలు, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, ఇరాక్ నుండి భారతీయుల తరలింపు వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వంపై కత్తులు దూయడానికి సిద్దంగా ఉంది.   ఈ నేపధ్యంలో సభలో 2014-15 సం.లకు ఆర్ధిక మరియు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. ఈ నెల 8న రైల్వే బడ్జెట్, 9న ఆర్ధిక సర్వే, 10న ఆర్ధిక బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశ పెట్టబడతాయి. ఆర్ధిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే బడ్జెట్ ను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెడతారు. రెండు బడ్జెట్లపై ఈ నెల 30వరకు చర్చలు జరిగి అదే రోజు ఆమోదించబడతాయి. పార్లమెంటు సమావేశాలు ఆగస్ట్ 14న ముగుస్తాయి. ఆ మరునాడు అంటే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసి ప్రసంగిస్తారు.

అందుకే ఈ హడావుడి అంతా?

  ఇటీవల జరిగిన మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలను అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, చైర్మన్ పదవులను హస్తగతం చేసుకొనే ప్రయత్నం చేయడంతో, రెండు పార్టీలు తీవ్ర ఘర్షణ పడ్డాయి. ఈ ప్రయత్నంలో జరిగిన సభ్యుల కిడ్నాపులు, పార్టీ ఫిరాయింపులను ఖండిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు గవర్నర్ నరసింహన్ను ఈరోజు కలిసి పిర్యాదు చేయనున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని, అందువలన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని వైకాపా కోరుతోంది.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే తపన గురించి తెలియనివారు లేరు. కానీ అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నెలరోజులు గడవక మునుపే ఏవో సాకులతో రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం చాలా హాస్యాస్పదం. గత ఐదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మరో ఐదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండవలసి రావడం చాలా కష్టమే. అన్నేళ్ళు పార్టీలో సభ్యులు గోడ దూకేయకుండా కాపాడుకొంటూ, పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ మాత్రం హడావుడి తప్పదు మరి.

పోలవరం, రైల్వేజోను ఈ సమావేశాలలోనే ఆమోదం

  కేంద్రపట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, జూలై 7 నుండి మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వేజోను మంజూరు, పోలవరం ప్రాజెక్టుకి తప్పకుండా ఆమోదిస్తామని తెలిపారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ప్రకటించి చాలా కాలమయినప్పటికీ, ఇంతవరకు ప్రత్యేకహోదా మంజూరు కాలేదు. దీనివలన రాష్ట్రానికి రావలసిన అనేక పరిశ్రమలు తెలంగాణా మరియు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే తెలంగాణకు తరలిపోయిన హీరో మోటార్ సైకిళ్ళు తయారీ సంస్థ బహుశః ఆంధ్రాకే మొగ్గు చూపి ఉండేదేమో! అందువలన రాష్ట్ర ప్రభుత్వం ఇకనయినా ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి వీలయినంత త్వరగా సాధించవలసి ఉంది. పోలవరం, రైల్వే జోను మంజూరు మంచి విషయమే అయినా, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కూడా చాలా అవసరం. వెంకయ్య నాయుడు, ఆంధ్రాకు చెందిన కేంద్రమంత్రులు, యంపీలు అందరూ కూడా ఈ అంశంపై పూర్తి శ్రద్ధ పెట్టడం అత్యవసరం. ఇక ఆర్ధిక లోటును పూడ్చుకోనేందుకు బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు కూడా జరిగేలా జాగ్రత్తపడటం చాలా అవసరం.

చెన్నైలో గోడ కూలి 11 మంది తెలుగువారు మృతి

  చెన్నైలో కొద్ది రోజుల క్రితం 11 అంతస్తుల భవనం కుప్పకూలి 61 మంది మృతి చెందిన సంఘటన మర్చిపోక ముందే మరో దుర్ఘటన సంభవించింది. శనివారం రాత్రి కురుసిన భారీ వర్షానికి తిరువళ్ళూరు జిల్లా ఉపరపలయం వద్ద గోడౌన్ గోడ కూలి 11 మంది తెలుగు వారు మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఒక శిశువు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 19 సంవత్సరాల నాగరాజ్ అనే యువకుడు శిథిలాల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. వీరంతా ఏపీలోని ఉత్తరాంధ్రకు చెందిన వారు. గోడ కూలిన ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న కాంగ్రెస్

  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారం దక్కించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశం దక్కకపోగా కనీసం లోక్ సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. గత పదేళ్ళుగా ఇష్టారాజ్యంగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కూడా పోరాడవలసి రావడం దాని దీనస్థితికి అద్దం పడుతోంది. లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 50 ఎంపీ సీట్లు కలిగి ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మాత్రమే ఉన్నాయి. అందువల్ల యూపీఏ మిత్ర పక్షాలను కూడా కలుపుకొని ఇప్పుడు తమకు 54 ఎంపీ సీట్లు ఉన్నాయి గనుక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి స్వయంగా లోక్ సభలో తగిన సంఖ్యాబలం లేదు గనుక ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం అభ్యంతరం చెపుతోంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయంపై బీజేపీ తన అభిప్రాయం చెప్పకుండా దాటవేసింది.   ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ అవసరమయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. కానీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోక ముందే ఎన్డీయే ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించవచ్చును. తనను ఇంత కాలంగా ఘోరంగా అవమానిస్తూ, వేధిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం నేర్పేందుకే ఎన్డీయే బహుశః తన నిర్ణయం ప్రకటించకుండా కాలయాపన చేస్తుండవచ్చును. ఏమయినప్పట్టికీ రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేద్దామనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం న్యాయపోరాటానికి సిద్దమని చెప్పుకోవడం చాలా నవ్వు కలిగిస్తోంది.

రుణమాఫీపై కేఈ కీలక ప్రకటన

రైతుల రుణమాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయలేకపోయినా …వారు సంతృప్తి చెందేలా చేస్తామని అన్నారు. తొలి దశలో డెబ్బై ఐదు వేల రూపాయలు, రెండో దశలో మరో డెబ్బై ఐదు వేల చొప్పున రైతులకు రుణాలు మాఫీ అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీలకు సంబంధించి ప్రభుత్వం మీద రూ.30 వేల కోట్ల వరకు భారం పడుతుంది. అసలే పదిహేను వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ మాత్రం చేయడం గొప్ప విషయమే. రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు దానిని చేసి తీరాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టిడిపి దూకుడు

  ఆంధ్రప్రదేశ్ జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆపార్టీ 10జడ్పీ ఛైర్మన్లకు దక్కించుకుంది. కడప జడ్పీ ఛైర్మన్ వైఎస్ఆర్ సీపీ దక్కించుకుంది. అయితే చాలా చోట్లు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ అభ్యర్థులు టీడీపీలోకి జంప్ కావడంతో టీడీపీ ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటోంది. ప్రకాశం జిల్లాలో మాత్రం ఉత్కంఠత కొనసాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీలకు 28 అభ్యర్థుల బలం ఉంది. ఈ స్థానం పై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. జడ్పీ ఛైర్మన్ అభ్యర్ధుల వివరాలు: * చిత్తూరు జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా గీర్వాణి ఎంపికయ్యారు. * అనంతపురం జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పరిటాల రవి అనుచరుడు చమన్‌ను టీడీపీ ఎంపిక చేసింది. * కర్నూలు జెడ్పీ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్ పేరు ఖరారైంది. * కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా గద్దె అనురాధ ఎంపికయ్యారు. * విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా లాలం భవాని బరిలోకి దిగారు. * పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థిగా ముళ్లపూడి బాపిరాజు పేరు ఖరారైంది. * విజయనగరం జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా శోభా స్వాతి ఎంపికయ్యారు. * శ్రీకాకుళం జెడ్పీ చైర్ పర్సన్ టీ డీపీ అభ్యర్థిగా ధనలక్ష్మి పేరును ఎంపిక చేశారు. * తూర్పుగోదావరి జెడ్పీ చైర్మన్ నామల రాంబాబును టీడీపీ ఖరారు చేసింది. * ప్రకాశం జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా మన్నె రవీంధ్ర ఎంపికయ్యారు. * గుంటూరు జెడ్పీ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా షేక్ జానిమూన్ ఎంపికయ్యారు. * కడప జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా గూడూరు రవిని వైసీపీ రంగంలోకి దింపింది.  

పరిటాల అనుచరుడు చమన్ జడ్పీ చైర్మన్ అయ్యారు

  గత పదేళ్లుగా అజ్ఞాతంలో జీవితం గడిపి రాజకీయాలలోకి వచ్చిన టిడిపి నేత చమన్ జిల్లా పరిషత్ ఛైర్మన్ అవుతున్నారు. పరిటాల రవికి ముఖ్య అనుచరుడిగా పేరుపడ్డ ఆయన ..పరిటాల హత్య తరువాత అజ్ఞాతంలోకి వెళ్లారు.ఇప్పుడు ఏకంగా జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒకటి రెండు స్థానాలు మినహా అన్ని జెడ్పీ చైర్మన్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున గెలిచిన 9 మంది జెడ్పీటీసీలు టీడీపీ మద్దతు ప్రకటించడంతో నెల్లూరు జెడ్పీ పీఠం కూడా టీడీపీ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా గద్దె అనురాధ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. మచిలీపట్నం జెడ్పీ కార్యాలయంలో అనురాధ ఎన్నిక లాంఛనంగా జరుగనుంది. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనురాధను పలువురు నేతలు, జెడ్పీటీసీ సభ్యులు అభినందించారు.

భారత్ కు చేరుకున్న కేరళ నర్సులు

  ఇరాక్ లో ఉగ్రవాదుల చేతులో చిక్కుకున్న కేరళ నర్సులు సురక్షితంగా ఇండియా చేరుకున్నారు. కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయల్దేరిన 46 మంది కేరళ నర్సులు, 137 మంది భారతీయులు ఈ రోజు ఉదయం 9:30 నిమషాలకి ముంబై చేరుకున్నారు. ఇక్కడ నుంచి విమానం ఇంధనం నింపుకుని ఉదయం 11.55 గంటలకు కొచ్చి చేరుకోనుంది. అనంతరం 2.25 గంటలకు హైదరాబాద్, చివరిగా సాయంత్రం 5.50కి ఢిల్లీ చేరుకుంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇరాక్‌ నుండి భారత్ ‌చేరుకున్న నర్సులకు కొచ్చి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా స్వాగతం పలకనున్నారు. అయితే ఇరాక్ లో భారత విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు తొలత అంగీకరించలేదు. చర్చలు, వివరణల తర్వాతే విమానం ల్యాండ్ అయ్యేందుకు వారు అగీకరించారు. ఆఖరికి నర్సులందరూ క్షేమంగా తిరిగి వచ్చారు.

ఫిల్మ్ ఇండస్ట్రీకి కేసిఆర్ షాక్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కె.చంద్రశేఖర్‌రావు వరుస సంచలన నిర్ణయాలతో రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏపీఎన్జీవోలకు సంబంధించిన 189 ఎకరాల 14 గుంటల భూమిని వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ( ఎపిఎఫ్ డిసి) కు షాక్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన 20 ఎకరాల భూమిని వెనుక్కి తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సీసీఎల్‌ఏ ఎస్‌కే సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. 1982లో ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగ అభివృద్ధి నిమిత్తం గతంలోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 40 ఎకరాల భూమిని ఎపిఎఫ్ డిసికి కేటాయించింది. ఇందులో పద్మాలయా స్టూడియో అభివృద్ధి కోసం 9 ఎకరాలు, రామానాయుడి స్టూడియోకు 5 ఎకరాలు, మరికొన్ని స్టూడియోలకు ఇంకొన్ని ఎకరాలను కేటాయించారు. ఇప్పుడు వాటిలో ఏది రద్దు అయిందో తెలియక అందరూ టెన్షన్ పడుతున్నారు.

కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని గుంటూరు, విజయవాడల మధ్యన ఏర్పడబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలో రియల్టర్లు వాలిపోయారు. రెండు జిల్లాలలో పెద్ద ఎత్తున భూమి లావాదేవీలు నడుస్తున్నాయి. ఇటీవల రాజధాని కోసం వేసిన కమిటీ కూడా గుంటూరు,కృష్ణా మధ్యలో రాజధాని నిర్మాణానికి ఆసక్తి చూపుతుండడంతో రియల్టర్లు భూముల కొనుగోళ్లకోసం వాలిపోయారు. భారీ ఎత్తున భూ కొనుగోళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు కృష్ణా జిల్లాలలో రిజిస్ట్రేషన్లను నిలిపివేయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని నిర్మాణానికి భూసేకరణ జరపడానికి ఈ కొనుగోళ్లు ఇబ్బందికరంగా మారుతుందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ డిమాండ్ కు ..కొనుగోళ్లకు ఏ మాత్రం పొంతన లేకపోవడం కూడా మరో కారణం.

జమ్మలమడుగులో ఉద్రిక్తత..ఎంపి కళ్లలో కారం

  కడప జిల్లాలోని జమ్మలమడుగులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ కారణంగా నిన్న వాయిదా పడిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఈరోజు  నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం వద్దకు దూసుకు వచ్చి ఎన్నికను ఆపేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులపై భాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ కౌన్సిలర్ జానీని అప్పగించాలి లేదా ఎన్నికను వాయిదా వేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.  ఈ సంధర్బంగా ఎన్నికతీరును తెలుసుకునేందుకు వెళ్లిన అవినాశ్ రెడ్డిపై టిడిపి కార్యకర్తలు కొందరు ఆయన కళ్లలో కారం చల్లారని వార్తలు వస్తున్నాయి. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.  

అవునూ..కంచె వచ్చింది అప్పుడే.!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప కంచె వివాదస్పదమైన విషయం తెలిసిందే. కంచె ఏర్పాటుకు గవర్నర్ పరిపాలనలోనే అనుమతి ఇచ్చారని హరీష్ రావు చెప్పడం, దానిని రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లతో గవర్నర్ నరసింహన్ గారికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. దీనిపై మళ్ళీ హరీష్ రావు వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 26వ తేదీన జీవో 426ఇచ్చారని.. అప్పటికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే ఉందని గమనించాలని వివరించారు. దీనికి సంబంధించిన జి.ఓని హరీష్ రావు విడుదల చేశారు. ఆఖరికి సచివాలయంలో కంచె వేయాలన్న నిర్ణయం చివరికి గవర్నర్ పాలనలోనే జరిగినట్లు తేలింది. అయితే ఆ విషయం బహుశా గవర్నర్ నరసింహన్ దృష్టికి రాకుండానే ఆటోమాటిక్ గా జరిగిపోయి ఉండవచ్చు. ఆ జిఓలోని అంశం ప్రాతిపదికగా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసి ఉండవచ్చు.

సచివాలయంలో పరిస్థితులపై చంద్రబాబు ఆందోళన

  సచివాలయంలో జే బ్లాకులో మంత్రులు, అధికారుల ఛాంబర్లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల వసతి ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. పరిస్థితులు ఎప్పటిలోగా అదుపులోకి వస్తాయే అర్ధం కావట్లేదన్నారు. ఆర్డీవో స్థాయి అధికారికి ఒక బల్ల, నలుగురు ఉద్యోగులను కేటాయించారని తెలిపారు. చాలా ఛాంబర్లకు తాళాలు వేసి ఉండడం అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు చంద్రబాబు ట్యాంక్ బండ్ పైన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బ్రిటీష్ వారి అరాచక పాలనను వ్యతిరేకించి పోరాడిన గొప్ప స్వాతంత్ర్యోద్యమ వీరుడు అల్లూరి అని కొనియాడారు. విశాఖలో అల్లూరి పేరిట ఓ మెమోరియల్ (స్మారకం) ఏర్పాటు చేస్తామని... అందులో అల్లూరికి చెందిన ఫొటోలు, వివరాలు, విషయాలు అన్నీ ఉంటాయన్నారు. అల్లూరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటామన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో అల్లూరి జయంతిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

హరీష్ రావుకి గవర్నర్ షాక్

సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్లాకుల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప కంచె మంత్రి హరీశ్ రావు, గవర్నర్ ల మధ్య వివాదంలా మారింది. మొదట ఈ కంచె పై చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్ర, తెలంగాణ ఏమైనా ఇండియా, పాకిస్తాన్ లా? సచివాలయంలో కంచె ఎందుకు అని మండిపడ్డారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ..ఇది తమ సర్కారు పని కాదని.. గవర్నర్ పాలనలోనే వచ్చిందని తెలుసుకోవాలని బాబుకి ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. హరీష్ రావు వ్యాఖ్యలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లతో గవర్నర్ నరసింహన్ గారికి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. రాజ్ భవన్ ప్రకటనపై మరోసారి హరీశ్ రావు స్పందించడంతో వివాదం మరింత ముదిరింది. ఇష్యూ గవర్నర్ వర్సెస్ హరీశ్ రావుగా మారింది. ఏప్రిల్ 26వ తేదీన జీవో 426ఇచ్చారని.. అప్పటికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనే ఉందని గమనించాలని వివరించారు.

మునిసిపల్ పదవులతో అధికారం సంపూర్ణం

  రెండు నెలల క్రితం జరిగిన పంచాయితీ, మునిస్పాల్ ఎన్నికలలో విజయ డంకా మోగించిన తెలుగుదేశం పార్టీ, ఈరోజు 90 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ పదవులకు జరిగిన పరోక్ష ఎన్నికలలో ఏకంగా 74 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ పదవులను, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చిత్తూరు మరియు అనంతపురం మేయర్ పదవులను కైవసం చేసుకొని రాష్ట్రా స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సంపూర్ణాధికారం చేజిక్కించుకొంది. తెదేపా-బీజేపీలు రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉండటం వలన రాష్ట్రానికి ఏవిధంగా పూర్తి ప్రయోజనాలు పొందగలుగుతుందో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా అధికార పార్టీకే చెందినవారు అధికారంలో ఉండటం వలన కూడా జిల్లాలు పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచుకొన్న పధకాల అమలులో, అదేవిధంగా జిల్లాలకు అవసరమయిన నిధులు మంజూరులో ఎటువంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.