చంద్రబాబు మీడియా సలహాదారుగా డా. పరకాల

  డా. పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సలహాదారుగా నియుక్తులవుతున్నారు. అందువల్ల ఆయనకు క్యాబినెట్ హోదా కూడా లభిస్తుంది. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలు సమూలంగా ప్రక్షాళన అవుతాయని భావించి ఆయన ఆ పార్టీలో చేరారు. కానీ ఎన్నికల సమయానికే పార్టీ పూర్తిగా ఒక వ్యాపార సంస్థలాగా నడుస్తుండటంతో ఆయన పార్టీ నుండి బయటపడ్డారు. ఆ తరువాత చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయినపుడు ఆయన కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఏర్పాటయిన విశాలాంధ్ర సభకు కన్వీనర్ గా బాధ్యతలు చేప్పట్టి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అప్పటి నుండి మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ఆయనకు టికెట్ ఇవ్వజూపినప్పటికీ సున్నితంగా తిరస్కరించారు.   మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఏకంగా క్యాబినెట్ హోదా గల మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, భవిష్యత్ గురించి స్పష్టమయిన అవగాహన కలిగిన డా.పరకాల వంటి మేధావిని చంద్రబాబు ఈవిధంగా గౌరవించడం హర్షణీయం. డా.పరకాల అర్ధాంగి శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ఇటీవలే ఆంధ్రప్రదేశ్ నుండి తెదేపా మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె కూడా రాష్ట్రాభివృద్ధికి యదాశక్తిన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

చంద్రబాబుకు నొప్పెందుకో అన్న హరీష్

  గురుకుల్ ట్రస్టు భూములలో అక్రమ భవనాలు కూల్చివేస్తుంటే చంద్రబాబు నాయుడుకు నొప్పేందుకు అని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అక్రమార్కులు, భూ కబ్జాదారులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కవ్వింపు గా మాట్లాడుతున్నారని, ఆ చర్యలు ఆపితే చంద్రబాబుతో చర్చలకు సిద్దమేనని హరీష్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణకు దక్కకుండా చంద్రబాబు కుట్ర చేశారన్నారు.తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలను తప్పుదోవ పట్టించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఒకవైపు చర్చలు జరుపుతామని చెబుతూనే మరోవైపు పిపిఎల రద్దుకు ఆదేశాలు జారీ చేసి తెలంగాణను చీకటిమయం చేయడానికి ప్రయత్నించలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు షాక్: టీఆర్ఎస్ లోకి మరో ఎమ్మెల్సీ

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్సీ టిఆర్ఎస్ లోకి జంప్ చేయడానికి సిద్దమయ్యాడు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని ఈరోజు ప్రకటించారు.నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు కూడా వేశారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందుతుందని ధీమాను వ్యక్తం చేశారు.టిఆర్ఎస్‌లో చేరి బంగారు తెలంగాణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్మన్ల లిస్ట్

  ఆంధ్రప్రదేశ్‌లో ఏడు నగరపాలక సంస్థలు, 96 మున్సిపాలిటీ సంఘాల పరోక్ష ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలు:   నగరపాలక సంస్థల మేయర్లు... అనంతపురం : ఎం.స్వరూప. విజయవాడ : కోనేరు శ్రీధర్‌. రాజమండ్రి : రజనీ శేషసాయి కృష్ణా ... నందిగామ : పద్మావతి, టీడీపీ. తిరువూరు : ఎం.కృష్ణకుమారి,టీడీపీ గుంటూరు ... తెనాలి : కొత్తమాసు తులసీదాసు, టీడీపీ. బాపట్ల : తోట మల్లీశ్వరి, టీడీపీ, రేపల్లె : తాడివా శ్రీనివాసరావు,టీడీపీ. చిలకలూరిపేట : గంజి చెంచుకుమారి, టీడీపీ, పొన్నూరు : సజ్జా హేమలత, టీడీపీ. మంగళగిరి : గంజి చిరంజీవి,టీడీపీ. మాచర్ల : జి. శ్రీదేవి,టీడీపీ. సత్తెనపల్లి : ఎల్లినీడి రామస్వామి,టీడీపీ. పిడుగురాళ్ల : భవనాసి హైమావతి, టీడీపీ. తాడేపల్లి : కొయ్యగూర మహాలక్ష్మి, వైకాపా. ప్రకాశం జిల్లా... గిద్దలూరు : వెంకటసుబ్బమ్మ, వైకాపా. కనిగిరి -చిన్నమస్తాన్‌ -టీడీపీ చీరాలా : మోదుగుల రమేశ్‌ టీడీపీ. పశ్చిమగోదావరి.... నిడదవోలు : బొబ్బా కృష్ణమూర్తి,టీడీపీ. జంగారెడ్డిగూడెం : శివలక్ష్మి,టీడీపీ. నెల్లూరు ... కావాలి : పోటుగంటి అలేఖ్య, టీడీపీ, నాయుడుపేట : ఎం శోభారాణి, టీడీపీ శ్రీకాకుళం .... ఆముదాలవలస : గీత,టీడీపీ. పలాస : పూర్ణచందర్‌రావు,టీడీపీ. పాలకొండ : పల్లా విజయనిర్మల, టీడీపీ, ఇచ్ఛాపురం : రాజ్యలక్ష్మి, వైకాపా. విజయనగరం .... సాలూరు : విజయకుమారి,టీడీపీ. బొబ్బిలి : అచ్యుతపల్లి,టీడీపీ అనంతపురం.... హిందూపురం : లక్ష్మి, టీడీపీ. గుంతకల్‌ : అపర్ణ,టీడీపీ. తాడిపత్రి : వెంకటలక్ష్మి,టీడీపీ, ధర్మవరం : గోపాల్‌,టీడీపీ, గుత్తి : తులసమ్మ, టీడీపీ మడకశిర : ప్రకాశ్‌,టీడీపీ. కల్యాణదుర్గం : రమేశ్‌,టీడీపీ, పుట్టపర్తి : గంగన్న, టీడీపీ. రాయదుర్గం : రాజశేఖర్‌,టీడీపీ. పామిడి : గౌస్‌పీరా, టీడీపీ చిత్తూరు .... పుత్తూరు : కరుణాకర్‌,టీడీపీ. నగరి : శాంతి, వైకాపా. పుంగనూరు : షమీమ్‌, వైకాపా. పలమనేరు : శారద, వైకాపా. కడప .... బద్వేలు : సోమేశుల పార్థసారథి, టీడీపీ. ఎర్రగుంట్ల : ముసలయ్య, వైకాపా. కర్నూలు .... ఆత్మకూర్‌ : నూర్‌ అహ్మద్‌,టీడీపీ. ఎమ్మిగనూరు : సరస్వతి,టీడీపీ. డోన్‌ : గాయత్రి,టీడీపీ. గూడూరు : ఇందిర సుభాషిణి,టీడీపీ, ఆళ్లగడ్డ : ఉషారాణి , వైకాపా.

చప్రాసీ నుండి చైర్మన్ అయ్యా

  తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్‌గా ఎన్నికైన స్వామిగౌడ్‌కు పలువురు బుధవారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ...''ఒకప్పుడు చప్రాసీగా పనిచేసిన నేను ఈ రోజు శాసనమండలి చైర్మన్ అయ్యా. ఇది ప్రజాస్వామ్యానికే గొప్ప విజయం. తెలంగాణ ఉద్యమంలో, సాయుధ పోరాటంలో అమరులయిన వారి త్యాగాలు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. నాకు కేసీఆర్ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నన్ను అందరూ చైర్మన్ స్థానం వద్దకు తీసుకెళ్తుంటే నాకు నోట మాట రాలేదు. మండలిలో చైర్మన్ స్థానానికి సభ్యులు గౌరవం ఇవ్వండి. నాకు కాదు'' అని తెలంగాణ శాసనమండలి నూతన చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. సభలో ఉన్న మేధావులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయుల కంటే నేను రాజకీయంగా చిన్నవాడిని. కాని సభ నడిపే విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు తీసుకువెళ్తాను. సభలో సభ్యుల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాను అని స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ శాసనమండలిని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతానని ఆయన తెలిపారు. చట్టసభల వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, బలహీన వర్గాలు, దళితులు, నిరుద్యోగులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన అన్నారు.

బాలకృష్ణ హ్యాపీ.. 27 ఏళ్ల తరువాత గెలిచిన టిడిపి

  27 ఏళ్ల తరువాత హిందూపురం మున్సిపల్‌ స్థానాన్ని టీడీపీ గెలుచుకోవడం శుభపరిణామమని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం హిందూపురం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎక్స్‌ ఆఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఓటేశారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఆర్‌.లక్ష్మి , వైఎస్‌ చైర్మన్‌గా జీపీకే రాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. కౌన్సిల్‌ సభ్యులందరితో సమన్వయం చేసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

వైకాపా అమర్‌నాథ్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు

  రాజంపేటకు చెందిన వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిపై పట్టణ పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్‌, నిర్బంధ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటిమిట్ట మండలం నర్వకాటిపల్లె ఎంపీటీసీ స్థానంలో గంగాదేవి విజయం సాధించారు. శుక్రవారం మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో తన భార్య గంగాదేవి ఉదయం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త నరసింహులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఇంట్లో నిర్బంధించినట్టు తెలియడంతో వెళ్లామని, తమను ఎమ్మెల్యే కులం పేరుతో దూషించారని నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు.

జమ్మలమడుగులో ఉద్రిక్తత

  మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికలలో తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు పోటాపోటీగా ఉన్న మున్సిపాల్టీలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.జమ్మలమడుగు మున్సిపాలిటీలో కౌన్సిలర్‌ జానీని వైకాపా శ్రేణులు కిడ్నాప్‌ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఎమ్మెల్యే అనుచరులే జానీని కిడ్నాప్‌ చేసినట్టు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ముళ్లజానీ కిడ్నాప్‌పై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమంది కార్యకర్తలు జమ్మలమడుగు మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. వైకాపా కౌన్సిలర్లతో కలిసి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్

  ఆంధ్రప్రదేశ్ లో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా కోనేరు శ్రీధర్‌, డిప్యూటీ మేయర్‌గా గోగుల రమణారావు ఎన్నికయ్యారు. విజయవాడ కార్పొరేషన్ లో మొదటిసారి టిడిపి పీఠం దక్కించుకుంది. కార్పొరేషన్ లో మొత్తం 38 వార్డులు ఉండగా అందులో 37 స్థానాలను టిడిపి, ఒకస్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. అలాగే బాపట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తోట మల్లేశ్వరి, వైఎస్‌ చైర్మన్‌గా రాము ఎన్నికయ్యారు. మరోవైపు కోదాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లను కాంగ్రెస్‌ పార్టీ వారు అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ కోదాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

తెలంగాణాలో రూ.1000కోట్ల పెట్టుబడితో ఇనుప కర్మాగారం

  హీరో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థను దక్కించుకొన్న తెలంగాణాకు మరొక భారీ పరిశ్రమ కూడా తరలి వచ్చింది. ఆస్ట్రియాకు చెందిన యన్.యస్.యల్. కన్సోలిడేటడ్ లిమిటడ్ అనే సంస్థ రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఇనుము కర్మాగారం స్థాపించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీన్ ఫ్రీమ్యాన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిన్న హైదరాబాదులో కలిసి ఒప్పందం దాదాపు ఖరారు చేసుకొంది. దాని ప్రకారం కరీంనగర్ జిల్లా ఆత్మకూరు వద్ద ఒక కర్మాగారం, మెదక్ జిల్లాలో సిద్ధిపేట వద్ద మరొకటి స్థాపించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా దాదాపు 1,000 మందికి ప్రత్యక్షంగా అనేక వందల మందికి పరోక్షంగా ఉపాధి దొరకుతుంది. ఈ రెండు కర్మాగారాలలో ఐరన్ పిల్లట్లు (ఇనుప దిమ్మలు) తయారవుతాయి. ఇవి ఉక్కు కర్మాగారాలకు ముడి సరుకుగా ఉపయోగించబడుతాయి. ఈ రెండు జిల్లాలలో ఏడాదికి దాదాపు 200 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభ్యత ఉంది గనుక మొదటి దశలో కరీంనగర్ కర్మాగారం స్థాపించేందుకు రంగం సిద్దమవుతోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నెల కూడా గడవక మునుపే రెండు భారీ పరిశ్రమలు రావడం చాలా హర్షణీయం. వీటికి అనుబంధంగా మళ్ళీ అనేక చిన్న పెద్ద పరిశ్రమలు అనేకం రావచ్చును. వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా తెలంగాణా రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందడం తధ్యం.

తెలంగాణను ఇష్టపడిన హీరో

  ఈ హీరో సినిమా హీరో కాదు. భారతదేశంలో నంబర్:1 మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థ ‘హీరో’ మొటోకార్ప్. ఇంతవరకు ఉత్తరాదిన ఐదు ఉత్పత్తి కేంద్రాలను స్థాపించిన ఈ హీరో మొట్టమొదటిసారిగా దక్షిణాదిన అడుగుపెట్టాలనుకొంటున్నట్లు ప్రకటించగానే, ఆ హీరోని దక్కించుకొనేందుకు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. రెండు ప్రభుత్వాలు కూడా సదరు సంస్థ డైరెక్టర్ తో సంప్రదింపులు జరిపాయి. తమ రాష్ట్రంలో ఆ పరిశ్రమను స్థాపించినట్లయితే ఏమేమీ ప్రోత్సాహకాలు ఇస్తాయో తెలియజేసాయి. సదరు సంస్థ యాజమాన్యం చివరికి తెలంగాణా లోనే తమ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. తెలంగాణా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇవ్వజూపడం, హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చెంది ఉండటం, చక్కటి సాంకేతిక నిపుణులు లభ్యత, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మొదలయిన రాష్ట్రాలను కలుపుతూ చక్కటి రోడ్లు, రవాణా సదుపాయాలు కలిగి ఉండటం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణాకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

సచిన్ ఎవరు?.. షరపోవా పొగరు!

  ఇంటర్నేషనల్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా కళ్ళుచెదిరే అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి కూడా. అయితే అందం, కీర్తి, డబ్బు వున్న షరపోవాకి పొగరు కూడా బోలెడంత వుంది. ఆ పొగరు ఏ స్థాయిలో వుందంటే, సచిన్ టెండూల్కరా? అతనెవరు? ఈ పేరు నేనెప్పుడూ వినలేదు అనేంత స్థాయిలో వుంది. వింబుల్డన్ పోటీలను తిలకించడానికి సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు. అక్కడ ప్రముఖులు కూర్చునే గ్యాలరీలో పలువురు ప్రముఖులతో కలసి కూర్చుని షరపోవా ఆడే టెన్నిస్ చూశాడు. షరపోవా మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఒక టీవీ రిపోర్టర్ ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మీ మ్యాచ్ చూడటానికి సచిన్ టెండూల్కర్ కూడా వచ్చాడు తెలుసా అని గొప్పగా చెప్పాడు. దానికి షరపోవా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ‘సచిన్ టెండూల్కరా.. అతనెవరు?’ అంది దాంతో తెల్లబోవడం సదరు రిపోర్టు వంతయింది. క్రికెట్ రంగంలో తనకంటే ఎక్కువ స్థాయిలో వున్న సచిన్ టెండూల్కర్ గురించి షరపోవాకి నిజంగా తెలియదా.. లేక తెలిసి కూడా పొగరు చూపించిందా? నో డౌట్.. అది పొగరే!

తెలంగాణ మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్

  తెలంగాణ శాసన మండలి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికలలో స్వామిగౌడ్‌కు 21 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు. మండలి ఛైర్మన్ పదవికి ఓటింగ్‌కి ముందే కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నికకు దూరంగా వుంది. దాంతో స్వామిగౌడ్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. శాసనమండలి అధ్యక్షుడిగా ఎన్నికైన స్వామిగౌడ్‌ని టీఆర్ఎస్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ, శాసనమండలి అధ్యక్షుడిగా తన విధి నిర్వహణ సక్రమంగా చేస్తానని అన్నారు. తెలంగాణ శాసనమండలి దేశంలోనే ఆదర్శ శానసమండలిలా వుండేలా కృషి చేస్తానన్నారు.

సునంద మృతిపై విచారణ జరిపించండి: థరూర్

  తన భార్య సునందా పుష్కర్ మృతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే తాను అన్నిరకాలుగా సహకరిస్తానని కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం శాసనసభ్యుడు శశిథరూర్ ప్రకటించారు. సునందా పుష్కర్ మరణం సహజమేనని తనతో బలవంతంగా చెప్పించారని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం ప్రధాన అధికారి అయిన సుధీర్ గుప్తా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. దాంతో శశి థరూర్ బయటకి వచ్చి వివరణ ఇవ్వక తప్పలేదు. శశి థరూర్ భార్య సునందా పుష్కర్ ఈ ఏడాది జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె మరణాన్ని సహజ మరణంగా వైద్యులు పేర్కొన్నారు. ఇప్పుడు అసలు విషయం బయట పెట్టారు.

వీటి దుంపతెగ.. ప్రాణం తీశాయి...!

  ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన జరిగింది. అడవి దుంపలు తిన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం అటవీ ప్రాంతంలో కూలీ పనులకు వెళ్ళిన కొంతమంది అడవిలో దొరికిన తెల్లచెన్నంగడ్డ అనే దుంపలను తవ్వుకుని ఇంటికి తెచ్చుకున్నారు. ఇంటి దగ్గర ఆ దుంపలను ఉడికించుకుని తిన్నారు. అయితే అవి విషపు దుంపలు కావడంతో భద్రమ్మ అనే 55 సంవత్సరాల మహిళ మరో ఎనిమిది మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. అడవిలో దొరికే అన్ని దుంపలూ తినడానికి పనికిరావని, అడవుల్లో విషపూరిత దుంపలు ఎక్కువగా వుంటాయి కాబట్టి గుర్తు తెలియని దుంపల్ని తినరాదని అధికారులు అంతా అయిపోయిన తర్వాత ప్రకటించారు.

నాగార్జున సాగర్ దగ్గర నీటి గోల!

  అధికార పార్టీ కార్యకర్తలే ధర్నా చేసే కార్యక్రమాన్ని కళ్ళారా చూసి తరించాలంటే మనం నాగార్జున సాగర్ దగ్గరకి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మీదట కేంద్ర జలసంఘం జులై 8 వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.

తరుణ్ తేజ్ పాల్ కు బెయిల్

  లైంగిక దాడి కేసులో ఆరు నెలలుగా జైలు వాసం గడుపుతున్న తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధిస్తూ జస్టిస్ విక్రమ్‌జిత్, జస్టిస్ ఎస్‌కె సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆయనకు బెయిల్ ఇచ్చింది. తేజ్‌పాల్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన సుప్రీం.. విచారణ కోసం క్రమం తప్పకుండా ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. తన సహోద్యోగి అయిన పాతికేళ్ల అమ్మాయిపై లిఫ్టులో లైంగిక దాడి జరిపాడన్నది తేజ్‌పాల్‌పై ఆరోపణ. గత ఏడాది నవంబర్ 30న ఆయన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి గోవాలోని జైల్లో ఉంటున్నాడు. తేజ్‌పాల్ తరఫున యూపీయే హయాంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ కోర్టులో వాదిస్తుండటం విశేషం.

అమెరికాకి మోడీ సర్కార్ వార్నింగ్!

భారతదేశంలోని భారతీయ జనతాపార్టీ నాయకుల కాల్డేటాను అమెరికా తస్కరించిందన్న వార్త దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం అమెరికా దౌత్యవేత్తలను పిలిపించి చర్చించింది. అమెరికా అత్యుత్యాహంతో చేసే ఇలాంటి గూఢచర్య చర్యలు భారత ప్రభుత్వానికి ఆమోద యోగ్యం కాదని తేల్చి చెప్పింది. పొరపాటైపోయిందని, మళ్లీ అలాంటి తప్పు చేయమని అమెరికా భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అలా హామీ ఇచ్చినప్పటికీ చట్ట ప్రకారం అమెరికా దౌత్య అధికారులకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.