కృష్ణాజలాల వివాదం.. ఆ రాష్ట్రాలకు సంబంధం లేదు.. మీరే పంచుకోండి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదం ఎప్పటినుండో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున 4 రాష్ట్రాలకు మళ్లీ నీటి కేటాయింపులు జరపాలని కోరింది. దీనికి కేంద్రం స్పందించి.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఈవివాదంతో సంబంధం లేదని..ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే.. ఏపీ తెలంగాణ పంచుకోవాలని స్పష్టం చేసింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

బాలకృష్ణకు షాక్.. కన్వీనర్ రంగారెడ్డి రాజీనామా

హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణకు తన నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎంతోకాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చిలమత్తూరు మండల కన్వీనర్ రంగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే దీనికి కారణం బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖరే కారణమని తెలుస్తోంది. దీంతో శేఖర్ వ్యవహార శైలి మరోసారి బయటకు వచ్చింది. గతంలో కూడా శేఖర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఎలాంటి హోదా లేకపోయినా అధికార, అనధికార కార్యక్రమాల్లో తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వకపోవడంతో శేఖర్ పై పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలకృష్ణ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మోడీ, రామోజీల భేటీ.. సూటు.. బూటులో రామోజీ

  మీడియా మొఘల్ రామోజీరావు ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయి కాసేపు ముచ్చటించారు. అయితే సాధారణంగా ప్రముఖులు భేటీ అయి ముచ్చటిస్తే ఎవరైనా ఏం మాట్లాడుకున్నారు అని పలువురు ఆసక్తికరంగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ రామోజీరావు, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి ముచ్చటించినా.. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది మాత్రం రామోజీ డ్రస్ గురించి. మామూలుగా అయితే రామోజీరావు ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉంటారు. చాలా మందికి ఆయన ఆ డ్రస్సింగ్ తోనే తెలిసిఉంటారు. దీంతో ఎప్పుడూ వైట్ అండ్ వైట్ లో ఉండే రామోజీ ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి మాత్రం.. సూటు వేసుకొని దానికి టై కూడా పెట్టుకున్నారు. ఇంత విభిన్నంగా డ్రస్సింగ్ అయ్యి రామోజీరావు మోడీని కలవడం చాలా విచిత్రంగా ఉంది. అయితే ఇంతకీ వీరిద్దరూ ఎందుకూ కలిశారంటే.. ఈనాడు.. ఈ టీవీ సంస్థల అధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ ఆసుపత్రి కార్యక్రమాల్ని వివరించారట. దీనికి సంబంధించిన కొన్ని డీవీడీలు.. పుస్తకాలు కూడా మోడీకి అందించారట. మొత్తానికి రామోజీ మోడీని కలవడం వెనుక ఇదే ఉందో.. ఇంకేదైనా ఆంతర్యం ఉందో..

లోకేశ్ విషయంలో పార్టీ నేతలు అనుకున్నదే జరిగిందా..?

గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారా? లేదా?అనే దానిపై అనుమానాలు వస్తునే ఉన్నాయి. ఉప ఎన్నికల్లో కూడా ప్రచారంలో పాల్గొనని ఆయన ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో కూడా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలకు కొంచెం క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది తాజా పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే.. ఈ గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు తన తనయుడిని ముందుకు తీసుకురావాలని చూస్తున్నారంట. మొదట ఈ విషయంలో చంద్రబాబు కన్ఫ్యూజన్లో ఉన్న ఇప్పుడు మాత్రం ఈ గ్రేటర్ ఎన్నికల బాధ్యతను లోకేశ్ కు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఇకనుండి లోకేశ్ తోనే చర్చించాలని.. పార్టీనేతలకు చంద్రబాబు సూచించారట. అంతేకాదు గ్రేటర్ ఎన్నికల పరిధిలో తనకున్న ఎక్స్ పీరియన్స్ ను కూడా లోకేశ్ కు చంద్రబాబు చెప్పారంట. ఇంకా అవసరమైతే పార్టీలోని సీనియర్ నేతల సలహాలు కూడా తీసుకోమని చెప్పారంట. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఇక పార్టీని ముందుండి నడిపేది లోకేశే అని గట్టిగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల కోసం గాను లోకేశ్ ఏపీలోని పార్టీ కార్యక్రమాలను సైతం పక్కన పెట్టారంట. మొత్తానికి టీడీపీ నేతలు అనుకున్నట్టే లోకేశ్ గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకున్నాడు. మొత్తానికి వారు అనుకున్నది సాధించారు. 

జగన్ మౌనం వెనుక కారణం ఉందా?

ప్రతి పక్షనేత అంటే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. అధికార పార్టీని విమర్శించడానికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వారిని విమర్శించాలా అని ఆలోచిస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడంలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆమధ్యలో ధర్నాలు, ఆందోళనలు అంటూ కొంచెం హడావుడి చేసినా ఇప్పుడు మాత్రం అలాంటి ఛాయలు ఎక్కడా కనిపించడంలేదు. తన పాటికి తాను సైలెంట్ గా పనులు చూసుకుంటారు. దీంతో పార్టీ నేతలకు జగన్ ఎక్క‌డంటూ వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఆయన వైఖరిపై పార్టీ నేతలే కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క టీడీపీ ప్రజల్లో తమ పార్టీని బలోపేతం చేసుకుంటుంటే మరో పక్క జగన్ మాత్రం తనకేమి పట్టనట్టు తన బిజెనెస్ పనుల్లో మునిగిపోతున్నారని.. ఇది పార్టీకే మంచిది కాదని అనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు..అంతేకాదు జగన్ తరుపున బొత్స లాంటి పెద్దలు ప్రెస్ మీట్ లు పెడుతున్నా.. టీడీపీ నేతలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదట. జగన్ విమర్శిస్తే అప్పుడు చూసుకోవచ్చులే.. ఇప్పుడు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఏందుకని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా జగన్ మాత్రం.. ప్రతిపక్షంగా ఎంత పోరాడినా వేస్ట్ అని.. ఏం చేసినా చంద్రబాబుదే పై చేయిగా నిలుస్తుందని చెప్పి.. ప్రస్తుతానికి మౌన మంత్రాన్ని అనుసరిస్తున్నారట. మరి జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో.. ఆయన సైలెంట్ వెనుక ఏదైనా కారణం ఉందా?.. సరైన టైం కోసం ఎదురుచూస్తున్నారా?.. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే వైయిట్ చేయాల్సిందే.

డిసెంబర్ 17 నుండి ఏపీ శీతాకాల సమావేశాలు.. కోడెల

డిసెంబర్ 17 నుంచి 22 వరకు 6రోజులపాటు అసెంబ్లీ శీతాకల సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లోనే జరుగుతాయని కోడెల స్పష్టం చేశారు. అంతేకాదు డిసెంబర్ 11వ తేదీనుండి నరసరావు పేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కూడా ఆహ్వానించామని.. ఇంకా కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు హాజరవుతారని తెలిపారు. ఒక స్పీకర్ గా నాకు ఉన్న అవకాశాలు అన్నీ వినియోగించుకుంటున్నాను.. రూ.200 కోట్లతో నరసరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణంతో పాటు, 5శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.

తీవ్ర అస్వస్థతకు గురైన సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండెపోటుతో ఉదయం 8 గంటల నుండి స్పృహలో లేని బర్దన్ ను జీబీ పంత్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న బర్ధన్ కు వయసు ఎక్కువ కావడంతో చికిత్సకు శరీరం సహకరించడం లేదని వైద్యులు తెలుపుతున్నారు. బెంగాల్ కు చెందిన బర్దన్ పూర్తి పేరు ఆర్దేందు భూషణ్ బర్ధన్. 1996 నుండి ఆయన సీపీఐ ప్రధాన కారదర్శిగా పనిచేశారు. బెంగాల్ లోని బరిసల్ అనే ప్రాంతంలో 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.

యాసిడ్ బాధితులు కూడా వికలాంగులే.. సుప్రీం కోర్టు

దేశంలో చాలా మంది యాసిడ్ దాడులకు గురవుతుంటారు. అలాంటి వారి కోసం సుప్రీం కోర్టు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదో ఒక కారణంతో.. ఎవరో దుర్మార్గానికి బలైపోవడం.. యాసిడ్ దాడులకు బలవ్వడం జరుగుతుంటాయి. అలా యాసిడ్ దాడులకు బలైన వారు ఎంతో నష్టపోతుంటారు. అలా యాసిడ్ దాడులకు గురైన వారిని వికలాంగులుగా పరిగణించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యాసిడ్ దాడులకు గురైన వారు వికలాంగులేనని తేల్చి చెప్పింది. వారికి.. వికలాంగులకు ఎలాంటి వసతులు.. రాయితీలు కల్పిస్తారో అవన్నీ కల్పించాలని స్పష్టం చేసింది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని కూడా ఆదేశించింది..

కల్తీ మందు తాగి ఆరుగురు మృతి.. పలువురి పరిస్థితి విషమం

విజయవాడలో కల్తీల దందా పెరిగిపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కల్తీనెయ్యి ముఠా పట్టుబడింది. ఇప్పుడు విజయవాడలోని కృష్ణలంకలో కల్తీమందు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణలంకలోని  హోటల్ స్వర్ణ బార్‌లో కల్తీ మందుతాగి ఆరుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్ర  అస్వస్థకు గురయ్యారు. దీంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. కాగా హోటల్ కల్తీ మందు అమ్మకంపై స్థానికులు ఆందోళనకు దిగారు.. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ దగ్గరికి చేరుకుని మధ్యం శాంపిళ్లను సేకరించి బార్ ను సీజ్ చేశారు. విజయవాడలోని స్వర్ణ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినదని బాధితులు చెబుతున్నారు.

హరికృష్ణకు ఆ అవకాశం దక్కేనా..?

వచ్చే ఏడాది 2016 జూన్ నాటికి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, జైరాం రమేశ్, జేడీ శీలంల పదవికాలం పూర్తికానుంది. ఈనేపథ్యంలో ఈ నాలుగు సీట్లు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ స్థానాల్లో సుజనా చౌదరికి.. నిర్మలా రామన్ కు మళ్లీ అవకాశం లభించనున్నట్టు తెలస్తోంది. వీరిద్దరికి మళ్లీ సీట్లు ఖరారు అయ్యే ఛాన్స్ ఉందని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. ఇక ఏపీ శాసనసభలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం లేకపోవడంతో ఆ పార్టీ నుంచి ఎన్నికైన జైరాం రమేష్, జేడీ శీలంకు ఛాన్స్ లేదు. దీంతో ఉన్న నాలుగు స్థానాల్లో మూడు స్థానాలు బీజేపీ -టీడీపీ పార్టీలు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మిగిలింది ఒక్క సీటు. దీనిని వైసీపీ గెలుచుకనే అవకాశం ఉంది. కాగా మూడు స్థానాల్లో ఒకటి సుజానాకు.. ఇంకోటి నిర్మలా రామన్ కు ఉండగా ఇక మిగిలింది ఒక్క స్థానం.. ఈ స్థానానికి గాను నందమూరి హరికృష్ణ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని.. చంద్రబాబు నాయుడితో చర్చించినట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. చంద్రబాబు మాత్రం దానికి సానుకూలంగా స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నారా లోకేష్  పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఈసారి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఆయన చేతుల్లోనే ఉంది.. మరి లోకేశ్ హరికృష్ణకు ఆ అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

పొమ్మన లేక పొగపెట్టారు.. నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. దానం

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ లో చేరాలని నన్ను అడిగిన మాట వాస్తవమే.. పార్టీ మారతానని పదే పదే అని నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారు. పొమ్మన లేక పొగపెట్టారు.. కానీ ఇప్పుడు అవన్నీ ముగిసిపోయాయని తెలిపారు. గ్రేటర్ పరిధి తగ్గించే ప్రయత్నాలే నన్ను బాధించాయి.. గ్రేటర్ కేడర్ నావైపే ఉంది.. నాకోసం ప్రాణాలు ఇస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలపై రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తామని.. రేపు చర్చించాల్సిన అంశాలపైనే షబ్బీర్ ఇంట్లో భేటీ అని.. ఎన్నికల వ్యూహాన్ని రేపు ఖరారు చేస్తాం.. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని.. కిరయి నేతలతో ప్రభుత్వం నడపాలని టీఆర్ఎస్ చూస్తుందని మండిపడ్డారు. కొనేస్తాం.. పరిపాలిస్తాం అంటే ప్రజలు మెచ్చరు.. కొత్త రాష్ట్రంలో ఈ పద్దతి మంచిది కాదని సూచించారు. ఏ ఉపఎన్నికల్లో గెలవని టీడీపీ అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు గ్రహణం పట్టింది.. త్వరలోనే పుంజుకుంటాం అని స్పష్టం చేశారు.

కేజ్రీవాల్ కు న్యాయమూర్తి మద్దతు.. బస్సులో అవసరమైతే నడుచుకుంటూ వెళ్తాం..

ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోయిందని.. దానిని నివారించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ సరికొత్త ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోజు విడిచి రోజు వాహనాలు నడపాలని.. ఒక రోజు సరి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు బేసి సంఖ్య ఉన్న వాహనాలు మాత్రమే నడపాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ పద్దతిని జనవరి 1 నుంచి అమలుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. అయితే కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుండి చాలా విమర్శలే వచ్చాయి. కానీ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయానికి  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మాత్రం మద్దతు తెలిపారు. ఢిల్లీలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము సిద్దంగా ఉన్నామని.. అందుకు కోర్టుకు బస్సులో వెళ్లడానికైనా సిద్దమే అని.. అవసరమైతే నడుచుకుంటా కూడా వెళతామని అన్నారు. కాగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ తమ పథకానికి మద్దతు తెలిపినందుకు కేజ్రీఆల్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎవరినైనా వదిలిపెట్టం.. ఒబామా

అగ్రరాజ్యాలపై ఐసిస్ చేస్తున్న దాడులకు గాను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉగ్రవాద చర్యలపై మండిపడ్డారు. వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అమెరికాకు హాని తలపెట్టాలని చూసే ఎవరినైనా వదిలిపెట్టబోమని.. అది ఐసిస్ కావచ్చు.. ఇంకా ఇతర ఏ ఉగ్రవాద సంస్థ అయినా కావచ్చు అని అన్నారు. ప్రపంచదేశాల్లోని ముస్లిం నేతలు ఐఎస్ఎస్ ఉగ్రవాదంపై నోరు విప్పాలని, వారి వైఖరి ఏమిటన్నది తెలపాలని పేర్కొన్నారు. అంతేకాదు మతాన్ని అధారంగా చేసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని సూచించారు. కాగా కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో ముస్లిం దంపతులు కాల్పులకు పాల్పడి 14 మందిని హత్యచేసిన నేపథ్యంలో వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఎటువంటి సాక్ష్యాదారాలు లేవని వివరించారు.

అతనిపై కన్నేసి ఉంచండి.. పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం

టీడీపీ అధినేత చంద్రబాబు బేజీపీ పార్టీ నేత సోము వీర్రాజు పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్న 5వ తేదీన చంద్రబాబు సమక్షంలో బీజేపీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ అటు బీజేపీ నుండి ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. కానీ సోము వీర్రాజు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో చంద్రబాబు వీర్రాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా వీర్రాజు టీడీపీ  పై విమర్శలు చేసినా చంద్రబాబు చూసీ చూడనట్టు వదిలేసేవారు. తాను మాత్రమే కాదు నేతలకు కూడా అదే సూచించేవారు. అయితే ఆ తరువాత వీర్రాజు మరీ రెచ్చిపోయి టీడీపీపై విమర్శలు చేస్తుండటంతో చంద్రబాబు కూడా అతడి కామెంట్స్ కు ధీటుగా జవాబు ఇవ్వాలని సూచించడంతో నేతలు అతని దూకుడికి బ్రేక్ వేశారు. దాంతో వీర్రాజు కొంచెం నోటి దూకుడిని తగ్గించారు. అయితే వీర్రాజు మళ్లీ ఇప్పుడు బీజేపీ-టీడీపీ సమన్వయ పార్టీకి హాజరుకాకుండా చంద్రబాబుకు కోపం తెప్పించాడు. దీంతో చంద్రబాబు వీర్రాజు వ్యవహార శైలిపై ఓ కన్నేసి ఉంచమని పార్టీ నేతలకు సూచించారట. ముఖ్యంగా కాపులను టీడీపీకి వ్యతిరేకంగా మార్చేందుకు వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నాడని.. అతని ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలను ఆదేశించారట. మొత్తానికి వీర్రాజు వ్యవహారంపై చంద్రబాబు బానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

చెన్నై.. 20 రోజుల తర్వాత కనిపించిన సూర్యుడు

చాలా రోజుల భారీ వర్షాల అనంతరం చైన్నెలో కొంచెం వర్షం తెరపిచ్చింది. దాదాపు 20 రోజులు తరువాత చెన్నై వాసులు సూర్యుడిని చూస్తున్నఛాయలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ బృందాలు చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతేకాదు నీటి మునిగిన ప్రాంతాలకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పదార్దాలు పంపిణి చేస్తున్నారు. వరదల కారణంగా అనారోగ్యం పాలవకుండా తెలంగాణ ప్రభుత్వం మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది.కాగా వర్షాల కారణంగా వారం రోజుల పాటు మూసివేసిన చెన్నై ఎయిర్ పోర్టు ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. దేశ, అంతర్జాతీయ సర్వీసులు యథావిధిగా సాగుతున్నాయి

ప్రధాని నరేంద్ర మోడిపై ఉగ్రవాదుల గురి?

  దేశంలో మెట్రో నగరాల మీద, ప్రముఖ పుణ్యక్షేత్రాల మీద, ముఖ్యంగా డిల్లీలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వంటి ప్రముఖులు నివసించే భవనాల మీద ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు గత కొంత కాలంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉగ్రవాదులు అత్యంత పటిష్టమయిన భద్రత కలిగిన ప్రధాని నరేంద్ర మోడినే హత్య చేసేందుకు పధకాలు రచించినట్లు నిఘా వర్గాలు కనిపెట్టాయి. అందుకోసంపాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా భారత్ లోకి ప్రవేశించగా వారిలో ఇద్దరినీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన ఆధారాలతో మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. వారిచ్చిన సమాచారం ప్రకారం లష్కర్ ఉగ్రవాదులు రెండు ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు.   వాటిలో మొదటిది ప్రధాని నరేంద్ర మోడి బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు ఆయనపై నేరుగా ఆత్మాహుతి దాడికి పాల్పడటం. ఒకవేళ అది విఫలమయినట్లయితే సభలో గ్రెనేడ్లు విసరడం ద్వారా భారీ ప్రాణ నష్టం కలిగించడం. అలాగే రెండవ పధకంలో డిల్లీలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం. ఈ రెండు పధకాలలో కూడా ముంబై కంటే చాలా తీవ్రంగా ప్రజలలో భయోత్పాతం సృష్టించే విధంగా ఉండాలని లష్కర్ ఉగ్రవాదులు పధకం పన్నారు. ఈ కుట్రలను అమలుచేసే బాధ్యత అబూ దుజన్ అనే ఉగ్రవాదికి అప్పగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూలో లష్కర్ ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ ని, అతనికి ఆశ్రయం కల్పించిన అమీర్ ఆలం గుజ్జర్ అనే వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారులు అరెస్ట్ చేసి వారి ద్వారా మిగిలినవారి సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకి అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన తెరాస

  వరంగల్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో మంచి ఉత్సాహంగా ఉన్న అధికార తెరాస త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలని కూడా అదే ఉత్సాహంతో ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేస్తున్నట్లు అందరికంటే ముందుగా తన పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. తెలంగాణాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలలు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో 7 స్థానాలకు తెరాస తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది.   పి. సతీష్-అదిలాబాద్, లక్ష్మి నారాయణ- ఖమ్మం, ఆర్. భూపతి రెడ్డి-నిజామాబాద్, టి. చిన్నప్ప రెడ్డి-నల్గొండ, భూపాల్ రెడ్డి-మెదక్, ఎన్.లక్షణ రావు, భాను ప్రసాద్-కరీంనగర్ నుండి పోటీ చేస్తారు. రేపటిలోగా మిగిలిన ఐదుగురు అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటిస్తామని తెరాస సెక్రటరీ జనరల్ కె. కేశవ్ రావు తెలిపారు.   “మా అభ్యర్దులందరినీ గెలిపించుకోగల బలం మాకు ఉంది కనుకనే మొత్తం 12 స్థానాలలో తెరాస అభ్యర్ధులను నిలబెడుతున్నాము తప్ప ఇతర పార్టీల మద్దతు కోసం తాము ఎవరితోనూ బేరసారాలు చేయడం లేదని” కేశవ్ రావు అన్నారు. కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా నేడు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. తమకు పూర్తి బలం ఉన్న చోటనే పోటా చేయాలనీ ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి.

కమల్ హాసన్ కంటే అల్లు అర్జునే నయం: పన్నీర్ సెల్వం

  చెన్నైలో వరద పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయిన నటుడు కమల్ హాసన్, “నా సురక్షితమయిన ఇంట్లో కూర్చొని మా ఇంటి కిటికీలో నుంచి నీళ్ళలో మునిగిపోతున్న చెన్నై నగరాన్ని, అందులో ప్రజలు పడుతున్న ఇక్కట్లను చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తోంది. ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏమి చేస్తోందో తెలియడం లేదు. మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ప్రజలు కోట్లాది రూపాయలు పన్నులు చెల్లిస్తున్నా కూడా ఇంకా ఇటువంటి సందర్భాలలో మావంటి వారు విరాళాలు అందజేయవలసి వస్తోందంటే, ప్రజలు కట్టిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్లిపోతోందో...దేనికి ఖర్చు పెడుతున్నారో అర్ధం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్పోరేట్ ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు ఖర్చు పెడుతోంది. వాటి వలన ప్రజలకు ప్రయోజనం కలగనపుడు ఆ డబ్బుని నేరుగా ప్రజలకే పంచిపెట్టేస్తే అందరూ లక్షాధికారులు అయ్యేవారు కదా?” అని అన్నారు.   కమల్ హసన్ ఆవేదన ప్రజలందరికీ సహజమయిన ప్రతిక్రియగా మాత్రమే చూసారు. కానీ అధికార అన్నాడీ.ఎం.కె. ప్రభుత్వానికి ఆయన మాటలు తమను అవమానిస్తున్నట్లు, అనుమానిస్తున్నట్లుగా అనిపించాయి. ముఖ్యమంత్రి జయలలిత నిప్పులో దూకేయమంటే దూకేసే ఆమె వీర భక్తుడు, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం కమల్ హాసన్ పై మండి పడ్డారు.   “మేమేమి ఆయనని విరాళం ఇమ్మని అడగలేదు. చెన్నై పరిస్థితిని చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అనేకమంది ప్రముఖులు, కేంద్రప్రభుత్వం స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమకి చెందిన నటుడు అల్లు అర్జున్ చెన్నై పరిస్థితి చూసి చలించిపోయి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన కమల్ హాసన్ని ఎవరూ విరాళం అడగకపోయినా అనవసరమయిన మాటలు చాలా మాట్లాడారు. ప్రజలు కట్టిన డబ్బు అంతా ఎక్కడికి పోతోందో...అని ఆయన అనుమానం వ్యక్తం చేయడం మా అమ్మ (ముఖ్యమంత్రి జయలలిత)ని అవమానించడమే. 2015-16 ఆర్ధిక సంవత్సరం బడ్జెటులో ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు కేటాయించిన రూ.679 కోట్లు ఇప్పుడు వినియోగిస్తున్నాము. అయినా సరిపోవడం లేదు. కేంద్రప్రభుత్వం కూడా సహాయం అందిస్తోంది."   "ఎన్నడూ ఊహించని విధంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిస్తే, ప్రకృతి ముందు ఎవరయినా తలవంచవలసిందే. ఇదేమీ సినిమా కాదు ఎంత పెద్ద ప్రకృతి విపత్తునయినా ఒక పాటలో పరిష్కారం చేసేయడానికి. సినిమాలలో జరిగినట్లు ప్రకృతి విపత్తులు మన నియంత్రణలో ఉండవనే సంగతి ఆయన తెలుసుకొంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన శాయశక్తులా ప్రజలను, ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40,000 మంది ఉద్యోగులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వరుసగా భారీ వర్షాలు కురిసాయి. సుమారు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము.55 లక్షల ఆహార పొట్లాలు అందజేసాము. ఇంకా ముమ్మరంగా సహాయ చర్యలు చేస్తూనే ఉన్నాము. వేలాదిమంది స్వచ్చంద సేవా కార్యకర్తలు, సైనికులు, వాయుసేన, నావికాదళానికి చెందిన బృందాలు సహాయ చర్యలలో పాల్గొంటున్నారు. ఇవన్నీ కమల్ హాసన్ కి తన ఇంటి కిటికీలో నుండి చూస్తే కనిపించేవి కావు. ఆయన ఇల్లు వదిలి బయటకు వచ్చి చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో అర్ధమవుతుంది."   "ఆయన నటించిన విశ్వరూపం సినిమా విడుదలకి అవరోధాలు ఏర్పడినపుడు ఆయన దేశం విడిచి వెళ్ళిపోతానని బెదిరించారు. కానీ అప్పుడు అమ్మ చొరవ చూపడం వలననే ఆ సమస్య పరిష్కారం అయ్యి సినిమా రిలీజ్ అయిన సంగతి కమల్ హాసన్ మరిచిపోయినట్లున్నారు. అందుకు అప్పుడు ఆయన అమ్మకి కనీసం కృతజ్ఞత కూడా తెలపాలనుకోలేదు. కానీ ఇప్పుడు అమ్మను విమర్శిస్తున్నారు. తెలిసీ తెలియకుండా ఈవిధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు,” అని పన్నీర్ సెల్వం అన్నారు.