మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన టీఆర్ఎస్

  తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలను మంత్రి హరీశ్ రావే స్వయంగా కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మరోసారి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్  కు తెరలేపినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మంత్రులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు గీతారెడ్డి, ముఖేష్ గౌడ్ లను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్. అయితే గీతారెడ్డి, ముఖేష్ గౌడ్లను ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలని.. ఆ భాధ్యతను కేశవరావుకు, డిఎస్ లకు అప్పగించారట కేసీఆర్. మరోవైపు టీడీపీ పై కూడా టీఆర్ఎస్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యే సాయన్నతో భేటీ అయినట్టు కనిపిస్తోంది. మరి వారు అనుకున్నట్టు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి ఇంకా బలం చేకూరినట్టే.

చెవిరెడ్డి హడావుడితో జగన్ కు చిక్కులు..?

వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉండి.. అధికార పార్టీని విమర్శించడంలో ఎప్పడూ ఫస్ట్ ఉంటారు. అలా విమర్శించే నేతకే ఇప్పుడు ఆపార్టీలోని ఒక నేత చేసే విమర్శలు తలనొప్పిగా తయారయ్యాయి. అది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి ఈ మధ్య తనకు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నాడని చాలామంది నేతలు జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారంట. దీంతో పదే పదే అందరిని విమర్శిస్తూ.. వివాదాల్లో చిక్కుకుంటూ తలనొప్పులు తెచ్చిపెడుతున్న చెవిరెడ్డికి జగన్ వార్నింగ్ ఇచ్చారట. మళ్లీ ఇలాంటి వివాదాల్లో తెచ్చిపెడితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట. కానీ చెవిరెడ్డి నడవడిక తెలిసిన నేతలు మాత్రం.. ఎవరెన్ని చెప్పినా చెవిరెడ్డి మాత్రం మారడు అని అనుకుంటున్నారు. కాగా గతంలో చెవిరెడ్డి బడ్జెట్ సమావేశాల్లో కోడెల పెద్ద గూండా అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందుకున్నారు. అనంతరం సొంత నియోజకవర్గంలో కొందరనీ కులం పేరుతో దూషిస్తున్నారన్న కారణంగా ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదుచేశారు. ఇక ఇప్పుడు ఎంపీ మిధున్ రెడ్డితో కలిసి ఎయిర్ పోర్ట్ మేనేజర్ పై చెవిరెడ్డి దాడి చేయడం. మరి జగన్ వార్నింగ్ కు భయపడైనా చెవిరెడ్డి నోటివాటం తగ్గిస్తారో లేదో చూడాలి.

ఆంధ్రా సిఎం కిడ్నాప్...కేసీఆర్ పై అనుమానం?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిడ్నాప్ అయ్యారా?తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుమానాలు? ఇది చూసి నిజమనుకొని కంగారుపడకండి. ఇది దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో తీయబోయే సినిమా పేరు. “ఆంధ్రా సిఎం కిడ్నాప్” దానికి ట్యాగ్ లైన్ గా “తెలంగాణ సిఎం సస్పెక్టెడ్” అని ఉంటుందని రాంగోపాల్ వర్మ తన తాజా ట్వీట్ మెసేజు ద్వారా తెలియజేసారు.   ఈ సినిమా పేరు చాలా వివాదాస్పదంగా ఉంది కనుక ఇక మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ మొదలవుతుంది. రాంగోపాల్ వర్మ చాలా కాలంగా మంచి హిట్ సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారు. అయినా ఈవిధంగా నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వరుసగా రెండు మూడు ఫ్లాపులు వచ్చిన దర్శకులు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నానా తిప్పలు పడుతుంటే, రాంగోపాల్ వర్మ వరుసగా ఇన్ని డజన్ల ఫ్లాపులు తీసి కూడా స్థిరంగా నిలదొక్కుకొని ఉండగలగడం విశేషమే. ఒకవేళ ఆయన స్థానంలో మరో దర్శకుడు ఎవరయినా ఇన్ని ఫ్లాపులు మూటగట్టుకొని ఉన్నట్లయితే, ఎక్కడా కనబడకుండాపోయేవారు.

అమెరికాలో కాల్పులు... 14 మంది మృతి

  అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌బెర్నార్డినో ప్రాంతంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శాన్‌బెర్నార్డినో వికలాంగుల కేంద్రంలో హాలిడే పార్టీ జరుగుతున్న సమయంలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు ఆగంతకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఆగంతకుడు మరణించినట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తుల వద్ద భారీగా ఆయుధాలు వున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన మీద అమెరికా అధ్యక్షుడు స్పందించారు. దుండగులు అందరూ హతమయ్యే వరకూ ఆపరేషన్ కొనసాగించాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు.

మీరే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.. చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో టీ.టీడీపీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు తాము వ్యూహాలు సిద్దం చేశామని నేతలు చంద్రబాబుకు తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ చేయాలని.. ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలన్న విషయం నేతలు చర్చించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే వారు మహబూబ్ నగర్ నుంచి పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డిని బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావించి.. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ... మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా జిల్లాల పర్యటనలను ఖరారు చేసుకోవాలన్నారు.

రాజకీయాల్లోకా.. నో వే.. అనుపమ్ ఖేర్

అమీర్ ఖాన్ అసహనంపై చేసిన వ్యాఖ్యలపై అందరి సంగతేమో కానీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కాస్త ఎక్కువగానే స్పందిచారన్న దాన్లో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆయన పాలిటిక్స్ ఎంట్రీపై అందరికి సందేహాలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయనకు ఈ తరహా ప్రశ్నే ఎదురైంది. దీంతో ఆయన స్పందించి.. తాను రాజకీయాల్లోకి రావడం అసాధ్యమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోనని తేల్చిచెప్పారు. అంతేకాదు రాజకీయాల్లోకి రాకపోయినా తాను కోట్లాదిమంది భారతీయులకు ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడతానని ఆయన ప్రకటించారు. కాగా అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో చేరి ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

చంద్రబాబును కేసీఆర్ కలవనున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు కలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు చంద్రబాబు రావుల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి వివాహం సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. అయితే కేసీఆర్ ఈ నెల చివరి వారాంతంలో ఆయుత చండీయాగం చేయనున్న నేపథ్యంలో చంద్రబాబును కలవనున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు.. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉన్నందున కేసీఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లి కుటుంబ సమేతంగా యాగానికి రావాలని ఆహ్వానిస్తారని అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులతో సంప్రదింపులు కూడా జరిపారట. అంతేకాదు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించి.. చాలా జాగ్రత్తగా.. గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ కూడా అదేవిధంగా చంద్రబాబు తనకు ప్రత్యేక స్థానం ఇచ్చినట్లే.. కేసీఆర్ కూడా చంద్రబాబు ప్రత్యేక స్థానం ఇవ్వాలని చూస్తున్నారట. కాగా కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రపతి, గౌవర్నర్ లను చండీయాగానికి ఆహ్వానించిన సంగతి విదితమే.

రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదు.. సుప్రీం

  రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో రాజీవ్ గాంధీ హత్య కేసులు నిందితులుగా ఉన్న ఏడుగురికి మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు ప్రభుత్వం.. మరణశిక్ష పడిన మురుగన్, శంతన్, అరివు అనే ముగ్గురు దోషులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వారితో పాటు  నళిని, రాబర్ట్ పియూస్, జయకుమార్, రవిచంద్రన్‌లను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వచ్చింది. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న నిందుతులకు శిక్ష తగ్గించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. రాజీవ్ గాంధీ హంతకులను వదిలిపెట్టకూడదని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా దోషులను వదలిపెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని.. శిక్షల విషయంలో ఉపశమనం కలిగించే అధికారం గానీ హక్కు గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని చెప్పింది.

తెలంగాణ తెలుగు యూనివర్శిటీ పేరు మార్పు..

రాష్ట్రం విడిపోయిన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏపీకి సంబంధించిన పేర్లన్నింటినీ మార్చేసింది. ఇప్పుడు తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయా విశ్వవిద్యాలయానికి ఫ్రోపెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చగా..  ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మార్చి దానికి సామాజిక చరిత్రకారుడైన సురవరం ప్రతారపెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతుందని.. ఈవిషయంపై ఏదో ఒక నిర్ణయం త్వరలో తీసుకుంటామని టీ సర్కార్ వెల్లడించింది. అంతేకాదు ఈ యూనివర్శిటీ పేరు మార్పుపై కేసీఆర్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

బీఫ్ ఫెస్టివల్ కు పోటీగా పందికూర ఫెస్టివల్..

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ వివాదం ముదురుతోంది. ఈనెల 10 వ తేదీన ఎలాగైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని బీఫ్ ఫెస్టివల్ నిర్వహకలు తేల్చిచెబుతున్నారు. మూడుసార్లు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినా మాట్లాడనివారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బీఫ్ ఫెస్టివల్ ను ఉద్దేశించి మరో దాద్రి ఘటన అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బీఫ్ ఫెస్టివల్ కు ఫోటీగా పందికూర ఫెస్టివల్ నిర్వహించాలని ఓయూ జేఏసీ నిర్ణయించుకుంది. ఈనెల 8న పందికూర ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని.. ఉద్రేకాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు బీఫ్ ఫెస్టివల్ వద్దని ఓయూ జేఏసీ అభిప్రాయపడింది.

జుకెర్ బర్గ్ సంచలనమైన నిర్ణయం.. 99 శాతం షేర్లు దానం

ఫేస్ బుక్ స్థాపకుడు జుకెర్ బర్గ్ ఓ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే తన కంపెనీకి చెందిన 99 శాతం షేర్లను స్వచ్చంధ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకన్నాడు. జుకెర్ బర్గ్ ఇంత సడెన్ గా.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనుకుంటున్నారా..? ఎందుకంటే.. జుకెర్ బర్గ్.. ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ లకు వారం క్రితమే పాప (మాక్స్) పుట్టింది. దీంతో వారు తమ షేర్లలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకి ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు  మాక్స్ రావడంతో తమ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభమయ్యాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా ప్రస్తుతం ఆ షేర్ల విలువ 45 అమెరికన్ బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ. 3 లక్షలు అన్నమాట. మొత్తానికి జుకెర్ బర్గ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మొత్తాన్ని స్వచ్ఛంద సేవ కోసం ఇచ్చి రికార్డు సాధించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు. చంద్రబాబు లోకేశ్ కు ఎంట్రీ ఇస్తారా..?

జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి నెలాఖరు కల్లా నిర్వహిస్తామని తెలంగాణ అధికార ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో  ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాల గురించి పార్టీలన్నీ ఇప్పటినుండే కసరత్తులు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇక టీడీపీ నుండి అయితే చంద్రబాబే ఏకంగా విజయవాడ నుండి వచ్చి మరీ హైదరాబాద్ లో రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు సంగతేమో కాని ఇప్పుడు అందరి దృష్టి మాత్రం లోకేశ్ మీద పడింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగు పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు.. కానీ లోకేశ్ ఎంతవరకూ గెలుపుకోసం కృషి చేస్తారు..ఎన్నికల్లో ఆయన పాత్ర ఎంతమేరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అంతేకాదు ఎలాగూ సీఎం ఏపీలో పరిపాలన బాధ్యతల్లో బిజీగా ఉంటారు కాబట్టి.. గ్రేటర్ ఎన్నకల బాధ్యత లోకేశ్ కు అప్పగిస్తే బావుంటుందని చెబుతున్నారట. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఎంతైనా టీడీపీకి కొంచెం ఆదరణ తక్కువ. ఇలాంటి నేపథ్యంలో బాద్యతలు లోకేశ్ కు అప్పగిస్తే.. ఎన్నికల్లో వచ్చే ఫలితాల సామర్ధ్యం లోకేశ్ పై పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే ఈ ఎన్నికలకు లోకేశ్ ను దూరంగా ఉంచాలని భావిస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ పడినవెంటనే లోకేశ్ కూడా చంద్రబాబుతో ఎన్నికల ప్రచారంలో దిగుతారని నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎంతవరకూ లోకేశ్ ఎంట్రీ ఉంటుందో చూడాలి.

జయలలితకు మోడీ ఫోన్.. వర్షం గురించి ఆరా..

  తమిళనాడు భారీ వర్షాలతో నీటి సంద్రమైపోయింది. ఇంకా నాలుగు రోజులు వర్ష ప్రభావం ఉంటుందని.. రోజుకు 20 సెం.మీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో చెన్నై వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల గురించి అడిగి తెలుసుకన్నారు. అంతేకాదు కేంద్రం తరఫున అవసరమైన సాయాన్ని అందజేసేందుకు సిద్ధమని మోదీ తెలిపారు. మరోవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. సుమారు లక్షా 70 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తెలంగాణ బీజేపీలో ముసలం..

ఇప్పటి వరకూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, టీడీపీ మధ్యే అంతర్గత విభేధాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న నేతల మధ్యే విభేదాలు ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. దీనికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కత్తి దుయ్యటమే నిదర్శం. గోషమహల్ నియోజకవర్గంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ గత కొద్దికాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇంత సడెన్ గా ఏమయిందో ఏమో ఉన్నట్టుంది కిషన్ రెడ్డిపై పడ్డారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణ పార్టీ అభివృద్ధి చెందటం లేదని.. ఆయనను తెలంగాణ అధ్యక్ష పదవి నుండి తీసేయాలని.. దీనిలో భాగంగానే ఆయన భాజపా అధినేత అమిత్ షా కు లేఖ రాశారు. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని ఎదగకుండా చేస్తున్నారని.. తన వర్గం మీద ఉన్న కనీస శ్రద్ద పార్టీ మీద పెట్టి ఉంటే చాలా బాగుండేదని అన్నారు. దీంతో బీజేపీ వర్గంలో ముసలం ఏర్పడిందని రాజకీయవిశ్లేషకులు అనుకుంటున్నారు. అంతేకాదు ఈసారి కూడా తెలంగాణలో బీజేపీకి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డి చేతికి ఇస్తే రాజాసింగ్ పార్టీలో ఉండే అవకాశం కూడా లేదు అని అంటున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం రాజాసింగ్ ను వదలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే హిందూ అతి వాదిగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్.. ఓల్డుసిటిలో ఎంఐఎం పార్టీని ఎదుర్కోగల పార్టీ నేతగా ఎదిగారు దీంతో బీజేపీ నేతలు అంత తేలికగా రాజాసింగ్ ను వదలుకోరు అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..

టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్..

ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు టీడీపీ కండువా కప్పి ఆనం బ్రదర్స్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆనం రాం నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉందని.. రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయామని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్ని సార్లు చెప్పినా మామాట వినలేదు..కాంగ్రెస్ లో మా అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల్లో పునరాలోచన చేసుకోలేదు.. చేసిన తప్పు పట్ల క్షమించమని ప్రజలకు చెప్పే పరిణతి కాంగ్రెస్ సాధించలేకపోయిందని అన్నారు. కార్యకర్తలే మమ్మల్ని టీడీపీలో చేరమన్నారని.. విజయవాడ బహిరంగ సభలో నెల్లూరు కార్యకర్తలను టీడీపీలో చేర్చుతామని స్ఫష్టం చేశారు. పదవులు ఆశించి టీడీపీలో చేరడం లేదు.. రేపటి తరానికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో టీడీపీలో చేరుతున్నామని రాం నారాయణరెడ్డి తెలిపారు.

చెన్నైకి శాపంగా మారిన వానలు

  చెన్నై నగరాన్ని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయిందంటే వానలు ఏస్థాయిలో కురుస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చును. చెన్నై నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అనేక ప్రాంతాలలో బస్సులు, రైళ్ళు రద్దయ్యాయి. జాతీయ విపత్తుల సహాయ కేంద్రానికి చెందిన 8 బృందాలు తుఫాను ప్రాంతాలలో సహాయ, పునరావాస చర్యలలో పాల్గొంటున్నాయి. ఆర్మీకి చెందిన రెండు దళాలు చెన్నైలోని తాంబరం మరియు ఉరపాక్కం ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడి అవసరమయిన సహాయ సహకారాలు అందించడానికి కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.   నటుడు సిద్దార్ధ ఇంటిలోకి కూడా నీళ్ళు వచ్చేయడంతో అతను కూడా వేరే ఇంట్లోకి మారిపోయాడు. అతను తన స్నేహితుడు బాలాజీతో కలిసి నేటి నుండి సహాయ చర్యలలో పాల్గొనబోతున్నారు. బాధితులను తరలించేందుకు ప్రజలు తమ వాహనాలను తీసుకొని రావలసిందిగా ఆయన విజ్ఞప్తి చేసాడు. అలాగే భాదితులకు నగరవాసులు తమ ఇళ్ళలో ఆశ్రయం కల్పించాలని పిలుపునిచ్చారు. దానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఉన్నత వర్గాల ప్రజలు కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.

భీప్ ఫెస్టివల్.. ఓయు స్టూడెంట్స్ వర్సెస్ ఎమ్మెల్యే రాజా సింగ్

గోషమహల్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ డిసెంబరు 10న ఉస్మానియా క్యాంపస్ లో నిర్వహించే బీఫ్ ఫెష్టివల్ ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఓయూ విద్యార్ధులు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న బీఫ్ ఫెస్టివల్ ను రాజా సింగ్ ఎలా అడ్డుకుంటారని.. అంతేకాదు దేశంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులకు నిరసనగా తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాదు యూనివర్శిటిలో ఉన్న ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టేందుకే రాజాసింగ్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఓయూ విద్యార్ధులు పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఫెస్టివల్ ఎలాగైన నిర్వహిస్తామని ఓయూ విద్యార్ధులు.. ఫెస్టివల్ ను అడ్డుకుంటామని రాజాసింగ్ సవాళ్లు విసరడంతో ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్ మరో వివాదంతో వేడెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వైసీపీతో టీఆర్ఎస్ పొత్తు..?

తెలంగాణ అధికార పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పుడే పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ఇక టీఆర్ఎస్ అయితే ఇప్పటికే హైదరాబాద్లో తాము చేపట్టిన పథకాలతో భారీ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు కూడా. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్ర‌భావం చాలా త‌క్కువే అని చెప్పొచ్చు. దానికి తోడు టీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణలు ఒకవైపు.. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కూడా మార్చివేశారు. కానీ గ్రేటర్ లో టీడీపీ, బీజేపీ, ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీలు కాస్త బలంగానే ఉన్నాయి. ఇక వైసీపీ పరిస్థితి కూడా పర్వాలేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదో పైకి గెలుపు తమదే అని చెబుతున్నా ఆపార్టీకి అంత సీన్ లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ టీఆర్ఎస్ కు కూడా తమ పరిస్థితి తెలిసి ఎంఐఎం, వైకాపాతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వైకాపా.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ వైకాపా తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే వైకాపా పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే వైకాపా ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాలి. మొత్తానికి ఏది తెలియాలన్నా ఎన్నికల వరకూ ఆగాల్సిందే.