బిడ్డకు పాలిచ్చిందని చంపేశారు

  ఐసీస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థను సాధ్యమైనంత త్వరగా నాశనం చేయాల్సిన అవసరం వుందనే విషయాన్ని ప్రపంచానికి గుర్తు చేసే ఘటన అల్‌రకా నగరంలో జరిగింది. అల్‌రకా నగరంలో బిడ్డకు పాలిచ్చిందనే నేరం మీద ఐసీస్ ఉగ్రవాదులు ఒక మహిళను దారుణంగా హింసించి, ఆ తర్వాత బహిరంగంగా కాల్చి చంపారు. సరుకుల కొనుగోలు కోసం నెలల శిశువుతో కలసి బయటకి వచ్చిన ఒక మహిళ మధ్యలో తన బిడ్డ ఆకలితో ఏడవటంతో ఒక చెట్టు పక్కకి వెళ్ళి పాలిచ్చింది. దీనిని ఐసీస్ అనుబంధ మహిళా ఉగ్రవాద సంస్థ అయిన అల్‌ఖన్సా సభ్యులు గమనించారు. ఐసీస్ ఉగ్రవాదుల నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వడం నేరం. ఈ నేరం మీద సదరు మహిళ నుంచి బిడ్డను లాక్కున్నారు. ఆమెను దారుణంగా హింసించిన అనంతరం బహిరంగంగా కాల్చి చంపారు.

పాక్‌లో ఆత్మాహుతి దాడి... 22 మంది మృతి

  పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి మోటర్ సైకిల్ మీద వచ్చిన దుండగుడు తనను తాను పేల్చేసుకోవడంతో భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటనలో 22 మంది మరణించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని మార్దన్ ప్రాంతంలో నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కార్యాలయం గేటును తోసుకుంటూ రద్దీగా వుండే కార్యాలయంలోకి మోటర్ సైకిల్‌తో దూసుకెళ్ళి ఆత్మాహుతి చేసుకోవడంతో 22 మరణించడంతోపాటు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయం గేటు దగ్గర వున్న సిబ్బంది దూసుకొస్తున్న మోటార్ సైకిల్‌ని ఆపడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. పేలుడు ధాటికి కార్యాలయ భవనం తలుపులు, కిటికీలు ధ్వంసమైపోయాయి. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం.

మరో 20 మంది విద్యార్ధులు అమెరికా నుంచి వెనక్కి!

  అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలలో చేరేందుకు వెళ్ళిన 14 మంది భారతీయ విద్యార్థులను శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికా అధికారులు నిర్బంధించి ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు ప్రశ్నించి, తరువాత వారినందరినీ వెనక్కి తిప్పి పంపేసారు. అందుకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ క్షమాపణలు కూడా చెప్పింది. ఆ సంఘటన జరిగి వారం రోజులు కూడా కాలేదు. మళ్ళీ మరో 20 మంది తెలుగు విద్యార్థులకు అటువంటి చేదు అనుభవమే షికాగో విమానాశ్రయంలో ఎదురయింది. వారు కూడా అదే యూనివర్సిటీలలో చేరేందుకు ఆదివారం షికాగో విమానాశ్రయం చేరుకొన్నప్పుడు, వారిని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడే ప్రశ్నించి వెనక్కి తిప్పి పంపేసారు. వారందరూ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు.   ఇదివరకు 14 మంది విద్యార్ధులను వెనక్కి తిప్పి పంపేసిన తరువాత,  అవే విశ్వవిద్యాలయాలలో చేరేందుకు  బయలుదేరుతున్న మరి కొందరు విద్యార్ధులను ఎయిర్ ఇండియా విమాన సంస్థ అధికారులు వారించారు. వారికి అక్కడి పరిస్థితుల గురించి వివరించి తమ ప్రయాణాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకోమని కోరారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా వారికి అదే సలహా ఇచ్చేరు. కానీ వారి మాటలను పెడచెవిన పెట్టి వెళ్లిన 20 మంది తెలుగు విద్యార్థులకు మళ్ళీ అటువంటి చేదు అనుభవమే ఎదుర్కోవలసి వచ్చింది.   ఆ రెండు విశ్వవిద్యాలయాలు తాము నిషేధిత జాబితాలో లేమని చెపుతున్నాయి. అయినా అమెరికా అధికారులు వాటిలో చేరేందుకు వెళుతున్న విద్యార్ధులను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపేస్తున్నారు. మధ్యలో విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు నలిగిపోతున్నారు.  ఆ రెండు విశ్వవిద్యాలయాల అధికారులు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే మధ్యలో విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారు.భారత్ విదేశాంగ శాఖ అధికారులు చొరవ తీసుకొని తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిలో చేరేందుకు అమెరికా అధికారులు అనుమతించడం లేదని తెలిసి కూడా విద్యార్ధులు అమెరికా ప్రయాణం అవడం పొరపాటే. విద్యార్ధుల తల్లి తండ్రులు కూడా తమ పిల్లలు ఆ రెండు విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు పొందినప్పటికీ, భారత విదేశాంగ శాఖా నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు అమెరికా పంపకుండా కొంతకాలం ఆగితే నష్టపోకుండా ఉంటారు.

జపాన్‌లో వింత జీవి

  జపాన్ సముద్ర తీరంలో అరుదైన వింత జీవి కనిపించి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. సెంట్రల్ జపాన్‌లోని టొయామా బే తీరంలో వెండి రంగు మచ్చలతో ఎర్రగా వున్న చాలా పెద్ద వింత జీవి చేపలు పట్టేవారి పడవల కిందుగ ఈదుకుంటూ వచ్చి కొద్దిసేపు నీటి ఉపరితలంలో కనిపించింది. దీనిని సముద్రం లోపలి దృశ్యాలను వీడియో చిత్రీకరించే కెమెరా చిత్రీకరించింది. కొన్ని గంటలపాటు నీటి ఉపరితంపైనే ఈదుతూ కనిపించిన ఈ వింత జీవిని మత్స్యకారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. దాదాపు 13 అడుగుల పొడవున్న ఈ జీవి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ తరహా వింత జీవిని గతంలో కూడా ఒకసారి చూశామని, అప్పుడు చూసిన జీవి దాదాపు 43 అడుగుల పొడవు వుందని కొంతమంది సీనియర్ మత్స్యకారులు చెబుతున్నారు.

20 ఎకరాల్లో ఏపీ సచివాలయం

  అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నిర్మాణానికి సీఆర్‌డీఏ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల కార్యాలయ భవన నిర్మాణం చేపట్టడానికి టెండర్లు పిలవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 180 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రభుత్వ అంచనా. ఇందులో వడ్డీలేని 90 కోట్ల రుణాన్ని ప్రభుత్వం సీఆర్‌డీఏ‌కి ఇస్తుంది. మిగిలిన 90 కోట్లు హడ్కో నుంచి రుణం పొందాల్సిందిగా నిర్దేశించింది. వివిధ విభాగాలకు కేటాయించిన వసతి ఆధారంగా వారి సాధారణ బడ్జెట్ నుంచి అద్దెను చెల్లించాల్సి వుంటుందని ప్రభుత్వం వివరించింది.

రాజకీయాలలోకి అప్పుడే రాను: మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

  మళ్ళీ చాలా కాలం తరువాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న రాజమండ్రిలో మీడియా కంటపడ్డారు. మాజీ కాంగ్రెస్ ఎంపి హర్షకుమార్ కి చెందిన రాజీవ్ గాంధి విద్యాసంస్థల సిల్వర్ జుబ్లీ వేడుకలలో పాల్గొనేందుకు ఆయన నిన్న రాజమండ్రి వచ్చేరు.   ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోతే ప్రజలు, రైతులు తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు పడవలసి వస్తుందని కనుక ఇరువురు ముఖ్యమంత్రులు గొడవలు పడకుండా పరస్పరం సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలకు రావలసిన వాటి గురించి కేంద్రంతో పోరాడాలని సూచించారు. అమరావతి నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. రుణమాఫీల విషయంలో రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసారు.   రైతుల పంట రుణాలను ఒక పరిమిత కాలంలో పూర్తిగా మాఫీ చేయకపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇదివరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు బ్యాంకుల నుండి లక్ష రూపాయలు ఋణం తీసుకొని దానిని తిరిగి ఏడాదిలోగా చెల్లించినట్లయితే బ్యాంకులు వారి నుండి ఎటువంటి వడ్డీ వసూలు చేసేవి కావు. కానీ ఇప్పుడు రైతులు దాదాపు 14 శాతం వడ్డీ చెల్లించవలసి వస్తోందని అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల ఇళ్ళ నిర్మాణానికి తన ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని కానీ కొత్త ప్రభుత్వాలు ఇంతవరకు వాటిలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఆ పధకంలో భాగంగా ఇళ్ళు కట్టుకొన్నవారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. తన రాజకీయ భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవడానికి తొందర ఏమీ లేదని అన్నారు.

గ్యాంగ్ రేప్ చేసిన సైనికులు

  సైనికులు దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సంగతి ఏమోగానీ, అప్పుడప్పుడు కొంతమంది సైనికులు అత్యాచారాలకు పాల్పడుతూ కళంకం తెస్తున్నారు. ఇంట్లోంచి పారిపోయి రైలెక్కిన ఓ యువతిని ఆ రైల్లో ఉన్న సైనికులు గ్యాంగ్ రేప్ చేశారు. హౌరా- అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమార్తె రైలు ఎక్కి పారిపోతోందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. రాంచీ సమీపంలోని మధుపూర్ రైల్వే స్టేషన్లో రైలును ఆపి ఆ అమ్మాయి కోసం గాలించారు. ఇందులో భాగంగా సైనికుల బోగీలోకి రైల్వే పోలీసులు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు సైనికులు తీవ్రంగా వ్యతిరేకించారు. బలవంతంగా లోపలకు వెళ్ళిన పోలీసులకు సైనికుల బోగీలో రేప్‌కి గురై వున్న ఆ యువతి కనిపించింది. ఆ తర్వాత ఆ యువతి ముగ్గురు జవాన్లు తనతో బలవంతంగా మద్యం తాగించి రేప్ చేశారని తెలిపింది. సీసీటీవీ ఫుటేజిలో ఆ ఇద్దరినీ ఆమె గుర్తించింది. ఈ కేసులో నిందితులుగా వున్న సైనికులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో వున్నారు.

ప్రముఖ హాస్య నటుడు పొట్టి రాంబాబు ఆకస్మిక మరణం

  ప్రముఖ హాస్యనటుడు పొట్టి రాంబాబు మంగళవారం తెల్లవారు జామున మరణించారు. ఆయనకు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆకస్మికంగా మృతి చెందారని తెలుస్తోంది. ఆయన ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, ప్రేమతో నువ్వు వస్తావని వంటి 40కి పైగా సినిమాలలో నటించి మంచి హాస్య నటుడుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. పులిరాజా ఐ.పి.ఎస్. అనే సినిమాలో హీరో పాత్ర కూడా ధరించారు. పొట్టి రాంబాబు మరణవార్త విని చిత్రసీమలో అందరూ దిగ్బ్రాంతి చెందుతున్నారు. 2015 సం.లో ముగుస్తున్న ఈ చివరి రోజుల్లో తెలుగు చిత్రసీమ మరో హాస్య నటుడుని కోల్పోవడం చాలా దురదృష్టకరం.

జస్ట్ కానిస్టేబుల్... కోట్లు సంపాదించాడు..

  మధ్యప్రదేశ్‌లోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కోట్లకు కోట్లు సంపాదించేశాడు. అతగాడికి ఆరు ఇళ్ళు, నాలుగు కార్లు, ఎనిమిది బ్యాంకు అకౌంట్లు... మొత్తమ్మీద ఓ పాతిక కోట్ల ఆస్తి అతగాడి పేరు మీద వుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్ సింగ్ ఆస్తుల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు అతగాడి ఆస్తుల వివరాలు చూసి అధికారులే నోళ్ళు తెరిచారు. ఈయన పేరు మీద 25 ఎకరాల ఫామ్ హౌస్ వుందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంత డబ్బు ఎలా సంపాదించాడో అర్థం కాక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు.

ప్రణబ్‌కి ఒబామా గ్రీటింగ్ కార్డు

  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్ కార్డు పంపించారు. ఈ గ్రీటింగ్ కార్డులో ప్రణబ్ ముఖర్జీకి ఒబామా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. హాలిడే సీజన్ సంతోషంగా గడపాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రీటింగ్ కార్డులో ఒబామాతోపాటు ఆయన భార్య మిషెల్ ఒబామా, కూతుళ్ళు మలియా, సాషాల సంతకాలు వున్నాయి. అలాగే వారి కుటుంబంలో భాగమైన పెంపుడు కుక్కలు బో, సన్నీల పాదముద్రలు కూడా వేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఒబామా కుటుంబం పంపుతున్న గ్రీటింగ్ కార్డులలో ఈ రెండు కుక్కల పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి.

క్షమాపణలా? నేను చెప్పనంతే!

  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం డీడీసీఏ అవకతవకలపై జరిపిన విచారణలో జైట్లీ పేరు లేకపోవడం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ దాదాపు బిచ్చం ఎత్తుకుంటున్న స్థాయిలో దేబిరిస్తేందని, అది జరగని పని అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా వున్న సమయంలో డీడీసీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఆరోపించింది. దానిమీద దర్యాప్తు కమిషన్ కూడా వేసింది. కేజ్రీవాల్ ఈ విషయమై జైట్లీ మీద విమర్శలు గుప్పించడంతో జైట్లీ ఆయన మీద పరువునష్టం దావా వేశారు. అవకతవకల విషయం మీద ఢిల్లీ ప్రభుత్వం విచారణ చేయించిన అనంతరం వచ్చిన నివేదికల్లో ఎక్కడా అరుణ్ జైట్లీ పేరు లేదు. దాంతో కేజ్రీవాల్ తనకు క్షమాపణ చెప్పాలని జైట్లీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పర్మిషనిస్తాం... కుమ్మించుకోండి....

  దేశంలోని పలు ప్రాంతంలో పశువులతో నిర్వహించే జల్లికట్టు లాంటి సంప్రదాయ క్రీడలకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. క్రూరంగా, జంతువులకు హానికరంగా ఉండనంత వరకు సంప్రదాయం నిర్వహించే క్రీడలను తాము గౌరవిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. తమిళనాడులోని జల్లికట్టు, మహారాష్ట్రలోని ఎడ్లపందేలు, కర్ణాటకలో నిర్వహించే కంబల, పంజాబ్‌లో జరిపే ఎడ్లపందేలు కొన్ని దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయని, వాటిని తామూ గౌరవిస్తామని ఆయన అన్నారు. అయితే జంతువుల పట్ల ఎలాంటి క్రూరత్వం వుండకూడదని ఆయన స్పష్టంచేశారు. రెండు మూడు రోజుల్లో కేంద్రం నుంచి ఈ విషయంలో ఆదేశాలు వచ్చే అవకాశం వుందని జవదేకర్ తెలిపారు.

మహా ఇల్లాలు... గొప్ప కూతురు...

  ఓ మహా ఇల్లాలు.. ఓ గొప్ప కూతురి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే గుండె అరచేతిలో పెట్టుకుని చదవండి. వారణాసిలో రాజేష్ సింగ్ అనే వ్యక్తికి అపర్ణ అనే భార్య, దివ్యాన్షి అనే కూతురు వున్నారు. ఈ తల్లీకూతుళ్ళు దుబారా ఖర్చు చేస్తున్నారన్న ఉద్దేశంతో రాజేష్ సింగ్ వాళ్ళకి డబ్బు అందుబాటులో లేకుండా చేశాడు. చేతిలో డబ్బులు ఆడకపోతూ వుండటంతో ఆ తల్లీకూతుళ్ళకి పిచ్చెక్కినంత పనైంది. తమకు బోలెడంత ఆస్తి వుంది.. కానీ తమ చేతిలో పైసా కూడా పడటం లేదు. ఆస్తి మొత్తం రాజేష్ సింగ్ అదుపులోనే వుంది. మరి ఆ ఆస్తి మొత్తం తమ సొంతం కావాలంటే ఒక్కటే మార్గం వుంది. మనసు రాయి చేసుకుని ఆయన్ని చంపేయడం ఒక్కటే మార్గమని ఆ తల్లీకూతుళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో ఆ ఇల్లాలు తీవ్రంగా ఆలోచించింది. కూతురు దివ్యాన్షీ ప్రియుడు హర్షవర్ధన్‌ని, అతని స్నేహితుడు మహేంద్రను రంగంలోకి దించింది. వీళ్ళిద్దరూ జాగ్రత్తగా ప్లాన్ చేసి డిసెంబర్ 17న రాజేష్ సింగ్‌ని మర్డర్ చేశారు. ఆ తర్వాత తల్లీకూతుళ్ళు దేవుడులాంటి మనిషిని ఎవరో గిట్టనివాళ్ళు పొట్టన పెట్టుకున్నారంటూ ఆస్కార్ లెవల్లో నటించేశారు. మన పోలీసులు తక్కువోళ్ళేమీ కాదు కదా... వాళ్ళకి తమదైన శైలిలో సత్కారం చేసి అసలు విషయాన్ని రాబట్టి ఆ ఇద్దర్నీ, మర్డర్ చేసిన ఇద్దర్నీ అరెస్టు చేసి జైల్లో వేశారు.

గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది..!!

  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దం కాబోతుంది. మరో మూడు రోజులలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు. జి.హెచ్.ఎమ్.సి. కమిషనర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు.ఎన్నికల సందర్బంగా సుమారు ఎనభై వేల మంది పోలీసులను ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల తుది జాబితాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గ్రామాలలో ఓటింగ్ శాతం పెరుగుతున్నా, నగరాలలో పెరగడం లేదని,ఈ పరిస్థితి మారాలని ,అందరూ ఒటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చని నాగిరెడ్డి అన్నారు.హైకోర్టు సూచన మేరకు గడువు లోపే ఎన్నికలు పూర్తి అవుతాయని అన్నారు.

దానం నాగేందర్ పై పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి

  ఈరోజు కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ నేడు ఉప్పల్ లో పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేయడానికి తన అనుచరులతో కలిసి వచ్చేరు. కానీ ఉప్పల్ ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది కనుక అక్కడ అప్పటికే జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ తన అనుచరులతో వచ్చి పార్టీ జెండా ఎగురవేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా కొద్ది సేపటికే దానం నాగేందర్ అక్కడికి చేరుకొన్నారు. అక్కడే ఉన్న మల్లేష్ గౌడ్ అనుచరులు, నగర అధ్యక్షుడయిన దానం నాగేందర్ తమ జిల్లా పరిధిలోకి ప్రవేశించి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదని కనుక తక్షణమే వెనక్కి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. ఆ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ‘దానం నాగేందర్ గో బ్యాక్’ అంటూ మల్లేష్ గౌడ్ అనుచరులు నినాదాలు చేసారు. అయినా దానం నాగేందర్వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా మల్లేష్ గౌడ్ ఎగురవేసిన పార్టీ జెండాను క్రిందకు దింపి మళ్ళీ తను ఎగురవేశారు. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన మల్లేష్ గౌడ్ అనుచరులు దానం నాగేందర్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇరు వర్గాల ఘర్షణతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారింది. నగర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పార్టీని గెలిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే విషయం గురించి ఆలోచించకుండా, తన పరిధిని అతిక్రమించి జిల్లాలో ప్రవేశించి ఇటువంటి అనవసరమయిన వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని మల్లేష్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు.