దానం నాగేందర్ పై పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి
posted on Dec 28, 2015 @ 2:07PM
ఈరోజు కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ నేడు ఉప్పల్ లో పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేయడానికి తన అనుచరులతో కలిసి వచ్చేరు. కానీ ఉప్పల్ ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది కనుక అక్కడ అప్పటికే జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ తన అనుచరులతో వచ్చి పార్టీ జెండా ఎగురవేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా కొద్ది సేపటికే దానం నాగేందర్ అక్కడికి చేరుకొన్నారు. అక్కడే ఉన్న మల్లేష్ గౌడ్ అనుచరులు, నగర అధ్యక్షుడయిన దానం నాగేందర్ తమ జిల్లా పరిధిలోకి ప్రవేశించి కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదని కనుక తక్షణమే వెనక్కి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. ఆ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ‘దానం నాగేందర్ గో బ్యాక్’ అంటూ మల్లేష్ గౌడ్ అనుచరులు నినాదాలు చేసారు. అయినా దానం నాగేందర్వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా మల్లేష్ గౌడ్ ఎగురవేసిన పార్టీ జెండాను క్రిందకు దింపి మళ్ళీ తను ఎగురవేశారు. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన మల్లేష్ గౌడ్ అనుచరులు దానం నాగేందర్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇరు వర్గాల ఘర్షణతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారింది. నగర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పార్టీని గెలిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే విషయం గురించి ఆలోచించకుండా, తన పరిధిని అతిక్రమించి జిల్లాలో ప్రవేశించి ఇటువంటి అనవసరమయిన వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని మల్లేష్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు.