తుమ్మలపై కేసీఆర్ అదనపు బాధ్యత..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై ఓ భరువైన బాధ్యతను పెట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 10 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అస్సలు పట్టులేని ఖమ్మం జిల్లాలో.. ఆ జిల్లా అభ్యర్ధిని గెలిపించడంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్రముఖ పాత్ర వహించినందుకు గాను కేసీఆర్ తుమ్మలను ప్రశంసించినట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలో భాగంగా సీమాంధ్ర ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండే స్థానాల్లో గెలుపు బాధ్య‌త‌ల‌ను కేసీఆర్ తుమ్మ‌ల‌కు అప్ప‌గించార‌ట‌. ముఖ్యంగా నగరంలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారట. ఇంక టీడీపీ నుంచి తెరాస‌లో చేరిన మాధ‌వ‌రం కృష్ణారావుతో కూడా తుమ్మ‌ల‌కు స‌న్నిహిత సంబంధాలు ఉండటంతో  కూక‌ట్‌ప‌ల్లి నియోక‌వ‌ర్గంలో ఎక్కువ డివిజ‌న్ల‌ను తెరాస ఖాతాలో వేసే బాధ్య‌త‌ను తుమ్మ‌ల తీసుకున్నార‌ట‌. మరి కేసీఆర్ పెట్టిన బాధ్యతను తుమ్మల కనుక నెరవేర్చితే.. తుమ్మలకు మంచి ప్రాధాన్య లభించడంతో పాటు కేబినెట్లో మంచి స్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చంద్రబాబు నిర్ణయం.. వైసీపీ షాక్.. తెలుగు తమ్ముళ్లు హ్యాపీ..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీ నేతల సంగతి ఏమో కానీ టీడీపీ నేతలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారంట. అంతలా పార్టీ నేతలు సంతోషపడే పని చంద్రబాబు ఏం చేశారనుకుంటున్నారా.. నిధులు పేరిట వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గంలో కూడా టీడీపీ ఇన్ ఛార్జ్ లకు  నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు ఇందులో ఏదైనా ఇబ్బంది తలెత్తితే… వారికి నియోజకవర్గం పరిధిలో ఏదైనా బాధ్యతలు అప్పగించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే నిర్ణయానికి కూడా చంద్రబాబు వచ్చారంట. దీంతో ఒకవైపు వైసీపీ నేతలు ముఖ్యమంత్రి నిర్ణయానికి ఖంగుతింటే.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న తమ నాయకులను ఎందుకు దూరం చేసుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఇలాంటి సరికొత్త నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మాత్రం తమ పార్టీ నేతలను దూరం చేసుకోకూడదని భావిస్తున్నట్టు అర్ధమవుతోంది.

గ్రేటర్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా టీఆర్ఎస్.. ఇన్‌చార్జ్ లకు ప్రచార కిట్

తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల సంగతేమో కాని టీఆర్ఎస్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నగరంలో పెద్ద పెద్ద హోర్డింగులు పెడుతున్నారు. ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యుహాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒక్కో డివిజన్ ఇన్‌చార్జీకి ప్రచార సామగ్రితో కూడిన కిట్‌ను అందజేస్తోందట అధికార పార్టీ. ఇంతకీ ఈ కిట్ లో ఏముందనుకుంటున్నారా.. ఈ కిట్‌లో డివిజన్ స్వరూపం, ఓట్లు, ఆ డివిజన్‌లో నెలకొన్న సమస్యలు, ఇప్పటి వరకు ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తామేం చేయబోతున్నారు..  ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. ఇక ఈ వివరాల ఆధారంగా నేతలు ప్రచారం రంగంలోకి దిగుతారన్నమాట. అంతేకాదు దీనివల్ల క్యాడర్‌లో నెలకొనే గందరగోళాన్ని కూడా సులభంగా ఎదుర్కొనే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి. మరి టీఆర్ఎస్ ఈ కిట్ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుద్దో చూడాలి.

భూకంప అనుభవాన్ని ప్రత్యక్షంగా చూశా.. కేంద్రమంత్రి

ఈశాన్య భారతదేశంలో భూకంప చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూకంప అనుభవాన్ని తాను స్వయంగా చూసినట్టు చెబుతున్నారు కేంద్రమంత్రి నిర్మలారామన్. నిర్మలారామన్ ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటల్ని పరిశీలించేందుకు గాను పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అక్కడ ఆమె అనేక ప్రాంతాలు పర్యటించి పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. అయితే అక్కడ ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో గది మొత్తం ఊగిపోయిన పరిస్థితులతో  ఆమె ఆందోళనతో బయటకు వచ్చారంట. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోయినా తాను మాత్రం భూప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని.. తాను బస చేసిన హోటల్ గది కంపించి పోయిందని.. అయితే.. తామంతా క్షేమంగా ఉన్నట్లుగా ఆమె ట్విట్టర్ లో తెలిపారు.

డైలమాలో పాక్-భారత్ ల ద్వైపాక్షిక చర్చలు..

ఈనెల 15 వ తేదీన పాక్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చలు జరుగుతాయో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి విదితమే. అయితే ఈ ఉగ్రవాదుల మూలాలు పాక్లోనే ఉన్నాయని.. ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. దీంతో పాక్-భారత్ మధ్య చర్చలు జరిగుతాయో లేదో అన్న డైలమా ఏర్పడింది. అంతేకాదు ఒకవైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరోవైపు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని.. పాక్తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రానికి ఉగ్రవాదుల్ని హతమార్చారని.. ఆపరేషన్ ముగిసినట్లుగా కేంద్రం ప్రకటించినా.. ఇంకా కొంత మంది ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో దాక్కున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎయిర్ బేస్ దగ్గర భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఆర్మీ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. మొత్తానికి భారీ వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాగా ఎయిర్ బేస్ లో ఇంకా ఎంతమంది ముష్కరులు ఉన్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

టీఆర్ఎల్ లో చేరిన విజయరామారావు..

టీడీపీ నేత.. మాజీ మంత్రి విజయ రామారావు కొద్ది రోజుల క్రితం టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి మారబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  అయితే అప్పుడు విజయరామారావు తన చేరిక గురించి ఆలోచించి నిర్ణయం చెబుతానన్నారు.. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా విజయరామారావుకి ఫోన్ చేసి.. పార్టీ మార్పుపై ఆలోచించుకోవాలని.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారని.. దాంతో విజయరావు కూడా సందిగ్దంలో పడ్డారని అన్నారు. కానీ ఇప్పుడు విజయరామారావు చేరికపై అనుమానాలు తీరిపోయినట్టే. ఎందుకంటే విజయరామారావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విజయరామారావు టీఆర్ఎస్ లోకి చేరారు. కేసీఆర్ గులాబీ కండువాకప్పి విజయరామారావుని పార్టీలోకి ఆహ్వానించారు. కాగా విజయరామారావు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు.

వణికిన ఈశాన్యం.. ఆరుగురు మృతి

ఈశాన్య భారతదేశం భూకంపంతో వణికిపోయింది. బంగ్లాదేశ్, ఇంపాల్, పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ లో ఉదయం 4.30 గంటలకు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పెద్ద పెద్ద భవనాలు, మల్టీ కాంప్లెక్స్ లు కూలిపోయాయి.  ఈ ఘటనకు ఆరుగురు మృతి చెందగా 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు సహాయక చర్యలకు గాను ఎన్టీఆర్ ఎఫ్ బృందాలుఇంపాల్ బయలుదేరాయి. ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భూకంపం గురించి ఆరా తీశారు. అసోం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇంపాల్ లోని భూకంప పరిస్థితి పై సమీక్షిస్తున్నారు.

ఆఫ్ఘానిస్తాన్ లో భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదుల దాడి

  ఈ కొత్త సంవత్సరంలో భారత్ లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మళ్ళీ నిన్న రెండవసారి దాడికి పాల్పడ్డారు. మొన్న జనవరి 1వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘానిస్తాన్ లో మజారీ షరీఫ్ నగరంలో ఉన్న భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. భద్రతాదళాలు వారి దాడిని తిప్పికొట్టాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.   సాధారణంగా ఉగ్రవాదులు మిలటరీ దుస్తులు ధరించి, కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటారు. లేదా బాంబులతో నింపిన వాహనంలో దూసుకువచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడుతుంటారు. కానీ ఈసారి మాత్రం పక్కనే ఉన్న మరో భవనంలోకి చొరబడి, దానిలో నుంచి కాల్పులు జరుపుతూ భారత కౌన్సిలేట్ భవనంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసారు. మొత్తం నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరినీ భద్రతాదళాలు వెంటనే కాల్చి చంపాయి. మిగిలిన ఇద్దరూ ఇంకా కాల్పులు జరుపుతున్నారు.   ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలియగానే కౌన్సిలేట్ భవనం లోపల ఉన్న దౌత్యాధికారులు, ఉద్యోగులు అందరినీ అదే భవనంలో ఒక సురక్షితమయిన ప్రాంతానికి తరలించారు. “భారత కౌన్సిలేట్ పై ఉగ్రవాదులు దాడులు చేసారు. అందరూ క్షేమంగా ఉన్నాము,” అని ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ జనరల్ బ్రజబాషి సర్కార్ ప్రకటించారు. ఉగ్రవాదుల దాడి సంగతి తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు అక్కడికి చేరుకొని ఉగ్రవాదులు దాకొన్న భవనాన్ని చుట్టు ముట్టాయి. ఆ భవనంలో దాకొన్న ఇద్దరు ఉగ్రవాదులకి భద్రతాదళాలకు మధ్య ఇంకా కాల్పులు జరుతున్నాయి. ఈ దాడికి పాల్పడినవారెవరో ఇంకా ప్రకటించుకోలేదు.   ప్రధాని నరేంద్ర మోడి కాబూల్, లాహోర్ పర్యటనల తరువాత మొదట పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై, మళ్ళీ నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లోని భారత కౌన్సిలేట్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడులు చేయడం గమనిస్తే, మోడీ ప్రారంభించిన శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించడానికే ఈ దాడులు జరుగుతున్నాయేమొన్నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేటీఆర్ చప్రాసి ఉద్యోగానికీ కూడా పనికిరాడు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కాకపోతే తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికీ కూడా అర్హుడు కాదని అన్నారు. ఈ సందర్బంగా ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారం గురించి ప్రస్తావిస్తూ గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున కెటిఆర్ ప్రచారం చేస్తే టిడిపి నుంచి నేను వస్తానని.. టిఆర్ఎస్ నుంచి కెసిఆర్ వస్తే టిడిపి నుంచి చంద్రబాబు వస్తారన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపింది ఎన్టీఆరేనని.. ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడితో కాకుండా గతంలో కేసీఆర్ ఆంధ్రా బిర్యానిని పేడ బిర్యాని అని విమర్శించగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానిని గుర్తు చేస్తూ.. కేసీఆర్ ఆంధ్రా బిర్యాని పేడ బిర్యాని అన్నారు.. ఇప్పుడు అమరావతి వెళ్లి అదే పేడ బిర్యాని తిని వచ్చారు అని ఎద్దేవ చేశారు. మరి ఇద్దరు సీఎంలు సన్నిహితంగా మెలుగుతున్న వేళ.. రేవంత్ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రేవంత్ వ్యాఖ్యలకు కేసీఆర్.. కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

కేజ్రీవాల్ రూల్ తో 4 లక్షల ఆదాయం..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యం నివారణకి సరి-బేసి విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఈ విధానం వల్ల అటు కాలుష్య నివారణతో పాటు.. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చేలా కనిపిస్తుంది. అదెలాగంటే.. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై రూ. 2వేల రూపాయలు జరిమానా విధించమని కేజ్రీవాల్ తెలిపిన సంగతి విదితమే. నేపథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా సరి-బేసి విధానాన్ని అమలు చేసిన తొలి రోజునే దాదాపు 200 పైన మంది ఈ నిబంధనను ఉల్లంఘించి పోలీసులకు బుక్కాయ్యారు. దీంతో వారి దగ్గర నుండి పోలీసులు 4 లక్షలకు పైగా జరిమానా వసూలు చేశారు. ఇదిలా ఉండగా ఈ నిబంధనల వల్ల ఆటో డ్రైవర్లు మీటర్లు కూడా వేయకుండా ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు చాలా వచ్చాయి. దీంతో పోలీసు రవాణా శాఖ అధికారులు 76 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి జరిమానా వసూలు చేశారు.

ప్రజా సమస్యలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా బొండపల్లిలో మూడో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టామని.. ప్రజా సమస్యలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతేకాదు అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాదు.. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలున్నా ఈ కార్యక్రమంలో అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప కూడా పెద్దాపురం నియోజకవర్గంలోని చదలవాడ గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులను అందిస్తామని.. పేద ప్రజల సంక్షేమం కోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

బాక్సింగ్ చేసిన మంత్రులు గంటా, అయ్యన్న..

మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న విబేధాల గురించి అందరికీ తెలిసిందే. ఉండటానికి ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఒకరు ఈస్ట్ అంటే మరొకరు వెస్ట్ అనే టైపు. విశాఖ రాజకీయాల గురించి తెలిసిన వారికెవరికైనా వీరి మధ్య ఉన్న వైరం గురించి తెలిసే ఉంటది. ఈమధ్య కొణతాల చేరిక విషయంలో కూడా వీరి మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. అలాంటిది వీరిద్దరి మధ్య ఓ ఆసక్తిర సంఘటన చోటు చేసుకుంది. వీరిద్దరూ 'విశాఖ ఉత్సవ్' ఉత్సవాల్లో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి 3 వరకు విశాఖలో 'విశాఖ ఉత్సవ్' పేరిట జరిగే ఉత్సవాల్లో వీరిద్దరూ పాల్గొన్న వీరు సరదాగా బాక్సింగ్ చేశారు. చేతికి గ్లౌజులు వేసుకొని ఒకరిపై ఒకరు సరదాగా పంచ్ లు విసురుకున్నారు. . అయ్యన్న బ్లూకలర్,.. గంటా రెడ్ కలర్ గ్లౌజ్ లు ధరించి ఒకరిపై ఒకరు నవ్వులు చిందిస్తూ పంచ్ లు విసురుకోవటం అందరినీ ఆశ్య‌ర్య‌ప‌రిచింది. దీంతో అక్కడున్న వారంతా మంత్రుల బాక్సింగ్ ఫైట్‌ను ఆసక్తిగా తిలకించారు.

నిధుల కేటాయింపులో పొరపాటు చేసిన ఏపీ సర్కార్..

ఎప్పుడు అవకాశం దొరుకుతుందా.. ఎప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేద్దామా అని ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా ఎదురుచూస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు అధికార పార్టీ చేసిన ఒక పొరపాటు వల్ల విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అదేంటంటే.. ఎమ్మెల్యేలకు కేటాయించ వలసిన నిధుల విషయంలో.. ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేలకు కాకుండా టీడీపీ నేతలకు మంజూరు చేయడంతో.. వైకాపా ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. తమ నియోజ‌క‌వర్గాల‌కు నిధులు విడుద‌ల చేయ‌డం లేద‌ని వైకాపా అధికారులు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు విడుదల చేసినా కానీ.. ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం పొరపాటు చేసింది. దీనికి వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. కానీ నిధులు విడుద‌ల చేసింది మాత్రం.. టీడీపీ నేత గంగుల ప్ర‌భాకర్ రెడ్డి పేరుతో.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి కాగా టీడీపీ నేత శిల్పా చక్రపాణి ఎమ్మెల్యే పేరు మీద.. కర్నూలు జిల్లాలో ఏకంగా నాలుగు వైకాపా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నిధులు టీడీపీ ఇన్‌చార్జ్‌ల పేరు మీద విడుదల చేశారు.    తునిలోయనమల రామకృష్ణుడి సోదరుడి పేరు మీద నిధులు విడుదల చేశారు. దీంతో నిధుల విడుద‌ల‌లో ఈ ప‌క్ష‌పాత వైఖ‌రి ఏంట‌ని వైకాపా ఎమ్మెల్యేలు ప్ర‌శ్నిస్తున్నారు. మరి వైకాపా నేతలు చేసే విమర్శలకు అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఘోర రోడ్డు ప్రమాదం.. శవంతో 20 కి.మీ..

నల్గొండలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఆమంచి గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే కారు అతనిని గుద్దినప్పుడు కారు టాప్ పై పడి మరణించాడు.. అయితే ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు కారును వెంబడించడంతో.. కారు డ్రైవర్ శవంతోనే 20 కిమీ వరకూ వెళ్లాడు. కానీ స్థానికులు అతనిని అయిటిపాముల వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రైవర్ కారును నడిపే సమయంలో తాగి ఉన్నాడా?లేదా? అనే విషయాన్ని తేల్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. షెడ్యూలు రేపు వెలువడే అవకాశం..?

తెలంగాణలో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన షెడ్యూలు రేపు వెలువడే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు పార్టీలు ప్రచార కార్యక్రమాలకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారానికి సిద్ధమైంది. నోటిఫికేషన్ రాకపోయినా ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంది. ఆదివారం నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా నగరమంతా పెద్ద పెద్ద హోర్డింగులతో నింపేశారు. కాగా గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లలో 84 హైదరాబాద్ సిటీ పరిధిలో ఉండగా, 64 రంగారెడ్డి పరిధిలో, 2 మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. పోలింగ్ ఈ నెల 23 నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రోజా సస్పెన్షన్ పై కమిటీ..

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నఆరోపణపై స్పీకర్ ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిపక్ష పార్టీలు రోజాపై అనవసరంగా సస్పెన్షన్ వేటు వేశారంటూ అధికారపార్టీపై విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు రోజా సస్పెన్షన్ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. స్పీకర్ కోడెల బుద్దా ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులుగా ముగ్గురిని నియమించారు. శ్రవణ్ కుమార్(టీడీపీ)శ్రీకాంత్ రెడ్డి (వైసీపీ) విష్ణుకుమార్ రాజు (బీజేపీ) ఈ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా రోజా సస్పెన్షన్ గురించి.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఇరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పీకర్ కోడెల సభ్యులను ఆదేశించడం జరిగింది.

పోటీ నుండి తప్పకోవడానికి కాంగ్రెస్ నేతలే కారణం..

నిజామాబాద్ కాంగ్రెస్ నేత వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ పోటీ నుండి తాను తప్పకోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని.. టీఆర్ఎస్ నేతలు నాకు డబ్బు ఇవ్వలేదని.. అసలు వాళ్లు నాతో మాట్లాడలేదని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు షబ్బీర్ అలీ, మధుయాష్కీ, మహేశ్ గౌడ్ డబ్బుల కోసం నాపై ఒత్తిడి తీసుకొచ్చారని.. షబ్బీర్ అలీ సమక్షంలోనే పార్టీ నేతల దగ్గర రూ.2కోట్లు డిపాజిట్ చేశా కానీ.. మరో రెండు కోట్లు డిమాండ్ చేయడంతో తట్టుకోలేకే పోటీ నుండి తప్పుకున్నానని చెప్పారు. మరి వెంకట రమణారెడ్డి రాసిన లేఖకు కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.