ఉద్యోగాలిస్తామంటూ ఫ్లిప్‌కార్ట్ మోసం..!

ప్రముఖ ఈ- కామర్స్  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై పెను వివాదం రేగుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన విద్యార్దులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దీనిపై కంపెనీ స్పందిచడం లేదు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో విధుల్లో చేరాల్సిన తేదీని జూన్‌కు వాయిదా వేశారంటూ మండిపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు ఎంపికయ్యామనే కారణంతో ఇతర కంపెనీల మంచి ఉద్యోగావకాశాలను వదులుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగాల పట్ల హామీ ఇవ్వాలని కోరుతూ విద్యార్ధుల తరపున ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ నితిన్ సేథ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సచిన్ బన్సల్ తదితరులకు మెయిల్ కూడా చేశారు.

టీడీపీ కొత్త రగడ.. భూమా ఆఖిల ప్రియ వర్సెస్ గంగుల

  మొన్నటి వరకూ టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డికి, శిల్పా సోదరులకు మద్య విబేధాలు ఉండేవి. ఎలాగొలా వారిద్దరి మధ్య విబేధాలు ముగిసిపోయాయి అనుకునేలోపు.. మరో రగడ మొదలైంది అప్పుడే. అయితే ఈసారి భూమా ఆఖిల ప్రియ, గంగుల వంతు వచ్చింది. చాగలమర్రి మండలం గొడిగనూరులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టిన వేళ, గంగుల ప్రతాపరెడ్డి వర్గీయులు వాటిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వర్గీయుల ఆక్రమణలను కాదని, తమ వారి కట్టడాలను మాత్రమే కూల్చుతున్నారని గంగుల వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇద్దరి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టి ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

బస్సులో మహిళల కోసం పానిక్ బటన్ లు...

  బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రక్షణగా కొన్ని సరికొత్త మార్పులు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిశ్ గడ్కరీ ప్రతిపాదించడం జరిగింది. ఇక నుండి బస్సుల్లో సీసీటీవీ, పానిక్ బటన్, వెహికల్ ట్రాకింగ్ డివైన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇరవై మూడు మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉన్న బస్సులో ఈ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని.. ఆపదలో ఉన్న సమయంలో మహిళలు పానిక్ బటన్ నొక్కగానే, జీపీఎస్ సిస్టమ్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం వెళ్తుందని.. బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ద్వారా అక్కడ జరిగిన సంఘటనంతా పోలీసు కంట్రోల్ రూంలో ప్రత్యక్షప్రసారమవుతుందని మంత్రి తెలిపారు. దీంతో, పోలీసులు అప్రమత్తమై మహిళలను రక్షించేందుకు అవకాశముంటుందని నితిన్ గడ్కరీ వివరించారు. ఈ నింబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2న జారీ అవుతుందని తెలిపారు. ఢిల్లీలో నిర్బయ ఘటన జరిగిన విధంగా ఇక భవిష్యత్ లో అలాంటి ఘటనలు ఇంక జరగకుండా చూడాలని అన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదు.. మూడు వేల భవనాలు

తెలంగాణ పాలేరు ఉపఎన్నికలో తుమ్మల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు వేల శాశ్వత భవనాలను నిర్మిస్తామని.. భవనాల నిర్మాణం కోసం కేంద్రంనుంచి నిధులు అందకపోయినా, రాష్ట్రమే పూర్తిగా భరిస్తోందని ఆయన అన్నారు. స్త్రీ శిశు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేస్తూ అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తోందని ఆయన చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ట్రాకింగ్ విధానం అమలు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలపై నితీశ్ కుమార్.. ఉమ్మేసే పరిస్థితి వస్తుంది.

  ఇప్పటికే పలు కట్టడాలకు, రోడ్లకు గాంధీ-నెహ్రూ కుటుంబాల పేర్లు పెట్టడంపై రిషీ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతీకారంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరుగుదొడ్డికి ఆయన పేరు పెట్టి పగ తీర్చుకున్నారు. ఇప్పుడు నితీశ్ కుమార్ కూడా రిషీ కపూర్ జాబితాలో చేరిపోయారు. నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలు పెట్టడం మానుకోవాలని.. విగ్రహాలు పెట్టుకుంటూ పోతే వాటిపై ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో రెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమి లేదని, వచ్చే మూడేళ్ల పాలనలోనూ పెద్దగా ఒరిగేదేం ఉండబోదని అన్నారు.

అమ్మపై అభిమానంతో.. 134 సీట్లకు 134 మంది గుండ్లు

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘన విజయం సాధించి.. ఆ పార్టీ అధినేత జయలలిత రికార్డులు తిరగరాసి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్న అమ్మ గెలిచినందుకు తమళి తంబీలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పార్టీ గెలిచినందుకు ఒక ఆటో డ్రైవర్ రూపాయికే తన సర్వీసును అందించగా.. ఇప్పుడు కొంత మంది ఏకంగా గుండ్లు కొట్టించేసుకున్నారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ 134 సీట్లు కైవసం చేసుకొని విజయ ఢంకా మోగించగా.. ఈ నేపథ్యంలోనే 134 సీట్లకు గాను 134 మంది గుండు చేయించుకొని అమ్మపై తన ప్రేమను చూపించారు. మొత్తానికి అమ్మలాగే ఆమె కార్యకర్తలు కూడా ఏం చేసినా కొత్తగానే చేస్తారుని మరోసారి నిదర్శనమైంది.

చనిపోయిన టెక్కీ.. సిపిఎం నేత మేనల్లుడు.. డబ్బుల కోసమే..

  హైదరాబాద్ నగరం లింగంపల్లిలో హష్మీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హష్మీని హత్య చేసింది.. స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి అనే విషయం పోలీసులు తెలిపారు. అంతేకాదు.. హష్మీ.. సిపిఎం ఎపి శాఖ కార్యదర్శి మధు మేనల్లుడు అనే విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హష్మీ గత వారం రోజుల క్రితమే టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. అయితే హష్మీ స్నేహితుడైన నరేష్ కుమార్ రెడ్డి అతనిని పదివేలు కావాలని అడిగాడు. హష్మీ తన వద్ద లేవని చెప్పడంతో.. అతని వద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరేష్ కుమార్ రెడ్డి బండరాయితో హష్మీని కొట్టి చంపేసి.. తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, సెల్ ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు వచ్చి.. మోటరు బైక్ ఇవ్వడానికి వచ్చానని హష్మీ తల్లిదండ్రులతో కట్టు కథ అల్లినట్టు పోలీసులు తెలిపారు.

మాల్యా చెక్ బౌన్స్ కేసులో ట్విస్ట్.. మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోండి..

విజయ్ మాల్యాను చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ ఎర్రమంజిల్ కోర్టు వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు పంపిన వారెంట్లు మళ్లీ తిరిగి ఎర్రమంజిల్ కోర్టుకే తిరిగి వచ్చేశాయి. కోర్టు పంపించిన అడ్రస్ కు వారెంట్లు వెళ్లినా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. తిరిగి ఆ వారెంట్లను కోర్టుకే పంపించేశారు. అంతేకాదు ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారని.. అందులో ఏ ఒక్క వ్యక్తి లేరని కోర్టుకు తెలిపారు.   ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసు విచారణను వచ్చే నెల 6 కు వాయిదా వేసిన కోర్టు... అసలు మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తాను జారీ చేసిన సమన్లు వెనక్కు రావడంతో కొత్తగా మరోమారు సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. అయితే ఆ సమన్లను ఏ అడ్రెస్ కు పంపాలన్న విషయాన్ని పోలీసులే చెప్పాలని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ (జూన్ 6వ తేదీ)లోగా మాల్యా ఉంటున్న అడ్రెస్ ను తమకు అందజేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ,టీడీపీ మిత్రపక్షంగా.. ఇప్పుడే చెప్పలేం..

  గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉండి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మారిన పరిస్థితులను బట్టి ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందునుండి బీజేపీ నేతలు, టీడీపీ నేతల ఒకరి మీద ఒకరు విమర్సలు గుప్పించుకున్నా.. ఆ తరువాత పెద్దలు కలుగజేసుకోవడంతో పరిస్థితులు చక్కబడేవి. ఒకానొక సందర్భంలో రెండు పార్టీలు విడిపోతాయి అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే రెండు పార్టీలు విడిపోతాయేమో అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే పార్టీలు.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం పై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో మిత్రపక్షంగా కొనసాగే అవకాశాలు లేవని అర్ధమవుతోంది.   అంతేకాదు దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కురాలు పురందేశ్వ‌రి మాట్లాడుతూ.. అలాంటి అవకాశం లేదని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రానున్న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగానే కొన‌సాగుతూ త‌దుప‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై నిర్ణ‌యాన్ని తాము ఇప్పుడే చెప్ప‌లేమని..  ప్ర‌స్తుతం రాష్ట్రంలో త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చే దిశగానే దృష్టి పెట్టామ‌ని, టీడీపీతో పొత్తు అంశాన్ని గురించి ఎటువంటి నిర్ణ‌యాన్ని తెలప‌లేమ‌ని ఆమె అన్నారు. ఇంకా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ఆమె స్పందిస్తూ.. తమ పార్టీ అధిష్టానం రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలపై దృష్టి పెడుతుందని.. అనవసరంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంపే..

  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ విజయ పంధాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇదే అద్యక్ష బరిలో ఉన్న హిల్లరీ అప్పుడప్పుడూ కాస్త నెమ్మదించినా.. ట్రంప్ మాత్రం ముందునుండి తన సత్తా చాటుతున్నాడు. ఇక సర్వేలు కూడా ట్రంపే కాబోయే అమెరికా అధ్యక్షుడు అని చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్, హిల్లరీ క్లింటన్లలో ఓట్లు ఎవరికి వేస్తారనే నేపథ్యంలో ఐదు సర్వేలు నిర్వహించారు. ఈ ఐదు సర్వేల్లో రెండింటిలో ట్రంప్ పై ఆధిక్యం సాధించిన హిల్లరీ క్లింటన్... మూడింటిలో మాత్రం వెనుకబడిపోయారు. దీంతో సర్వేల ప్రకారం.. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనని అభిప్రాయపడుతున్నారు. అయితే హిల్లరీ కంటే ట్రంప్ కేవలం 0.2 శాతం మాత్రమే ఓట్లు అత్యధికంగా సాధించగలిగారని సర్వేలు వెల్లడించాయి. మరి సర్వేలు చెప్పినట్టు ట్రంప్ అధ్యక్షుడవుతాడో లేక.. సర్వేలను తిరగరాస్తూ హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవిని సొంతం చేసుకుంటారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ప్లాన్.. స్టాంప్ పేపర్ పై బాండ్

  రాష్ట్రం ఏదైనా కానీ పార్టీ ఫిరాయింపులు మాత్రం కామన్. అధికారంలో ఉన్న పార్టీల్లోకి నేతలు జంప్ అవ్వడం పారిపాటైపోయింది. అయితే ఈ పార్టీ ఫిరాయింపులను ఆపేందుకు కాంగ్రెస్ ఓ కొత్త పథకాన్ని ఎంచుకుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంత ఫలితాలు రాలేదు. దీంతో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను తట్టుకునేందుకు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ చౌదరి.. తాము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉంటామని, రూ. 100 స్టాంప్ పేపర్ పై బాండ్ రాసి ఇవ్వాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులతో బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడానికి ఇదేమి బాండ్ పేపర్ కాదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించకుంటే, వారిపై చర్యలు తీసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. పార్టీ పట్ల విధేయతపై వారి బాధ్యతలను గుర్తు చేసేందుకే ఇలా అడిగాం" అని చౌదరి వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూద్దాం.

పఠాన్ కోట్ లా మరో భీకర దాడి.. నిఘా వర్గాల హెచ్చరిక..

  పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో దాడి జరపడానికి.. ఏ క్షణమైనా ఉగ్రవాదులు విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని.. భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు దీనికోసం జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని..  పఠాన్ కోట్ దాడికన్న భీకర దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారుని.. దీనికి సంబంధించిన నివేదికను పంజాబ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఈ దాడులకు ప్రధాన సూత్రధారి పాక్ లోని ఒకారా ప్రాంతానికి చెందిన అవాసీ అని.. జైషే మహమ్మద్ కమాండర్ అయిన అవాసీ స్వయంగా మలేషియా మీదుగా భారత్ కు రావాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఇంకా ఈ దాడుల కోసమే పాక్ లో జైషే మహమ్మద్ మరో మూడు కార్యాలయాలు తెరిచిందని నిఘా వర్గాలు తెలిపారు. దాడులు ఎప్పుడైనా జరగవచ్చని, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

హైదరాబాద్లో టెక్కీ దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి

  హైదరాబాద్లో రోజు రోజుకు టెక్కీల హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి హష్మీ ఒక రోజు క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్‌ వద్ద హష్మీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హష్మీని దుండగులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. సెల్‌ఫోన్‌, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మీని హత్య చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మొన్ననే ఎమ్మెల్యే అయ్యాడు..అంతలోనే

నిన్న గాక మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కాని ఆ ఆనందం కొద్ది రోజులు కూడా నిలవలేదు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరుప్పరంగుండ్రం నియోజకవర్గం నుంచి శీనివేల్ అనే వ్యక్తి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గుండెనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. అయితే శీనివేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన మరణించకపోయినప్పటికి మరణించినట్టు పుకార్లు వ్యాపించాయి. వీటిని ఆయన కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఖండించారు. అయితే నిన్న అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. శీనివేల్ మృతిపట్ల అన్నాడీఎంకే నేతలు సంతాపం తెలిపారు.

సిబ్బంది నిర్లక్ష్యం..చచ్చేవాడికి వైద్యం ఎందుకు..?

చావు బతుకుల మధ్య ఉన్న రోగిని శతవిధాలా కాపాడేందుకు ఎంతోమంది వైద్యులు ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రిలోకి చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. శంషాబాద్‌లోని ఆహ్మద్‌నగర్ బస్తీకి చెందిన జోగు శ్రీను అనే వ్యక్తికి సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు 108 సాయంతో హుటాహుటిన శంషాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పుడు విధుల్లో ఉన్న ఎంన్‌ఓ నాసర్‌ఖాన్, వాచ్‌మెన్ కృష్ణ మద్యం మత్తులో ఉండి అంబులెన్స్‌ను ఆస్పత్రిలోకి రానివ్వకుండా రోగి బతకడు..వైద్యం అవసరం లేదని బాధ్యతారాహిత్యంగా గొడవకు దిగారు. విషయం మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈ లోపు మీడియా ప్రతినిధులు రావడంతో సిబ్బంది గేట్‌ తెరిచారు. వైద్యులు రోగికి వెంటనే సెలైన్ ఎక్కించడంతో అతని ప్రాణం నిలబడింది. అక్కడ ఏమాత్రం అటు ఇటైనా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేది.

మన సినిమాల్ని ప్రొత్సహించేందుకు..

భారతీయ చిత్రాల నిర్మాతలకు చేయూత నిచ్చే ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వారికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగానే.. ఇకపై ఆస్కార్, కేన్స్ వంటి చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడే చిత్రాలకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసందర్బంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఆస్కార్ కు ఎంపికయ్యే చిత్రానికి రూ.కోటి, కేన్స్ కు అయితే రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని భావిస్తున్నట్లు  తెలిపారు. భారత్ లో షూటింగ్ నిమిత్తం వచ్చే విదేశీ ఫిల్మ్ మేకర్లకు వీసా వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.