బంగ్లాలో హిందువులను ఓటింగ్‌కు దూరం చేయడానికి కుట్ర..!

 

ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా? మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు ఓటింగ్లో పాల్గొనకుండా చేయడానికే ఈ మారణకాండ కొనసాగుతుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గడిచిన 31 రోజుల్లో ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యలు, లూటీలు, అత్యాచారాలతో బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా హిందువుల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. 

కొత్త ఏడాదిలోనే ఇదే పరిస్థితి కొనసాగుతుండతో సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో మైనారిటీల పరిస్థితి దిక్కుతోచకుండా తయారైంది. ముఖ్యంగా హిందూ సమాజమే లక్ష్యంగా జరుగుతున్న మతపరమైన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల ప్రాణాలను, మానవ హక్కులను కాపాడటంలో ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ఒక్క నెలలోనే 51 దాడులు జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం డిసెంబర్ నెలలోనే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 లూటీలు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. దొంగతనాలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలతో అక్రమ అరెస్టులు, చిత్రహింసలు వంటి సంఘటనలు మైనారిటీల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూనే సాగాయని కౌన్సిల్ స్పష్టం చేసింది. 

ఇంత జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలపాలవుతోంది. దేశవ్యాప్తంగా ఎలాంటి భద్రతా చర్యలు కనిపించడం లేదని, ఆంక్షలు విధించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు కుట్రగా కనిపిస్తోంది.

కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో మయన్నార్ బాధితులు స్వదేశానికి

  ఉద్యోగుల కోసమని మయన్మార్ వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకుపోయిన పది మందిని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యక చొరవతో స్వదేశానికి వచ్చేలా చేశారు. భాధితుల ఇబ్బందులను వారి కుటుంబ సభ్యులు ఇటీవల రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌రే లేఖ రాసి రక్షించమని కోరారు.  దాంతో యాంగోన్‌లోని భారత రాయబా కార్యాలయం అధికారులు అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చించి 10 మందిని ఢిల్లీకి తరలించారు. బాధితులను ఏపీ భవన్ అధికారులు వారి స్వస్థలాలైన విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు తరలించాు. మయన్నార్‌లో 80 మందికి పైగా భారతీయులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకున్నారని, వారందర్నీ వెనక్కు రప్పించే ప్రయత్నం చేయాలని రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరారు.

సిరియాలో ఐసిస్ స్థావరాలపై యూఎస్ దాడులు

  సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దళాలు భారీ దాడులు చేపట్టాయి. గత నెల ఐసిస్ జరిపిన దాడుల్లో తమ ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తమ పౌరులకు హాని తలపెట్టిన వారిని.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. వారిని తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. వెతికి పట్టుకుని చంపేస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.  మిత్ర దేశాల దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది.  గత నెలలో ఐసిస్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఓ పౌరుడు చనిపోయాడని.. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది. అంతేకాకుండా.. ఎవరైనా తమ సైనికులకు హాని తలపెడితే.. వారు న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదని పేర్కొంది. వారిని తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని చంపేస్తాము యూఎస్ సెంట్రల్ కమాండ్ అని ఆ ప్రకటనలో పేర్కొంది.   2025 డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు పాల్మిరా, సిరియాలో.. అమెరికా, సిరియా భద్రతా దళాలు లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు అమెరికాకు చెందిన ట్రాన్స్‌లేటర్ మృతి చెందాడు. యూఎస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 19న ఆపరేషన్ హాక్‌ఐ పేరుతో ఐసిస్‌పై దాడులు నిర్వహించింది. జోర్డాన్‌తో కలిసి దాదాపు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు చేసింది. తాజాగా అదే ఆపరేషన్‌కు కొనసాగింపుగా ప్రతీకార దాడులు నిర్వహించింది అమెరికా. కాగా, ప్రస్తుతం సిరియాలో దాదాపు 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.  

మేడారానికి పోటెత్తిన భక్త జనం

  ములుగు జిల్లా మేడారానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో అమ్మవార్లను దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ దేవతలను మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గద్దెల ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారుల అంచనా వేస్తున్నారు. రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు.  మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో పస్ర-మేడారం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నార్లపూర్, కొత్తూరు, జంపన్నవాగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.  అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే.   

తెలంగాణలో చలి పంజా...మూడు రోజులు వణుకుడే

  తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పలుజిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు చేరడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవడం చలి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ నగరంలో  4.8 °C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు సౌత్ ఢిల్లీలోని అయా నగర్‌లో 2.9 °C  ఉష్ణోగ్రతతో ప్రజలు వణికిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల వద్దే ఉంటుందని పేర్కొంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఎమ్మెల్యేపై మూడో రేప్ కేసు...అరెస్ట్ చేసిన పోలీసులు

    కేరళ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో ఆయను అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పాలక్కాడ్‌లో ఆయన్ను పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్బవతిని చేసి మోసం చేశాడని సదరు మహిళ ఆరోపించారు.  నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు తెలిపింది.  అబార్షన్ చేయించుకోమని బెదిరించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నది.  రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండడంతో ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని.. అయితే ఎమ్మెల్యేపై రేప్‌ కేసులు నమోదుకావడంతో తాను కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వరుస లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతడిని బహిష్కరించింది. సీఎంవో ఆఫీసుకు మెయిల్ ద్వారా రాహుల్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును సీఎంవో క్రైమ్ బ్రాంచ్ కు పంపగా.. విచారణ నిమిత్తం ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.  ప్రాథమిక విచారణ తర్వాత తిరువల్ల కోర్టులో రాహుల్ ను ప్రవేశపెట్టి కస్టడీ కోరనున్నట్లు వెల్లడించారు.  

నేను డాక్టర్‌ను కాదు... కానీ సోషల్ డాక్టర్‌ను : సీఎం రేవంత్‌రెడ్డి

  హైదరాబాద్‌లో జరుగుతున్న ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని యువ కార్డియాలజిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. “నేను మెడికల్ డాక్టర్ కాదు… కానీ సోషల్ డాక్టర్‌ను” అంటూ ఆయన ప్రారంభించారు. భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హైదరాబాద్‌కు రావడం గర్వకారణమని అన్నారు. డాక్టర్ల వృత్తిలో నిరంతరం నేర్చుకోవడం అత్యంత కీలకం అని రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త జ్ఞానం, నైపుణ్యాలను నిర్లక్ష్యం చేస్తే కెరీర్‌ అంతమైన్నట్లేనని స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల ఆవిష్కరణలకు హబ్‌గా హైదరాబాద్ వేగంగా ఎదుగుతోందని ఆయన గుర్తుచేశారు. డాక్టర్లు సమాజంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారని, ప్రాణాలను కాపాడే దేవతలుగా ప్రజలు వారిని నమ్ముతారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, మెరుగైన హెల్త్ పాలసీల కోసం వైద్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలతో ఆరోగ్యరంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో, డాక్టర్లు టెక్నాలజీతో పాటు మానవత్వాన్ని కూడా మర్చిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు.ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నందున, వాటిని నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములై పనిచేయాలని సూచించారు.  ముఖ్యంగా విద్యార్థులకు CPR శిక్షణ అందించడంలో వైద్యులు ముందుకు వస్తే అనేక ప్రాణాలను కాపాడగలమని చెప్పారు.నివారణపై అవగాహన కల్పించడం సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్న సీఎం, క్వాలిటీ హెల్త్‌కేర్ అందించడంలో భారత్ ప్రపంచంలోనే ఉత్తమంగా నిలవాలని, ప్రతి వైద్యుడు ఉత్తముడిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

డెయిరీ రంగ సేవలకు భువనేశ్వరికి అరుదైన అవార్డు

  భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025' సౌత్‌జోన్ ప్రదానం చేసింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె చూపిన దూరదృష్టి నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టంపై ఆమె కల్పించిన సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు వరించింది.  ఈ నెల 9న కేరళలోని కోజికోడ్‌లో కాలికట్ ట్రేడ్ సెంటర్, డాక్టర్ వర్గీస్ కురియన్ నగర్‌లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్ - 2026 ప్రారంభ సమావేశంలో ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి జే.చించు రాణి చేతుల మీదుగా భువనేశ్వరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడంపై భువనేశ్వరి స్పందించారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. భారత డెయిరీ రంగం అభివృద్ధి, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానని మరోసారి స్పష్టం చేశారామె.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు.  ఆమెకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. పాడి రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ పురస్కారం భువనేశ్వరి సహా ఆమె బృందానికి దక్కాల్సిన సరైన గుర్తింపు అని సీఎం పేర్కొన్నారు. ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కృషి ఉందన్నారు.  

మహిళా ఐఏఎస్‌లపై వచ్చిన అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నాం : మంత్రి సీతక్క

  మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా వేదికలు అసభ్యంగా, అనుచితంగా, దూషణాత్మకంగా వార్తలు, వ్యాఖ్యలు చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం అని తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క  పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన మహిళా ఐఏఎస్ అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె అన్నారు. మహిళలు ఉన్నత స్థాయిలకు చేరితే వాటిని తట్టుకోలేని ఫ్యూడల్ మానసికతే ఈ రకమైన దుష్ప్రచారాలకు మూలమని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందని, అటువంటి పరిస్థితుల్లో మహిళా అధికారులను కించపరిచే వ్యాఖ్యలను, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారాన్ని సహించబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలను ధైర్యంగా, నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, వారి వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ తరహా దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలపై ద్వేషం, అవమానంతో కూడిన ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

చైనాలో ఒక్కో కోతి ధర రూ.25 లక్షలు

  చైనాలో కోతుల కొరత పెరిగిపోతండంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్కో కోతికి ఏకంగా రూ.25 లక్షల వరకు చెల్లిస్తున్నారు. కొత్తగా తయారు చేసిన మందుల  క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా కోతులపై ఆధారపడుతోంది.  కోతుల కొరత కారణంగా.. ఔషధాలు తయారు చేసే వ్యయం పెరగడంతోపాటు.. కొత్త పరిశోధనలు ఆలస్యం అవుతున్నాయని చైనా ఆందోళన చెందుతోంది.  చైనాలో బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో.. ల్యాబ్‌లలో ప్రయోగాల కోసం ఉపయోగించే కోతుల కొరత ఏర్పడింది. దీంతో కోతుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక్కో కోతి ధర 1.5 లక్షల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త మందుల క్లినికల్ ట్రయల్స్ విపరీతంగా పెరగడం, కోతుల పెంపకంలో నెలకొన్న జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.   దీని వల్ల మందుల తయారీ ఖర్చు పెరుగుతోందని.. కొత్త ప్రయోగాలు చేయడానికి మరింత  గతేడాది ఒక్కో కోతి సగటు ధర సుమారు 1,03,000 యువాన్లు అంటే దాదాపు రూ.13 లక్షలు ఉండగా.. 2026 ప్రారంభం నాటికి రూ.25 లక్షల వరకు చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయికి చేరిన కోతుల ధరలు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరుకోవడం పరిశోధనా సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

మాజీ ఐపీఎస్‌ అధికారి భార్యకు రూ.2.58 కోట్ల టోకరా

  స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య నుంచి రూ.2.58 కోట్లను కాజేసిన ఘటన హైదరాబాద్‌ నగరంలో కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వాట్సాప్‌ ద్వారా మొదలైన మోసం గత నెలలో బాధితురాలికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామని ఒక సందేశం వచ్చింది. పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలోనే భారీ లాభాలు సాధించవచ్చని, తామిచ్చే సలహాలు పూర్తిగా నిపుణులవి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో, బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపి, ఆయన్ను కూడా ఆ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించింది.  29.11.2025న, నా భర్త “స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ 20” అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు, అందులో సుమారు 167 మంది సభ్యులు ఉన్నారు.ఆ తర్వాత కొద్దికాలానికే, దినేష్ సింగ్ అని తనను తాను పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, 9685717841 అనే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి, గ్రూప్‌లో వివరణాత్మక సందేశాలను పంపుతూ చురుకుగా తరగతులు మరియు చర్చలు నిర్వహించడం ప్రారంభించాడు. అతను సామూహిక పెట్టుబడి యొక్క ప్రాముఖ్యత, ట్రేడింగ్‌లో క్రమశిక్షణ మరియు సమన్వయ వ్యూహాల ప్రయోజనాలను వివరించాడు.  అతని సందేశాలు అత్యంత పాండిత్యంతో, విశ్లేషణా త్మకంగా వివరించారు. అతని మాటలు ఆ గ్రూపులో ఉన్న వారందరూ నమ్మారు.. ఇతను చాలా స్టాక్ మార్కెట్ గురించి వివరించారు. చాలా మంది గ్రూప్ సభ్యులు ఈ స్టాక్‌లు మంచి లాభాలను ఇస్తున్నాయని పేర్కొంటూ గ్రూప్‌లో సందేశాలను మరియు స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయడం ప్రారంభించారు.  అలా గ్రూపులో ఉన్న సభ్యులందరూ మెసేజ్లు చేయడంతో బాధితురాలు అది నిజమని పూర్తిగా నమ్మింది. వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులకు 500 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. తమ సంస్థ సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అంటూ ప్రచారం చేశారు. దీనికి మద్దతుగా సెబీకి చెందినట్లుగా కనిపించే నకిలీ సర్టిఫికెట్లు, డాక్యు మెంట్లను కూడా వాట్సాప్‌లో పంపించారు. ఈ నకిలీ ధృవపత్రాలను చూసి బాధితురాలు నిజమేనని విశ్వసించారు. సైబర్ నెరగాళ్లు బాధితురాలు చేత తొలుత చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టించి, ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌లో లాభాలు వచ్చినట్లు చూపిస్తూ.... మరింత పెట్టుబడి పెట్టేం దుకు ప్రోత్సహించారు. సైబర్ నేరగాళ్ల మాటలు పూర్తిగా నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 ట్రాన్సాక్షన్లలో రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టారు.కొంత కాలానికి అనుమానం రావడంతో బాధితురాలు పెట్టుబడి నిలిపివేయగా, సైబర్ నేరగాళ్లు తీవ్ర ఒత్తిడి మొదలుపెట్టారు. మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టాలని, పెట్టుబడి చేయకపోతే ఇప్పటివరకు పెట్టిన మొత్తం డబ్బు మొత్తం పోతుందని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పరిణామాలతో  భారీ మోసానికి గురైనట్టు తెలుసుకున్న బాధిత కుటుంబం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ సెబీ సర్టిఫికెట్లు, వాట్సాప్ గ్రూప్ లింకులు, బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా నిందితుల జాడ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిపి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో పెట్టుబడుల పేరిట వచ్చే వాట్సాప్ సందేశాలు, అధిక లాభాల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెబీ సర్టిఫికేషన్ పేరుతో వచ్చే లింకులు, డాక్యుమెంట్లను అధికారిక వెబ్‌సైట్లలో ధృవీకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు.