18+లో చూసే దృష్టికోణం మారాలి

సమాజాన్ని అంతో ఇంతో ప్రభావితం చేయగలిగేది సాహిత్యం అని నా అభిప్రాయం. ఇందులో కథ, కవిత్వం, నాటకం, సంగీతం, సినిమా ఇలా అనేక ప్రక్రియలు ఉన్నాయి. వేటికవే ప్రత్యేకం. అయితే ఇప్పుడు యువతను బాగా ప్రభావితం చేస్తుంది సినిమా. మరి అలాంటి సినిమాని యువత ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నారు? అనేది మనం గమనించాలి. కథలో ముఖ్యంగా సినిమా కథల్లో ప్రత్యేకించి మంచిని వేరు చేసి చూపించరు. కథలో భాగంగా ఉంటుంది. ఇది చర్చ ద్వారానే అవగతమవుతుంది. అయితే ఆ చర్చ ఎవరితో జరగాలి? తల్లిదండ్రులతో జరగాలి. గురువులతో జరగాలి అప్పుడే అందులో ఉన్న అంతః సారం గురించి అర్ధవంతమైన చర్చ జరుగుతుంది. అంతేగాని సమవయస్కులైన మిత్రులతో కలిసి చర్చిస్తే అనవసరమైన విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఉదాహరణకు "పోకిరి" సినిమాని తీసుకుందాం. ఆ సినిమాని చూసిన పద్దెనిమిది, ఇరవయ్యేళ్ల వయసువాళ్లు మిత్రులతో కలిసి ఎక్కువగా ఏమి చర్చిస్తారో తెలుసా? హీరోయిన్ డైలీ ఆఫీస్ కి తీసుకెళ్లే ఉప్మా గురించి. ప్రతి కథానాయకుడు స్త్రీల పట్ల అసభ్యంగా చేసిన పద ప్రయోగాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు.  ఇదే కథని తల్లిదండ్రులవద్ద లేదా గురువుల వద్ద చర్చకు వస్తే విషయం వేరుగా ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం లెక్క చేయక, దుష్టుల చేతిలో భార్యను కోల్పోయిన తండ్రి నే స్ఫూర్తిగా తీసుకొని పోలీస్ ఆఫీసర్ అయిన కొడుకు అయిన హీరో గొప్పతనం గురించి కచ్చితంగా చర్చకు వస్తుంది.  అయితే ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు చూసి వచ్చిన సినిమా గురించి చర్చిస్తున్నారు. విని వారి అనుభవ సారం నుంచి అర్ధమైన విషయం పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పగలుగుతున్నారు అంటే వెళ్లపై లెక్కపెట్టవచ్చు. కునుకు మంచి అయినా చెడు అయినా పిల్లలతో చర్చించండి. వారికి అర్ధమైంది తెలుసుకోండి. మీకు అర్ధమైంది వివరించండి. అప్పుడే శోధనాత్మకమైన యువ సమాజం నిర్మితమవుతుంది. - వెంకటేష్ పువ్వాడ

డోంట్ వర్రీ తమ్ముడూ - ఓసారి వివేకానందున్ని చదువుదాం!

చిన్న కష్టానికే హడలిపోతున్నారు. అర్ధం లేని కారణాలకు ఆత్మ త్యాగాలను చేస్తుంది ఈ జనరేషన్. కారణం ఇంట్లో సరి అయిన మార్గనిర్దేశం చేయాల్సిన తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపారాలలో పడి పిల్లలతో సరిగా మాట్లాడలేకపోవడం. ఎవరి పరుగు వాళ్లది. బాధపడాల్సిన పని లేదు తమ్ముడూ! స్వామి వివేకానంద కొత్త తరాలను జాగృతం చేసే గొప్ప మాటలను గ్రంధస్తం చేసి మనకోసం వదిలేసి వెళ్లిపోయాడు. యువతే భావిభారత నిర్మాణానికి పునాదులని దేశంలో యువతిని తన సమ్మోహ నయనాలతో గొప్ప సూక్తులను ఉపదేశించి చైతన్యం దిశగా నడిపారు. ఆ క్రమంలో ఎన్నో సందేశాలను ప్రవచించారు. ప్రతి పౌరుడు హృదయంలో చెరగని సంతకంగా నిలిచిపోయారు. ఒకసారి వివేకానందున్ని చదువుదాము.  కాలం మారింది, సామాజిక పరిస్థితులు మారాయి పాశ్చాత్య పోకడలు నవీన నాగరికతను నిర్వచిస్తున్నాయి. ఈ సమయంలోనే మనం తరం జాగృతం కావాలి " బలమే జీవనం - బలహీనతే మరణం" (strength is life - weakness is death) అంటారు వివేకానంద. ప్రకృతి ఉపద్రవాలు వైపరీత్యాలు, మనిషి ఉనికినే ప్రశ్నిస్తున్న కరోనా లాంటి వాటిని దీటుగా ఎదుర్కొని నిలబడాలంటే ఇప్పుడు మానిసికంగా ఎంతో బలపడాల్సి ఉంది. బలహీనతల్ని ఐక్యతతో ఎదుర్కోవాల్సి ఉంది. ఇంకా ఆర్ధిక అసమానతలతో నిరుద్యోగ యువత కి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి అదే బలహీనతగా దారి తీసి చీకటి అగాధంలోకి జారిపోయి ఆత్మ త్యాగాలను చేసే ఎంతోమంది అమాయక యువతను మానసికంగా శారీరకంగా బలమే జీవనం అని హెచ్చరిస్తారు వివేకానంద. ఇంకో సందర్భంలో  " ఎవరైతే తనని తాను విశ్వసించడో వాడే పెద్ద నాస్తికుడు" అంటారు. ప్రస్తుతం యువత ఆస్థికతకు నాస్తికతకు మధ్య ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు. అయితే కాల గమనంలో కొంతమంది సూడో మేధావితనాన్ని ఆపాదించుకొని దేవుడు- నమ్మకం గురించి అనవసర చర్చలు జరిపి దేశ యువతిని భారతీయతకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీనిద్వారా కల్పిక నాస్తికతపై ఎక్కువ చర్చ జరిగి యువ సమాజం అయోమయంలో పడిపోతుంది. దేవుడికంటే ముందు నిన్ను నువ్వు నమ్ము అంటాడు వివేకానంద. ఇలా ప్రతి సంక్షోభానికి వివేకానందను చదివితే పరిష్కారం దొరుకుతుంది. మనసు ప్రశాంతత పొందుతుంది. ఇలా తన జ్ఞాన తేజస్సుతో స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటల్ని మూటకట్టి విజ్ఞాన బాండాగారాన్ని మనకోసం వదిలేసి వెళ్లిపోయారు. అందుకే ఆయన చెప్పిన మాటలు నిత్యం మనం స్మరణం చేసుకుంటే చాలు. నిరాశ నిస్తేజం కి చోటు ఉండదు. - వెంకటేష్ పువ్వాడ   

మన గమనం ఎలా ఉండాలి?

జీవితం తెల్లని కాగితం లాంటిది. అందమైన రంగులతో చక్కగా మలుచుకుంటే గొప్పగా ఉంటుంది. కాదని కుదురైన ఆలోచనలు లేక పిచ్చి గీతలు గీసుకుంటే అర్ధం లేకుండా ఉంటుంది. పాశ్చాత్య పోకడలు మన నవీన నాగరికత పై తద్వారా యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది కాదనలేని నిజం. పదవ తరగతి పూర్తయిన విద్యార్థి నుంచి డిగ్రీ విద్యార్థి వరకు తర్వాత ఏం చదవాలి ఎలా ముందుకు వెళ్లాలి అని స్పష్టమైన అభిప్రాయం లేని ఎంతోమందిని మన చుట్టూ చూస్తున్నాం. నిర్దిష్టమైన ఆలోచనలు లేకపోవడమే దీనికి కారణం.  స్థిరత్వం కావాలి... ఒక పని లేదా ఒక అంశాన్ని ఎంచుకొన్నపుడు అందులో ఎదో చిన్న సమస్య ఎదురైందని, అయ్యో! ఇది తీసుకోకుంటే బాగుండు ,ఇది ఎంచుకోకుంటే బాగుండు అనే ఆలోచనలు రానివ్వడం ద్వారా మనిషికి తన మీద ఉన్న తన నమ్మకం తెలీకుండా సడలిపోతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బద్దకం. ఇది  స్కూల్ స్థాయి నుంచే అలవడటం ప్రమాదం. ఉదాహరణ గా చెప్తే ఒకసారి రాయడం ద్వారా పది సార్లు చదివినట్లు అని చెప్తారు. చెప్పడం కాదు నిజం. అయితే ఇప్పుడు విద్యావ్యవస్థలో నోట్స్ రాసే విద్యార్థులు ఎంతమంది. ఆ స్థానంలో జిరాక్స్ లు వచ్చాయి. శ్రమ లేని చదువు మత్తుని ఇస్తుంది కానీ మనో నిబ్బరాన్ని ఇవ్వలేదు. దీని వలనే ఈరోజు యువత చిన్న కష్టానికే తన పనిని, వృత్తిని, చదువుని పదే పదే మార్చుకుంటూ స్థిరత్వం కోల్పోతున్నాడు. "సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్ధించకు. ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకొని నిలబడే శక్తి కోసం ప్రార్ధించు" అంటాడు బ్రూస్లీ. వీలైనంత వరకూ బద్దకానికి దూరంగా ఉండి పోరాడే శక్తిని అలవరుచుకోవడం ఉత్తమం. ఆ విధంగానే మన విద్యా వ్యవస్థ ఉండాలి. అప్పుడే జీవితం కాన్వాస్ పై రంగు కలల అడుగులు పడతాయి. - వెంకటేష్ పువ్వాడ

హాయ్ బ్రో! - నేను క్షేమమే!

హాయ్ బ్రో! నేను క్షేమమే! ఈ మాటల్ని చూడగానే రెండు వేరు వేరు కాలాలను కలిపి ముడేసినట్లు ఉంది కదా! పాత రోజుల్లో ఎవరికైనా సమాచారాన్ని చేరవేయడానికి జాబులు రాసేవారు. ఇంకా కొంచెం ఎక్కువ విషయం అయితే ఇంగ్లాండ్ కవర్ లో రాసేవారు. అనురాగలను, అభిమానాలను హృదయం పై "ఉభయకుసులోపరి" అంటూ అచ్చేసుకొని మనిషి మమతల్ని ఆవిష్కరించేవి ఆనాటి ప్రత్యుత్తరాలు.  "నేను క్షేమమే! మీరు క్షేమమే అని తలుస్తున్నా!" " నాన్న గారికి నమస్కరిస్తూ! వ్రాయునది" "పెద్దలకు హృదయపూర్వక సుమాంజలి" ఇలాంటి తొలి తొలి మాటల్లోనే ఎంతటి ద్వేషాన్ని అయినా కరిగించి ప్రేమను కురిపిస్తాయి. అలాంటి మనసు తడి అక్షరాలను మోసుకొచ్చే ఆనాటి జాబు ముక్కలు, తోక లేని పిట్టలు ఈరోజు ఎక్కడ?  కాల గమనంలో  కనుమరుగయ్యాయి.  కాలం మారింది ~~~~~~~~ ఇప్పుడు యువత స్మార్ట్ ఫోన్ సాక్షిగా తోకా, పిట్టా రెండూ లేని సమాచారాలు, సందేశాలు గాల్లో తిరుగుతున్నాయి. అక్షరాలు తేలిక అయిపోయాయి. వాట్సప్, ఫేస్బుక్ మెస్సెంజర్స్ ,టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్ లలో  కొన్ని వందల సందేశాలను పంపిస్తున్నారు. సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. కానీ మాటలు ముక్కలై పోతున్నాయి. "హాయ్ బ్రో హౌ ఆర్ యూ" "హాయ్ సిస్ ఎలా ఉన్నావ్" ఇలా మొదలై రాత్రి భోజనం వరకూ మాట్లాడుకుంటారు. సగం సగం మాటలు. షార్ట్ అండ్ కోడ్ సంభాషణలతో షార్ట్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయినట్లు ప్రేమలు కూడా ఎగిరిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కూడా వృధా చేస్తున్నారు నేటి యువత. ఎదురెదురు కలిసిన మిత్రులను విష్ చేసుకోలేక వాట్సాప్ లో మాట్లాడే వాళ్లని చూస్తున్నాం. మానవ సంబంధాలు ఈ తీరుగా మారడానికి కారణాన్ని ప్రశ్నించుకోవాలి. చాటింగ్ భూతాన్ని కంట్రోల్ చేసుకుని యువత వాస్తవిక ప్రపంచంలోకి రావాలి. గతాన్ని వర్తమానాన్ని కలిపి ముడి వేయండి. తోకలేని పిట్టల్ని పట్టుకు రండి తల్లిదండ్రులకు ,మిత్రులకు మనసారా ఓ ఉత్తరం రాసి చూడండి. జీవితం కొత్తగా ఉంటుంది. - వెంకటేష్ పువ్వాడ

ఇలా చేస్తే భయం కాస్తా పారిపోతుంది

ఏం జరగబోతోందో అన్న అనుమానమే భయానికి దారితీస్తుంది అంటారు పెద్దలు. మనలో ఏర్పడే భయాలు కొంతవరకూ సహేతుకమే కావచ్చు. ప్రమాదాల నుంచి పరాజయాల నుంచి మనల్ని కాపాడవచ్చు. కానీ చీటికీ మాటికీ భయపడుతూ కూర్చుంటే జీవితమే ఒక జాగ్రత్తగా మారిపోతుంది. అందుకనే భయాలను దాటినవారికే విజయం లభిస్తుందని చెబుతుంటారు నిపుణులు. మరి ఆ భయాలను దాటేందుకు వారు ఇచ్చే సలహాలు...   భయాన్ని పసిగట్టండి మెదడులో అసంకల్పితంగా ఏర్పడే భయం తన ప్రభావాన్ని శరీరం మీద చూపి తీరుతుంది. ఆ లక్షణాలను పసిగట్టే ప్రయత్నం చేస్తే... మనలో ఉన్న భయం అవసరమా కాదా అని తర్కించే అవకాశం దొరుకుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, తల దిమ్మెక్కిపోవడం, చెమటలు పోయడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది... లాంటి లక్షణాలు ఏర్పడిన వెంటనే, వాటికి భయమే కారణమేమో గమనించాలి.   అలవాటు చేసుకోండి ఇదివరకు ఎప్పుడూ చేయని పని అనుమానానికి దారితీస్తుంది. ఆ ఆనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది. కాబట్టి మీకు భయం కలిగిస్తున్న పనిని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ భయం నిర్హేతుకం అని తేలిపోతుంది. పరీక్షలంటే భయముంటే మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి, కొత్త వ్యక్తులను కలవడంలో భయం ఉంటే చొరవగా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి.   భయపడే పని చేసేయండి ఒక పని చేయాలంటే మీకు చాలా భయం. కానీ ఆ పని విజయవంతం అయితే మీ జీవితమే మారిపోతుందని తెలుసు! అలాంటప్పుడు భయపడుతూ కూర్చుంటే లాభం లేదు కదా! ఒక్కసారి గుండెని అదిమిపట్టి అనుకున్న పనిని చేసేయండి. శరీరాన్ని ముందుకు దూకించండి. ఉదాహరణకు మీకు ఇంటర్వ్యూ అంటే భయం. కానీ ఫలానా కంపెనీలో మీలాంటివారికి ఉద్యోగం ఉందని తెలిసింది. వెంటనే మీ రెజ్యూమ్ని తీసుకుని ఆఫీసుకి చేరిపోండి. ఆ తర్వాత ఎలాగూ ఇంటర్వ్యూని ఎలాగూ ఎదుర్కోక తప్పదు.   తాత్సారంతో లాభం లేదు భయపడే పనిని వాయిదా వేసి, ఆ భయం నుంచి తాత్కాలికంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా పని మరింత క్లిష్టతరం అయిపోతుంది. దాంతో భయమూ అంతకంతకూ పెరిగిపోతుంది. కాబట్టి వాయిదా వల్ల హాని తప్ప ఉపయోగం లేదు. అందుకనే అనుకున్న పని పూర్తిచేయడానికి కొన్ని నిర్దిష్టమైన డెడ్లైన్స్ పెట్టుకోండి. పని చేయబోతున్నానని ఇతరులతో ఒప్పేసుకోండి. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాధ్యతని తలకెత్తుకోండి.   చిన్నపాటి టెక్నిక్స్ పాటించండి భయాన్ని ఎదుర్కోవడానికి చాలా చిట్కాలే ఉన్నాయి. వాటిలో మీకు అనువుగా ఉండేదాన్ని ఎన్నుకోండి. ఊపిరి నిదానంగా పీల్చుకుని వదలడం, ఉద్వేగంతో బిగుసుకుపోయిన కండరాల మీద ధ్యాస నిలపడం... లాంటి చిట్కాలు చాలావరకూ సాయపడతాయి. - నిర్జర.  

ప్రపంచం చుట్టుతా ఓ రహదారిని నిర్మిస్తే...!?

భూమి గుండ్రంగా బంతి ఆకారంలో ఉందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఓ భూగోళాన్ని చుట్టివచ్చే ప్రయత్నం చాలామంది చేశారు. అయితే ఈ ప్రపంచం చుట్టుతూ ఒక రహదారిని నిర్మిస్తే ఎలా ఉంటుంది. భూమికి అడ్డంగా, భూమధ్య రేఖ వెంట ఒక పొడవైన రహదారిని ఉన్నట్లుగా ఊహించుకోండి.. ఇప్పటికైతే భూమధ్యరేఖ వెంట అలాంటి రహదారి లేదు. కానీ, నిర్మిస్తే ఎలా ఉంటుంది..?   అయినా భూమిపై అంత పొడవైన రహదారిని ఎలా నిర్మిస్తాము? దీని పైన ప్రయాణించాలంటే ఎంత సమయం పడుతుంది?  పర్యావరణానికి ఇది నష్టం చేస్తుందా ? ఒకవేళ ఇలాంటి రహదారిని నిర్మించినట్లయితే ఎలా ఉంటుంది. అది తెలియాలంటే కొన్ని విషయాలు మనం పరిశీలించాల్సిందే. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల రోడ్లు కలిసి 64 మిలియన్ కిమీ (40 మిలియన్ మైళ్ళు ఉన్నాయని ఓ అంచనా. కానీ వీటిలో ఏ ఒక్క హైవే నెట్‌వర్క్  కూడా మిమ్మల్ని న్యూయార్క్ నుండి నేరుగా కేప్ టౌన్‌కు తీసుకెళ్లదు. కానీ మనం ఊహిస్తున్న రోడ్డు నిర్మాణం మనల్ని  కొలంబియా నుండి ఇండోనేషియాకు సులభంగా తీసుకువెళుతుంది. ఇప్పటికే ఉన్న కొన్ని రహదారి వ్యవస్థలతో అనుసంధానం చేసుకుంటే సులభంగా ప్రయాణించవచ్చు.  ఇది ఉహించడానికి బాగున్నా నిర్మాణం చేయాలంటే చాలా ఖరీదైన ఇంజనీరింగ్ ప్రక్రియ వలనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ రహదారిని ఎక్కువ భాగం నీటి అడుగున నిర్మించాల్సి ఉంటుంది. పైగా దీన్ని నిర్మించడానికి సగటున ఐదు నుండి పది సంవత్సరాలు పడుతుంది. కానీ దీన్ని ఏదో  రహదారిని నిర్మించినట్లుగా నిర్మించలేం. 40,000 కిలోమీటర్ల పొడవైన రెండు లేన్ల ఈక్వటోరియల్ రహదారిని సాధారణ రహదారి వలె ఒకే సమయంలో వివిధ భాగాల్లో నిర్మించాల్సి  ఉంటుంది. అన్నీ ప్రాంతాల్లో ఒకే సమయంలో ఈ నిర్మాణం చేపట్టాలి అంటే సుమారు 8 మిలియన్ల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు పనిచేయాలి. ఇందుకోసం 9.2 ట్రిలియన్లు డబ్బు ఖర్చు అవుతుంది. మరీ, ఈ రహదారిపై ప్రయాణించడం ఎలా ఉంటుందనేగా..? చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. భూమధ్యరేఖ వెంబడి 13 దేశాలను చుడుతూ, మూడు మహాసముద్రాల గుండా వెళుతుంది ఈ రహదారి. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో ప్రారంభమై, కొలంబియా ద్వారా బ్రెజిల్‌కు తూర్పున ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం, అధిక టెంపరేర్లను చవిచూడాల్సి  ఉంటుంది కాబట్టి  యాత్రకు బయలుదేరే ముందు కారు ఎయిర్ కండిషనింగ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చూసుకొని బయలుదేరితే మంచిది. ఈ ప్రయాణం పర్వతాల గుండా, అమెజాన్ నది మీదుగా సాగుతుంది. ఒకవేళ ఈ మార్గంలో రిఫ్రెష్ కోసం ఈతకొట్టాలని అనుకుంటే అమెజాన్ నదిలో ఈతకు వెళ్ళవచ్చు. అమెజోనియన్ లో సాహసాలు చేయవచ్చు. ఆ తర్వాత బ్రెజిల్, అట్లాంటిక్ తూర్పు తీరం వెంట టన్నెల్ లో ప్రవేశిస్తారు. ఈ గొప్ప అనుభూతిని సొంతం చేసుకోవాలంటే అట్లాంటిక్ సముద్రపు అడుగున నిర్మించిన టన్నెల్ లో ప్రయాణం సాగించాల్సి  ఉంటుంది. ఇక్కడ ప్రయాణం కాస్త మందకొడిగా సాగుతుంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆఫ్రికా ఖండంలోని భూమిని చూడటం సాధ్యమవుతుంది.  సవన్నాల ద్వారా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. గబన్' కాంగో చిత్తడి నేలలు' దట్టమైన వర్షారణ్యం, కెన్యా  , సోమాలియా ఎడారుల గుండా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో ఏనుగులను చూడవచ్చు. గొరిల్లాస్, గేదెలు, చిరుతపులు తారసపడతాయి. ఈ ప్రయాణం  అట్లాంటిక్ మహా సముద్రం లోని సొరంగం ద్వారా సాగిన సుదీర్ఘ ప్రయాణం కంటే కూడా కాస్త ఎక్కువనే ఉంటుంది.  ఆ తర్వాత మరో టన్నెల్ లో ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సారి భారతీయ సొరంగా మార్గం గుండా ప్రయాణించాలి. ఆ తర్వాత మళ్ళీ  ఇండోనేషియాలో భూమి కనిపిస్తుంది. ఇక్కడ  భూమధ్యరేఖ చుట్టూ 17000 ద్వీపాలు చెల్లాచెదురుగా కనిపిస్తాయు. ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి వెళ్ళడానికి చిన్న చిన్న సొరంగాల గుండా ప్రయాణం చేయాలి. సొరంగం నుండి భూమిపైకి వచ్చిన ప్రతిసారీ గంభీరమైన దృశ్యాలు కనిపిస్తాయి. అగ్నిపర్వతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వరి పొలాలు, ఉష్ణమండల వర్షారణ్యాలు కనిపిస్తూ ప్రయాణాన్ని అద్భుతంగా మారుస్తాయి. ఈ లాంగ్ డ్రైవ్ లో బీచ్‌ లో ఎంజాయ్ చేయొచ్చు కూడా.  ఆ తర్వాత గ్రేట్ పసిఫిక్ సముద్రంలో నిర్మించిన సొరంగా మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది మూడు రెట్ల ప్రయాణం అనుకోవచ్చు. సుదీర్ఘంగా సాగే ఈ ప్రయాణం మొత్తం నీటి అడుగునే సాగుతుంది. ఆ తర్వాత ఉత్తేజపరిచేందుకు అన్నట్లుగా అద్భుతమైన గాలాపాగోస్ దీవులు దర్శనమిస్తాయి. ఇక్కడే జీవ పరిణామానికి చెందిన అనేక జంతు జీవజాలాలను, అసాధారణమైన జీవిత రూపాలను చూడవచ్చు. ఈ లాంగ్ డ్రైవ్ కన్నులపండుగ అనే  చెప్పవచ్చు. ఆ తర్వాత చివరకు చిన్న నీటి అడుగున సొరంగం మార్గం ద్వారా మీరు కొంచెం దూరం వెళ్లితే  ప్రయాణం ప్రారంభమైన ఈక్వెడార్‌లోనే  మీ లాంగ్ వరల్డ్ టూర్ ముగుస్తుంది.  గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా ఈ భూగోళం చుట్టూ ప్రయాణించడానికి 400 గంటల సమయం పడుతుంది. లేదా 17 రోజుల 17 గంటల సమయం అవుతుంది. ఇందులో దాదాపు 12 రోజులు సముద్రపు అడుగున సొరంగంలో ప్రయాణిస్తూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ కొన్ని దృశ్యాలను ఆస్వాదిస్తూ ఉండిపోతారు.  ఈ మొత్తం ప్రయాణ ప్రశాంతంగా, ఆస్వాదిస్తూ  సాగాలంటే మీకు ఓ రెండు నెలల సమయాన్ని కేటాయిస్తే తప్ప సాధ్యం కాదు.  కానీ ఈ ఆలోచన చూడటానికి, వినటానికి బాగున్నా భూ గ్రహంపై అధిక వేడికి కారణం అవుతుంది. రహదారి నిర్మాణం కోసం భూమిపైన, సముద్రంలోపల పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. అది కాకుండా ఈ యాత్రలో మీరు కారు  సగటున సంవత్సరంలో విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ల కంటే కూడ దాదాపు రెండు రెట్లు ఎక్కువ విడుదల చేస్తుంది.  భూమధ్యరేఖ గుండా సాగే ఈ ప్రయాణం మనం ఎప్పటికీ చూడలేమేమో కానీ ఈ మార్గం గుండా ఎగిరే కార్లను నిర్మించడం సాధ్యమవుతుందేమో  చూడాలి.

ఒకవేళ మీరు 10 వేల సంవత్సరాలు ముందుకెళ్తే ఏం జరుగుతుంది?

భూమి ఏ రకంగా కనిపిస్తుంది? భూభాగం అంత అగ్నిపర్వతాలతో నిండిపోతుందా? లేక మంచులో గడ్డకట్టుకుపోతుందా? ఒకవేళ భవిష్యత్తులో మీరింకా ఒక మిలియన్ ముందుకెళ్తే ఏం జరుగుతుంది?సముద్రాలన్నీ ఆవిరైపోతాయా? లేక ప్రపంచం అంత నీటిలో మునిగి పోతుందా? అసలేం అవుతుంది?   సరే ఇపుడు మనం ఒక బిలియన్ సంవత్సరాల ముందుకెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. అపుడు మనుషులెవరైనా మిగిలి ఉంటారంటారా? వున్నా వాళ్ళు ఇంకే ఇతర గ్రహాల మీదో సెటిల్ అయి ఉంటారంటారా? ఏమైనా అవ్వచ్చు. ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత మీకు ఎదురుపడిన వ్యక్తులెవరైనా మీ ముందుకొచ్చి మాట్లాడటం అనేది బహుశ చాలా అరుదై ఉండొచ్చు.   ఒక బిలియన్ సంవత్సరాల వరకు మనం జీవించాలి అంటే ఎన్నో రకాల ఆటంకాలని ఎదురుకోవాల్సి ఉంటుంది, వాటన్నింటిని తట్టుకొని బతకాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఈ కరోనా మహమ్మారిలో మనం ఆల్రెడీ చాలా చూసాం. చాలా ఎదుర్కొని, బతకడానికి ఎంత కష్టపడాలి అనేది నేర్చుకున్నాం. అలాగే మనం భవిష్యత్తులో రాబోయే వాతావరణ మార్పులకి కారణంగా జరిగే విద్వాంసాలని, పెరిగిన జనాభా వాళ్ళ వచ్చే సమస్యలని, గ్లోబల్ న్యూక్లియర్ వార్ ని, ఆస్టరా యిడ్స్ ఇలా అనేక రకాల విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకోగలమా?   సూర్యుడు రోజు రోజుకి వేడెక్కి పోతున్నాడు, మంచుకరిగిపోతుంది, సముద్రాల మట్టం పెరిగిపోతుంది  వీటన్నింటిని మనం భవిష్యత్తులో ఎలా తట్టుకోబోతున్నాం??   భవిష్యత్తులోకి ఒకసారి వెళ్ళి చూద్దాం... కేవలం పది వేల సంవత్సరాల ముందుకెళ్ళి చూద్దాం..... మనం  "deca- millennium bug" అనబడే ఒక పెద్ద సమస్యని ఎదుర్కోబోతున్నాం. 10 వేల సంవత్సరాల లో సాఫ్వేర్ నాలుగు దశాంశాలు మించి డెట్స్ ను చుపించదు.   Y2k గుర్తుందా?? హ.... ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్నంత భయం మాత్రం లేదనే చెప్పాలి అపుడు. 10 వేల సంవత్సరాలలో bright side ని చూస్కుంటే,మనుషులలో అపుడు జన్యు సంబంధిత మార్పులు -గుర్తులు బహుశ ప్రాంతీయ పరంగా ఉండకపోవచ్చు. మనిషి చర్మము -వెంట్రుకల కలర్ కూడ ప్రపంచమంత విస్తరించి ఉండొచ్చు. బహుశ అది మనందరినీ ఒక్కటిగా కలపడానికి సహాయ పడుతుంది.   20 వేల సంవత్సరాల తరవాత......? ఇపుడున్న భాషలేవి అపుడు వాడుకలో ఉండకపోవచ్చు. భవిష్యత్తులో మాట్లాడబోయే భాష బహుశ 1శాతం ఒక కోటి పదజాలం తో ఉండొచ్చు.   50 వేల సంవత్సరాల తర్వాత......? భూమి ఒక గడ్డకట్టుకు పోయిన పదార్థంలా మారోచ్చు, ఒక కొత్త మంచు సంవత్సరం అక్కడ ప్రారంభం అవుతుంది. నయగర జలపాతాలు క్షిణించి  ఏరిక్ సరస్సులోకి పూర్తిగా చొచ్చుకు పోయి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో భూమిపై పూర్తి రోజు కూడా పెరుగుతుంది. కార్యకలాపాలకు ఎక్కువ సమయం ఉంటుంది.   250,000 సంవత్సరాల తర్వాత..? ఇహి అగ్నిపర్వతం నీటి పైకి లేచి హవాలిలో కొత్త ద్వీపం ఏర్పడుతుంది.   500,000 సంవత్సరాల తర్వాత..? కిలోమీటర్ (0.62 మైళ్ళు) కంటే ఎక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఉంది. గ్రహం అంతటా మంటలను సృష్టిస్తుంది. గాలి పీల్చుకోవడానికి కూడా లేకుండా చేస్తుంది. అదీ సరిపోలేదా అయితే ముందు ఉందిగా..?   1, 000,000 సంవత్సరాల తర్వాత..? మరొక సూపర్ వోల్కానో విస్ఫోటనం సంభవిస్తుంది. 3,200 క్యూబిక్ కిలోమీటర్ల బూడిదను బయటకు పంపేంత పెద్దది. ఇది 70,000 సంవత్సరాల క్రితం మన మానవాళిని దాదాపుగా తుడిచిపెట్టిన టోబా విస్ఫోటనం మాదిరిగానే ఉంటుంది. ఈ సమయానికి సూపర్నోవాలో పేలిపోతుంది, ఇది పగటిపూట కూడా భూమి నుండి కనిపిస్తుంది.   2,000,000 సంవత్సరాల తర్వాత..? సౌర వ్యవస్థలో మానవాళి స్థావరాలు ఉంటాయి. వివిధ గ్రహాలపై జనాభా వేరుగా ఉంటే, మానవులు వారి నిర్దిష్ట ప్రపంచానికి అనుగుణంగా ఇతర జాతులుగా పరిణామం చెందుతారు.   10,000,000 సంవత్సరాల తర్వాత..? తూర్పు ఆఫ్రికాలో చాలా భాగం విచ్ఛిన్నమవుతుంది. కొత్తగా మహాసముద్ర బేసిన్ ఏర్పడుతుంది. 50 మిలియన్ సంవత్సరాలలో, ఆఫ్రికా యురేషియాతో ఢీకొంటుంది. మధ్యధరా సముద్రాన్ని మూసివేస్తుంది. రెండు భూభాగాల మధ్య కొత్త పర్వత శ్రేణి ఏర్పడుతుంది. ఈ పర్వత శ్రేణిలో ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తైన పర్వతం ఉండవచ్చు. అంతరిక్షంలో, మార్స్, దాని ఉపగ్రహంతో ఢీకొంటుంది. దీని ఫలితంగా సాటర్న్ వంటి శ్రేణి వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.   60,000,000 సంవత్సరాలు తర్వాత..? కెనడియన్ , అమెరికన్ రాకెట్లు పూర్తిగా క్షీణించాయి.   80 మిలియన్ సంవత్సరాల తర్వాత..? అన్ని హవాయి ద్వీపాలు నీటి కిందకు వెళ్లిపోతాయి.   100 మిలియన్ సంవత్సరాల తర్వాత..? 66 మిలియన్ సంవత్సరాల కిందట  డైనోసార్లను చంపిన మాదిరిగానే ఒక గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఉంది. అది 10 కి.మీ వెడల్పు ఉంటుంది.   250 మిలియన్ సంవత్సరాల తర్వాత..? భూమి  ఖండాలన్నీ పాంగేయా లాగా కలిసిపోతాయి. ఈ సమయంలో దీనిని పాంగేయా అల్టిమా అంటారు. కానీ 400-500 మిలియన్ సంవత్సరాలలో పాంగే అల్టిమా మళ్లీ వేరు అవుతుంది.   500-600 మిలియన్ సంవత్సరాల తర్వాత..? భూమి నుండి 6500 కాంతి సంవత్సరాలలో దూరంలో గామా కిరణం విస్ఫోటనం సంభవిస్తుంది. అది భూమిని తాకితే అది ఓజోన్ పొరను దెబ్బతీయడమే కాకుండా సామూహిక విలుప్తానికి కారణమవుతుంది.   600 మిలియన్ సంవత్సరాల తర్వాత..? చంద్రుడు భూమికి దూరంగా ఉంటాడు. మొత్తం సూర్యగ్రహణాలు ఇకపై సంభవించడం ఉండదు. సూర్యునిపై పెరుగుతున్న ప్రకాశం భూమిపై ఉష్ణోగ్రతను పెంచుతుంది, ఇది ప్లేట్ టెక్టోనిక్స్ కదలికను నిలిపివేస్తుంది.   800 మిలియన్ సంవత్సరాల తర్వాత..? కార్బన్ డయాక్సైడ్ స్థాయి గణనీయంగా పడిపోతుంది. కిరణజన్య సంయోగక్రియ ఇకపై సాధ్యం కాదు. ఆక్సిజన్ , ఆక్సోన్ వాతావరణం నుండి అదృశ్యమవుతాయి. సంక్లిష్టమైన జీవిజాతి చనిపోతుంది.   చివరకు, 1000 మిలియన్ సంవత్సరాల తర్వాత..? సూర్యుని ప్రకాశం 10శాతం పెరుగుతుంది. భూమిపై సగటు ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియాస్ అవుతుంది. మన వాతావరణం తడిగా ఉన్న గ్రీన్ హౌస్ లాగా ఉంటుంది. మహాసముద్రాలు ఆవిరైపోతాయి, ప్రతి ధ్రువాల వద్ద కేవలం నీటి చెలిమెలు మిగిలిపోతాయి. మీరు మీ టైమ్ మెషీన్లో ఇక్కడకు చేరుకుంటే, మీరు గుర్తుంచుకున్నట్లుగా కనిపించని గ్రహం ఉంటుంది. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. మానవ జాతి అంతరించి పోతుంది. ఆశాజనక, మంచి జీవితాన్ని మరికొన్ని దూర గ్రహం మీద గడుపుతోంది. తీవ్రమైన వేడి, నీరు లేకపోవడం ,  గాలి లేకపోవడం వల్ల భూమి నివాసయోగ్యంగా ఉండదు. కాబట్టి మీరు ఎక్కువసేపు ఉండలేదు. దానికి బదులుగా మీరు మిగిలిన సౌర వ్యవస్థను చూడటానికి బయలుదేరాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ, మీ తోటి మానవులను లేదా ఇతర రకాల తెలివైన జీవవులను కనుగొంటారు. కానీ అది మరొక కథ.

ఎలా స్పందిస్తారో మీ ఇష్టం!

అనగనగా ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నిబ్బరంగా సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. కానీ కూతురు మాత్రం ప్రతి చిన్న కష్టానికీ కంగారుపడిపోయేది. ఏం చేయాలో పాలుపోక తెగ బాధపడిపోయేది. ‘ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కాదమ్మా!’ అని ఓ రోజు తన తల్లితో తెగేసి చెప్పింది కూతురు. తల్లి, కూతరి వంక ఒక్క నిమిషం చూసింది. ఆ తరువాత మారుమాట్లాడకుండా ఆమెను వంటింట్లోకి తీసుకువెళ్లింది. తల్లి తనకేం చెప్పాలనుకుందో తెలియని అయోమయంలో కూతురు ఆమెను అనుసరించింది.   వంటింట్లోకి వెళ్లిన తల్లి ఒక మూడు పాత్రలు తీసుకుంది. ఒకదానిలో బంగాళదుంప, మరోదానిలో కోడిగుడ్డు, ఇంకోదానిలో కాఫీ గింజలు వేసి వాటిని పొయ్యి మీద పెట్టింది. తల్లి చేస్తున్న పని చాలా అసంబద్ధంగా తోచింది కూతురికి. అయినా మారు మాటాడకుండా చూస్తూ నిల్చొంది. ఒక పది నిమిషాలు అయిన తరువాత... ‘ఒకో గిన్నెలో ఏం జరిగిందో గమనించు’ అంటూ అడిగింది తల్లి. ‘గమనించడానికి ఏముంది! బంగాళదుంప వేడి నీటికి మెత్తబడిపోతుంది. కోడిగుడ్డు గట్టిపడిపోతుంది. కాఫీ గింజలతో కాఫీ తయారవుతుంది’ అంది కూతురు ఎగతాళిగా. ‘కదా! పైకి గట్టిగా కనిపించే బంగాళదుంప కాస్త వేడినీరు తగలగానే ఇట్టే మెత్తబడిపోయింది. చేయి తగిలితే చాలు చితికిపోయే కోడిగుడ్డేమో వేడినీటికి గట్టిపడిపోయింది. ఇక కాఫీ గింజలు మాత్రం తన చుట్టూ ఉన్న నీటిని తన ఉనికితో నింపేశాయి,’ అని చెప్పుకొచ్చింది తల్లి. తల్లి చేసిన వింత చేష్ట వెనుక ఏదో మంచిమాట దాగి ఉంటుందని అప్పటికి అర్థమైంది కూతురికి.   ‘మనం కూడా ఇంతే! అప్పటివరకూ ధైర్యంగా ఉన్నవారు కూడా కష్టాలు రాగానే ఇట్టే డీలా పడిపోతారు.. ఆ బంగాళదుంపలా. మరికొందరేమో కష్టాలు ఎదురయ్యేసరికి మొద్దుబారిపోతారు. అప్పటివరకూ సున్నితంగా ఉన్నవారు కూడా రాయిలా మారిపోతారు- కోడిగుడ్డులా. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కష్టాలకు ఎదురీదుతారు. ఆ కష్టాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. వాళ్ల స్వభావంతో, వారి చుట్టూ ఉన్న వాతావరణమే పూర్తిగా మారిపోతుంది... కాఫీ గింజల్లాగా! ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు?’ అని అడిగింది తల్లి. కూతురు మారు మాట్లాడకుండా చిరునవ్వుతో కాఫీని ఒక రెండు కప్పుల్లోకి సర్ది, ఒకదాన్ని తన తల్లికి అందించింది. మరోదాన్ని తను ఆస్వాదించేందుకు సిద్ధపడింది... జీవితాంతం!   - నిర్జర.

తెల్లవారికి చెప్పమంది బాయ్ బాయ్....

తెల్లవారికి చెప్పమంది బాయ్ బాయ్.... ఆమెవరో కాదండీ ఝాన్సీ లక్ష్మీబాయి.... అంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతీ భారతీయుడు ఆమెను తలుచుకున్నారు. అంతటి వీర నారి ఆమె. బ్రిటీష్ వారిపై భారతీయుల పోరాట స్ఫూర్తికి...అక్షరాల ఆమె మూర్తి... వారణాశిలో మోరాపంత్ ధాంబే గారికి జన్మించారు. మణికర్ణిక అనేది ఆమె చిన్ననాటి పేరట. అప్పట్లో చిన్న మరాఠా సంస్ధానమైన ఝాన్సీ పరిపాలకుడు రాజా గంగాధరరావుకు ఆమెనిచ్చి వివాహం చేశారు. పెళ్ళయిన తర్వాత ఆమె లక్ష్మీబాయిగా పేరుపొందారు. వారసులెవ్వరూ లేకుండానే గంగాధరరావు మరణించారట. చనిపోవటానికి ముందు దామోదర్ ను ఆయన దత్తత తీసుకున్నారు.  అప్పట్లో లార్డ్ డల్ హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉండేవారు. దామోదర్ ను చట్టబద్ధమైన వారసుడిగా, లక్ష్మీబాయిని రాజప్రతినిధిగా అంగీకరించడానికి డల్ హౌస్ నిరాకరించారు. దాంతో గొడవ మొదలైంది. ప్రతిఘటనలు, నిరసనలు ఎదురైనప్పటికీ ఝాన్సీ లక్ష్మీభాయ్ కి అయిదువేల రూపాలయ చిన్నమొత్తాన్ని భరణంగా ఇవ్వసాగారు. అయితే ఈ అగౌరవాన్ని, పరాయివారికి లోబడి ఉండడాన్ని రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ జీర్ణించుకోలేకపోయారు. సంస్ధానాన్ని వదిలిపెట్టకూడదనుకున్నారు.  అంతే ఆమె వారి మీద 1857 మే నెలలో తిరుగుబాటు చేశారు. ఝాన్సీ సంస్ధానమంతా రాణీ లక్ష్మీబాయిదే అధికారమని ప్రకటించారు. బ్రిటిష్ సేన దండయాత్రకుదిగితే  వారిని ఎదుర్కొని... గ్వాలియర్ కోటను లక్ష్మీబాయి తన అధీనంలోకి తీసుకుంది. అది చూసి గ్వాలియర్ మహారాజు కోట వదిలి పరిగెత్తాడు. ఆయన బలగాల్లో అత్యధికశాతం లక్ష్మీబాయి పక్షం వచ్చేసాయి. దెబ్బతిన్న బ్రిటిష్ వారు గ్వాలియర్ కోట మీద ఒక్కసారి దాడి చేశారు. లక్ష్మీ బాయ్ తీవ్రపోరాటం చేసినప్పటికీ ఆపోరులో మరణించింది. ఆ విధంగా తన ఇంటికి సుదూరప్రాంతంలో రాని అశువులు బాసింది. కానీ బ్రిటిష్ వారి మీద ఝాన్సీ లక్ష్మీ భాయి చూపిన ధైర్యసాహసాలు బలపరాక్రమాలు, సామర్ధ్యం భారతీయులెవ్వరూ ఎప్పటికీ మరిచిపోరు. ఆమె చిరస్మరణీయురాలు.  

పని మధ్యలో ఫేస్‌బుక్‌ చూస్తున్నారా!

  సోషల్‌ మీడియా ఒక వ్యసనం. కాకపోతే అది హద్దుల్లో ఉన్నంతవరకూ చాలా ఉపయోగం అనుకుంటూ ఉంటాము. అందుకే ఎంత పనిలో ఉన్నా మధ్యమధ్యలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్ లాంటి అకౌంట్లను పలకరిస్తుంటాం. ఇలా పని మధ్యలో వాటిని చూడటం వల్ల మనం రిలాక్స్ అవుతామన్నది మన ఉద్దేశం. ఇందులో నిజమెంత? ఒక సమయంలో ఒకే పని మీదే దృష్టి పెట్టినప్పుడు, మన మెదడు ఏకాగ్రతతో పనిచేస్తుంది. అలాకాకుండా ఏకకాలంలో నాలుగు రకాల పనుల మీదా దృష్టి పెట్టినప్పుడు దాదాపు 40 శాతం తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్నే మరోసారి రుజువుచేసే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ నాలుగు సినిమాలని 50 సెకన్ల పాటు ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. ఆ ముక్కల్ని కలగాపులగం చేసి జనాలకి చూపించారు. ఇలా చూస్తున్న సమయంలో వారి మెదడు ఎలా పనిచేస్తుందో స్కాన్ చేశారు. పరిశోధనలో రెండో దశలో సినిమాలని మరీ 50 సెకన్ల పాటు కాకుండా కనీసం 6.5 నిమిషాల నిడివి ఉండేట్లు కత్తిరించారు. వీటిని కూడా కలగాపులగం చేసి జనాలకి చూపించారు. 50 సెకన్ల ముక్కలు చూసినప్పటికంటే 6.5 నిమిషాల వీడియోలను చూసినప్పుడు ప్రేక్షకుల మెదడు సజావుగా పనిచేస్తున్నట్లు తేలింది. మెదడులో cerebellum వంటి భాగాలు ముక్కలు ముక్కలుగా చూసిన విషయాలను ఒకే ప్రవాహంలా (sequence) అల్లుకునే ప్రయత్నం చేస్తాయి. ఆ సీక్వెన్స్‌ని మాటిమాటికీ గజిబిజి చేస్తుంటే మెదడు మీద భారం తప్పదు. సాధారణంగా మనం నాలుగు రకాల పనులని ఒకేసారి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. దీని వల్ల సమయం కలిసి వచ్చినట్లు కనిపించిన్పటికీ... ఇలాంటి మల్టీ టాస్కింగ్‌ వల్ల నిజానికి పనులు మరింత ఆలస్యంగానూ, అసంపూర్ణంగానూ సాగుతాయట. ఈ సూత్రం సోషల్‌ మీడియాకు మరింత బాగా వర్తిస్తుంది. ఒకసారి ఏ ఫేస్‌బుక్కో ఓపెన్‌ చేశామనుకోండి.. అందులో ఒకరు ఏదో వార్తని పోస్ట్‌ చేస్తారు, ఇంకొకరు ఆట ఆడమని పిలుస్తారు, మరొకరు ఏదో పాటని అప్‌లోడ్‌ చేస్తారు... ఇలా రకరకాల పోస్టులు చూసుకుంటే వెళ్లేకొద్దీ మెదడు గజిబిజిగా మారిపోతుంది. పైగా మనం చేసే పని ఆపి మరి ఈ పోస్టులు చూడటం మొదలుపెడితే... అసలు పని మీద ఏకాగ్రత చెదిరిపోతుంది.   - నిర్జర.

విజయమే ప్రతీకారానికి సమాధానం

ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ! అన్న సుమతీ శతకంలోని పద్యం చిన్నప్పుడు మనం చదివాం. ఈ పద్యం అర్థం  మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి అని ఈ పద్యానికి అర్థం. ఈ కాలంలో అలాంటి వారు ఎవరుంటారు అని అనుకుంటాం. కానీ, మానవత్వం, మంచితనం ఉన్నవారు ఏ కాలంలోనైనా ఉంటారు. అయితే వారి సంఖ్య పరిమతంగా ఉండోచ్చు. ఎందుకంటే ఇది కలికాలం కదా.  సరే ఇక అసలు విషయానికి వస్తే..   వ్యాపార సంస్థల మధ్య పోటీ ఉంటుంది. కొన్నిసార్లు అది కాస్త పెరిగి ప్రతీకారంగా మారుతుంది. అయితే వ్యాపార ఒప్పందం కోసం పిలిచి అవమానపరిచిన ఒక సంస్థతో తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత నష్టాల్లో ఉన్న ఆ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసి తన ఔదార్యం చాటుకున్న పారిశ్రామిక వేత్త రతన్ టాటా.  ప్రతీకారం అంటే అందనంత ఎత్తుకు ఎదగడమే అని కొత్త అర్థం చెప్పారు. ఎదుటివారిపై పగ సాధించడం అంటే విజయం సాధించడమే అని నిరూపించారు. మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి అన్న సుమతీ శతకంలోని నీతిని అక్షరాల పాటించారు.    రతన్ టాటా భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో పరిచయం అవసరం లేని పేరు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా వంశంలో జన్మించారు. 1962లో టాటా స్టీల్ జంషెడ్ పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1868లో స్థాపించబడిన టాటా గ్రూప్ కు ఐదో చైర్మన్ గా  1991లో  జెఆర్‌డి టాటా నుంచి బాధ్య తలను స్వీకరించారు. అప్పట్లో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల టాటా గ్రూప్ ను అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థ స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సంస్థ టర్నోవర్ నేడు 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. టర్నోవర్‌లో 58 శాతం ఎగుమతుల ద్వారానే వస్తోంది. రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే ఇది. టాటా గ్రూపును ఆయన విదేశాలకు కూడా విస్తరింపజేశారు.   టాటా గ్రూప్‌లో మొత్తం 32 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ 8,882 కోట్ల డాలర్లు. మొత్తం షేర్ హోల్డర్ల సంఖ్య 38 లక్షలు. ఉద్యోగుల సంఖ్య 4.50,000. లిస్టెడ్ కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా పవర్, టాటా కెమికల్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా టెలీ, టైటాన్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియా హోటల్స్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. గ్రూప్ వ్యాపారం 80 దేశాలకు విస్తరించి ఉంది. 85 దేశాలకు టాటా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.   టాటా గ్రూప్ ఛైర్మన్ గా రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఆయనలోని వ్యాపార దక్షతకు, మానవీయతకు దర్శణం ఫోర్డ్ సంస్థతో జరిగిన ఒప్పందం. స్టీల్, కెమికల్, మోటార్స్ ఇలా అనేక ఉత్పత్తులను దేశీయంగా తయారుచేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పించిన  ఘనత రతన్ టాటాదే. భారతదేశంలో ట్రక్ ల తయారీలో అగ్రగామి టాటా మోటర్స్. వస్తువుల రవాణాకే పరిమితం కాకుండా  కార్లను కూడా తయారు చేయాలని సంకల్పించారు. అందుకు ఫలితంగా 1998 చివరి నాటికి టాటా ఇండికా అందుబాటులోకి తీసుకువచ్చారు. టాటా ఇండికా మొదటి స్వదేశీ మోడ్రన్ కారు. ఇది రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని నిజం చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఫలితంగా టాటా ఇండికా మార్కెట్ లోకి విడుదల చేశారు.  ఇది భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాత్మక అంశంగా మారింది. అయితే  కార్ల అమ్మకాలు ఆయన అంచనాకు తగ్గట్టుగా జరగలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ను వేరే మోటార్ కంపెనీ అమ్మాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. 1999లో ఫోర్ట్ కంపెనీ టాటా ఇండియా ప్రాజెక్ట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచింది. ముంబాయిలోని టాటా గ్రూప్ కార్యాలయంలో చర్చలు జరిపిన తర్వాత డెట్రాయిట్ లోని తమ ప్రధానకార్యాలయానికి టాటాగ్రూప్ చైర్మన్, ఇతర సభ్యులను ఆహ్వానించారు. రతన్ టాటా తన బృందంతో డెట్రాయిట్ లోని ఫోర్డ్ ఆఫీస్ కు చేరుకున్నారు. మూడు గంటల పాటు అక్కడ నిరీక్షించిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసిన ఫోర్డ్ కంపెనీ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ మీకు ఎం తెలుసని ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి ప్రారంభించారు. మీ కార్లను కొలుగోలు చేసి మీకు పెద్ద సహాయం చేస్తున్నాం అంటూ రతన్ టాటాతో వ్యాఖ్యానిస్తాడు. ఆ మాటలను అవమానకరంగా భావించిన రతన్ తమ కార్ల ప్రాజెక్టును అమ్మడం లేదని చెప్పి,  ఒప్పందం చేసుకోకుండానే తన బృందంతో తిరిగి ముంబాయి చేరుకుంటారు. అదే రోజు కార్ల తయారీ ప్రాజెక్ట్ ను అమ్మకూడదని నిర్ణయించుకుని తన పూర్తి దృష్టిని కార్ల పరిశ్రమపై పెట్టారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే ప్రపంచంలోని  ఆటోమొబైల్ రంగంలో టాటా కార్స్ మంచి పేరు సాధించాకున్నాయి.   2008లో టాటా మోటర్స్ బెస్ట్ సెల్లింగ్ కంపెనీగా మార్కెట్ లో నిలిచింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీ నష్టాల బాటలో పడింది. ఫోర్డ్ కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో నష్టాల ఊబిలో చిక్కిన ఆ సంస్థ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ కొనుగోలు చేస్తామని ఫోర్డ్ సంస్థకు ఆఫర్ ఇచ్చారు. ఈ రెండు కార్ల ప్రాజెక్ట్ ను అమ్మడం ద్వారా తమ సంస్థ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ తమ బృందంలో ముంబాయిలోని టాటా కార్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. మా రెండు కార్ల ప్రాజెక్ట్ ను కొలుగోలు చేయడం ద్వారా మీరు మాకు పెద్ద సహాయం చేస్తున్నారు అంటూ బిల్ ఫోర్డ్ రతన్ టాటాకు ధన్యవాదాలు చెప్పాడు. ఫోర్డ్ కంపెనీ ఐకాన్ గా భావించే జాగ్వార్ ల్యాండ్-రోవర్ బ్రాండ్‌లను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు రతన్ టాటా. బిల్ ఫోర్డ్ మాదిరిగా అవమానకరంగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ  రతన్ టాటా హుందాగానే వ్యవహరించారు. తొమ్మిది సంవత్సరాల తక్కువ సమయంలోనే ఆటోమొబైల్ రంగంలో తన సత్తా చాటి ఫోర్డ్ లాంటి సంస్థను నష్టాల బారిన నుంచి రక్షించిన ఘనత రతన్ టాటాది. ఈ సంఘటన ఆయనలోని మానవత్వానికి, దార్శనికతకు దర్పణం పట్టే అనేక సంఘటనల్లో ఒకటి మాత్రమే.   భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్న కార్లలో ఈ రెండు బ్రాండ్ కార్లు కూడా చేరాయి. ప్రపంచంలోని ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ప్రముఖ సంస్థగా మారింది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరలో నానో కార్లను తయారు చేసిన టాటా గ్రూప్ తమ లాభాల్లో 66శాతం ఛారిటీ కార్యక్రమాలకే వినియోగిస్తోంది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలకు 1500కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది.

శ్రమ విలువ...

అతనో నిరుద్యోగి. జీవితంలో ఎన్నోకష్టనష్టాలను చూసిచూసి ఎలాగొలా ఓ డిగ్రీని సంపాదించుకున్నవాడు. ఇంతగా కష్టపడిన తరువాత బతుకులో నిలదొక్కుకునేందుకు ఏదన్నా ఆసరా వస్తుందనే ఆశతో బతుకుతున్నవాడు. అలాంటి నిరుద్యోగి ఓ కంపెనీలో ఉద్యోగానికని బయల్దేరాడు. అవడానికి నిరుద్యోగే అయినా అతని ప్రతిభలో ఎలాంటి లోటూ లేదు. అందుకనే కంపెనీ వాళ్లు పెట్టిన ప్రతి పరీక్షలోనూ సునాయాసంగా నెగ్గాడు. ఆఖరి ఘట్టమైన ఇంటర్వ్యూకి ఎంపికైన అతికొద్ది మందిలో నిలిచాడు.   నిరుద్యోగి ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే ఎదురుగుండా ఉన్న కుషన్‌ కుర్చీలో ఓ ముసలాయన కూర్చుని కనిపించాడు. ఆయన నిరుద్యోగి సర్టిఫికెట్లన్నీ పరిశీలిస్తూ- ‘మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?’ అని అడిగాడు. ‘నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండీ. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది,’ అంటూ చెప్పుకొచ్చాడు నిరుద్యోగి. ‘ఓహ్‌! మీ అమ్మగారు ఏం చేస్తుంటారు?’ ఆసక్తిగా అడిగాడు పెద్దాయన. ‘మా అమ్మ బట్టలు కుడుతూ ఉంటుందండి. అలాగే నన్ను ఇంతటివాడిని చేసింది,’ అంటూ చెప్పుకొచ్చాడు నిరుద్యోగి. ‘అవునా. గొప్ప విషయమే! ఏదీ నీ చేతులని ఓసారి చూపించు,’ అన్నాడు పెద్దాయన.   పెద్దాయన మాటల్లోని ఆంతర్యం నిరుద్యోగికి అర్థం కాలేదు. అయినా తన చేతులని ఆయన ముందర ఉంచాడు. అతని చేతులు చాలా మృదువుగా ఉన్నాయి. దూదిలాగా మెత్తగా, తెల్లగా ఉన్నాయి. ‘అదేంటీ! నువ్వెప్పుడూ మీ అమ్మగారి పనిలో సాయపడినట్లు లేదే!’ నిరుద్యోగి మృదువైన చేతులని చూసి అడిగాడు పెద్దాయన.   అప్పుడు అర్థమైంది నిరుద్యోగికి, పెద్దాయన చేతులని ఎందుకు చూపించమన్నాడు. ‘లేదండీ! మా అమ్మకి ఎప్పుడూ సాయపడేవాడిని కాదు. నా చదువులోనే కాలం గడిచిపోయింది. ఎప్పుడన్నా తనకి సాయపడతానని ముందుకు వచ్చినా కూడా ఆమె ఒప్పుకొనేది కాదు,’ అంటూ సిగ్గుపడుతూ చెప్పాడు నిరుద్యోగి.   ‘సరే ఒక చిన్న పని చేయి. ఇవాళ ఇంటికి వెళ్లినవెంటనే మీ అమ్మగారి చేతులు శుభ్రంగా కడుగు. ఆ పని చేశాక నీకెలా అనిపించిందో రేపు వచ్చి నాతో చెప్పు,’ అన్నాడు పెద్దాయన.   పెద్దాయన మాటలకి నిరుద్యోగి అయోమయంలో పడిపోయాడు. ఆ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో తనకి ఆర్థం కాలేదు. అయినా తప్పదు కాబట్టి ఆ రోజు ఇంటికి వెళ్లిన వెంటనే తన తల్లి దగ్గర కూర్చున్నాడు. ‘ఇవాళ ఓసారి నీ చేతులని శుభ్రంగా కడగాలని ఉందమ్మా!’ అన్నాడు. పిల్లవాడి చర్యలో ఆంతర్యం అర్థం కాకపోయినా, అతని మీద ప్రేమతో ఊరుకుంది తల్లి. వెంటనే తల్లి చేతులను తన చేతులలోకి తీసుకుని చూసుకున్నాడు నిరుద్యోగి. ఆశ్చర్యం! ఆ చేతులు తన చేతుల్లాగా మృదువుగా లేవు, తెల్లగానూ లేవు. ఆ చేతుల నిండా సూదిగాట్లు! బట్టలు కుట్టీకుట్టీ ఆ చేతులు బండబారిపోయాయి. నిలువెల్లా గీతలతో రాటుదేలిపోయాయి. వాటిని ఎంతగా కడిగినా కూడా ఆ గీతలు కొంచెం కూడా చెరగలేదు.   తల్లి చేతులని చూసిన నిరుద్యోగి నోట మాట రాలేదు. ఆ మర్నాడు అతను ఆ పెద్దాయన ఆఫీసులోకి అడుగుపట్టే వరకు కూడా అతని కళ్లు చెమ్మగిల్లే ఉన్నాయి. ‘ఏమైంది అలా ఉన్నావు. నేను చెప్పిన పని చేశావా!’ అని అడిగాడు పెద్దాయన. ‘చేశాను సర్‌,’ అన్నాడు నిరుద్యోగి సిగ్గుపడుతూ. ‘నీ తల్లి చేతులని చూసినప్పుడు నీకు ఏమర్థమయ్యింది!’ అని అడిగాడు పెద్దాయన.   ‘ఇల్లు గడిచేందుకు నా తల్లి తన వంతు బాధ్యతగా కష్టపడుతోంది అనుకునేవాడిని కానీ, ఆ బాధ్యతని నెరవేర్చడంలో ఆమె శ్రమ ఏపాటిదో గ్రహించలేకపోయాను. తన జీవితం ఎంతగా రాటుదేలిపోయిందో నిన్నటివరకూ నాకు అర్థం కానే లేదు. నేను ఎంత ఎదిగినా కూడా తన త్యాగాన్ని మర్చిపోలేదు. ఆమెని ఎంత గొప్పగా చూసుకున్నా కూడా ఆమె పట్ల మేలుని తీర్చుకోలేను,’ అని చెప్పుకొచ్చాడు నిరుద్యోగి.   ‘నీకు కష్టం విలువ, కృతజ్ఞత విలువ తెలియాలనే ఆ పని చెప్పాను. నీలో స్వార్థముంటే కనుక నీ తల్లి త్యాగం ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. నీ తల్లే కాదు... ఈ ప్రపంచంలో శ్రామికులంతా తమ కుటుంబం ముందుకు సాగేందుకు శ్రమిస్తూ రాటుదేలిపోతున్నారు. నువ్వు ఉద్యోగంలో ఎంత ఎదిగినా కూడా వాళ్ల శ్రమని గౌరవించే మనస్తత్వం ఉండాలి. ఆ తత్వం నీలో ఉందని అర్థమైంది. మున్ముందు దానిని నిలుపుకుంటావన్న ఆశా ఉంది. నువ్వు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావు,’ అంటూ చిరునవ్వుతో చెప్పాడు పెద్దాయన. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

జీవితమనే తుపానులో భయమెందుకు?

ఆ అమ్మాయిది అందమైన మనసు. ఆ అబ్బాయిది వెనుదిరకని వ్యక్తిత్వం. వాళ్లిద్దిరికీ మధ్య ప్రేమ చిగురించింది. అదో అందమైన ప్రేమకథ! ఆ ప్రేమకి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఆ కథ సుఖాంతం అయ్యింది. పెళ్లయిన కొత్తజంత విహారయాత్రకి బయల్దేరారు. దారిలో నది అడ్డువస్తే, దానిని దాటేందుకు చిన్న నావని తీసుకుని వెళ్లారు. నావ నది మధ్యకి రాగానే అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం కాస్తా భీకరంగా మారిపోయింది. సన్నటి చినుకులతో మొదలై పెనుతుపాను చెలరేగింది. అంతటి తుపానుకి నావ అల్లల్లాడిపోవడం మొదలుపెట్టింది. ఎటు చూసినా కారుమబ్బులు, అన్ని వైపుల నుంచీ సూదుల్లా పొడుస్తున్న చినుకులు. వాటిని చూసి యువతి చిగురుటాకులా వణికిపోయింది. కానీ యువకుడిలో మాత్రం ఎలాంటి కలవరమూ లేదు. పైగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడేమో అన్నంతగా అతని మోములో చిరునవ్వు చెక్కుచెదరడం లేదు.   యువకునిలోని నిశ్చలత్వం చూసి అతని ప్రేయసికి ఒళ్లుమండిపోయింది. ‘ఇంత ప్రమాదంలో కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా! బెల్లం కొట్టినరాయిలా కదలకుండా కూర్చుండిపోతావేంటి?’ అంటూ అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ప్రేయసి మాటలు విన్న ప్రియుడు ఒక్క ఉదుటున తన ఒరలోంచి కత్తి తీసి ఆమె గొంతు మీద పెట్టాడు. ‘నా చేతిలో ఇంత పదునైన కత్తి నీ గొంతు మీద ఉంటే... నీకు భయం వేస్తోందా!’ అని అడిగాడు. దానికి ప్రియురాలు ‘ఇన్నిరోజులుగా నిన్ను చూస్తున్నాను. నీ స్వభావం ఏమిటో నాకు తెలియదా! చూస్తూ చూస్తూ నా గొంతు కోస్తావని ఎలా అనుకుంటాను. నీ చేతిలో ఎంత ప్రమాదకరమైన ఆయుధం ఉన్నా సరే. అది నా గొంతు మీద ఉన్నా సరే. నువ్వు మాత్రం నాకు హాని తలపెట్టవనే నమ్మకం నాకుంది,’ అంది.   ‘ఈ తుపాను కూడా ఆ భగవంతుని చేతిలో ఆయుధంలాంటిదే. ఆయన నాకు హాని తలపెట్టడనే నా నమ్మకం. ఒకవేళ నిజంగానే మన ఆయుర్దాయం ఇంతటితో సరి అని ఆయన తలిస్తే మాత్రం, ఇప్పుడు మనమేం చేయగలం! మన నావ నది మధ్యలో ఉంది. మన ఇద్దరికీ ఈత రాదు. చుట్టూ ఆదుకునే వారు లేరు. ఈ ఆపద నుంచి ఎలాగైనా బయటపడితే బాగుండు అని కోరుకుంటూ కూర్చోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి సమయంలో కంగార పడి అటూఇటూ తిరగడం వల్ల నావ కాస్తా బోల్తా పడక మానదు. అందుకని ప్రశాంతంగా కూర్చోవడాన్ని మించి తెలివైన పని మరొకటి ఉందంటావా?’ అని అడిగాడు ఆ యువకుడు. ఆ మాటలకి అతని ప్రియురాలి వద్ద సమాధానం లేకపోయింది.   కాసేపటికి తుపాను ఆగిపోయిన. దంపతులు ఇద్దరూ హాయిగా ఆవలి తీరానికి చేరుకున్నారు. కానీ ఆ వీరుడు చెప్పిన మాటలని మాత్రం ఆ యువతి ఎప్పటికీ మర్చిపోలేదు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు చేయగలిగిన ప్రయత్నం చేయడం, ఫలితాన్ని ఆ ప్రకృతి మీద వదిలి నిబ్బరంగా ముందుకు సాగిపోవడం! ఆనాడు తన వీరుడు చెప్పిన ఈ సూత్రాన్ని జీవితాంతమూ ఆ యువతి మర్చిపోలేదు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

స్వర్గానికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?

ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు. గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు. `నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు. `మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు. `ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు. `నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు. `అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు. `ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు. `ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు. గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు. `ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో! అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.

సంతోషం ఎక్కడ ఉంది?

ఒకప్పుడు అందరూ సంతోషంగా ఉండేవారట. ప్రపంచమంతా నిత్యం ఆనందడోలికల్లో తేలిపోతుండేది. సంతోషంగా ఉండీ ఉండీ జనాలకి మొహం మొత్తేసింది. దాని విలువే తెలియకుండా పోయింది. ఎంతటి నీచులైనా, పనికిమాలినవారైనా హాయిగా సంతోషంగా ఉండసాగారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సృష్టికర్త ఒక సభను ఏర్పాటుచేశాడు. ‘సంతోషం మరీ తేలిగ్గా దొరుకుతోంది. కాబట్టి దానికోసం ప్రజలు తపించిపోయేలా... దాన్ని ఎక్కడన్నా భద్రపరచాలి. ఎక్కడ భద్రపరచాలో మీమీ ఉపాయాలు చెప్పండి,’ అన్నాడు సృష్టికర్త. ‘ఇందులో చెప్పేదేముంది. సంతోషాన్ని సముద్రగర్భంలో దాచిపెడితే సరి,’ అని సూచించాడో దేవత. ‘అబ్బే! మనిషి అసమాన్యుడు. అతను సముద్రగర్భాన్ని సైతం చేరుకోగలడు. మరో మార్గం ఏదన్నా చెప్పండి,’ అని సూచించాడు సృష్టికర్త. ‘హిమాలయ పర్వతాలలోని అడవుల మధ్య ఓ చిన్న పెట్టెలో దాచిపెడితే ఎలా ఉంటుంది,’ అని సూచించాడు మరో దేవత. ‘అహా! మనిషి అక్కడకి కూడా తేలికగా చేరుకోగలడు. మరో మార్గాన్ని సూచించండి,’ అని పెదవి విరిచాడు సృష్టికర్త. ఆ తరువాత చాలా సలహాలే వినిపించాయి. అగ్నిపర్వతంలో దాచమనీ, కొండల కింద పాతిపెట్టమనీ, ఆకాశంలో వేలాడదీయమనీ... ఇలా సంతోషాన్ని దాచేందుకు రకరకాల ఉపాయాలు సూచించారు దేవతలు. కానీ అవేవీ సృష్టికర్తకు తృప్తినివ్వలేదు. చివరికి ఒక యువదేవత లేని నిలబడ్డాడు... ‘మీరంతా ఏమనుకోకపోతే నాది ఒక చిన్న విన్నపం. మనిషి ఈ ప్రపంచాన్నంతా శోధించే ప్రయత్నం చేస్తాడు కానీ తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నమే చేయడు. కాబట్టి మనిషి మనసులోనే సంతోషాన్ని దాచిపెట్టేస్తే సరి! అతను ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు,’ అని సూచించాడు. ‘అద్భుతమైన ప్రతిపాదన. నిత్యం భౌతికమైన విషయాలలో మునిగితేలే మనిషి ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు. తన విచక్షణకు విలువనిచ్చేవాడు మాత్రమే తనలోని సంతోషాన్ని పొందగలడు,’ అంటూ దేవతలంతా ఆ ప్రతిపాదనను ఏకాభిప్రాయంతో అంగీకరించారు. అప్పటి నుంచి సంతోషం మన మనసులోనే ఉండిపోయింది. దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

ఆమె హృదయం సంచిలో ఉంది..

లబ్ డబ్ శబ్దం వింటూ జీవితాన్ని లయబద్ధంగా కొనసాగిస్తాం. మరి ఆ శబ్దం ఆగిపోతే... జీవితం ఆగిపోతుందా.. ఆగిపోదు అని నిరూపిస్తున్నారు సెల్వా హుస్సేన్. 39 ఏళ్ల సెల్వా శరీరం లోపల గుండె లేకపోయినా గుండెధైర్యంతో జీవితాన్ని కొనసాగించవచ్చని కృత్రిమ గుండెను బ్యాగ్ లో మోస్తూ చిరునవ్వుతో ఎందరికో స్ఫూర్తి నిస్తున్నారు. ఆమె ప్రపంచంలోనే కృత్రిమ గుండెతో జీవిస్తున్న రెండవ మహిళ సెల్వా( మొదటి మహిళ కాథ్లీన్ షోర్స్ ) బ్రిటన్ రాజధాని లండన్ లోని ఇల్ఫోర్డ్ లో నివసించే సాధారణ మహిళ సెల్వా హుస్పేన్. భర్త, ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో పెనుతుఫాన్. చిన్నపాపాయికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. ఫ్యామిలీ డాక్టర్ ను కలవడానికి ఇంటి నుంచి కాస్త దూరం నడిచారు. అంతే అడుగు ముందుకు పడలేదు. వెంటనే లండన్‌లోని హేర్‌ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి హార్ట్ లో సమస్య ఉందని వెంటనే మరో గుండెను అమర్చాలని చెప్పారు. ఆమె ప్రాణాలు నిలబడాలంటే మరో గుండె కావల్సిందే. అయితే గుండె దాతల కోసం అప్పటికే వందలాది మంది ఎదురుచూస్తున్నారు. సెల్వా పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. మరో గుండె అనేది సాధ్యమయ్యే విషయంగా కనిపించలేదు. దాంతో కృత్రిమ గుండె అమర్చడానికి డాక్టర్ల బృందం సిద్ధపడింది. 27 జూన్ 2017న హేర్ ఫీల్డ్ సర్జరీ డిపార్ట్ మెంట్ హెడ్ ఆండ్రీ సైమన్, సర్జన్ డయానా గార్సియా సాజ్ ఆధ్వర్యంలో ఆరుగంటల పాటు జరిగిన ఆపరేషన్ లో ఆమె గుండెను తొలగించారు. దాని స్ఠానంలో కృత్రిమ గుండె కవాటాలను ఇంప్లాట్ చేశారు. దానిని పని చేయించే యంత్రాంగాన్ని శరీరం వెలుపల ఏర్పాటు చేశారు.   ఆపరేషన్ తర్వాత నెలరోజుల పాటు సెల్వా ఆసుపత్రిలోనే ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో నడవడం, మాట్లాడటం, తినడం, తాగటం, కండరాల బలాన్ని పెంపొందించుకోవడం తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. పుట్టుకతో తన శరీరంలో ఉన్న గుండెను ఆసుపత్రిలో వదిలేసి కృత్రిమ గుండెతో ఇంటిదారి పట్టారు. ఆ తర్వాత  భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. ఆమె గుండె స్థానంలో ఏర్పాటుచేసిన కృత్రిమ గుండె  నిమిషానికి 138 సార్లు కొట్టుకుంటుంది. ఈ హృదయ స్పందనలతో శరీరమంతా రక్త ప్రసరణ జరుగుతుంది. సెల్వాను సజీవంగా ఉంచుతుంది. ఈ గుండెను పనిచేయించే పరికరాన్ని మాత్రం ఎప్పుడు ఆమెతో ఉండేలా బ్యాగ్ లో అమర్చారు.  6.8 కిలోల బరువున్న ఈ బ్యాగ్ ను ఆమె అనుక్షణం తనతో ఉంచుకోవాల్సిందే. ఇందులోని పరికరం రెండు బ్యాటరీలతో ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ మోటారు , పంపు ద్వారా ఆమె శరీరంలో రక్త ప్రసరణ కోసం ఛాతీలోని ప్లాస్టిక్ సంచిలోకి జతచేయబడిన గొట్టాల ద్వారా గాలిని నెట్టివేస్తాయి. ఇందులో బ్యాటరీ ఆగిపోతే కేవలం నిమిషంన్నరలోనే తిరిగి బ్యాటరీ అమర్చాలి. లేకపోతే ఆమె శరీరంలో రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆమెతో పాటు భర్త ఉంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాడు.   జీవితంలో చిన్నచిన్న సమస్యలకే మనం బాధపడిపోతాం. కానీ, శరీరంలో ఎంతో కీలకమైన గుండె లేకపోయినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. తన ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను భుజానికి తగిలించుకుని  చిరునవ్వుతో జీవిస్తున్న సెల్వాకు హాట్సాఫ్..

పసుపు టాక్సీలకి ప్రమాదాలు జరగవు

ఓలాలు, ఉబర్లు వచ్చేసిన తరువాత ఏది కారో, ఏది టాక్సీనో కనుక్కోవడం కష్టమైపోయింది. కానీ ఒకప్పుడు టాక్సీ అంటే స్పష్టంగా పచ్చటి పసుపురంగులోనే ఉండేది. ఇప్పటికీ చాలా దేశాలలో టాక్సీ అంటే అల్లంత దూరాన పసుపు రంగులో కనిపించే వాహనమే! టాక్సీలు పసుపురంగులో ఉండటానికి ప్రత్యేకించిన కారణాలు ఏవీ లేవు. 1907లో టాక్సీ సర్వీసులను ప్రారంభించినప్పుడు, మిగతా వాహనాలకంటే భిన్నంగా కనిపించాలి కాబట్టి... అరుదుగా ఉండే పసుపు రంగుని ఎంచుకున్నారు. రోడ్డు మీద వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య పసుపురంగుని గుర్తించడం నిజంగానే తేలికని కొన్ని అధ్యయనాలు రుజువుచేశాయి.   ఇప్పుడు ఏకంగా పసుపురంగు టాక్సీలకి ప్రమాదాలు కూడా తక్కువ జరుగుతాయంటూ ఓ పరిశోధన నిరూపిస్తోంది. సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయంలోని నిపుణులు ఈ పరిశోధన కోసం 16,700 కార్లున్న ఓ టాక్సీ సంస్థను (The Singapore taxi company) ఎన్నుకొన్నారు. ఈ కంపెనీలో మూడింత ఒక వంతు పసుపు కార్లుంటే, మరో రెండు వంతులు నీలం కార్లున్నాయి. వీటన్నింటినీ ఓ 36 నెలలపాటు దగ్గరగా పరిశీలించారు. చివరికి పసుపురంగు టాక్సీలకి ప్రమాదం జరిగే అవకాశం పదిశాతం తక్కువని తేల్చారు.   ఇలా ప్రమాదాలు తక్కువ జరగడం వల్ల మనుషులకి దెబ్బలు తగిలే అవకాశాలు ఎలాగూ తగ్గుతాయి... కార్లకి రిపేర్ల పేరుతో వేల రూపాయలు వదిలించుకునే శ్రమా తగ్గుతుందని గుర్తుచేస్తున్నారు. The Singapore taxi companyనే తీసుకుంటే... ఇందులో ఉన్న నీలం కార్లని కూడా పసుపురంగులోకి మార్చేయడం వల్ల ఏటా 917 ప్రమాదాలు తప్పిపోతాయనీ, కోటి రూపాయలకు పైగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.   ఇంతకీ పసుపురంగుకీ ప్రమాదాలు తగ్గడానికి మధ్య సంబంధం ఏమిటీ! అంటే కారణం తేలికగానే స్ఫురిస్తుంది. రోడ్డు మీద పోయే ముదురురంగు కార్లతో పోలిస్తే పసుపు టాక్సీలు కంటికి సులభంగా కనిపిస్తాయి. అవి ఎంత దూరంలో ఉన్నాయో అంచనా వేయడం తేలికవుతుంది, దగ్గరగా ఉన్నప్పుడు పక్కకి తప్పుకోవడంలోనూ అంచనా తప్పదు. అంచేత, ప్రమాదాలూ తక్కువగానే సంభవిస్తాయి. పసుపు టాక్సీలు సురక్షితం అని తేలడంతో... ప్రజారవాణా అంతా కూడా పసుపు టాక్సీలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మరి ఆ మాటని ప్రభుత్వాలు వింటాయో లేదో!   - నిర్జర. 

ఈ జాగ్రత్తలు పాటించకపోతే... కొంప కొల్లేరే!

సంసారాన్ని ఓ ప్రయాణంతో పోలుస్తూ ఉంటారు పెద్దలు. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు కాస్త ఆదమరచి ఉన్నా, వెనకబడిపోవాల్సిందే! ఆ పొరపొటు ఒకోసారి భాగస్వామిని చేజార్చుకునేంతవరకూ వెళ్లవచ్చు. లేదా శాశ్వతంగా మన పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టవచ్చు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు అనుభవజ్ఞులు. ఇంతకీ వారి సలహాలు ఏమిటంటే...   కుటుంబంలో ఆఫీసు పెట్టొద్దు కెరీర్‌లో ముందుకు సాగాలంటే కష్టపడి పని చేయాల్సిందే! దానిని ఎవరూ కాదనలేరు. కానీ కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించకపోతే మన పడే కష్టానికి అర్థమే ఉండదు. కనీసం ఇంట్లో ఉండే సమయంలో అయినా టీవీ, ఫేస్‌బుక్‌లాంటి వ్యాపకాలను పక్కనపెట్టి భాగస్వామితో కాస్త మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందే. ఆఫీసులో పని ఒత్తిడి గురించి కూడా భాగస్వామికి చెప్పి ఉంచితే... మీరు తనని కావాలనే దూరం ఉంచుతున్నారన్న భావన బలపడకుండా ఉంటుంది.   ఆఫీసరు మీద ఆవేశం ఇంట్లో వద్దు చాలామంది చేసే పొరపాటే ఇది. తోటి ఉద్యోగులతోనో, స్నేహితులతోనో జరిగిన గొడవ తాలూకు కోపాన్ని ఇంట్లో వెళ్లగక్కుతూ ఉంటారు. ఆఖరికి ట్రాఫిక్‌లో ఆలస్యమైనా ఆ ఆవేశం ఇంట్లోనే ప్రదర్శిస్తారు. ఊరంతా తిరిగివచ్చి, ఇంటి బయట చెప్పులు విడవడంతోనే... రోజువారీ చిరాకులన్నీ మర్చిపోయి మనిషిలా మెలగమని సూచిస్తుంటారు పెద్దలు.   అనుమానాస్పదమైన బంధాలు వద్దే వద్దు జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. ఎవరికెంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ స్నేహం సంసారంలోకి ప్రవేశిస్తోందన్న అనుమానం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే! మీ స్నేహాన్ని భాగస్వామి అపార్థం చేసుకుంటున్నారనో, మీ బంధం హద్దులు మీరడం లేదనో అనుకుంటే ఉపయోగం లేదు. ఆ పరిస్థితిని దాటుకుని మొండిగా సాగే స్నేహం సంసారం చీలిపోయేందుకు దారితీస్తుంది.   రహస్యాలు దాచవద్దు భార్యాభర్తల మధ్య మిగిలే రహస్యాలు ఎప్పటికైనా అపనమ్మకానికి దారితీస్తాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అప్పులకి సంబంధించిన వ్యవహారాలు వారితో పంచుకుని తీరాల్సిందే!   మనస్పర్థలు సహజమే రోడ్డు మీద ఓ ఇద్దరు మనుషులు ఎదురుపడితేనే గొడవలు మొదలైపోతుంటాయి. అలాంటిది ఇద్దరు మనుషులు ఏళ్లతరబడి కలిసి జీవిస్తే మనస్పర్థలు రాకుండా ఎలా ఉంటాయి. ఆ బేధాలను దాటుకుని ముందుకు సాగడం ఎలా అన్నది ఓ నైపుణ్యం. కోపంలో వాదించకుండా, అహంతో ఆలోచించకుండా, విచక్షణ కోల్పోకుండా పట్టువిడుపులకి సిద్ధపడుతూ సాగితేనే స్పర్థని దాటగలం.                              - నిర్జర.

The Art Of Argument

A conversation can always lead to an argument. And when there is an argument... there won't be any winners. That is the reason why our elders have always warned us against arguments. Repentance is oftenthe end result of an argument. It would hurt our character, our ego and our relation. But we are humans and we might sometimes land in thesoup of a heated discussion. A few reminders might lead us through such an argument... Never argue with the strangers: You might protest anyone being uncivilized and harmful. But don't argue over trifle things with a stranger. How often we see an argument turning into a fight in a bus! It might be a scene of amusement for the co-travellers, but can be really embarrassing to those involved. We never know who the other one is, we never know how far the argument might lead us. So when you wish to argue with a stranger, just answer yourself - Is the matter worthy to be an argument?   Never argue in a bad mood: You have just entered your home from the office and your wife says something that ignites you. On a cool day, you might have probably seen the lighter side of the issue. But today was a tough day with your boss, and you are ready for another fight. Such might be a situation where you loose your charm. It's better to call off the day and postpone the argument over the cup of a tea, the next morning. Thesame would be the suggestion if your partner is in a bad mood. Lethim/ her cool down, before a discussion.     The language: It's the language we use that represents our character. People often tend to be abusive while being in an argument. Because at one point of the argument, it turns out to be an ego clash. And both involved in the argument try to hurt the ego of the opponent. People insult each other with every word that's possible... and that's where our language turns foul.   Those History classes/clashes: It's a silly thing that we do over an argument. We recall every single mistake our opponent has done over years. It almost looks like the long borne grudge that we are spilling. We look back into our past, bring the filth from it, analyse it and feel proud that we've got a weapon to fight with. We often raise the weak points in the life of our opponent, and hurt him deep. You need not be a bad boy: Well! Arguments do occur. Sometimes they do turn ugly. But you can always be yourselves during such situations. You need not blowup to prove your point. You can use harsh words, with calm tone. You can present strong objections with cool mind. One thing that an argument does- it brings the beast out of an angel! So watch out the beast within you. Don't let it handle the situation. Finally... when you feel that an argument is turning and churning into a storm, you better ease the situation. A few calm words, a phone call in between, a permission to leave or even an apology would certainly save the relation. Nirjara