దోషులుగా తేలితే పోటీ చేయకుండా జీవితకాల నిషేదం?.. త్వరలో తేలుస్తామన్న సుప్రీం!

ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం వారిని నిషేధించాలనే అంశంపై త్వరలో పరిశీలిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి  అమికస్ క్యూరీగా ఉన్న విజయ్ హన్సారియా సుప్రీంకు నివేదిక అందించారు. దేశంలో ఇప్పటికే ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించి 4,400 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నివేదికను తయారు చేసినట్టు తెలిపారు.   తెలంగాణలో 118 కేసులు పెండింగ్ లో ఉన్నాయని... ఒక్క హైదరాబాదులోనే ప్రజాప్రతినిధులపై 13 సీబీఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ వెల్లడించారు. వీరిలో ఒక ఎమ్మెల్యేకు జీవితఖైదు విధించే స్థాయి కేసు కూడా విచారణలో ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారని... హైదరాబాదులో సీబీఐ, ఈడీ కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సూచించారు. కర్ణాటక వంటి హైకోర్టుల్లో అవినీతి నిరోధక చట్టం కింద కేసులు ఉన్నాయని... తెలంగాణలో ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయని... వీటిలో కొన్ని కేసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిందని హన్సారియా తెలిపారు. కొన్ని కేసుల్లో ట్రయల్స్ ప్రారంభం కాలేదని, మరికొన్న కేసుల్లో ఛార్జిషీట్లు ఇంకా వేయలేదని చెప్పారు.   జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, కొన్ని రాష్ట్రాల్లో రెండు, మూడు కేసులు మాత్రమే ఉంటాయని... అలాంటి వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల హైకోర్టులకు కొన్ని ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కొన్ని కేసుల్లో విచారణ ఇంకా ప్రారంభం కాలేదని చెప్పింది. కేసు విచారణలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని... పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేయకపోవడం, ఛార్జ్ షీట్లు ఫైల్ చేయకపోవడం, సాక్షులను పిలవకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒకే స్పెషల్ కోర్టు ఉంటే నిర్ణీత గడువులోగా దర్యాప్తును ముగించడం కష్టమని వ్యాఖ్యానించింది.   ఒక్కో ప్రత్యేక కోర్టు ఎన్ని కేసులు విచారించాలనే విషయాన్ని సుప్రీం నిర్ణయిస్తే బాగుంటుందని ఈ సొలిసిటర్ జనరల్ మెహతా చెప్పారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక్కో స్పెషల్ కోర్టుకు ఎన్ని కేసులు ఇవ్వాలనే విషయాన్ని ఆయా హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు నిర్ణయించినా బాగుంటుందన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం రాష్ట్రాలకు కేంద్రం నిధులను విడుదల చేసిందని... అయితే అనేక రాష్ట్రాలు ఇంత వరకు యూసీలను పంపలేదని చెప్పారు. జీవితఖైదు శిక్ష పడే కేసులు, అవినీతి నిరోధక చట్టం కిందకు వచ్చే కేసులకు తొలి ప్రధాన్యత ఇవ్వాలని అన్నారు. కోర్టు ఏం చెప్పినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు మెహతా. ప్రత్యేక కోర్టులు, మౌలికవసతుల కల్పనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై  స్పందించిన ధర్మాసనం.. హైకోర్టులు, ట్రయల్ కోర్టులకు రేపటిలోగా కొన్ని ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.

కరోనా మహమ్మారికి బలైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్.. 

తిరుపతి ఎంపీ, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ బుధవారం చెన్నయ్ అపోలో హాస్పిటల్ లో కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడిన అయన చెన్నయ్ అపోలో హాస్పిటల్ లో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. దుర్గాప్రసాద్ 1985లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఒకపక్క న్యాయవాద వృత్తిలో ఉంటూనే అయన రాజకీయాల్లో ప్రవేశించారు. 28 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్నికైన బల్లి దుర్గా ప్రసాద రావు నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. 1996లో చంద్రబాబు కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కూడా అయన పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వై‌సీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు.

కోడెల సేవలు చరిత్రలో నిలిచిపోతాయి: బాలకృష్ణ

డా.కోడెల శివప్రసాద రావు మొదటి వర్థంతి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు.   నేడు కోడెల శివ ప్రసాద రావు మొదటి వర్థంతి సందర్భంగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో దివంగత నేత సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తో పాటు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోడెల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిచారు.   ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. స్వర్గీయ డా. కోడెల శివ ప్రసాద రావు తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుండి సమాజానికి సేవ చేయాలన్న పడ్డ తపన, చేపట్టిన కార్యక్రమాలు ఆయనను చిరస్మరణీయునిగా మిగిల్చాయని గుర్తు చేసుకొన్నారు. నిబద్దత కలిగిన కార్యకర్తగా, నాయకునిగా తన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రాభివృద్దిలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ స్థాపన లోనూ కోడెల సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, అటువంటి మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన భాద్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. మొదటి వర్థంతి సందర్భంగా కోడెల కుటుంభ సభ్యులకు బాలకృష్ణ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన రోగులు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర సిబ్బందికి బాలకృష్ణ అన్నదానం చేశారు.

ఎంతో సాధించి.. చివరికి పరువు కోసం ప్రాణాలు తీసుకున్న పల్నాటి పులి

నేడు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మొదటి వర్థంతి. రూపాయి డాక్టరుగా పేదల మనసు గెలిచిన ఆయన.. ఎన్టీఆర్ ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలనాటి అరాచకాలకు ఎదురు నిలిచి, పల్నాటి గడ్డలో అభివృద్ధికి బాటలు పరిచి.. నరసరావుపేట కి నగిషీలు అద్ది, కోటప్పకొండకు కొత్త రూపు తెచ్చి పల్నాటి పులిగా పేరుతెచ్చుకున్నారు.   గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో 1947 మే 2 వ తేదీన సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు కోడెల జన్మించారు. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నా.. ఆయన తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు.   పల్నాడు ప్రాంత పేదప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని రాజాగారికోటలో ఆసుపత్రి నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు కోడెల. ఆయన దగ్గరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారు అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు. అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో ఆసుపత్రి గడప తొక్కేవారు. ఆయన పేదల డాక్టరుగా, రూపాయి డాక్టరుగా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దృష్టి కోడెల సేవపై పడి, 1983లో పార్టీలోకి ఆహ్యానించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలన్న తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు కోడెల తెలుగుదేశంలో చేరారు. మొదటిసారిగా ఆయన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే, మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవారు. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన స్పీకర్ గా పనిచేశారు.    ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ఆయన రాజీ లేని పోరాటం చేశారు. వైఎస్‌ హయాంలో రైతుల కోసం గొంతెత్తి లాఠీ దెబ్బలు తిని.. జైలుకు వెళ్లారు. కోటప్పకొండ పవిత్రతను కాపాడాలంటూ నరసరావుపేట నుంచి కొండపైదాకా నడిచారు. కోటప్పకొండ ఆలయ అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారు.   స్వచ్ఛఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛఆంధ్రప్రదేశ్ లో భాగంగా కోడెల సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.   ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఏదో ఒక సామాజిక సేవ చేయడం కోడెల ఆనవాయితీ. పుట్టినరోజు సందర్భంగా ఒకసారి 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి రికార్డు సృష్టించారు. 2017 మే 2న కోడెల పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించారు. 11,987 మంది గుంటూరు జిల్లా ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.   టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినా ఆయన ఎన్నడూ కండువా మార్చలేదు. 36 ఏళ్లు టీడీపీలోనే ఉన్నారు. పార్టీ మారమని ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా కించపరచినా ఎప్పుడూ పార్టీ మారలేదు. డాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఎంతో సేవ చేసి.. పేదల మనిషిగా, పల్నాటిపులిగా పేరు తెచ్చుకున్న ఆయన.. కొందరు ఆయనపై వేసిన నిందలను, తప్పుడు ప్రచారాలను తట్టులోలేక.. మానసికంగా కృంగిపోయి.. గతేడాది ఇదే రోజున అవమానలను భరించలేక పరువుకోసం ప్రాణం తీసుకున్నారు.

అమరావతి భూముల విషయంలో ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ.. సిట్ విచారణ పై హైకోర్టు స్టే 

అమ‌రావ‌తి రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంలో ఏపీలోని జగన్ ప్ర‌భుత్వానికి ఈరోజు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. అమ‌రావ‌తి భూముల అంశంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు, అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ సిట్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించిన సంగతి తెలిసిందే. దీనికోసం సిట్ తో విచారణ చేయించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్దమౌతుండగా సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాకుండా సిట్ ఏర్పాటు, మంత్రివర్గ ఉపసంఘం తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.    రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూముల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం సుమారుగా 4 వేల ఎకరాల్లో టీడీపీకి చెందిన నేతలు అక్రమంగా భూములు కొన్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది.    ఇది ఇలా ఉండగా అమరావతి రాజధాని భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని నిన్న ఏసీబీ ఒక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కూడా ఎసిబి కేసులు నమోదు చేసింది.    అయితే సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా చేస్తోందని తమ పిటిషన్ లో వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సిట్ ఏర్పాటు పై స్టే విధిస్తూ తీర్పు వెలువ‌రించింది.

ఏపీలో ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

ఏపీలో హిందూ ఆలయాలు, ఆలయాల ఆస్తుల పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న అంతర్వేది రధం దగ్ధం ఘటన మరిచిపోక ముందే విజయవాడ దుర్గగుడి రథంలో వెండి సింహాలు మాయమైన ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటన వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే కృష్ణా జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ శ్రీ షిర్డీసాయిబాబా ఆలయం బయట నెలకొల్పిన బాబా విగ్రహాన్ని ధ్వంసం చేసారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్రామంలోని స్థానికులు, ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అమెరికాలో తెలుగు వైభవం.. 9,500 మంది విద్యార్థులతో సిలికానాంధ్ర మనబడి తరగతులు ప్రారంభం!

భాషాసేవయే భావి తరాలసేవ అనే నినాదంతో, గత 13 సంవత్సరాలుగా మహాయజ్ఞంలా నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి తరగతులు, 2020-21 నూతన విద్యాసంవత్సరానికి ఈ సెప్టెంబర్ 12 వ తేదీ నుండి దిగ్విజయంగా ప్రారంభమైనాయి! అమెరికాలో 35 రాష్ట్రాలలో 250 కి పైగా కేంద్రాలలో, పదికి పైగా ప్రపంచంలోని ఇతర ఖండాలలోని దేశాలలో ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగుభాష నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడిలో, COVID-19 మహమ్మారి వల్ల మనమంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ 9,500 కు పైగా విద్యార్థులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు!   "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం" వారి అనుబంధంతో , ప్రతిష్ఠాత్మక ACS-WASC (USA) వారి అధికారిక గుర్తింపు పొంది, 35 స్కూల్ డిస్ట్రిక్టులలో ఫారిన్ లాంగ్వేజ్ (FLC) గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని, మనబడి అధ్యక్షులు మరియు కులపతి శ్రీ రాజు చమర్తి పేర్కొన్నారు. గత 13 ఏళ్లలో మనబడి ద్వారా 60,000 కు పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని, కరోనా పరిస్థితులలో సైతం ఇన్నవేల మందిని నమోదు చేసినందుకు తల్లిదండ్రులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు! మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, స్వచ్ఛంద కార్యకర్తలకు కూడా వారు కృతఙ్ఞతలు తెలియజేశారు. మనబడిలో తెలుగు భాష నేర్పించడం మాత్రమే కాకుండా తెలుగుమాట్లాట పోటీలు, బాలానందం రేడియో కార్యక్రమాలు, తెలుగుకు పరుగు, పద్యనాటకాలు, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో మన పిల్లలకు మన సంసృతీసాంప్రదాయాలతో పాటు, మన కళల పట్ల అవగాహన కల్గించడం మనబడి ప్రత్యేకత!   మీ పిల్లలను ఈ విద్యాసంవత్సరానికి manabadi.siliconandhra.org ద్వారా సెప్టెంబర్ 25 వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని, మనబడి అభివృద్ధి, ప్రాచుర్యం మరియు టెక్నాలజీ విభాగాల ఉపాధ్యక్షులు శ్రీ శరత్ వేట గారు విన్నవించారు. మొదటి త్రైమాసికం తరగతులన్నీ కరోనా పరిస్థితులవల్ల సాంకేతికతను ఉపయోగించి అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహిస్తారని కూడా వారు తెలిపారు.

విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ.. మండిపడ్డ టీడీపీ

ఏపీలోని వివిధ హిందూ ప్రార్థన స్థలాలలో వరుసగా జరుగుతన్న ఘటనలు రాష్ర ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అంతర్వేది రథం దగ్ధం ఘటన మరవక ముందే తాజాగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని రథంపై దుమారం రేగుతోంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉత్సవ వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమవడం సంచలనం ‌గా మారింది. ఈ రథంపై మొత్తం నాలుగు వెండి సింహాలు ఉండేవి. అయితే ప్రస్తుతం మూడు సింహాలు మాయమయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రథంపై మూండు సింహాలు మాయం కావడంతో దుర్గమ్మ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అంతేకాకుండా ఈ విషయం పై ఆలయ ఈవో నీళ్లు నమలడం దొంగలకు వత్తాసు పలకడమేననని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది.. ఎవరిని రక్షించడానికి మీరు దీనిని కప్పిపెట్టాలని చూస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వెండి సింహాల మాయం ఘటనపై వెంటనే నిజానిజాలు బయటపెట్టాలని అయన డిమాండ్ చేశారు.   రాష్ట్రంలో "వైసిపి అధికారంలోకి వచ్చాక ఏ గుడికి భద్రత లేకుండా పోయింది. వైసిపి నాయకులు ఏకంగా గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా ఉన్నారు. దేవాదాయ భూముల ఆక్రమణల దగ్గర నుండి, రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, వెండి తాపడాల మాయం, ఇలా రోజుకో నేరం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగలు, దగాకోర్లు ఆలయాల్లో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నా సీఎం చోద్యం చూస్తున్నారు. ఆలయాల్లో చోరీలు, విధ్వంసాలు, అరాచకాలు చేస్తున్న నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలి. భక్తుల మనోభావాలను గౌరవించాలి. అంతేకాకుండా 15నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన అరాచకాలపై సిబిఐ విచారణ జరిపించాలి.'' అని బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్‌తో సమావేశమై దుర్గగుడిలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చలు జరిపారు. తరువాత ఆలయ ఈవో, ఇతర సిబ్బంది కలిసి ఉత్సవ రథాలను పరిశీలించారు. అప్పుడు వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమైన విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా నాలుగో సింహాన్ని కూడా పెకలించి ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. వీటిలో ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని.. ఈ లెక్కన మొత్తం రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైనట్లు సమాచారం. ఐతే ఆలయ అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. దీని పై దుర్గ గుడి ఈవో సురేశ్ స్పందిస్తూ రథంపై ఉన్న సింహాలు మాయమయ్యాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఆలయ రికార్డులను పరిశీలించి సింహాలు గతంలో ఉన్నాయో లేవో తేల్చడానికి 3 రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.

శశికళ విడుదల అయ్యేది 2021 లోనే.. అది కూడా ఫైన్ కడితేనే.. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నాయకురాలు అయిన శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లుగా బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నసంగతి తెలిసిందే. శశికళ వచ్చే ఏడాది జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని.. అయితే, దీనికోసం ఆమె రూ. 10 కోట్లు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని కర్ణాటక జైళ్ల శాఖ తెలిపింది.   శశికళ శిక్షాకాలం, విడుదల తేదికి సంబంధించి ఆర్టీఐ కార్యకర్త, లాయర్ నరసింహమూర్తి చేసిన దరఖాస్తుకు సమాధానముగా పరప్పన జైలు సూపరింటెండెంట్ ఆర్.లత ఈ వివరాలు తెలిపారు. ఒక వేళ ఆమె ఫైన్ కట్టకపోతే మాత్రం 27 ఫిబ్రవరి 2022 వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2017 లో అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శశికళ అనుచరురాలు ఇళవరసి అలాగే శశికళ మేనల్లుడు సుధాకరన్ కూడా ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

కేసుల భయమా! స్నేహ హస్తమా! ఒకే బాటలో వైసీపీ, టీడీపీ 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఒకే దారిలో పయనిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు ఓటేశారు వైసీపీ, టీడీపీ ఎంపీలు. రాష్ట్రంలో బద్ద శత్రువులుగా ఉన్న పార్టీలు ఢిల్లీలో ఒకేబాటలో పయనించడం చర్చనీయాశంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ కూటమికి మద్దతిచ్చామని వైసీపీ చెబుతోంది. టీడీపీ కూడా అదే వాదన వినిపిస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల పరిణామాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహానికి వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని రెండు పార్టీలు చెబుతున్నా.. కేసుల భయంతోనే  బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదనే చర్చ కూడా జరుగుతోంది.    ఏపీ సీఎం జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. గతంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరైన ఆయన ప్రస్తుతం మినహాయింపులో ఉన్నారు. సీఎం హోదాలో కూడా ఓసారి కోర్టుకు హాజరయ్యారు జగన్. కేసులు ఇంకా పూర్తి కానందున కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండటమే బెటరన్న అభిప్రాయంలో వైసీపీ ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే పరిణామాలు మారవచ్చని.. కేసుల విచారణలో స్పీడ్ పెరగవచ్చనే భయం జగన్ పార్టీ నేతల్లో ఉంది. అందుకే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులతో పాటు అన్ని అంశాల్లోనూ బీజేపీకే మద్దతిస్తున్నారు వైసీపీ ఎంపీలు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లోనూ అలాగే చేశారు. బీజేపీకి మద్దతుగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం కూడా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.    ఇక టీడీపీ అధినేత చంద్రబాబుది సేమ్ అలాంటి ఇబ్బందే. అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పాటు ఫైబర్ నెట్ పనులపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరే యోచనలో ఉంది వైసీపీ. వీటిపై ఇప్పటికే రాష్ట్రంలో ఏసీబీ విచారణ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కూటమిలో చేరి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల తర్వాత ఫలితాలు తారుమారు కావడం, ఏపీలోనూ టీడీపీకి పరాజయం దక్కడంతో చంద్రబాబు మౌనంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు బీజేపీ పెద్దలు. ఈ నేపథ్యంలో అమరావతి, ఫైబర్ నెట్ పనులపై జగన్ సర్కార్ సీబీఐ దర్యాప్తు కోరితే తనకు ఇబ్బంది కలగొచ్చనే ఆందోళనలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే కొంత కాలంగా ఆయన బీజేపీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఇటీవల ఎలాంటి ప్రకటనలు చేయలేదు చంద్రబాబు. కరోనా కట్టడిలో మోడీ సర్కార్ బాగా పని చేస్తుందని చెప్పారు. బీజేపీతో మంచి సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలను ఉపయోగించుకున్నట్లు చెబుతున్నారు, ఎన్డీఏకు సపోర్ట్ చేయడం వల్ల బీజేపీకి దగ్గర కావచ్చన్నది బాబు అంచనాగా భావిస్తున్నారు .   మరోవైపు వైసీపీ, టీడీపీ తీరుపై ఏపీలోని మిగితా పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయకుండా.. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల భయంతోనే బీజేపీకి జై కొడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ, టీడీపీ మద్దతు ఇవ్వడంపై ఢిల్లీలోనూ చర్చలు జరుగుతున్నాయి.

కోడెల వర్ధంతి కార్యక్రమాలపై పోలీసుల నోటీసులు.. ఆపేది లేదంటున్న కుమారుడు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మొట్టమొదటి వర్ధంతి రేపు బుధవారం నాడు జరగనుంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో దివంగత నేత కోడెల అనుచరులు పలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క కోడెల కుమారుడు శివరాం కూడా కొన్ని కుటుంబ పరమైన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కోడెల శివరాం తో సహా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో బహిరంగంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.   అయితే పోలీసుల తాజా వైఖరిపై కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు యథావిధిగా తాము కార్యక్రమాలు చేపట్టి తీరుతామని కోడెల శివరామ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కుటుంబ పరంగా జరిగే వర్ధంతి కార్యక్రమాలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం సరికాదని అయన అభిప్రాయపడ్డారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏడాది క్రితం హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇద్దరు సీఎంలు జాన్ జిగ్రీలే.. అయినా బస్సులు మాత్రం రోడ్డెక్కవు 

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు జాన్ జిగ్రీలు అన్న సంగతి అందరికి తెల్సిందే. గత సంవత్సరం జరిగిన ఏపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ పార్టీకి అండగా ఉండి అయన గెలుపుకు సాయపడ్డారని అటు టీడీపీ, ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపధ్యంలో రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ ఇప్పటివరకు అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ఇటు టీఎస్ఆర్టీసీ కానీ రెండు రాష్ట్రాల మధ్య బస్సులను మాత్రం నడపడం లేదు. దీనికి కారణం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంతం వీడక పోవడమే అని తెల్సుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మ‌ధ్య చ‌ర్చ‌లు జరిగినా అవి రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా సాగాయి. దీని కోసం దాదాపు మూడు నెల‌లుగా రెండు రాష్ట్రాల అధికారులు చర్చించడం.. ఆ తరువాత బ‌స్సులు న‌డ‌ప‌డంపై ఏదీ తేల్చ‌కుండా ముగిస్తున్నారు. ఈక్ర‌మంలోనే ఈరోజు మరోసారి రెండు రాష్ట్రాల అధికారులు ఈ అంశం పై చర్చించేందుకు స‌మావేశ‌మ‌వుతున్నారు.   ఇంతకు ముందు జరిగిన స‌మావేశాలలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బ‌స్సులు సమాన దూరం నడుపుకుందామన్న తెలంగాణ‌ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించలేదు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బ‌స్సుల ప్రారంభంపై ప్రతిష్టంభన ఏర్పడింది. కరోనా ప్రబలక ముందు వరకు తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీకి బ‌స్సులు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతుండగా.. టీఎస్ఆర్టీసీ బ‌స్సులు ఏపీ పరిధిలో 1.45 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంతకుముందు జరిగిన చర్చలలో తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటే…తెలంగాణ 50వేల కిలోమీటర్ల ప‌రిధి పెంచుకుంటే సరిపోతుంద‌ని ఏపీ ప్రతిపాదించింది. అయితే ఆ స్థాయిలో టీఎస్ఆర్టీసీ వద్ద బస్సులు సిద్ధంగా లేని కారణంగా తెలంగాణ మాత్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. తాము గ‌తంలో న‌డిపిన‌ట్టుగానే స‌ర్వీసులు న‌డిపిస్తామ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఇంతకుముందు జరిగిన స‌మావేశంలో రెండు రాష్ట్రాల మధ్య బ‌స్సులు నడపడం పై స్ప‌ష్ట‌త రాలేదు. మరో పక్క ఏపీ రవాణా శాఖ.. మంత్రుల స్థాయి భేటీకి ప్రయత్నించగా దానికి తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ నో చెపుతూ.. ముందుగా అధికారుల మధ్య చర్చలు సఫలం అయితేనే రెండు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశం ఉంటుందని స్పష్టం చేసారు. దీంతో క‌నీసం ఈసారి అధికారుల స్థాయి చర్చలలోనైనా ఒక ఒప్పందానికి వచ్చి బ‌స్సులు నడిపిస్తారో లేదో వేచి చూడాలి.

చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ సీబీఐ విచారణ కోరుతున్న వైసీపీ 

ఢిల్లీలో నిన్ననే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఒకపక్క కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుండగా మరో పక్క రాష్ట్రాలకు చెందిన వివిధ సమస్యలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీకి సంబంధించి రాజధాని అంశంలో ఇటు అమరావతి రైతులు తమ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. మరో పక్క సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు మూడు రాజధానులను అడ్డుకునేందుకు లోక్ సభలో పోరాటానికి సిద్దమయ్యారు. ఇప్పటికే దీని గురించి టీడీపీ ఎంపీలు నిన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ను కలిసి ఏపీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ల పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అక్కడ నెలకొన్న వాస్తవ పరిస్థితుల పై వివరించారు. ఆ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలను సరిచేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కేంద్రంపై ఉందని ఈ సందర్భంగా ఎంపీలు అధికారులకు గుర్తు చేసారు. దీంతో న్యాయశాఖ అభిప్రాయాలను తీసుకుని అవసరమైతే అఫిడవిట్‌లు సరిచేసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అజయ్‌భల్లా వారికి హామీ ఇచ్చినట్లుగా కూడా టీడీపీ ఎంపీలు తెలిపారు. దీంతో పాటు ఈ అంశాన్ని లోక్ సభ ప్రస్తుత సమావేశాల్లో లేవనెత్తి అమరావతికి న్యాయం జరిగే దిశగా పోరాటం చేయాలనీ నిర్ణయయించారు.   అయితే టీడీపీ ఎంపీల ఈ ప్రయత్నాన్ని తిప్పి కొడుతూ ఒక పక్క మూడు రాజధానులకు మార్గం సుగమం చేస్తూ.. మరో పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ వైసిపి పావులు కదుపుతోంది. దీని కోసం ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలు, ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో అవినీతిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే దీని పై ఇంకా కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాల పై సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేస్తూ లోక్ సభలో ఈ అంశం లేవనెత్తబోతున్నారు. దీంతో అటు అమరావతి నుండి రాజధానిని మార్చడంతో పాటు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లను టార్గెట్ చేసి ప్రతిపక్షాన్ని కోలుకోలేని దెబ్బకొట్టే ఆలోచనలో వైసిపి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏమైనా సరే రాజధాని, ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని వైసీపీపీ కేంద్రాన్ని పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. టీడీపీ అధినేత తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నేతలకు కూడా ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్ననేపథ్యంలో సిబిఐ విచారణ కు కేంద్రం ఒప్పుకుంటే ఇక టీడీపీ గట్టి దెబ్బ అనే ఆలోచనలో వైసిపి అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నటుగా ఇటు రాజధాని మార్పుతో పాటు అటు రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయవచ్చనేది వైసిపి మంత్రాంగం గా కనిపిస్తోంది. అయితే ఈ ప్రయత్నంలో వైసిపి ఎంతవరకు విజయవంతమౌతుందో వేచి చూడాలి.

హిందూ ఆలయాల నిర్మాణానికి సాయం.. ముస్లిం కుటుంబం ఆదర్శం

కులాలు, మతాల పేరుతో మనుషులకి మనుషులకి మధ్య దూరం పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. మా దృష్టిలో మనుషులంతా సమానం, అన్ని మతాలను గౌరవిస్తాం అంటూ ఓ ముస్లిం జంట ఆదర్శంగా నిలుస్తోంది. అసోంలోని జోర్‌హాట్ జిల్లాకు చెందిన 39 ఏళ్ల హామిదుర్ రహమాన్, ఆయన భార్య పార్సియా సుల్తానాలు.. మసీదులతో పాటు కొన్ని హిందూ ఆలయాల నిర్మాణాలు, మరమ్మతులు చేయించారు. అంతేకాదు, వారికి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయించారు.   హామిదుర్ తండ్రి టీ తోటలో పనిచేసేవారు. అక్కడ వారి కుటుంబం తప్ప, అందరూ హిందువులే ఉండేవారు. టీ తోటలో ఉన్న హరి మందిరంలో పౌరాణిక నాటకాలు వేసేవారు. హామిదుర్ కూడా తన మిత్రులతో కలిసి వాటిలో పాత్రలు వేసేవారు. ఆ విధంగా ఆయనకు అన్ని మతాలపై గౌరవం ఏర్పడింది.    "మా కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు నన్ను ఎప్పుడూ వేరే మతం వాడిగా చూడలేదు. తాను అన్ని మతాలను గౌరవించడానికి ఇదే కారణం. నా స్తోమత కొద్దీ వీలైన సాయం చేస్తుంటా. నా మనసుకు సంతోషం కలగాలని ఈ పని చేస్తున్నాను తప్ప ప్రచారం కోసం కాదు" అని హామిదుర్ మీడియాతో చెప్పారు.   హామిదుర్ రోజూ నమాజ్ చదువుతారు. హిందూ ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారు. వీలైన సాయం చేస్తుంటారు. స్థానికంగా మసీదు నిర్మాణం, సుందరీకరణకు హామిదుర్ దాదాపు రూ.12 లక్షలు దానం చేశారు. ఓ హిందూ మందిరానికి కాళీ మాత విగ్రహాన్ని, త్రిశూలాన్ని, గంటను దానం చేశారు. తితాబర్‌ పట్టణంలో ఓ శివాలయ నిర్మాణానికి కూడా సాయం చేశారు. తితాబర్ హైండిక్ గ్రామంలో ఉన్న మందిరంలో ఒక హాలును, బంగాలీ పట్టీలోని రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో టాయిలెట్లను కట్టించారు. రాధాకృష్ణ మందిర సమీపంలో రోడ్డును కూడా వేయించారు. హిందూ దేవాలయాల నిర్మాణానికి హామిదుర్ సాయం చేస్తుండటాన్ని స్థానిక ముస్లింలు కూడా అభినందిస్తున్నారు.   హామిదుర్‌ కు జోర్‌హాట్‌లోని చినామార్‌లో ఉక్కు పరిశ్రమ ఉంది. ఒకప్పుడు ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, గత కొన్నేళ్లలో వ్యాపారంలో బాగా ఎదిగారని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి తనకి తోచిన సాయం చేయడం మొదలుపెట్టారు. ఆయనకు కుటుంబం కూడా మద్దతిస్తోంది. "సాయం చేయడం కన్నా మంచి పని ఏముంటుంది. మా మొత్తం కుటుంబం ఆయన వెంట ఉంది. మాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి" అని హామిదుర్ భార్య సుల్తానా అంటున్నారు.   కొందరు స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెడుతుంటే.. హామిదుర్ మాత్రం 'మనుషులంతా సమానం, అన్ని మతాలను గౌరవిస్తాం' అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ మంత్రి అవంతికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఇటు సామాన్య ప్రజలనే కాక అటు ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా చుట్టబెడుతున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో మంత్రి వచ్చి చేశారు. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయన తో పాటు ఆయ‌న కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో ప్రస్తుతం ఇద్ద‌రూ హోంఐసోలేష‌న్‌లోకి వెళ్లారు.    తానూ తన కుమారుడు కరోనాకు చికిత్స తీసుకుంటున్నందువల్ల త‌న‌ను నేరుగా కలవడానికి ఎవరూ ఇంటికి రావొద్ద‌ని అయన కోరారు. అలాగే త‌న ఆరోగ్యంపై ‌ఆందోళన చెందవద్దని మంత్రి తన అనుచరులకు తెలిపారు. ఏవైనా అత్య‌వ‌స‌ర‌మైన ప‌నుల‌కు త‌న కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఇంకా ఏదైనా స‌మ‌స్య ఉన్నవారు సిబ్బందిని ఫోన్ లో సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ సింగ్ ఎన్నిక

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ గా జేడీయూ నేత, ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. హరివంశ్‌ సింగ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.    డిప్యూటీ చైర్మన్ పదవి కోసం హరివంశ్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ప్రతిపాదన చేయగా, కేంద్రమంత్రి తవర్చంద్ గెహ్లాట్ బలపరిచారు. అటు, విపక్ష అభ్యర్థిగా ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పేరును కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ ప్రతిపాదించగా, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ బలపరిచారు. వాయిస్‌ ఓట్‌ ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించగా.. మనోజ్‌ ఝాపై హరివంశ్‌ సింగ్‌ విజయం సాధించారు.   రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. హరివంశ్ తొలిసారిగా 2018 ఆగస్టు 8న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్ తో ముగిసింది. అనంతరం మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్‌ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి.    ఇక, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ కి వైసీపీ, టీడీపీ, బీజేడీ మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికకు టీఆర్ఎస్‌ దూరంగా ఉంది.

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కేసు.. పోలీసుల అదుపులో పిటిషనర్‌!!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజుపాలెం మండలం కోట నెలమపురి, కొండమోడు గ్రామాల్లో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌ కి పాల్పడుతున్నారని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ పై స్పందించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని గనుల శాఖను ఆదేశించింది. అయితే, మంగళవారం హైకోర్టులో అక్రమ మైనింగ్ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో.. పిటిషనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.    కోటనెమలిపురి, కుబాద్పురం గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వానికి చెందిన భూముల్లో అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమంగా వైట్‌ లైమ్‌స్టోన్‌ తవ్వకాలకు పాల్పడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ వైసీపీ కార్యకర్తలైన కోటనెమలిపురికి చెందిన పప్పుల శ్రీనివాసరెడ్డి, కొండమోడుకు చెందిన నల్లగొర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ కార్యకర్తల తరఫున హైకోర్టు న్యాయవాది నాగరఘు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై గత నెల 26న విచారణ జరపగా.. పూర్తి నివేదిక తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.   మంగళవారం హైకోర్టులో ఈ అక్రమ మైనింగ్ కేసు విచారిస్తారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ నల్లగొర్ల రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. రామయ్యను ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సెటిల్‌మెంట్‌ కి రావాలని రెండు రోజులుగా అధికార పార్టీ రామయ్యపై ఒత్తిడి పెంచుతోందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

మాట తప్పిన మీరంతా రాజీనామా చేయండి.. వైసీపీకి రఘురామరాజు ఝలక్

వైసిపి పార్టీ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరో సారి అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం జగన్ తన పార్టీ ఎంపీలు అందరికీ ఒక సమావేశం ద్వారా మార్గనిర్దేశం చేశారు. అయితే.. రఘురామ రాజుకి మాత్రం ఈ సమావేశానికి పిలవలేదు. వైసిపి ఎంపీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉందని ఉదయం 9 గంటలకు ఏపీ భవన్ నుంచి అందరికి ఆహ్వానం అందింది. అయితే అంతలోనే 11:10 గంటలకు రఘురామరాజుకు ఫోన్ చేసి పార్టీకి మీకు ఎటువంటి సంబంధం లేదు.. మీరు సమావేశానికి రావొద్దని చెప్పారు. తాజాగా దీనిపై రఘురామరాజు స్పందిస్తూ.. "నన్ను వైకాపా నుంచి బహిష్కరించారనే భావిస్తున్నాను. అయితే దీనిపై రాతపూర్వక సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. అయితే నన్ను బహిష్కరించినప్పటికీ నేను పార్టీ జారీ చేసే విప్ ను మాత్రం పాటిస్తాను. ప్రస్తుతం నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే అర్థం కావడం లేదు. మీడియాలో కూడా విద్యావంతులు ఉన్నారు కాబట్టి దీనిపై మీరు ఎలా రాసుకుంటారో రాసుకోండి" అని మీడియాకు తన అభిప్రాయాన్ని తెలిపారు.   ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అయన ‘‘ఫలానా ఎక్స్ బొమ్మ పెట్టుకుని గెలిచానన్నారు. అయితే నా ముఖంతోనే నేను గెలిచాను. నా ముఖం చూసే ప్రజలు బటన్ నొక్కారు. అది అటు ప్రజలకు కూడా తెలుసు. అంతేకాకుండా నా రక్తం పీల్చేసిన ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇపుడు వెనకడుగు వేసి రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా వెళ్లారు. కాబట్టి మీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. నా ముఖం మాత్రం అక్కడే ఉంది. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నేను నెగ్గాను. అమరావతిపై అపుడు ప్రతిపక్షంలో ఉండి ఇపుడు అధికారంలోకి వచ్చి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు కాబట్టి.. ఒకవేళ రాజీనామా అంటూ చేయాల్సి వస్తే మీరు, మీ మంత్రివర్గం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. నేను చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎప్పటికి పార్టీకి విధేయుణ్ణి.. పార్టీ ఆనాడు చెప్పిన మాటను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇచ్చిన మాట తప్పారు కాబట్టి.. మీరు రాజీనామా చేసుకోండి. నేను మాత్రం రాజీనామా చేయను’’ అని రఘురామకృష్ణం రాజు ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

షాకింగ్.. 25 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

పార్లమెంట్‌ వ‌ర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభ్యులందరూ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. భారీ సంఖ్య‌లో ఎంపీల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఉభ‌య‌స‌భ‌ల‌కు చెందిన 25 మంది ఎంపీలు ఈ మ‌హ‌మ్మారి బారిన‌ ప‌డిన‌ట్టు తెలిసింది. ఇందులో 17 మంది లోక్‌స‌భ ఎంపీలు కాగా.. మిగిలిన వారు రాజ్య‌స‌భ స‌భ్యులుగా గుర్తించారు.   క‌రోనా బారిన‌ ప‌డిన‌ 17 మంది లోక్‌స‌భ ఎంపీలలో 12 మంది బీజేపీ స‌భ్యులు కాగా.. ఇద్ద‌రు వైసీపీ, శివ‌సేన‌, ఆర్ఎల్‌పీ, డీఎంకేకు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీల్లో అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఉన్న విషయం తెలిసిందే. ఇక, 8 మంది రాజ్య‌స‌భ ఎంపీలలో.. ఇద్ద‌రు బీజేపీ, ఇద్ద‌రు కాంగ్రెస్ కాగా.. అన్నాడీఎంకే, టీఆర్ఎస్, ఆప్, తతృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఒక్కో ఎంపీ ఉన్నారు.    పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభమైన విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భల‌ను వేరు వేరు స‌మ‌యాల్లో నిర్వ‌హిస్తున్నారు. లోక్‌స‌భ ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌రిగింది. రాజ్య‌స‌భ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం కాగా, 7 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. కొత్త స‌భ్యులు అజిత్ కుమార్‌, పూలో దేవి నీత‌మ్‌ల చేత చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు.