ఉద్యోగులను పులులుగా మార్చకండి! కేసీఆర్ పై TNGO నేత హాట్ కామెంట్స్ 

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు TNGO రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్. తెలంగాణ పాలనలో కుడితిలో పడ్డ ఎలుకల్లా ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారిందన్నారు. ఏ ఒక్క ఉద్యోగి ముఖంలో నవ్వు లేదన్నారు మామిండ్ల రాజేందర్. తెలంగాణ వచ్చాక నష్టపోయింది ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు. పీఆర్సీ కమిటీ ఉద్యోగుల కాళ్లు కట్టేసిందన్నారు. వరంగల్ లో జరిగిన TNGO సమావేశంలో రాజేందర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.    ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లో పిల్లుల మాదిరి ఉంచడమే ప్రభుత్వానికి మంచిదని.. పులులను చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలతో  నామమాత్ర చర్చలే జరుపుతున్నారని రాజేందర్ తేల్చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు వినతి పత్రాల దగ్గరే ఉంటే.. ఆంధ్రాలో మాత్రం స్పీడుగా జీవో వరకు వెళుతోందన్నారు రాజేందర్.    కండువాల్లేని టీఆరెఎస్ కార్యకర్తలా పని చేశామన్నారు మామిడ్ల రాజేందర్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ పార్టీ కార్యకర్తల్లా ఉద్యోగులు పని చేస్తారని చెప్పారు. జిందాబాద్.. ముర్ధాబద్ అంటే పనులు కావన్న రాజేందర్..  ఆర్టీసి సమ్మె మాదిరి ఆగమాగం చేయబోమని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు చేపించాలని ఉద్యోగులకు సూచించారు. TNGO నాయకునికి టికెట్ అడిగితే తప్పేంటన్నారు. కారం రవీందర్ మరో బాధ్యతలతో మన ముందుకు వస్తారని నమ్మకం ఉందని వరంగల్ ఉద్యోగులతో చెప్పారు మామిండ్ల రాజేందర్.

ఏపీలో కొత్తగా 5,145 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విజృంభణ మునుపటితో పోలిస్తే తగ్గింది. గత కొద్దిరోజులుగా తక్కువ సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో గడచిన 24 గంటల్లో 70,521 శాంపిల్స్ పరీక్షించగా 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 862 మందికి, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 139 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7,44,864కి చేరింది. గత 24 గంటల్లో 31 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,159కి చేరింది. ఇప్పటివరకు 6,91,040 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 47,665 యాక్టివ్ కేసులున్నాయి.

ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 12కి వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 12కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 12 నుంచి రోజువారీ విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.   ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులపై కోర్టులు విచారణ ప్రారంభించాయి.   ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసు వ్యవహారంపై ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కాగా, ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు సెబాస్టియన్, ఉదయసింహ తదితరులు నిందితులుగా ఉన్నారు.   ఈ కేసులో ఆడియో టేపుల విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టు కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఇప్పటికే 960 పేజీలతో కూడిన చార్జిషీటు దాఖలు చేసింది. స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడిదన్నది ఈ కేసులో కీలక అంశం.    2015లో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం కోసం అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను నగదుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో రేవంత్ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇప్పుడు ఈ కేసు విచారం ప్రారంభం కావడంతో.. దీనిపై కోర్టు ఏం తీర్పు ఇస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తాజా మార్గదర్శకాలు వెల్లడించింది. సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మాస్క్‌ లేకుంటే షాపింగ్ మాల్స్‌, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది. విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద శానిటైజర్లు తప్పనిసరి. మాస్కు లేనివారికి ప్రవేశం నిషేధం. సినిమా థియేటర్లలో మాస్కు ధరించటం, శానిటైజేషన్, భౌతిక దూరానికి సంబంధించి ప్రచార ప్రకటనలు వేయాలి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధిగా భౌతికదూరం పాటించాలి. కోవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి. ప్రార్థనా మందిరాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మైకుల ద్వారా మాస్కు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిపై మైకుల ద్వారా ప్రచారం. స్కూళ్లు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి. పాఠశాలల్లో ప్రతి పీరియడ్ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేసుకోవాలి.

మాకు సన్మానం చేస్తున్నవారికి త్వరలో రెట్టింపు సన్మానం.. జేసీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి జగన్ సర్కార్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాడిపత్రి గనుల శాఖ కార్యాలయానికి దివాకరరెడ్డి వచ్చారు. అయితే జేసీ వచ్చిన సమయానికి ఆఫీసులో గనుల శాఖ ఏడీ లేకపోవడంతో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తాను వస్తున్నట్టు తెలుసుకుని ఏడీ పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. తాను మళ్లీ సోమవారం వస్తానని అయన స్పష్టం చేశారు.   అయితే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన.. అధికార పార్టీపై, అలాగే అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం తన కుటుంబంతో దూరంగా ఉంటున్నానని.. తనకు లైవ్ లీ హుడ్ జరగడమే కష్టంగా ఉందని అయన చెప్పుకొచ్చారు. తన భార్య, చెల్లి పేరుతో గనులు ఉన్నాయని.. అయితే ఆ గనులను శోధించడానికి కొన్ని వాహనాల్లో 50 నుంచి 60 మంది వచ్చారు. వారిని చూసి ఇంతకీ వీళ్లెవరబ్బా..? అని అనుకున్నానని జేసీ అన్నారు.   "వైజాగ్ నుంచి నక్సలైట్లు ఏమైనా గనులకు వచ్చారా..? లేక పోలీసులు.. నక్సలైట్ల కోసం గాలిస్తున్నారేమో అనుకున్నానని అన్నారు. అదే ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఇతర నేతలకు కూడా గనులున్నా.. నా భార్య పేరుతో ఉన్న గనులను మాత్రమే పరిశీలించారు. వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధించేందుకే ఆ అధికారులు ఇదంతా చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నా కుటుంబాన్ని అన్ని రకాల బాధలకు గురిచేసింది. ఏమీ లేకుండానే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టి నా బ్రదర్‌ను లోపల వేశారు. ఈ కేసులన్నీ కేవలం కక్ష సాధింపులో భాగమే" అని జేసీ దివాకరరెడ్డి తెలిపారు.   "ఇప్పటి వరకూ జగన్ సర్కార్.. దివాకరరెడ్డిని టచ్ చేయలేకపోయింది. బహుశా నేనెప్పుడూ జగన్‌ను.. మా వాడు.. మా వాడు అంటున్నా కదా. ఆ సంబంధంతోనే ఏమీ చేయలేదు. అయితే తాజాగా గనులను క్లోజ్ చేసేందుకు వారు స్కెచ్ వేస్తున్నారు. ఈ గనులు తప్ప నాకు ఇతర ఆస్తిపాస్తులేమీ లేవు. అందులో వచ్చే ఆదాయంతోనే అన్నం వండుకుని తింటున్నాము. అది కూడా లేకుండా మాడ్చి చంపడానికే చూస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మైనింగ్ కూడా లేకుండా చేయాలనే సంకల్పంతో వాళ్ళు ఉన్నారు." అని జేసీ తెలిపారు.   "నా భార్యకు పెరాలసిస్ వచ్చి.. ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గనుల పర్మిట్ల కోసం మరోసారి వస్తాను. ఇక్కడే కూర్చుంటా.. మైనింగ్‌కు పర్మిట్ ఇవ్వకుంటే అన్నం లేకుండా మాడి పైకి పోతాం. దాంతో వాళ్ల కోరిక కూడా నెరవేరుతుంది. ఇక్కడే కూర్చుని నిరాహారదీక్ష చేస్తా. సోమవారం కూడా గనుల శాఖ ఏడీ గారు దొంగ క్యాంపుకు పోతే పోనీ ఏం చేస్తారు. నాకు సత్కారం చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఇటువంటి ఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాణ్ని. అందరికీ చెబుతున్నా.. ఇపుడు మీరు నాకు సత్కారం చేస్తారు. అందుకు రెట్టింపు సత్కారం మీకు కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది. అపుడు నాకు సత్కారం చేసే పెద్దవాళ్లకు సత్కారం చేసి మా రుణం తీర్చుకుంటాం.. ఇంతకంటే ఘనమైన సత్కారం తీర్చుకోకతప్పదు" అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.   గనుల శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన సమయంలో పోలీసుల వయ్వహారించిన తీరు పట్ల అయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలం మారుతోందని, జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. పోలీసులు ట్రాన్సఫర్లకు బయపడి ఊడిగం చేస్తున్నారని, పోలీసులు ఇలా బానిసల్లా ఎందుకు బతుకుతున్నారో అర్థంకావడంలేదని అయన అన్నారు. "మా ప్రభుత్వం వస్తే... మేం కాదు, మా కార్యకర్తలే మీ సంగతి చూసుకుంటారు. చాలా తొందర్లోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వస్తుంది... అప్పుడు వచ్చే పాలకులు ఇప్పటివాళ్లకన్నా నాలుగింతలు దుర్మార్గులు వస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?" అని అయన ప్రశ్నించారు. మీరంతా ఓ నియంత చెప్పినట్టు చేస్తున్నారు, ఆ నియంత ఎంతకాలం ఉంటాడో తెలుసా? ముస్సోలిని, హిట్లర్ వంటి మహామహులైన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు మాకు సన్మానం చేసిన అధికారులు త్వరలో అంతకు రెట్టింపు సన్మానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అయన అన్నారు.

జ‌గ‌న్ గేమ్ ప్లాన్‌!?

అన‌గ‌న‌గా ఒక కూట‌మి. పెద్ద కూట‌మి. అధికార కూట‌మి. అయినా ఒక‌రిద్ద‌రు ఒక‌రిత‌ర్వాత మ‌రొక‌రు నిష్ర్క‌మించారు. అయినా కూట‌మి కంగారు ప‌డ‌లేదు. నింపాదిగా న‌డుస్తున్న‌ది. కొత్త‌గా ఎవ‌ర్న‌యినా చేర్చుకోవాల‌నుకుంటే అది కూట‌మి నిర్ణ‌యించుకుంటేనే అవుతుంది. అధికార కూట‌మి కాబ‌ట్టి అందులో చేరాల‌ని ఆశించేవాళ్లు మిక్కిలిగానే ఉంటారు. కాని అది చేరాల‌నుకునేవారి ఇష్టాయిష్టాల మీద ఉండ‌దు. కూట‌మి ఆలోచ‌న‌ను బ‌ట్టి ఉంటుంది. తాజాగా ఒక ప్రాంతీయ పార్టీ అందులో భాగ‌స్వామి కావాల‌ని అనుకుంటున్న‌ట్టు అనిపిస్తున్న‌ది. మ‌రి ఈ క‌థ కంచికి ఎలా చేరుతుంది?   నిజానికి ఇది అన‌గ‌న‌గా ఒక క‌థ కాదు. ఆ కూట‌మి మ‌రేదో కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే. ఆ ప్రాంతీయ పార్టీ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైసీపీ. ఈ వారం ఆరంభంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. దీన్ని కేవ‌లం ప్ర‌చారం అని కొట్టేయ‌డానిక్కూడా త‌గిన ఆధారాల్లేవు. ఎందుకంటే..ఆయ‌నంత ఆగ‌మేఘాల మీద ఢిల్లీ వెళ్లాల్సివ‌చ్చింది. ప్ర‌ధాన‌మంత్రి కోరుకున్నారు కాబ‌ట్టి జ‌గ‌న్ అలా హ‌ఠాత్తుగా ఒక్క రోజు ముంద‌స్తు స‌మాచారంతో వెళ్ల‌గ‌లిగారు. అదేరోజు మ‌ధ్యాహ్నం రెండు తెలుగు రాష్ట్రాల జ‌ల వివాదం మీద అపెక్సు కౌన్సిల్ స‌మావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఉభ‌య రాష్ట్రాల సీఎంలు వారివారి రాజ‌ధాని న‌గ‌రాల నుంచి, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి షెకావ‌త్ ఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సి ఉంది. తీరా ప్ర‌ధానితో భేటీ కార‌ణంగా ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో త‌న నివాసం నుంచి వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్నారు. దీన్నిబ‌ట్టి ప్ర‌ధానితో భేటీలో ఒక మ‌ర్మం ఉంద‌న్న ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతున్న‌ట్టే భావించాలి.    ఆ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఎవ‌రి ప్రోద్బ‌లం మీద జ‌రిగింద‌న్న‌ది ఒక అంశం. అపెక్సు కౌన్సిల్ స‌మావేశానికి రెండు రోజుల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రికి ఒక సుదీర్ఘ లేఖ రాశారు. అదంతా స‌హ‌జంగానే తెలంగాణ వాద‌న‌కు బ‌లం చేకూర్చే విధంగా ఉంది. ఆత‌ర్వాతే జ‌గ‌న్‌-మోడీ భేటీ ఖ‌రారైంది. అంటే..అపెక్సు కౌన్సిల్ భేటీకి ముందుగానే జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీని క‌లిసి జ‌ల వివాదంలో ఆంధ్రా వాద‌న‌ను బ‌లంగా వినిపించి అపెక్సు కౌన్సిల్ స‌మావేశంలో త‌మ వాద‌న‌కు మార్గం సుగ‌మం చేసుకోవాల‌నుకున్నారా? అందుకోసం పీఎంఓ ద్వారా ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ తీసుకున్నారా? ఇదీ ఒక అంశ‌మే. కేసీఆర్ లేఖ‌కు మోడీతో భేటీ ఒక స‌మాధాన‌మ‌న్న మాట‌! అయితే ఏపీలో ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఈ వాద‌నేదీ బ‌లంగా చ‌ర్చ‌కు నోచుకోలేదు. కేవ‌లం ఎన్డీయేలో చేరే విష‌య‌మై చ‌ర్చ‌ల‌కు పిలిచిన‌ట్టుగానే ఎక్కువ ప్ర‌చారానికి నోచుకుంది. అయితే ఆ భేటీ అయ్యాక ఏవైపు నుంచీ అందుకు సంబంధించిన స‌మాచార‌మేదీ అధికారికంగా గాని, విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ‌న్న‌ట్టు గాని బైటికి రాలేదు. దీన్నిబ‌ట్టి అస‌లు ఈ అంశంలో ఎన్డీయే అభిప్రాయ‌మేమిటి అన్న సందేహాలు తెర‌మీదికొచ్చాయి.    ఎన్డీయే నుంచి ఈమ‌ధ్యే శిరోమ‌ణి అకాలీద‌ళ్ వైదొలిగిన మాట నిజ‌మే. అంత‌మాత్రాన ఇప్ప‌టికిప్పుడు ఆ శూన్యాన్ని భ‌ర్తీ చేసుకోవాల‌న్న ఆదుర్దా ఆ కూట‌మికేమీ లేదు. అలాంటి వాతావ‌ర‌ణం కూడా క‌నిపించ‌డం లేదు. కాని వైసీపీకి ఎన్డీయే నుంచి సిగ్న‌ల్ అందుతున్న‌ట్టు అంటున్నారు.వైసీపీ మాత్రం ప్ర‌త్యేక హోదా ఇస్తేనే చేర‌తామ‌ని ప్ర‌ధానితో భేటీలో కూడా చెప్పిన‌ట్టు ఒక ప్ర‌చారం జ‌రిగింది. అందుకు ఎన్డీయే నుంచి..హోదా ఇవ్వ‌లేము గ‌న‌క‌..అందుకు త‌గిన‌ట్టు ప్యాకేజీ ఇస్తామ‌ని రాయ‌బారాలు సాగుతున్న‌ట్టు మ‌రొక క‌థ‌నం. అస‌లీ క‌థ‌నాలు అటు ఎన్డీయేతో గాని, ఇటు వైసీపీతో గాని సంబంధం లేకుండానే న‌డుస్తున్నాయా అన్న అనుమానాలూ క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఒక‌వేళ ఎన్డీయేలో చేరాల‌నుకునే ఏ పార్టీ అయినా..మోడీ ముందు, అమిత్ షా ముందు ష‌ర‌తులు పెట్టేంత వాతావ‌ర‌ణం ఉందా? ఆ ప‌రిస్థితి ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందా? ఇలాంటి సంద‌ర్భాల్లో ఉభ‌యుల ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ఒప్పందాలు కుద‌ర‌డం స‌హ‌జ‌మే. ఇరువైపులా వ‌త్తిళ్లు ఉన్న‌ప్పుడే ఇలాంటివి జ‌రిగే వీలుంది. వైసీపీ ష‌ర‌తులు పెట్ట‌డం..ఎన్డీయే వాటిమీద బేర‌సారాలు ఆడ‌టం..ప్ర‌స్తుత రాజ‌కీయ వాతావ‌ర‌ణానికి పొస‌గ‌ని అంశాలుగా క‌నిపిస్తున్నాయి. రాజ్య‌స‌భ‌లో ఎన్డీయేకి బ‌లం త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి, బిల్లుల విష‌యంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు భాగ‌స్వాముల్ని చేర్చుకోవ‌చ్చున‌న్న ఒక‌ప్ప‌టి వాద‌న‌లకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. మొన్నీమ‌ధ్యే చూశాం. క‌రోనా నేప‌థ్యంలో అర‌కొర స‌భ్యుల మ‌ధ్య వ్య‌వ‌సాయ బిల్లుల్ని ప్ర‌భుత్వం క‌నీస లాంఛ‌నాలైనా పాటించ‌కుండా ఆమోదింప‌చేసుకోవ‌డాన్ని క‌ళ్లారా చూశాక కూడా రాజ్య‌స‌భ‌లో బ‌లం కోసం కొత్త‌వారిని కూట‌మిలో చేర్చుకోవ‌డంలాంటిది జ‌రుగుతుంద‌ని భావించ‌గ‌ల‌మా? ఏతావాతా అలాంటి ప్ర‌తిపాద‌నేదైనా ఉంటే..అది వ‌చ్చే అసెంబ్లీ..పార్ల‌మెంటు ఎన్నిక‌ల కోస‌మే అవుతుంది త‌ప్ప వేరే కార‌ణాల కోసం మాత్రం కాదు.    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఇంకా ఇంకా బ‌ల‌హీన‌ప‌రిచి, క‌నుమ‌రుగు చేస్తేనే అటు బీజేపీకి గాని, ఇటు వైసీపీకి గాని ప్ర‌శాంత‌త ఉండ‌ద‌న్న‌ది నిజం. ఇక్క‌డ ఈ ఇద్ద‌రి ఉమ్మ‌డి శ‌త్రువు తెలుగుదేశంగా భావిస్తున్నంత కాలం ఈ ఇరువురి మ‌ధ్య నెయ్యం గురించి ఇలాంటి ఊహాగానాలు వ‌స్తూనే ఉంటాయి. కాని బీజేపీకి తెలుగుదేశంతో పాటు వైసీపీ కూడా టార్గెట్ అయి, ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకుంటే ప‌రిస్తితి వేరేగా ఉంటుంది. మ‌రి ఈ విష‌యం తేలేదెప్పుడు? ప‌్ర‌స్తుతం బీజేపీ బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల మీద త‌న శ‌క్తియుక్తులు కేంద్రీక‌రించింది. అక్క‌డ స‌రికొత్త రాజ‌కీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. ప‌రిస్థితి అనుకూలించ‌క‌పోతే..అనువు గాని చోట అధికుల‌మ‌న‌రాదు అన్న సామెత‌కు అనుగుణంగా నితీష్ కుమార్‌తో క‌ల‌సి న‌డ‌వ‌డ‌మే..ఆయ‌న్ని ముఖ్య‌మంత్రిగా అంగీక‌రించ‌డ‌మే. కాదంటే..అంకెల్లో ఆశాజ‌న‌క‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డితే..తానే అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం..ఇదీ బీజేపీ వ్యూహం. ఇందుకు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు బీజేపీ అడుగుల్లో అడుగేస్తూ స‌హ‌క‌రిస్తున్నాడు. ఎన్నిక‌లైపోయి, ఫ‌లితాలొచ్చి, ప్ర‌భుత్వ‌మెవ‌రిదో తేలాక ఏపీలో ప‌రిస్థితి మీద బీజేపీ మ‌రింత శ్ర‌ద్ధ పెడుతుంది. ఎన్డీయే కూట‌మిలోకి వైసీపీని ఆహ్వానించేదీ లేనిదీ తెలిసేది అప్పుడే! -రాజా రామ్మోహ‌న్ రాయ్

త్వరలో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వ్యాపారాలు పేరిట బ్యాంకుల నుంచి రుణం తీసుకుని రూ.826.17 కోట్ల మేర దారి మళ్లించారన్న ఆరోపణలపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. అయితే, ఈ అంశంపై రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఎంపీగా అనర్హుడ్ని చేయలేని వైసీపీ నేతలు ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.    తాను బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగవేశానంటూ రాయడం ద్వారా ఓ పత్రిక విశ్వసనీయత పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. బ్యాంకుల నుంచి మేం తీసుకున్న రుణం రూ.4 వేల కోట్ల లోపే ఉంటుందన్నారు. అందులో రూ.2 వేల కోట్లు ఇంకా బ్యాంకు ఖాతాల్లోనే ఉన్నాయని తెలిపారు. అక్టోబరు 6న తనపై కేసు నమోదైందని చెప్పిన ఆయన.. అదే రోజున సీఎం జగన్ ప్రధాని మోదీని కలవడం, పీఎన్ బీ బ్యాంకు చైర్మన్ ను కలవడం అనుమానాలు కలిగిస్తోంది అన్నారు.    తమ వ్యాపారాల్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెబుతానని తెలిపారు. తనపై సీబీఐ కేసు వేయించేలా చేసింది సీఎం జగన్ కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ అని ఆరోపించారు. కేంద్ర ఆర్థికశాఖలో ప్రవీణ్ ప్రకాష్ బ్యాచ్ మేట్ ఉన్నారని, ఆయన ద్వారానే ఈ కేసు వేయించారని పేర్కొన్నారు.   వాళ్లపై రూ.43 వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉండడంతో తనపై రూ.23 వేల కోట్లు అని ఆరోపణలు చేశారనుకుంటున్నానని ఎద్దేవా చేశారు. అవాస్తవాలతో కథనాలు రాసిన వారిపై కేసులు వేద్దామని మా లాయర్లు చెబుతున్నారు కానీ, మరో మూడ్నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరో కేసు వేయడం ఎందుకుని ఆగిపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగతి పబ్లికేషన్ కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యనించారు.

వైఎస్ జగన్‌ కేసుల విచారణ 12కి వాయిదా

హైదరాబాద్‌ లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ ఈ నెల 12 కి వాయిదా పడింది. అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసులను నవంబరు 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.   ఈ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం విచారణ జరిగేది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులు, మాజీలకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది. దీంతో ఈ కేసు విచారణ ఇక నుండి రోజువారీ సాగనుంది. ఈ నేపథ్యంలో కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.    జగన్‌, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిని కోర్టు అంగీకరించింది. కరోనా నేపథ్యంలో.. కోర్టు హాలులో ఎక్కువమంది న్యాయవాదులు, నిందితులు ఉండటం ఇబ్బందిగా ఉండటంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని, జగన్‌ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. తాము కూడా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.    జగన్‌ కేసులో నాలుగు ఛార్జిషీట్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఉంది. స్టే ఉన్న కేసులను నవంబర్‌ 9 కి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. ఇతర కేసుల విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.   కాగా, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను సత్వర విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో జగన్ కి ఇబ్బంది తలెత్తే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు, వాన్‌ పిక్‌ కు భూకేటాయింపులతో పాటు ఎమ్మార్‌ వ్యవహారంపై నమోదు చేసిన ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. ఈ కేసులలో సత్వర విచారణ జరిగి ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

దిశా చట్టం నిద్రపోతోందా సీఎం గారూ.. లోకేష్ ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేసారు. ఏపీలో బాలికలు, మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అయన మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించకుండా, రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. అసలు "దిశ చట్టం నిద్రపోతుందా వైఎస్ జగన్ గారు? తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైకాపా నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం" అని నారా లోకేశ్ అన్నారు. అంతేకాకుండా "చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ ? ప్రచార ఆర్భాటంతో మొట్ట మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణకు బాక్సులు.. ఏపీలో లోకల్ ఫైట్ ఇప్పట్లో లేనట్టే!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగడం కష్టమే. లోకల్ బాడీ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి తెప్పించిన బ్యాలెట్ బాక్సులు తిరిగి వెళుతున్నాయి. డిసెంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరపాలని భావిస్తున్న తెలంగాణ ఎన్నికల సంఘం.. గతంలో ఏపీకి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులను తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో ఏపీ ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులను తెలంగాణకు పంపించేస్తున్నారు.    ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. బ్యాలెట్ పద్దతిలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల పోలింగ్ కోసం తెలంగాణ నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. తెలంగాణ‌లోని వివిధ జిల్లాల నుండి 30వేల బ్యాలెట్ బాక్సుల‌ను తీసుకొచ్చారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడినా.. బ్యాలెట్ బాక్సులు ఏపీలోనే ఉండిపోయాయి. తెలంగాణ అధికారులు కోరడంతో ఇప్పుడు వాటిని తిరిగి పంపిస్తున్నారు. ఇప్పటికే ఏడు జిల్లాల్లో భద్రపరిచిన 17 వేల 366 బ్యాలెట్ బాక్స్‌లు రిటర్న్ పంపించారు.  మిగిలిన 12,366 బ్యాలెట్ బాక్సుల‌ను కూడా హైదరాబాద్ పంపించేందుకు ఏపీ ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో అన్ని బ్యాలెట్ బాక్సులు పంపించనున్నారు.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నిర్వహించే బ్యాలెట్ బాక్సులు.. ఫలితాల తర్వాత కొన్ని నెలల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ఇప్పట్లో బ్యాలెట్ బాక్సులు తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావడం సాధ్యం కాదు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జరపాలంటే బ్యాలెట్ బాక్సులు అవసరం. ఇందుకోసం తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఇంకా ఎన్నికల అధికారులు మొదలు పెట్టలేదు. ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేసినా.. బాక్సులు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన ఇప్పట్లో స్థానిక  సంస్థల ఎన్నికలను ఏపీలో నిర్వహించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   బీహార్ అసెంబ్లీతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఏపీలోనూ వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్ లో నిర్వహించాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల కోసం తెప్పించిన బ్యాలెట్ బాక్సులను తిరిగి తెలంగాణకు పంపించడంతో.. ప్రభుత్వం భావిస్తున్న డిసెంబర్ లో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహించడం దాదాపు అసాధ్యమని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే.. ఇతర రాష్ట్రాల నుంచి ఆగమేఘాల మీద బ్యాలెట్ బాక్సులు తెప్పించాల్సి ఉంటుంది. ఏపీ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టర్మ్ వచ్చే ఏప్రిల్ తో ముగియనుంది. అప్పటివరకు ఎన్నికలు జరగపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

డాక్టర్ శిల్ప సూసైడ్ కేసులో నిందితులకు మళ్ళీ పోస్టింగ్.. ఫైర్ అవుతున్న బంధువులు 

తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంతో డాక్టర్ శిల్ప 2018 ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 2018 నవంబర్ 9వ తేదీన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పనిచేసే ముగ్గురు ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సీఐడీ నివేదిక కూడా ఇచ్చింది. లైంగిక వేధింపులకు సహకరించనందుకే డాక్టర్ శిల్పను ఎండీ పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఈ నివేదిక తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లను అప్పట్లో ప్రభుత్వం విధుల నుండి తప్పించింది.   ఇది ఇలా ఉండగా నిన్నటి వరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి టీటీడీ ఈఓ గా బదిలీ అయి వెళ్లే ముందు చివరి ఉత్తర్వులుగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లకు తిరిగి పోస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి తిరిగి పోస్టింగ్స్ ఎందుకు ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఫోన్లు ట్యాపవుతున్నాయా! నగదు అలానే దొరికిందా? 

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక  తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దుబ్బాక హాట్ హాట్ గా మారింది. గెలుపు కోసం ప్రచార వ్యూహాలు రచిస్తూనే.. విపక్షాలను దెబ్బకొట్టే ఎత్తులు వేస్తున్నాయి పార్టీలు.  ప్రధాన పార్టీల ముఖ్యనేతలంతా దుబ్బాకలోనే మకాం వేశారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరింది. ఎలాగైనా గెలిచేందుకు డబ్బులను కూడా పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో మనీ, మందు పంపకాలు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. గ్రామాల్లో ప్రలోభాలు, బేరసారాలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారు.   రెండు రోజుల క్రితం షామీర్ పేట దగ్గర పోలీసులు ఓ వాహనంలో నలభై లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇది బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు కు చెందినదిగా వెల్లడించడంతో కలకలం రేగింది. నగదుతో పట్టుబడిన వారితో రఘునందన్ రావు పీఏ మాట్లాడినట్లు తమకు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఇఫ్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.    త‌న ఫోన్ తో పాటు త‌న సిబ్బంది ఫోన్ల‌ను తెలంగాణ స‌ర్కారు ట్యాపింగ్ చేస్తుందంటూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేర‌కు తెలంగాణ పోలీసు విభాగం ఈ ప‌నిచేస్తుంద‌ని, వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని ఆయన కేంద్రాన్ని కోరారు. అక్టోబ‌ర్ 5 న జ‌రిగిన సంఘ‌ట‌న ద్వారా ఇది రుజువ‌య్యింద‌ని, వెంట‌నే  ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచార‌ణ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ర‌ఘునంద‌న్ రావు కోరారు.   బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం వల్లే నగదు దొరికిందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు ఆయన ముఖ్య అనచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ విపక్ష నేతలను టార్గెట్ చేస్తుందని చెబుతున్నారు. సొంత పనుల కోసం తీసుకెళుతున్న డబ్బులను అక్రమ నగదుగా చూపించే కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.    దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఈజీగానే గెలుస్తుందని మొదట భావించారు. అధికార పార్టీగా ఉండటంతో పాటు ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ఉంది కాబట్టి గెలవడం కారుకు పెద్ద కష్టం కాదనుకున్నారు. కాని ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అధికార పార్టీ గట్టి పోటీనే ఎదుర్కొంటుందని తెలుస్తోంది. నెల రోజుల క్రితమే ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. ఇప్పటికే నియోజకవర్గంలోని గ్రామాలన్ని ఒకసారి చుట్టేశారు. రఘునందన్ రావుకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని చెబుతున్నారు. టీఆర్ఎస్ సర్వేల్లోనూ అదే తేలిందట. దీంతో అధికార పార్టీ అప్రమత్తమై విపక్ష నేతలపై నిఘా పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.    శామిర్ పేట ఘటనతో బీజేపీ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎత్తులకు చిక్కకుండా ప్రచార పర్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారట. కాంగ్రెస్ నేతలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నారట. మొత్తంగా పోటా పోటీగా సాగుతూ రాజకీయ హీట్ రేపుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో... పోలింగ్ నాటికి ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరీ..

వైసీపీ ఎంపీ రఘురామరాజుపై సీబీఐ కేసు నమోదు..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆయన భార్య రమాదేవిపై తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్- భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ కు సంబంధించిన విషయంలో వీరితో పాటు మరో 9 మంది డైరెక్టర్ల పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీకి రుణం ఇచ్చిన బ్యాంకుల తరఫున పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరబ్ మల్హోత్రా మొన్న మార్చి నెల 21వ తేదీన ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు ఆధారంగా గత మంగళవారం సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న హైదరాబాదు, ముంబై నగరాల్లోనూ, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు.   ఎఫ్ఐఆర్ లోని వివరాల ప్రకారం.. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంకులు కలిసి ఎంపీకి చెందిన ఇండ్ - భారత్ సంస్థకు మొదట రూ.941.80 కోట్లు, దానికి అనుబంధం రూ.62.80 కోట్లు కోట్లు మంజూరు చేశాయి. ఇండ్- భారత్ సంస్థ మొదట కర్ణాటకలో ఒక పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో దాన్ని తమిళనాడులోని ట్యూటికోరిన్ కు మార్చింది. అయితే సంస్థ ఏర్పాటైనప్పటి నుండి వివిధ పద్ధతుల్లో దీనికి సంబంధించిన నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా విద్యుదుత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు విషయంలో కూడా మాయ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సరైన రికార్డులు కూడా కంపెనీ వద్ద లేవు. దీంతో కంపెనీ లావాదేవీల్లో అవకతవకలపై బ్యాంకులు ఎప్పుడు ప్రస్తావించినా ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో సంస్థను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చారు. నిందితులంతా కలిసి తమ ప్రయోజనం కోసం ప్రయత్నించి రూ.826.17 కోట్ల నష్టం కలిగించారు దానిపై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద సైతం కేసులు నమోదు చేశారు.

‘గ్రేటర్’లో రిజర్వేషన్ లొల్లి

మాకొద్దంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు   కేటీఆర్‌కు మొర పెట్టుకుంటున్న నేతలు   నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. దీనితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలయింది. ఓ వైపు పార్టీలు వ్యూహరచనలో మునిగిపోగా, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, రిజర్వేషన్ల వ్యవహారం పితలాటకంగా మారింది. 2016 నాటి గ్రేటర్ ఎన్నికల్లో, ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా చేసిన రిజర్వేషన్ల ప్రక్రియ, ఇప్పుడు ఇబ్బందిగా పరిణమించిందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశంపై వారంతా, ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో.. పార్టీ అగ్రనేత కేటీఆర్‌కు చెప్పి, తమ ఈతిబాధలు వెళ్లబోసుకున్నారట. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న రిజర్వుడు స్థానాలు మార్చాలని కేటీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.   గత ఎన్నికల్లో నగరంలోని మొత్తం 150 డివిజన్లలో.. ఎస్టీలకు ఒక జనరల్-ఒక మహిళ వార్డు కేటాయించారు. ఎస్సీలకు 5 జనరల్- 5 మహిళా వార్డులు కేటాయించారు. బీసీలకు 25 జనరల్-25 మహిళా వార్డులు; మహిళ (జనరల్)కు 44 వార్డులు; అన్ రిజర్వుడు-44 డివిజన్లు కేటాయించారు. అయితే, అప్పట్లో తెరాస టికెట్ల ఎంపిక కూడా హడావిడిగా జరిగింది. ఎవరంటే వారికి, ముఖ్యంగా ఉద్యమంలో ఉత్సాహంగా పనిచేసిన వారితోపాటు, స్థానిక ఎమ్మెల్యే-ఇన్చార్జులు చెప్పిన వారికి సీట్లు ఇచ్చారు.   ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత, నగరంపై టీఆర్‌ఎస్ పట్టు మరింత పెరిగింది. నగరంలో మజ్లిస్ తప్ప, మరో పార్టీకి స్థానం లేకుండా పోయింది. బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. దీనితో కార్పొరేటర్ల సీట్లపై నియోజకవర్గ-ద్వితీయ స్థాయి నేతల ఆశలు పెరిగాయి. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల స్థానాల్లో, ఎమ్మల్యేలు ఇప్పటికే తమ అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 75 స్థానాల్లో మహిళా కార్పొరేటర్లే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. వారిలో 90 శాతం వరకూ పెత్తనం చేసేది, వారి భర్తలు లేదా తండ్రులేనన్నది బహిరంగ రహస్యం. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకటంలా పరిణమించింది. వారిని గట్టిగా మందలించలేని పరిస్థితి. కొంతమంది మహిళా కార్పొరేటర్లు మాత్రం క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉంటే, చాలామంది కార్పొరేటర్ల పెత్తనాన్ని భర్తలే చెలాయిస్తున్న పరిస్థితి నెలకొంది.     ఈ నేపథ్యంలో, తమ నియోజకవర్గాల వరకూ మహిళా రిజర్వేషన్లు లేకుండా చూడాలని, మహిళా రిజర్వేషన్లు ఉన్న డివిజన్లను సాధ్యమయినంత వరకూ.. బీసీ జనరల్ లేదా జనరల్ రిజర్వేషన్లు వచ్చేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. నగరంలో సికింద్రాబాద్-సనత్‌నగర్ నియోజవర్గాల్లోనే ఎక్కువగా మహిళ జనరల్, ఎస్సీ, బీసీ స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇక్కడ పురుష కార్పొరేటర్ల శాతం బహు తక్కువ. దీనితో పార్టీకి పనిచేసిన మగవారికి, అవకాశం కల్పించే పరిస్థితి లేకుండా పోతోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. గతంలో బీసీలు ఎక్కువగా ఉన్న డివిజన్లను కూడా, ఎస్సీ రిజర్వుగా మార్చారన్న విమర్శలున్నాయి.   అయితే.. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం, మహిళలు ఉంటేనే తమకు నెత్తినొప్పి ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. మగవారయితే, ఒకవేళ వారు ఆర్ధికంగా బలంగా ఉంటే.. తమపైనే గ్రూపులు కట్టే ప్రమాదం ఉందని, అదే మహిళలయితే ఆ సాహసం చేయరన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, పార్టీకి చెందిన మహిళా నేతలు మాత్రం, పార్టీలో మొదటి నుంచీ పనిచేస్తున్న తమకు కాకుండా, నేతల భార్యలకు టికెట్లు ఇప్పించుకుంటున్న సంప్రదాయానికి, ఈసారయినా తెరదించాలని కేటీఆర్‌కు మొరపెట్టుకుంటున్నారు.   ఈ ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు.. తమ వారసులను రంగంలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. అయితే, ఇప్పటి రిజర్వేషన్లే మళ్లీ కొనసాగితే.. కొడుకులకు బదులు, కోడళ్లను నిలబెట్టాలన్న నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఉన్న మునిసపల్ చట్టాన్ని కొనసాగిస్తారా? లేక జీహెచ్‌ఎంసీ చట్టాన్ని కూడా, దానికి వర్తింపచేస్తూ ఆర్డినెన్స్ ఇస్తారా? అన్నది చూడాలి.  -మార్తి సుబ్రహ్మణ్యం

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత.. రేపు పాట్నాలో అంత్యక్రియలు

కేంద్ర మంత్రి, లోక్ జన్‌ శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ నిన్న రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. రాంవిలాస్‌ పాశ్వాన్‌ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా రాం విలాస్ పాశ్వాన్ కొనసాగుతున్నారు.   పాశ్వాన్ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ 12 జన్‌పథ్‌లోని ఆయన నివాసానికి తరలిస్తారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం పాట్నకు తరలించనున్నారు. పట్నాలోని లోక్‌జనశక్తి పార్టీ ఆఫీసులో మద్దుతుదారులు, అభిమానులు నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రేపు అంటే శనివారం పట్నాలో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.   రామ్‌విలాస్ పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇది తనకు మాటలకందని విషాదమని పేర్కొన్న ప్రధాని మోదీ.. ఆయన లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.

హత్రాస్ కేసులో మరో ట్విస్ట్.. బాధితురాలు నా ఫ్రెండ్ అంటూ నిందితుడు లేఖ!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత యువతి, తాను మంచి ఫ్రెండ్స్ అంటూ ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్ జిల్లా ఎస్పీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది.   యువతి మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని సందీప్ ఠాకూర్ జిల్లా ఎస్పీకి లేఖ రాశాడు. బాధితురాలు, తాను స్నేహితులమని.. తమ స్నేహాన్ని సహించలేక యువతిని ఆమె తల్లి, సోదరులు కొట్టి హింసించారని లేఖలో పేర్కొన్నాడు. యువతిని కలిసేందుకు పొలానికి వెళ్లగా, అక్కడ ఆ యువతితో పాటు ఆమె తల్లి, సోదరులు ఉన్నారని చెప్పాడు. అయితే, వాళ్ళు తనను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తే వెళ్లానని తెలిపాడు. వాళ్ళే ఆ యువతిని కొట్టి చంపి, తనతో పాటు మరో ముగ్గురిపై నేరం మోపారని సందీప్ ఠాకూర్ లేఖలో పేర్కొన్నాడు. అయితే, సందీప్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను బాధితురాలి తల్లిదండ్రులు ఖండించారు.   బాధిత యువతి, తాను మంచి ఫ్రెండ్స్ అని.. ఆమె తల్లి, సోదరులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ప్రధాన నిందితుడు లేఖ రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అక్కడి పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం చూస్తుంటే.. కేసుని కేసుని తప్పుదోవ పట్టిస్తూ, కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కవితకు దసరా గిఫ్ట్! ఆ మంత్రికి టెన్షన్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసింది. కౌంటింగ్ ఈనెల 12న జరగనున్నా... ఫలితమేంటో అందరికి ముందే తెలిసిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఏకపక్షంగానే సాగడంతో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే. ఎమ్మెల్సీగా కవిత విజయంపై ఎవరికి అనుమానం లేకున్నా.. ఆమె గురించే ఇప్పుడు మరో చర్చ నిజామాబాద్ జిల్లాలో ఊపందుకుంది. శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న కవితకు సీఎం కేసీఆర్ త్వరలోనే మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే చర్చ జిల్లాతో పాటు టీఆర్ఎస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. కవితకు కేసీఆర్ దసరా కానుక ఇవ్వబోతున్నారని ఆమె అనుచరులు, అభిమానులు ప్రచారం మొదలుపెట్టేశారు.   రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత  కీలకంగా మారనున్నారనే చర్చ టీఆర్ఎస్ పార్టీలోనూ జరుగుతోంది. కవిత ఎమ్మెల్సీ గా మాత్రమే పరిమితం కారని , మంత్రిగా రాష్ట్ర రాజకీయాలలో పని చేస్తారని  నిజామాబాద్ జిల్లా గులాబీ నేతలు కూడా చెబుతున్నారు. అయిదేళ్లపాటు ఎంపీగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కవిత.. ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారని చెబుతున్నారు.    నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు కవిత. పరాజయం తర్వాత ఆమె పాలిటిక్స్ లో సైలెంట్ అయ్యారు. చాలా రోజుల పాటు బయటికి కూడా రాలేదు. గత సంవత్సరం జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోలేదు. చివరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమె జోక్యం చేసుకోలేదు. కవిత రాజకీయ భవిష్యత్ పై రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి. అయితే ఇంతకాలం రాజకీయాలకు దూరంగా సైలెంట్ గా ఉన్న కవిత.. సడెన్ గా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగారు. కవితను ఎమ్మెల్సీగా బరిలోకి దింపిన సీఎం కేసీఆర్.. అంతటితో ఊరుకోరని.. ఆమెకు కచ్చితంగా ప్రమోషన్ ఉంటుందని తెలంగాణ భవన్ లోనూ చర్చ జరుగుతోంది. సమయం చూసే కవితను మళ్లీ యాక్టివ్ చేశారని చెబుతున్నారు. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్.. రాష్ట్ర పాలనా పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారనే చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కవితను ఎమ్మెల్సీ చేశారని, కేబినెట్ లోకి  తీసుకుని కేటీఆర్ కు సపోర్ట్ గా ఉంచుతారనే వాదన గులాబీ పార్టీలో వినిపిస్తోంది.    మరోవైపు కవిత రీ ఎంట్రీతో నిజామాబాద్ జిల్లాలో ఆమె అనుచరుల్లో సంతోషం కనిపిస్తుండగా, మరికొందరు గులాబి నేతలలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది. కవితకు మంత్రిగా అవకాశం ఇస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి అవుట్ అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆ మంత్రి పనితీరుపై పార్టీలోనూ అసంతృప్తి ఉందని తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోనూ ఆయనకు సఖ్యత లేదని సమాచారం. అందుకే ఆ మంత్రికి చెక్ పెట్టేందుకే కవితను ఎమ్మెల్సీగా పోటీ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా  కవిత గెలుపు కోసం ఆ మంత్రి కష్టపడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ చేరేలా పావులు కదిపారు. చాలా మందిని కారు ఎక్కించారు. ఇన్ని రోజులుగా కవిత గెలుపు కోసం కష్టపడుతున్న ఆ మంత్రికి.. కవిత రూపంలోనే గండం వచ్చిందని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వందనాలు సరే వేతనమేది! గ్రామ స్వరాజ్యమంటే ఇదేనా?

వాలంటీర్లకు వందనాలన్నారు. అద్భుత సేవలు చేస్తున్నారంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. సచివాలయ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడి కొనియాడారని గొప్పలు చెప్పారు. వారికి మద్దతుగా చప్పట్లు కొడుతూ అధికార పార్టీ నేతలు షో చేశారు. సీఎం జగన్  కూడా ఇంటి బయటికి వచ్చి చప్పట్లు కొట్టారు. మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైందని గొప్పగా చెప్పారు. వాలంటీర్లు కాదు వారియర్స్ అని కీర్తించారు. అయితే సీఎం జగన్  చెబుతున్న వారియర్స్.. ఇప్పుడు వైసీపీ పాలనను ఛీదరించుకుంటున్నారు. తమకు వేతనాలు ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఏడాదిగా తమతో వెట్టి చాకిరి చేయిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వని జగన్ ప్రభుత్వాన్ని నడి రోడ్డుపై నిల్చుని నిలదీస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు.     వైసీపీ నేతలు గొప్పగా చెబుతున్న సచివాలయ వ్యవస్థ మరో కోణంలో అధ్వాన్నంగా ఉంది. సచివాలయ వ్యవస్థను ప్రారంభించి రెండు లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది వైసీపీ ప్రభుత్వం. ఏడాదిగా వారి సేవలు ఉపయోగించుకుంటూ.. వారికి వేతనాలు మాత్రం ఇవ్వలేదు. తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్క నెల వేతనం మాత్రమే ఇచ్చిందని తెలుస్తోంది. వేతనాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదట. అందుకే చేసేది లేక వారంతా రోడ్డెక్కారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 96 మంది వాలంటీర్లు ఆందోళనకు దిగారు. 11 నెలలుగా తమకు జీతాలు రావడం లేదంటూ ధర్నా చేశారు. వెంటనే తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.   తూర్పు గోదావరి జిల్లానే కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. వేతనాల రాక వాలంటీర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. కొన్ని జిల్లాలో ఆరు నెలలు, కొన్ని జిల్లాల్లో 11 నెలల వేతనాలు పెండింగులో ఉన్నాయంటున్నారు. కరోనా టైమ్ లో ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించుకుని కూడా వేతనాలు ఇవ్వలేదని వాలంటీర్లు వాపోతున్నారు. సచివాలయ వ్యవస్థ గురించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్న జగన్ సర్కార్.. వారికి వేతనాలు ఇవ్వకపోవడం విస్మయపరుస్తోంది. జగన్ చెబుతున్న గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.    గ్రామ స్వరాజ్యం పేరుతో ఏడాది క్రితం సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది జగన్ సర్కార్. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 61 వేల మంది వలంటీర్లను నియమించింది. గ్రామ వాలంటీర్ గౌరవ వేతనాన్నిఐదు వేల రూపాయలుగా ప్రకటించింది. విడతల వారీగా వేతనాలు పెంచుతామని చెప్పారు జగన్. అయితే వేతనం పెంచడం కాదు.... ఇస్తామన్నది ఇవ్వడమే మానేసింది వైసీపీ ప్రభుత్వం. వేతనాలు రాకపోవడంతో వాలంటీర్లు కష్టాలు పడుతున్నారు. తమ బాధలు, సమస్యలు ఎవరితో చెప్పుకోవాలే తెలియక.. ఏం చేయాలో అర్ధంకాక లోలోపలే కుమిలిపోతున్నారు. కొందరు మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వాలంటీర్లతో పనులు చేయించుకుని జీతాలు ఇవ్వకుండా వేధించడంపై అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.    కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. ప్రభుత్వ పథకాలు రావాలంటే తమకు లంచం ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారని ఇప్పటికే  చాలా ఫిర్యాదులు వచ్చాయి. రేషన్‌ కార్డు మంజూరుకు లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వాలంటీర్లు  ఫింఛనుదార్లను మోసగించి వసూళ్ళకు పాల్పడ్డారు. విశాఖ జిల్లా పాయకరావు పేటలో పెన్షన్ ఆపేస్తానని బెదిరింది  ఓ వాలంటీర్... 70 మంది ఫింఛన్ దారుల నుండి దాదాపు 2 లక్షల రూపాయలు వసూల్ చేసిన వ్యవహారం కలకలం రేపింది. ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో కొందరు వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం వల్లే వాలంటీర్లు వక్రమార్గం పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెలల నుండి వేతనాలు రాకపోవడంతో వాలంటీర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.    గ్రామ స్వరాజ్యం, గాంధీ కలల పథకం అంటూ గొప్పలు చెప్పడం కాదు.. వ్యవస్థను సక్రమంగా నడిపించాలనే అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతోంది. వాలంటీర్ సిస్టమ్ గురించి గొప్పగా చెప్పుకుంటూన్న జగన్ ప్రభుత్వం.. వారికి వేతనాలు ఇందుకు ఇవ్వలేదో చెప్పాలంటున్నారు. చప్పట్లు కొట్టి షో చేయడం కాదు.. వారి సమస్యలు పరిష్కరించాలని సూచిస్తున్నారు. వైసీపీ నేతల ప్రచారం చూసి సచివాలయ వ్యవస్థ గొప్పగా ఉందని భావిస్తున్న వారికి .. వాలంటీర్లకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని తెలిస్తే రాష్ట్రం పరువు పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వంశీ చేతిలో, వెంకట్రావు చేయి ఉంచి రాజీ చేసిన సీఎం జగన్.. ఇక అంతా ఓకేనా.. 

గన్నవరం నియాజకవర్గంలో టీడీపీ తరుఫున ఎన్నికైన ఎమ్మెల్యే వంశీ తరువాతి కాలంలో వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గంలో అయన పై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుతో ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో తాను ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటానని వంశీ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా కృష్ణ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసారు.   ఈరోజు కృష్ణా జిల్లాలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ పునాదిపాడుకు చేరుకోగా.. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు కూడా అందులో పాల్గొన్నారు. అయితే సీఎం స్కూల్ లోకి వెళ్లే సమయంలో జిల్లా ముఖ్య నేతలు అయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు యార్లగడ్డ వెంకట్రావు అభివాదం చేసారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేతిలో వెంకట్రావు చేతిని ఉంచి ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. అయితే ఇదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు సీఎం జగన్ కు ఏదో చెప్పే ప్రయత్నం చేయగా సీఎం మాత్రం అయన చెప్పే మాటలను వినకుండానే ఆయనను ఆప్యాయంగా పట్టుకొని కలిసి పనిచేయాలని సూచించి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ మొత్తం తతంగాన్ని పక్కనే ఉన్న ఎమ్మెల్యే వంశీ చూస్తూండిపోయారు.