గులాం నబీ ఆజాద్‌ కు కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం హోం క్యారంటైన్ లో ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అయితే, ఆజాద్‌ కు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.   దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 63,371 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469 కి చేరింది. కరోనా కారణంగా మరో 895 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,12,161 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,04,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జైలుకెళ్తాననే భయంతోనే సీఎం జగన్ తప్పుమీద తప్పులు... యనమల సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ రాయడం.. గోప్యంగా ఉంచాల్సిన ఆ లేఖను తరువాత ప్రెస్ కు రిలీజ్ చేయడం పై అటు ఏపీలోను ఇటు న్యాయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై పలు బార్ అసోసియేషన్లు.. పలువురు సీనియర్ న్యాయవాదులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నారని... సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని సీనియర్ న్యాయవాదులే చెప్పారని అన్నారు. దీంతో జగన్ పై కోర్ట్ ధిక్కరణ కేసు ఖాయమని చెప్పారు.   దీంతో ''జైలుకెళ్తాననే భయంతో సీఎం జగన్ తప్పుమీద తప్పులు, అలాగే తప్పుడు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ జైలుకు వెళ్తాడనే చర్చ అయన సొంత పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ తర్వాత సిఎం ఎవరనే ఆలోచనలు కూడా వైసిపిలో జోరుగా చేస్తున్నారు. జగన్ లోని ఆందోళన, వైసిపి కార్యకర్తల్లో చర్చలు ఈ లేఖలో స్పష్టంగా ప్రతిబింబించాయి'' అని అయన అన్నారు.   అంతేకాకుండా ''భస్మాసురుడి మార్గంలో జగన్ నడుస్తున్నాడు. భస్మాసురుడి తరహాలోనే తన చెయ్యి తననెత్తిపై జగన్ ఇప్పటికే పెట్టుకున్నారు. తనపై ఇప్పటికే ఉన్న 31కేసులకు (ఈడి - 7 , సిబిఐ - 11, ఇతర కేసులు - 13) అదనంగా తాజాగా మరో కేసు(కోర్టు ధిక్కరణ కేసు) ను కూడా కొనితెచ్చుకోబోతున్నారు. శిక్షపడితే 6ఏళ్ల అనర్హత వేటు పడుతుందనే భయం జగన్ ను వెన్నాడుతోంది. పదేళ్ల శిక్ష పడితే 16ఏళ్లు పోటీకి కూడా అనర్హుడు అవుతాడు. ఈ 31కేసులతో తన రాజకీయ జీవితం ముగిసి పోతుందనేది జగన్ భయం. సీఎం జగన్ తప్పటడుగులు, తప్పుడు పనులు ఎపి భవిష్యత్తుకే అవరోధాలుగా తయారయ్యాయి'' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   ఇప్పటికే "బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్, మహిళా న్యాయవాదుల సంఘం తదితర అసోసియేషన్లు అన్నీ జగన్ దుర్బుద్దిని, రహస్య అజెండాను తప్పుపట్టాయి. అంతేకాకుండా విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అడ్వకేట్లు జగన్ లేఖను ఖండించారు. సిజెఐకి లేఖ రాయడం ద్వారా జగన్ రెడ్డి రాష్ట్రానికే తలవంపులు తెచ్చాడు. దీంతో దేశవ్యాప్తంగా తన అవినీతిపై జగన్ మళ్లే చర్చ పెట్టాడు. జగన్ రెడ్డి రూ43వేల కోట్ల అవినీతి, 31కేసులు, హవాలా, మనీలాండరింగ్ తదితర తీవ్ర అభియోగాలపై దేశ వ్యాప్తంగా డిబేట్ తెచ్చాడు'' అని అయన అన్నారు.   'సిజెకు లేఖ ద్వారా జగన్ తన స్వార్ధానికి మొత్తం రాష్ట్రాన్నే బలి పెడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఏపీని పాలిస్తున్నాడని దేశం మొత్తం విస్తుపోయేలా చేశారు. తనను నమ్మి ఓట్లువేసిన ప్రజలను కూడా మోసం చేశారు'' అని యనమల విమర్శించారు. అంతేకాకుండా ''అధికారంలో లేనప్పుడు తండ్రి అధికార అండతో... ఇప్పుడు స్వయంగా అధికారం హస్తగతమవ్వడంతో జగన్ మోసాలు, ద్రోహాలు ఎక్కువయ్యాయి. ఇప్పటిదాకా హవాలా, మనీ లాండరింగ్ నేరాలతో రాష్ట్రానికి జగన్ చెడ్డపేరు తెస్తే, ఇప్పుడీ లేఖతో యావత్ దేశానికే తీరని కళంకం తెచ్చాడు. తన నేరాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న ఉమ్మడి ఏపి హైకోర్టుపై జగన్ పగ పట్టాడు. న్యాయవ్యవస్థపై పగబట్టిన ఒక పాలకుడిని మనం ఇప్పుడే చూస్తున్నాం'' అని అయన మండిపడ్డారు.   తాజాగా ''హైకోర్టును, సుప్రీంకోర్టును జగన్ టార్గెట్ చేశాడు. దీని ద్వారా తన కేసులపై రాబోయే తీర్పులను ప్రభావితం చేయాలనే అయన పథకం వేశాడు. ఇప్పటికే తన కేసులలో సహనిందితులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో నియమించారు. ప్రభుత్వ సీక్రెట్ డాక్యుమెంట్స్ ను కూడా వారి ద్వారా పబ్లిక్ చేయిస్తున్నారు. సిజెకు రాసిన లేఖతోపాటు తన ప్రభుత్వ సలహాదారుతో విడుదల చేయించారు. కోర్టు ధిక్కరణతోపాటు సీక్రెట్ డాక్యుమెంట్స్ బహిర్గతం చేసిన నేరానికి కూడా పాల్పడుతున్నారు. దీంతో రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక అర్హత కూడా కోల్పోయారు'' అని యనమలఅన్నారు.   అసలు "ప్రభుత్వాలను కోర్టులు అస్థిర పర్చడం ఎప్పుడైనా విన్నామా..? తన ప్రభుత్వాన్ని న్యాయస్థానం అస్థిర పరుస్తోందన్న సీఎం ఈ దేశంలో ఉన్నాడా..? ఇంత విధ్వంస మనస్తత్వం ఉన్నవారు పరిపాలనకు తగరు. తాజాగా జగన్ రెడ్డి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి, ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించే స్థాయికి చేరడం జగన్ బరితెగింపు రాజకీయాలకు పరాకాష్ట. ఇప్పటివరకు ప్రతిపక్షాలను బెదిరించడం, శాసన వ్యవస్థను బెదిరించడం, పరిపాలనా వ్యవస్థను బెదిరించడం, అధికార యంత్రాంగాన్ని బెదిరించడం, మీడియాను బెదిరించడం, ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థనే బెదిరించడం చూస్తున్నాం. ఈ పెడధోరణులను ఇలాగే వదిలేస్తే వీళ్ళు రేపు ఎంతకైనా తెగిస్తారు'' అని అయన ఆరోపించారు. పరిపాలన గాలికి వదిలేసి తన కేసులు,రోజువారీ విచారణ, రాబోయే తీర్పుల గురించి కంగారెత్తి పోతున్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట్లో ముంచేశారు, రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేశారు'' అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

అమరావతిని ముంచే కుట్ర? జగన్ సర్కార్ పై రైతుల ఆగ్రహం 

వరదలతోనూ ఏపీలో రాజకీయం చేస్తున్నారా? సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారా? అమరావతిని ముంచేందుకు ప్లాన్ చేశారా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. అమరావతిని రాజధానిగా అంగీకరించని జగన్ సర్కార్.. ఆ ప్రాంతాన్ని ముంపుగా చూపించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని గ్రామాల్లోకి వరద రావాలనే ఉద్దేశ్యంతోనే.. అక్కడి వాగుల పూడిక తీత చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్యాముల నుంచి సకాలంలో నీటిని వదలకుండా, ఎత్తిపోతల మోటార్లు వేయకుండా కావాలనే కుట్రలు చేస్తున్నారని చెబుతున్నారు. వందేళ్లలో రాని ముంపు అమరావతికి వస్తే అందుకు  జగన్ ప్రభుత్వమే కారణమంటున్నారు రాజధాని రైతులు,   వైసీపీ నేతల తీరు కూడా రాజధాని రైతుల అనుమానాలకు బలమిచ్చేలా ఉన్నాయి. వరదలతో అమరావతి మునిగిపోయిందని, రోడ్ల మీద చేపలు పట్టుకోవచ్చు అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోతుందని హడావిడి చేశారు. ఏపీ హైకోర్టును వరద ముంచెత్తిందని కొందరు పోస్టులు పెట్టారు. అయితే సోషల్ మీడియా ప్రచారం జరిగినట్లు అమరావతి  ఎక్కడా నీట మునగలేదు. హైకోర్టు దరిదాపుల్లోకి కూడా వరద రాలేదు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా భద్రంగానే ఉంది. పరువు పోగొట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమరావతికి పెద్దగా వరద ముంపు లేదు. అమరావతిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వైసీపీ నేతలే ఫేక్ ఫోటోలు పెట్టి ప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని పట్టుకుని కొందరు వైసీపీ ముఖ్య నేతలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పరువు పొగొట్టుకున్నారు.    తమ కుట్రలో భాగంగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ముందుకు పోతున్నారని రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అమరావతి ప్రాంతం వరదలో మునిగేలా జగన్ ప్రభుత్వ చర్యలు ఉండగా.. అసత్య  ప్రచారాలతో బద్నాం చేేసే పనిలో వైసీపీ కేడర్ ఉందని చెబుతున్నారు. అమరావతి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చేస్తోన్న విష ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని రైతులు సూచిస్తున్నారు. దమ్ముంటే అమరావతి రాజధానిపై బహిరంగ చర్చకు వస్తారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మహా నగరాలు మునుగుతున్నా అమరావతి సేఫ్ గా ఉందని చెప్పారు. విపత్తులో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వానికి ముంచడమే ఎజెండాగా మారిందని మండిపడుతున్నారు.    జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సకాలంలో నీటిని కిందకు విడుదల చేయకుండా అమరావతిని ముంచడమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు యోచనలకు పూనుకోవడం అమానుషమన్నారు చంద్రబాబు.మొత్తానికి రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి నీటిలో మునిగేలా కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పనులకు పూనుకోవడం మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ప్రకృతితో పరిహాసం చేస్తే.. జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇకనైనా అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

ఏపీ దిశా చట్టంలో లోపాలు.. తిప్పి పంపిన కేంద్రం

ఏపీలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు ఉద్దేశించి జగన్ ప్రభుత్వం పంపిన దిశా చట్టాన్ని కేంద్రం వెనక్కు పంపింది. హైద‌రాబాద్ నగరంలో దిశ పై హత్యాచారం ఘటన జరిగిన త‌ర్వాత ఒకపక్క ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఏపీ స‌ర్కార్ హడావిడిగా దిశ బిల్లును ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదింపజేసుకొని కేంద్రం యొక్క ఆమోదం కోసం పంపింది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఈ దిశ చట్టం పైన కేంద్ర హోంశాఖ‌, న్యాయ శాఖ‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల‌కు పంపి అభిప్రాయాన్ని కోర‌గా… చ‌ట్టంలో లోపాలున్నాయని ఆ శాఖలు తెలిపాయి. దీంతో దిశ చ‌ట్టంలో మార్పులు చేర్పులు సూచిస్తూ కేంద్రం దీన్ని వెన‌క్కి పంపినట్లు తెలుస్తోంది.   రాష్ట్ర ప్ర‌భుత్వం తయారు చేసిన దిశా చ‌ట్టం అమ‌లులోకి రావాలంటే కేంద్రం ఆమోదంతోపాటు రాష్ట్రప‌తి కూడా ఆమోదం తెలిపిన త‌ర్వాతే అధికారికంగా ఏపీలో దిశ చట్టం అమ‌లులోకి వస్తుంది. అయితే ఏపీలో దిశా చట్టం ఆధారంగా ఇప్పటికే పలు చోట్ల దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ చట్టం కింద కేసులు కూడా పెట్టగా.. ఇపుడు కేంద్రం దీన్ని వెనక్కు పంపడం గమనార్హం. ఈ దిశ చ‌ట్టం ప్రకారం మ‌హిళ‌ల‌పై ఎవ‌రైనా అఘాయిత్యాల‌కు పాల్ప‌డితే 21రోజుల్లోగా దోషుల‌కు శిక్ష పడేలా ఏపీ ప్ర‌భుత్వం ఈ దిశ చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కేంద్రం ఈ చ‌ట్టాన్ని వెన‌క్కి పంపడంతో.. కేంద్రం సూచించిన మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ చట్టాన్ని తిరిగి పంపాల్సి ఉంటుంది.

విజయదశమికి పార్టీ పేరు! రజనీతో డీఎంకేలో టెన్షన్ ? 

తమిళనాడులో  రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది  అధికార, ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. కొత్త పార్టీలు, కొత్తగా వచ్చే పార్టీలతో తమిళనాడు రాజకీయం సరికొత్తగా మారుతోంది.  సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రజనీ ఎప్పుడెప్పుడు రాజకీయ పార్టీని ప్రకటిస్తారా  అని ఆయన అభిమానులు, ప్రజలతో పాటు పొలిటికల్ పార్టీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయదశమి రోజున ఆయన పార్టీ పేరు ప్రకటిస్తారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది.      పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ చేయడానికి రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. రజనీ సన్నిహితులు వారం రోజులుగా ఢిల్లీలోనే  ఉండి పార్టీ రిజిస్ట్రేషన్‌ చేయడానికిగాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. 2021 జనవరి నుంచి రజనీకాంత్ పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే ప్రత్యేక దృష్టిసారిస్తారని తెలుస్తోంది.    కరోనా లాక్‌డౌన్‌ లో పార్టీ ప్రారంభం కోసం కావాల్సిన ప్రచార సామగ్రికి  రజనీకాంత్ సన్నాహాలు చేశారని తెలుస్తోంది. గత ఏడు నెలలుగా  ఆయన  50 రకాల ప్రచార వీడియోలు రూపొందించారట. తనదైన స్టైల్‌లో రాజకీయాలు, సామాజిక విషయాలు, తన పార్టీ లక్ష్యాలు, ప్రజలకు తానందించే పథకాల వివరాలు తెలియజేస్తూ ప్రసంగించిన వీడియోలను రికార్డు చేయించారు. పార్టీ పేరును ప్రకటించిన వెంటనే 50 రకాల వీడియోలను వరుసగా సోషల్‌ మీడియాలో ఆయన విడుదల చేయనున్నారని సన్నిహితులు తెలిపారు. అందులో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు. విజయదశమి రోజున  పార్టీ ప్రకటన తర్వాత  తాను మాట్లాడిన వీడియో రజనీ విడుదల చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు,    2017 డిసెంబర్‌ 31న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు బాషా. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి రజనీ పార్టీ పేరు ప్రకటిస్తారని కోట్లాదిమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలలే మిగిలివున్నా రజనీ నుంచి ఎలాంటి రాజకీయ  ప్రకటన రాలేదు. రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించి రెండేళ్లు గడచిపోయాయి.  గత మార్చిలో మీడియాతో మాట్లాడిన రజనీ తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననని, పార్టీలో యువకులకు  ప్రాధాన్యం ఇస్తానని,  పదవులు అధికంగా వుండవని, సేవచేసే వారికే ఇస్తామని ప్రకటించారు.  సీఎం పదవికి పోటీ చేయనన్న రజనీ ప్రకటన ఆయన అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. రజనీ మక్కల్‌ మండ్రాల నేతలు ఆయనతో పలు మార్లు చర్చించి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననే నిర్ణయాన్ని రజనీ మార్చుకుంటారని అందరూ భావిస్తున్నారు.    ఇక తమిళనాడు వ్యాప్తంగా ఇటీవల రజనీకాంత్ సర్వే చేయించారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రజనీ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 12 శాతం ఓటు బ్యాంక్‌ లభిస్తుందని ఆ సర్వేలో తేలిందని చెబుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే వ్యతిరేక ఓట్లు, తటస్థుల ఓట్లు, అభిమానులు, మక్కల్‌ మండ్రాల ద్వారా లభించే ఓట్లే అధికంగా వున్నాయి. ఈ ఓటు బ్యాంక్‌తో రజనీ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చునని సర్వే నిర్వహించిన సంస్థలు చెబుతున్నాయి. అదనంగా మరో  20 శాతం ఓట్లను సంపాదించుకున్నప్పుడే అధికారం సాధ్యమని తెలిపాయి. దీంతో తన ఓటు బ్యాంక్‌ పెంచుకునే దిశగా త్వరలో సంచలనాత్మకమైన ప్రజా సంక్షేమ పధకాలకు సంబంధించిన ప్రకటన రజనీకాంత్ చేయనున్నారని తెలుస్తోంది.   రజనీ పార్టీ పేరును ప్రకటించగానే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌, నటుడు లారెన్స్‌ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. లారెన్స్‌తోపాటు తమిళురువి మణియన్‌, కాంగ్రెస్‌ నేత కరాటే త్యాగరాజన్‌, మాజీ మంత్రి ఏసీ షణ్ముగం, సినీ నిర్మాతలు, నటీనటులు, అన్నాడీఎంకే, డీఎంకే ల నేతలు కూడా రజనీ పార్టీలో చేరటానికి రెడీగా వున్నారు. ఇప్పటికే రజనీ మక్కల్‌ మండ్రాల నాయకుల్లో పలువురిని రజనీకాంత్‌ మార్చారు. పార్టీ పెడితే ఏయే ప్రముఖులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారనే వివరాలను రజనీ ఇప్పటికే సేకరించారు. ఆ దిశగానే పార్టీలో చేరబోతున్నవారి వద్ద రజనీ తరచూ చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో గత నెల రోజులుగా రజనీ మక్కల్‌ మండ్రాల జిల్లా శాఖల నాయకులతో చర్చలు జరిపి బూత్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ వెయ్యికి పైగా బూత్‌ కమిటీలను  రజనీ ఏర్పాటు చేశారట.   మరోవైపు రజనీ రాజకీయ పార్టీ స్థాపనపై తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై తమిళనాట ఓ వార్త వైరల్ అవుతోంది. రాజకీయ ప్రవేశం చేయవద్దని రజనీకాంత్‌పై డీఎంకే తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎంకే పెద్దలు రజనీకి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రముఖుడిని ఆయన వద్దకు దూతగా పంపినట్లు సమాచారం. రజనీ ఆరోగ్య పరిస్థితులు, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా రాజకీయాల్లోకి రావద్దంటూ ఆ దూత ఆయనకు తెలిపినట్లు చెబుతున్నారు.అయితే ఇదంతా వట్టి పుకార్లేనని డీఎంకే సీనియర్లు నేతలు ఖండించారు. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఒక వేళ రజనీని రాజకీయాల్లోకి రావద్దంటూ డీఎంకే చెప్పినా ఆయన ఆ మాటను ఆమోదిస్తారా అని డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా డీఎంకేకు ఎలాంటి నష్టం జరగదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.     మొత్తానికి  విజయ దశమి సమీపిస్తుండటంతో రజనీకాంత్ అడుగులపై తమిళనాడులో ఆసక్తి పెరుగుతోంది. బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లేనని.. కచ్చితంగా రజనీ రాజకీయ పార్టీ ప్రకటిస్తారని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. అదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని అనలిస్టులు చెబుతున్నారు. మరీ దసరా రోజున రాజనీకాంత్ ఏం చేస్తారో చూడాలి మరీ...

ఖమ్మం మైనర్ బాలిక మృతి

ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక(13) మృతి చెందింది. హైదరాబాద్‌ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక గురువారం రాత్రి కన్నుమూసింది.    ముస్తాఫా నగర్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై.. ఆ ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 70 శాతం కాలిన గాయాలైన ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించి గోప్యంగా చికిత్స అందజేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడి కుటుంబం బెదిరింపులకు పాల్పడటమే కాకుండా.. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. మధ్యవర్తుల ద్వారా డబ్బు ఇప్పించేలా బాలిక తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే, బాలిక పరిస్థితి విషమించడంతో ఆ తరువాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా.. ఘటన వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక చివరకు తన ప్రాణాలు విడిచింది. 

మాజీ మంత్రి నాయని నర్సింహా రెడ్డి పరిస్థితి ఆందోళనకరం.. కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా 

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత నాయని నర్సింహా రెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. నాయని నర్సింహా రెడ్డికి గత నెల 28వ తేదీన కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరి దాదాపు 16 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయితే వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో ఇక ఇంటికి వస్తారని అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యూమోనియా వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో నర్సింహా రెడ్డి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో.. ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి లో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు.    ఇది ఇలా ఉండగా నాయని కుటుంబంలో మరో ముగ్గురికి కూడా కరోనా సోకింది. అయన సతీమణి అహల్య కూడా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమెకు నెగెటివ్ వచ్చింది . ఇక నాయని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పోరేటర్ వి. శ్రీనివాస రెడ్డికి, ఆయన పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకాగా వారు కోలుకుంటున్నారు.

ఏపీలో దళిత బాలికలపై పెరుగుతున్న పాస్టర్ల అత్యాచార యత్నాలు

మొన్న గాజువాక.. నిన్న తిరుపతి   మాజీ ఐపీఎస్ ట్వీట్ తర్వాతనే కదలిక   ‘దిశ’ లేని ఏపీ సర్కార్   మతమార్పిళ్లపై దళితులలో మారుతున్న ఆలోచనలు   పండితురాలు నందమూరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. హిందూమతంలో చేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో, దళిత మహిళలపై పాస్టర్లు చేస్తున్న అత్యాచారాల సంఖ్య పెరుగుతుండటం, మహిళాలోకానికి కలవరం కలిగిస్తోంది. విశాఖ పీఠాథిపతి స్వరూపానంద సరస్వతి.. సీఎం జగన్‌తో మూడుసార్లు గంగలో మునక వేయించి, హిందూమతంలోకి తీసుకువచ్చారని పండితురాలు పార్వతమ్మ ఇటీవలే ప్రకటించారు. అయినప్పటికీ జగన్‌పై క్రైస్తవ ముద్ర వేయడం దారుణమని, ఆవేదన వ్యక్తం చేశారు. అటు రోజా కూడా జగన్ పాలనలో హిందువులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. అంటే జగన్ క్రైస్తవుడు కాదు. ఫక్తు హిందూ అని చెప్పడమే, ఈ మహిళానేతల కవిహృదయం కావచ్చు. మంచిదే. జగన్‌పై అలాంటి ప్రచారానికి తెరపడి, ఆయన అందరివాడయితే, రాష్ట్ర ప్రజలకూ సంతోషమే.   కానీ, ఏపీలో ఇటీవలికాలంలో నిర్నిరోధంగా జరుగుతున్న పాస్టర్ల అత్యాచారాలపై.. సర్కారు నుంచి ఎలాంటి చర్యలు కనిపించకపోవడం, హిందూ సంస్థల ఆగ్రహానికి దారితీస్తోంది. నిజంగా హిందువు సీఎంగా ఉంటే మహిళలు, దళితులపై పాస్టర్ల అత్యాచారాలు నిర్నిరోధంగా జరుగుతాయా? అన్న ప్రశ్నలు హిందూ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా గాజువాకలో ఒక పాస్టర్.. ప్రార్ధన పేరిట ఒక దళిత బాలికపై అత్యాచార యత్నం ఘటన, స్థానిక దళితులకు ఆగ్రహం కలిగించింది. ఈ ఘటనలో పాస్టర్‌పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. దళితులను మతం మారుస్తున్న పెద్దలు.. ప్రార్ధనల పేరిట అదే దళిత బాలికలపై, అత్యాచారాలకు ఒడిగడుతున్న వైనం.. దళితవర్గాల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది.   అనేక ప్రలోభాలతో మతం మారుస్తున్న పాస్టర్లు, చివరకు తమ పిల్లలపైనే అత్యాచారానికి పాల్పడుతుండటాన్ని, దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా.. క్రైస్తవంలో చేరాలంటూ తమపై వస్తున్న ఒత్తిళ్లపై తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునేందుకు, ఈ ఘటన బీజం వేసింది. మతం మారితే జీవితాలు మార్చేస్తామని, పిల్లలకు ఉచితంగా ఖరీదైన విద్య అందిస్తామన్న ప్రలోభాలవైపు, దళితులు ఇప్పటివరకూ ఆశగా చూసేవారు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రలోభాలతోనే, గ్రామాల్లో పాస్టర్లు తమ జాతికి చెందిన వారిని మతం మార్చారని, హిందూ- మాల, హిందూ మాదిగ నేతలు స్పష్టం చేస్తున్నారు.   ఆ తర్వాత ప్రలోభాలకు లొంగి, మతం మారిన తమ ఆడపిల్లలపై పాస్టర్లు, ప్రార్ధనల పేరుతో.. లైంగిక వేధింపులు, అత్యాచారయత్నానికి ఒడిగడుతున్న వైనంపై, దళితుల్లో కొత్త ఆలోచన మొదలయినట్లు కనిపిస్తోంది. తాము ప్రలోభాలకు లొంగడం వల్లనే, తమ బిడ్డలపై ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాస్తవం.. ఇలాంటి ఘటనలతో తమ జాతికి అర్ధమయిందని చెబుతున్నారు. పాస్టర్లు అత్యాచారం చేయడానికే.. దళితులను మతం మార్చేందుకు ఎంపిక చేసుకున్నట్లుందన్న వ్యాఖ్యలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి.   గాజువాకలో దళిత బాలికపై పాస్టర్ పాశవిక దాడి చేసిన దారుణం మర్చిపోకముందే.. వాటికన్ సిటీగా పేరున్న తిరుపతిలో, మరో పాస్టర్ ఒక యువతిపై అత్యాచార యత్నం చేయడం కలకలం సృష్టించింది. 20 ఏళ్ల యువతిపై దేవసహాయం అనే పాస్టర్, లైంగిక వేధింపులు-అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితులురాలు ఈస్ట్ పోలీస్‌స్టేషన్, దిశ పోలీసుస్టేషన్‌లో, తనపై అత్యాచారయత్నం చేసిన పాస్టర్ దేవసహాయంపై ఫిర్యాదు చేసింది. తాము పదిరోజుల నుంచి దిశ పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతున్నా, పట్టించుకోవడం లేదని బాధితురాలు, ఆమె స్నేహితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.   ఈ ఘటనపై పోలీసులు స్పందించని వైనంపై నిరసన వ్యక్తమయింది. అటు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. పాస్టర్‌పై దిశ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపై రెండుసార్లు అత్యాచారయత్నం జరిగిందని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి ఆరోపించారు. పైగా దిశ స్టేషన్ ఎస్‌ఐ హైమావతి, బాధితురాలితో అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈలోగా పాస్టర్ చేసిన అత్యాచార యత్నంపై పోలీసుల మౌనాన్ని మాజీ ఐపిఎస్ నాగేశ్వర్‌రావు ట్వీట్ చేయడంతో, పోలీసు యంత్రాంగం అనివార్య పరిస్థితిలో స్పందించాల్సి వచ్చింది. దీనితో ఏఎస్పీ సుప్రజ రంగంలోకి దిగడంతో, ఎట్టకేలకూ పోలీసులు కదిలారు. చివరకు గాజులమండ్యం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వాయువేగంతో స్పందించి.. కేసు నమోదు చేయాల్సిన దిశ పోలీసుస్టేషన్ అధికారులు, మీనమేషాలు ఎందుకు లెక్కబెడుతున్నారన్నది ప్రశ్న. కేవలం మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు, నిందితులను శిక్షించేందుకు మాత్రమే ఏర్పాటుచేసిన దిశ పోలీసుస్టేషన్లు.. తమకు అప్పగించిన బాధ్యత కూడా నిర్వర్తించకపోతే, ఇక ఆ వ్యవస్థపై ఎవరికి నమ్మకం ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   రాష్ట్రంలో దళితులపై పాస్టర్ల అత్యాచారాలు, రోజురోజుకూ పెరిగిపోతున్నా.. పోలీసులు వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు, భయపడుతున్నారన్న విమర్శలు, హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలోనయినా ఇలాంటి ఘటనలు జరిగితే, పోలీసులు వాయువేగంతో స్పందించేవారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అధికారులు కూడా.. పాస్టర్లపై చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారని, హిందూ సంస్థల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   అంతర్వేది వ్యవహారంలో కూడా, రథాన్ని తగులబెట్టిన వారిని ఇప్పటిదాకా గుర్తించలేని పోలీసులు.. చర్చిపై రాళ్లేశారన్న ఫిర్యాదు మేరకు, డజన్ల మందిపై కేసులు పెట్టి, అరెస్టు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. బాలికలపై అత్యాచార యత్నానికి పాల్పడిన.. ఇద్దరు పాస్టర్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేస్తేనే, లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. జగన్మోహన్‌రెడ్డిని హిందూ సమాజం హిందువుగా భావిస్తుందని, హిందూ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మరి పండితురాలు పార్వతమ్మ, ‘జగన్గురువు’ స్వరూపా సాములోరు ఏం చెబుతారో చూడాలి! -మార్తి సుబ్రహ్మణ్యం

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి యత్నం... అడ్డుకున్న గన్ మేన్

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. గత రాత్రి 10.30 గంటల సమయంలో గుంటూరులోని ఎంపీ నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. దాడికి యత్నించిన వ్యక్తిని మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావుగా గుర్తించారు. నిన్న రాత్రి ఎంపీ సురేశ్ తన ఇంటి నుంచి కారులో బయలుదేరుతుండగా.. పూర్ణచంద్రరావు ఆయన వాహనానికి బైక్ అడ్డుపెట్టి..తన వద్ద ఉన్న రాడ్డుతో కారుపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన ఎంపీ గన్‌మెన్ అతడి చేతిలోని రాడ్డు లాక్కొని పడేయడంతో, నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఎంపీ గన్‌మెన్ అతడిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

"మీ పేరు రాసి చచ్చిపోతాం".. హైదరాబాద్ లో ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహం..

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. దీంతో ఒక పక్క నాలాలు మరోపక్క చెరువులు పొంగి కాలనీలు మునిగిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజల పరిస్థితి దారుణంగా తయారయింది. దీంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను జనం కడిగిపారేస్తున్నారు. తాజాగా వరదలో చిక్కుకున్న వారిని పరామర్శించేందుకు వచ్చిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సుభాష్ రెడ్డిని చూసిన బాధితులు అయన మీద మండి పడ్డారు. సుభాష్ రెడ్డితో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. ‘‘మీ పేరు రాసి చచ్చిపోతాం’’ అంటూ ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న తమని అసలు ఎవరు ఆదుకోవడం లేదని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఇది ఇలా ఉండగా మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మేడిపల్లి గ్రామంలో చెరువు నిండటంతో పూజలు చేసేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనంపై ఏకంగా చెప్పులు, రాళ్లు విసిరారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి తమ గ్రామంలోకి రావొద్దంటూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారికీ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్థానికులపై లాఠీ చార్జ్ చేసారు. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలంటూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.    భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేర‌కు సాయం చేయాల్సిందిగా ప్ర‌ధానికి లేఖ రాశారు. కాగా తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ సాయం కోరారు.   కాగా, ప్రధాని మోదీ ఇప్పటికే సీఎం కేసీఆర్‌ తో మాట్లాడారు. స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని ర‌కాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న‌ద‌న్నారు. తక్షణ సాయం కింద కేంద్రం రూ.1,000 కోట్లు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

సీనియర్ ఐఏఎస్ కు షాక్.. ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్..! 

ఏపీ ప్రభుత్వం సీనీయ‌ర్ ఐఏఎస్ అధికారి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ను ఆక‌స్మాత్తుగా బ‌దిలీ చేసింది. 1987 బ్యాచ్ కు చెందిన ఆయ‌న ప్రస్తుతం సీసీఎల్‌ఎ కమిషనర్‌ పదవితో పాటు అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ గా కూడా పని చేస్తున్నారు. అంతేకాకుండా అయన గ‌తంలో ఇంచార్జి సీఎస్ గా కూడా ప‌నిచేశారు. దీంతో ఈయ‌నే నెక్స్ట్ సీఎస్ అన్న ప్ర‌చారం కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఉంది. విధుల్లో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరున్న ఆయ‌నను తాజాగా ప్ర‌భుత్వం బ‌దిలీ చేస్తూ, ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వకుండా జీఎడీలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది. అంతేకాకుండా కొత్త సీసీఎల్ఏగా 1987 బ్యాచ్ కు చెందిన సీనీయ‌ర్ ఐఏఎస్ అధికారి ఆదిత్య నాథ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు నీరబ్ కుమార్ నిర్వహిస్తున్న ఇతర శాఖల బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.   అయితే జ‌గన్ అక్ర‌మాస్తుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సీనీయ‌ర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యానాథ్ దాస్ ను త్వరలోనే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌బోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఏపీ ప్రభుత్వం.. హఠాత్తుగా బుధ‌వారం రాత్రి చేసిన బ‌దిలీలే నిదర్శనం అని అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆదిత్యనాథ్ దాస్ అత్యంత కీలకమైన భారీ నీటి పారుదల శాఖ నిర్వహించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఆయనపై ఉన్న అభియోగాలపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. ఈ ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు దీనిపై ఆదిత్యనాథ్ దాస్‌కు నోటీసులు కూడా జారీ చేసింది.   ఇది ఇలా ఉండగా ప్ర‌స్తుతం సీఎస్ గా ఉన్న నీలం సాహ్ని ప‌ద‌వీకాలం ఎప్పుడో ముగిసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు ఆమెకు ఇప్ప‌టికే రెండు సార్లు ప‌ద‌వీకాలాన్ని పొడిగించారు. అయితే ఆమె పదవీకాలం ఇక కేంద్రం పొడిగించే అవ‌కాశం లేదు. మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా నీలం సాహ్ని ప‌ద‌వీకాలాన్ని పొడిగించాల‌ని కోర‌లేదు. దీంతో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యమౌతోంది.

ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో కేసులు!!

సీనియర్ నటి ఖుష్బూ సుందర్‌ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆమె బీజేపీలో చేరుతూ కాంగ్రెస్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లంతా మానసింక వికలాంగులే.. అటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఖుష్బూకు తలనొప్పిగా మారాయి.    ఖుష్బూ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు అన్నారు. కాంగ్రెస్ పై ఆమెకు ఏదైనా కోపం ఉంటే మరోలా విమర్శించుకోవాలని, మధ్యలో తమను కించపరిచే మాటలు ఎందుకు? అంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఖుష్బూ క్షమాపణలు చెప్పారు. అయితే, ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ, కొందరు ఆమెపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఖుష్బూ చెప్పిన క్షమాపణలను తాము అంగీకరించబోమని, ఆమె చట్టాన్ని ఉల్లంఘించారని, ఆమెపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అంటున్నారు. దీంతో తొందరపాటు వ్యాఖ్యలు ఖుష్బూకి చిక్కులు తెచ్చి పెట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మూడో స్థానమొస్తే పార్టీకి మూడినట్టే! హస్తంలో దుబ్బాక టెన్షన్

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. తెలంగాణలో అధికారం కోసం తహతహలాడుతున్న హస్తం పార్టీ భవిష్యత్ ను దుబ్బాక బైపోల్ డిసైడ్ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ కొత్త ఇంచార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ కూడా పార్టీ నేతలకు ఇదే చెప్పారట. అందుకే పీసీసీ, సీఎల్పీ నేతలంతా దుబ్బాక నియోజకవర్గంలోనే మకాం వేశారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దుబ్బాకలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్ గా కాంగ్రెస్ నేతలు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.    తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా.. బీజేపీ ఇటీవల దూకుడు పెంచింది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది. కేసీఆర్ సర్కార్ పై పోరాటంలోనూ కాంగ్రెస్ కంటే స్పీడుగా ఉన్నారు కమలనాధులు. దుబ్బాక ఉపఎన్నికలోనూ ప్రచారంలో ముందున్నారు. రఘునందన్ రావు. ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. ఎందుకంటే దుబ్బాకలో బీజేపీ గెలిచినా... సెకండ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ కు గండమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది మరింత బలపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం కలగానే మిగిలిపోతుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.    దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి తీరాలి. ఒకవేళ ఓడినా కనీసం రెండో స్థానంలోనైనా నిలవాలి.. లేదంటే తమకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచినా తమకు పెద్ద నష్టం ఉండదని హస్తం పార్టీ భావన. ఎందుకంటే కారు పార్టీ గెలిచినా అధికారంతో పాటు సెంటిమెంట్ తో గెలిచిందని చెప్పుకోవచ్చు. అదే తమ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తే ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. అందుకే బీజేపీ లక్ష్యంగానే దుబ్బాకలో కాంగ్రెస్ ప్రచారం సాగుతున్నట్లు కనిపిస్తోంది. గెలవడం లేదంటే రెండో స్థానం సాధించడం కోసం హస్తం నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.    దుబ్బాక ఉప ఎన్నికలో గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోంది కాంగ్రెస్. గ్రామగ్రామాన ప్రచారంతో హోరెత్తిస్తోంది. నియోజకవర్గంలోని 146 గ్రామాలకు టీపీసీసీలోని 146 మంది ముఖ్యనాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. పీసీసీ నియమించిన విలేజ్ ఇన్‌ఛార్జిలు ఆ గ్రామ పార్టీ నాయకులతో ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలతో కలిసి వారు బూత్‌ల వారీగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార గడువు ముగిసే వరకు దుబ్బాక నుంచి నేతలెవరు రావొద్దని మాణికం ఠాగూర్ ఆదేశించారని చెబుతున్నారు. గ్రామాల వారీగా ఫలితాలను విశ్లేషించి మంచి ఫలితాలు తెచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారని తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్ నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.   చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని చేర్చుకుని దుబ్బాక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ముఖ్యనేతలంతా ప్రచారం చేస్తుండటంతో గెలుపుపై ఆశలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ కనిపిస్తుందని.. ఇదే జోష్ లో ప్రచారం చేస్తే గెలుపు ఖాయమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గెలవకపోయినా బీజేపీ కంటే ముందుండడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా చెబుతున్నారు.

టీఆర్‌ఎస్ ఇమేజీకి.. ‘వర్షం’ డ్యామేజీ

‘కారు’ మబ్బులు.. విమర్శల ‘వర్షం’   ఇస్తాంబుల్‌గా మార్చేస్తాం.. మరో లండన్ చేసేస్తాం.. విశ్వనగరంగా మారుస్తాం.. ప్రపంచంలో నెంబర్ వన్ సిటీగా మారుస్తాం.. 640 కోట్లు ఖర్చు పెట్టాం.. ఇవన్నీ ఎక్కడో ఎప్పుడో విన్నట్లు ఉన్నాయి కదూ?.. కేసీఆరో, కేటీఆరో, ఇంకెవరో మంత్రులో ఇప్పటికి కొన్ని వందల డజన్ల సార్లు చెప్పినట్లు అనిపిస్తోంది కదూ? యస్.. మీరేమీ పొరపాటునో, గ్రహపాటునో వినలేదు. మీరు విన్నది, గుర్తు చేసుకుందీ నిఝంగా నిజం! సాక్షాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అనేక సందర్భాల్లో చేసిన బాసలే ఇవి. ఇచ్చిన ప్రసంగాలే అవి!   అది ఎంత నిజమో..  ఇప్పుడు మీరు చూస్తున్న వర్షనగరమూ అంతే నిజం. ఒక్కరోజు కురిసిన రాకాసి వర్షానికి, రాజధాని నగర రాదార్లు గోదార్లయ్యాయి. మొసళ్లు రోడ్లపైకి వచ్చాయి. చిన్నారులతోపాటు, కార్లు జలసమాధి అయ్యాయి. రోడ్లమీద ఉండాల్సిన నీళ్లు వంటింట్లోకి చేరాయి. కాలనీలు చిన్నపాటి చెరువులయ్యాయి. మొత్తంగా విశ్వనగరం విషాదనగరమయింది. దీనికి కారణం కొంత మానవ స్వయంకృతమయితే, మిగిలిన పాపాలన్నీ  పాలకుల ఖాతాలోనివే. లోతట్టు ప్రాంతాలు, నాలాలని తెలిసి కూడా అక్కడే ఇళ్లు కట్టుకున్న జనంలో.. ఇన్ని భారీ వర్షాలు, ఇంత ప్రాణనష్టం  కూడా మార్పు తీసుకురాలేపోయాయి. కళ్లెదుటే కొట్టుకుపోతున్న కుటుంబాల ఆర్తనాదాలు కూడా,  అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించలేకపోతున్నాయి. ఇది నిస్సందేహంగా ప్రజల స్వయంకృతమే.   మరి ప్రభుత్వానికయితే బాధ్యత ఉంది కదా? వారిని బలవంతంగానయినా ఖాళీ చేయడం పాలకుల బాధ్యత కదా? అయినా ఓట్ల కోసం వారికి ఇంటి నెంబర్లు, రేషన్‌కార్డులిస్తున్న పాపం పాలకులదే కదా? కోట్లాదిరూపాయలతో వేస్తున్న రోడ్లన్నీ ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్నాయంటే, వాటి నాణ్యతపై నిఘా పెట్టడంలో సర్కారు విఫలమయినట్లే అర్ధం. సెప్టెంబర్ 18న కురిసిన వర్షం మిగిల్చిన కాళరాత్రిని, ‘సిటి’జనులు ఇంకా మర్చిపోకముందే.. మరో జలప్రళయం నగరాన్ని నరకం చేయడాన్ని ప్రజలు తాళలేకపోతున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షానికి, మల్కాజిగిరి దీనదయాళ్‌నగర్‌లో ఓ బాలిక, మరో ఘటనలో మరో మహిళ కొట్టుకుపోయిన విషాదం మరువకముందే ఇంకో ఉత్పాతం. కలసి వెరసి.. టీఆర్‌ఎస్ సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత. హైదరాబాద్ నగరంలో 16.4 కి లోమీటర్ల మేర నాలాలు విస్తరిస్తామని కేటీఆర్ మొదట్లో హామీ ఇచ్చారు. ఇంకా ఆ లక్ష్యానికి 60 శాతం అడుగుల దూరంలో ఉన్నారు. అంటే గమ్యాన్ని ముద్దాడేందుకు ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో ఎవరికీ తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి పాలకులు వేసిన కిర్లోస్కర్ కమిటీ.. 170 కిలోమీటర్ల మేర ఉన్న 71 నాలాలు విస్తరించాలని, అందుకోసం 10 వేల ఆక్రమణలు తొలగింపుతోపాటు, వీటికి 6700 కోట్లు ఖర్చు అవుతుందని  నివేదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆ కమిటీ కొండెక్కింది.   మళ్లీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత, వోయాంట్స్ కన్సల్టెన్సీకి ఆ బాధ్యత అప్పగించింది. ఆ కమిటీ చేసిన సర్వేలో.. 28 వేల ఆక్రమణలు తొలగించాలని, 390 కిలోమీటర్ల మేర నాలాలు విస్తరించాలని, అందుకు 12 వేలు కోట్లు ఖర్చవుతుందని నివేదిక ఇచ్చింది. చివరాఖరకు 12,182 ఆక్రమణలున్నట్లు తేల్చింది. 390 కిలోమీటర్ల మేర ఉన్న నాలా ఉండగా, అందులో పైకప్పులున్నవి చాలా తక్కువ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆక్రమణలు పెరిగాయన్నమాట. మరి జీహెచ్‌ఎంసీ ఏం చేస్తుందన్నది ప్రశ్న.   ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్‌కుమార్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు,  పౌరులకు ఓ విచిత్రమైన సవాల్ విసిరారు. ఎవరైనా సరే.. గుంతలు పడిన రోడ్లు చూపిస్తే బహుమానం ఇస్తామన్నారు. అంటే హైదరాబాద్ రోడ్డు వంగి ముద్దుపెట్టుకోవాలన్నంత అందంగా.. చాలా సొంపుగా ఉంటాయని, అసలు గుంతలే ఉండవన్నది ఆయన కవి హృదయమన్నమాట. ఆయన సవాలుకు జవాబుగా, విపక్షాలు గుంతలుపడ్డ చోట నిలబడి ఫొటోలు దిగడంతో, సోమేష్‌కుమార్ ఇక ఆ సవాలు ముచ్చటే మర్చిపోయారు.   ఇప్పుడు మళ్లీ వందేళ్ల తర్వాత వచ్చిన జలప్రళయం రాజధానిని ముంచేసింది. జనజీవనాన్ని భయకంపితులను చేసింది. మళ్లీ.. ‘కఠిన చర్యలు’, ‘హామీ’ల వర్షం, ‘తగిన జాగ్రత్తలు’ అనే  పాలకుల పడికట్టు పదాలు, మామూలుగానే వినిపిస్తున్నాయి తప్ప, ఆచరణ శూన్యం. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకూ వర్షాఘానికి బలవుతున్న నగర ప్రజలు, సహజంగానే టీఆర్‌ఎస్ సర్కారుపై నిప్పులు కురిపిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆగ్రహావేశంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను కష్టాల కడలి నుంచి కాపాడటంలో విఫలమయిందని భావిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు-కార్పొరేటర్లు చోద్యం చూస్తున్నారని, అధికారులు తమను గాలికొదిలేశారన్న నిర్ణయానికి వచ్చారు.  ఖచ్చితంగా ఇవన్నీ,  రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపేవే.   ప్రజల ఆగ్రహజ్వాల,  ఖచ్చితంగా అధికార పార్టీకి ప్రమాదఘంటికనే. ప్రభుత్వ అసమర్ధ నిర్వాకం వల్లనే,  తాము గంటలపాటు కరెంటు-నిత్యావసర వస్తువులకు దూరమయ్యామని, రోజంతా నరకయాతన అనుభవించామన్న చేదు జ్ఞాపకాలు, విషాద దృశ్యాలు అప్పటివరకూ జనం గుర్తుంచుకుంటే..  ‘కారు’ ఒక్క అడుగు కూడా ముందుకేయడం కష్టం. ఈ అసంతృప్తి అగ్నికి విపక్షాలు,  ఎన్నికల వరకూ ఆజ్యం పోయకుండా ఉంటారనుకోలేం. అప్పటికీ నష్టనివారణకు దిగకపోతే నగరంలో షి‘కారు’కు...  కష్టమే! సహజంగా వర్షాలొస్తే పాలకులకు పండుగ. జనం కష్టాలు మర్చిపోతారు. కానీ రాజధాని నగరంలో వర్షాలొస్తే, పాలకుల ఇమేజీ దారుణంగా  డ్యామేజీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది.  -మార్తి సుబ్రహ్మణ్యం

గడువు ప్రకారమే గ్రేటర్ పోల్! వరదలతో మారిన గులాబీ ప్లాన్?

గ్రేటర్ లో టీఆర్ఎస్ కు వరదపోటు తగలనుందా? జీహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికలపై గులాబీ పార్టీ ఆలోచనలో పడిందా? గడువు ప్రకారమే బల్దియా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుందా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వస్తోంది. గ్రేటర్ ఎన్నికలను మూడు నెలల ముందే నిర్ణయించాలని భావించిన అధికార పార్టీ.. ఆ దిశగా కసరత్తు కూడా చేసింది. ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ అయితే మరింత స్పీడ్ గా వెళ్లారు. గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ వారిని పరుగులు పెట్టించారు. అయితే తాజాగా గ్రేటర్ ఎన్నికలపై అధికార పార్టీ ఆలోచనలో పడిందని తెలుస్తోంది. ముందస్తు వెళ్లకుండా షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని భావిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు హైదరాబాద్ లో వచ్చిన వాన, వరదలే కారణమంటున్నారు.    గ్రేటర్ హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలు... అధికార పార్టీని షేక్ చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే నగరంలో వరద బీభత్సం పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. వరద నివారణ చర్యలు చేపడతామంటూ  అరేండ్లుగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఎక్కడా ఏమి చేయడం లేదని జనాలు మండిపడుతున్నారు. వరదలో ఉన్న ప్రజలను కాపాడటంలోనూ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. వరద బాధితులకు ఆహారం అందించడం లేనూ బల్దియా చేతులెత్తిసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు అధికారులు ఎవరూ రాకపోవడంతో  స్థానిక యువకులే సాహసం చేసి వృద్ధులు, పిల్లలను ఇండ్ల నుంచి బయటికి తీసుకొచ్చిన విజువల్స్  వైరల్ గా మారాయి. మంగళవారం రాత్రి వరద ముంచెత్తితే జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం మధ్యాహ్నానికి తమ దగ్గరకు వచ్చారని కొన్ని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ స్వయంగా జనాగ్రహం చవిచూశారు. తమ ప్రాంతానికి వచ్చిన కేటీఆర్ తో స్థానికులు వాగ్వాదానికి దిగడం కనిపించింది. వర్షాలు వచ్చినప్పుడల్లా వరదలు ఇండ్లను ముంచెత్తుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జనాలు మంత్రిని నిలదీశారు. ప్రచారం చేసుకోవడమే తప్ప మీరు చేసిందేంటని కొందరు కేటీఆర్ ను నేరుగానే ప్రశ్నించారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో ఆయన హడావుడిగా పర్యటించి వెళ్లారు. మంత్రి దగ్గరకు జనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడం ఎల్బీనగర్ ఏరియాలో వివాదాస్పదమైంది. తమతో మాట్లాడకుండా, సమస్యలు తెలుసుకోకుండా ... మంత్రి కేటీఆర్ ఇక్కడికి  ఎందుకు  వచ్చారని మహిళలు ప్రశ్నించడంతో బల్దియా అధికారులు సమాధానం చెప్పకోలేక దిక్కులు చూశారు.    వరదలు ముంచెత్తడంతో గతంలో ఎప్పుడు లేనంతా  భాగ్యనగరం  విలయాన్ని చూసింది. ప్రకృతి విలయానికి 30 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. పాత భవనాలు కూలి కొందరు సజీవ సమాధయ్యారు. నగరంలోని వందలాది కాలనీలు , వేలాది ఇండ్లు పూర్తిగా నీట మునిగాయి. లక్షలాది జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లు, బైకులు ఎన్ని కొట్టుకుపోయాయే లెక్కలేదు.  వాహనాలు వరదలో పోతుండగా చూడటం తప్ప ఎవరూ ఏం చేయలేని పరిస్థితి ఉందంటే వరద ఉధృతి  రేంజ్ లో ఉందో ఊహించవచ్చు. సిటీలోని  రహదారులు, కాలనీలు చెరువులుగా మారాయి. హైదరాబాద్ నగరం కనివిని ఎరుగని జల విలయాన్ని చూసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు రెండు రోజులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.     పాతబస్తీ  అయితే చిన్నపాటి సముద్రంలానే కనిపించింది. వందలాది మంది కొన్ని గంటల పాటు వరద నీటిలోనే ఉండిపోయారు. బిల్టింగులపైకి చేరి సాయం చేయాలని, రక్షించాలని కేకలు పెట్టారు. వరద కట్టడిలో విఫలమైన అధికారులు.. వరద నుంచి బాధితులను కాపాడటంలోనూ ఆలస్యంగా స్పందించారు. వరద ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం కూడా సిబ్బందికి కష్టంగా మారింది. పాతబస్తీలో సహాయ చర్యల  కోసం హెలికాప్టర్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ కు తోడుగా ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగి వందలాది మందిని వరదల నుంచి రక్షించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడంతో ప్రజలు అంధకారంలో ఉండిపోయారు.               హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తాం.. పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామని  తెలంగాణ సీఎం కేసీఆర్  పలు సార్లు ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చి ఆరేండ్లైనాఅతీ గతి లేదు. అభివృద్ధి చెందడం కాదు గతంలో కన్నా సమస్యలు పెరిగాయంటున్నారు ప్రజలు.  ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెబుతోంది. అయితే సిటీలో ఎక్కడా కొత్త నాలాలు వేయలేదు. ఉన్నవాటిని విస్తరించలేదు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించలేదు. నగరంలోని  చెరువులు కబ్జాకు గురికావడంతో వరద ఉధృతికి వాటి కట్టలు తెగాయి. నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. చెరువుల కబ్జాలు అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలేవి  తీసుకోలేదని సిటీ జనాలు మండిపడుతున్నారు. 60 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.     హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ఆరోపిస్తున్నాయి. డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ విశ్వనగరమంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని మండిపడుతున్నారు. విపక్షాలు ఆరోపణలు,  జనాల ఆగ్రహాన్ని స్వయంగా చూసిన కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై వైఖరి మార్చుకున్నట్లు  చర్చ జరుగుతోంది.  వరదలతో ప్రభుత్వంపై జనాలంతా ఆగ్రహంగా ఉన్నారని, ఇప్పట్లో ఎన్నికలకు వెళితే వ్యతిరేక ఫలితాలు వస్తాయని కేటీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి వరకు గడువుంది. ఆ సమయానికి ప్రజల్లో కొంత మార్పు వస్తుందని, వరదలను మర్చిపోయే అవకాశం ఉంటుందని మెజార్టీ గులాబీ నేతల అభిప్రాయంగా ఉందట. అందుకే గ్రేటర్ లో ముందస్తుకు వెళ్లకూడదని కేటీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. అయితే వరదల కారణం కాకుండా కరోనా వంకతోనే .. షెడ్యూల్ ప్రకారమే బల్దియా ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ చెప్పాలని డిసైడైనట్లు తెలుస్తోంది.

ఏపీ హైకోర్టు మునిగింది.. సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారుల హల్చల్

ఏపీలో రాజధాని అమరావతిని వీలైనంతగా బదనాం చేసే పని వైసీపీ అధికారంలోకి రాకముందు నుండే మొదలు పెట్టింది. అది అమరావతి కాదు భ్రమరావతి అని ఒకసారి.. అది కేవలం ఒక కులం వారు ఉండే ప్రాంతమని మరోసారి చేసిన సంగతి తెల్సిందే. ఇపుడు మూడు రాజధానుల జపం చేస్తున్న జగన్ సర్కార్ ఆలోచనలకు తగ్గట్టుగా ఇప్పటికీ అమరావతి పై దాడి జరుగుతూనే ఉంది.   తాజాగా వైసీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. అమరావతిలోని హైకోర్టు చుట్టూ నీళ్లు చేరుతున్నట్లు, ఇక లాయర్లు పడవల్లో వెళ్తున్నట్లుగా ఓ భ్రమ సృష్టించారు. దీంతో హైకోర్టు మునిగిపోయింది, లాయర్లు పడవల్లో పోతున్నారంటూ దానికి ఒక వ్యాఖ్య కూడా జత చేసారు. దీంతో హైకోర్టు చుట్టూ నీళ్లు చేరాయంటూ వైసీపీ అనుకూల మీడియా కూడా హల్‌చల్‌ చేసింది. అయితే ఇది తప్పుడు ప్రచారమే అని తేలింది. అయితే వాస్తవానికి అక్కడ రోడ్ల నిర్మాణంలో భాగంగా తవ్విన మట్టిని రోడ్డుకు అటూ ఇటూ వేయడంతో... వర్షపు నీరు పోవడానికి దారిలేక కేవలం ఒకే ఒక్కచోట 50 మీటర్ల మేర నీరు నిలిచింది. పక్కనున్న మట్టికట్టకు చిన్న గండి కొడితే... ఐదు నిమిషాల్లో ఆ నీరంతా వెళ్లిపోతుంది. కానీ... వైసీపీ మద్దతుదారులు ఏకంగా హైకోర్టునే ముంచేశారు! అయితే తాజాగా ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ అమరావతి రైతులు సోషల్‌ మీడియాలో ఒరిజినల్ చిత్రాలతో పోస్టులు పెట్టారు. దీంతో వైసిపి మద్దతుదారులు సోషల్ మీడియాలో చేసిన ఈ మాయాజాలం చూసి అందరు అవాక్కవుతున్నారు   అంతేకాకుండా ఒకవైపు అమరావతిని పూర్తిగా డైల్యూట్ చేసేసి.. వైజాగ్ షిఫ్ట్ అయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకున్న సర్కార్.. కేవలం కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుత రాజధానిపై ఇంకా బురద చల్లాలని చూస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఇలా ఉండగా ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సైతం.. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఊరు మునిగిపోయిన ఫోటో పెట్టి.. అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే దానికి కౌంటర్ పడిపోయింది. ఆ ఫోటో గోదావరి జిల్లాదని ఆధారాలతో సహా టీడీపీ వాళ్లు పెట్టేశారు.

తిరుపతిలో యువతిపై పాస్టర్ అత్యాచారం.. ఫిర్యాదుపై పట్టించుకోని దిశా స్టేషన్ పోలీసులు  

తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన 20 ఏళ్ల యువతిపై ఓ పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడదమే కాకుండా అత్యాచారం చేశాడు. ఈ ఘటన పై బాధితురాలి తల్లి కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు దిశా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా కేసు నమోదు చేయకపోవడంతో.. వారు స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు అదనపు ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది.   ఈ అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం "తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో గత నెల 4వ తేదీన మా పెద్దకుమార్తె (బాధితురాలు) పనికి చేరింది. అయితే ఈ నెల 3వ తేదీన దేవసహాయం కారులో వచ్చి.. సరకు డెలివరీ ఇవ్వాలని.. బాధితురాలిని తీసుకెళ్లాడు. అలా చెప్పి తీసుకెళ్లిన పాస్టర్ రేణిగుంట రోడ్డులోని తుకివాకం గ్రామ సమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత అమ్మాయి ఇంటికి వచ్చాక జరిగిన ఘోరం గురించి తమకు తెలిసింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దిశ పోలీస్ స్టేషన్‌కు వెళితే.. వాళ్లతో మీరు పోరాటం చేయలేరని అక్కడి అధికారులు అన్నారు. అంతేకాకుండా మా అమ్మాయిని వేరే పని చేసుకోమని కూడా సలహా ఇచ్చారు. దీంతో మేము స్పందన కార్యక్రమం ద్వారా ఈ దారుణం పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం" అని ఆమె చెప్పారు. ఇంకా, స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదును అదనపు ఎస్పీ సుప్రజ.. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కు పంపడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   ప్రస్తుతం బాధితురాలు తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటన పై అలాగే.. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా టీడీపీ నేత నరసింహయాదవ్‌, టీఎన్‌ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ శ్రేణులు ధర్నా చేసారు.

తెలంగాణలో ‘తెలుగు’ జెండా పీకేసినట్లే!

రమణపై తమ్ముళ్ల తిరుగుబాటు   బాబుపై మరోసారి లేఖాస్త్రం   ఆర్ధిక పరిస్థితులే అసలు సమస్యట   తెలంగాణ గడ్డపై కళ్లు తెరచిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అదే తెలంగాణలో కన్నుమూసే విషాదకర పరిస్థితికి చేరింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పూర్తిగా పీకేసినట్లుగానే కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణలో పార్టీని అనాధను చేశారన్న ఆగ్రహం, ఎన్టీఆర్ కాలం నుంచి కొనసాగుతున్న తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది. ఓటుకు నోటు కేసు తర్వాత, తమ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి పార్టీని వదిలేసి పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రనేతలంతా ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోగా, ఉన్న వారి భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ అసమర్థ నాయకత్వం పుణ్యాన, కొస ప్రాణంతో ఉన్న పార్టీ.. పూర్తిగా సమాధి కావడానికి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కాలయాపన విధానమే కారణమని తమ్ముళ్లు ధ్వజమెత్తుతున్నారు.   తాజాగా.. రమణను మార్చాలని తెలంగాణ టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నేతలు మరోసారి చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఈ విధంగా టీటీడీపీ నేతలు బాబుకు లేఖ రాయడం ఇది రెండోసారి. మంగళవారమే వారు తమ లేఖను బాబుకు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఎవరినీ కలవడం లేదని సిబ్బంది చెప్పడంతో, లేఖను ఆయన పీఏకు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ సంస్థాగత విషయాలు చర్చించాలని వారంతా లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి అటు రమణకు సైతం పార్టీ కార్యాలయంలో సిబ్బంది ముందు ఇబ్బందికరంగా మారింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు తమ అభ్యర్ధిని ప్రకటించి, ఆ మేరకు ప్రచారంలో ఉన్నాయి. కానీ తమ పార్టీ మాత్రం ఇంతవరకూ అభ్యర్ధిని ప్రకటించలేదని తమ్ముళ్లు, రమణపై మండిపడుతున్నారు. అటు ఆరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలపైనా, రమణ ఇప్పటిదాకా చర్చించలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా? లేదా అన్న దానిపైనా స్పష్టత ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు.   ఈ విషయంలో రమణ చెబుతున్న దానికీ, చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకూ పొంతన ఉండటం లేదంటున్నారు. ఏ నిర్ణయమయినా చంద్రబాబును అడిగే తీసుకుంటానని రమణ, పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో, మీరే సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ నేతలకు చెబుతున్నారు. ప్రతి దానికీ నా నిర్ణయం కోసం ఎదురుచూడవద్దని, మీరే నిర్ణయం తీసుకోమని స్పష్టం చేస్తున్నారు. దీనితో ఎవరి మాట నమ్మాలో అర్ధం కావడం లేదని నేతలు వాపోతున్నారు. లాక్‌డౌన్ మొదలయినప్పటి నుంచీ, బాబు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అయినా, ఒక్కసారి కూడా తమతో భేటీ కాలేదని తమ్ముళ్లు చెబుతున్నారు.   అయితే ఈ విషయంలో పార్టీ నాయకత్వం.. కావాలనే తప్పించుకు తిరిగే ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు, సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి, పోటీ చేసి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకన్న ఆలోచనతో, నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ నాయకత్వం ఆంధ్రాలోనే డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేనందున, ఇక తెలంగాణలో ఖర్చు పెడుతుందనుకోవడం అత్యాశేనంటున్నారు.   ‘ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ నయాపైసా ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ పార్టీపై మా సార్‌కు ఆసక్తి లేదు. నిజంగా ఆసక్తి, పట్టుదల ఉంటే రెండు నెలల ముందునుంచే ఎన్నికలపై దృష్టి పెట్టేవారు. ఆయన ఎన్నికల సమయంలో ఎంత వేగంగా పనిచేస్తారో, ఎంత వేగంగా ఆలోచిస్తారో మేం చూశాం కదా? ఇప్పుడు ఏం చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలి. అదే గతం మాదిరిగా అన్ని వ్యవహారాలు బాబు చేతిలో ఉంటే, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. సర్వే సంస్థలను ఎన్నికలకు మూడు నెలల ముందే దించేవారు.పరిశీలకుల హడావిడి, నాయకుల మీడియా సమావేశాలు ఉండేవి. అంటే దీన్నిబట్టి రెండు విషయాలు అర్ధమవుతున్నాయి. ఒకటి ఆయనకు తెలంగాణలో ఎన్నికలపై ఆసక్తి లేకపోయినా ఉండాలి. లేదా ఆర్ధికపరమైన నిర్ణయాలు ఆయన చేతిలో లేకపోయినా ఉండాలి. ఇప్పుడు ఈ కీలకమైన వ్యవహారాలన్నీ సారు చూడటం లేదంటున్నారు. గాలి వచ్చినప్పుడే గెలుస్తామన్న ధోరణి కనిపిస్తోంద’ని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు.   రమణను తొలగించాలని నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నా, బాబు స్పందించకపోలడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బహుశా మిగిలిన వారికి పగ్గాలు అప్పగిస్తే.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారన్న భయంతోనే, నిర్ణయాన్ని నానుస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘మా సార్ కు బలమైన బీసీ కులానికి చెందిన నాయకుడు కావాలి. కానీ అతడు బలంగా ఉండకూడదు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా, తనపైనే ఆధారపడే నాయకుడు కావాలి. ఈ అర్హతలున్న నాయకుడి కోసమే, మా సార్ కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం లేదనిపిస్తోంద’ని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.   కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వంటి సీనియర్లలో ఒకరికి, అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న సూచన చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. ఓసీలకు ఇవ్వాలనుకుంటే దయాకర్‌రెడ్డి, రావులలో ఒకరికి ఇవ్వడం మంచిదని, బీసీలకు ఇవ్వాలనుకుంటే అరవిందకుమార్ గౌడ్‌కు ఇవ్వడం ఉత్తమమంటున్నారు. అదేవిధంగా ప్రత్యర్ధులపై విరుకుపడే నోరున్న న ర్శిరెడ్డి లాంటి నేతకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మంచిదని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా, వారు సొంత ఖర్చులతోనే పార్టీ నడిపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కాగా దుబ్బాక ఉప ఎన్నికలో రమణను, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్శిరెడ్డి లేదా కాట్రగడ్డ ప్రసూనను రంగంలోకి దింపాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో? -మార్తి సుబ్రహ్మణ్యం