రేవంత్ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.  టీజీపీఎస్సీ ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును  డివిజన్ బెంచ్ బుధవారం (సెప్టెంబర్ 24) సస్పెండ్ చేసింది.  గ్రూప్ 1 అభ్యర్ధుల విషయంలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే..  నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉండాలని  పేర్కొంది.  గ్రూప్ వన్ మెయిన్స్ ర్యాకింగ్స్ లో  అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో  కొందరు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ర్యాంకులను రద్దుచేస్తూ ఈ నెల 9న తీర్పు వెలువరించిన సంగతి విదితమే.  ఫలితాలకు సంబంధించి అభ్యర్ధులు రాసిన జవాబుపత్రాలను రీవాల్యుయేషన్ నిర్వహించాలని, అది కుదరకుంటే పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సింగిల్ బెంచ్ తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ర్యాంకులు సాధించిన కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.   వారి పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును  సస్పెండ్ చేస్తూ.. ర్యాంకుల ఆధారంగా నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తరుపరి విచారణను వాయిదా వేసింది.  

రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్....ఎంతో తెలుసా?

  రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా,  దీపావళి పండుగ సందర్బంగా  గ్రూప్‌ C, గ్రూప్‌ D ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. ఈ బోనస్ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లను కేటాయించింది. గ్రూప్‌ D (లెవెల్‌ 1 స్టాఫ్‌) ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తించనుంది.  అలాగే, రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే వర్క్‌షాపులు, ఇతర సహాయ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ బోనస్‌ అందనుంది. ప్రతి సంవత్సరంలా, ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం పండుగ బోనస్‌ను ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.  

మండలిలో జీఎస్టీపై తీర్మానం.. వైసీపీ మద్దతిచ్చిందా? లేదా?

జీఎస్టీపై వైసీపీ వైఖరి ఏమిటన్నది అంతుపట్టకుండా ఉంది. ఒక వైపు ఆ పార్టీ అధినేత జీఎస్టీని పొగుడుతూ, ప్రధాని మోడీని ఆకాశానికెత్తేశారు. అయితే మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం జీఎస్టీ విషయంలో తన వైఖరి ఏమిటో స్పష్టం చేయకుండా పలాయన మంత్రి పఠించింది. ఇంతకీ విషయమేంటంటే.. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలను ఆమోదిస్తూ ప్రభుత్వం తీర్మానించింది.  ఇక శాసన మండలిలో బుధవారం జీఎస్టీ సంస్కరణలపై బుధవారం (సెప్టెంబర్ 24) తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి అధికార పార్టీ సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ వైసీపీ మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా వైసీపీ తన వైఖరి  చెప్పాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దీనిపై సభలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ నేరుగా సమాధానం ఇవ్వలేదు. పైగా జీఎస్టీ సంస్కరణలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు.. దేశమంతటా అమలు అవుతున్నాయి కదా..అటువంటప్పుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తీర్మానం ఎందుకు అంటూ దాటవేశారు. అయితే పయ్యావుల మాత్రం జీఎస్టీ సంస్కరణలను వైసీపీ స్వాగతించి మద్దతు ఇస్తోందా లేదా చెప్పాలంటూ పట్టుబట్టారు. అప్పటికి కూడా బొత్స  స‌మాధానం దాట వేసి మరేదో మాట్లాడారు. ఈ దశలో పయ్యావుల మీరు ఆమెదం తెలపకపోతే ఢిల్లీ నుంచి మీ నాయకుడికి ఫోన్ వస్తుందేమో అని చమత్కరించారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ జీఎస్టీ సంస్కరణలను అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతిని కూడా గుర్తు చేశారు. అయినా బొత్స నోట మాత్రం జీఎస్టీకి ఆమోదం అన్న మాట రాలేదు. ఆ దశలో మండలి చైర్మన్ జఎస్టీపై తీర్మానాన్ని సభ ఆమోదించినట్లుగా ప్రకటించారు. దీనికి కూడా  కూడా మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  వైసీపీ స‌భ్యులు త‌మ అభిప్రాయం చెప్పకుండా తీర్మానం ఆమోదం పొందింద‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చైర్మ‌న్‌ను నిల‌దీశారు. అయితే చైర్మన్ పయ్యావుల అభ్యంతరాన్ని పట్టించుకోకుండా భోజన విరామానికి సభను వాయిదా వేశారు.  

జగన్ బెయిలుపై విడుదలై నేటికి పుష్కరం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చి నేటికి సరిగ్గా 12 ఏళ్లయ్యింది. అంటే పుష్కరకాలం అన్న మాట.  అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు ఇవ్వడంతో 2013 సెప్టెంబర్ 24న ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అంతకు ముందు ఆయన దాదాపు 16 నెలల పాటు జైలులో ఉన్నారు.   జగన్ పై ఐపీసీ, యాంటీకరప్షన్ యాక్ట్ కింద అభియోగాలు నమోదయ్యాయి. నేరపూరిత కుట్ర, అవినీతి, మోసం,  ఫోర్జరీ  వంటివి ఉన్నాయి.   క్విడ్ ప్రోకో పె ద్వారా ఆయన పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నది ఆ కేసుల సారాంశం.  2019 ముందు వరకూ అంటే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేంత వరకూ కోర్టు బెయిలు మంజూరు చేసిన సందర్భంగా విధించిన షరతులను పాటించారు. అయితే సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత అధికారిక విధులు కారణంగా చూప్తిస్తూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఆ తరువాత 2024 ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆ మినహాయింపు అలాగే కొనసాగుతున్నది.  జగన్ పై సీబీఐ కేసులు పదకొండు, అక్రమాస్తులకు సంబంధించి ఈడీ కేసులు 9 ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కాదు. కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. పార్టీ అధినేత అన్నది పక్కన పెడితే జగన్ ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా కేసుల విచారణకు వ్యక్తిగత మినహాయింపు కొనసాగుతుండటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఈ ఫార్ములా రేస్ కేసు.. ఇక అధికారుల అరెస్టేనా?

ఈ ఫార్ములా రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల అరెస్టుకు రంగం సిద్ధమౌతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. తెలంగాణలో రాజకీయ హీట్ ను అమాంతంగా పెంచేసిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ రికమెంట్ చేసింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల ప్రాసిక్యూషన్ ను అనుమతి కోరుతూ ఏసీబీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి విదితమే. దీనిపై విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి ఈ ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది.   ఏసీబీ నివేదిక ఆధారంగా వీరిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేయడంతో  వీరి అరెస్టు ఖాయమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. అయితే ఇదే కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్  కు గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతీ ఇంకా రాలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎ1గా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఏసీబీ ఇప్పటికే రెండు సార్లు విచారించింది. కాగా..  ఐఏఎస్‌ అధికారులు అరవింద్‌, బీఎల్ఎన్ రెడ్డిలను మూడేసి సార్లు విచారించింది. 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

  తెలంగాణలో సంచలన సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  అధికారులపై చర్యలు  తీసుకునేందుకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పట్లో హెచ్‌ఎండీఎ కమీషనర్‌‌గా కొనసాగిన  ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండ రింగ్ జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఈ ముగ్గురిని విచారణ చేసి ప్రభుత్వానికి నివేది కను పంపింది. అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించిన నివేదికను గవర్నర్ కి సమర్పించారు.  ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ కమిషన్ ఫార్ములా ఈ కార్ రేస్ లోని అధికారు లపై ఒక కీలక నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా పలుమార్లు విచారణ చేశారు .ఈమేరకు విజిలెన్స్ కమిషన్ ఏసిబి ఇచ్చినా నివేదికపై విచారణ జరిపి ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నుంచి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి చేరింది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ అధికారులు గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటివరకు గవర్నర్  ఫార్ములా ఈ కార్ రేస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (సెప్టెంబర్ 23) వెల్లడించింది. అంతే కాకుండా ఎలక్షన్ ప్రణాళిక అందజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ సీఎస్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ కూడా రాసింది.  ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈ నెల 2న, మండల, జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెందిన ఓటర్ల జబితాను ఈనెల 10న ప్రచురించినట్లు పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లపై సమాచారం కోరింది.    ఈ నేపథ్యంలో అందరి దృష్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ పైనే ఉంది. ఈ పిటిషన్ బుధవారం (సెప్టెంబర్ 24)న విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపుఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్​పిటిషన్​దాఖలైంది.  దీనిపై కోర్టు ఏం నిర్ణయిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ రెండో వారంలో స్థానిక ఎన్నికల తొలి విడతకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.  

ప్రతిపక్ష హోదా..జగన్ పిటిషన్ విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో  వైసీపీకి ప్రతిపక్ష హోదా  హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్ బుధవారం (సెప్టెంబర్ 24) విచారణకు వచ్చింది. అయితే విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.   జగన్ తన పిటిషన్ లో  తనను ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.   శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా తన పిటిషన్ లో జగన్ ప్రతివాదులుగా పేర్కొన్న  స్పీకర్ , అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మత్రి పయ్యావుల కేశవ్ లకు నోటీసులు ఆచ్చింది. ఆ నోటీసులలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది.  జగన్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఇలాంటి పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్ లో ఉండగానే మళ్లీ మరో పిటిషన్ వేశారు.  మామూలుగా అసెంబ్లీ వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకోవు. స్పీకర్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్ప ఎటువంటి ఆదేశాలూ ఇచ్చే పరిస్థితి ఉండదు.  ప్రతిపక్ష నేత హోదా అంశంలో గతంలో పదిశాతం సీట్లు లేకుండా హోదా కావాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల పై అనుకూలమైన తీర్పులు వచ్చిన దాఖలాలు లేవు.  

విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ పై సస్పెన్షన్ వేటు

విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్( ఏడిఈ) అంబేద్కర్ పై సస్పెన్షన్  వేటు పడింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విద్యుత్ శాఖలో ఏ డి ఈ గా పని చేస్తున్న అంబేద్కర్ ఇంట్లో కొద్ది రోజుల కిందట ఏసీబీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.  ఆ సందర్భంగా ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది. అంబేద్కర్ పై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అంబేద్కర్ ఇంటి తోపాటు బినామీ, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగించారు.  విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బాధ్యతలు కొనసాగిస్తూనే మరోవైపు నార్సింగ్ డివిజన్ కూడా ఏ డి ఈ గా వ్యవహరించారు.   ఈ నేపథ్యంలోనే మణికొండ నార్సింగ్ పరిధిలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతుండగా వాటి అనుమతుల కోసం వచ్చిన వారి వద్ద నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏసీబీ అధికారుల సోదాల్లో అంబేద్కర్ ఇంట్లో భారీ ఎత్తున నగదు తో పాటు బంగారం విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం 500 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అంబేద్కర్ బినామీ ఇంట్లో రికార్డు స్థాయిలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైనది. ఒక వైపు ప్రభుత్వ అధికారిగా ఉంటూనే మరో వైపు ప్రవేటు సంస్థలను స్థాపించిన అంబేడ్కర్ వాటికి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.     ఏసిబి అధికారులు ఇప్పటికే అంబే ర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే  విద్యుత్ శాఖ ఏడిఈ అంబే ద్కర్ ను సస్పెండ్  చేస్తూ  ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ సీఐడీ నజర్.. ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు

బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సిఐడి ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహిస్తున్నది. బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసు కున్న తెలంగాణ సిఐడి తెలంగాణలో పాటు మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి ఎనిమిది మంది కీలక సూత్రధారు లను అరెస్టు చేశారు. ఆరు యాప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ సిఐడి   ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కొరడా ఝళిపించాలని నిర్ణయించుకుంది.  అందుకే దేశంలో తొలిసారి ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ సీఐడీ బృందాలు రాజ స్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రా ల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు. ఆరు ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి  8 మందిని అరెస్టు చేశాయి.  సిఐడి బృందాలు ఈ సందర్భంగా అనేక హార్డ్ వేర్  పరికరాలు,  స్తృతమైన డేటా  స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉండే అవకాశముందన్న అంచనాతో  వారిని గుర్తించే దిశగా  దర్యాప్తు సాగుతోంది. 

శ్రీశైలంలో మూడో రోజు చంద్రఘంటా దుర్గ గా అమ్మవారు

శ్రీశైలంలో   శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంటా దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో అమ్మవారు చంద్రవంక ఆకారంలో ఉండే గంటను శిరస్సున ధరించి, శివునితో కలయికను సూచిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజైన మంగళవారం (సెప్టెంబర్ 23)  బ్రహ్మచారిణి అలంకారాంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలం కారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి  బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో, అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు మయూరవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు,బాజా బజంత్రీలు,కేరళ చండీ మేళం,కొమ్ము కోయ నృత్యం,స్వాగత నృత్యం,రాజభటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాల,చెంచు గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోపలి నుంచి భాజా భజంత్రీలు బ్యాండు వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా,  కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస రావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

విపక్ష నేత హోదాపై జగన్ పిటిషన్.. హైకోర్టులో నేడు విచారణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న విషయంలో మంకుపట్టు వీడటం లేదు. ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా ఆయన దాని కోసం పట్టుబడుతూ అసెంబ్లీని కూడా బాయ్ కాట్ చేశారు. అయినా ప్రభుత్వం దిగిరాలేదు.  సభలో సంఖ్యాబలంలేనందున వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పీకర్ రూలింగ్ కూడా ఇచ్చారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.  తనను ప్రతిపక్షనేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన రూలింగ్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ  ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు బుధవారం (సెప్టెంబర్ 24) విచారించనుంది.  జగన్ పిటిషన్ లో  తనను ప్రతిపక్షనేత హోదా కల్పించేలా ఏపీ శాసన వ్యవహారాల కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.   శాసన సభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్యకార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. 

ఏపీకి అతి భారీ వర్ష సూచన

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్యబంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుభందంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడుగా ఉత్తర బంగాళా ఖాతంలో గురువారం (సెప్టెంబర్ 25) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతే కాకుండా ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని హెచ్చ రించింది. వీటి ప్రభావంతో  రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పోతే బుధవారం (సెప్టెంబర్ 24) శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ,  తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయనీ పేర్కొంది. వచ్చే ఐదు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.  

వైసీపీ తీరు మారుతోందా? మండలిలో మద్దతు దేనికి సంకేతం?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడే వైసీపీ తొలి సారిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపింది. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ప్రవేశ పెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది.  ఔను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీకీ, విత్త మంత్రులు నిర్మలా సీతారామన్, హెచ్ డీ కుమార స్వామిలను అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ మంగళవారం  (సెప్టెంబర్ 23) మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఈ అభినందన తీర్మానానికి వైసీపీ సంపూర్ణ మద్దతు పలికింది. దీంతో ఈ అభినందన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. విషయం ఏదైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరించే వైసీపీ మొట్టమొదటి సారిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు తెలపడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  జీఎస్టీ సంస్కరణల విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీని ప్రశంసిస్తూ, జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ ట్వీట్ చేసినప్పటికీ, మండలిలో జీఎస్టీని స్వాగతిస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తరువాత కారణాలేమైనా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు.. అలాగని మద్దతు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రశక్తే లేదని ఆ విధంగా చాటారు. కానీ.. కేంద్రాన్ని అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో వైసీపీ తీరు మారిందా అన్న చర్చ మొదలైంది. 

చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఒక సీఐ  లీగల్ నోటీసులు పంపించారు.  2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ సీఐ శంకరయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లీగల్ నోటీసులు పంపారు.  వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ నోటీసులు చంద్రబాబుకు ఈ నెల 18న అందాయి.  వివేకా హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందకు గాను రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్‌లో నోటీసులో పేర్కొన్నారు.  వైఎస్ వివేకానంద రెడ్డి   హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐ‌గా  ఉన్న జే.శంకరయ్య అండతో నిందితులు ఆధారాలను తారుమారు చేశారంటూ  చంద్రబాబు అప్పట్లో పలు బహిరంగ వేదికలపై పేర్కొన్న సంగతి తెలిసిందే.  విధులలో  అలసత్వం వహించారని  శంకరయ్యను అప్పటి  ప్రభుత్వం సస్పెండ్ చేసింది.   ఆ తరువాత జగన్ సర్కార్  శంకరయ్యపై  సస్పెన్షన్ ఎత్తేసింది. ఇప్పుడు తాజాగా  శంకరయ్య సీఎం చంద్రాబాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. 

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో  గురువారం (సెప్టెంబర్ 24) నుంచి అక్టోబర్ 2వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం(సెప్టెంబర్ 23)  సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాత్రి 7.50 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఏంటో పిచ్చి జ‌నం.. జీఎస్టీ త‌గ్గింద‌ని ప‌రుగులు!

యాభై రూపాయ‌ల వ‌స్తువును వంద‌కు పెంచి.. ఆపై దాన్ని డెబ్భై ఐదు రూపాయ‌ల‌కు డిస్కౌంట్ పేరిట‌ అమ్ముతుంటే ఎగ‌బ‌డి కొన‌డం మ‌న‌కు న‌ర‌న‌రాన జీర్ణించుకుపోయిన ఒకానొక దుర‌ల‌వాటు. అదే మ‌నం మ‌న ప‌క్కింటి కిరాణా షాపుల్లోని స‌రుకులు.. మ‌న అమ్మ‌మ్మ బామ్మ వంటి వారు వీధుల్లో కుప్ప‌లు పోసి అమ్మే కూర‌గాయ‌లు.. ఇవ‌న్నీ మ‌న‌కు చాలా  చాలా చౌక ధ‌ర‌లకే ల‌భిస్తుంటాయి.  కానీ మ‌నం ఎగేసుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్తుంటాం. అక్క‌డ మ‌నం  పైన చెప్పుకున్న‌ట్టు యాభై రూపాయ‌ల వ‌స్తువును వంద‌కు ఎంఆర్పీ వేసి.. దాన్ని డెబ్భై ఐదుకు భారీ డిస్కౌంట్ పేరిట‌ అమ్మేస్తుంటే ఎగ‌బ‌డి మ‌న ట్రాలీలో వేసేసుకుంటాం. అదేమంటే డెడ్ చీపుగా డిస్కౌంట్లో వ‌చ్చింద‌ని బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభానికి మించిన బిల్డప్ ఇస్తుంటాం. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం నిర్మ‌లా  సీతారామ‌న్ అనే ఒక ద‌క్షిణాదికి చెందిన, తెలుగింటి కోడ‌లిగారి చేత చేయిస్తోన్న జీఎస్టీ గార‌డీ ఇదేనంటారు చాలా మంది ఆర్ధిక నిపుణులు. బేసిగ్గా  గుజ‌రాతీ బ‌నియా బుద్ది  ప్ర‌కారం  చూస్తే.. ప్ర‌జ‌ల చేతిలో విరివిగా ఏదీ ఉండ‌కూడ‌దు. ఉంచ కూడ‌దు. డ‌బ్బంతా ఖ‌జానాలో ఉండాలి. జ‌న‌మంతా డ‌బ్బు కోసం అంగ‌లార్చుతుండాలి. ఇదే వారి మెయిన్ ఫైనాన్షియ‌ల్ పాల‌సీ. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ పాల‌సీని అమ‌ల్లో పెట్ట‌డానికి ట్రంప్ టారీఫ్ ల క‌న్నా మించి.. వాడి  జ‌నం ర‌క్తం పీల్చి పిప్పి చేసేశారు. మ‌న‌మంతా ట్రంప్ మామ ఒక్క‌డే మ‌న‌ల్ని ఇంత‌గా పిండుతున్నాడ‌ని ఓ తెగ ఫీలై పోయాంగానీ.. మ‌న‌ల్నిఇక్క‌డ మోడీ తాత అంత‌క‌న్నా మించి పీల్చేసిన విష‌యం ఇటు జీఎస్టీలోనే కాదు అటు పెట్రోల్, గ్యాసు, మొబైల్ రీచార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటికీ ఈ నాటికీ ఎంతో ధ‌ర‌ల‌ తేడా క‌నిపిస్తుంది రెండు క‌ళ్లు పెట్టి చూస్తే. వీట‌న్నిటికీ ప్ర‌స్తుతం మ‌నం ఒక‌టికి రెండు మూడు రెట్లు ఎక్కువ‌గా చెల్లిస్తున్నాం. ఈ క్ర‌మంలో కాస్త ఊర‌ట‌నిచ్చేలా నాలుగు జీఎస్టీ స్లాబులు తీసేసి రెండు స్లాబులు మాత్ర‌మే ఉంచ‌డం అది కూడా ద‌స‌రా, దీపావ‌ళి ధమాకా పేరిట‌ ఇవ్వ‌డం చూస్తుంటే.. ఇదొక కార్పొరేట్ పాల‌సీగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందులో జ‌నం సొమ్ము జ‌నానికే పంచ‌డం ఏదైతే ఉందో అది న‌భూతో అంటున్నారు చాలా మంది అర్ధ‌శాస్త్ర నిపుణులు.  ఈ విష‌యం అర్ధం కాక టీవీలు, ఫ్రిడ్జిలు, కార్లు.. ఇత‌ర‌త్రా భారీగా త‌గ్గాయ‌ని ఎగేసుకుని వెళ్తున్నాం మ‌న‌మంతా.. దీన్నే అంటారు బ‌నియా టెక్నిక్ అని కామెంట్ చేస్తున్నారు కొంద‌రు సీఏ స్టూడెంట్స్.

తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో ఏర్పాటు కానుంది. ఎన్ఆర్ఐల వితరణతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రానికి ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, వీజీవో రాంకుమార్, టీటీడీ బోర్డు  సభ్యుడు నరేష్ పరిశీలించారు.   శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు  ఏఐ  ను వినియోగించాలన్న చైర్మన్ నిర్ణయం ప్రకారం ఎన్ఆర్ఐ ల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటు లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు చర్యలు చేపట్టనుంది.   ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే  ఎలా ఉపయోగపడుతుందనే ఆంశాలను ఒకసారి పరిశిలిస్తే ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తు లను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంచనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల హావభావాల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.  క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడీ మ్యాపులు, చిత్రా లతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది. ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపుతుంది.