ఇద్దరు మంత్రుల పనితీరు కేసీఆర్‌కి నచ్చలే...

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అందరూ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు... మంత్రి పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులు అందరూ! కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఇవాళ రేపు అంటూ చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన ఇరవై రోజుల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ వుంటుందని చాలామంది ఆశిస్తున్నప్పటికీ ఎవరికి అవకాశం దక్కుతుందో చివరి నిమిషం వరకూ తెలిసే అవకాశం కనిపించడం లేదు. అయితే కేసీఆర్ తన మంత్రివర్గంలో దక్షిణ తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి మంత్రిపదవి వదులుకుని వచ్చి మరీ టీఆర్ఎస్‌లో చేరిన మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు జూపల్లి కృష్ణారావుకు, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, జడ్చర్ల ఎమ్మల్యే లక్ష్మారెడ్డికి మాత్రం ఈసారి తప్పకుండా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం వుందని భావిస్తున్నారు. ఎప్పటి నుంచో పదవి ఇస్తామని ఊరిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్‌కి కూడా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. తుమ్మలతో పాటు దేవీప్రసాద్ కూడా ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఇద్దరికీ ప్రస్తుతానికి మంత్రిపదవులు ఇచ్చేసి, ఆ తర్వాత ఇద్దర్నీ కౌన్సిల్ సభ్యులు చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.   మంత్రివర్గ విస్తరణ సంగతి ఇలా వుంటే, ప్రస్తుతం తన కేబినెట్‌లో కీలక మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరి పనితీరు పట్ల కేసీఆర్ పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ తన మంత్రివర్గం అద్భుతంగా పనిచేయాలని ఆశించారు. అయితే పరిస్థితులు అందుకు విరుద్ధంగా వున్నాయి. మంత్రులు పనిచేయడానికి అవకాశాలు తక్కువగా వున్నాయి. అయినప్పటికీ మంత్రులు సాధ్యమైనంత మేరకు తమ పనితీరుతో కేసీఆర్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరు మంత్రులు మాత్రం పరమ నాసిరకమైన పనితీరును కనబరుస్తున్నారని, వారి పనితీరు మీద కేసీఆర్‌కి అనేక ఫిర్యాదులు కూడా అందాయని తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఆ ఇద్దరు మంత్రులకు పనితీరు విషయంలో ప్రైవేట్‌గా, పబ్లిగ్గా క్లాసులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశాలు అయితే లేవుగానీ, ఈ ఇద్దరినీ అంతగా ప్రాధాన్యం లేని శాఖలకు, ఎంతమాత్రం పనిచేయకపోయినా నడిచిపోయే శాఖలకు మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సానియా సవాల్‌ని కేటీఆర్ స్వీకరిస్తారా?

  ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైన తర్వాత అలాంటి రకరకాల ఛాలెంజ్‌లు వ్యాప్తిలో వున్నాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇలాంటి ఛాలెంజ్‌ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక కొత్త మలుపు తిప్పారు. ఆయన రూపొందించిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమం ద్వారా దేశంలోని చెత్తని నివారించే పని మొదలుపెట్టారు. నరేంద్రమోడీ చేత చీపురు పట్టి చెత్తను ఊడ్చి, దేశంలోని కొంతమంది సెలబ్రిటీలకు ఇలా చేయండంటూ సవాల్ విసిరారు. వారిలో రిలయన్స్ అధినేత అనిల్ అబానీ కూడా వున్నారు. మోడీ పిలుపుకు స్పందించిన అనిల్ అంబానీ తాను కూడా చీపురు పట్టి చెత్త ఊడ్చి మరికొంతమందికి సవాల్ విసిరారు. వారిలో సానియా మీర్జా కూడా వున్నారు. తాజాగా సానియా మీర్జా కూడా చీపురు పట్టి చెత్త ఊడ్చి మరికొంతమందికి సవాల్ విసిరారు. వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) కూడా వున్నారు. ఇప్పుడే అసలు చిక్కు వచ్చి పడింది.   టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. సానియా మీర్జాకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పదవి దక్కడానికి, రెండు విడతలుగా రెండు కోట్ల రూపాయలు దక్కడానికి ప్రధాన కారణం కేటీఆర్. అందుకే ఆయన మీద గౌరవాన్ని పెంచుకున్న సానియా మీర్జా ఆయనకు స్వచ్ఛ భారత్ సవాల్ విసిరారు. కేటీఆర్ కనుక సానియా సవాల్ స్వీకరించినట్టయితే తాను కూడా చీపురు పట్టి చెత్త ఊడ్చి మరికొంతమందికి సవాల్ విసరాల్సి వుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ అలా చేస్తారా అనేదే పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది.   ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిర్వహించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ కార్యక్రమాన్ని ఎంతమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వాధినేతలు గానీ, ప్రభుత్వాధికారులు గానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమానికి దూరంగా వుందన్న అభిప్రాయాలు వున్నాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా సలహాకి స్పందించి కేటీఆర్ కనుక చీపురు పట్టి ఊడిస్తే ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం అనుసరించిన విధానానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. మరి ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తారో చూడాలి.

పవన్ కళ్యాణ్ ఆ సూచన చిరంజీవికేనా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుఫాను విపత్తును ఎదుర్కొంటున్న వేళ ఈ అంశాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే నాయకులను చూస్తే ఎవరికైనా చిరాకు పడుతుంది. రాజకీయ నడపడానికి ఏ అంశమూ లేనట్టుగా ఈ బాధాకర అంశాన్ని కూడా వాడుకోవాలని అనుకోవడం కొంతమంది రాజకీయ నాయకుల చిన్నతనాన్ని చూపిస్తూ వుంటుంది. ఆ విషయాన్నే గురువారం నాడు విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. విశాఖకు తుఫాను వచ్చిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖకు రావడమే కాకుండా, వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని, చంద్రబాబు నాయుడు వైజాగ్‌లోనే మకాం వేసి ప్రజలకు అండగా నిలబడటాన్ని పవన్ కళ్యాణ్ మనస్పూర్తిగా అభినందించారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ మరో మాట కూడా అన్నారు. ఇలాంటి సందర్భాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని కూడా అన్నారు. ఈ సందర్భాన్ని చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే ఈ కామెంట్లు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటన విశాఖ విపత్తు అంశాన్ని రాజకీయాలకు వాడుకునేవిధంగానే వుంది. ప్రధానమంత్రి మోడీ వెయ్యి కోట్ల తక్షణ సాయం ప్రకటించడం చాలా తక్కువ అని, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఆర్థిక సాయం అందేలా కృషి చేయలేకపోయిందన్నట్టుగా చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు. నరేంద్రమోడీ చాలా తక్కువ ఆర్థిక సాయం ప్రకటించడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని చిరంజీవి లేనిపోని ఆశ్చర్యాన్ని ప్రదర్శించారు. చిరంజీవి తన లేఖలో వ్యక్తం చేసిన ఈ ధోరణికి వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. విశాఖ విపత్తులో వుంటే తీరిగ్గా 19, 20 తారీఖులలో పరామర్శకు వస్తానని చెప్పిన చిరంజీవి పద్ధతి కూడా పవన్ కళ్యాణ్‌కి నచ్చలేదని తెలుస్తోంది. అంతా అయిపోయిన తీరిగ్గా విహార యాత్రకు వచ్చినట్టు వస్తానని అనడం, తుఫాను అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నించడం పవన్ కళ్యాణ్‌కి చిరాకు పుట్టించిందని సమాచారం. ఆ చిరాకే గురువారం ఆయన చేసిన కామెంట్ల రూపంలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది.

తుఫాను మీద చిరంజీవి ముష్టి రాజకీయాలు

  ముష్టి రాజకీయాలు అంటే ఎలా వుంటాయో తెలుసుకోవాలంటే మాజీ మెగాస్టార్, రాజకీయాల్లో దగాస్టార్ చిరంజీవి చేసే రాజకీయాలను చూసి తెలుసుకోవచ్చు. ఆయన ఆ తరహా రాజకీయాలు చేస్తారు కాబట్టే రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రజల్లో వున్న ఆదరణ కోల్పోయి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆటలో అరటి పండులాగా మాత్రమే మిగిలిపోయారు. సినిమా రంగంలో మెగాస్టార్ అయిన ఆయన రాజకీయంగా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయి కూర్చున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఆయన వ్యవహార శైలే అందుకు కారణం. ఆయన గారు రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి ఆయన ఏ పని చేసినా తెలుగు ప్రజలు నవ్వుకునేవిధంగానో, తిట్టుకునే విధంగానో వుంది తప్ప ‘‘చిరంజీవి భలే చేశాడు’’ అనుకునే విధంగా ఆయన రాజకీయంగా ఏనాడూ ప్రవర్తించలేదు. అది ఆయన రాజకీయ అసమర్థత అనడం ఎంత కరెక్టో.. తెలుగు ప్రజల దురదృష్టం అనడం కూడా అంతే కరెక్టు. అంతటి ప్రజాదరణ వున్న వ్యక్తి ఒక బలమైన రాజకీయ నాయకుడిలా మారి, ప్రజలకు అండగా నిలిచే నాయకుడిలా వుండాల్సింది. అయితే ఆయన నేలబారు రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడిలా మిగిలిపోవడమే తెలుగు ప్రజల దురదృష్టం.   హుదుద్ తుఫాను పెను విపత్తులా మారి తెలుగు ప్రజలందరికీ ఆవేదన కలిగిస్తోంది. తుఫాను కారణంగా విలవిలలాడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్విరామ కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్రను ఆదుకోవడానికి అనేకమంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది సినీ తారలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించిన తర్వాత చిరంజీవి తీరిగ్గా రంగంలోకి దిగి ఆయన కూడా 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అది కూడా ప్రజలు ఆయన సినిమాలను ఆదరించి ఇచ్చిన వేలాది కోట్ల నుంచి కాకుండా తనకు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నుంచి విరాళాన్ని ఇచ్చారు. అంటే తన జేబులోంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నమాట. సినిమా ఇండస్ట్రీలో చిన్న కమెడియన్‌గా వున్న వ్యక్తి కూడా తన జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. ‘మెగాస్టార్’ అని తనను తాను చెప్పుకునే చిరంజీవి మాత్రం తన జేబులోంచి డబ్బు తీసి ఇవ్వలేదు. పోనీ డబ్బు ఏదైనా డబ్బే.. ప్రజల డబ్బే ప్రజలకు ఇచ్చారని అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ విరాళాన్ని ప్రకటిస్తూ ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖని చూస్తేనే ఆయన ఎంత దిగజారుడు రాజకీయాలు నడుపుతున్నారో అర్థమవుతోంది.   చిరంజీవి తాను రాసిన లేఖలో తుఫానుకు సంబంధించి అందరికీ తెలిసిన విషయాలే మరోసారి ఉల్లేఖించారు. అక్కడితో ఆగితే బాగుండేది. తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేవలం 1000 కోట్లు మాత్రమే ఆర్థిక సహాయంగా ప్రకటించడం చిరంజీవికి ఆశ్చర్యాన్ని కలిగించిందట. అలాగే ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించకపోవడం కూడా చిరంజీవిని ఆశ్చర్యానికి గురిచేసిందట. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీదే బాధ్యత వుందట. అయినా విశాఖ పట్టణం కోలుకునే వరకూ తాను అండగా వుంటానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం చిరంజీవికి తెలియదా.. ఉత్తరాంధ్రను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి చిరంజీవికి కనిపించడం లేదా. చిరంజీవి రాసిన లేఖ ఏదో ఎందుకూ పనికిరాని రాజకీయాలు చేసే విధంగా వుంది తప్ప... ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి నైతికంగా మద్దతు ఇచ్చేవిధంగా ఎంతమాత్రం లేదు.   తన లేఖలో భారీ స్థాయిలో వాపోవడాలు, ఆశ్చర్యపోవడాలు చేసిన చిరంజీవి అదే లేఖలో మరెంతో కామెడీ అంశాలు కూడా రాశారు. వాటిని చదివి నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. ఇంత ఆశ్చర్యపోతున్న పెద్దమనిషి విపత్తులో వున్న ఉత్తరాంధ్ర ప్రజలను పరామర్శించడానికి ఇప్పుడు వెళ్ళరట. ఈనెల 19, 20 తేదీలలో కాంగ్రెస్ జాతీయ నాయకులతో కలసి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారట. అప్పటికి ఉత్తరాంధ్ర మొత్తం తుఫాను తెచ్చిన విలయం నుంచి తేరుకుని తన జీవన గమనంలో తాను వుంటుంది. అప్పుడు వెళ్ళి ఈ పెద్దమనిషి ఎవరి కన్నీరు తుడుస్తారోమరి. అందరూ అన్ని రకాలుగా పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత ఈయన తీరిగ్గా మేకప్ వేసుకుని వెళ్ళి అక్కడ స్పీచ్‌లు ఇస్తారన్నమాట. ఇలాంటి చర్యలే చిరంజీవి రాజకీయంగా ఎందుకు ఎదగలేపోయారో చెప్పకనే చెబుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ముప్పుగా పరిణమించింది హుదుద్ లాంటి తుఫాను కాదు.. చిరంజీవి లాంటి బాధ్యత లేని రాజకీయ నాయకులు.

రియల్ హీరోలకి అభినందనలు

  తెరమీద మాత్రమే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోలు కొంతమంది మాత్రమే వుంటారు. మన టాలీవుడ్‌లో కొంతమంది హీరోలు మేము తెరమీద ఆడే బొమ్మ హీరోలం మాత్రమే కాదు... మనసున్న రియల్ హీరోలం అని చాటుకునే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేసిన హుదూద్ తుఫాన్ ఆ ప్రాంతానికి అపారమైన నష్టాన్ని మిగిల్చింది. కన్నీటి పర్యంతం అవుతున్న ఉత్తరాంధ్ర వాసుల కన్నీళ్ళు తుడిచేందుకు ఎంతోమంది తమ హస్తాలను ముందుకు చాస్తున్నారు. అలాంటి ఆపన్న హస్తాలలో మన టాలీవుడ్ సినిమా హీరోలు చేతులు కూడా వుండటం అభినందనీయం.   తుఫాను బాధితులను ఆదుకునే విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ చూపిస్తూ 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. త్వరలో తాను తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్తానని చెప్పడంతోపాటు, అక్కడ సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా తన అభిమానులకు పిలుపు ఇచ్చారు. మహేష్‌బాబు 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధికి పదేసి లక్షల విరాళాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ మరో ఐదు లక్షలను రామకృష్ణ మిషన్‌కి ప్రకటించాడు. కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా తుఫాను బాధిత ప్రాంతాలకు ఆహార పదార్ధాలను, మందులను పంపనున్నట్టు తెలిపారు.   అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అలాగే సినిమా రంగానికి చెందిన మరికొందరు హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి.

విపత్తులోనూ వ్యాపారబుద్ధేనా?

  హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్టణం ఎదుర్కొన్న పెను విపత్తు దేశవ్యాప్తంగా అందర్నీ కదిలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలోనే మకాం వేసి అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విశాఖ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తుఫాను ధాటికి విశాఖపట్టణం అతలాకుతలం అయిపోయింది. చాలామంది సర్వం కోల్పోయి నడి రోడ్డున నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటి ప్రాంతాల వారే విశాఖను చూసి జాలిపడుతుంటే, విశాఖలో వ్యాపారులు మాత్రం ఈ విపత్తుని క్యాష్ చేసుకోవాలని తపిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో జనం రోడ్లమీదకి వచ్చారు. నిత్యావసరాల కోసం, పెట్రోలు, డీజిల్ కోసం రోడ్ల మీదకు వచ్చిన జనం దుకాణాల్లో ఆయా వస్తువులకు వ్యాపారులు చెబుతున్న రేట్లు విని నోళ్ళు తెరిచారు. మామూలుగా అమ్మే ధరకంటే రెట్టింపు ధరలు అమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్ ఏకంగా వందరూపాయల రౌండ్ ఫిగర్ చేసేశారు. కోడిగుడ్డు కొనాలన్నా కళ్ళలో గుడ్లు తిరిగిపోయే రేట్లు చెప్పారు. ఈ విషయాలన్నీ గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చేసరికి కొంతమంది దారికి వచ్చారు. మరికొంతమంది తమ వ్యాపార ధోరణిలోనే తమ ఇష్టం వచ్చిన ధరకు విక్రయాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యాపారులున్న వైజాగ్‌కి తెలుగు ప్రజలందరి తరఫున ప్రగాఢ సానుభూతి. ఇలాంటి వ్యాపారులున్న వైజాగ్‌ భవిష్యత్తులో స్మార్ట్ సిటీ అవడం వల్ల ఉపయోగం ఏమిటి? అడుగడుగునా పరిస్థితులను ‘స్మార్ట్’గా క్యాష్ చేసుకునేవాళ్ళు తయారైనప్పుడు ఏ నగరమైనా ఎంత అభివృద్ధి చెందినా ఉపయోగం ఏమిటి? ఇలాంటి విపత్తు సమయంలో కూడా వ్యాపార బుద్ధితో ఆలోచించిన వారిని ఏమనాలి? అలాంటి వారికి బుద్ధొచ్చేట్టు చేయి దేవుడా అని ప్రార్థించడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు.

ఎర్రబెల్లి.. అందని ద్రాక్ష...

  ఓ కథ అందరికీ తెలిసిందే. అనగనగా ఓ నక్క. ఆ నక్కకి ఓ రోజున వెళ్తూ వెళ్తూ తల పైకెత్తి చూస్తే పైన ద్రాక్ష పళ్ళు కనిపించాయి. వాటిని సొంతం చేసుకోవడానికి నక్క రకరకాల ఫీట్లు చేసింది. ఎంత ఎగిరినా ద్రాక్షని అందుకోలేకపోయింది. చివరకు ద్రాక్షల కోసం పైకి ఎగిరీ ఎగిరీ నక్క నడుం కూడా బెణికింది. చివరికి నక్క ‘ఈ ద్రాక్షలు బాగోవు.. ఇవి పుల్లటి ద్రాక్షలు’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన వైఫల్యాన్ని ఆ నక్క ద్రాక్ష పళ్ళ మీదకి నెట్టేసింది. ఈ కథకి, టీఆర్ఎస్ - ఎర్రబెల్లికి మధ్య పోలిక వుందని తెలంగాణ తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. నక్కకి అందని ఆ ద్రాక్షే ఎర్రబెల్లి అంటున్నాయి. తెలంగాణలో టీడీపీని బలహీనం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆకర్ష’ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. తాజాగా ముగ్గురు టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చెబుతున్న కారణాలు మరీ విచిత్రంగా వున్నాయన్న అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. ధర్మారెడ్డి అనే ఎమ్మెల్యే చెప్పే కారణం అయితే మరీ కామెడీగా వుంది. తాను టీఆర్ఎస్‌లో చేరితే తన నియోజకవర్గం అభివృ‌ద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వందల యాభై కోట్లు ఇస్తాననేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నాడట. సరే, వీళ్ళ సంగతి అలా వుంచితే, టీఆర్ఎస్ గాలం వేసిన పెద్ద చేప ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం చిక్కలేదు. ‘మనం మనం ఒకటి’ అని సామాజిక వర్గం కోణంలో ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదు. ప్రజల సమస్యల ప్రస్తావనకు ముఖ్యమంత్రి స్థానంలో వున్న కేసీఆర్‌ని కలవటానికి ఎర్రబెల్లి వెళ్తే, దానికి పార్టీ మారడానికే కలిశారంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి మాత్రం తాను ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదన్న తన మాటకు కట్టుబడి వున్నారు. దాంతో టీఆర్ఎస్ ఎర్రబెల్లి మీద ఆశలు వదిలేసుకుంది. ఎర్రబెల్లి మీద ఆశలు వదులుకున్న టీఆర్ఎస్ అక్కడితో ఆగకుండా ఎర్రబెల్లి పుల్లని ద్రాక్ష అంటూ ప్రచారం మొదలుపెట్టింది. దానికోసం టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి సేవలను ఉపయోగించుకుంటోంది. గత కొన్ని రోజులుగా కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకరరావు మీద విమర్శల మీద విమర్శలు కురిపిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుని టీఆర్ఎస్‌లోకి రానిచ్చే ప్రసక్తే లేదని అనడం మొదలుపెట్టారు. ఎర్రబెల్లి కేసీఆర్ని అర్ధరాత్రిపూట ఎందుకు కలిశారో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏ గడ్డి పీకినా ఎర్రబెల్లిని టీఆర్ఎస్‌లో అడుగు పెట్టనిచ్చేదే లేదని చెబుతున్నారు. ఒకవైపు స్వయానా ఎర్రబెల్లే నేను టీఆర్ఎస్‌లోకి రాను మొర్రో అంటూ వుంటే మరోవైపు కడియం చేస్తున్న కామెంట్లు పుల్లటి ద్రాక్షపళ్ళ కథని గుర్తుకు తెచ్చేలా వున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇక గూగుల్ హ్యాంగ్ ఔట్‌లో చంద్రబాబు

  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు ముందుండే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఐప్యాడ్ లను ఉపయోగిస్తూ ‘పేపర్ లెస్ క్యాబినెట్ మీటింగ్’ నిర్వహించి తన ప్రత్యేకత మరోసారి చాటుకొన్నారు. దానికి క్లౌడ్ కంప్యూటర్ సర్వీస్ సేవలుపయోగించుకోవడం మరో విశేషం.   ఇక ఇప్పటికే ఆయన ట్వీటర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో అభిప్రాయాలు పంచుకొంటున్నారు. ఇకపై యూ ట్యూబ్, ఫేస్ బుక్, గూగూల్ ప్లస్ ద్వారా కూడా యువతరంతో అభిప్రాయలు పంచుకొబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మాట్లాడినపుడు తీసిన వీడియో క్లిప్పింగులను, శుక్రవారం నుండి యూ ట్యూబ్ లో ఉంచుతూ దానిపై ప్రజల నుండి వచ్చే స్పందన తెలుసుకొంటున్నారు. అదేవిధంగా డిశంబరు మొదటి వారం నుండి ఆయన గూగూల్ హ్యాంగ్-అవుట్ ద్వారా కూడా నేరుగా ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకోబోతున్నారు. మొదటగా తన ప్రభుత్వం చేప్పట్టిన ఏడు మిషన్లపై చర్చతో ఆరంభించే అవకాశం ఉందని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.   చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ సోషల్ నెట్ వర్క్ సైట్ల ద్వారా ప్రజలతో నిత్యం ‘టచ్చు’ లో ఉండటమే కాకుండా అన్ని మంత్రిత్వ శాఖలను, మంత్రులను కూడా శాఖలవారిగా ప్రత్యేక వెబ్ సైట్స్ మరియు ఫేస్ బుక్, ట్వీటర్ ల ద్వారా ఇదేవిధంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ప్రజాస్పందన ఏవిధంగా ఉందనే సంగతి తెలుసుకోవడానికి ఎన్నికల వరకు భజన చేస్తూ కూర్చోవడం కంటే, ఈవిధంగా ఎప్పటికప్పుడు ప్రజలతో తమ అభిప్రాయాలు పంచుకొంటూ, వారి సలహాలు, సూచనలు తీసుకొంటూ ముందుకు సాగినట్లయితే అందరికీ అమోదయోగ్యమయిన విధంగా పరిపాలనా సాగించవచ్చని, తప్పులు జరిగితే తక్షణమే వాటిని సరిదిద్దుకొనే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్థాన్‌కి సత్తా చాటిన భారత సైన్యం

  జమ్ము - కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ఓవర్ యాక్షన్ చేసి భారత సైనికుల మీద, భారత భూభాగంలోని జనావాసాల మీద కొద్ది రోజుల క్రితం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో అనేక ఇళ్ళు ధ్వంసం కాగా, ఇద్దరు మరణించారు. గత రెండు రోజుల నుంచి పాకిస్థాన్ సైనిక మూకలు కాల్పులు జరపడం ఆపేశారు. భారత సైన్యం చూపిన సత్తాయే పాక్ సైనికులు గప్‌చుప్ అయిపోవడానికి కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్ సైనికులకు గతం నుంచీ ఒక ఆటలా వుండేది. యుపిఎ హయాంలో సరైన ఆయుధ సంపత్తి లేక, దూకుడుగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం లేక భారత సైనికులు చేతులు కట్టేసినట్టు వుండేవారు. ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైనికులలో ఆత్మస్థైర్యాన్ని పెంచే ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాకిస్థాన్ సైనికులు ఎక్కువ చేస్తే వారిని అదుపులోకి తేవడానికి అవసరమైన పూర్తి ఆయుధ సంపత్తితోపాటు నైతికంగా వారికి పూర్తి మద్దతు ఇచ్చారు. దాంతో భారత సైనికులు పాకిస్థాన్ సైనికులను విజయవంతంగా కట్టడి చేయగలిగారు.   భారత ప్రధానమంత్రి కార్యాలయం పాకిస్థాన్ సైనికులు కాల్పులు ప్రారంభించగానే తగిన చర్యలను తీసుకోవాలని సైనిక వర్గాలను ఆదేశించింది. గతంలో మాదిరిగా సందేహించాల్సిన అవసరం లేదని, పాకిస్థాన్ సైనికుల విషయంలో దూకుడుగా వ్యవహరించొచ్చని చెప్పింది. పాక్ సైనికులను తిప్పికొట్టడానికి భారీ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని సూచించింది. ప్రభుత్వం నుంచి సూచనలు అందుకున్న భారత సైనికులు తమ ప్రతాపం చూపించారు. దాదాపు ఐదు లక్షల బుల్లెట్లు వర్షంలాగా కురిపించారు. భారత సైనికులు జరిపిన కాల్పుల వల్ల పాకిస్థాన్ అధికారికంగా బయటపెట్టకపోయినప్పటికీ, వందల సంఖ్యలో పాకిస్థాన్ సైనికులు మరణించారని తెలుస్తోంది. పాకిస్థాన్ సైనికులతోపాటు సరిహద్దులు దాటి రావడానికి ప్రయత్నించిన జిహాదీ మూకలు కూడా మరణించాయని తెలుస్తోంది. భారత సైనికులు తీవ్రంగా కాల్పులు ప్రారంభించగానే, అప్పటి వరకూ సరిహద్దుల దగ్గర గోతికాడ నక్కల్లా కాచుకుని వున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద జిహాదీ గ్రూపుల వారు దాదాపు 500 మంది చెట్టుకొకరుగా పుట్టకొకరుగా పారిపోయారని తెలుస్తోంది. భారత సైన్యం జరిపిన భారీ కాల్పుల్లో దాదాపు 90 పాకిస్థానీ సైనికుల శిబిరాలు ధ్వంసమైపోయాయని సమాచారం. భారత సైనికులు చూపిన తెగువ పాకిస్థానీయులను బిత్తరపోయేలా చేసిందని, తిరిగి ఇప్పట్లో పాకిస్థాన్ సైనికులు భారత భూభాగం మీద కాల్పులు జరిపే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు?

  మరో ఇరవై రోజుల్లో నవంబర్ 1వతేదీ వస్తుంది. ఇంతవరకు ఆరోజును రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పాటిస్తున్నాము. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలనే చర్చ మొదలయింది. కొందరు అదే రోజున జరుపుకోవాలని సూచిస్తుంటే మరి కొందరు ఆంద్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన రోజున అంటే జూన్2న జరుపుకోవాలని వాదిస్తున్నారు. కానీ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. కనుక ప్రజలలోనే కాదు ప్రభుత్వ అధికారులలో కూడా ఈ విషయంలో సందిగ్దత నెలకొని ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోతే, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించవలసి ఉంటుంది కనుక దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సమయం సరిపోదని అధికారులు భావిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలను కూడా సంప్రదిస్తే అనవసర రాద్ధాంతం నివారించవచ్చును.

మీడియా గొంతు మూగబోవలసిందేనా?

  గత మూడున్నర నెలలుగా తెలంగాణా రాష్ట్రంలో నిషేధానికి గురయిన ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ పునరుద్దరణకు ఆ సంస్థ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. చివరికి నిన్న హైకోర్టులో కూడా వారికి చుక్కెదురయింది. జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం నిన్న తన తీర్పు ప్రకటిస్తూ ప్రైవేటు వ్యక్తులయిన తెలంగాణా యం.యస్.ఓ.లను ఛానల్ ప్రసారాలను పునరుద్దరించమని ఆదేశించలేమని, అందువలన ఈ వ్యవహారాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోమని సూచించింది. సివిల్ కోర్టులో కేసులు తేలడానికి ఎన్నేళ్ళు పడతాయో అందరికీ తెలిసిన విషయమే. కనుక ఆ ప్రయత్నం కూడా వృధా ప్రయాసేనని చెప్పకతప్పదు. అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళడమే ఇక మిగిలింది. మన దేశంలో మీడియాకు చాలా స్వేచ్చ ఉందని విదేశాలు సైతం ప్రశంసిస్తుంటాయి. మన దేశంలో మీడియా స్వేచ్చకు సంకెళ్ళు పడటం చాలా అరుదనే చెప్పవచ్చును. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ఆ మీడియా గొంతే మూగబోతుంటే, అందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు చివరికి కోర్టులు కూడా తమ నిస్సహాయత వ్యక్తం చేయడం చాలా విచారకరం. ఇదంతా చూసి ఇతర రాష్ట్రాలు కూడా తమకు నచ్చని మీడియా గొంతులను నొక్కే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదనే చెప్పవచ్చును.

ఏపీ రాజధాని: అన్ని దారులూ అమరావతి వైపే!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో ఉంటుందని ప్రకటించిన తర్వాత ఆంధ్రుల తొలి రాజధాని, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి వైపే రాజధాని వుండే అవకాశాలు వున్నాయన్న అభిప్రాయాలు వినిపించాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కృష్ణానదికి అవతలి వైపునే రాజధాని వుంటుందని స్పష్టంగా ప్రకటించడం కూడా అమరావతి ప్రాంతం రాజధాని అయ్యే అవకాశాలు వున్నాయన్న అంచనాలకు మరింత బలం చేకూరింది.   పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.... అమరావతి ప్రాంతానికి రాష్ట్రానికి రాజధాని అవ్వడానికి అన్ని అర్హతలూ వున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని కావడం అనేది వాస్తు పరంగా అద్భుతం. ఎందుకంటే అమరావతికి ఈశాన్యం చాలా పల్లంగా వుంటుంది. పైగా కృష్ణానది నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది. అలాగే అమరావతి ఈశాన్య భాగంలో పెద్ద రిజర్వాయర్ వుంది. ఆ విధంగా ఈశాన్యంలో సహజసిద్ధంగానే నీటి నిల్వలు వుండటం ఎంతో మంచిది. మరో విషయం గురించి ఆలోచించకుండానే ఏకగ్రీవంగా అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయడానికి ఈ ఒక్క కారణం చాలు. ఈ కారణంతోపాటు మరెన్నో కారణాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్గాలు అమరావతి వైపు పయనించడానికి కారణం అవుతున్నాయి.   అమరావతి పరిసరాల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్... ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సరిపడా ప్రభుత్వ భూములు వున్నాయి. కృష్ణాతీరంలో వున్న అమరావతిని రాజధానిగా చేయడం వల్ల రాజధానికి నీటి సమస్య కూడా వుండదు. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి మీద ట్రాఫిక్ ఒత్తిడి పడకుండా రింగ్ రోడ్లను ప్లాన్ చేసింది. విజయవాడ పరిసరాలు మొత్తం అభివృద్ధి చెందేలా, అమరావతి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసేలా ఈ ప్రణాళిక వుంది.   అలాగే అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని చేసిన తర్వాత ఆ ప్రాంతంలో రవాణా సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై రెండు భారీ వంతెనలను నిర్మించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.   అమరావతి అనాది నుంచి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. బౌద్ధ సంస్కృతి విలసిల్లిన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేసినట్టయితే వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి సిద్ధంగా వున్నట్టు బౌద్ధ గురువు దలైలామా రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బౌద్ధాన్ని పాటించే జపాన్ కూడా అమరావతి రాజధాని అయినట్టయితే రాజధాని అభివృద్ధికి భారీ స్థాయిలో సహకరిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. రాజధాని పేరు కూడా బౌద్ధ ధర్మాన్ని అనుసరించి పెట్టినట్టయితే తమ నుంచి మరింతగా సహకారం అందుతుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇన్ని అనుకూల అంశాలు వున్నాయి కాబట్టే అందరి ఆలోచనలూ ‘అమరావతి’ అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని దారులూ అమరావతి వైపు వెళ్తున్నాయి.

జగన్‌కి తెలంగాణ మీద లవ్వెందుకు పుట్టిందంటే...

  జగన్‌ పార్టీ తెలంగాణలో ఎప్పుడో బాల్చీ తన్నేసింది. తెలంగాణలో వైకాపా అంత్యక్రియలు, దినవారాలు ఎప్పుడో అయిపోయాయి. అప్పటి నుంచి జగన్ బాబు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైపోయి తన ప్రతాపం అక్కడే చూపిస్తున్నారు. ఎవరి పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు మండిపోతుందో ఆ వ్యక్తి కేసీఆర్‌తో జగన్ దోస్తీ కట్టి స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడుతున్నాడు. ఆ పాటలనే తన మీడియాలో కూడా వినిపిస్తూ కేసీఆర్ మీద తనకున్న భక్తిని యథాశక్తి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ నాలుగు నెలల కాలంలో తెలంగాణలో ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా వాటి గురించి పల్లెత్తు మాట కూడా అనకుండా జగన్ తెలంగాణ అంటే తనకు ఎంతమాత్రం పట్టనట్టే వ్యవహరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ గానీ, ఆయన పార్టీ గానీ తిరిగి తెలంగాణలో ఎంటరయ్యే అవకాశం లేదని అందరూ అనుకున్నారు.   అయితే జగన్‌ బాబుకి సడెన్‌గా తెలంగాణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కేసీఆర్ సరిగా పరిపాలించడం లేదన్న విషయం గుర్తుకొచ్చింది. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో తన పార్టీకే అధికారం దక్కేస్తుందని ఆశ పుట్టుకొచ్చింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతని తన సోదరీమణి షర్మిలకి అప్పగించేశాడు. వైఎస్సార్ పోయినప్పుడు తెలంగాణలో కూడా ఎంతోమంది గుండె ఆగి చనిపోయారట. వాళ్ళ కుటుంబాలని ఐదేళ్ళ తర్వాత పరామర్శించి రమ్మంటూ షర్మిలకి పురమాయించేశాడు. ఇదంతా చూస్తుంటే జగన్‌కి తెలంగాణ మీద సడెన్‌గా ఇంత లవ్వు ఎందుకు పుట్టిందా అనే సందేహం అందర్లోనూ కలిగింది.   తెలంగాణలో తిరిగి కాలు మోపడం వెనుక కారణాలని జగన్ పైకి ఎన్ని చెబుతున్నప్పటికీ, మొన్నటి వరకూ తన భుజాన ఎక్కించుకుని తిరిగిన కేసీఆర్ని ఇప్పుడు సడెన్‌గా విమర్శిస్తున్నప్పటికీ జగన్ పార్టీ రీ ఎంట్రీ వెనుక చాలా పెద్ద ప్లానే వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్, షర్మిల పాత్రధారులైన ఆ ప్లానుకు సూత్రధారి మరెవరోకాదు.. కేసీఆరేనని కూడా అంటున్నారు. ఈ ప్లాన్ వెనుక వున్న సంగతులను కూడా విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వెలమ దొరల సామాజిక వర్గం అధికారంలోకి రావడంతో రెడ్డి సామాజికవర్గం దిగాలు పడిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుండగా తెలంగాణ ప్రాంతంలో మొన్నటి వరకు హవా నడిపిన రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగాలు పడిపోయింది. రాష్ట్ర రాజకీయాలను శాశించే బలమైన నాయకుడు తమ సామాజిక వర్గం నుంచి ఎవరైనా వస్తారా అన్న ఎదురుచూపు ఆ సామాజికవర్గంలో వుంది. కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు వున్నప్పటికీ వాళ్ళు చురుకుగా వ్యవహరించే పరిస్థితి లేదు. కేసీఆర్ గవర్నమెంట్‌ని ఎదుర్కొనే శక్తీ లేదు. దాంతో ఆ సామాజిక వర్గం ఎంతో లోటుగా భావిస్తోంది. ఆ లోటును గ్రహించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం మీద బాణంలా సంధించి వదిలారు. బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు, మాటకారితనం వున్నవాడు, ముక్కుసూటిగా వ్యవహరించేవాడూ అయిన రేవంత్‌రెడ్డి గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వం మీద మాటల తూటాలు విసురుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ‘దొరల’ మీదే తన పోరాటం అంటున్న రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గానికి కొత్త ఆశలు కలిగేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సామాజికవర్గం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ చేరువ అవుతున్నారు.   రెడ్డి సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి చేరువ కావడాన్ని గ్రహించిన కేసీఆర్ తన చిరకాల మిత్రుడు జగన్మోహన్‌రెడ్డిని మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ చేసి రెడ్డి సామాజికవర్గం పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళకుండా కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జగన్ పార్టీ నాయకులు పైపైకి తనను విమర్శిస్తూ రెడ్డి సామాజిక వర్గాన్ని చెయ్యిజారిపోకుండా చూసుకుంటే ఆ తర్వాత జగనూ, తానూ బాబాయ్, అబ్బాయ్‌లా కలసిపోతే ఆయన సామాజిక వర్గం కూడా తనతో దోస్తీ చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదంతా ఆలోచించే కేసీఆర్ మళ్ళీ తెలంగాణలో వైకాపాని సమాధిలోంచి బయటకి వెలికి తీయించారని విశ్లేషిస్తున్నారు.

అందుకే లోకేష్ కేసీఆర్‌ను ఢీ కొంటున్నారా?

  తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని నిందిస్తున్నతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని మొన్న తీవ్రంగా విమర్శించిన నారా లోకేష్ మళ్ళీ మరోసారి ఆయనపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చెందిన సంగతి అందరికీ తెలుసని కానీ ఆ విషయం కేసీఆర్ కే తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఈ విషయంపై నేరుగా చంద్రబాబుతో చర్చించే దైర్యం ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. అసలు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇదివరకు కూడా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్ధులపై చాలా సార్లు ఇటువంటి విమర్శలు చేసేరు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే నేరుగా విమర్శలు చేయడం గమనిస్తే, తెరాస నేతలు చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇంతవరకు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ కొంత సంయమనం పాటిస్తూ వచ్చినా, ఇకపై ఎంత మాత్రం ఉపేక్షించబోదని ఆయన విమర్శలు స్పష్టం చేస్తున్నాయి.

అరకు యాపిల్స్ వచ్చేస్తున్నాయోచ్

  నెత్తి మీద పండు పడినప్పుడో లేక నీళ్ళ టబ్బులో తేలినప్పుడో శాస్త్రవేత్తలకి బల్బు వెలిగినట్లే, విశాఖ జిల్లా అరుకు సమీపంలో ఉండే లంబసింగి అనే మారు మూల గ్రామంలో బొబ్బిలి రాంబాబు కూడా యాపిల్ కాయ తినేసి పెరట్లో విత్తనాలను విసిరేసినప్పుడు అక్కడ యాపిల్ మొక్కలు పుట్టి ఏపుగా ఎదిగి కాయలు కూడా కాసేస్తున్నాయని ఆ నోటా ఈ నోటా పాకి చివరికి మన వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళ చెవుల్లో కూడా పడేసరికి “అయితే ఆంధ్రాలో కూడా మనం ఎంచక్కా యాపిల్ మొక్కలు వేసుకోవచ్చన్నమాట” అనే కొత్త సంగతి కనుగొన్నారు.   ఇంతవరకు సీమ్లా యాపిల్, కాశ్మీర్ యాపిల్, హిమాచల్ యాపిల్ అనుకోని చెప్పుకోవడమే కానీ అరుకు యాపిల్, పాడేరు యాపిల్ అనే మాట ఎవరూ వినలేదు కదా! అందుకే హైదరాబాద్ లో గల సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయోలజీకి చెందిన శాస్త్రవేత్తలు హిమాచల్ ప్రదేశ్ నుండి వంద యాపిల్ మోక్కలు పట్టుకువచ్చి లంబసింగిలో నాటి అక్కడ యాపిల్ తోటలు సాగుకు అనువుగా ఉన్నాయా లేదా? అనే విషయంపై ఏడాదిగా పరిశోధనలు చేస్తున్నారు. అవి కాక స్థానిక వ్యవసాయ పరిశోధనా కార్యాలయ ఆవరణలో వివిధ రకాలకు చెందిన యాపిల్ మొక్కలను నాటి పరిశోధన చేస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ డా.యన్. వేణుగోపాలరావు తెలిపారు.   సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా అరుకు, పాడేరు, చింతపల్లి, పెదబయలు, జి.మాడుగుల, అనంతగిరి తదితర గిరిజన ప్రాంతాలలో వాతావరణం ఎప్పుడూ 15డిగ్రీల లోపే ఉంటుంది. కనుక అక్కడ చల్లటి వాతావరణానికి అనుకూలమయిన కాఫీ, మిరియాల తోటలు దాదాపు 1.5లక్షల ఎకరాలలో పండిస్తున్నారు. అక్కడ పండించిన కాఫీ దేశ విదేశాలకు ఎగుమతవుతోంది కూడా. అందుకే ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఎకరం విస్తీర్ణంలో యాపిల్ మొక్కలు పెంచుతున్నారు. దాదాపు ఏడాది వయసున్న ఆ మొక్కలు మరో రెండేళ్ళ తరువాత కాయలు కాయడం మొదలుపెడతాయి.   ఒకవేళ ఈ ప్రాంతంలో కూడా యాపిల్ తోటల సాగుకు అనుకూలమని తేలినట్లయితే, యాపిల్ తోటల పెంపకానికి, వాటి మార్కెటింగ్ కు తాము గిరిజనులకు అన్ని విధాల సహకరిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్. లక్ష్మణుడు తెలిపారు.   ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తోంది. కానీ దాని బదులు ఈ ఏజన్సీ ప్రాంతాలలో స్ట్రా బెర్రీ, పసుపు, యాలకులు , సుగంధ ద్రవ్యాల మొక్కలు, వివిధ రకాల పూల తోటల సాగుకు అవసరమయిన ఆర్ధిక సహాయం, శాస్త్రీయ సహకారం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని స్థానిక గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా బొబ్బిలి రాంబాబు మాత్రం పెరట్లో కాస్తున్న యాపిల్ కాయలు చూసి లొట్టలు వేస్తున్నాడు.

ఆంధ్రాలో బిజినెస్ అదుర్స్

  భారతదేశం చాలా బీద దేశం కానీ భారతీయులు మాత్రం బీదవారు కారని విదేశీయులు చెప్పుకొంటు౦టారు. అది నిజమేనని నిరూపిస్తున్నారు ఆంధ్రాలో సౌండ్ పార్టీలు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం ఆర్ధికంగా చాలా క్లిష్ట పరిస్థితులో ఉందని నిత్యం మనల్ని మనం ఓదార్చుకోవడం పరిపాటయిపోయింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలాసవంతమయిన కార్ల అమ్మకాలు ఏకంగా 62శాతం వరకు పెరిగాయని వివిధ కార్ల షో రూమ్స్ మేనేజర్లే స్వయంగా చెపుతున్నారు. ఆ విషయాన్ని ఆర్.టీ.యే. అధికారులు కూడా ద్రువీకరిస్తున్నారు.   రూ. 10లక్షలకు పైబడి ఉన్న కార్లను విలాసవంతమయిన కార్లగా గుర్తిస్తే, మళ్ళీ వాటిలో రూ. 50 నుండి 60 లక్షల ధరలున్నకార్లని ‘సి’ మరియు ‘ఈ’ కేటగిరీల క్రింద విభజించారు. ఇవి కాక జీ.యల్. కేటగిరీ కూడా ఒకటుంది. అదొక రేంజిలో ఉంటుంది. అంటే కనీస ధర రూ.85 లక్షలతో మొదలయ్యి రూ.1.36 కోట్లవరకు సాగుతుంది. ఆ పైన ఇంకేమయినా కేటగిరీలు పెడితే మనోళ్ళు దానికీ సిద్దమేనంటున్నారు. కానీ అమ్మే వాళ్ళే లేరు.   ఇక లెక్కలోకి వస్తే గతేడాది ఏప్రిల్ నెల నుండి సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు కేటగిరీలలో మొత్తం 1,931 కార్లు రిజిస్టర్ అయ్యాయిట. కానీ ఈసారి ఏకంగా 3,129 కార్లు అమ్ముడయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఏకంగా 62శాతం అమ్మకాలు పెరిగాయన్నమాట. అవి కూడా అల్లాటప్పా కార్లు కాదు. ఆడి, బెంజ్, బి.యం.డబ్ల్యు.వోల్వో వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీల కార్లు.   ఇక హైదరాబాదులోనే సంపద అంతా పోగుపడుంది కనుక అక్కడ దీనికి రెండితలు అమ్ముడయ్యే ఉంటాయని అందరూ భావించవచ్చు. కానీ గతేడాది ఇదే సమయంలో అక్కడ ఈ కేటగిరీ కార్లు 4,162 అమ్ముడయితే, ఈ ఏడాది కేవలం 5,088 మాత్రమే అమ్ముడయ్యాయిట. అంటే కేవలం 22శాతం అమ్మకాలు పెరిగాయన్నమాట.   అందుకే ఆడి, బెంజ్, బి.యం.డబ్ల్యు.వోల్వోల షోరూములు ఇప్పుడు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, చివరికి మంగళగిరికి కూడా వచ్చేసాయి లేదా త్వరలో వచ్చేస్తున్నాయి. అందువల్ల బెంజి కారు కొనుకోవడానికి మనం ఏ హైదరాబాదో డిల్లీకో పరిగెత్తనవసరం లేదు విజయవాడ బెంజి సర్కిల్లోనే దొరకవచ్చు, లేదా వైజాగ్ రామా టాకీస్ సందు పక్కన దొరకవచ్చును.

పంట రుణాల పేరుతో బ్యాంకులకు రైతులు కుచ్చు టోపీలు

  ఈనెల 22న దీపావళి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి దఫాగా రైతుల పంట రుణాలలో 20 శాతం వారి ఖాతాలలో జామా చేయాలని భావించారు. ఆ క్రమంలో రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు తెప్పించుకొన్న ప్రభుత్వాన్ని పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే దాదాపు 40శాతం మంది రైతులు ఒకే పంట భూమిపై 12 నుండి 34 బ్యాంకులలో ఖాతాలు తెరిచి రుణాలు తీసుకొన్నట్లు బయటపడింది. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ఒక వ్యక్తి 12 బ్యాంకులలో ఖాతాలు తెరిచి పంట రుణాలు తీసుకొంటే, పక్క జిల్లాలో మరో ఘనుడు ఏకంగా 34 ఖాతాలతో మూడు పూవులు ఆరు కాయలన్నట్లు ఒకే పంట భూమిపై ఏకంగా 34సార్లు పంట రుణాలు పొందాడు. అటువంటివన్నీ కలుపుకొని చూసినట్లయితే రాష్ట్రంలో మొత్తం 80 లక్షల పంట రుణాల ఖాతాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నిటినీ గుర్తించి తొలగించగలిగినట్లయితే, ప్రస్తుతం చెల్లించాల్సిన పంట రుణాలలో ఏకంగా సగానికి సగం భారం తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.   అయితే నేటికీ చాలా బ్యాంకులు వారి ఖాతాల వివరాలు ప్రభుత్వం చేతికి ఇవ్వనందున, దీపావళినాడు మొదటి దఫా రుణాల మాఫీ ప్రక్రియ ఆలస్యం జరిగేలా ఉందని అధికారులు భావిస్తున్నారు. పైగా ఈ పంట రుణాలు తీసుకొన్న రైతులు, వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం తయారు చేసిన 34 కాలమ్స్ తో కూడిన దరఖాస్తులను నింపవలసి రావడం వలన కూడా ఆలస్యమవవచ్చునని భావిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 22న మొదటి దఫా పంట రుణాల చెల్లింపులు జరగవలసిందేనని ఆదేశించినట్లు వారే చెపుతున్నారు.

చీపుర్లు పట్టుకోబోతున్న నాగార్జున, సానియా మిర్జా

  గతంలో సినిమా కళాకారులు రాష్ట్రంలో వరదలు, తుఫానులు లేదా ఏవయినా అటువంటి ఉపద్రవ పరిస్థితులు ఏర్పడినప్పుడు అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి భారీ విరాళాలు అందజేయడమే కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి స్వయంగా విరాళాలు సేకరించేవారు. స్వర్గీయ యన్టీఆర్ నేతృత్వంలో తెలుగు సినిమా కళాకారులు అటువంటి కార్యక్రమాలలో చాలా సార్లు పాల్గొన్నారు. అయితే కాలక్రమంలో సినిమా కళాకారులలో అటువంటి ఆలోచనలు తగ్గిపోయి వారి ద్యాసంతా నిత్యం సినిమా షూటింగులు, వ్యాపార ప్రకటనలు, టీవీ షోలలో యాంకరింగ్ చేసుకొంటూ కోట్లు కూడబెట్టుకోవడంపైనే ఉంది. వారందరూ విధిగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం మరిచిపోరు కానీ ఏనాడు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి సమాజ హితానికి పాటుపడిన దాఖలాలు లేవు. మహా అయితే తమపెరిత ఒక బ్లడ్ బ్యాంకో తెరిచి, దానికి తమ అభిమానులను రక్తం ఇమ్మని చెప్తారు తప్ప స్వయంగా రక్తం కూడా ఇవ్వరు. కానీ తాము ప్రజాసేవ చేయడం ఎన్నడూ మరిచిపోలేదని చెప్పుకోవడానికి కొందరు రాజకీయాలలో ప్రవేశిస్తే, ఆ ఓపికలేని వాళ్ళు అప్పుడప్పుడు ఎక్సిబిషన్ క్రికెట్ మ్యాచులు ఆడుకొంటారు. రాజకీయాలలో ప్రవేశించిన సినిమా నటులు ఎంత గొప్పగా ప్రజాసేవ చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. వారి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.   ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ‘స్వచ్చ భారత్’ కార్యక్రమానికి పిలుపినిచ్చినప్పుడు, అందులో స్వచ్చందంగా పాల్గొన్నవారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. ఆయన ప్రత్యేకంగా బొట్టుపెట్టి పిలిస్తే తప్ప తమంతట తాము అందులో పాల్గొనడం నామోషీగా భావించేవారు కొందరయితే, అటువంటి కార్యక్రమాలలో పాల్గొనే బదులు ఆ సమయంలో నాలుగు కమర్షియల్ యాడ్స్ చేసుకొంటే మరో నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చనేవారు లేకపోలేదు.   మోడీ పిలుపందుకొని ముంబైలో స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా సచిన్ టెండూల్కర్, అనిల్ అంభానీ వంటి ప్రముఖులు చీపుర్లు చేతపట్టుకొని ముంబై నగరంలో రోడ్లు ఊడ్చారు. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి కానీ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గానీ ఎవరూ కూడా ఇంతవరకు స్వచ్చందంగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. కారణం తమను ఎవరూ బొట్టు పెట్టి పిలవకపోవడమే.   కానీ అనిల్ అంభానీ పిలుపందుకొని హీరో నాగార్జున, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పని వారిని ఎవరూ పిలవక మునుపే చేసి ఉండి ఉంటే అది వారికి మరింత వన్నె తెచ్చేది.   జీవితంలో డబ్బు, కార్లు, బంగ్లాలు, ఆస్తులు, కీర్తి ప్రతిష్టలు ఆర్జించడం ఎంత ముఖ్యమో తమకు అవన్నీ కల్పించిన సమాజం కోసం ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం కూడా అంతే ముఖ్యమని, అది తమ బాధ్యతా కూడా అని మన సినీ తారలు, క్రీడాకారులు ఎప్పుడు గ్రహిస్తారో?ఈవిధంగా వారిని ప్రతీసారి ఎవరో ఒకరు ఏదో ఒక కార్యక్రమానికి బొట్టుపెట్టి ఆహ్వానించినప్పుడే కదలడం కంటే వారంతట వారే చొరవ తీసుకొని రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే వారికీ సమాజంలో మరింత గౌరవం పెరుగుతుంది. ప్రజలు కూడా సంతోషిస్తారు.

ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టు బాధ్యతలు శ్రీధరన్ కే!

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో నిర్మించ తలపెట్టిన మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఫీసిబిలిటీ మరియు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను తయారుచేసే బాధ్యతలను డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఈ శ్రీధరన్ కు అప్పగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆయనను ఈ మూడు ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా నియమించుకొంది. ఇప్పుడు వాటి నివేదికలు సిద్దం చేసే బాధ్యత కూడా ఆయనకే అప్పగించింది.   క్రిందటి నెల విజయవాడలో పర్యటించిన ఆయన ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నడపడం లాభదాయకం కాదు కనుక దానిని ప్రభుత్వం సూచించిన విధంగా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను కలుపుతూ నిర్మించడం మంచిది కాదని, దానిని కేవలం విజయవాడ నగరానికే పరిమితం చేయమని సలహా ఇచ్చారు. వచ్చే జనవరి నెలాఖరులోగా ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తానని, కేంద్రప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రాగానే ఆరు నెలలలో మొదలుపెట్టి మూడేళ్ళలో పూర్తిచేస్తానని ఆరోజే తెలియజేసారు.   ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ రెండు నివేదికలు తయారు చేసే బాధ్యతలు అప్పగించడంతో ఇకపై పనులు జోరందుకోవచ్చును. ఆయన ఈనెల 15,16 తేదీలలో వైజాగులో పర్యటించి జీ.వీ.యం.సి. ప్రతిపాదిస్తున్న నాలుగు మార్గాలను అధ్యయనం చేసి నగరానికి బాగా ఉపయోగపడే ఒక మార్గాన్ని సూచిస్తారు. జీ.వీ.యం.సి. ఇప్పటికే ఈ నివేదికలు తయారు చేసేందుకు టెండర్లు పిలవగా నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేయ్సాయి. కానీ ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యతలను పూర్తిగా ఆయనకే అప్పగించడంతో ఇక ఆ కంపెనీలకు అవకాశంలేనట్లే భావించవచ్చును.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వైజాగ్ లోనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో మెట్రో రైలు కూడా వస్తే ఇక వైజాగ్ నగరం ఇక హైదరాబాదుతో పోటీ పడి మరీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.