అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదు

  విద్యుత్ సంక్షోభంతో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా తక్షణమే స్పందించి వారికి భరోసా కల్పించి, అందుకు నివారణ చర్యలు చెప్పట్టకపోగా ఈ విద్యుత్ సంక్షోభానికి ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కరెంటు లేక కాళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే, అప్పుల భయంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి విద్యుత్ సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇస్తున్నారు. విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం విలవిలలాడుతుంటే, తక్షణమే డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి జాతీయ గ్రిడ్ నుండి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నాలు గట్టిగా చేయకపోగా, ఆపని చేసిన తెలంగాణా తెదేపా యంపీ, యం.యల్యే.లను విమర్శిస్తున్నారు.   తెదేపా సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ గుండు సుధారాణి తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిల్లీలో ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావుతో నేతృత్వంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్, కలిసి తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం దాని వలన ఎండిపోతున్న పంటలు, నానాటికి పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు వంటి పరిస్థితులన్నీ వివరించి తక్షణమే కేంద్ర గ్రిడ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసారు. ఆ తరువాత వారందరూ కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధా మోహన్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు మరియు వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ లను కూడా కలిసి పరిస్థితి వివరించి తెలంగాణా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.   తెలంగాణా ప్రభుత్వం తరపున ఎవరూ వెళ్లి కేంద్రంతో మాట్లాడి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నం చేయకపోయినా, అందుకోసం వెళ్ళిన తెదేపా నేతలపై విరుచుకు పడుతున్నారు. “తెదేపా నేతలు మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే పనిగట్టుకొని డిల్లీ వెళ్ళారు తప్ప తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర సహాయం కోరేందుకు కాదు” అని తెరాస యంపీ జితేందర్ రెడ్డి అనడం చూస్తే అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదన్నట్లుంది. తెలంగాణా ప్రభుత్వమే చొరవ తీసుకొంటే మేమెందుకు డిల్లీ వెళతామని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికయినా తెలంగాణా ప్రభుత్వం మేల్కొని అన్ని పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అదనపు విద్యుత్ పొందే ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.  

తెలంగాణలో బోర్లు భోరుమంటాయి...

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరెంటు సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రభుత్వం విలవిలలాడుతుంటే, కరెంటు కోతల కారణంగా తమ పంటలకు నీరు అందడం లేదని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎండాకాలం రాకముందే పరిస్థితి ఇలా వుంది.. ఎండాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా వుంటుందోనన్న ఆందోళన తెలంగాణ రాష్ట్రంలోని అందర్లోనూ వుంది. ఇదిలా వుంటే తెలంగాణ రైతులకు షాక్‌లాంటి మరో విషయం బయటపడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న బోర్లు త్వరలో ఎండిపోబోతున్నాయని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు. అసలే కరెంటు లేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి ఇప్పుడు బోర్లు కూడా ఎండిపోతే ఏమైపోతుందో ఊహించడానికే భయం వేస్తోంది. తెలంగాణలో వ్యవసాయం 80 శాతానికి పైగా బోర్లమీదే ఆధారపడి వుంది. దాదాపు 18 లక్షల బోర్లు తెలంగాణలో వున్నాయి. ఇప్పుడు భూగర్భ జల నిపుణులు ఈ బోర్లు భోరుమనబోతున్నాయని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రైతాంగం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారోనన్న ఆందోళన కలుగుతోంది.

మరో కొత్త వివాదం: హైదరాబాద్ లో ఆంద్ర ప్రదేశ్ అధికారి అరెస్ట్

  ఇప్పటికే వివిధ అంశాలతో కత్తులు దూసుకొంటున్న ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకి తమ యుద్ధం కొనసాగించడానికి మరొక బలమయిన కారణం దొరికింది. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ ఆర్.టీ.సి క్రాస్ రోడ్స్ వద్దగల ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖకు చెందిన కార్యాలయంలో ప్రవేశించి రాష్ట్రానికి చెందిన అధికారి పీవీ మురళీ సాగర్ అనే అధికారి బీరువాను పగులగొట్టి అందులో ఫైళ్ళను స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత ఆయన ఇంట్లో కూడా శోధించారు.   మురళీసాగర్ తెలంగాణా రాష్ట్రానికి చెందిన రూ.609కోట్ల సొమ్మును అక్రమంగా విజయవాడ ఆంద్ర ప్రదేశ్ కార్మికశాఖ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించారంటూ తెలంగాణా కార్మికశాఖ కమీషనర్ ఎ.అశోక్ చిక్కడపల్లి పోలీసు స్టేషనులో నిన్న ఉదయం పిర్యాదు చేయడంతో, పోలీసులు మురళీసాగర్ పై ‘చీటింగ్ మరియు నమ్మకద్రోహం’ కేసులు నమోదు చేసి ఆయన లేనప్పుడు ఆయన ఇంట్లో, కార్యాలయంలో తనికీలు నిర్వహించి, ఆయన ఆంద్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీతో సమావేశం ముగించుకొని సాయంత్రం సచివాలయానికి తిరిగి వచ్చినప్పుడు అరెస్ట్ చేసారు.   అవిబాజ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికశాఖ రాష్ట్రంలో గల మునిసిపాలిటీల నుండి కార్మిక సంక్షేమం కోసం 1శాతం సెస్ గా వసూలు చేసేది. ఆ మొత్తం రూ.1400కోట్లు ఉందని తెలంగాణా కమీషనర్ వాదన. విభజన చట్టం ప్రకారం ఆ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకొంటే తెలంగాణ వాటాగా రూ.609కోట్లు వస్తుంది. కానీ మురళీసాగర్ తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఆ మొత్తాన్ని విజయవాడకు తరలించారని పిర్యాదు చేసారు.   కానీ మురళీసాగర్ మీడియాతో మాట్లాడుతూ, తమ శాఖ వసూలు చేసిన మొత్తం రూ. 910 కోట్లు మాత్రమేనని, అందులో తెలంగాణకు రూ.410కోట్లు మాత్రమే వాటాగా వస్తుందని తెలిపారు. ఇంతవరకు ఆ మొత్తాన్ని ఫిక్సడ్ డిపాజిస్ట్ రూపంలో హైదరాబాద్ లోగల వివిధ బ్యాంకులలో ఉంచామని, దానిని రెండు రాష్ట్రాలు పంచుకోవాలంటే అందుకోసం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో ఒక కమిటీని వేసి మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని, కానీ ఇంతవరకు కమిటీని ఏర్పాటు చేసుకోకపోవడంతో త్వరలో తమ కార్మికశాఖ కార్యాలయం విజయవాడకు తరలిపోతున్నందున ఆ మొత్తాన్ని విజయవాడలోని వివిధ బ్యాంకులలోకి బదిలీ చేసామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే తాను ఈ మొత్తాన్ని విజయవాడకు బదిలీ చేసానని మురళీసాగర్ తెలిపారు.   తెలంగాణా పోలీసులు తమకు చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా తమ ప్రభుత్వ కార్యాలయంలో జొరబడి, ఫైళ్ళను స్వాధీనం చేసుకోవడం, ఆంద్ర అధికారి ఇంట్లో తనికీలు నిర్వహించి ఆయనను అరెస్ట్ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు చేసి ఒక నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీ.జీ.పీ. రాముడుని ఆయన ఆదేశించారు.

వైకాపా యంపీ కొత్తపల్లి గీతకు కోర్టు సమన్లు

  అరకు వైకాపా యంపీ కొత్తపల్లి గీత గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ తెదేపా-బీజేపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. తనను గౌరవించని వైకాపాలో తను ఇమడలేనని ఇకపై తెదేపా-బీజేపీలతోనే కలిసి పనిచేస్తానని ఆమె ప్రకటించారు.   అప్పుడు ఆమె నియోజక వర్గానికే చెందిన పార్టీ యం.యల్యే. ఈశ్వరి ఆమె తాను దళిత కులానికి చెందిన వ్యక్తినని రిటర్నింగ్ అధికారికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపణలు చేసారు. దానిపై యంపీ గీత స్పందిస్తూ “నాకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ అధిష్టానం అవేవి చూడకుండానే టికెట్ ఇచ్చిందా? నేను యస్సీనని దృవీకరించుకొన్న తరువాతనే పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఆ విషయంపై ప్రశ్నించడం అంటే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపట్టినట్లే కనుక ఈశ్వరి నన్ను ప్రశ్నిస్తున్నారా లేక పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారా?” అని ఎదురు ప్రశ్నించి ఆమె నోరు మూయించగలిగారు.   అయితే కొత్తపల్లి గీతపై పోటీ చేసి ఓడిపోయిన తెదేపా నేత సంద్యారాణి ఆమె ఎన్నికలలో పోటీ చేసేందుకు తప్పుడు కుల దృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఆమెపై హైకోర్టులో ఒక పిటిషను వేసారు. అయితే అప్పుడు కొత్తపల్లి గీత తెదేపాలోకి వచ్చి చేరుతుందని ఊహించకపోవడంతో ఇప్పుడు హైకోర్టు ఆమె వేసిన ఆ పిటిషను విచారణకు చెప్పట్టి ఆమెను ఈ నెల 31న కోర్టు విచారణకు హాజరు కమ్మంటూ నోటీసులు జారీ చేయడంతో తెదేపాకు కొంచెం ఇబ్బందికరం పరిస్థితి ఎదురయింది.   అది చూసి వైకాపా చాలా సంతోషపడిపోతోంది. అయితే నేటికీ కొత్తపల్లి గీతను తెదేపాలో చేర్చుకోకపోవడంతో ఆమె నేటికీ వైకాపా యంపీగానే పరిగణింపబడతారు. అయితే ఆవిషయం పట్టించుకోకుండా వైకాపా చంకలు కొట్టుకొని తెగ ఆనందపడిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ గీత కనుక ఈ వ్యవహారంలో దోషిగా తేలితే అందుకు వైకాపాయే బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప తెదేపా కాదనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వైకాపా కేర్ ఆఫ్ లోటస్ పాండ్

  త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని త్వరలో విజయవాడకు తరలించబోతోంది. కనుక ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నఆ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని జగన్ నివాసమయిన ‘లోటస్ పాండ్’ ప్యాలస్ లోకి తరలించబోతున్నారు. విజయవాడలో కార్యాలయం ఏర్పడేవరకూ అక్కడి నుండే తాత్కాలికంగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు. త్వరలోనే తెలంగాణా రాష్ట్రానికి కూడా వేరొకచోట పార్టీ కార్యాలయం ఏర్పాటుచేయబోతున్నట్లు సమాచారం.   రాష్ట్ర విభజన జరిగి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు కనుక అక్కడ అన్ని పార్టీలు తమతమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం సహజమే. కనుక వైకాపా కూడా విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. కానీ తెలంగాణా రాష్ట్రంలో కూడా పార్టీని నడపాలని భావిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్ దాని కోసం ‘లోటస్ పాండ్’లో కాక వేరొకచోట కార్యాలయం ఏర్పాటుచేయాలని భావిస్తున్నప్పుడు ముందుగా ఆ ఏర్పాటు చేసుకొని అక్కడికి పార్టీ కార్యాలయాన్ని తరలించి ఉండిఉంటే బాగుండేది. కానీ ముందు ఆ పనిచేయకుండా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి, తాళం వేయడం తెలంగాణా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. అసలే పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న పార్టీ తెలంగాణా నేతలకు, కార్యకర్తలకు ఇది మింగుడుపడని విషయమే. అయితే అది జగన్ కి చెప్పుకోవాలన్నా వారికి ‘లోటస్ పాండ్’ లోకి ఎంట్రీ అంత వీజీ కాదు.

ముదిరి పాకానపడుతున్న ఇరు రాష్ట్రాల విభేదాలు

  కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా రాష్ట్ర విభజన చేసి తను నష్టపోవడమే కాకుండా ఇరు రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వాలకీ కూడా అనేక కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. దానికి తోడూ ఆంధ్రాపాలకులను, తెదేపా ప్రభుత్వాన్ని, దాని అధినేత చంద్రబాబు నాయుడుని తీవ్రంగా ద్వేషించే కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టడంతో నిత్యం ఏదో ఒక అంశం మీద రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, విమర్శలు ప్రతివిమర్శలు మామూలయిపోయాయి. చివరికి అవి గవర్నరు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళుతుండటం సర్వ సాధారణ విషయమయిపోయింది.   ఇప్పటికే నీళ్ళు, విద్యుత్ పంపకాల విషయంలో గొడవ పడుతున్న రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఇంటర్ మరియు ఎంసెట్ పరీక్షల నిర్వహణ మీద విభేదించాయి. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ప్రస్తుత విద్యావిధానమే మరో పదేళ్ళు కొనసాగవలసి ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వేరేగా నిర్వహించుకొంటామని వాదిస్తోంది. దానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో ఈసారి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తోంది.   తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ మరియు జలవివాదాలలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పటికే గవర్నరు మరియు కృష్ణానది జల యాజమాన్య బోర్దులకు పిర్యాదులు చేసి త్వరలోనే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్దపడుతుంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్, ఎంసెట్ అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్దపడుతోంది. బహుశః ఇటువంటి పోరాటాలు మరో ఐదేళ్ళపాటు కొనసాగినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే ఇరు రాష్ట్రాల ప్రతిష్ట దెబ్బతింటుంది. అభివృద్ధి కూడా కుంటుపడుతుంది.

వైకాపాకు జగనే బ్రాండ్ అంబాసిడర్, శత్రువు కూడా?

  వై.య.స్సార్. కాంగ్రెస్ పార్టీకి దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే బ్రాండ్ అంబాసడర్ అని చెప్పవచ్చును. కానీ ఆ పార్టీకి ఆయనే ప్రధాన శత్రువని కూడా చెప్పవచ్చును. ఆయన అహం మరియు దుందుడుకు స్వభావం వల్ల పార్టీకి తరచూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడే వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తమ మాటకు వీసమెత్తు విలువీయడని, పార్టీలో తమకు ఏ మాత్రం గౌరవం లేదని అందుకే వీడుతున్నామని చెప్పడం గమనిస్తే ఆ పార్టీలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్ధమవుతుంది.   ఇంతవరకు చాలామంది కేవలం ఇదే కారణంతో పార్టీని వీడారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కూడా ఇదే కారణంతో పార్టీని వీడేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడు. ఆ పదవికి రాజీనామా చేస్తూ జగన్ కి వ్రాసిన లేఖలో పార్టీలో అవమానాలు భరిస్తూ కొనసాగలేనని తెలిపినట్లు తాజా సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీకి అండగా నిలబడిన తమను కాదని తమ చిరకాల రాజకీయ ప్రత్యర్ధి దాడి వీరభద్రరావుని పార్టీలో చేర్చుకొన్నప్పటికీ, ఎన్నికలలో పార్టీ ఓడిపోగానే దాడి కూడా ‘పార్టీలో సీనియర్ల మాటకు విలువలేదు వారికి పార్టీలో గౌరవం లేదు,’ అని ఆరోపిస్తూ పార్టీని వీడారు. కానీ కొణతాల వర్గీయులు మాత్రం స్వర్గీయ వై.యస్సార్ పై అభిమానంతో నేటికీ వైకాపాలోనే కొనసాగుతున్నారు. అదే వారి విశ్వసనీయతకు ఒక మంచి నిదర్శనం. కానీ జగన్మోహన్ రెడ్డి వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో గత ఆరునెలలుగా ఆయన, ఆయన సోదరుడు, వారి సహచరులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ వారిని జగన్ పట్టించు కోకపోవడంతో ఆయన వైఖరితో విసుగెత్తిన కొణతాల వర్గీయులు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం.   అసలు జగన్ తన మాటను కాదని తన రాజకీయ ప్రత్యర్ధి దాడి వీరభద్ర రావును పార్టీలో చేర్చుకొన్నప్పుడే ఆయన పార్టీని వీడాలనుకొన్నారు. అపార రాజకీయానుభవం, మంచి ప్రజాధారణ గల ఆయనను చేర్చుకోవడానికి కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఒకవేళ ఆయన పార్టీని వీడితే ప్రస్తుతం తెదేపా అధికారంలో ఉంది కనుక ఆ పార్టీలో చేరేందుకే ఆసక్తి చూపుతారేమో. ఏమయినప్పటికీ వైకాపా అటు దాడి వీరభద్ర రావును నిలుపుకోలేకపోయింది. పార్టీకి అత్యంత నమ్మకస్తుడని పేరుపడ్డ కొణతాలనూ నిలుపుకోలేకపోతోంది. జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగానే ఇటువంటి పరిస్థితి తరచూ తలెత్తుతుండటం గమనిస్తే పార్టీకి ప్రధమ శత్రువు పార్టీ అధ్యక్షుడేనని భావించవలసి వస్తోంది.

విజయవాడలో వైకాపా ప్రధాన కార్యాలయం

  త్వరలో వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టీ అభిమానులకు, ఇరు రాష్ట్రాలలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలకు మరింత చేరువయ్యేందుకు గాను త్వరలోనే పార్టీ తరపున ఒక మాసపత్రిక మరియు నెట్-టీవీ కూడా మొదలుపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. షర్మిల నేతృత్వంలో వైకాపా మళ్ళీ తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది కనుక ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కార్యాలయాన్నే తెలంగాణా రాష్ట్రానికి ప్రధాన కార్యాలయంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహించవచ్చును.   కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొనేందుకు సిద్దమవుతోంది. అయితే అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంతవరకు అటువంటి సూచనలేవీ చేయకపోవడం విశేషం. కానీ తెదేపాను జాతీయాపార్టీగా మార్చబోతున్నందున త్వరలోనే ఆ పార్టీ కూడా విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

ఆంద్ర ప్రభుత్వంపై త్వరలో తెలంగాణా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషను?

  నీళ్ళు మరియు విద్యుత్ పంపకాలలో తెలంగాణాను మోసం చేస్తున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోర్టుకు ఈడుస్తామని ప్రతిజ్ఞ చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా విద్యుత్ మరియు నీటి పారుదల నిపుణులు, అధికారులతో అందుకు అవసరమయిన కసరత్తు మొదలుపెట్టారు. వారు విభజన చట్ట ప్రకారం తెలంగాణాకు రావలసిన నీళ్ళు మరియు విద్యుత్ లెక్కలు కట్టి, తెలంగాణకు దక్కవలసిన వాటాని ఇవ్వకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా మోసం చేస్తున్నదీ తెలియజేస్తూ ఒక నివేదిక తయారుచేసే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నివేదికను ఆమోదించగానే, రాష్ట్ర ఇంధన, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఇరువురూ కలిసి తెలంగాణా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పిటిషను దాఖలు చేయనున్నారు.   ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రులు ఒకరినొకరు నిందించుకొంటున్నందున ఎవరిమాట నిజమో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషను వేసేందుకు సిద్దపడుతోంది కనుక ఇక ఈ వ్యవహారంలో ఎవరు దోషులో తేలిపోతుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యుత్, జలవనరుల అధికారులు కూడా తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ తన రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే కాకి లెక్కలు చెపుతున్నారని, కోర్టుకు వెళితే ఆయనకు భంగపాటు తప్పకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.   పనిలోపనిగా కేసీఆర్ కృష్ణా, గోదావరి బోర్డులపైనా సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నందున, ఈ వ్యవహారంలో కేంద్రాన్ని కూడా లాగినట్లవుతుంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయమని కృష్ణా జలసంఘం వ్రాసిన రెండు లేఖలకు తాము విద్యుత్ ఉత్పత్తి నిలబోమని తెలంగాణా ప్రభుత్వం జవాబిచ్చింది కనుక ఈ వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పకపోవచ్చని వారు భావిస్తున్నారు.   ఏమయినప్పటికీ కోర్టు గడప ఎక్కడమంటే గోటితో పోయేదానికి గొడ్డలి పట్టుకొన్నట్లే అవుతుంది. బహుశః మరో ఐదేళ్ళపాటు ఇంకా చాలాసార్లు కోర్టు గడప ఎక్కవలసి వచ్చినా ఏమీ ఆశ్చర్యం లేదు.

తెలంగాణాకు హాని కలిగిస్తున్న కేసీఆర్ ధోరణి

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాదు కేంద్రంతో కూడా ఏదోక అంశంపై కత్తులు నూరుతూనే ఉన్నారు. పొరుగు రాష్ట్రంలో ఆయన తీవ్రంగా వ్యతిరేఖించే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కనుక ఆయన దానితో కయ్యమాడటం సహజమే అని సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఆయన కేంద్రంతో కూడా ఎందుకు సఖ్యత పాటించలేకపోతున్నారో, కేంద్రం నుండి ఎందుకు సహాయం పొందలేకపోతున్నారో ఆయనకే తెలియాలి. పోనీ రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏమయినా ఆయనకు అడ్డుపడుతున్నారా..అంటే అదీ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధోరణిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. శ్రీశైలం హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయడం నిలిపివేయమని కృష్ణా జలసంఘం పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, తాము ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయమని జవాబీయడమే కాక, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేంద్ర మంత్రి ఉమాభారతి ద్వారా జలసంఘంపై ఒత్తిడి తెచ్చి తమకు లేఖలు వ్రాయిస్తున్నారని, చంద్రబాబే నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున ఆయనను సుప్రీం కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.   ఈ విషయంలో కేంద్రం మాటని కూడా తాను ఖాతరు చేయబోనని చెపుతూనే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని ఆదుకోవాలని, తమ అధికారులు వివిధ అంశాలపై కేంద్రానికి వ్రాస్తున్న లేఖలపై కేంద్రప్రభుత్వం స్పందించాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   కేంద్ర మంత్రులతో, ప్రధాని మోడీతో ఎంతో చక్కటి సంబంధాలు గల చంద్రబాబు నాయుడు స్వయంగా డిల్లీ వెళ్లి వారందరినీ కలిసి సహాయం కోసం పదేపదే అర్ధించినా కేంద్రం ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చిల్లి గవ్వ విదిలించలేదు. కనీసం ఇంతవరకు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. అటువంటప్పుడు నిత్యం కేంద్రంతో గొడవపడే కేసీఆర్ సహాయం చేయమని కోరినంతనే కేంద్రం ఉదారంగా సహాయం చేస్తుందని భావించడం అవివేకమే.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణా రాష్ట్రానికి 300మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు సంసిద్దత వ్యక్తపరిచినా కేసీఆర్ పంతానికి పోయి దానిని తీసుకోకపోవడం వలన తెలంగాణా రైతాంగానికి తీరని నష్టం జరుగుతోందని చెప్పవచ్చును. ఆ విద్యుత్ స్వీకరించేందుకు విముఖత చూపిస్తున్న కేసీఆర్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నవిద్యుత్ లో తమ వాటా ఇవ్వడంలేదని, చంద్రబాబుని కోర్టుకు ఈడుస్తానని రంకెలు వేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కేసీఆర్ ధోరణి వల్ల ఆయనకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టమూ కలుగకపోవచ్చును. కానీ తెలంగాణా రాష్ట్రము, ప్రజలు మాత్రం చాలా నష్టపోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన అందరితో సామరస్య ధోరణితో వ్యవహరిస్తే నేడు తెలంగాణా రాష్ట్రంలో ఈ కరెంటు కష్టాలు ఉండేవి కావు. పొరుగునున్న ఆంధ్రా నుండి, కేంద్ర గ్రిడ్ నుండి అవసరమయిన విద్యుత్ లభించి ఉండేదేమో?

తెలంగాణాకి కూడా హూద్ హూద్ దెబ్బ

  ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను అతలాకుతలం చేసిన హూద్ హూద్ తుఫాను కారణంగా అనేక ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో నేటికీ విద్యుత్ సరఫరా పునరుద్దరించడం చాలా కష్టమవుతోంది. విశాఖలో సింహాద్రీ పవర్ ప్లాంటులో 2000మెగా వాట్స్ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు నరసరావుపేట వద్ద గల కలపాక స్విచ్చింగ్ ప్లాంట్ ద్వారా గ్రిడ్ కు అక్కడి నుండి వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతుంతుంది. కానీ హూద్ హూద్ తుఫాను వల్ల కలపాక స్విచ్చింగ్ ప్లాంటుకు అనుసంధానమయున్న హై ట్రాన్స్మిషన్ లైన్లు బాగా దెబ్బ తిన్నాయి. అందువల్ల సింహాద్రీలో విద్యుత్ ఉత్పత్తికి సర్వం సిద్దంగా ఉన్నప్పటికీ ఇరుగుపొరుగు రాష్ట్రాలకు దానిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది.   ఇరుగుపొరుగు రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఒకటి. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉతప్పత్తి అయిన విద్యుత్తులో 52 శాతం తెలంగాణకు సరఫరా చేయవలసి ఉంటుంది. అయితే ఈ సమస్య కారణంగా తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేయడం వీలుపడటం లేదు. విద్యుత్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ హై ట్రాన్స్మిషన్ లైన్లను సరిచేసి విద్యుత్ పునరుద్దరించడానికి మరికొంత సమయం పడుతుందని చెపుతున్నారు. ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభంలో మునిగిపోయిన తెలంగాణా రాష్ట్రానికి ఇది గోరుచుట్టుపై రోకటిపోటువంటిదే.

తెరాసపై ఆ పత్రికలో కూడా విమర్శలు?

  ఇంతవరకు తెరాస, వైకాపాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలే కొనసాగుతున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఎన్నడూ ఒకదానినొకటి విమర్శించుకోలేదు. తెరాస మంత్రులు, నేతలు ఆంద్రప్రదేశ్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నప్పటికీ వైకాపా ఎన్నడూ నోరు విప్పి వాటిని ఖండించలేదు. కానీ వైకాపా ఇప్పుడు తెలంగాణాలోకి పునః ప్రవేశించాలని భావిస్తున్నందున మెల్లగా తెరాసపై బాణాలు సంధిస్తోంది. ఆ పార్టీ అధినేతకు చెందిన పత్రికలో కొత్తగా యం.యల్యే.గా ఎన్నికయిన ఒక తెరాస నేత ఒకరు వసూళ్ళకు పాల్పడుతున్నారని, ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచి తీవ్రంగామందలించారని ఒక వార్త ప్రచురించింది. సాధారణంగా ఇటువంటి వార్తలు తెరాసను వ్యతిరేఖించే పత్రికలలోనే ముందుగా ప్రచురితమవుతుంటాయి. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వం తరపున దానికి మద్దతుగా వార్తలు ప్రచురిస్తూ ఉండేవైకాపాకు చెందిన ఆ పత్రికలో తెరాస నేతలు వసూళ్ళకు పాల్పడుతున్నారనే వార్త ప్రచురింపబడటం గమనిస్తే తెరాస పట్ల వైకాపా వైఖరి మారుతున్నట్లు స్పష్టం చేస్తోంది. బహుశః తెరాస నేతలు కూడా వైకాపాపై అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తే, ఇక ఆ రెండు పార్టీల మధ్య తెగతెంపులు జరిగి, వైకాపా తెలంగాణాలో పునః ప్రవేశానికి రంగం సిద్దమయినట్లే భావించవచ్చును.

అందుకే డొక్కా రఘువీరారెడ్డిని విమర్శిస్తున్నారా?

  కాంగ్రెస్ పార్టీలో కీచులాడుకోవడానికి పెద్ద కారణాలేవీ అవసరం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు మరో మారు నిరూపిస్తున్నారు. పార్టీలో అనేకమంది వారిస్తున్నా వినకుండా పీ.సి.సి. అధ్యక్షుడు రఘువీర రెడ్డి నందిగామ ఉప ఎన్నికలలో దళితుడిపై కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెట్టి పార్టీకి పరాజయం కట్టబెట్టారని, కానీ ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో ఉన్నత వర్గానికి చెందిన ప్రత్యర్ధిపై పార్టీ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టేందుకు వెనుకాడటం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆయన విమర్శించారు. భూమా నాగిరెడ్డి కుటుంబంతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగానే పోటీకి విముఖత చూపిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని డొక్కా విమర్శించారు. ఒక్కో ఉప ఎన్నికలలో ఒక్కో విధానం అవలంభించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉన్నట్లు తన ప్రత్యర్ధులకు చాటిచెప్పు కొన్నట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం గురించి తను కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.   నందిగామ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెట్టడం తప్పుడు నిర్ణయమేనని చెప్పవచ్చును. బహుశః అదే కారణంతో ఇప్పుడు ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు రఘువీర రెడ్డి వెనుకంజవేసి ఉండవచ్చును. అయితే ఆయన ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో కారణాన్నికూడా డొక్కా బయటపెట్టడం వల్ల రఘువీర రెడ్డికి ఆయన ఇబ్బందికర పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది.   డొక్కా వాదన వినేందుకు బాగానే ఉన్నప్పటికీ దాని వలన కూడా పార్టీలో నెలకొని ఉన్న విభేదాలు అయోమయ పరిస్థితి బయటపెట్టుకొన్నట్లయింది. అందుకు డొక్కాను కూడా తప్పు పట్టవలసి ఉంటుంది. అయితే తనకు దక్క వలసిన పీ.సి.సి అధ్యక్ష పదవి రఘువీరా రెడ్డికి దక్కిందనే అసంతృప్తి వలనే ఆయన రఘువీర రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణా పీ.సి.సి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కుర్చీలో నుండి దింపేసి అందులో తాము కూర్చొనేందుకు టీ-కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే కుస్తీ పట్లు పడుతున్న సంగతి ప్రత్యక్షంగా అందరికీ కనబడుతోంది. కానీ ఆంధ్రాలో కూడా రఘువీర రెడ్డి కుర్చీ క్రింద మంట రాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు డొక్కావారు చాటి చెప్పినట్లయింది. ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఈవిధంగా మరోసారి బయటపడ్డాయి.

పాక్, చైనాలతో సరిహద్దు ఘర్షణలు శాశ్వితం?

  పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడిన ప్రతీసారి, పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రజల దృష్టిని మళ్ళించేందుకు భారత్-పాక్ సరిహద్దులలో కాల్పులకు తెగబడటం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ లో అటువంటి పరిస్థితే నెలకొని ఉండటంతో అలవాటు ప్రకారం పాక్ సైనికులు సరిహద్దుల వద్ద చెలరేగిపోయారు. పాక్ సైన్యాలు పేట్రేగిపోవడంతో భారత సైనిక దళాలు కూడా ధీటుగా బదులిచ్చాయి. పాకిస్తాన్ తక్షణమే కాల్పులు విరమించి వెనక్కి తగ్గకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో, పాక్ సైన్యాలు వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ మళ్ళీ షరా మామూలుగానే పాక్ సేనలు సరిహద్దుల వద్ద కాల్పులు మొదలుపెట్టాయి.   కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇచ్చిన సమాధానం పాక్ ప్రభుత్వ ఆలోచన తీరుకు అద్దం పట్టేదిగా ఉంది. పాకిస్తాన్ భారత్ తో సత్సంబంధాలే కోరుకొంటోందని, సరిహద్దుల వద్ద శాంతి నెలకొల్పాలని తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే, భారత్ దానిని తమ బలహీనతగా భావిస్తోందని ఆక్షేపించారు. భారత్ సేనలే సరిహద్దులలో పాక్ సైనికులపై దాడులు చేస్తూ, పాక్ ప్రభుత్వంపై నిందలు మోపడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? పాక్ ప్రధాని స్వయంగా ఈవిధంగా మాట్లాడుతుంటే పాక్ మీడియా వేరే విధంగా మాట్లాడుతుందని భావించలేము. మీడియా ప్రభావంతో అప్పుడు పాక్ ప్రజలు కూడా భారత్ సేనలే తమ దేశంపై దాడులకు తెగబడుతున్నాయని భావించడం సహజం.   పాక్ ప్రభుత్వం కూడా సరిగ్గా అదే కోరుకొంటోంది. తమ దేశానికి భారత్ వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందనే అభద్రతా భావం వారిలో స్థిరంగా నెలకొని ఉన్నప్పుడే వారు పాక్ ప్రభుత్వ అసమర్ధతను ఉపేక్షించే అవకాశం ఉంటుంది. లేకుంటే మళ్ళీ వారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. అందువల్ల పాక్ ప్రభుత్వం తన దేశంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతీసారి భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంటుంది. ఈ ఉపాయంతో పాక్ ప్రభుత్వం తన ప్రజలను మభ్యపెడుతూ చాలా తెలివిగా తన అసమర్ధతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. కానీ దానివల్ల చివరకు ఆ దేశమే తీవ్రంగా నష్టపోతుంది.   భారతదేశం ఎన్నడూ కూడా ఇతరదేశాల మీదకు దండెత్తిన సందర్భాలు లేవు. కారణం అనాదిగా భారత్ సుసంపన్నమయిన దేశం కావడమే. నేటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా పేరు తెచ్చుకొంది తప్ప ఇరుగు పొరుగుదేశాల సరిహద్దులలో జొరబడి ఆక్రమించుకొంటుందనే విమర్శ ఎన్నడూ వినబడలేదు. నిజానికి భారత్ తలుచుకొంటే ఏనాడో పాక్ ఆక్రమిత కాశ్మీరును కూడా తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకొనేది. కానీ ఆపని చేయకపోవడానికి కారణం భారత్ శాంతికాముక దేశం కావడమే.   జాతిపిత మహాత్మా గాంధీ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టేందుకు, బ్రిటిష్ సైనికుల చేతుల్లో లాటీ దెబ్బలు తినేందుకే సిద్దపడ్డారు తప్ప వారి మీద తన చేతి కర్ర ఎత్తాలని ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కర్ర ఎత్తి ఉండిఉంటే భారతదేశ భూత, భవిష్యత్ చరిత్ర మరో విధంగా ఉండేదేమో! ఆనాటి నుండి ఈనాటి వరకు దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నీ కూడా ఆయన చూపిన శాంతి మార్గంలోనే పయనిస్తున్నాయి. అందుకే కాశ్మీరులో కొంత భాగం పాక్ సేనలు ఆక్రమించుకొన్నప్పుడు అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ వారిని భారత భూభాగం నుండి తరిమికొట్టకపోగా, ఐక్యరాజ్యసమితికి పోయి మొరపెట్టుకొన్నారు.   భారత్ యొక్క ఆ శాంతికాముకతే నేడు చైనా, పాక్ వంటి దేశాలకు అసమర్దతగా కనబడుతోంది. అందుకే అవి భారతదేశంతో నిత్యం చెలగాటం ఆడే సాహసం చేయగలుగుతున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం “ఇప్పుడు భారత్ లో కొత్త ప్రభుత్వం వచ్చిందని, అందువల్ల మారిన ఆలోచనా విధానాన్ని, మారిన పరిస్థితులను కూడా గుర్తించమని, లేకుంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని” పాక్, చైనా దేశాలకు చాలా గట్టి హెచ్చరికలే చేసింది. కానీ అంత మాత్రాన్న ఆ రెండు దేశాల ధోరణి మారుతుందని ఆశించడం కష్టం. ఎందువలన అంటే చైనాకు సామ్రాజ్య విస్తరణ కాంక్ష విపరీతంగా ఉంటే, పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. కనుక ఆ రెండు దేశాలు ఎన్నటికీ తమ వైఖరిని మార్చుకొనే అవకాశంలేదనే భావించవచ్చును. కనుక భారత్ ఎంత శాంతి కాముక దేశం అయినప్పటికీ సరిహద్దుల వద్ద ఆ రెండు దేశాలతో సమస్యలు తప్పవనే చెప్పవచ్చును.

టీడీపీ ఆఫీసు మీద దాడి టీఆర్ఎస్ తప్పిదమే

  ఉద్యమం నడిపినట్టుగా ప్రభుత్వాన్ని నడపడం ఏ పార్టీకి కుదరదు. దానికి టీఆర్ఎస్ కూడా అతీతమేమీ కాదు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో ఎన్నో సందర్భాలలో ఎంతోమంది మీద దాడులు జరిపింది. ఇప్పుడు మంత్రిగా వున్న హరీష్ రావు అయితే దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో ఒక దళిత ఉద్యోగి మీద దారుణంగా చేయి కూడా చేసుకున్నారు. అయితే ఇలాంటి దాడులు అప్పట్లో ‘ఉద్యమం’ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. టీఆర్ఎస్ అప్పట్లో జరిపిన దాడులు ఆ పార్టీకి మైలేజీ పెంచాయని అనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలాగా వ్యవహరించకుండా ఒక ఉద్యమ పార్టీ తరహాలోనే వ్యవహరిస్తోంది. ఎన్నో విషయాల్లో ఈ తరహా వ్యవహారశైలి బయటపడింది. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ తనలో వున్న ఉద్యమకారుడి సోయి పోలేదని ముఖ్యమంత్రి కేసీఆరే ఒప్పుకున్నారు. అయితే అధికార పార్టీ ఉద్యమ పార్టీలా వ్యవహరించడం తప్పిదమే అవుతుంది. ఆ విషయాన్ని గ్రహించలేని టీఆర్ఎస్ తప్పుల మీద తప్పులు చేస్తోంది. తాజాగా నల్గొండలో టీడీపీ కార్యాలయం మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసి విధ్వంసం చేయడం కూడా టీఆర్ఎస్ పార్టీ తప్పిదమే అవుతుంది.   తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు టీడీపీనే కారణమనే సాకును ఒకదాన్ని అడ్డుగా పెట్టుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఈ దాడి తెలంగాణ రాష్ట్రంలో వున్న టీఆర్ఎస్ వర్గాలకు సంతోషాన్ని కలిగించవచ్చేమోగానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం ఎంతమాత్రం నచ్చని అంశం. అది కూడా అధికార పార్టీ హోదాలో వున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేయడం అనేది అసలు ఎంతమాత్రం క్షమార్హం కాని విషయం. నల్గొండ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు, దాడి చేయించిన టీఆర్ఎస్ నాయకులు భలే చేశామని భుజాలు చరుచుకుంటే చరుచుకోవచ్చేమోగానీ, ఈ సంఘటన అధికార పార్టీ మీద మచ్చలా మిగులుతుంది. రాష్ట్రంలో శాంతి భధ్రతలను కాపాడాల్సిన అధికార పార్టీయే శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చే ప్రమాదం వుంది. మీడియా వాళ్ళని పది కిలోమీటర్ల లోతులో పాతిపెడతానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పరువు పోయాలా చేశాయి. ఇప్పుడు ఇలాంటి దాడుల సంఘటనలు తెలంగాణ రాష్ట్ర పరువును పాతాళానికి దిగజార్చే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబుని తిడితే కరెంటు వస్తుందా?

  కోడిని కొడితే తెల్లారుతుందా? చంద్రబాబును తిడితే తెలంగాణకి కరెంటు వస్తుందా? ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఉత్తరాంధ్ర జిల్లాలను అతాలాకుతలం చేసిన హుడ్ హూద్ తుఫాను వచ్చే వెళ్ళిన మరునాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు తరలివచ్చి దాదాపు వారం రోజులు ఏకధాటిగా సహాయ, పునరావాస చర్యలు స్వయంగా పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తిగా కోలుకోనేవరకు కూడా తను పూర్తిగా ఇదేపని మీద ఉంటానని ఆయన ఇదివరకే చెప్పారు. చెప్పడమే కాకుండా మళ్ళీ అదే పని మీద మరోమారు వైజాగ్ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా ఉత్తరాంధ్ర జిల్లాలలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపైనే ఉందని అందరికీ అర్ధమవుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టు నుండి తెలంగాణా రాష్ట్రానికి విద్యుత్ రాకుండా అడ్డుకొంటున్నారని తెరస నేతలు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్ పై ధర్నా చేయడం హాస్యాస్పదం.   తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన తెరాస, ఈ నాలుగు నెలలలో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందని తెరాసకు కూడా తెలియకపోలేదు. అయినా హామీ ఇచ్చింది. కానీ నానాటికీ తెలంగాణా రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ముదురుతుండటం, ఇదే అదునుగా ప్రతిపక్షాలన్నీ ప్రజలలోకి వెళ్లి అధికార తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటంతో బహుశః దానికి విరుగుడుగా తెరాస నేతలు ఈ ధర్నా కార్యక్రమం చేప్పట్టినట్లు కనబడుతోంది. ఏమయినప్పటికీ శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టు నుండి లభించే విద్యుత్ వలన తెలంగాణ రాష్ట్రానికి కొంత ఉపశమనం కలుగుతుంది తప్ప, దాని వలన ఈ సమస్య నుండి పూర్తిగా గట్టెక్కలేదనే సంగతి అందరికీ తెలుసు. కనుక తెరాస ప్రభుత్వం ఈ విధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందిస్తూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసే బదులు, ఈ సంక్షోభం నుండి గట్టేక్కేందుకు ఆయన సహాకారం కూడా తీసుకొని ఉండి ఉంటే ప్రయోజనం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ రైతుల రుణమాఫీ.. బ్యాంకుల ఓవర్ యాక్షన్!

  రైతు రుణమాఫీ... ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థులు ఆలోచించడానికి కూడా బెంబేలెత్తిపోయిన అంశం. రాష్ట్రంలో పేద రైతుల కష్టాలను అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు అర్హులైన పేద రైతులందరికీ వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కట్టుబడి వున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అర్హులైన రైతుల రుణాలు మాఫీ మాఫీ చేయడానికి ఆయన కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఆదుకోవడానికి ఆదాయ మార్గాల అన్వేషణలో, తగిన ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమై వున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిని రైతులు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నారు.   రైతుల రుణమాఫీ అంటే బొజ్జ నిండిన భూస్వాములు ఊబుసుపోక తీసుకున్న రుణాలు మాఫీ చేయడం కాదు. భూమి మీద అప్పు తీసుకుని వాటితో వడ్డీ వ్యాపారాలు చేసే బడాబాబుల పాలిట వరప్రసాదం కాదు. పంటలు ఏవీ వేయకపోయినా భూములు ఉన్నాయి కాబట్టి క్రాప్ లోన్ పేరిట తీసుకున్న రుణాలను మాఫీ చేయడం ఎంతమాత్రం కాదు. నిజానికి రైతు రుణమాఫీ అంటే... ఇతరులకు అన్నం పెట్టే ప్రయత్నంలో వివిధ కారణాల వల్ల తన కడుపు మాడే పరిస్థితికి వచ్చిన నిరుపేద రైతుల రుణాలు మాఫీ చేయడం. అలాంటి పేద రైతుల రుణాలు మాఫీ చేయడమే చంద్రబాబు నాయుడు ప్రధానోద్దేశం. రుణమాఫీ చేయడానికి నిజమైన అర్హులైన రైతుల రుణాలను మాఫీ చేయడమే న్యాయంగానీ, బడాబడా భూస్వాములకు మేలు చేయడం ఎంతమాత్రం న్యాయం కాదు. అందుకే ఈ విషయంలో అర్హులైన రైతులకు అన్యాయం జరగకూడదు. అనర్హులైన వారికి అప్పనంగా రుణమాఫీ చేయకూడదు.   చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30వ తేదీ, 2013 సంవత్సరంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ ప్రస్తావన తెచ్చారు. అంటే ఆ ఏడాది రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోరిన మేరకు బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాలను లెక్కగట్టడం ప్రారంభించాయి. అన్ని రకాలుగా లెక్కలు వేసి మొత్తం రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 5 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలు వున్నాయని, ఆ ఖాతాలున్న రైతులు తీసుకున్న రుణాలు 87,612 కోట్లు అని తేల్చాయి. ఈ అంకె చూసి ప్రతిపక్ష నాయకుడు జగన్ గుడ్లు తేలేశాడు. ఇంత భారీ మొత్తంలో రుణాలు వుంటాయి కాబట్టే రైతు రుణమాఫీ సాధ్యం కాదని తాను ముందే చెప్పానని కాకలు తీరిన ఆర్థికవేత్తలాగా ప్రకటనలు చేశాడు. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ ఎలా చేస్తాడో ఏంటోనని సానుభూతి వ్యక్తం చేశారు. అయితే నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాఫీ చేయాల్సిన రుణాలు ఇంత భారీ స్థాయిలో లేవు. ‘తెలుగువన్’ చేసిన పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు, బ్యాంకుల తెలివితేటలు బయటపడటంతోపాటు... అర్హులైన రైతుల రుణాలు మాఫీ చాలా సులభంగా చేయొచ్చని కూడా క్రిస్టల్ క్లియర్‌గా తెలిసిపోయింది.   నిజానికి బ్యాంకులు ప్రకటించిన 87,612 కోట్లు ఈ ఏడాది తీసుకున్న రైతు క్రాప్ రుణాల మొత్తం కాదు... ఈ మొత్తంలో చంద్రబాబు ప్రకటించిన సంవత్సరానికి కాకుండా అంతకు ముందు సంవత్సరాలలో తీసుకున్న రైతు రుణాలు 30,190 కోట్లు వున్నాయి. దశాబ్దాల తరబడి మొండి బకాయిలుగా మిగిలిపోయి, బ్యాంకులు కూడా వసూలు చేయలేక చేతులు ఎత్తేసిన రుణాలు 6,480 కోట్లు వున్నాయి. ఇక బంగారం తాకట్టు పెట్టి వ్యక్తిగత అవసరాల కోసం, వ్యవసాయేతర పనుల కోసం తీసుకున్న రుణాలు, రుణమాఫీ పరిధిలోకి రాని హార్టీకల్చరల్ రుణాలు, భూస్వాములు తీసుకున్న రుణాలు, ఒకే కుటుంబంలో ఒకరికి మించి తీసుకున్న రుణాలు..... ఇలా రకరకాల ‘మాఫీ’తో సంబంధం లేని రుణాలన్నీ కలిపి 87,612 కోట్లు అయింది. ఈ మొత్తంలో ప్రభుత్వం నిజంగా మాఫీ చేయాల్సిన రుణం కేవలం 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది.   అయితే బ్యాంకులు మాత్రం తెలివిగా ఈ లెక్కలను బయటపెట్టడం లేదు. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన రుణమాఫీ 15 నుంచి 20 వేల కోట్ల రూపాయల మధ్యలో వున్నప్పటికీ ఆ లెక్కలు, అంకెలను బయటపెట్టకుండా ‘‘రైతులు బ్యాంకులకు 87,612 కోట్లు బాకీ వున్నారు’’ అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాయి. ఇక్కడ బ్యాంకుల స్వార్థం ఏమిటంటే, ప్రభుత్వం ఎలాగూ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది కాబట్టి, ఎన్నో సంవత్సరాలుగా తాము ఇచ్చిన రుణాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేసేసి తాము చేతులు దులిపేసుకుంటే ఒక పనైపోతుంది కదా అనే!చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలు మాఫీ చేయడం చాలా సులువైన విషయం. అయితే మధ్యలో బ్యాంకులు మైండ్ గేమ్ ఆడుతూ స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ వుండటం వల్లే రైతు రుణమాఫీ అంశం చాలామందికి భూతద్దంలో కనిపిస్తూ భయపెడుతోంది. నిజానికి బ్యాంకులు ఇప్పటికైనా చంద్రబాబుతో మైండ్ గేమ్ ఆడటం ఆపేయాలి. రైతు రుణమాఫీ అంశాన్ని అడ్డు పెట్టుకుని అవకాశవాదంతో, స్వార్థంతో వ్యవహరించడం మానుకోవాలి. ఇంతకాలం తాము భరిస్తున్న రుణాల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన వేయాలని భావించడం పద్ధతి కాదని తెలుసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన వాస్తవ రుణాన్ని బ్యాంకులు ఎలాంటి తిరకాసులు పెట్టకుండా బయటపెడితే పేద రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ లక్ష్యమూ నెరవేరుతుంది.

హుదుద్ తుఫాను: తోటలకు తీరని నష్టం

  ఉత్తరాంధ్ర మీద కనీవినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడిన హుదుద్ తుఫాను ఉత్తరాంధ్రకు తీరని నష్టాన్ని మిగిల్చింది. విశాఖపట్నం అస్తవ్యస్తం కావడం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలకు భారీ నష్టం జరగడం అలా వుంచితే, రోజులు గడుస్తున్నకొద్దీ హుదుద్ తుఫాను చేసిన నష్టాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ స్థాయిలో జరుగుతున్న తోటల పెంపకానికి ఊహించని నష్టాన్ని ఈ తుఫాను కలిగించింది. అరవై కిలోమీటర్ల తీర ప్రాంతంలో పళ్ళతోటలు భారీగా విధ్వంసానికి గురయ్యాయి.   విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గర్నుంచి విశాఖపట్నం జిల్లా తలపాలెం, ద్వారపూడి ప్రాంతాల్లో సపోటా, కొబ్బరి, జీడిమామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. మళ్ళీ చిన్న చిన్న మొక్కలు పెంచుకుని నాలుగైదు ఏళ్ళ తర్వాతే మళ్ళీ ఫలసాయం చూడగలమని ఈ ప్రాంతాల్లోని తోటల పెంపకందార్లు చెబుతున్నారు. గుడ్డిలో మెల్లగా పెద్ద పెద్ద పర్వతాలు అడ్డుగా వున్న కొన్ని గ్రామాల్లో మాత్రం పండ్ల తోటలు సురక్షితంగా వున్నాయి. ఆ పర్వతాలే తమ తోటలను కాపాడాయని స్థానికులు చెబుతున్నారు.   మొత్తమ్మీద ఉత్తరాంధ్రలోని రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పండ్ల తోటలు నేటమట్టమైపోయాయని తెలుస్తోంది. ఈ నష్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హార్టీకల్చర్ డిపార్ట్‌మెంట్ లెక్కలు కడుతోంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటే తప్ప ఉత్తరాంధ్రలో తోటల పెంపకందార్లు తిరిగి నిలదొక్కుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

టీడీపీ - బీజేపీ... మిత్రభేదం మొదలవుతుందా?

  ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెత చాలామందికి తెలిసే వుంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ మధ్యన వున్న స్నేహం ఆ సామెత మాదిరిగానే తయారయ్యేట్టుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీని సంపాదించింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకీ కొన్ని సీట్లు తక్కువ వున్నప్పటికీ అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీనే. ఇలా చాలా తక్కువ వ్యవధిలోనే కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. తాజాగా మహారాష్ట్ర, హర్యానాల్లో అయితే ఏపార్టీలో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. ఇలా ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా సాధించిన విజయాలు బీజేపీ నాయకత్వంతో కొత్త ఆలోచనలకు ప్రాణం పోసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధానాన్ని అనుసరిస్తే ఓ పనైపోతుంది కదా అన్న ఆలోచన మొదలైంది.   గత ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం పార్టీలో కలసి ఎన్నికలలో పోటీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో బీజేపీ కొద్ది సీట్లు మాత్రమే సాధించి సరిపెట్టుకుంది. తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేయడం వల్లనే రెండు రాష్ట్రాల్లోనూ ‘సరిపెట్టుకునే స్థితి’లో బీజేపీ వుందని, ఇక్కడ కూడా ఒంటరిగా పోటీ చేస్తే ఆ పరిస్థితే వేరుగా వుండేదన్న అభిప్రాయాలు ఇక్కడి బీజేపీ నాయకత్వంలో వుంది. ముఖ్యంగా మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా వుండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డికి మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయాలని ఆయన శాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ఒంటరి పోరులో రెండు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఒంటరిగానే రాజకీయ ప్రస్థానం చేస్తే మంచిదన్న ఉద్దేశాన్ని కిషన్ రెడ్డి కేంద్ర నాయకత్వానికి ఇంజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో వున్న కిషన్ రెడ్డి ఆ విషయాన్నే పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పినట్టు తెలుస్తోంది.   ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందడానికి ప్రధాన కారణం టీడీపీ - బీజేపీ మధ్య సయోధ్య ఉండటమేనన్న అభిప్రాయాలు వున్నాయి. ఇప్పుడుగనుక బీజేపీ భవిష్యత్తులో ఒంటరి ప్రయాణం చేసే ఉద్దేశంతో రాజకీయంగా పావులు కదపడం మొదలుపెట్టిందంటే అది రెండు పార్టీల మధ్య వున్న సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం వుంది. ఇప్పటి వరకూ బీజేపీతో ఉన్న స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు చెడిపోయే ప్రమాదం వుంది. ప్రభుత్వానికి మరో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవలసి కూడా వుంటుంది. అటువైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ సొంతగా బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని స్థాపించాలన్న టీడీపీ కలలకు గండిపడే ప్రమాదం వుంది. ఈ విధంగా మోడీ, బీజేపీ హవా పుణ్యమా అని తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కొత్త సమస్యలు వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇప్పటి వరకూ బీజేపీ వల్ల మిత్రలాభం పొందిన టీడీపీ ఇక ముందు మిత్రభేదాన్ని కూడా ఎదుర్కోవలసి వుండొచ్చని అంటున్నారు.