మాల్యా మన బ్యాంకులకు చెడ్డపేరు తెచ్చాడు... అరుణ్జైట్లీ
విజయ్ మాల్యా వల్ల ప్రపంచ వ్యాప్తంగా మన దేశ బ్యాంకులకీ, ప్రైవేటు రంగానికీ చెడ్డ పేరు వచ్చిందని అర్థిక మంత్రి అరుణ్జైట్లీ విరుచుకుపడ్డారు. ఇండియాటుడే నిర్వహిస్తున్న ఓ సమావేశంలో మాట్లాడుతూ అరుణ్జైట్లీ, మొండి బకాయిలు అన్నింటినీ ఒక్క తీరున చూడలేమని స్పష్టం చేశారు. ఇనుము, దుస్తులు వంటి రంగాలలో వచ్చిన నష్టాల వల్ల మొండిబకాయిలు ఏర్పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చుననీ, కానీ ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో ఏర్పడిన మొండిబకాయిలు చాలా ప్రమాదకరమన్నారు. సరైన తనఖాలు కానీ, అవసరాలు కానీ లేకుండానే అనైతికంగా తీసుకున్ని రుణాల వల్ల బ్యాంకులకు తీవ్ర నష్టమంటూ హెచ్చరించారు. మొండిబకాయిల కునారిల్లుతున్న బ్యాంకింగ్ రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియచేశారు. బ్యాంకులు తిరిగి పుంజుకునేలా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, ఆస్తులను అమ్ముకునేందుకు, యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకునేందుకు... తగిన స్వేచ్ఛను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి విజయ్మాల్యా గురించి ప్రస్తావిస్తూ, బ్యాంకులు అతని నుంచి ఆఖరిపైసా వరకూ వసూలు చేసి తీరతాయని ఆశించారు అరుణ్జైట్లీ. ఆర్థికమంత్రి చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి కానీ, మన దేశంలో పెద్దగా ఆస్తులు లేని మాల్యా నుంచి 9,000 కోట్ల రూపాయల అప్పును బ్యాంకులు ఎలా వసూలు చేస్తాయన్నదే పెద్ద సందేహం!