మోదీతో బ్రిటన్‌ ప్రధాని చర్చలు... టాటా స్టీల్‌ గురించేనా!

  అమెరికాలో జరగనున్న అణుభద్రత సదస్సులో పాల్గొనేందుకు ఇటు భారత ప్రధాని మోదీ, అటు బ్రిటన్‌ ప్రధాన కెమెరూన్ వాషింగ్టన్‌కు చేరుకున్నారు. పనిలో పనిగా ఈ సమావేశంలో కెమెరూన్‌, బ్రిటన్‌లోని టాటాస్టీల్ సంక్షోభం గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇంగ్లండులోని సౌత్‌వేల్స్ ప్రాంతంలో టాటా యాజమాన్యానికి భారీ స్టీల్‌ కర్మాగారం ఉంది. అయితే రోజురోజుకీ ఈ కర్మాగారం నుంచి లాభాలు రాకపోగా, కోట్లకొద్దీ నష్టాలు వాటిల్లడం మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులు, చైనా నుంచి ఐరోపాకు కారుచౌకగా స్టీలు ఎగుమతి కావడం తదితర అంశాల వల్ల, ఆ కర్మాగారం సంక్షోభంలో పడిపోయింది.   దాంతో ఈ కర్మాగారాన్ని మూసివేయాలని టాటా యాజమాన్యం నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 40 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని అంచనా. అందుకే మూసివేత గురించి వదంతులు వినిపించగానే బ్రిటన్ ప్రధాని కెమెరూన్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎక్కడెక్కడి అధికారులో ఆదరాబాదరాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు లండన్ చేరుకున్నారు. నయానో భయానో ఈ కర్మాగారం మూతపడకుండా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం దొరికేదాకా టాటా యాజమాన్యం కాస్త ఓపికపట్టేలా చూడాలని కొందరు సూచించారట. ఇప్పటికే కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు టాటాలతో సంప్రదింపులు జరిపేందుకు ఇండియాకు చేరుకున్నారు. మరో పక్క, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు మోదీ కూడా చొరవ తీసుకోవాలంటూ, బ్రిటన్ ప్రధాని కెమెరూన్‌ కూడా అభ్యర్థించనున్నారని తెలుస్తోంది. ఓడలు బళ్లుగా మారడం అంటే ఇదేనేమో!

ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే భలే ఉంటుంది- మోదీ

  దేశంలో ఏదో ఒక మూల ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉండటం మనకి తెలిసిందే! ఇలా తరచూ ఎన్నికలు జరగడం వల్ల అటు సమయమూ, ఇటు డబ్బూ వృథా అవుతున్నాయని చాలామంది వాపోతుంటారు. ఇప్పుడు మోదీ కూడా అలాంటి వారితో ఏకీభవిస్తున్నట్లున్నారు. ఈ మధ్యే జరిగిన ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, దేశంలోని అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిపితే చాలా బాగుంటుందని సూచించారట. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు... ఇలా ప్రజల చేత ఎన్నుకోబడే వ్యవస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలని ఆయన కోరుకుంటున్నారట.   దీని వల్ల తరచూ ఎన్నికల ప్రచారాలకి తిరుగుతూ నాయకులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి ఉండదని ఆయన ఉద్దేశం. పైగా కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ పేరుతో ఎన్నికలు జరిగే ప్రాంతంలో ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేసే అవకాశం ఉండదు. అయితే మోదీ ఈ విషయాన్ని కేవలం ఆలోచనతో వదిలేట్లు లేరు. తాను మిగతా పార్టీలతో కూడా ఈ విషయమై చర్చించనని, చాలామంది దీనికి సుముఖంగా ఉన్నారని మోదీ చెబుతున్నారు. ఇక బీజేపీ ఎలాగూ ఈ విధానానిక మొదటి నుంచి అనుకూలంగానే ఉంది. అసెంబ్లీ, పార్లమెంటులకు ఒకేసారి ఎన్నికలు జరిగేలా ఒక విధానాన్ని రూపొందించాలని ఆ పార్టీ తన 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది కూడా!

తలాక్‌ ఇక మీదట చెల్లదా!

  ఇప్పటివరకు భారతదేశంలోని ముస్లింల మత చట్టాలలో ప్రభుత్వం ఎలాంటి జోక్యమూ కలిగించుకోలేదు. అయితే ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ సూచనలను కనుక ఆమోదిస్తే, దేశంలో మరో వివాదం రాజుకునే అవకాశం ఉంది. ఈ కమిటీ బహుభార్యత్వం మీదా, మూడుసార్లు తలాక్‌ చెప్పే విధానం మీదా తన అభ్యంతరాలను తెలియచేసినట్లు వినికిడి. ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్న తరువాత, వారికి తగినంత భరణాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా కమిటీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ భరణానికి సంబంధించి ఇప్పటికే 1985 నాటి షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినా, ఆ తీర్పుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అప్పటి నుంచి న్యాయస్థానాలు కానీ, ప్రభుత్వం కానీ ముస్లిం మత చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేందుకు సాహసించలేదు.   అయితే మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులు తీసుకునే విధానం మీద, ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియచేయాలని నిన్న సుప్రీం కోర్టు ఆదేశించడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియచేయాల్సిన అగత్యం వచ్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన సైరాబాను అనే మహిళకు సంబంధించిన కేసులో సుప్రీం ఈ ఆదేశాలను జారీచేసింది. సైరాబాను వాదన ప్రకారం మూడుసార్లు తలాక్‌ చెప్పే విధానం గురించి ఖురాన్‌లో తగిన ప్రస్తావన లేదని, పాకిస్తాన్‌ వంటి చాలా ఇస్లామిక్‌ దేశాలు సైతం ఈ విధానాన్ని అనుమతించడం లేదనీ తెలుస్తోంది. మరి కేంద్రం ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఎలా తెలియచేస్తుందో చూడాలి. తాను నియమించిన కమిటీ మాటలతో ఏకీభవిస్తూ, అదే విషయాన్ని సుప్రీంకు చేరవేస్తుందా. లేకపోతే మతపరమైన సున్నిత అంశాల జోలికి పోకుండా తటస్థంగా ఉండిపోతుందా అన్నది త్వరలోనే తేలనుంది!

జేఎన్‌యూలో చేరేందుకు విద్యార్థుల విముఖత

  జేఎన్‌యూ అంటే ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంగా భావించేవారు. అందులో చేరాలని మేధావులంతా తపించేవారు. జేఎన్‌యూ పూర్వవిద్యార్థుల జాబితా చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడ నుంచి ఎలాంటి హేమాహేమాలు తయారయ్యారో. కానీ ఇదంతా పూర్వవైభవం కానుందా? జేఎన్‌యూ ప్రతిష్ట మసకబారిందా? అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.   గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జేఎన్‌యూలో చేరాలనుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు ఐదు శాతం తగ్గిపోయిందట. జేఎన్‌యూలోని వివిధ కోర్సులకుగాను ఆ విశ్వవిద్యాలయానికి అందిన దరఖాస్తుల వెల్లువలో మార్పు వచ్చిందంటున్నారు అధికారులు. ఏటా పెరుగుతూ వచ్చే ఈ దరఖాస్తులు ఈసారి 3,000కు పైగా తగ్గిపోయాయట. ఇటీవల జేఎన్‌యూలో జరిగిన పరిణామాలే దీనికి కారణం అంటున్నారు విశ్లేషకులు. అటు విద్యార్థుల వివాదాస్పద సభలు, వాటి మీద ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలతో... జేఎన్‌యూకి చెడ్డపేరు వచ్చిందంటున్నారు. ఇందులో నిజం ఎంతో కన్నయ కుమార్‌కే ఎరుక!

ఆలయాలలో మహిళల ప్రవేశాన్ని అపలేరు- ముంబై హైకోర్టు

  ఆలయాలో మహిళల ప్రవేశానికి సంబంధించి ముంబై హైకోర్టు నేడు ఒక కీలకమైన తీర్పుని వెలువరించింది. ఆడవారు ఆలయాలలోకి ప్రవేశించకూడదంటూ ఎలాంటి చట్టమూ లేదని హైకోర్టు భావించింది. మగవారు వెళ్లే ప్రతి చోటుకీ, స్త్రీలు కూడా వెళ్లే హక్కు ఉందని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అలా మహిళలను అడ్డుకునే సందర్భాలలో వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా కలెక్టర్లదే అని పేర్కొంది. శనిశింగనాపూర్‌లోని మూలవిరాట్టు ఉండే గట్టు మీదకు స్త్రీలను అనుమతించేందుకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయమంటూ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.   గత కొద్ది నెలలుగా శని శింగనాపూర్‌, త్రయంబకేశ్వరం తదితర ఆలయాలలో ప్రవేశించేందుకు కొందరు మహిళలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే! భూమాత బ్రిగేడ్‌ అనే సంస్త తరఫున తృప్తి దేశాయ్ అనే కార్యకర్త ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లారు. గత వారం తృప్తి, త్రయంబకేశ్వర ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి అరెస్టయ్యారు కూడా! ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. ఆలయాలలో మహిళల ప్రవేశానికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర  ఫడ్నవీస్, ఆరెస్సెస్‌లు కూడా అనుకూలంగా ఉండటంతో... ఈ సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత తీర్పు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

దేశానికి క్షమాపణ చెప్పిన షాహిద్‌ ఆఫ్రిదీ

  క్రికెట్‌ అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ పాకిస్తాన్‌లో అలా ఉండదు. తమ క్రికెట్‌ జట్టు ఓడిపోతే, అందులోనూ ఇండియా చేతిలో ఓడిపోతే అక్కడి భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచకప్‌లో భాగంగా, భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోవడంతో మరోసారి అక్కడి అభిమానులు తమ జట్టు మీద విరుచుకుపడ్డారు. పుండు మీద కారం చల్లినట్లు తరువాత జరిగిన మ్యాచ్‌లలో కూడా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టు పేలవ ప్రదర్శనకు కారణం ఆటగాళ్లే అంటూ ఆ జట్టు కోచ్‌ వకార్‌ యూనిస్‌ చేతులు దులిపేసుకున్నాడు. కానీ ఆఫ్రిదీ మాత్రం మరో అడుగు ముందుకేసి, తాను దేశానికి క్షమాపణ చెబుతున్నానంటూ ఆన్‌లైన్‌లో ఒక వీడియోని ఉంచాడు. 20 ఏళ్లుగా తాను దేశం తరఫున ఆడాననీ, దేశ ప్రజల ఆశలకు ప్రాతినిధ్యం వహించాననీ చెప్పుకొచ్చాడు ఆఫ్రిదీ.   తన గురించి ఎవ్వరేమనుకున్నా పట్టించుకోననీ, ఒక్క దేశ ప్రజలకు మాత్రమే జవాబుదారిగా ఉంటానని పేర్కొన్నాడు. ఆ దేశ ప్రజలకు, తమ పేలవమైన ప్రదర్శనకుగాను క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌లో కంటే, భారతదేశంలోనే తమను ఎక్కువగా అభిమానిస్తారంటూ పేర్కొని విమర్శల పాలైన ఆఫ్రిదీ... ఈ క్షమాపణలతోనైనా పాకిస్తాన్‌ ప్రజల మనసుని చూరగొంటాడేమో చూడాలి. ఎవరెన్ని చెప్పినా, ఈ పరాజయాల తరువాత, ఆఫ్రిదీని అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగించే అవకాశాలు సన్నగిల్లినట్లే!

సీరియల్స్‌ని కూడా సెన్సార్ చేయండి... ఓ నిర్మాత కేసు

  టీవీ పెడితే చాలు, కళ్లు మిటకరిస్తూ, బూతులు తిట్టుకుంటూ హడలెత్తించే సీరియల్స్ కోకొల్లలు. ఇక అక్రమసంబంధాలు, వెకిలి నృత్యాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇవి చూసీచూసీ చిరాకేసినవారికి ఓ శుభవార్త. టీవీలో వెలువరించే కార్యక్రమాలకు సెన్సార్‌ చేయరేమంటూ ఓ నిర్మాత కోర్టు మెట్లెక్కాడు. ఎమ్.ఎస్.రవీంద్ర అనే వ్యక్తి కన్నడంలో ఇటీవలే ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రంలో ఫలానా ఫలానా సంగతులు ఉన్నాయంటూ ఆర్భాటంగా టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు. తీరా తుది చిత్రానికి మాత్రం అక్కడి సెన్సార్‌ బోర్డు అంటకత్తెర వేసి వదిలింది. కొన్ని దృశ్యాలను టీవీలో ప్రకటనకి అనుమతించిన సెన్సార్‌ బోర్డు, తుది చిత్రంలో సదరు మార్పులు ఎందుకు చేసిందన్నది రవీంద్ర వాదన.   టీవీలో ప్రకటన చూసి వచ్చిన ప్రేక్షకులు, చిత్రంలో సదరు దృశ్యాలు లేకపోవడంతో నిరుత్సాహపడ్డారన్నది అతని ఆవేదన. అసలు టీవీలో వచ్చే కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సెన్సార్‌ నిబంధనలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం ఏ మేరకు అమలుచేస్తోందో తెలియచేయాలంటూ రవీంద్ర కర్ణాటక హైకోర్టుని వేడుకున్నాడు. రవీంద్ర వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రాంతీయ సెన్సార్‌ బోర్డుకీ, సమాచార మంత్రిత్వ శాఖకీ తాఖీదులు జారీ చేసింది. టీవీలలో వచ్చే ధారావాహికలు, ప్రకటనలు వంటి కార్యక్రమాలన్నింటికీ కూడా సెన్సార్‌ వర్తింపచేయాలని ఎప్పటి నుంచో జనం కోరుతున్నారు. ఈ కేసు ద్వారా అయినా వారి ఆశకి అవకాశం లభిస్తుందేమో చూడాలి!

పిచ్చివాడి చేతిలో విమానం!

  ఆరుగంటల పాటు ఈజిప్టు దేశాన్ని గడగడ వణికించిన హైజాక్‌ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. నిన్న ఉదయం అలగ్జాండ్రియా నుంచి కైరోకు బయల్దేరిన ఓ విమానాన్ని ఆగంతకుడు హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే! ఆగంతకుడు తన నడుముకి పేలుడుపదార్థాలని చుట్టుకున్నానని బెదిరించడంతో, ఈజిప్టు ఒక్కసారిగా వణికిపోయింది. పైగా విమానంలో ఉన్న 72మందిలో డజనులకు పైగా విదేశీయులు ఉండటంతో, ఈ ఘటన ప్రపంచాన్నే వణికించింది. హైజాకరు ISIS తీవ్రవాదేమో అన్న భయాలూ మొదలయ్యాయి. హైజాకర్‌ విమానాన్ని లర్నాకాలో దింపమంటూ ఒత్తిడి చేయడంతో, పైలట్లు అతని మాటను అంగీకరించారు. విమానం లార్నాకాలో దిగిన తరువాత ఏడుగురు వ్యక్తులను తప్ప మిగతావారిని హైజాకర్‌ విడిచిపెట్టడంతో, పరిస్థితి కాస్త నెమ్మదించింది.   నిమిషాలు గడిచేకొద్దీ హైజాకర్‌ అంత ప్రమాదకరమైన వ్యక్తి కాదని అధికారులకు అర్థం కాసాగింది. ఒకదాని తరువాత ఒకటి పొంతన లేని డిమాండ్లను అతను వల్లె వేస్తూ ఉండటంతో అతని మతిస్థిమితం మీద అనుమానాలు మొదలయ్యాయి. ఇంతలో లార్నాకాలో ఉన్న తన భార్యను చూసేందుకే విమానాన్ని హైజాక్‌ చేశానని చెప్పడంతో, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అతని భార్యను విమానాశ్రయానికి రప్పించి, ఆపై హైజాకరును అరెస్టు చేశారు. హైజాకరుకు మతిస్థిమితం లేదనీ, 1994లో తన భార్య నుంచి విడాకులను పొందిన తరువాత, మరింత కుంగిపోయాడనీ అధికారులు చెబుతున్నారు. అతని వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని కూడా వెల్లడిస్తున్నారు. హైజాకరు మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేనప్పటికీ, అతని చర్యల వల్ల ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నది మాత్రం వాస్తవం. కాబట్టి, ఈ చర్యకుగాను సదరు వ్యక్తికి భారీగానే శిక్షపడే అవకాశం కనిపిస్తోంది.

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా తీర్పు

  ఉత్తరాఖండ్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తిప్పి కొట్టింది. ఆ రాష్ట్రంలోని హరీశ్‌ రావత్‌ ప్రభుత్వం మైనారటీలో పడిపోయిందంటూ కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనకి విరుద్ధంగా నేడు హైకోర్టు తీర్పునిచ్చింది. తాజా తీర్పు ప్రకారం హరీశ్‌ రావత్‌ ఈ నెల 31న అక్కడి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునే అవకాశం దక్కింది. 71 మంది సభ్యులు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36మంది సభ్యుల బలం ఉంది. అయితే వీరిలో 9 మంది బీజేపీ పంచన చేరడంతో, అధికారపక్షం బలహీనమైపోయింది.   ఇలాంటి పరిస్థితుల్లో హరీశ్‌ రావత్‌ తన బలాన్ని ఎలా నిరూపించుకుంటారో వేచి చూడాలి. పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హైకోర్టు ఆమోదించలేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొనవచ్చంటూ న్యాయస్థానం అవకాశాన్ని అందించింది. ఈ తతంగం ముగిసేవరకూ కూడా హరీశ్‌రావత్‌ను ముఖ్యమంత్రిగా భావించాలంటూ న్యాయస్థానం పేర్కొంది. మరోపక్క ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనని అన్యాయంగా విధించారంటూ సుప్రీంకోర్టులో వేసిన ప్రజావ్యాజ్యాన్ని, కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టు నుంచి కేంద్రానికి అక్షింతలు తప్పేట్లు లేవు.

హిమాచల్‌ ముఖ్యమంత్రి అరెస్టుకు రంగం సిద్ధం

  అక్రమార్జన కేసులో హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ త్వరలోనే అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను అధికారులు వీరభద్ర సింగ్‌ ఆస్తులకి సంబంధించి సోదాలు నిర్వహించిన నేపథ్యంలో, వీరభద్ర సింగ్‌ తప్పు మీద తప్పు చేసినట్లు కనిపిస్తోంది. తన దగ్గర పట్టుబడిన ఆస్తులన్నీ సక్రమమైనవే అని రుజువు చేసుకునేందుకు, ఆయన పాత తేదీలతో ఉన్న స్టాంప్‌ పేపర్ల మీద కొత్త ఒప్పందాలు చేసుకున్నట్లు తేలింది. కొత్తగా చూపిస్తున్న ఒప్పందాల ప్రకారం తన ఆస్తి లక్షల్లో కాదు, కోట్లలో ఉందనీ.... ఇదంతా కూడా తన యాపిల్‌ తోటల మీద న్యాయంగా సంపాదించిన సొమ్మనీ ఆయన రుజువు చేసే ప్రయత్నం చేశారు.   అయితే ఈ విషయాన్ని అధికారులు పసిగట్టడంతో వీరభద్రసింగ్ పప్పులు ఉడకలేదు. దాంతో అక్రమార్జనకు సంబంధించిన కేసులే కాకుండా నకిలీ దస్తావేజులను సృష్టించిన ఆరోపణల్లో కూడా ఆయన విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఒక పక్క సీబీఐ విచారణ, మరోపక్క అరెస్టుకు సమాయత్తం అవుతున్న ఈడీ అధికారులు.... ఇలా కష్టాలలో మునిగి ఉన్న వీరభద్ర సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్‌ అధిష్టానం కూడా షాక్‌ ఇవ్వనుందని సమాచారం. ఇదే కనుక జరిగితే అటు అరుణాచల్‌, ఇటు హర్యానాలలో తమ ప్రభుత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్... ఇప్పడు హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా కష్టకాలాన్ని ఎదుర్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే అయిన బౌలింగ్ చేస్తాను- శ్రీశాంత్‌

  ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్ ఇప్పుడు కేరళ రాజకీయాలతో చురుకుగా ఆడుకుంటున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడనున్న శ్రీశాంత్‌, ఆటకు ముందుగానే మాటల యుద్ధాన్ని మొదలుపెట్టాడు. క్రికెట్‌లో తను ఎలాగైతే దూకుడుగా వ్యవహరిస్తానో, రాజకీయాలలో కూడా అంతే దూకుడుగా ఉంటానంటున్నాడు శ్రీశాంత్‌. యువత రాజకీయాలలో రావల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, అందుకే తాను ఈ రంగంలోకి అడుగుపెట్టానని పేర్కొంటున్నాడు. ప్రధానమంత్రి మోదీకి తను వీరాభిమానిని కనుక, బీజేపీలో చేరానని చెప్పుకొస్తున్నాడు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రం వేరేలా ఉన్నాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అధికారిక క్రికెట్ నుంచి దూరమైన శ్రీశాంత్‌, ఆ ఆరోపణల నుంచి బయటపడేందుకే అధికార పార్టీలో చేరాడని విమర్శిస్తున్నాయి.   2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రీశాంత్‌, ఆది నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. తాజాగా 2013లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల తరువాత, శ్రీశాంత్‌ను బీసీసీఐ నిషేధించింది. అయినా శ్రీశాంత్ నిశ్శబ్దంగా ఉండిపోలేదు. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించేందుకు సిద్ధపడ్డాడు. ఇప్పుడేమో రాజకీయాలలోనూ అడుగుపెట్టాడు. మరి ఒకవేళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కూడా క్రికెట్ ఆడతారా అనే ప్రశ్నకు ‘ఔను’ అంటూ తడుముకోకుండా జవాబు ఇస్తున్నాడు. ఇప్పటికీ తాను వేగంగా బంతులు విసరగలననీ, దేశం తరఫున ఆడగలననీ అంటున్నాడు. శ్రీశాంత్‌ సిద్ధంగా ఉన్నా బీసీసీఐ ఒప్పుకోవాలి కదా!

బెల్జియం దాడులలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి

  బెల్జియంలో గతవారం నుంచి కనిపించకుండా పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి చెందినట్లు తేలింది. బెల్జియం రాజధాని బ్రెసిల్స్‌ విమానాశ్రయం మీదా, సమీపంలోని రైల్వే స్టేషన్లోనూ జరిగిన ఆత్మాహుతి దాడులలో 35మంది మృతి చెందిన విషయం తెలిసిందే! ఆ రోజు నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్‌ గణేశ్‌ కూడా కనిపించడం లేదు. రాఘవేంద్రన్‌కు తరచూ మెట్రో రైళ్లలో ప్రయాణం చేసే అలవాటు ఉందని తేలడంతో, దాడులలో అతను కూడా మృతి చెంది ఉంటాడని అంతా భయపడ్డారు.   భయపడినట్లే, రాఘవేంద్ర మృతదేహాన్ని బెల్జియం ఆసుపత్రిలో కనుగొన్నారు. అతని శరీరం గుర్తుపట్టలేనంతగా దెబ్బతినిపోవడంతో, రాఘవేంద్ర కుటుంబం మాత్రమే అతని మరణాన్ని ధృవీకరించగలిగింది. ఇన్ఫోసిస్‌ తరఫున గత నాలుగేళ్లుగా బెల్జియంలో పనిచేస్తున్న గణేశ్‌, గత నెలే ఇంటికి వచ్చి వెళ్లాడు. ఘటన జరిగిన కొద్దిసేపటి ముందు కూడా తమతో ఫోన్లో మాట్లాడాడనీ, ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయిందనీ గణేశ్‌ తల్లి వాపోయారు. గణేశ్ కనిపించకుండా పోయిన దగ్గర్నుంచీ, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌, గణేశ్‌ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేశారు.

ద్వేషాన్ని రెచ్చగొట్టేవారు ఎన్నికలలో గెలుస్తున్నారు

  కొందరు నేతలు, సున్నితమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలను చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ సదరు వ్యక్తులు ఏవో భావోద్వేగంతో అలాంటి ప్రసంగాలను చేస్తున్నారనుకోవడం పొరపాటే అంటున్నారు మనోజ్‌ అనే సామాజిక కార్యకర్త. గత 12 సంవత్సరాలుగా ఎన్నికల తీరుని విశ్లేషించిన మనోజ్‌, తన పరిశీలన ఆధారంగా ఓ సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టిన వారిలో మూడో వంతు మంది ఎన్నికలలో గెలుపొందుతున్నట్లు తేల్తోంది.   అంతేకాదు! ద్వేషపూరిత ప్రసంగాలు చేసి విచారణను ఎదుర్కొంటున్న వారిలో 70 మంది ప్రస్తుత చట్టసభల్లోనే ఉన్నారట. వీరిలో సాక్షి మహరాజ్, అజంఖాన్‌, అక్బరుద్దీన్‌ ఓవైసీ వంటి ఉద్ధండులూ ఉన్నారు. పోనీ ఇలాంటి ప్రసంగాలు చేసే వ్యక్తులను పార్టీలన్నా దూరంగా ఉంచుతున్నాయా అంటే అదేమీ లేదంటున్నారు మనోజ్‌. ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కేసులను ఎదుర్కొంటున్న 399 మందికి గత 12 ఏళ్లలో వివిధ పార్టీలు టిక్కెట్లిచ్చి సత్కరించాయట. అంటే ద్వేషంతో ప్రజల మనసుని విరిచి, పదవి గెలుచుకునే ప్రయత్నాలు బలపడుతున్నాయన్నమాట! తస్మాత్‌ జాగ్రత్త.

చైనాలో నోరెత్తితే... కుటుంబం గల్లంతే!

  చైనాలో మానవహక్కులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అలాంటి విషయాల గురించి మాట్లాడేవారు తరచూ గల్లంతైపోతుంటారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, ఏకంగా కుటుంబాన్నే మాయం చేసేస్తే! అలాంటి ఘటనే ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... న్యూయార్క్‌లో నివసించే ‘వెన్‌ యుంచావ్’ అనే చైనా పౌరుడు, చైనా అధ్యక్షుడిని విమర్శించే లేఖ ఒకదాన్ని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అప్పటి నుంచీ చైనాలో ఉన్న వెన్‌ కుటుంబం మాయమైపోయింది.   చైనా అధికారులే తన తల్లిదండ్రులనీ, తమ్ముడినీ తీసుకువెళ్లిపోయారని ఆరోపిస్తున్నాడు వెన్. నిజానికి ఆ లేఖ తాను రాయలేదనీ, ఎవరో రాసిన లేఖను ట్విట్టర్‌లో పంచుకున్నాననీ వాపోతున్నాడు. కానీ వెన్ ప్రచురించిన లేఖని చైనా ప్రభుత్వం చాలా తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చైనా అధ్యక్షుని వల్ల ఆ దేశానికి చాలా నష్టం జరిగిందనీ, కాబట్టి ఆయన తప్పుకోవాలని సదరు లేఖలో ఉంది. అంతంతేసి మాటలంటే కరణామయులైన చైనా అధికారులు ఎలా ఊరుకుంటారు. అందులోనూ చైనా అర్థిక స్థితి అంతంతమాత్రమేనని తేలుతున్న ఈ రోజుల్లో, చైనా ప్రభుత్వం ఏ విమర్శనీ కూడా సహించే స్థితిలో లేదట. అయినా తమ వంతుగా ఆమ్నస్టీ సంస్థ, వెన్‌ కుటుంబాన్ని విడుదల చేయవలసిందిగా చైనా ప్రభుత్వాన్ని కోరింది. చైనా ప్రభుత్వం నుంచి ఎప్పటిలాగే, ఈసారి కూడా ఎలాంటి ప్రతిస్పందనా లేదు.

అప్పుడు శారద, ఇప్పుడు నారద... మమత మీద మోదీ విసుర్లు

  త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్లో మోదీ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిన్న ఖరగ్‌పూర్‌లో జరిగిన ఒక భారీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోదీ అటు మమతాదీదీ మీదా ఇటు వామపక్ష కూటమి మీదా విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. మొదట్లో శారద స్కాంలో తృణమూల్‌ చిక్కుకుందనీ, ఇప్పుడేమో నారద అనే పత్రిక నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్లో పట్టుబడిందనీ ఎద్దేవా చేశారు. ఈ డబ్బంతా కూడా సామాన్య ప్రజల సొమ్మేనని గుర్తుచేశారు. తాము కేంద్రంలో అధికారాన్ని చేపట్టి రెండేళ్లు అయినా కూడా, ఇప్పటి వరకూ ఒక్క అవినీతి ఆరోపణని కూడా ఎదుర్కోలేదని ప్రకటించారు.   ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున మాట్లాడిన మమతా బెనర్జీ ఇప్పుడు ఓ మహారాణిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పశ్చిమబెంగాల్లో ఏ పరిశ్రమా పెద్దగా అభివృద్ధి చెందలేదనీ, ఒక్క బాంబుల్ని చుట్టే పని మాత్రమే బాగా జరుగుతోందని అన్నారు. ఇక కాంగ్రెస్‌- వామపక్ష కూటమిని కూడా మోదీ ఏకిపారేశారు. కేరళలో శత్రువులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆ పార్టీలు, పశ్చిమబెంగాల్లో ఎలా కలిసి పనిచేస్తాయని ప్రశ్నించారు. మోదీ ఘాటైన ఎన్నికల ప్రచారంతో, అక్కడి బీజేపీ కూడా శక్తిని పుంజుకున్నట్లైంది. మరి ఈ ప్రచారం ఏ ఫలితానికి దారితీయనుందో!

మేం లాహోర్‌లో అడుగుపెట్టాం... ఉగ్రవాదుల ప్రకటన

  అభంశుభం తెలియని చిన్నారుల మీద కసి తీర్చుకోవాలని ఎవరికి అనిపిస్తుంది. ఎవరో కూడా తెలియని పసి జీవితాలని చిదిమేయాలని ఎంతటి రాక్షసుడికైనా మనసెలా వస్తుంది. కానీ లాహోర్‌లో అదే జరిగింది. పిల్లల కేరింతలతో నిండిన ఓ పార్కులో, తాలిబాన్ చెందిన ఓ తీవ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కనీసం 60 మందన్నా చనిపోయి ఉంటారని ప్రభుత్వ అధికారుల అంచనా. కాగా ఈ దాడులకు తామే కారణం అంటూ తాలిబాన్‌ అనుబంధ సంస్థ అయిన జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ ప్రకటించింది. ఈస్టర్‌ పండుగ, అందునా ఆదివారం కావడంతో పార్కులోకి చేరిన వందలాది క్రిస్టియన్లని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది.   ‘మేం ఈ దాడి ద్వారా నవాజ్‌ షరీఫ్‌కు ఓ సందేశాన్ని పంపిస్తున్నాం. మేం లాహోరులో అడుగుపెట్టాం! ఇక మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మా ఆత్మాహుతి దళాలు ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంటాయి’ అంటూ జమాన్‌-ఉల్-అహ్రార్‌ ప్రతినిధి ప్రకటించారు. నవాజ్ షరీఫ్‌ సొంత ఊరు అయిన లాహోర్‌ను, పాకిస్తాన్‌లోనే అతి ప్రశాంతమైన నగరాలలో ఒకటిగా పేర్కొంటారు. అలాంటి కీలకస్థానంలో దాడి చేయడాన్ని ఉగ్రవాదులు తమ విజయంగా భావిస్తున్నారు. మరి ఉగ్రవాదులు విసిరిన సవాలుని, పాకిస్తాన్‌ ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో!

నేను అస్సాం టీనే అమ్మేవాడిని- మోదీ

త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలోని ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి. పదిహేను సంవత్సరాలుగా అస్సాంను ఏలుతున్న కాంగ్రెస్‌ పార్టీ, అధికారాన్ని నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, ఈసారైనా విజయతీరాలను చేరుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ప్రధానమంత్రి మోదీ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాను టీలు అమ్ముకునేటప్పుడు, అస్సాంటీని ఉపయోగించేందుకు ప్రాధాన్యతని ఇచ్చేవాడినని చెబుతున్నారు మోదీ. అస్సాం టీ జనానికి ఉత్సహం కలిగిస్తుంది కానీ, తేయాకుని విస్తృతంగా పండిస్తున్న అస్సాం ప్రజలు జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడలేదని చెప్పుకొచ్చారు.   అస్సాం ప్రజల్లో దాదాపు 20 శాతం ఉన్న తేయాకు కార్మికులు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు వారిని ఆకర్షించనున్నాయి. అస్సాంలో సహజ వనరులు ఉన్నప్పటికీ అక్కడ తాగేందుకు మంచినీటి వసతిని కూడా కల్పించలేదని, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నప్పటికీ వంట చేసుకునేందుకు గ్యాస్‌ సదుపాయం లేదని విమర్శించారు మోదీ. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అత్యంత ధనిక రాజ్యంగా ఉన్న అస్సాం ఇప్పుడు పేదరికంలో మునిగిపోయిందని వాపోయారు. ఇప్పటికీ అస్సాంలోని రెండువేల గ్రామాలకి విద్యుత్‌ సౌకర్యం కూడా లేదని వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌ పెద్దవారైపోయా

పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారి

పఠాన్‌కోట్‌ దాడులలో పాకిస్తాన్‌ జాతీయులు పాల్గొన్నారని మన దేశం నిరూపించే సమయంలో, అనుకోని ఓ వార్త వెలుగు చూసింది. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్‌ ప్రాంతంలో, ఓ భారతీయ గూఢచారిని పట్టుకున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. కుల్‌భూషణ్‌ యాదవ్‌ అనే సదరు వ్యక్తి భారతీయ గూఢచర్య సంస్థ (RAW)కు చెందినవాడన్నది పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. భారతీయ నౌకా దళానికి చెందిన ఇతను, ప్రస్తుతం RAW తరఫున పనిచేస్తున్నాడని ఆ దేశం చెబుతోంది. బెలూచిస్తాన్‌లో స్థానికుల తిరుగుబాటుకి భారతదేశం తోడ్పడుతోందని, పాకిస్తాన్‌ ఎప్పటి నుంచో విమర్శిస్తోంది.   ఇప్పుడు అదే ప్రదేశంలో ఓ భారతీయ అధికారి కూడా పట్టుబడటంతో, ఆ దేశం మరింత గట్టిగా ఆరోపించేందుకు అవకాశం చిక్కింది. కానీ మన దేశం మాత్రం పాకిస్తాన్‌ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. కుల్‌భూషణ్‌ ఏనాడో నౌకా దళం నుంచి పదవీ విరమణ చేశాడనీ, అతనికి ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. కాగా కుల్‌భూషణ్‌కు ఇరాన్ దేశం తరఫున కూడా ఒక పాస్‌పోర్టు ఉందనీ, దాని సహాయంతో అతను ఇరాన్‌ సరిహద్దుల ద్వారా పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడని అక్కడి పోలీసులు చెప్పడంతో, ఇరాన్ ప్రభుత్వాన్ని కూడా ఈ వివాదంలోకి లాగినట్లైంది.

పఠాన్‌కోట్‌కు వస్తున్న పాక్‌ బృందం

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద జరిగిన ఉగ్రదాడి గురించి పరిశోధించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఒక బృందం ఈ ఆదివారం భారత్‌కు చేరుకోనుంది. ఈ పరిశోధన బృందంలో, పాకిస్తాన్‌ నిఘా వర్గాలకు చెందిన అయిదుగురు ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 2న పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భారతీయ సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మన రక్షణ వ్యవస్థనే ఎగతాళి చేసిన ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌కు చెందినవారే అని ప్రాథమికంగా తేలింది. వీరికి జైష్‌-ఎ-మహమ్మద్‌ అనే సంస్థ కావల్సిన శిక్షణను అందించిందని బయటపడింది.   సదరు జైష్‌-ఎ-మహమ్మద్ అనే సంస్థ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా పనిచేసుకుంటోందనీ, దాని అధిపతి మౌలానా అజార్ పాకిస్తాన్‌లో రొమ్ము విరుచుకుని తిరుగుతున్నాడనీ... భారతీయ అధికారులు మండిపడుతున్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌ జాతీయులే అని చెప్పేందుకు వారి సిమ్‌కార్డులు మొదల్కొని, బూట్ల వరకు పాకిస్తాన్‌ అధికారులకు అందించినా, ఇంతవరకూ వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మౌలానా అజార్‌ను అరెస్టు చేశామని ఓసారి, గృహనిర్బంధంలో ఉంచామని మరోసారి... అసలు అతని జోలికే పోలేదని ఇంకోసారి చెబుతూ వచ్చారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి రావడంతో, ఏవో కంటితుడుపు చర్యలకు సిద్ధపడ్డారు. అందుకు అనుగుణంగా ‘గుర్తుతెలియని వ్యక్తులు’ పఠాన్‌కోట్‌ మీద దాడి చేశారంటూ ఒక ఎఫ్.ఐ.ఆర్‌ని కూడా నమోదు చేశారు. ఆ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు, ఇదిగో ఇప్పుడు భరతదేశానికి వేంచేస్తున్నారు.