రాజీవ్ హంతకుల విడుదలకు రంగం సిద్ధం!
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధిని హత్య చేసిన అభియోగంలో, జైలుశిక్షను అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేసేందుకు, తమిళనాడు ప్రభుత్వం మరోసారి పావులు కదుపుతోంది. నిందితులంతా 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారనీ, వీరిని విడుదల చేసేందుకు అనుమతించమంటూ కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఓ ఉత్తరం కూడా రాసింది. 2014లో తమిళనాడు ఇలాంటి ప్రయత్నమే చేయగా, సుప్రీం కోర్టు అడ్డుకోవడంతో అమ్మ పథకం బెడిసికొట్టింది. కాగా అతివాద తమిళుర మనసు గెల్చుకునేందుకు మరోసారి జయ ప్రభుత్వం సిద్ధపడినట్లు కనిపిస్తోంది.
తమిళనాడు విడుదల చేయాలనుకున్న ఏడుగురిలో నలుగురు శ్రీలంక తమిళురు కావడం గమనార్హం. వీరంతా 1991లో రాజీవ్ గాంధి హత్య జరిగిన కొద్ద రోజులకే అరెస్టు చేయబడి, అప్పటి నుంచి కూడా వివిధ జైళ్లలో గడుపుతున్నారు. నిందితులలో నళిని అనే మహిళా ఖైదీ, ఆమె భర్త మురుగన్ కూడా ఉన్నారు. వీరువురికీ మొదట ఉరిశిక్షను ఖరారు చేసినప్పటికీ 1999లో ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్పుచేశారు. సాక్షాత్తూ మన దేశ మాజీ ప్రధాని హత్య కేసులో వీరు దోషులైనప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీరిపట్ల సానుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. త్వరలో ఎన్నికలు రానున్న సందర్భంలో తమిళుర మనసు గెల్చుకునేందుకు జయలలిత ఈ చర్యను చేపట్టి ఉండవచ్చని విమర్శకులు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ కనుక అంగీకరిస్తే, ఆ పేరు జయలలితకు వస్తుంది. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తే, చెడ్డపేరు కాస్తా కేంద్రానికే అంటుకుంటుంది.