మూత్రపిండాలలో పేరుకున్న విషాలు తొలగాలంటే  ఇదిగో ఈ పండ్లు తినాలి..!

    మానవ జీవనశైలి రోజురోజుకూ దిగజారిపోతోంది.   జీవనశైలి మారిన కారణంగా  చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం కారణంగా, జీవనశైలి కారణంగా శరీరంలో మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలు కూడా కలుషితం అవుతుంటాయి.  ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోతే చాలా కష్టం. మూత్రపిండాలలో పేరుకున్న విషపదార్థాలు తొలగించుకోకపోతే   మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, మూత్రపిండాలలో రాళ్లు పేరుకోవడం,  మూత్ర పిండాలు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి.  అలా కాకుండా మూత్రపిండాలలో పేరుకున్న విష పదార్థాలు తొలగిపోవాలంటే.. ఈ కింద చెప్పుకున్న పండ్లు తప్పనిసరిగా తినాల్సిందే.. పుచ్చకాయ, బ్లాక్‌బెర్రీస్, నిమ్మకాయ, యాపిల్,  క్రాన్‌బెర్రీ వంటి పండ్లు కిడ్నీలను చాలా వేగంగా శుభ్రపరుస్తాయని వైద్యులు, ఆహార నిపుణులు  పేర్కొంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గుతుంది. పండ్లు కిడ్నీలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. పుచ్చకాయ: ఈ పండులో 92% నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది టాక్సిన్స్ ను బయటకు పంపడమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నిమ్మకాయ: నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్,  విటమిన్ సి ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. యాపిల్: యాపిల్‌లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్,  వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. నేరేడు: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నేరేడు కిడ్నీలకు బాడీగార్డ్ లాగా పనిచేస్తంది. ఇందులో ఉండే తక్కువ పొటాషియం స్థాయి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కిడ్నీ కణాలను రక్షిస్తుంది. క్రాన్‌బెర్రీ: యూటీఐ నివారణకు క్రాన్‌బెర్రీ మంచి పండు. దీని వినియోగం అనేక విధాలుగా మూత్రపిండాల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. పైనాపిల్: పైనాపిల్ బ్రోమెలైన్ రిచ్ తక్కువ పొటాషియం పండు. బ్రోమెలైన్  అనేది ఒక ఎంజైమ్, ఇది వాపును తగ్గిస్తుంది. పండ్లు ఎప్పుడు తినాలి? ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమతుల్య ఆహారంలో భాగంగా  పండ్లను ప్రతిరోజూ అల్పాహారంగా తీసుకోవచ్చు. రోజూ ఒక మీడియం కప్పు పండ్లను తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది. జాగ్రత్త.. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పండ్లను తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని తీసుకునే ముందు  వైద్యుడిని తప్పకుండా సంప్రదించిన తరువాతే తినాలి.                                  *రూపశ్రీ.

తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే కలిగే లాభాలు ఇవే..!

  తేనె సహజమైన తియ్యని పదార్థం.  దీన్ని సంస్కృతంలో మధు అని పిలుస్తారు.  ఆయుర్వేదం తేనెను గొప్ప ఔషదంగా పేర్కొంది. తేనెను  ప్రతి రోజూ తీసుకుంటే చాలా రకాల వ్యాధులు నయం అవుతాయి.  తేనెలో సహజమైన చక్కెరలు ఉండటం మూలాన ఇది శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ఇక డ్రై ఫ్రూట్స్ గురించి అందరికీ తెలిసిందే.. డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తిని, ఆరోగ్యకరమైన కొవ్వులను ఇస్తాయి.  డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దీర్ఘకాల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.  అలాంటి డ్రై ఫ్రూట్స్ ను తేనెలో నానబెట్టి తింటే శరీరానికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయట. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాు పుష్కలంగా ఉంటాయి.  తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టైతే అలాంటి వారు తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తినాలి.  ఇది చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో సహాయపడుతుంది.  ప్రతి రోజూ కనీసం ఒక స్పూన్ తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినాలి. తేనె, డ్రై ఫ్రూట్స్ రెండూ శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి.  అలసిపోయినప్పుడు తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే అలసట నుండి ఉపశమనం పొందవచ్చు.  నీరసంగా అనిపించినా, అలసటగా ఉన్నా,  శరీరంలో శక్తి లేనట్టు అనిపించినా తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది, తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  జీర్ణ శక్తి బలహీనంగా ఉన్నవారు తేనెలో నానబెట్టిన డ్రై ప్రూట్స్ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది అమృతంతో సమానమైన ఔషధంగా పనిచేస్తుంది.                                                     *రూపశ్రీ.

ఈ సమస్యలున్న వ్యక్తులు చాయ్ తాగడం డేంజర్ తెలుసా?

చాయ్..  భారతీయులకు ఎమోషన్. పట్టణాలలో టీ దుకాణాలలో టీ ఎప్పుడూ ఉడుకుతూనే ఉంటుంది.  దానికి తగ్గట్టు ప్రజలు కూడా టీని అమృతంలాగా జుర్రుకుని తాగుతుంటారు. కొందరికి టీ తాగకపోతే అసలు ఏ పని చేయాలని అనిపించదు. ఇక కష్టపడి పనిచేసేవారు బద్దకం, నిద్ర వదిలి శరీరం చురుగ్గా ఉండటం కోసం రోజులో చాలా సార్లు టీ తాగుతుంటారు. టీ అనేది రుచినే కాదు.. మితంగా తాగితే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. టీ లో ఉన్న రకాలు.. ఫ్లేవర్ లు టీని మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేలా చేస్తాయి. కానీ కొన్ని సమస్యలున్న వారు టీ తాగడం అస్సలు  మంచిది కాదట.  ఇంతకీ టీ ని ఎవరు తాగకూడదో తెలుసుకుంటే.. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్న వ్యక్తులు టీ తీసుకోవడం మంచిది కాదట.  టీ లో ఉండే కెఫిన్ కంటెంట్ యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను ఇంకా ఎక్కువ చేస్తుంది. కడుపులో ఏర్పడే యాసిడ్లు అధికం అయ్యి అవి ఛాతీ వరకు వచ్చి ఛాతీలోనూ, గుండెల్లోనూ మంట పెడుతుంటాయి.  ఈ సమస్యను యాసిడ్ రిఫ్లక్స్  అంటారు.  ఈ సమస్య ఉన్నవారు చాయ్ తాగితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. గర్భం దాల్చిన మహిళలు టీకి దూరంగా ఉండటమే మంచిదట.  టీలో కెఫీన్ ఉంటుంది.  దీన్ని గర్భవతులు తాగితే కెఫీన్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కెఫీన్ పానీయాలు కడుపులో బిడ్డ మీద కూడా  ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే పుట్టే బిడ్డ జుట్టు రాగి రంగులో ఉంటుంది. అంతేనా.. గర్భవతులు చాయ్ ఎక్కువ తీసుకుంటే శరీరం ఐరన్ గ్రహించే శక్తిని కోల్పోయి రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే ఐరన్ లోపం ఉన్నవారు టీని తీసుకోకపోవడం మంచిది. టీ లో ఉండే కెఫీన్, టానిన్ లు శరీరంలో ఐరన్ శోషణకు అంతరాయం కలిగిస్తాయి. రక్తహీనత సమస్యను మరింత పెంచుతాయి. మధుమేహం ఉన్నవారు టీని తీసుకోవడం  మంచిది కాదు. సాధారణంగా టీలో తీపి ఉంటేనే దాని రుచి మెరుగ్గా ఉంటుంది.  టీలో చక్కెర, బెల్లం వంటివి జోడించినవి తీసుకుంటే మధుమేహం సమస్య పెరుగుతుంది.  బెల్లం తో చేసిన టీ అయినా రోజూ తాగుతూ ఉంటే ప్రమాదం. 12 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న పిల్లలు టీలోని కెఫీన్ కంటెంట్ వల్ల ఏకాగ్రత విషయంలో డిస్టర్బ్ అవుతారు. ఇది చదువులోనూ, నిద్రలోనూ ఆటంకం కలిగిస్తుంది. *రూపశ్రీ.  

సంబరాల సంక్రాంతితో ఆరోగ్యం..!

సంక్రాంతి భారతీయులు జురుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ప్రముఖంగా రైతుల పండుగ.  క్రాంతి అంటే  స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. సంక్రాంతి అంటే.. కొత్త క్రాంతి.. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో వెలుగులీనుతాడు.  క్రమంగా తన వెలుగును పెంచుకుంటూ వెళతారు. సూర్యుడిలానే ప్రజలు కూడా కొత్త కాంతితో తమ జీవితాలలో ముందుకు సాగాలన్నదే సంక్రాంతి సందేశం.  సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది.  సూర్యుడి కాంతి ద్వారా భూమి వెలుగులో సంచరిస్తుంది.  ఉత్తరాయణం ప్రారంభం అయితే సూర్యుడి గమనం వేగం అవుతుంది. సూర్యుడి గమనం వల్లనే  ఈ ప్రపంచం ఇలా ఉంది. సూర్యుడి గమనం లేకపోతే ఈ ప్రపంచం అంధకారం అవుతుంది.  అందుకే సూర్యుడి విలువను, సూర్య కాంతి విలువను అర్థం చేసుకోవాలి. సంక్రాంతి అంటే 'పరివర్తనం' అని అర్థం. మకర సంక్రాంతి రోజున  'మహా-స్నాన-యోగం' జరుగుతుందట. నదులు,  సరస్సులలో ముఖ్యంగా పవిత్ర నదుల సంగమం వద్ద స్నానం చేయడం చాలా మంచిది. మకర సంక్రాంతి పంటల పండుగ కూడా. శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నువ్వులతో చేసిన సాంప్రదాయ స్వీట్లు సంక్రాంతి ప్రత్యేకం.  పొంగలి కూడా సంక్రాంతి ప్రత్యేక వంటకం. దీని పేరు మీదనే ఈ పండుగకు పొంగల్ అనే పేరు కూడా వచ్చింది. సంక్రాంతి పండుగ పంటల పండుగ.  పంటలు పండాలంటే ఆ సూర్య రశ్మి చాలా అవసరం.  ఈ కారణంగానే రైతులతో పాటు దేశం యావత్తూ సూర్యుజిని సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరాధిస్తుంది.  ఉత్తరాయం ప్రారంభానికి సూచనగా, సూర్యుడి గమనానికి ప్రాధాన్యత ఇస్తూ రథం ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే.. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.  అది కూడా నీరు పారే ప్రాంతాలు, నదులలో అర్ఘ్యం సమర్పించడం మంచిది.   ఏ నదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పిస్తారో.. ఆ నదీ దేవతకు ప్రార్థిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి పండుగ రోజున సన్యాసులు, పేదలకు దానం చేయడం మంచిది. అలాగే ఈ పండుగ రోజు వండే వంటల్లో ఉల్లి వెల్లుల్లిపాయలను అస్సలు తినకూడదు.                               *రూపశ్రీ.  

శీతాకాలంలో జలుబు, దగ్గు, సైనస్ కు చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కాలు..!

  చలికాలం చాలా రకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకు వస్తుంది. చలిగాలులు, మంచు కారణంగా తొందరగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. ఇక ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారు చలికాలం వల్ల చెప్పలేనంత ఇబ్బంది పడతారు. కొందరికి చలి కారణంగా ఛాతీ పట్టేయడం,  ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. చలి గాలులు చెవిలోకి వెళ్లి తలనొప్పి కూడా వచ్చేలా చేస్తుంది.   ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, వీటి నుండి బయటపడాలన్నా,   ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. పసుపు పాలు.. పసుపును కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ సమస్యల  నివారణకు ఉపయోగిస్తున్నారు.  పసుపులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  కొద్దిగా పసుపును పాలలో వేసి మరిగించాలి.  ఇందులో రుచి కోసం అల్లం, మిరియాలు కూడా వేసుకోవచ్చు.  ఈ పసుపు పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.  జలుబు కారణంగా ఏర్పడిన ముక్కుల రద్దీని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హనీ, జింజర్ టీ.. అల్లం, తేనె రెండూ ఆయుర్వేదంలో మంచి ఔషధాలు.  రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం, తేనె పని చేస్తాయి. అల్లాన్ని దంచి లేదా సన్నని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించాలి.  మరిగిన తరువాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతుకు మంచి  ఉపశమనం ఇస్తాయి. అల్లం శ్వాస కోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవిరి.. ఆవిరి పట్టడం చాలా మంచి టిప్.  జలుబు, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, తల నొప్పి, తల భారం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గిన్నెలో నీటిని బాగా మరిగించాలి.  బాగా వేడెక్కిన నీటిలో కొన్ని చుక్కల నీలగిరి తైలం వేసుకుని నీటి ఆవిరి పట్టాలి. ఇది తల భారం తగ్గిస్తుంది,  ముక్కల రద్దీని తగ్గిస్తుంది. శ్వాస నాళాలను క్లియర్ చేస్తుంది. పుక్కిలించడం.. గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం కూడా మంచి మార్గం.  గోరు వెచ్చని నీటిలో కాసింత ఉప్పు వేయాలి.  ఈ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. నీరు గొంతును క్లీన్ చేసేలా పుక్కిలించాలి.  ఇది నోట్లో, గొంతులో ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది. నాసల్ డ్రాప్స్.. ఆయుర్వేదంలో నాసల్ డ్రాప్స్ ఉన్నాయి.   దీన్ని అను తైలం అని పిలుస్తారు. ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకోవడం వల్ల ముక్కుల రద్దీ తగ్గుతుంది.  సాధారణంగా ఏ టిప్ వాడినా ముక్కులు తాత్కాలికంగా రిలీఫ్ అయ్యి తరువాత మళ్లీ రద్దీ అవుతాయి. కానీ ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. హెర్బల్ టీ..   నల్ల మిరియాలు, అతి మధురం,  తులసి వంటి ఆయుర్వేద మూలికలతో చేసిన హెర్బల్ టీని తయారు చేసుకుని ఈ చలికాలంలో తీసుకుంటే భలే పనిచేస్తుంది.  ఇది దగ్గు, జలుబు,  రద్దీగా ఉన్న ముక్కులను తెరవడం, దగ్గు, కఫం సమస్యను తగ్గించడం చేస్తుంది.                                                   *రూపశ్రీ.

ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావడం లేదా? ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!

  నిద్ర మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు.  మంచి నిద్ర ఉంటే  శరీర ఆరోగ్యం చాలా వరకు సాఫీగా ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రవ్వగానే హాయిగా నిద్రపోవాలని అనుకుని, పడుకుని నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కాలయాపన చేసేవారు.. నిద్రరాక గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ ఆలోచనలలో గడిపేవారు చాలా మంది ఉంటున్నారు. కొందరైతే నిద్ర  బాగా రావాలని పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు కూడా తాగుతుంటారు. అయితే ఇలా నిద్ర రాకపోవడం అనేది సాధారణంగా కొట్టే పడేయాల్సిన విషయం కాదట. ఇలా నిద్ర రాకపోవడం అనేది కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందని అంటున్నారు.   నిద్రలేమి వివిధ కారణాల వల్ల సంభవించినా.. దీర్ఘకాలం ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే మాత్రం అది కొన్ని తీవ్రమైన వ్యాధుల వల్ల జరుగుతుంది. నిద్ర లేమి అనేది చాలా వరకు డిప్రెషన్ తో బాధపడేవారికి ఎదురయ్యే సమస్య.  డిప్రెషన్ కారణంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చాలామంది ఈ కాలంలో అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి.   కొందరిలో స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటుంది.  ఇది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే వ్యాధి.  దీని వల్ల శ్వాస సరిగా ఆడక మళ్లీ మళ్లీ నిద్ర మధ్యలో మేల్కొంటు ఉంటారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే అది జీవక్రియను ప్రభావితం చేస్తుంది.  జీవక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీర వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య కలుగజేస్తుంది. ఆర్థరైటిస్,  మైగ్రేన్ లేదా ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా సరిగా నిద్ర పోలేరు. ఈ వ్యాధుల కారణంగా  నిద్రలో పదే పదే మెలకువ వస్తుంది.  ఈ సమస్యలు ఉన్నవారిలో నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి. అధికంగా ఆల్కహాల్,  కెఫీన్ పానీయాలు తీసుకునే వారు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలవాట్లు ఉన్నవారు రాత్రి సమయంలో సరిగా నిద్రపోలేరు.                                           *రూపశ్రీ.

మెదడుకు అమృతం లాంటి ఆహారం ఇది..!

  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం సరిపడినంత తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆహారం నుండే శరీరానికి కావలసిన పోషకాలు,  విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అయితే కొన్ని ఆహారాలకు ప్రత్యేకత ఉంటుంది.  కొన్ని గుండెకు మేలు చేస్తాయి.  కొన్ని కండరాలకు మేలు చేస్తాయి.  కొన్ని కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇలా మేలు  చేసే ఆహారాలలో మెదడుకు మేలు చేసే ఆహారాలు ముఖ్యమైనవి.  మెదడు పనితీరు బాగుండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మెదడు లేదా అని ఆంటుంటారు. అంటే.. మంచి ఆలోచనలకు,  జ్ఞాపకశక్తికి, శరీర కార్యకలాపాలకు మెదడు శక్తివంతంగా ఉండటం అవసరం. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, మెదడు పనితీరు బావుండాలన్నా మెదడుకు  శక్తిని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. మెదడుకు అమృతంతో సమానమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకంటే.. వాల్ నట్,  బాదం.. వాల్ నట్, బాదం పప్పులు మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.  వాల్ నట్ లలోనూ,  బాదం లోనూ అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మానసికంగా బలహీనంగా ఉన్నా,  జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నా,  ఆలోచనా పనితీరు, మెదడు చురుగ్గా ఉండాలన్నా వాల్ నట్ లు, బాదం పప్పులు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదట. వాల్ నట్ లు బాదం పప్పులలో విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.  ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలో నరాల పనితీరు బాగుండాలంటే నాడీ వ్యవస్థ బాగుండాలి. నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలి.  నాడీ కణాలకు పోషణ ఇవ్వడం ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో వాల్ నట్స్, బాదం పప్పులు సహాయపడతాయి. వాల్ నట్స్,  బాదం పప్పులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి వయసుతో పాటు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాల్ నట్స్ లో మెలటోనిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా  అవసరం.  నిద్రను మెరుగుపరచడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు కణాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. వాల్ నట్స్ లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, బాదం పప్పులో ఉండే పొటాషియం మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.                                                  *రూపశ్రీ.

హెచ్ఎంపీవీ వైరస్.. మళ్లీ భయపెడుతున్న వైరస్ దాడులు.. ఇది ఎవరికి ఎక్కువ ప్రమాదం తెలుసా?

  హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్ చైనా నుండి మొదలైంది. ఇది కొత్తగా పుట్టినదేమీ కాదట.  ఇది ఆరు దశాబ్దాల నుండి ఉనికిలో ఉంది.  శాస్త్రవేత్తలకు గత 25 సంవత్సరాలుగా దీని గురించి తెలుసు. ఇది ఆర్‌ఎన్‌ఏ వైరస్.  అందుకే ఇది సజీవంగా ఉండటానికి సహజంగా పరివర్తన చెందుతూ ఉంటుంది. నివేదికల ప్రకారం హెచ్ఎంపీవీలో  కొత్త మ్యుటేషన్ కూడా సంభవించింది.  దీని కారణంగా చైనాలో  కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీడియా నివేదికలు,  వీడియోలు చైనాలోని ఆసుపత్రులు శ్మశానవాటికలకు భారీ సంఖ్యలో జనాలను తరలించడం చూపించాయి. ఈ వార్తలు చూస్తుంటే చైనా నుండి మరో అంటువ్యాధి కరోనా మాదిరిగా  ప్రపంచమంతటా వ్యాపిస్తుందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి.  ప్రజలు ఇంకా కరోనా నుండి సరిగ్గా కోలుకోలేదు.  కానీ అప్పుడే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోంది.  ఇది ప్రజలను కలవరపెడుతోంది.  అన్నింటిలో మొదటిది దేశంలో వైరస్ వ్యాప్తి కారణంగా  ఆసుపత్రులు,  శ్మశానవాటికలలో రద్దీని పెంచిందని చైనా నుండి వార్తలు వచ్చాయి. పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని గుర్తించారు. చైనా తర్వాత ఇతర దేశాలలో కూడా హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతోంది. సోమవారం (డిసెంబర్ 6), ఈ అంటు వ్యాధి మొదటి కేసు భారత్ లో కూడా నమోదైంది ఈ వైరస్ గురించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ కరోనా వైరస్‌తో సమానంగా ఉంటుందట.  దాని లక్షణాలు కరోనా కంటే కొంచెం ఎక్కువ లేదా కరోనా కంటే కొంచెం తక్కువ తీవ్రతతో ఉంటాయట.  కరోనా మాదిరిగానే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కూడా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ప్రజలు జలుబు,  శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారట.                                                 *రూపశ్రీ.

జబ్బులు ఎందుకొస్తాయంటే...

అనారోగ్యం రావడానికి కారణం ఏంటి?? ఆలోచిస్తే.. సరియైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానము లేనివారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయాల్లో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంటుంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలే అనే అపోహతో కొందరు, పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అనే అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు.  కొన్ని జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా ఆ జబ్బు మాత్రం వేరేగా ఉంటుంది. ఇలాంటి సమస్యను దృవీకరించాల్సింది వైద్యులు తప్ప మనం కాదు కదా.. కానీ చాలామంది ఇదిగో ఇదే నాకు వచ్చిన సమస్య అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు.  ఏ వ్యాధి అనే విషయం తెలుసుకోకుండా పైన కనుపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవటం వల్ల వ్యాధి తగ్గకపోగా కొన్ని సమయాలలో వాడబడిన మందులవల్ల శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులల్లో ఇలాంటి దుష్పరిణామాలను నివారించటం వైద్యులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మందులనేవి స్వయంగా వాడుకోవటం చాలా చెడ్డ అలవాటు. ప్రస్తుతకాలంలో అందరూ ఓ అలవాటుగా సేవించే కాఫీ,టీ, లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవే..  వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహము కలుగవచ్చు కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభకరమైందికాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునేవారికి కొంతకాలమైన తరువాత  అవి తీసుకోకపోతే నిస్సత్తువ, చిరాకు, పనులమీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల నాడీ బలహీనత సమస్య ఎదురై, నిత్యం తలనొప్పితో బాధ పడటం జరుగుతుంది. ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వ్యాదులకు లోనయ్యే ప్రమాదముంది. గుండెవ్యాధులు, కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు రావడానికి ధూమపానం వాడకాలు ముఖ్యమని చెప్పాలి. సిగరేట్, చుట్ట, బీడీ లాంటివి త్రాగటంవల్ల ఆ పొగను కొంత బైటికి వదలటం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. పొగాకు పొగత్రాగే వారికెంత హానికరమో, బైటగాలిలో వదలిన పొగను వారికి తెలియకుండా పీల్చే వారికి కూడా అంతే హానికరంగా పరిణమిస్తుంది. పొగాకు నమలటం, జరదా కిళ్ళీలు వేయటం వల్ల కూడా హృద్రోగాలు, కాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని దాని కారణంగా కాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటివి సంభవిస్తుంటాయి. పొగాకు నమిలేవారికి నోరు, పళ్ళు, గొంతు, స్వరపేటికలకు సంబంధించిన తీవ్రవ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువ. మన శరీరానికి జబ్బు తెచ్చిపెట్టే కొన్ని అలవాట్లు గమనిస్తే… ప్రతిరోజు స్నానం చెయ్యకుండా ఉండటం మొదటి అలవాటు. శరీర శుభ్రత లేకపోతే జబ్బులు రావడానికి మొదటి మార్గం మనమే ఇచ్చినట్టు. క్రమబద్దము లేని భోజనము చేయడం. రోజుకొక వేళలో భోజనం చేయడం వల్ల శరీరం ఏ సమయానికి శక్తిని తయారు చేసుకోవాలో నిర్ణయించుకోలేదు.   అధికంగా ఉపవాసములు చేయడం పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. నిజానికి ఉపవాసం అనేది కూడా ఆరోగ్య ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిందే అయినా దాన్ని అతిగా పాటిస్తే శరీరానికి నష్టం చేకూరుతుంది.  బయట తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. అలాగే శీతల పానీయాలు, చల్లని పదార్థాలు తినడం కూడా నష్టమే.   ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఫుడ్ చెడిపోకుండా వాయువులు నింపుతారు కాబట్టి వాటిని తిన్నా అనారోగ్యం వెంట వస్తున్నట్టే.. చాలామంది శారీరక సమస్యల విషయంలో సంకోచం చెందుతారు. కానీ అతిగా శృంగారంలో పాల్గొనడం ఎంత చేటు చేస్తుందో.. అసలు శృంగారం జోలికి పోకుండా సన్యాసిలా బ్రతకడం ఈకాలంలో అంతే చేటు చేస్తుంది.   ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు నోరు శుభ్రంగా లేకపోతే జబ్బులు వస్తాయి.  సౌకర్యవంతమైన దుస్తులు కాకుండా ఫ్యాషన్ పేరుతో బిగుతుగా ఉన్నవి ధరించడం. శరీరంలో అవయవాల ఒత్తిడికి కారణమై తద్వారా వాటి క్రమబద్ధత తప్పేలా చేస్తుంది. ఆకుకూరలు–పౌష్టికాహారములు వాడకుండా ఉండటం కూడా అనారోగ్యానికి మూలకారణమే. మన శరీరానికి అనారోగ్యం దాపురించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి చూడండి.                                     ◆నిశ్శబ్ద.  

మీకు తెలుసా? ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్ ను స్లో గా పెంచేస్తాయ్..!

  యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే ఒక వ్యర్థ పదార్థం.  శరీరంలో ప్యూరిన్స్ అనే రసాయనాలు ప్రాసెస్ అయినప్పుడు లేదా అవి విచ్చిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.  సాధారణంగా శరీరంలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ రక్తంలో కరికి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది శరీరంలో పేరుకుపోతుంది.  ఇలా పేరుకుపోవడం వల్ల శరీరంలో ఎముకలు దెబ్బతింటాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ సమస్య కూడా వస్తుంది. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాపకింద నీరులా శరీరంలో పెరిగిపోతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. గొడ్డు మాంసం.. గొడ్డు మాంసం చాలా మంది తింటుంటారు.  అలాగే గొర్రె మాంసం అధికంగా తింటారు. ఇక పంది మాంసం విదేశాలలో ఎక్కువగా తింటారు.  ఈ మాంసాలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిల ఉత్పత్తి దారుణంగా పెరుగుతుంది.  యూరిక్ యాసిడ్ సమస్య ఇప్పటికే ఉన్నవారు పైన చెప్పుకున్న మాంసాలకు దూరంగా ఉండటం మంచిది. సముద్ర ఆహారాలు.. సముద్ర ఆహారాలలో ప్రోటీన్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయని చెబుతారు. అయితే సముద్ర చేపలు, జీవులు అయిన మాకేరెల్,  ఆంకోవీస్ వంటి సముద్ర చేపలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. షుగర్ డ్రింక్స్.. అధికంగా ప్రక్టోజ్ కలిగిన కార్న్ సిరప్ తో తయారు చేసే శీతల పానీయాలు, ఇతర పానీయాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.  ఈ చక్కెర పానీయాలు కేవలం యూరిక్ యాసిడ్ స్థాయినే కాకుండా మధుమేహం పెరగడానికి,  ఊబకాయానికి కూడా కారణం అవుతాయి. ఆల్కహాల్.. ఆల్కహాల్ తాగే అలవాటు రోజురోజుకూ ఎక్కువ అవుతూందని చెప్పవచ్చు.  ఆల్కహాల్ తాగడం అనేది ఫ్యాషన్ లో భాగం అయిపోయింది. బీర్ తో సహా ఇతర ఆల్కహాల్ పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను చాలా పెంచుతాయి. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు చాలా ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ స్థాయి వల్ల జరిగే ప్రమాదం ఎక్కువ  ఉంటుంది. ప్రాసెస్ ఫుడ్స్.. ప్రాసెస్ చేసిన ఆహారాలలో శుద్ది చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.  అలాగే శుధ్ది చేసిన చక్కెరల వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడంలో పనిచేస్తాయి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలామంచివి.  వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్, విటమిన్-డి లభిస్తాయి. అయితే పుట్టగొడుగులలో మితంగా ప్యూరిన్ లు ఉంటాయి. పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగుతాయి. కాలీఫ్లవర్.. కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన సీజనల్ కూరగాయ.  ఇందులో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కాలీఫ్లవర్ ను తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు మరింత పెరుగుతాయి.  అంతేకాదు.. ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు కాలీఫ్లవర్ కు దూరంగా ఉండాలి.                                         *రూపశ్రీ.  

నిద్రకు ముందు దాల్చిన చెక్క, అల్లం కలిపి టీ తయారు చేసుకుని తాగితే..!

  ఆరోగ్యకరమైన అలవాట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  దీని కోసం చాలామంది ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు చాలా రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తారు. వీటిలో ఉదయాన్నే వేడి నీరు తాగడం తో మొదలుపెట్టి రాత్రి పడుకునే ముందు ఏదో ఒక పానీయంతో ముగిస్తారు. రాత్రి సమయంలో చాలామంది పసుపు పాలు తాగడం,  త్రిఫల జ్యూస్,  ఉసిరి జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవన్నీ జీర్ణశక్తికి,  రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.  అలాంటి వాటిలో దాల్చిన చెక్క, అల్లం తో తయారు చేసిన టీ కూడా ఒకటి.  ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అల్లం, దాల్చిన చెక్క కలిపి  తయారు చేసిన టీ తాగితే ఏమవుతుందంటే.. దాల్చిన చెక్క, అల్లం రెండూ చాలా ఆహ్లాదకరమైన గుణాలు కలిగి ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా శరీరానికి విశ్రాంతి ఇస్తాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.  నిద్రకు ఒక 30 నిమిషాల ముందు ఈ టీని తాగడం వల్ల  రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు. అల్లం జీర్ణశక్తికి పేరుగాంచింది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క కూడా అలాగే సహాయపడుతుంది. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు కడుపు భారం తగ్గడానికి, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రకు ముందు తాగితే  ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయంలో అల్లం, దాల్చిన చెక్క టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అల్లంలోనూ, దాల్చిన చెక్కలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ప్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.  ముఖ్యంగా దాల్చిన చెక్క మధుమేహం ఉన్నవారికి గొప్ప వరం కంటే తక్కువ కాదు.  దీన్ని రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు నియంత్రణలోనే ఉంటాయి. అంతేకాదు ఈ టీని రాత్రి సమయంలో తాగడం వల్ల రాత్రి పూట నిద్ర మధ్యలో ఆకలి వేయడం,  రాత్రి సమయంలో బయటి ఆహారాలు,  ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినాలనే కోరిక తగ్గుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యతో బాధపడుతూ ఉంటే దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా  శీతాకాలంలో ఈ టీని తాగడం వల్ల చాలా మంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉన్నవారికి చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇప్పటి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటారు.  అల్లం, దాల్చిన చెక్క రెండూ జీర్ణక్రియను వేగవంతం చేసేవే. ఈ రెండూ కలిపి తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొన్ని రోజులలోనే మార్పు తెలుస్తుంది.                                        *రూపశ్రీ.

చలికాలంలో సాసువ ఆకు లేదా ఆవాల ఆకు తినాలని చెప్పేది ఇందుకే..!

ఆహారం శరీరానికి చాలా మేలు చేస్తుంది.  సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి జబ్బులు అయినా తగ్గుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అందుకే సీజన్ కు తగ్గట్టు ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతుంటారు.  చలికాలంలో సాసువ ఆకు లేదా ఆవాల ఆకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. ఆవాలు చెట్టు నుండి లభించినప్పుడు దాని మీద పొట్టు కూడా తీయకుండా పసుపు రంగులో ఉంటే వాటిని సాసువలు అంటారు.  ఇక ఆవాల గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.  ఈ ఆవాలు పండే మొక్కల ఆకులను ఆహారంలో తీసుకుంటారు.  ఇప్పట్లో చాలా మంది ఈ ఆకుల వినియోగం తగ్గించారు కానీ పెద్దల కాలం నాడు ఈ ఆకులను వంటల్లో వినియోగించేవారు.  ఆవాల చెట్టు ఆకులను ఆహారంలో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. పోషకాలు.. ఆవాల మొక్క ఆకులలో  విటమిన్-ఎ,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  కాల్షియం,  మెగ్నీషియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. ఆవాల మొక్క ఆకులను ఆహారంలో తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.  చలికాలంలో సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.  జీర్ణక్రియ మెరుగ్గా ఉండటానికి ఆహారంలో ఆవాల మొక్క ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మోషన్ సాఫీగా జరగడంలో సహాయపడుతుంది. ఆవాల మొక్క ఆకులలో అమైనో ఆమ్లాలు,  ఫైబర్ సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఈ ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  శరీరలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. ప్రోటీన్లు, విటమిన్లు సమృద్దిగా ఉండటం వల్ల ఆవాల మొక్క ఆకులు తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గడం నుండి జుట్టు ఆరోగ్యంగా పెరగడం వరకు అన్ని రకాలుగా జుట్టుకు మేలు చేస్తుంది. ఆవాల మొక్క ఆకులలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో తీసుకుంటే ఉంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. ఈ  కారణంగా ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఆవాల మొక్క ఆకులు చాలా మేలు చేస్తాయి. ఆవాల మొక్క ఆకులు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.  శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఇది వేడి చేసే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆకులు  ఆహారంలో తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.                                   *రూపశ్రీ.

యూరిక్ యాసిడ్ కు, కీళ్ల నొప్పులకు 15రోజుల్లో చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కా..!

  యూరిక్ యాసిడ్ నేటి కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్-రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు ఏర్పడే పదార్థం. ఇది రక్తంలో పేరుకుపోతుంది.  శరీరం నుండి తొలగిపోనప్పుడు  ఇది కీళ్లలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది.  దీని కారణంగా  ఆర్థరైటిస్,  మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవడానికి అనేక వైద్య  చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి.  అయితే ఆయుర్వేద  చిట్కాల ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు. యూరిక్ యాసిడ్‌ తగ్గించడానికి  అల్లోపతి ఔషధాల కంటే ఆయుర్వేద మందులు మెరుగైన ఫలితాలను ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో యూరిక్ యాసిడ్ ను,  కీళ్ల నొప్పులను 15రోజులలో తగ్గించే ఆయుర్వేద ఔషధం గురించి తెలుసుకుంటే.. కావలసిన పదార్థం.. వాము.. 1టీ స్పూన్ తురిమిన అల్లం.. 1టీ స్పూన్ తయారీ విధానం.. రెండు గ్లాసుల నీటిలో ఒక చెంచా వాము,  ఒక స్పూన్  తురిమిన అల్లం వేసి బాగా ఉడికించాలి.  రెండు గ్లాసుల నీరు కాస్తా  ఒక గ్లాసుగా  మిగిలే వరకు ఉడకబెట్టాలి. ఈ నీళ్ళను వడగట్టాలి. ఎప్పుడు తాగాలి.. వాము గింజలు,  అల్లం ఉడికించిన నీళ్లను ఉదయాన్నే తాగాలి.  దీన్ని ఉపయోగించడం ద్వారా  కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను పొందవచ్చు. ఇది ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన  ఔషధం అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.  15రోజులు ఈ ఔషధాన్ని ఉపయోగించిన తర్వాత యూరిక్ యాసిడ్ స్థాయి పరీక్షిస్తే యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గడాన్ని గమనించవచ్చు.  దీన్ని 15 రోజుల కంటే ఎక్కువ వాడుతుంటే యూరిక్ యాసిడ్ సమస్య పూర్తీగా తగ్గిపోతుందని అంటున్నారు.                                  *రూపశ్రీ.  

ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకుంటే ఇన్ని షాకింగ్ ఫలితాలు ఉంటాయని తెలుసా?

  నిమ్మరసం భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం.  నిమ్మరసాన్ని వంటల్లో మాత్రమే కాకుండా రిఫ్రెషింగ్ డ్రింక్స్ లోనూ,  డిటాక్స్ డ్రింక్స్ లోనూ ఉపయోగిస్తారు.  నిమ్మరసాన్ని భారతీయ సంప్రదాయ వంటల తయారీలోనూ ఉపయోగిస్తారు.  నిమ్మరసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నిమ్మరసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.   నిమ్మరసం సిట్రస్ జాతికి చెందిన పండు.  దీన్ని పండు అని పిలుస్తామే కానీ నేరుగా దీన్ని తినలేము.  చాలా పుల్లగా ఉండే నిమ్మరసాన్ని పానీయాలలోనూ,  వంటల్లోనూ పులుపు కోసం జోడించుకుంటారు.  ఇక నిమ్మకాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగాలి.  ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  ఇది మలబద్దకం, అజీర్ణం సమస్యలను కూడా తొలగిస్తుంది.  గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి.  శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి.  ప్రతి ఒక్కరి శరీరంలో టాక్సిన్లు ఉంటాయి.  ఇవి ఆహారం, తాగే పానీయాలు, నీరు,  వాతావరణం కారణంగా శరీరంలో చేరతాయి.  ఈ టాక్నిన్లను తొలగించుకోవాలంటే డిటాక్స్ వాటర్ తాగాలి. డిటాక్స్ వాటర్ తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది.  అందుకోసం ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి.  ఇలా చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు,  వ్యర్థాలు అనబడే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. నిమ్మకాయలో విటమిన్-సి ఉంటుందనే విషయం తెలిసిందే.  ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.  రోజూ నిమ్మరసం కలిపిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి బలపడి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది.  నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు శరీరానికి చురుకుదనం ఇస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు.. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  శరీరంలో ఉండే అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది.  ఇది బరువు తగ్గాలని అనుకునేవారికి చాలా మంచి పానీయం.  నిమ్మరసం కలిపిన నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులలోనే బరువు విషయంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. నిమ్మకాయలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది.  ఎలాగంటే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  రక్తపోటు ఎక్కువైన సందర్బాలలోనే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.  అందుకే నిమ్మరసాన్ని అధిక రక్తపోటు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారికి కూడా నిమ్మరసం మంచిది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.                                        *రూపశ్రీ.  

విటమిన్-డి లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

  శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల విటమిన్లు,  ఎంజైమ్ లు, పోషకాలు, ప్రోటన్,  ఫైబర్.. వంటివన్నీ చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ శరీరం ఫిట్ గా ఉండటంలో సహాయపడతాయి.  అయితే శీతాకాలంలో సూర్య రశ్మి తక్కువగా ఉంటుంది.  ఒక్కోసారి సూర్యుడి ఉనికి చాలా తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది.  శరీరానికి సూర్యుడి లేత కిరణాలు తగిలినప్పుడు శరీరంలో విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది.  కానీ సూర్యరశ్మి లేకపోవడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడినట్టు కొన్ని లక్షణాల ద్వారా చెప్పవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. అలసట.. శరీరం అలసిపోయిందని చెప్పే చాలా మంది ఎక్కువ పని చేయడం,  నిద్ర సరిగా లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి కారణాలుగా చెబుతుంటారు.  కానీ ఆహారం బాగా తీసుకుని,  శరీరానికి తగిన విశ్రాంతి లభించి, మంచి నిద్ర లభించి,  ఎక్కువ అలసట తెప్పించే పనులు చేయకపోయినా సరే.. అలసటగా అనిపిస్తుంటే అది విటమిన్-డి లోపానికి ముఖ్య లక్షణంగా పేర్కొంటారు. కండరాల నొప్పి.. శరీరం కాల్షియం ను గ్రహించాలన్నా,  ఎముకలు దృఢంగా ఉండాలన్నా విటమిన్-డి చాలా అవసరం.  కాళ్లు,  వెన్ను,  కీళ్లు,  కాలి కండరాలు బలహీనంగా ఉండటం,  పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటే అది కూడా విటమిన్-డి లోపానికి కారణం కావచ్చు. ఎముకల నొప్పి.. ఎముకల నొప్పి, బలహీనత, ఎముకలు పెళుసుగా ఉండటం, నడుస్తున్నప్పుడ లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు ఎముకలు శబ్దం రావడం వంటివి జరుగుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం కూడా ఉన్నట్టే అర్థం. ఎందుకంటే విటమిన్-డి ఉంటేనే శరీరంలో కాల్షియం ఏర్పడుతుంది.  విటమిన్-డి లోపిస్తే కాల్షియం కూడా ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. మూడ్.. చాలామందికి ఉన్నట్టుండి మూడ్ మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకు చిరాకుగా,  కోపంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి విటమిన్-డి లోపం ఉండే అవకాశం ఉంటుంది. మూడ్ స్వింగ్స్ అయ్యేవారిలో విటమిన్-డి లోపం ఉంటుంది. విటమిన్-డి లోపం ఒత్తిడి హార్మోన్లు పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడం.. జుట్టు పలుచగా మారుతున్నా,  జుట్టు రాలిపోతున్నా, జుట్టు విరిగిపోతున్నా.. బలహీనంగా మారుతున్నా అది విటమిన్-డి లోపానికి సంకేతమే.. రోగనిరోధక వ్యవస్థ.. శరీర రక్షణ వ్యవస్థ బలంగా ఉండటంలో విటమిన్-డి చాలా సహాయపడుతుంది.  విటమిన్-డి లోపిస్తే తరచుగా జలుబు,  జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు లోనవుతుంటారు. గాయాలు.. సాధారణంగా శరీరం మీద ఏదైనా గాయం జరిగితే అది నయం కావడానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. కానీ గాయాలు నయం కావడానికి  నిర్ణీత  సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం ఉన్నట్టే లెక్క.                                                          *రూపశ్రీ         

బరువు తగ్గడానికి భలే ట్రిక్స్.. ఈ నాలుగు పనులు చెయ్యండి చాలు..!

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి,  అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువు మధుమేహం, గుండె జబ్బులు,  జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గడం  అంత సులభం కాదని అనుకుంటారు. బరువు తగ్గడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టించడం దగ్గర్నుంచి డైటింగ్, రకరకాల డైట్ ప్లాన్‌లు పాటించడం వరకు చాలా ఫాలో అవుతారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ  ప్రయోజనాలు లభించకపోతే బరువు తగ్గడానికి డైటింగ్ లేదా వ్యాయామం మాత్రమే పనికిరావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం రోజువారీ దినచర్యలో కొన్ని ప్రత్యేక మార్పులు అవసరం. ముఖ్యంగా నాలుగు పనులు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చట.  ఈ నాలుగు ఫాలో అయితే బరువు తగ్గడం ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు. నిద్ర.. చాలామంది  బరువు తగ్గడానికి జిమ్ చేయడం, వ్యాయామాలు చేయడం, ఆహారం తక్కువ తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇలాంటివి  కొనసాగించడం సరికాదు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి విశ్రాంతి,  తగినంత నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి 7-9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.   మంచి రాత్రి నిద్ర బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. విశ్రాంతి..  వ్యాయామం చేయడం లేదా పరుగు వంటి మార్గాల  ద్వారా బరువు తగ్గుతారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వ్యాయామం అవసరమే కానీ  దానితో పాటు కండరాలు తిరిగి రిపేర్ కావడానికి ,  అవి శక్తివంతంగా తయారవ్వడానికి  వారానికి 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి.  శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. సాధారణ వాకింగ్ లేదా యోగాతో పాటు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. కేలరీలు.. ఫిట్‌గా ఉండటానికి సులభమైన సూత్రం  రోజువారీ తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడం. చాలా మంది వారాంతాల్లో ఆహారం విషయంలో తరచుగా  తమను తాము మోసం చేసుకుంటారు.  ఈ సమయంలో కేలరీలు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిప్స్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పాప్‌కార్న్.. డెజర్ట్‌కు బదులుగా డార్క్ చాక్లెట్..  చక్కెర పానీయాలకు బదులుగా పండ్ల రసాలను ప్రయత్నించండి. ప్రోటీన్-రిచ్ అల్పాహారం కోసం, కాల్చిన మఖానా లేదా పనీర్ తినాలి. బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రెస్.. ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తులు  బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం రోజువారీ వాకింగ్ చేయాలి.  లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి.  ఆహారంలో గ్రీన్ టీ, బచ్చలికూర, వాల్‌నట్స్,  గుమ్మడి గింజలు వంటి ఒత్తిడిని తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.  ఒత్తిడిని తగ్గించడానికి, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.   మనస్సును ప్రశాంతపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి.                                         *రూపశ్రీ.

కాళ్లను బలంగా ఉంచుకోవాలంటే.. ఇవి తినాల్సిందే..!

శరీర బరువు మొత్తం కాళ్లే మోస్తాయి.  ఎండలో నడవడం, వానలో తడవడం.. క్లిష్టమైన దారిలో వెళ్లడం చేసినప్పుడు కాళ్లే మొదట బాధితులుగా మారతాయి. ఇక పరిగెత్తడం, వేగంగా నడవడం,   రోజువారి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం మొదలైన వాటికి కాళ్లు ఆరోగ్యంగా ఉండాలి.  కాళ్లు బలహీనంగా ఉన్నా, కాళ్ల ఎముకలు,  కండరాలు బలహీనంగా ఉన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు,  కండరాల నొప్పులు, ఎముకలు బలహీన పడటం వంటి సమస్యలు ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాళ్లు బలంగా ఉండటానికి ఆహారం బాగా సహాయపడుతుంది.   ఏ ఆహారాలు తింటే కాళ్లు బలంగా ఉంటాయో తెలుసుకుంటే.. పాలకూర, బచ్చలికూర.. పాలకూర, బచ్చలికూరలో ఐరన్, కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి.  ఇవి కండరాలకు మేలు చేస్తాయి.  శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి.  ఆహారంలో బచ్చలికూర, పాలకూరను విరివిగా తీసుకుంటే కాళ్లు బలంగా ఉంటాయి. సాల్మన్ ఫిష్.. సాల్మన్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కండరాల పునరుద్దరణలో సహాయపడతాయి.  కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడతాయి. ఎముకలను బలంగా మార్చి కాళ్లు బలంగా ఉండేందుకు  సాల్మన్ ఫిష్ తీసుకోవాలి. చిలకడదుంపలు.. చిలకడదుంపలలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి.  ఇవి శరీరానికి శక్తి అందించడంతో పాటు ఎక్కువ సేపు ఆ శక్తిని నిలిపి ఉంచుతాయి. చిలకడదుంపలను ఆహారంలో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఎంతో మంచిది. కోడిగుడ్లు.. ప్రోటీన్,  ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు పుష్కంలగా ఉండే ఆహారంల గుడ్లు కూడా  ఒకటి.  ఇవి కండరాల పెరుగుదలకు సహాయపడతాయి.  కండరాల మరమ్మత్తుకు కూడా సహాయపడతాయి. రోజుకు ఒక గుడ్డు తింటూ ఉంటే  కాళ్ల కండరాలు చాలా తొందరగా గట్టి పడతాయి.  బలంగా మారతాయి. బాదం.. బాదంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు,  విటమిన్-ఇ ఉంటాయి.  ఇవి కండరాలను బలంగా మారుస్తాయి.  కండరాల ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.  కాళ్లు బలంగా ఉండటంలో సహాయపడతాయి. క్వినోవా.. క్వినోవాలో అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.  ఇది చాలా గొప్ప ప్రోటీన్ మూలం ఉన్న ఆహారం.  కండరాల బలాన్ని పెంచడానికి, కండరాలు తొందరగా కోలుకోవడానికి క్వినోవా బాగా సహాయపడుతుంది.                                                 *రూపశ్రీ.

తరచుగా తలనొప్పి సమస్య వస్తోందా? బ్రెయిన్ ట్యూమర్ కి సంకేతం కావచ్చు..!

   చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను చాలా లైట్ గా తీసుకుంటారు.  కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల  తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటాయని తెలుసా..? అకారణంగా  జ్వరం రావడం,  తలనొప్పి రావడం.. ఉన్నట్టుండి సుస్తీ చేయడం వంటి సమస్యలు  అంతర్లీన వ్యాధుల సంకేతాలు కావచ్చు.  కొన్నిసార్లు  ఇది ప్రాణాంతకమైన సమస్య కూడా కావచ్చు. అలాంటి సమస్యలలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి.  బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే.. 2020లో బ్రెయిన్‌ ట్యూమర్‌ క్యాన్సర్‌ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు దాని గురించి ఎవరికీ  తెలియదని,  ఆ సమస్య అంత సులువుగా గుర్తించలేమని  వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో మెదడులో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది.  ఈ కారణంగా  దాని లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితిలోకొన్ని సాధారణ సంకేతాలను తెలుసుకోవడం,  వీటిని గుర్తించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం! మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఇది కాకుండా ప్లాస్టిక్,  రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు. జన్యుశాస్త్రం, జీవనశైలి-ఆహారం మొదలైనవాటితో  పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితుల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారే అవకాశం ఉంది. తలనొప్పి.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు.  తలనొప్పి  దాని అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి లేదా ఒత్తిడి పెరగడం లేదా నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మెదడు కణితి లక్షణాలు దాని పరిమాణం, అది పెరిగే  ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది.  అందుకే దానిని విస్మరించవద్దు. ఈ లక్షణాలు కూడా.. మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు.  ఇది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో తలనొప్పి లేదా ఒత్తిడి చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువసార్లు చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది.   వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది.   కంటిచూపు సరిగా లేకపోవడం,   ఒక వస్తువు రెండుగా కనిపిండం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చేతులు లేదా కాళ్ళలో సంచలనం లేదా కదలిక తగ్గడం జరుగుతుంది. శారీరక సమతుల్యత,  మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయ తరచుగా తల తిరగడం లేదా ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అనుమాలు వద్దు.. సకాలంలో చికిత్స తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్  తీవ్రమైన సమస్యగా మారే  ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  పెద్దవారు,  స్థూలకాయులు లేదా రసాయనాలకు ఎక్కువగా గురయ్యేవారు మెదడు కణితి  సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స,  కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.   అయితే మెదడులో పెరిగే అన్ని కణుతులు బ్రెయిన్ క్యాన్సర్ కాదని గుర్తుపెట్టుకోవాలి.                                 *రూపశ్రీ

వేడి నీళ్లతో స్నానం చేయడం ఎంతవరకు ఆరోగ్యం?

  స్నానం శారీరక శుభ్రతలో ప్రధాన భాగం.  ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించడం చిన్నతనం నుండి అలవాటుగా వచ్చేస్తుంది. కొందరైతే రోజులో రెండుపూటలా స్నానం చేస్తారు.  ఇది శరీరానికి చాలా రిఫ్రెషింగ్ అనుభూతి ఇస్తుంది.   అధిక శాతం మంది స్నానానికి వేడి నీరే ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేస్తుంటారు.  ఇది ఎంత వరకు ఆరోగ్యం.  బాగా వేడిగా ఉన్న నీటితోస్నానం చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? తెలుసుకుంటే.. చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.  అందుకే చాలామంది పొగలు కక్కుతున్న నీటితో స్నానం చేస్తారు.  చాలా వరకు గమనిస్తే చలికాలంలో స్నానం చేసి బాత్రూమ్ డోర్  ఓపెన్ చేయగానే బాత్రూమ్ నుండి మంచు పొగ బయటకు వచ్చినట్టు వేడనీటి ఆవిర్ల పొగ బయటకు వస్తుంది.  పొగలు కక్కే వేడి నీరు శరీరానికి చాలా రిలాక్స్ గా అనిపించినా అది చర్మానికి చాలా చెడు చేస్తుంది.  ముఖ్యంగా చర్మం కందిపోవడం,  ఎర్రబడటం జరుగుతుంది. చలికాలంలో ముందే చర్మం తొందరగా పొడిబారే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మరింత వేడినీరు పడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. లో బిపి.. చాలామందికి ఉండే సమస్య.  ఈ మధ్యకాలంలో అధిక బీపీ కంటే లో బీపీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.  లో బీపీ సమస్యలు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదని అంటున్నారు.  దీని వల్ల శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటును మరింత తగ్గేలా చేస్తాయట.  ఈ కారణంగా శరీరంలో రక్తపోటు తగ్గిపోయి ప్రమాదకర పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంటుందట. ఎప్పుడో ఒకసారి శరీరం బాగా అలసిపోయినప్పుడు,  చాలా చలిగా ఉన్నప్పుడు వేడినీటితో స్నానం చేసినా పర్లేదు.. కానీ ప్రతిరోజూ పొగలు కక్కే నీటితో స్నానం చేస్తుంటే మాత్రం చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి చాలా ఇబ్బంది అనే చెప్పాలి. చాలా వేడిగా ఉన్న నీరు చర్మం పిహెచ్ బ్యాలెన్స్ ను పాడు చేస్తుంది.  ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మమే అంత దెబ్బతినే అవకాశాలు ఉన్నప్పుడు.. చాలా సున్నితంగా ఉండే తల చర్మం,  వెంట్రుకలు మరింత సమస్యకు లోనవుతాయి.  బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.  వేడి నీరు జుట్టు పొడిగా మారడానికి,  సున్నితంగా మారడానికి,  డ్యామేజ్ కావడానికి కారణం అవుతుంది.  ఫలితంగా జుట్టు పెరుగుదల అస్సలు ఉండదు. చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరంగా పరిగణించబడుతుంది.  అందుకే స్నానానికి వేడినీరు ఉపయోగించాలి అనుకుంటే ఆ నీరు గోరువెచ్చగా ఉండాలి. అంతే కానీ పొగలు కక్కే నీటితో స్నానం చేయకూడదు.                                         *రూపశ్రీ.