బ్లడ్‌గ్రూపే తెలియని బ్రిటన్ ప్రజలు

  సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించామని బ్రిటన్‌ దేశస్థులు మురిసిపోతూ ఉండవచ్చుగాక! కానీ అమాయకత్వంలో మాత్రం వారు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకున్నారు. తాజాగా జరిగిన ఒక సర్వేలో తమ ఆరోగ్యానికి సంబంధించిన మౌలికమైన విషయాలు కూడా తెలియవంటూ నాలుక కరుచుకున్నారు. ఆ నివేదిక ఇదిగో...   హెల్త్‌స్పాన్‌ అనే సంస్థ, తన పరిశోధనలో భాగంగా బ్రిటన్‌లోని రెండువేల మంది పెద్దలని ఓ పది ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరో వైద్యవిద్యార్థులకు సంబంధించినవి కావు. ఒక వ్యక్తికి తన ఆరోగ్యం గురించి ఎంతవరకు తెలుసు అన్న విషయాలకు సంబంధించినవే! కానీ చాలామంది వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సరైన సమాధానం చెప్పేలేకపోయారట. ఉదాహరణకు-   - సర్వేలో పాల్గొన్న సగానికి సగం మందికి తమ బ్లడ్‌గ్రూప్‌ ఏమిటో తెలియదట!   - ఒక 68 శాతం మంది తమ గుండె పనితీరు సవ్యంగానే ఉందని భావిస్తున్నారు. ఇక ఓ 42 శాతం మందికైతే మెరుగైన గుండె కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదు.   - 16 శాతం మంది అభ్యర్థులకు తమకు వంశపారంపర్యంగా ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో అన్న అవగాహన లేదు.   - ఓ 35 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకోలేదని చేతులెత్తేశారు.   - సర్వేలో పాల్గొన్న జనాభాలో చాలామందికి కొలెస్ట్రాల్‌ పరిమితుల గురించి కానీ, ఆరోగ్యకరమైన రక్తపోటు గురించి కానీ ఆలోచనే లేదు. పైగా వీటివల్ల ఏదన్నా ప్రమాదం ఏర్పడితే అప్పుడే చూసుకోవచ్చులే అని ఓ 44 శాతం మంది భావిస్తున్నారు కూడా!   - కొంతమంది అభ్యర్థుకి 47 ఏళ్లు వచ్చిన తరువాత కానీ తమ జీవనవిధానంలో ఏమన్నా మార్పులు ఉండాలేమో అన్న ఆలోచన రావడం లేదు.   ఇక కొంతమందికి రోజుకి ఎంత మంచినీరు తాగాలో కూడా తెలియకపోతే, మరికొందరేమో తమకి ఏమన్నా తేడా చేసినప్పుడు కూడా జీవన విధనంలో ఎలాంటి మార్పులనూ చేయం అని కుండబద్దలు కొట్టేశారు.   ఇలాంటి అజ్ఞానం నిజంగా ప్రాణాంతకం అంటున్నారు సర్వే చేపట్టిన పరిశోధకులు. 40 ఏళ్ల వయసు వచ్చిన తరువాత అన్ని రకాల వైద్య పరీక్షలనీ చేయించుకుంటేనే మేలని సూచించారు. సమస్యలు మరీ జటిలం అయితే తప్ప మర ఆరోగ్యాన్ని పట్టించుకోమనీ, దానివల్ల గుండె వంటి ముఖ్యమైన శరీర భాగాలను తీరని నష్టం జరిగిపోయే ప్రమాదం ఉందనీ హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరిమితులు, డి విటమిన్‌ ఆవశ్యకత వంటి విషయాల మీద అవగాహన ఉంటే సమస్య మొదలవకముందే దానిని నివారించవచ్చునని సూచిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎలాంటి వైద్య పరీక్షలూ చేయించుకోకుండా ఉండి ఉంటే కనుక, తక్షణమే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి పరీక్షల కోసం వైద్యడి దగ్గరకు బయల్దేరమని తొందరపెడుతున్నారు. లేకపోతే ఇవి నిదానంగా మన శరీరాన్ని దెబ్బతీసి, ముప్పు తలపెడతాయి. ఈ సూచనలు కేవలం బ్రిటన్ వాసులకే కాదు, మనకు కూడా ఉపయోగపడతాయి కదా!     - నిర్జర.

అయితే ఆకలి లేకపోతే అనారోగ్యం!

  పేదరికం ఎక్కడ ఉంటే ఆకలి అక్కడ ఉంటుందనేది అందరికీ తెలిసిన నిజమే! ఆ ఆకలిని రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలన్నీ తెగ కృషి చేసేస్తున్నాయి. వీటికి తోడు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల సహకారం ఎలాగూ ఉంది. కానీ పరిస్థితుల్లో ఏమంత మార్పులు కనిపించడం లేదని పెదవి విరుస్తోంది ఓ నివేదిక.   కోట్లమంది ఆకలితో Global Panel on Agriculture and Food Systems for Nutrition అనే సంస్థ రూపొందించిన ఈ నివేదిక, మన భవిష్యత్తు ఏమంత ఆరోగ్యంగా లేదని సూచిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది ఆకలితో అల్లలాడిపోతున్నారనీ, 2030 నాటికి ఈ సంఖ్య ఏకంగా 300 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక ఊహిస్తోంది. అంతేకాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల్లో నాలుగో వంతు మందిలో సరైన శారీరిక, మానసిక ఎదుగుదల ఉండటం లేదని స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు ఒక్క గ్వాటెమాల (ఆఫ్రికా)లోనే 40 శాతం మంది పిల్లలు తమ వయసుకి ఉండాల్సినంత ఎత్తు లేరట! పేద దేశాలలోని పిల్లలకు ఆహారం అందినా కూడా అందులో పాలు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారం లభించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతోందని తేలింది. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లభించక, రోజుకి ఎనిమిది వేల మంది చనిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతోంది.   ఊబకాయం పెనుముప్పు వెనుకబడిన దేశాలలో ఆకలి సమస్యగా ఉంటే... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో ఊబకాయం ముంచుకు వస్తోందని హెచ్చరిస్తోంది ఈ నివేదిక. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది ఊబకాయంతోనో, అధికబరువుతోనో బాధపడక తప్పదని తేలుస్తోంది. ఇక చైనాలో అయితే సగానికి సగం మంది ఊబకాయంలో కూరుకుపోక తప్పదని ఊహిస్తోంది. ప్రాసెస్డ్‌ ఆహారం, శీతల పానీయాల వాడకం విపరీతంగా పెరిగిపోవడమే ఈ దుస్థితికి కారణం అని నివేదిక కుండబద్దలు కొట్టేసింది. వీటి వల్ల రక్తపోటు, చక్కెర, గుండెజబ్బుల వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితి HIV, మలేరియా వంటి వ్యాధులకంటే ప్రాణాంతకమని హెచ్చరిస్తోంది. సమస్యలే కాదు, సూచనలు కూడా!     ప్రపంచం ముందర ఉన్న వివిధ సమస్యలను స్పష్టం చేయడమే కాదు, ఆ సమస్యలకు కొన్ని పరిష్కారాలను కూడా సూచిస్తోంది ఈ నివేదిక. వాటిలో కొన్ని...   - పోషకాహారాన్ని కొనుగోలు చేసి అవి తక్కువ ధరలకే ప్రజలకు అందేలా ప్రభుత్వరంగ సంస్థలు చొరవ చూపాలి.   - ప్రజలకి ఆహారం అందుతోందా లేదా అనే కాదు... అందులో తగిన పోషకాలని అందించే పండ్లు, పీచుపదార్థాలు, తృణ ధాన్యాలు ఉన్నాయా లేదా అని కూడా గమనించుకోవాలి.   - ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలను పాటించాలి. ఉత్పత్తి దగ్గర్నుంచీ ప్రకటనల దాకా అవి ఏ దశలోనూ వినియోగదారులను పక్కదోవ పట్టించేలా ఉండకూడదు.   - పిల్లలకు ఆరు నెలల వయసు వచ్చేవరకూ తల్లిపాలని పట్టించేలా తగిన ప్రచారం చేయాలి.   - అధికంగా ఉప్పు, పంచదార, మాంసం ఉన్న పదార్థాల వాడకం తగ్గేలా చర్యలు తీసుకోవాలి. చిరుతిళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్, శీతల పానీయాల ప్రాభవాన్ని తగ్గించాలి.   - మహిళలకు తగిన పోషకాహారం అందిచే చర్యలు తీసుకోవడం వల్ల... వారికీ, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికీ ఢోకా లేకుండా కాపాడుకోగలగాలి.   ఈ సూచనలన్నీ ఆచరిస్తే సరేసరి! లేకపోతే... 2030 నాటికి ఈ నివేదిక ఊహించిన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందేమో!     - నిర్జర.

మంచితనమే శ్రీరామరక్ష

  ‘మన మంచితనమే మనల్ని కాపాడుతుంది’ అని తరచూ పెద్దలు చెప్పే మాటల్ని మనం కొ్ట్టిపారేస్తూ ఉంటాము. కొన్నాళ్ల క్రితం వరకూ వారంతా హాయిగా పాటించిన విలువలని చాదస్తాలుగా తీసిపారేస్తూ ఉంటాము. కానీ నలుగురితో మంచిగా నడుచుకోవడం మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని తేల్చిచెబుతున్నాయి అనేక పరిశోధనలు. వాటిలో కొన్ని...   ఒత్తిడి నుంచి ఉపశమనం గత ఏడాది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు నిపుణులు ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం వారు 77 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. ఇతరులకు ఏవన్నా సాయం చేసినప్పుడు, మనలోని ఒత్తిడిలో ఏమన్నా మార్పులు వస్తాయా అన్న దిశగా అభ్యర్థలు జీవితాలను పరిశీలించారు. సాయం అనగానే ఏవో భారీ త్యాగాలు అనుకునేరు! అవతలివారి కోసం తలుపు తెరిచి పట్టుకోవడం, ఎవరన్నా దారి చెప్పమంటే సరైన సూచనలు ఇవ్వడం... ఇలా మనం రోజువారీ చేయగలిగే చిన్నపాటి సాయాలే! ఆశ్చర్యం ఏమిటంటే, ఇలాంటి సాయాలు చేసిన రోజులలో వారిలో సానుకూల దృక్పథం పెరిగి ఒత్తిడిని సునాయాసంగా ఎదుర్కోగలిగారట! ఒత్తిడిని ఎదుర్కోవాలంటే నలుగురితోనూ మంచిగా ఉండేందుకు ప్రయత్నించి చూడమంటున్నారు పరిశోధకులు.   సంతోషాల స్థాయి పెరుగుతుంది 2008లో హావర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కి చెందిన కొందరు పరిశోధకులు, సైన్స్‌ అనే పత్రికలో ఓ వ్యాసాన్ని రాశారు. తమ దగ్గర ఉన్న డబ్బుని ఇతరుల కోసం ఖర్చుపెడితే, మనలో సంతోషపు స్థాయిలో ఏమన్నా మార్పు వస్తుందా అన్న కోణంలో వీరు ఒక పరిశోధనను నిర్వహించారట. ఇందులో భాగంగా వీరు కొందరు విద్యార్థులకి తలా కొంత డబ్బుని అందించారు. ఈ డబ్బుని తమ కోసం కానీ, ఇతరుల కోసం కానీ ఖర్చుపెట్టుకోవచ్చునని సూచించారు. ఏ విద్యార్థులైతే ఇతరుల కోసం డబ్బుని ఖర్చుపెట్టారో, వారిలో సంతోషపు స్థాయి కూడా గణనీయంగా పెరగడాన్ని గమనించారు. గుండెతీరు మెరుగుపడుతుంది   సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. వీరిలో రక్తపోటు కానీ, గుండెవేగం కానీ సాధారణంగా ఉంటాయనీ... గుండెధమనుల మీద ఉండే ఒత్తిడి అదుపులో ఉంటుందనీ తేలింది. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుందనీ... ఒత్తిడీ, క్రుంగుబాటు వంటి వ్యతిరేక ధోరణులు తగ్గుముఖం పడతాయనీ వెల్లడయ్యింది.   నలుగురితో మంచిగా ఉండటానికీ ఆరోగ్యానికీ సంబంధం ఏమిటన్న ప్రశ్న ఎవరిలోనైనా మెదలవచ్చు. దీనికి జవాబు ఏమంత కష్టం కాదేమో! మనిషి సంఘజీవి. తనకు ఇతరుల అవసరం ఉందని గుర్తించిననాడు, తాను కూడా ఇతరులకు చేతనైనంత సాయం చేస్తాడు. ఇతరులకు చేసే మేలు అంతిమంగా తనకే ఉపయోగపడుతుందన్న విషయం అతనిలో ఏదో ఒక మూలన స్ఫురిస్తూనే ఉంటుంది. అందుకనే ఇతరులకు సాయం చేసినప్పుడూ, ఆప్తులను ఆదుకున్నప్పుడూ... తన జీవితం సార్థకం అయ్యిందన్న తృప్తి అతనికి లభిస్తుంది. ఒంటరితనంలో అతన్ని దిగులు మాత్రమే ఆవరిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలన్నా, బాధను తగ్గించుకోవాలన్నా మనిషి చుట్టూ నలుగురు ఉండాల్సిందే! ఆ నలుగురితో మంచిగా బతకాల్సిందే!   - నిర్జర.

ఆరోగ్యంలో మన స్థానం- 143

పరీక్షలలో పిల్లవాడికి నూటికి 42 మార్కులు వస్తే వాడి చెవి పట్టుకుని మెలేస్తారు. అంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటూ నిలదీస్తారు. కానీ అస్తవ్యస్తమైన విధానాల పుణ్యమా అని మన దేశానికే 42 మార్కులు వస్తే ఎవరిని ప్రశ్నించగలం? ఆరోగ్య రంగంలో ఐక్యరాజ్యసమితి మన దేశానికి అందించిన మార్కులివి. ప్రపంచవ్యాప్తంగా 188 దేశాలకు ఇలాంటి మార్కులను కేటాయించగా వాటిలో మన దేశం 143వ ర్యాంకుని పొందింది. ఆ ముచ్చట ఇదిగో... అన్నింటిలో దిగదుడుపే!   ప్రపంచంలోని వేర్వేరు దేశాలలోని ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు ఐక్యరాజ్యసమితి కొన్ని అంశాలను ఎన్నుకొంది. మలేరియా నివారణ, ఐదేళ్లలోపు పసిపిల్లల మరణం, పరిశుభ్రత... ఇలా ఓ 33 అంశాలలో ప్రతి దేశానికీ కొన్ని మార్కులను కేటాయించింది. వాటిలో మనకు దక్కిన కొన్ని మార్కులివీ-     - మలేరియా నివారణలో వందకి గానూ మనకి కేటాయించిన మార్కులు పది! మన పక్కనే ఉన్న శ్రీలంక వంటి చిన్నదేశాలు కూడా మలేరియా మీద విజయం సాధించాయి. తమ దేశాలలో మలేరియా రూపురేఖలే లేకుండా తరిమికొట్టి వందకి వంద మార్కులు పొందాయి. కానీ మనం మాత్రం 2030 నాటికన్నా మలేరియాను తరిమికొట్టాలన్న ఆశతో ప్రస్తుతానికి మలేరియా దోమల్ని పెంచిపోషిస్తున్నాము.   - స్వచ్ఛ భారత్‌ గురించీ, మరుగుదొడ్ల నిర్మాణం గురించీ మన ప్రభుత్వాలు తెగ ఊదరగొడుతూ ఉండవచ్చుగాక. వీటి గురించి ప్రకటనలను గుప్పించేందుకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ఉండవచ్చుగాక. కానీ పరిశుభ్రమైన పద్ధతులను పాటించడంలో మన దేశానికి దక్కిన మార్కులు ఎనిమిదంటే ఎనిమిది!   - మాతాశిశు సంక్షేమం గురించి దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయి. కానీ ఇప్పటికీ ప్రసవ సమయంలో స్త్రీల మరణాలు అదుపులోకి రావడం లేదు. ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్యానికీ భరోసా లేదు. అందుకే ఆయా రంగాలలో ఐరాస మనకు 39, 28 పాయింట్లను అందించింది. ఇంతేకాదు! వాయుకాలుష్యం, ఎయిడ్స్‌ వంటి సమస్యలను ఎదుర్కోవడంలోనూ మన సామర్థ్యం అంతంత మాత్రమే అని ఈ నివేదిక పేర్కొంటోంది.   సిరియాకంటే దారుణం వివిధ రంగాలలో ఆయా దేశాల ఆరోగ్య ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని మొత్తంగా వాటికి కొన్ని మార్కులను కేటాయించింది ఐరాస. వాటి ప్రకారం ఐస్‌ల్యాండ్ దేశం 85 మార్కులతో తొలి స్థానంలో నిలువగా... సింగపూర్‌, స్వీడన్‌, ఫిన్‌ల్యాండ్, ఇంగ్లండులు తరువాత స్థానాలను పొందాయి. అంతర్యుద్ధంతోనూ, తీవ్రవాదంతోనూ నలిగిపోతున్న సిరియా (117), ఇరాక్‌ (128) వంటి దేశాలకంటే కూడా మన దేశం దిగువన ఉండటం తప్పకుండా ఆలోచించాల్సిన అంశమే! పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి పొరుగు దేశాలు మనకంటే తక్కువ మార్కులను పొందడం మాత్రమే మన నేతలను   తృప్తిపరిచే అంశం! మన దేశ ప్రజల్లో ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన లేకపోవడం, పౌరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు బలమైన వ్యవస్థలు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు నిపుణులు. ఇదే వాతావరణం కొనసాగితే, వచ్చే ఏడాది మన ర్యాంకు మరింత దిగజారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! ఇంతకీ మోదీగారు ఈ ర్యాంకులను చూశారో లేదో!   - నిర్జర.

డెంగీ, చికెన్‌గున్యాలను తరిమికొడదాం!

  డెంగీ- ఒకప్పుడు దీని అర్థం ఎవరికీ తెలియదు. ఇప్పుడో! ఈ పేరు వినని వారు ఉండరు. ఓ నాలుగు చినుకుల వర్షం కురిస్తే ఈ మహమ్మారి ఎక్కడ బయటకి వస్తుందో అని అనుమానం! ఓ రెండు డిగ్రీల జ్వరం పెరిగితే అది డెంగీ ఏమో అన్న భయం! వెరిసి డెంగీ ఇప్పుడు ఇంటింటి పేరు. ఇంతకీ ఈ డెంగీ ఏమిటి? దాన్నుంచి తప్పుకునే మార్గమే లేదా అంటే లేకేం....   డెంగీ వ్యాధి ఏడిస్‌ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. మిగతా దోమలకంటే ఈ ఏడిస్‌ దోమ తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనం దీని బారిన పడే ప్రమాదం ఎక్కువ. ఈ దోమ మన ఇంట్లో నిలువ ఉండే మంచినీటిలో సులభంగా బతికేస్తుంది. పాత టైర్లు, కుండీలు, కూలర్లు, ఫ్లవర్‌వాజులు, ఈతకొలను, నీటిడ్రమ్ములు... ఇలా ఎక్కడ మంచినీరు కాస్త నిలువ ఉంటే, అక్కడ వందలకొద్దీ గుడ్లను పొదిగేస్తుంది. పైగా ఇది పగటివేళల్లోనే కుడుతుంది. మన ఇళ్లలోని కర్టెన్ల వెనకాల, మంచాల కింద, బీరువాల చాటునా బతికేస్తూ అదను చూసి మన మీద దాడి చేస్తుంది. ఈ వైరస్‌ ఉన్న దోమ కుట్టినప్పటి నుంచి వారం రోజుల లోపు డెంగీ సూచనలు కనిపిస్తాయి. జ్వరంతో పాటుగా తలనొప్పి, కళ్ల వెనుక పోట్లు, కీళ్లు కండరాల నొప్పులు, దద్దుర్ల వంటి లక్షణాలు ఉండవచ్చు. అరుదుగా చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం కారడాన్ని కూడా గమనించవచ్చు.   మన శరీరంలోని రక్తస్రావాన్ని అరికట్టే ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, రక్తం పలచబడటం వంటి సూచనల ద్వారా రోగికి డెంగీ సోకిందని నిర్ధారిస్తారు. డెంగీ సోకిన వ్యక్తి ఒకటి రెండు వారాలలో తిరిగి కోలుకుంటాడు. అప్పటివరకూ తగినంత విశ్రాంతిగా ఉండటం, పోషకాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఇక డెంగీతో మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి... నీరు, పండ్లరసాలు, ORS వంటి ద్రవపదార్థాలను తీసుకుంటూ ఉండాలి.   డెంగీ ప్రాణాంతకం కాదు. అలాగని వైద్యుని సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు మాత్రలు వేసుకుంటే మాత్రం పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. ఇక కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు తిరగడం, ఆయాసం, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు, రక్తస్రావం... వంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. సకాలంలో అందే వైద్యంతో డెంగీ రోగలక్షణాలు తగ్గడమే కాకుండా, ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. డెంగీ వచ్చాక తీసుకోవల్సిన జాగ్రత్తల కంటే అది రాకుండా చూసుకోవల్సిన అవసరమే ఎక్కువ. ఇందుకోసం...   - ఇంట్లోనూ, ఇంటి ఆవరణలోనూ ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - తేమ లేదా చీకటిగా ఉండి దోమలు వృద్ధి చెందే పరిస్థితులు ఉన్నచోట బజార్లో దొరికే దోమల మందుని చల్లాలి. - ఉదయం వేళ్లలో కూడా మస్కిటో రిపెల్లంట్స్‌ని వాడుతూ ఉండాలి. - రోజంతా పడుకుని ఉండే పసిపిల్లలకి ఉదయం వేళల్లో కూడా దోమతెరని కట్టాలి. - శరీరం అంతా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.   చికెన్‌గున్యా డెంగీలాగానే చికెన్‌గున్యా కూడా ఏడిస్‌ దోమ ద్వారానే వస్తుంది. అయితే జ్వరంతో పాటుగా తీవ్రమైన తలనొప్పి, కీళ్లనొప్పులను ఈ వ్యాధిలో గమనించవచ్చు. వ్యాధి తగ్గిన తరువాత కూడా వారాలు, నెలల తరబడి కీళ్లనొప్పులతో రోగి బాధపడటం చికెన్‌గున్యాలో సాధారణం. అందుకే చికెన్‌గున్యా వచ్చిన రోగులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటుగా కీళ్లనొప్పులకు మందులను కూడా వాడవలసి ఉంటుంది. డెంగీ దోమలు వ్యాపించకుండా, అవి కుట్టకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, అవన్నీ చికెన్‌గున్యాకు కూడా వర్తిస్తాయి.   డెంగీ, చికెన్‌గున్యాలు రెండూ ప్రాణాంతకం కాకపోయినా, రోగిని నిస్సహాయంగా మంచాన పడవేసే వ్యాధులు. వీటి బారిన పడినవారు కోలుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి అవి వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుందాం. వాటిని మన జీవితాల్లోంచి తరిమికొడదాం!    ..Nirjara

జ్వరం ఇక దూరం

  జరుగుబాటు ఉంటే జ్వరమంత సుఖం లేదంటారు పెద్దలు. కానీ ఎంత జరుగుబాటు ఉంటే మాత్రం మంచంలో అలా నిస్సహాయంగా పడి ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. జ్వరంతో పాటుగా వచ్చే సలపరింత, ఒళ్లునొప్పులు వంటి నానారకాల చిరాకులని ఎవరు మాత్రం ఇష్టపడతారు. అందుకనే జ్వరమొస్తే దాన్ని ఎలా తగ్గించుకోవలన్న తపనే అందరిదీనూ. అందుకోసమే ఈ వివరణ!   వైరల్‌ ఫీవర్లు! మనకు వచ్చే జ్వరాలలో రెండు మూడు రోజుల పాటు సతాయించి విడిచిపెట్టే వైరల్‌ ఫీవర్లే ఎక్కువ. అందుకని ఆరోగ్యంగా ఉండే పెద్దలు ఒకటి రెండు రోజుల పాటు ఉండే జ్వరాల గురించి అంతగా కంగారుపడాల్సిన అవసరం లేదు. ఈ కింది సందర్భాలలో మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది...   - శరీర ఉష్ణోగ్రత 103ని తాకుతున్నప్పుడు. పసిపిల్లలలో అయితే ఈ ఉష్ణోగ్రత 100.4 దాటినా కూడా వైద్యుని సంప్రదించడం మేలు.   - రెండు రోజులకి మించి జ్వరం కనిపిస్తున్నప్పుడు.   - దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, నీరసం, కళ్లుతిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అతిగా దాహం వేయడం... వంటి ఇతర లక్షణాలు కనిపించినప్పుడు.   - బ్రాంకైటిస్, బీపీ, క్యాన్సర్‌ వంటి వ్యాధులు ఉన్నప్పుడు.   చిట్కాలు చిన్నపాటి వైరల్‌ జ్వరాలలో ఉపశమనానికి ఈ కింద చిట్కాలను పాటించి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చు   - జ్వరంతో శరీరంలోని నీటి శాతం గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల మూత్రం కూడా పచ్చగా మారడాన్ని గమనించవచ్చు. కాబట్టి ఒళ్లు వేడిగా ఉన్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం మంచిది. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, జ్వరంగా ఉన్న రోజుల్లో కనీసం 8- 12 గ్లాసుల నీటిని తీసుకోమని చెబుతున్నారు. వైద్యులు. దీనివల్ల ఒంట్లో నీటి శాతం పెరగడమే కాకుండా, ఉష్ణోగ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది.   - గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల ఉష్ణోగ్రత నిదానంగా తగ్గడమే కాకుండా, శరీరంలో ఉన్న అలసట కూడా తీరుతుంది. అలాగని చన్నీటి స్నానం చేస్తే మాత్రం, శరీరంలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది.   - చల్లని నీటిలో తడిపిన గుడ్డతో నుదురు, మణికట్టు, మెడ, పాదాలని తుడుస్తూ ఉంచడాన్ని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే ఒకేసారి అన్ని ప్రాంతాలలోనూ తుడిస్తే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోవచ్చు. కాబట్టి ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో తుడిస్తే సరిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే సాక్సుని తడిపి రాత్రంతా ఉంచుకునే చిట్కాని వాడతారు, కానీ మన వాతావరణానికి అది సరిపోకపోవచ్చు.   - ఒకప్పుడు జ్వరం వస్తే లంఖణాన్నే (ఉపవాసం) మందుగా భావించేవారు. జ్వరాన్ని నయం చేసుకునేందుకు శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడమే ఉపవాసంలో ఉన్న లక్షణం. ఇప్పుటి ఉరుకులపరుగుల జీవితంలో ఉపవాసాలు కుదరకపోయినప్పటికీ.... తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వీటికి తోడుగా సీ విటమిన్‌, నీటి శాతం ఎక్కువగా ఉండే నారింజ వంటి పండ్లని కూడా తీసుకోవాలి.   - మన ఇంట్లోనే దొరికే తులసి, అల్లం వంటి ఔషధులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా మంచి ఫలితం దక్కుతుంది.     - నిర్జర.

శ్రీలంకలో మలేరియా మాయం... మరి మనమో!

  మన పక్కనే ఒక బిందువులా కనిపించే ఓ చిన్న దేశం శ్రీలంక. నిన్నమొన్నటి వరకూ నిరంతర అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోయిన దేశం. ఇప్పుడిప్పుడే ఆక్కడ ప్రశాంతమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి ఓ దేశం ఊహించని అద్భుతాన్ని సాధించింది. మలేరియా రహిత దేశంగా సగర్వంగా నిలిచింది. పెద్దన్నలాంటి మన దేశానికి కూడా ఆదర్శంగా నిలిచింది. ఆ విజయగాధ...   అనుకూలమైన పరిస్థితులు శ్రీలంకలో అడవుల శాతం ఎక్కువ. నీటి లభ్యతకీ కొదవేమీ లేదు. పైగా చుట్టూ సముద్రమే! దోమలకు ఇంతకంటే స్వర్గధామం ఏముంటుంది. ఇక శ్రీలంకలో గ్రామీణ ప్రాంతాలే అధికం కాబట్టి, ఏదన్నా వ్యాధి వస్తే దానికి చికిత్స తీసుకోవాలన్న అవగాహన కూడా తక్కవే! దాంతో ఒకప్పుడు లక్షలాది మలేరియా కేసులు నమోదయ్యేవి. వేలాదిమంది జనం పిట్టల్లా రాలిపోయేవారు.   యుద్ధం మొదలు శ్రీలంక ప్రభుత్వం ఆది నుంచీ కూడా మలేరియా మీద ఉక్కుపాదం మోపుతూనే ఉంది. మలేరియా పరీక్ష కోసం చేసిన రక్తపరీక్షల ఫలితాలను 24 గంటలలోనే అందించడం, డీడీటీ వంటి రసాయనాలతో దోమల వ్యాప్తిని నిరోధించడం వంటి జాగ్రత్తలను పాటించేది. ఇక 1958 నాటికి మలేరియా మీద పూర్తిస్థాయి యుద్ధాన్నే ప్రకటించింది. ఇందుకోసం కొలంబియాలో ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. మలేరియాని అదుపుచేసేందుకు ఉపయోగించే డీడీటీ ప్రమాదకరం అని తేలిపోవడంతో సరికొత్త ప్రణాళికలతో తన యుద్ధాన్ని కొనసాగించింది.   ఇవీ చర్యలు - మలేరియా గురించి, దాని నివారణ చికిత్సల గురించి ప్రజల్లో విస్తృతమైన అవగాహనను కలిగించడం. - మలేరియా బారిన పడిన రోగులకు సత్వర చికిత్స అందించడం ద్వారా, వారి నుంచి ఆ రోగకారకాలు ఇతరులకు చేరకుండా చూసుకోవడం. - వర్షపాతం, నీటిప్రవాహం వంటి సూచనల ఆధారంగా మలేరియా ప్రబలే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అక్కడకు తగిన వైద్య సిబ్బందిని పంపించడం. - దేశంలో నమోదవుతున్న మలేరియా కేసులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఎక్కడ ఆ వ్యాధి ప్రబలుతోందో గమనించడం. భవిష్యత్తులో ఆ ప్రాంతాల మీద మరింత దృష్టిని సారించడం. - ఒకపక్క మలేరియాని నివారించడం కోసం తగినన్ని నిధులను కేటాయిస్తూనే, మరో పక్క ఆ వ్యాధి మీద మరింత పట్టుని సాధించేందుకు పరిశోధనలు సాగించడం. ... ఇలా రకరకాలా చర్యలతో గత మూడు సంవత్సరాలుగా దేశీయంగా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఐక్యరాజ్యసమితి శ్రీలంకను మలేరియారహిత దేశంగా ప్రకటించింది.   మరి మనమో! మన దేశంలో మలేరియా అంటే సర్వసాధారణమైన విషయం. ఏటా దాదాపు పదిలక్షలమందికి పైగా జనం ఇక్కడ మలేరియా బారిన పడుతూ ఉంటారు. ఇక ఓ వెయ్యమంది వరకూ ఈ వ్యాధితో మృత్యుఒడిని చేరుతూ ఉంటారు. శ్రీలంకంతో పోల్చుకుంటే ఇక్కడ జీవనవిధానాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాల దగ్గర నిధులకి కానీ, జనాల దగ్గర చదువుకి కానీ కొరత లేదు. కానీ లేనిదల్లా చిత్తశుద్ధి మాత్రమే! ఈ ఏడాది మన దేశం కూడా మలేరియాను 2030నాటికి సమూలంగా నాశనం చేస్తామని ప్రతిన పూనింది. అంటే మరో పదిహేను సంవత్సరాలకు కానీ మనం మలేరియా రహిత భారతదేశాన్ని చూడకపోవచ్చునన్నమాట! మన ఆరోగ్యశాఖల తీరుని గమనిస్తే అప్పటికైనా ఇది సాధ్యమేనా అన్న అనుమానమూ కలగక మానదు.   - నిర్జర.

మీ పిల్లి ప్రాణాంతకం కావచ్చు!

  పిల్లులతో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొందరిలో ఆ ఇష్టం కాస్త శృతి మించి వాటితో మోటుగా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో పిల్లి గోళ్లు కనుక మన శరీరానికి గీరుకుంటే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు అని సూచిస్తున్నారు వైద్యులు.   cat-scratch fever: పిల్లులలో ‘బార్టొనెలా హెర్న్‌సెలే’ అనే ఒక బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందట. ఈ బ్యాక్టీరియా పిల్లుల శరీరం మీద ఉండే రకరకాల పరాన్న జీవుల ద్వారా ఒక పిల్లి నుంచి మరో పిల్లికి వ్యాపిస్తాయి. వీటివల్ల పిల్లులకి పెద్దగా హాని కలుగకపోయినా... ఆ బ్యాక్టీరియా కనుక మనిషి ఒంట్లోకి చేరితే cat-scratch fever అనే జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లులతో ఆడేటప్పుడు వాటి గోళ్లు మనకు రక్తం వచ్చేలా గీరుకున్నా, మన కంటికి తగిలినా... సదరు బ్యాక్టీరియా మనలోకి చేరే అవకాశాలు ఏర్పడినట్లే.   లక్షణాలు - గాయం ఏర్పడిన చోట వాపు లేదా దద్దుర్లు, - శరీరంలోని లింఫ్‌ గ్రంథులు వాయడం, - నీరసం, జ్వరం, తలనొప్పులు, గొంతు నొప్పి, - వెన్నునొప్పి. కీళ్లు, కండరాల నొప్పులు, - బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం...   .... ఇలా రకరకాల లక్షణాల ఈ రోగం ద్వారా ఏర్పడవచ్చు. గాయం ఏర్పడినప్పటి నుంచి రెండు నెలల వరకు ఎప్పుడైనా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. పైగా పరీక్షల ద్వారా ఈ జబ్బుని గుర్తించడం కూడా కష్టం. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఏవో సాధారణ జ్వరం వల్ల ఏర్పడ్డాయని రోగులు భావించే ప్రమాదమే ఎక్కువ. ముఖ్యంగా HIV వంటి రోగంతో బాధపడుతున్నవారు కానీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కానీ ఈ వ్యాధి బారిన పడితే మరింత అనారోగ్యానికి లోనయ్యే ప్రమాదం ఉంది.   ఉపద్రవం: సాధారణంగా ఈ రోగ లక్షణాలన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. మరీ అవసరమైతే తప్ప వైద్యులు కూడా ఈ రోగానికి పెద్దగా మందులను సూచించరు. కానీ కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం ఈ బ్యాక్టీరియా శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. తాత్కాలికంగా కంటిచూపు మసకబారడం దగ్గర్నుంచీ మెదడు శాశ్వతంగా దెబ్బతినడం వరకూ ఈ బ్యాక్టీరియా ఒకోసారి ఉపద్రవాన్నే సృష్టిస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఇది ఎముకలు, గుండెను సైతం ప్రభావితం చేస్తుంది.   నివారణ: దాదాపు 40 శాతం పిల్లుల్లో ఏదో ఒక సందర్భంలో ఈ రోగాన్ని కలిగించే బ్యాక్టీరియా పొంచి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పిల్లులతో ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఏవన్నా గాట్లు తగిలిన తరువాత రోగలక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించడాన్ని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లిపిల్లల్లో ఈ వ్యాధి కారకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటికి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉండే పెంపుడు పిల్లులకు కూడా తరచూ వైద్య పరీక్షలను నిర్వహించమని చెబుతున్నారు.   - నిర్జర.

మధుమేహానికి వేపుళ్లంటే ఇష్టమట!

  కాలం మారిపోతోంది. కాలంతో పాటుగా మన ఆహారంలోని రుచులూ, అభిరుచులూ మారిపోతున్నాయి. దురదృష్టవశాత్తూ ఇలాంటి మార్పులన్నీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం జిహ్వచాపల్యం ఆధారంగానే ఉంటున్నాయి. పండ్లూ కూరగాయలకు బదులుగా వేపుళ్లూ, బేకరీ పదార్థాలూ తీసుకోవడం ఎక్కువైంది. ఇక మాంసం తినేవారైతే గ్రిల్డ్‌ చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ మార్పులు ఖచ్చితంగా మన అనారోగ్యానికి కారణం అవుతున్నాయంటూ ఇప్పుడు ఒక పరిశోధన స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ పలకరించేందుకు సిద్ధంగా ఉన్న మధుమేహపు మహమ్మారికి వేపుళ్లంటే ఇష్టమని తెలియచేస్తోంది.   నీరు- నిప్పు మన వంటలో నీటికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయి నిప్పుకి ప్రాముఖ్యత పెరిగిపోయింది. అంటే ఆహారాన్ని ఉడికించకుండా వేయించడమో, కాల్చడమో ఎక్కువయ్యింది. ఇలాంటి ఆహారంలో Advanced Glycation End Products (AGEP) అనే పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పదార్థాలు మన శరీరంలోని ఇన్సులిన్‌ వాడకాన్ని దెబ్బతీస్తాయట. ఇన్సులిన్‌ వాడకం సరిగా లేకపోవడంతో, మన శరీరంలో చక్కెర నిల్వలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇలా అధికంగా పేరుకుపోయిన చక్కెర నిల్వల వల్ల గుండె, కిడ్నీలు, కళ్లు వంటి కీలక అవయవాలు దెబ్బతినిపోతాయి. పైగా AGEPల కారణంగా శరీరంలోని కణాలు కూడా వాపుకి (inflammation) లోనై గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   పరిశోధనతో తేలిపోయింది AGEPల కారణంగా మన శరీరంలో ఇన్సులిన్‌ వాడకంలో లోపాలు, కణాల వాపు ఏర్పడతాయన్న విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు న్యూయార్కుకి చెందిన కొందరు వైద్యులు ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం ఒక వందమంది అభ్యర్థలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా ఊబకాయం, అధికరక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారే. అందరూ 50 ఏళ్లు పైబడినవారే. ఈ వంద మందిలో 49 మందిని ఎప్పటిలాగే ఆహారాన్ని తీసుకోమంటూ సూచించారు. మరో 51 మందిని మాత్రం తమ ఆహారాన్ని వండుకునే విధానంలో మార్పులు చేయమని చెప్పారు. వేయించడం, కాల్చడం కాకుండా ఉడికించడం, నానబెట్టడం వంటి పద్ధతుల ద్వారా ఆహారాన్ని వండుకోమని సలహా ఇచ్చారు.   ఫలితం ఊహించినదే! ఒక ఏడాదిపాటు జరిగిన పరిశోధన తరువాత తేలిందేమిటంటే వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తిన్నవారిలో ఇన్సులిన్‌ పనితీరు మెరుగుపడింది. పైగా కణాల వాపు కూడా తగ్గిపోయింది. దీంతో మధుమేహం ఉన్నవారూ, ఆ వ్యాధి ఎప్పటికీ రాకూడని కోరుకునేవారూ వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలన్న విషయం స్పష్టమైంది. అంతేకాదు! శాకాహారంలో AGEPలు స్వతహాగానే చాలా తక్కువ స్థాయిలో ఉంటాయనీ, కాబట్టి మధుమేహానికి దూరంగా ఉండాలంటే ఇలాంటి ఆహారాన్నే తీసుకోవాలని చెబుతున్నారు.   - నిర్జర.

9/11 దాడి ఇంకా పూర్తవ్వలేదు

  2001, సెప్టెంబరు 11. అల్‌ఖైదా ఉగ్రవాదులు రెండు బోయింగ్‌ విమానాల సాయంతో అమెరికాలోని ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేశారు. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులతో సహా 2,700కి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన జరిగి నిన్నటికి 15 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ వేల మంది ఆరోగ్యాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే...     విష వాతావరణం రెండు భారీ విమానాలు అంతకంటే భారీగా ఉన్న భవనాలను కూల్చివేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విస్ఫోటనంలో విమానంలోని ఇంధనం మొదలుకొని, భవన నిర్మాణంలో ఉపయోగించిన యాస్బెట్సాస్ వంటి హానికారక పదార్థాలు ఎన్నో ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. భవనంలో ప్లాస్టిక్‌ మొదలుకొని మానవ విసర్జితాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. అక్కడ ఉన్న యంత్రాలు, పరికరాలు తగలబడిపోవడంతో మెర్క్యురీ, లెడ్ వంటి విషపదార్థాలతో ఆ ప్రాంతం నిండిపోయింది.     తప్పుడు నిర్ణయం ట్విన్‌ టవర్స్‌ని కూల్చివేడం ద్వారా అల్‌ఖైదా అమెరికాను దారుణంగా దెబ్బతీసినట్లు అయ్యింది. కానీ తమ పౌరుల స్థైర్యం ఇంకా చెక్కుచెదరలేదన్న సంకేతాలను అమెరికా పెద్దలు చెప్పాలనుకున్నారు. అందుకనే ట్విన్ టవర్స్‌ చుట్టుపక్కల ప్రదేశంలోని గాలి, నీరు ఇంకా సురక్షితంగానే ఉన్నాయనీ... పౌరులంతా అక్కడే ఉండి తమ రోజువారీ జీవితాన్ని కొనసాగించవచ్చనీ ఊదరగొట్టారు. దాంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు కూడా అక్కడే ఉండిపోయారు. ఆ కాలుష్యంలోనే తమ జీవితాలను గడపసాగారు.     అనారోగ్యాలు మొదలు ఏళ్లు గడిచేకొద్దీ అక్కడి ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా విస్ఫోటనం తరువాత ట్విన్‌ టవర్స్ చుట్టుపక్కల నివసించిన ప్రజలు, అక్కడి ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన కార్మికులలో ఒకొక్కటిగా రోగాలు బయటపడసాగాయి. ఆస్తమా, ఊపిరితిత్తులు పాడైపోవడం, డిప్రెషన్‌, నిద్రలేమి మొదలుకొని క్యాన్సర్‌ వరకూ రకరకాల జబ్బులు పీడించసాగాయి.   ఉచిత వైద్యం 9/11 కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడ్డవారికి చికిత్సను అందించేందుకు 2012లో World Trade Center Health Program పేర ప్రభుత్వం ఒక ఆరోగ్య పథాకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ కాలుష్యానికి బాధితులుగా ఉన్నవారంతా ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఈ పథకం కింద ఏకంగా 75 వేల మంది ప్రజలు చేరారంటే, 9/11 కాలుష్యం ఎంతమందిని ప్రభావితం చేసిందో ఊహించుకోవచ్చు. అయితే ఈ లెక్క చాలా తక్కువని వాదించేవారూ లేకపోలేదు. 9/11 ఘటన జరిగిన తరువాత కొంతమంది అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారనీ, మరికొందరికి అసలు ఈ పథకం గురించే తెలియదనీ చెబుతున్నారు. పైగా క్యాన్సర్‌ వంటి రోగాలు బయటపడటానికి ఒకోసారి 20 సంవత్సరాల వరకూ సమయం పడుతుంది. కాబట్టి మున్ముందు కాలంలో 9/11 బాధితుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భయపడుతున్నారు. అలా ఉగ్రవాదుల పైశాచికత్వానికి, ప్రభుత్వాల తప్పిదాలు కూడా తోడవ్వడంతో 9/11 భూతం ఇంకా న్యూయార్కు వాసులను వెన్నాడుతూనే ఉంది.   - నిర్జర.

Worried of Platelet count?

  A few days back, very few people are aware of the word Platelet. But thanks to the growing awareness, people are now often worried about their platelet counts and the ways in keeping them steady.   What are Platelets? Platelets are the tiniest cells in our blood that stop bleeding. In other words, they plug the injury and don’t let the blood to drain away. A healthy person might have 150,000 to 450,000 platelets per micro litre of blood. But there might be occasions where the count of Platelets might start falling rapidly.     Reasons In medical terms, low platelet count is called as `Thrombocytopenia’. This might be caused due to... - Anaemia. - Deficiency of B12, Iron and folate. - Viral infections such as HIV, Dengue, Chickenpox. - Drugs ranging from Aspirin to chemotherapy drugs. - Severe illness such as cancer, liver cirrhosis and leukaemia. - Heavy alcohol consumption. - Exposure to radiation, toxic chemicals and chemotherapy.   Symptoms Unusual fall of Platelet count can cause a wide range of symptoms from normal bleeding to brain haemorrhage. Some of them are mentioned here... - Dark coloured skin rashes due to bleeding within the layers of the skin. - Abnormal blood flow in menstruation. - Prolonged bleeding from the wounds. - Continuous bleeding from nose and gums. - Unusual bleeding in stools and urine. - Discomfort, weakness and fatigue.   Treatment Often, a drop in platelet count can be a temporary phenomenon. The advice and diagnosis of a medical expert is needed if the Platelet count drops below 150,000 in our blood. But there is no need to worry unless such dip is the result of a severe illness such as leukaemia. - Earlier, Platelet transfusion is thought to be an immediate remedy to increase the count. But now experts are suggesting platelet transfusion to be a last resort as it is expensive and has some   side effects. - Various drugs such as Romiplostim (Nplate), Eltrombopag (Promacta) are widely available to induce Platelet count. - Foods such as Papaya, Pumpkin, Pomegranate, Milk, Carrots, Wheatgrass, Spinach, Oranges are thought to be highly useful in encouraging the Platelet count. - Pills made out of Carica papaya leaf extracts (ex: Carpill) have proved to induce the Platelet count without any side effects.    - Nirjara.  

రాత్రి తిండి ఆరోగ్యానికి చేటు

  పగటి నిద్ర ఆరోగ్యానికి చేటు అని కొందరు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ, రాత్రి పొద్దుపోయాక తినే తిండి తప్పకుండా మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వారు చెబుతున్న కారణాలు కూడా ఏమంత ఆషామాషీగా కనిపించడం లేదు.   - సూర్యోదయ సూర్యాస్తమాలకు అనుగుణంగా మనలో ఒక జీవగడియారం పనిచేస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే! ఈ జీవగడియారాన్ని అనుసరించి పగటివేళ మన శరీరం పనిచేయడానికీ, ఆహారం తీసుకోవడానికీ సిద్ధపడితే, రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.   - ఈ జీవగడియారాన్ని అనుసరించి మన జీర్ణవ్యవస్థకు రాత్రివేళల్లో కనీసం 12 గంటల విశ్రాంతి అవసరం. అయితే ఇలా జీర్ణవ్యవస్థ విశ్రాంతిగా ఉండాల్సిన సమయంలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి రుజువుచేసేందుకు రాత్రివేళల్లో పని చేసే కార్మికులను గమనించినప్పుడు, వారు ఏడాదికి 10-15 కిలోలు అదనపు బరువుని పొందినట్లు తేలింది.   - ఇలా వేళాపాళా లేకుండా జీవగడియారాన్ని ఉపేక్షిస్తూ ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధం వంటి జీర్ణక్రియ సంబంధ వ్యాధులే కాకుండా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నట్లు రుజువైంది.   - సాధారణంగా రాత్రివేళల్లో మన రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. కానీ రాత్రిళ్లు మరీ ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించక, రక్తపోటు యథావిధిగానే ఉంటున్నట్లు తేలింది. టర్కీలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇందుకోసం దాదాపు 700 మంది ఆహారపు అలవాట్లను, వారి రక్తపోటులోని హెచ్చుతగ్గులను పరిశీలించారు. ఆశ్చర్యకరంగా రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నవారిలో రక్తపోటు తగ్గకపోవడం అనే సమస్య, మూడు రెట్లు ఎక్కువగా ఉందని గమనించారు. ఈ రక్తపోటుతో పాటుగా ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి కూడా అధికంగా జరుగుతున్నట్లు వెల్లడయ్యింది. రాత్రివేళల్లో రక్తపోటు తగ్గకపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే!   - ఏతావాతా నిపుణులంతా చెప్పేదేమిటంటే... నిద్రపోవడానికి కనీసం రెండుగంటల ముందరగానే భోజనం ముగించాలి. ఇంకా వీలైతే రాత్రి ఏడుగంటలకల్లా భోజనాన్ని ముగించేస్తే మరీ మంచిది. ఆ భోజనం కూడా భారీగా కాకుండా అధిక కొవ్వు, తీపిపదార్థాలు, వేపుళ్లు అధికంగా లేకుండా సాదాసీదాగా అరిగిపోయే మితాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. దురదృష్టవశాత్తూ మన ఆహారపు అలవాట్లు నిపుణులు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. పగలంతా కష్టపడుతున్నాం కదా అని రాత్రివేళ పొద్దుపోయాక నిదానంగా రకరకాల ఆహారపదార్థాలతో విందుభోజనాన్ని లాగించేస్తున్నాం. ఇక వారానికి ఓసారన్నా బయటకి వెళ్లి విందు చేసుకునే అలవాటూ పెరిగిపోతోంది. అలాంటి అలవాట్లను ఇప్పటికైనా మార్చుకోమన్నదే నిపుణుల ఘోష!                        - నిర్జర.  

Refreshing Epsom Salt Bath

  Have you ever heard of Epsom Salt? Sure you might have certainly heard about it, but didn’t care much of its use! Epsom salt has nothing do with our common salt. It is a pure combination of magnesium and sulphate. There used to be a water spring in England called Epsom which contained these two chemicals. People who took bath in that spring felt relieved from numerous ailments. And this led to the origin of commercial product with such combination.   People use this Epsom salt for various uses, but mixing a cup of Epsom salt in the bathtub is the most popular ploy. Here are a few benefits of Epsom Salt Bath.   Enters the body! Epsom salt when mixed in water breaks down into magnesium and sulphate. There is a populous belief that these chemicals then enter into our body. Even if they don’t enter the body, there is enough scientific evidence to prove that they could affect our skin, muscles and joints.     Relieves from stress There is direct relation between decreased levels of magnesium in our body and increased levels of adrenaline that causes stress. Magnesium enters our skin through the Epsom salt bath and would balance this equation. Further it helps the production of a chemical called serotonin that’s known to keep our mind calm and peaceful.   Extracts the toxins Thanks to our complex living style, our body has now become a hub for numerous toxins. The sulphates in the Epsom salt are known to pull out the toxins from our body. So Epsom salt bath could be regarded as a best way to detoxify ourselves. Soaking in the bath tub filled with Epsom salt for at least 10 minutes a week can certainly serve the purpose.   Relief from pain and swelling Epsom Salt has the soothing effect of relaxing the muscles. It not only relieves the muscles from sprains and inflammation but is also effective in treating pains and ailments related to inflammation such as arthritis, bronchial asthma and migraine. Further magnesium helps the proper functioning of muscles by letting them to absorb the needed calcium.   Skin - Epsom Salt bath has a direct and perfect effect on the skin. - It removes the dead cells from the skin making it look healthier and younger. - Gets rid of fungal infections present on the body such as athlete’s foot. - Smoothes the skin and dislodges blackheads. - provides relief in hard core diseases such as psoriasis. - Fights body odour. - Restores skin health in cases such as sunburns and bruises.   Contradiction: There is no harm in trying Epsom salt bath once in a while, but experts caution against its use in cases of pregnancy, dehydration, open wounds and fresh burns.   - Nirjara. 

చదవండి.. నిద్రపోండి!

  ఈ పోటీ ప్రపంచంలో మిగతా విద్యార్థులకి దీటుగా ఉండాలంటే పాఠ్యపుస్తకాలను బట్టీపడితే సరిపోదు. చదివిన చదువు చక్కగా ఒంటబట్టాలి. ఎప్పుడు పడితే అప్పుడు తిరిగి వాటిని గుర్తుకుతెచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఒక చిత్రమైన పరిశోధన ఫ్రాన్స్‌లో జరిగింది. సైకలాజికల్‌ సైన్స్‌ అనే పత్రికలో ప్రచురించిన ఈ కథనం చదువుకి సంబంధించి ఒక కొత్త చిట్కాను అందిస్తోంది.   చదువు తరువాత నిద్ర తమ పరిశోధనలో భాగంగా లియాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఓ 40 మందిని ఎన్నుకొన్నారు. ఆ నలభైమందిని రెండు జట్లుగా విడదీసి... వాళ్లు అంతకు ముందు ఎప్పుడూ వినని కొన్ని పదాలనూ, వాటికి అర్థాలనూ నేర్పారు. ఉదయం పూట ఒక జట్టుకీ, సాయంత్రం వేళ ఒక జట్టుకీ ఈ శిక్షణ సాగింది. కొన్నాళ్ల తరువాత పరిశీలించి చూద్దురు కదా! సాయంత్రం వేళ నేర్చుకున్న విద్యార్థులు ఉదయంపూట అభ్యసించిన విద్యార్థులకంటే త్వరగా, సమర్థవంతంగా పదాలను నేర్చుకోవడాన్ని గమనించారు.    కారణం! ‘మన మెదడుకి కాస్త విశ్రాంతిని ఇస్తే, అది అప్పటివరకూ నేర్చుకున్న విషయాలను జ్ఞాపకాల రూపంలోకి మలుచుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది’ అంటున్నారు- ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీఫెన్‌ మజ్జా అనే పరిశోధకులు. అందుకనే చదువు తరువాత నిద్రపోయినవారిని కొంతకాలం తరువాత ప్రశ్నించినా కూడా, తాము నేర్చుకున్న విషయాలను చక్కగా గుర్తుచేసుకోగలిగారట. అంటే వారి మెదడులో ఆ విషయం జ్ఞాపకాల రూపంలో శాశ్వతంగా, పదిలంగా ఉండిపోయిందన్నమాట!   ఉపయోగం బాగా చదువుకోవాలనే తపనతో చాలామంది విద్యార్థులు సరిగా నిద్రపోరు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలాగూ వస్తాయని తెలుసు. కానీ నిద్ర మానేసి చదవడం వల్ల అసలుకే మోసం వస్తుందని ఈ పరిశోధనతో రుజువైపోతోంది. ఇక ఉదయాన్నంతా చదువుకున్న విషయాలను సాయంత్రం వేళల్లో ఒకసారి అలా పునశ్చరణ చేసుకుంటే మరింత ఉపయోగంగా ఉంటుందన్న చిట్కాని ఈ పరిశోధన అందిస్తోంది. ఏదన్నా క్లిష్టమైన పాఠాన్ని చదువుకున్న తరువాత ఓ చిన్న కునుకు తీసినా కూడా ఉపయోగంగా ఉండవచ్చునేమో! అటు శరీరానికి విశ్రాంతిని ఇచ్చినట్లూ అవుతుంది. మనం నేర్చుకున్న విషయాలు మెదడులో ఇంకిపోయేందుకు తగిన సమయమూ లభిస్తుంది! ఓసారి పాటించి చూస్తే పోలా!     - నిర్జర.

Ways to change your workout for fall

  As we move from summer to fall, days become colder as well as shorter and the workout routine becomes difficult to follow. Three sports will help you go through this season and will make your workout plan easy to follow. The following are the sports that are to be included in your workout plan this season.   HOT YOGA If you had hit the park in the summer season for yoga classes, then continue your yoga by staying indoors so as to keep yourself warm during the fall. Hot yoga class enables you to work out inside and the heated room can keep you away from cold. The key to make your workout effective is to stay hydrated during the session. According to Mandy Ingber who is Jennifier Anitson’s yoga instructor, hot yoga gives rise to a great cardiovascular workout which helps in increasing the rate of the heart.   SPINNING Outdoor cycling is fun during the summer season, but it is not great for fall as you might get caught in rain during this season. If you love to include cycling in your workout plan during fall, opt for an indoor spinning class. You will not be able to explore outdoors but you can make new friends and stay motivated with the help of indoor spinning. Also sprint cycling techniques can burn up to 675 calories in half an hour. Spinning allows you to challenge your muscles in the legs as well as the bum and it helps in boosting the cardiovascular activities for fast results.   TRAIL RUNNING Trail running is great for this season and is worth getting wet in the rain for, because summer is too hot to run. Train running is advantageous to health and is more challenging when compared to running on tread mill. For this workout you need to run outdoors without using any equipment. You can alternate between running and walking for one or two minutes before running continuously without stopping. Once you get used to it, you can increase the time limit based on your strength and fitness.

పుట్టిన నెలని బట్టి అనారోగ్యాలు

  ఒకో సమయంలో పుట్టిన పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి అని ఊహించేదుకు, ప్రపంచమంతా రకరకాల జాతకాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వైద్యులు కూడా పిల్లలు పుట్టే నెలని బట్టి, వాళ్ల ఆరోగ్యం ఉంటుందని చెప్పడమే కాస్త విచిత్రంగా ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి నాటు వైద్యులు కాదు... కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు తేల్చిన మాట ఇది.   55 రోగాలు! పుట్టిన నెలకీ, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికీ మధ్య ఏదన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానంతో ‘కొలంబియా యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌’లో నమోదైన 17 లక్షల మంది రోగుల వివరాలను పరిశీలించారు. తాము ఎన్నుకొన్న 1,688 రోగాల జాబితాలో 55 రోగాలకీ, పుట్టిన నెలలకీ మధ్య సంబంధం ఉండటాన్ని గమనించారు. ఇలా సంబంధం ఉన్న రోగాలలో ఆస్త్మా, ADHD, సంతానలేమి, గుండెజబ్బులు... వంటి తీవ్రమైన జబ్బులు ఉండటం గమనార్హం.   ఏఏ నెలలలో! మార్చి, ఏప్రిల్ నెలల్లో పుట్టినవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జన్మించినవారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం బయటపడింది. నవంబరులో పుట్టినవారిలో మానసిక సమస్యలు బయటపడే ప్రమాదం కనిపించింది. మొత్తంగా చూస్తే మే, జులై నెలల్లో పుట్టినవారికంటే అక్టోబరు, నవంబరు మాసాల్లో పుట్టినవారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ గణాంకాలు సూచించాయి.   కారణం! పుట్టిన నెలని బట్టి ఆరోగ్యం అన్న మాట విచిత్రంగా ఉన్నా... దానికి హేతుబద్ధమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కాలాన్ని బట్టి తల్లి తీసుకునే ఆహారంలోని మార్పులు, పిల్లలు పుట్టిన వెంటనే వాతావరణంలో ఉండే వివిధ క్రిముల ప్రభావం వంటి కారణాలు చూపిస్తున్నారు పరిశోధకులు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ‘డి- విటమిన్‌’ వల్లే ఇలాంటి మార్పులు కలుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. డి విటమిన్‌ మనలోని ఎముకలు, పళ్లు గట్టి పడేందుకు తోడ్పడుతుందన్న విషయం తెలిసిందే! కానీ మెదడు ఎదుగుదల దగ్గర్నుంచీ, రోగనిరోధక శక్తి వరకూ శరీరంలోని ఎన్నో అంశాలు డి విటమిన్ మీదే ఆధారపడి ఉంటాయని ఇప్పుడిప్పుడే పరిశోధనలు తేలుస్తున్నాయి.   శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇటు తల్లికీ, పుట్టిన తరువాత అటు బిడ్డకూ తగినంత డి విటమిన్‌ అందకపోతే... అది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తత్ఫలితంగానే వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని పేర్కొంటున్నారు. డి విటమిన్ సూర్యరశ్మి నుంచే లభిస్తుంది కాబట్టి, ఆ సూర్య కిరణాల తీవ్రత ఎక్కువగా లేని నెలలలో పుట్టిన పిల్లలని డి విటమిన్‌ లోపం ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నారు.   ఏతావాతా డి విటమిన్‌ లోపమే అసలు దోషమని తేల్చారు పరిశోధకులు. అయితే ఒక నెలలో పుట్టినంత మాత్రాన తప్పకుండా ఆయా రోగాల బారినపడి తీరతారన్న భయమేమీ వద్దనీ.... పోషకాహారం, వ్యాయామం, ఒత్తిడి వంటి ఎన్నో విషయాలను కనుక మన నియంత్రణలో ఉంచుకుంటే  ఏ రోగమూ మన దరి చేరదని అభయమిస్తున్నారు. పైగా సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉండే ఉష్ణదేశాలలో, నెలని బట్టి ఆరోగ్యం అనే తమ పరిశోధన చెల్లకపోవచ్చునని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా గర్భిణీ స్త్రీలు కూడా కాస్త నీరెండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదేమో!     - నిర్జర.

ప్రాణాలు తీస్తున్న ట్రాఫిక్‌

  ట్రాఫిక్‌లో గంటల తరబడి ఎదరుచూడటం అంటే ఎవరికి మాత్రం అసౌకర్యంగా ఉండదు. ఇలా ట్రాఫిక్‌లో సమయాన్ని గడపడం వల్ల సమయం ఎలాగూ వృథా అవుతుంది. దానికి తోడు అది మన ఆయుష్షుని కూడా హరించివేస్తుందన్న హెచ్చరిక ఇప్పుడు వినిపిస్తోంది. ఇంగ్లండుకి చెందిన ఒక భారతీయ పరిశోధకుడు అందిస్తున్న నివేదిక, ట్రాఫిక్‌లో చిక్కుబడిపోవడం ఎంతటి ప్రాణాంతకమో సూచిస్తోంది.   లక్షల ప్రాణాలు గాలిలోని కాలుష్యం వల్ల ఏటా లక్షలమంది ప్రాణాలను కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చరించింది. గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకోవడం వల్ల ఆస్తమా, గుండెజబ్బు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతకమైన జబ్బులెన్నో వ్యాపిస్తాయని తేల్చింది. ఇక ఇంగ్లండులో అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయేవారికన్నా, రోడ్ల మీద ఉన్న గాలిలోని కాలుష్యాన్ని పీల్చి చనిపోయేవారి సంఖ్య పదిరెట్లు ఎక్కువ అన్న గణాంకాలు వినిపిస్తున్నాయి. ఈ మాటల్లో నిజమెంతో తేల్చుకునేందుకు ప్రశాంత్‌ కుమార్‌ అనే నిపుణుడు ఒక పరిశోధనను నిర్వహించారు.   40 శాతం ఎక్కువ సాధారణంగా ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్ ఉన్న చోట వాహనాల నుంచి వెలువడే వ్యర్థాల పేరుకుంటూ ఉంటాయి. అక్కడి ట్రాఫిక్‌ నిరంతరాయంగా సాగుతూ ఉండటంతో, విష పదార్థాలు అక్కడి గాలిలోనే స్థిరంగా ఉంటాయి. పరిశోధకులు సేకరించిన వివరాల ప్రకారం, మామూలు రోడ్ల మీదకంటే... కూడలి వద్ద ఉన్న ట్రాఫిక్‌లో 29 రెట్లు అధికంగా ప్రాణాంతక వాయువులు కనిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల వాహనం కనుక నిలిచిపోతే, అక్కడి కాలుష్యం బారిన పడే అవకాశాలు 40 శాతం ఎక్కువగా ఉన్నాయి.     ఇదీ ఉపాయం! వీలైనంతవరకూ ట్రాఫిక్‌ లేని దిశగా ప్రయాణం చేయమని చెప్పడం సులువే. కానీ ఇది ఏమంత ఆచరణసాధ్యం కాదు కదా! పైగా కారుల్లో ప్రయాణం చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కారు అద్దాలను మూసేసుకొని లోపల ఫ్యాన్‌ వేసుకుని కూర్చోవడం మినహా, వారికి మరో ఉపాయం తోచదు. అయితే దీనివల్ల పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతుందంటున్నారు. బయటనుంచి గాలిని తీసుకునే ఫ్యాన్లు లోపల ఉండే ప్రయాణికులకు మరింత విషపదార్థాలను అందిస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్‌లో కనుక ఇరుక్కుపోయి ఉంటే కిటికీ తలుపులను మూసివేసుకుని, ఫ్యాన్లను ఆపివేయమని సూచిస్తున్నారు. ముందు ఉన్న వాహనానికి కాస్త దూరంగా ఉండమంటూ సూచిస్తున్నారు. దీని వల్ల వాహనం చుట్టూ ఉన్న వాయువులను పీల్చే ప్రమాదం 76% తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండే మన దేశంలో ఈ సలహాని పాటించడం సాధ్యమేనా అన్నదే ప్రశ్న!   - నిర్జర.

చైనా ఏడుపు- జర్మనీ ఏడుపు

పిల్లల ఏడుపుని ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా! ‘ఆ... అందులో గమనించేటందుకు ఏముటుంది? అన్ని ఏడుపులూ ఒకే రకంగా ఏడుస్తాయి కదా!’ అంటారా. పిల్లల మాతృభాషను బట్టి వారి ఏడుపు కూడా మారుతూ ఉంటుందని జర్మనీకి చెందిన ఒక పరిశోధకురాలు తేల్చిచెప్పేశారు. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటో, అందులో తేలిన విషయం ఏమిటో, దాని వల్ల మనకి ఉపయోగం ఏమిటో మీరే చూడండి...   టోనల్‌ లాంగ్వేజ్ అన్ని భాషలూ ఉచ్ఛారణ మీదే ఆధారపడి ఉంటాయన్న విషయం మనకు తెలిసందే! అయితే కొన్ని భాషలలో, ఆ ఉచ్ఛారణలోని చిన్న చిన్న మార్పులను బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు చైనీయులు పలికే మాండరిన్‌ భాషలో ఒకే పదాన్ని నాలుగు రకాలుగా పలికితే, నాలుగు అర్థాలు వస్తాయి. ఇక ఆఫ్రికాలో వినిపించే లామ్‌సో అనే భాషలో అయితే ఒక పదాన్ని ఎనిమిదిరకాలుగా పలికి ఎనిమిది అర్థాలను తీయవచ్చు. ఇలా స్వరంలో మార్పుని బట్టి వేర్వేరు అర్థాలను కలిగించే భాషను ‘టోనల్‌ లాంగ్వేజ్’ అంటారు. మన దేశంలో పంజాబీ భాష మాత్రమే ఈ విభాగం కిందకు వస్తుంది.   భాషని బట్టి ఏడుపు! ఇంతకీ ఈ భాషకూ, పిల్లల ఏడుపుకూ మధ్య సంబంధ ఏమన్నా ఉంటుందా? అని జర్మనీలోని ఉర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కేథ్‌లీన్‌ అనే ప్రొఫెసరుగారికి అనుమానం కలిగింది. అనుకున్నదే తడవుగా చైనాకు చెందిన ఓ 55 మంది పిల్లలనీ, లామ్‌సోని మాట్లాడే ప్రాంతంలో ఓ 21 మంది పిల్లలనీ ఆమె పరిశీలించారు. ఆశ్చర్యంగా మాండరిన్‌ వంటి టోనల్‌ లాంగ్వేజ్ మాతృభాషగా కలిగిన పిల్లల ఏడుపు కూడా అలాగే రాగయుక్తంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. అలాకాకుండా సాఫీగా సాగిపోయే జర్మనీ వంటి మాతృభాషలు కలిగిన పిల్లలు సౌమ్యంగా ఏడుస్తున్నారట   ఎందుకలా! పిల్లలు తమ తల్లి కడుపులో ఉన్న ఆరో నెల నుంచే, ఆమె మాట్లాడుతున్న భాషను గుర్తిస్తారని చెబుతున్నారు కేథ్‌లీన్‌. ఆమె మాట్లాడే భాషకు అనుగుణంగానే తాము కూడా శబ్దాలు చేసేందుకు ప్రయత్నిస్తారనీ... అందువల్ల, తల్లి మాతృభాష పిల్లల ఏడుపులో ప్రతిధ్వనిస్తుందనీ అంటున్నారు. అత్యాధునిక వసతులు ఉన్న చైనాలో అయినా, ఆధునికతకు అల్లంత దూరాన ఉండే ఆఫ్రికాలో అయినా... ఈ నియమం వర్తిస్తుందని రుజువు చేస్తున్నారు.   ఉపయోగం ఇంకా ఈ ప్రపంచంలోకి రాకుండానే పిల్లల మెద,డు తమ మాతృభాషను నేర్చుకునేలా రూపుదిద్దుకుంటోందని ఈ పరిశోధనతో తేలిపోతోంది. దీనిని బట్టి పిల్లలకు మొదట మాతృభాష నేర్పించిన తరువాతే ఇతర భాషల జోలికి పోవాలని స్పష్టమవుతోంది. పైగా ఇలా పిల్ల ఏడుపుని, భాషకు అనుగుణంగా పరిశీలించండం వల్ల... వారి మానసిక ఎదుగుదల సవ్యంగా ఉందా లేదా అన్నది గమనించవచ్చన్నది పరిశోధకులు అభిప్రాయం. మరీ ముఖ్యంగా మున్ముందు సదరు పిల్లల్లో భాషని నేర్చుకోవడంలో ఏవన్నా సమస్యలు ఏర్పడతాయేమో అన్నది ముందుగానే పసిగట్టవచ్చునన్నది కేథ్‌లీన్‌ ఆలోచన. మంచిదే! (తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా)   - నిర్జర.