జగన్, విజయమ్మల రాజీనామాలు పార్టీకి లాభమా, నష్టమా

  జగన్, విజయమ్మల రాజీనామాలతో వైకాపా చాలా తెలివిగా పావులు కదిపిందని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. తమ రాజీనామాలతో తమ ప్రియతమ శత్రువు చంద్రబాబుని, అధిష్టానానికి వ్యతిరేఖంగా మాట్లాడి సీమంద్రాలో ఒక్కసారిగా తన రేటింగ్ పెంచుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వైకాపా అధిగమించిందని విశ్లేషణ. అయితే, వారు తమ వద్ద ఉంచుకొన్నఆఖరి అస్త్రాలను కూడా ఒక చిన్న ప్రయోజనం ఆశించి నిరుపయోగపరుచుకొన్నారని చెప్పక తప్పదు. షర్మిల పాదయాత్ర కూడా ముగించుకొని వచ్చేసారు గనుక, 'సమైక్య చాంపియన్ షిప్ కోసం జరుగుతున్నరేసులో' ఆమెచేత సభలు, దీక్షలు, ర్యాలీలు నిర్వహింపజేసినా వైకాపాకి అదే ఫలితం వచ్చి ఉండేది. కానీ, జగన్ మోహన్ రెడ్డి చాలా అనాలోచితంగా, దూకుడుగా రాజీనామాలు సమర్పించడం వలన, ఇక ఆ పార్టీ నేతలెవరూ కూడా చట్టసభలలో ప్రవేశించే అవకాశం పోగొట్టుకొన్నారు.   ఇంకా సాధారణ ఎన్నికలకి దాదాపు 7-8నెలలు సమయమున్న ఈ తరుణంలో పార్టీకి చెందిన అందరూ రాజీనామాలు చేసి చట్ట సభలలో తమ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేసుకోవడం ఒక అనాలోచిత నిర్ణయమని చెప్పక తప్పదు. ఒక వేళ రాష్ట్ర విభజనపై తీర్మానం చేసేందుకు రేపు రాష్ట్ర శాసనసభను నిర్వహిస్తే, మిగిలిన అన్నిపార్టీలు సభలో తమ వాదనలు వినిపిస్తుంటే, వైకాపా మాత్రం అసెంబ్లీ బయట కూర్చొని ధర్నాలు దీక్షలు చేసుకొంటూ కాలక్షేపం చేసుకోవలసి ఉంటుంది.

విభజనపై ఎంవీవీఎస్ ఘాటు వ్యాఖ్యలు

      టిడిపి మాజీ ఎంపీ, సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి సాధారణంగా సౌమ్యంగా ఉంటారు. అలాంటి నేత విభజనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోవాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని ఆయన అన్నారు. అది లేకుండా చేస్తే మాత్రం రక్తపాతమేనని ఆయన హెచ్చరిస్తున్నారు.   రాష్ట్ర విభజనపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, అయితే హైదరాబాద్ భవిష్యత్తు, రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధివిధానాలు, ఆర్థికపరమైన అంశాలపై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని, ఇక చంద్రబాబు నోరు విప్పే సమయం ఆసన్నమైందని మూర్తి అన్నారు. అధికార దాహంతో, రాజకీయ స్వార్థంతో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌ను విభజించే హక్కు, అర్హత కాంగ్రెస్ పార్టీకి లేవని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన అభినందించారు. 

తెదేపా బీజేపీతో మళ్ళీ స్నేహగీతం ఆలపిస్తుందా

  నరేంద్ర మోడీ మూడవసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేస్తున్నపుడు ఆయన తేదేపాకు కూడా ఆహ్వానపత్రం పంపారు. అప్పుడు బాలకృష్ణ బయలుదేరేందుకు సిద్దపడితే చంద్రబాబు వారించడంతో ఆయన ఆగిపోయారు. అయితే, నిన్నమోడీ హైదరాబాదులో జరిగిన సభకు బయలుదేరక మునుపు, ఇతర సినీ ప్రముఖులతో బాటు నందమూరి బాలకృష్ణ కూడా వెళ్లి మోడీని కలవడం గమనిస్తే, చంద్రబాబు తన మనసు మార్చుకొన్నట్లు అర్ధం అవుతోంది.   బాలకృష్ణ మోడీని పార్క్ హయత్ హోటల్లో కలిసి వచ్చిన తరువాత, మోడీ తన సభలో ప్రసంగిస్తూ తెదేపాను స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవం కోసం ఆయన కాంగ్రెస్ తో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికే ఆయన తెదేపాను స్థాపించాడని, అందువల్ల తెదేపా ఆయన అడుగుజాడలలో నడిచి తన నిబద్దతను చాటుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే ఆయనకు ఘనమయిన నివాళి అర్పించినట్లవుతుందని అని పలికి తెదేపా సెంటిమెంట్ ని కదిపారు. అయితే, ఆయన యన్టీఆర్ పొగిడినంత మాత్రాన్న తెదేపా ఆయనతో పోత్తులకు సిద్దపడిపోదని మోడీకి తెలుసు. కానీ, ఆయన తన ప్రయత్నం తను చేసారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇంచుమించు అదే విధంగా జవాబిచ్చారు.   తెదేపా ఇప్పటికిప్పుడు బీజేపీతో పొత్తులకి సిద్దపడకపోయినా, ఎన్నికలలోగా మళ్ళీ బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనే అవకాశం ఉంది. ఇక రెండు రోజుల క్రితమే తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ బీజేపీతో పొత్తుల గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పడం చూస్తే, ఆ ఆలోచన ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ తెరాసతో, వైకాపాతో పొత్తులు లేదా విలీనాలకి సిద్దపడితే, అప్పుడు తెదేపా కూడా తప్పని పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులకు అంగీకరించక తప్పదు. లేకుంటే ఆ పార్టీ తెలంగాణాలో తీవ్రంగా నష్టపోవడం ఖాయం. అదేవిధంగా తెదేపా కాంగ్రెస్-తెరాస-మజ్లిస్ కూటమికి ఎదురునిలిచి తెలంగాణా రాష్ట్రంలో పట్టు సాధించాలంటే తప్పనిసరిగా బీజేపీతో చేతులు కలపక తప్పదు. లేకుంటే తెదేపా వారి ధాటికి తట్టుకొని నిలబడటం చాలా కష్టం అవుతుంది.   తెదేపా తెలంగాణా ప్రాంతంలో బీజేపీ సహాయం పొందే ప్రయత్నం చేస్తే, బీజేపీ సీమంధ్ర ప్రాంతం తెదేపా సహాయం తీసుకొనే అవకాశముంది. ఒకవేళ రానున్న ఎన్నికలలో బీజేపీ గనుక కేంద్ర ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితికి చేరుకొంటే, అప్పుడు ఆ పార్టీకి తెదేపా వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు చాల అవసరముంటుంది.   ఇక ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో రెండు చోట్ల తన పార్టీని నడపాలని భావిస్తున్న తెదేపా అందుకు వీలుగా తప్పనిసరిగా తమపార్టీకి జాతీయ పార్టీ హోదా పొందవలసి ఉంటుంది. ఒకసారి తెదేపా జాతీయ హోదా పొందిన తరువాత చంద్రబాబు కూడా అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది, గనుక బీజేపీతో చేతులు కలపవచ్చును.

తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను ఆకట్టుకున్న మోడీ

      తమకు తెలంగాణ ఎంత ముఖ్యమో... సీమాంధ్ర కూడా అంతే ముఖ్యమని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. హైదరాబాద్ లో జరిగిన నవ భారత్ యువ భేరీ సభలో మోడీ అందరినీ ఆకట్టుకొనే ప్రసంగం చేసారు. మోడీకి తెలంగాణా అంశం లేకుండా చేసామని సంబరపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మోడీ పెద్ద షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నివ్వెరపోయేలా మోడీ ‘జై తెలంగాణా ! జై సీమంద్రా!’ అని నినాదించి ప్రేక్షకులచేత కూడా నినాదింపజేసారు. రెండు ప్రాంతాలు విడిపోయినా అభివృద్ధిలో పోటీపడి గుజరాత్ ను మించిపోవాలని తానూ మనసారా కోరుకొంటున్నానని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో లక్షలాది తెలుగు ప్రజలు, గుజరాతీలు అన్నదమ్ములుగా కలిసిమెలిసి జీవించగలుగుతున్నపుడు, హైదరాబాద్ నగరంలో వేలాది గుజరాతీలు తెలుగువారితో కలిసిమెలిసి సుఖసంతోషాలతో జీవిస్తున్నపుడు, తెలుగువారు సాటి తెలుగువారితో, అదీ హైదరాబాదులో ఎందుకు కలిసి జీవించలేరని ఆయన ప్రశ్నించారు. తద్వారా అటు తెలంగాణా ప్రజలను, హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులను సంతోషపరచగలిగారు.

కిషన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్య

      బీజేపీ ప్రచార సారథి, గుజరాత్ సీఎం నరేంద్రమోదీ హైదరాబాద్‌లో ప్రారంభించిన 'నవభారత యువభేరి' సభలో కిషన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఒక పోలీసు అధికారిని డ్రెస్ విప్పుతాం అంటూ మజ్లిస్ నేతలు బెదిరిస్తే,వారికి ప్రభుత్వం లొంగిపోయిందని, ఆ అధికారినే బదిలీ చేసిందని ఆయన అన్నారు. "అదే మా ప్రభుత్వం ఉంటే... వారి బట్టలు విప్పించే వాళ్లం'' అని మజ్లిస్ నేతలనుద్దేశించి ఆయన విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయని, గూండాయిజం, రౌడీయి జం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిజాం సొత్తు కాదని ఎంఐఎంపై ధ్వజమెత్తారు.

కొత్త స్నేహితులకోసం మోడీ ప్రయత్నాలు ఫలించేనా

  బీజేపీ కొత్త రధ సారధిగా నరేంద్ర మోడీ పేరు ఖాయం చేయగానే, ఆ పార్టీకి బీహార్ లో మంచి బలమయిన స్నేహితుడిగా పేరున్ననితీష్ కుమార్ బీజేపీ అధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీయే కూటమి నుండి తప్పుకోవడంతో, ఆ లోటును తిరిగి భర్తీ చేయవలసిన భాద్యత సహజంగానే మోడీపై పడింది.   అందుకే నిన్న హైదరాబాద్ లో జరిగిన నవభారత్ యువ భేరీ సభలో ప్రసంగిస్తూ స్వర్గీయ యన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి, కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొట్టడమే ఆయనకు అసలయిన నివాళి అవుతుందని, అందువలన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఆయన నెలకొల్పిన తెదేపా ఆయన అడుగుజాడలలో నడుస్తుందో లేదో తేల్చుకోవాలని అన్నారు. భారత దేశాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించే యుద్ధంలో తెదేపా కూడా పాలు పంచుకోవాలని చెపుతూ తమ ఇద్దరి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీయే గనుక, తమతో చేతులు కలపాలని ఆయన పరోక్షంగా తేదేపాకు సూచించారు.   ఇక అదేవిధంగా తమిళనాడులో కరుణానిధికి చెందిన డీయంకే పార్టీతో కాంగ్రెస్ పోత్తుపెట్టుకొనే అవకాశం ఉంది గనుక, ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేఖించే ఎ.ఐ.ఎ.డీ.యం.కే. పార్టీ అధినేత్రి మరియు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రసన్నం చేసుకొనేందుకు మోడీ తన ప్రసంగంలో గట్టి ప్రయత్నమే చేసారు. కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవడానికి నామోషీగా ఉంటే, పొరుగునున్న జయలలిత పాలిస్తున్నతమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు. తద్వారా తమిళనాడులో తమ పార్టీ ఎ.ఐ.ఎ.డీ.యం.కే.తో స్నేహంచేసే ప్రయత్నం చేసారు.   ఇంతవరకు బీజీపీ దక్షిణాదిన కేవలం కర్ణాటకలో మాత్రమే కాలుపెట్టగలిగింది. కానీ, ఎడ్యురప్ప పుణ్యమాని దానిని కూడా ఇటీవల జరిగిన ఎన్నికలలో పోగొట్టుకొని, మళ్ళీ మొదటికొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ దక్షిణాదిన నిలద్రొక్కుకోవడానికే మోడీ వ్యూహాత్మకంగా అన్ని సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న హైదరాబాదును ఎంచుకొన్నారని అర్ధం అవుతోంది.   అయితే రానున్న కాలంలో ఆయన దేశప్రజలపై ఏమేరకు ప్రభావం చూపగలరనే దాని మీదనే ఆధారపడి కొత్త స్నేహితులు ఏర్పడుతారు తప్ప, ఆయన పొగడ్తలకు చంద్రబాబు, జయలలిత వంటి వారు అంత తొందరగా పడిపోయే అవకాశం లేదు. ఏమయినప్పటికీ, మోడీ వారందరికీ ‘ద్వారములు తెరిచేయే ఉంచెను’ అని చెప్పకనే చెప్పారు.

అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్‌

  ట్రాఫిక్ చ‌లానాల భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర‌సిస్తూ ఆటో యూనియ‌న్‌లు ఆటోల బంద్ కు పిలుపునిచ్చాయి. ఆటో పార్కింగ్ స‌మ‌స్యకు ఎలాంటి ప‌రిష్కారం చూపించ‌కుండానే ట్రాపిక్ ఉల్లంఘ‌న‌కు జ‌రిమానాను ఏక‌ప‌క్షంగా వేయి రూపాయ‌ల‌కు పెంచుతూ ట్రాపిక్ పోలీస్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఆటో డ్రైవ‌ర్స్ జేఏసి ఖండించింది. దీనికి వ్యతిరేకంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్ పాటిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది ఆటోడ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తుంద‌ని చెప్పారు. సిగ్నల్ జంపిగ్ లాంటి వాటికి చ‌లానాలు రాస్తున్న ప్రభుత్వం 20కిపైగా కూడ‌ళ్లలో సిగ్నల్స్ ప‌నిచేయ‌టం లేద‌ని ప్రభుత్నానికి తెలియ‌దా అని చెప్పాడు. అమిత్‌గార్గ్ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపిం చారు. నగరంలో ఆటోల‌కు పార్కింగ్ ఏర్పాటు చేసే వ‌ర‌కు చ‌లాన్లను పెంచ‌వద్దని కోరారు.అలా చేయ‌ని ప‌క్షంలో నిర‌వ‌దిక స‌మ్మెకు దిగుతామ‌ని హెచ్చరించారు.  న్యాయపరమైన డిమాం డ్లను అంగీకరించే వరకూ సమ్మెను కొనసాగించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు.

కాంగ్రెస్ నుంచి విముక్తే ఎన్టీఆర్‌కు నివాళి : మోడి

  అంద‌రు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోడి ప్రసంగం అనుకున్నట్టుగా అంద‌రిని ఆక‌ట్టుకుంది. మొద‌ట త‌న ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోడి తరువాత త‌న మార్క్ విమ‌ర్శనాస్త్రాల‌తో కాంగ్రెస్ పార్టీపై విరుచు ప‌డ్డారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ 85 ఏళ్ల వృద్ధురాలికి, స్వాతంత్య సమర యోధులకు పాదాభివందనం చేసి ఆయన ప్రసంగాన్ని మొద‌లు పెట్టారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నాన్నరు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచనం దినం అని.. అలాగే నా పుట్టిన రోజు కూడా  అదే రోజని ఆయన తెలిపారు. ప్రసంగం అంతా ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌భ‌లాగే జ‌రిగింది. యుపిఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్న ఆయ‌న‌ కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్కు సద్బుద్ధి ప్రసాదించమని దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని దేశ ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్థుతం రాష్ట్రంలోనె  కొన్న ప‌రిస్థితుల‌ను కూడా మోడి త‌న ప్రసంగంలో ప్రస్థావించారు. తెలుగు ప్రజ‌లు రెండు వ‌ర్గాలు విడిపోయి ఘ‌ర్షణ‌లు ప‌డ‌టానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే సీమాంద్ర అభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే 2004లోనే ఎందుకు తెలంగాణ ప్రక్రియ  మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. తెలుగు నేల మీద కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్టీఆరే కారణం అన్న ఆయ‌న కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి లభిస్తేనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అన్నారు.

సమైక్య జంతర్ మంతర్ పనిచేస్తుందా

  కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, యంయల్సీలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఈనెల 13న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చెప్పటనున్నారు. అయితే, కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని ఖరాఖండిగా చెపుతున్ననేపధ్యంలో వారి నిరసన దీక్షలు ఏమయినా ప్రభావం చూపగలవా? అనే ధర్మసందేహానికి మంత్రి శైలజానాథ్ జవాబు చెపుతూ, “ఇక చర్చలే లేవని తేల్చి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానాన్నితమ ఒత్తిడితో ఇప్పుడు ఆంటోనీ కమిటీ పేరిట చర్చలకు ఒప్పించగలిగామని, అదే విధంగా ఆఖరి నిమిషం వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర కోరుకొంటున్న నేతలందరూ 12వ తేదీ సాయంత్రానికల్లా డిల్లీ చేరుకొని 13న జరిగే నిరసన దీక్షలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తధ్యమని ఒకసారి, ఆంటోనీ కమిటీకి నిర్దిష్ట వ్యవధి ఏదీ లేదని మరొకసారి చెపుతూ రెండు ప్రాంతాల ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నదిగ్విజయ్ సింగ్ పై సీమాంధ్ర నేతలు ప్రయోగించనున్నఈ సమైక్య జంతర్ మంతర్ పనిచేస్తుందా? లేదా? లేక కొద్ది రోజుల క్రితం టీ-కాంగ్రెస్ నేతల చేత తెలంగాణా సాధన సభ పెట్టించి పదిరోజులోనే చాలా నాటకీయంగా నరేంద్ర మోడీ సభకు ముందుగానే తెలంగాణా ప్రకటించేసి, తెలంగాణపై మోడీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, నేడు మోడీ సభ ముగిసిపోతుంది గనుక ఇప్పుడు సీమంద్రాలో తన పార్టీని కాపాడుకొనేందుకు మళ్ళీ తన తెలంగాణా నేతల మీద ఈ జంతర్ మంతర్ ని ప్రయోగిస్తోందా? లేక సమైక్యవాదులు నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం మీద ఈ జంతర్ మంతర్ ను ప్రయోగిస్తున్నారా? తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

కొండా దంపతులకు దిగ్విజయ్ డిసపాయింట్మెంట్

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకొన్న తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకి వచ్చిన కొండా సురేఖ దంపతులు తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకొనేందుకు మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ ను ఆశ్రయించారు. ఆయితే ఆయన రాయభారం పనిచేయలేదని సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలవాలనుకొన్న కొండా దంపతులకు ఆయన అప్పాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. గతంలో వైకాపాలో ఉన్న సమయంలో వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వారు తీవ్రంగా దూషించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోయినట్లతే, వారు బీజేపీలో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే, తెలంగాణా ప్రాంతంలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ మరింత బలపడి, మరికొన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకొనే వీలుకలుగుతుంది. ఇది కాంగ్రెస్ తెరాస రెండు పార్టీలకి నష్టమేనని చెప్పవచ్చును.

మోడీని కలిసేందుకు క్యూ కట్టిన తెలుగు సినీ పరిశ్రమ

  ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో ‘నవ భారత్ యువ భేరి’ బహిరంగ సభలో ప్రసంగించేందుకు హైదరాబాద్ చేరుకొన్నారు. ఆయనను కలుసుకొనేందుకు తెలుగు చిత్ర సీమకు చెందిన ప్రముఖులు చాలా మంది తరలి రావడం విశేషం.   ఆయన కలిసిన వారిలో డా.డీ.రామానాయుడు, కే.రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ, వీవీ వినాయక్, కోట శ్రీనివాస రావు, మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు, కృష్ణం రాజు, కీరవాణి, రవి తేజ, ఆలి, నిర్మాత సి. కళ్యాణ్, జగపతి బాబు తదితతరులున్నారు.   తెలుగు చిత్ర సీమలో దాదాపు 70 శాతం మంది సీమాంధ్ర జిల్లాలకు చెందినవారే కావడంతో, రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతున్న ఈ తరుణంలో వారందరూ మోడీని కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొంది. వారు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తూ మోడీకి మద్దతుగా నిలుస్తున్నామని తెలిపేందుకు కలిసారా? లేక రాష్ట్ర విభజనకు మద్దతునిచ్చిన బీజేపీ తరపున ఆయనను హైదరాబాద్ విషయంలో రెండు ప్రాంతాల మధ్య చెలరేగుతున్న వివాదంపై తన ప్రసంగంలో ప్రస్తావించామని కోరేందుకే వెళ్లి కలిసారా? లేక బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా చెప్పబడుతున్నఆయనను కేవలం మర్యాదపూర్వకంగా కలిసారా? అంటే వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో కలిసి ఉండవచ్చును.   ఏమయినప్పటికీ, ఇంత మంది సినీ ప్రముఖులు నరేంద్ర మోడీని కలవడానికి ఉత్సుకత చూపించడం రానున్నఎన్నికలలో వారిలో కొందరయినా బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పవచ్చును. హాస్య నటుడు ఆలీపై రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే మీడియాలో వార్తలు రావడం, వాటిని ఆయన ఖండించడం అందరూ ఎరిగిన విషయమే. కానీ, నేడు ఆయన కూడా మోడీని కలవడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.

తిరుప‌తిని మాకిచ్చేయండి

ఆంద్రప్రదేశ్ లో విభ‌జ‌న స‌మైక్య సెగ‌ల‌తో భ‌గ్గుమంటుంటే, ఓ తమిళ నాయ‌కుడు కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకు వ‌చ్చాడు. తెలంగాణ,సీమాంద్ర ప్రాంతాల వారే పంప‌కాలు తేల‌క గొడ‌వ‌లు ప‌డుతుంటే ఇప్పుడు కొత్త గా తిరుప‌తిని మాకు ఇచ్చేయండి అంటూ ఓ ఫ‌న్నీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు పిఎంకే నేత రాందాస్ . రాష్ట్రంలో నేల కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల మూలంగానే ఇలా పొరుగు రాష్ట్రాల వారికి లోక‌వ‌వున్నామంటున్నారు సీమాంద్ర నాయ‌కులు. ఇన్నాళ్లు విభ‌జ‌న సెగ‌ల‌తో అబివృద్దిలో వెనుక‌ప‌డిన రాష్ట్రం ఇప్పుడు స‌మైక్య సెగ‌ల‌తో అట్టుడుకుతుంది. దీంతో మ‌రోసారి అభివృద్ది ఆగిపోయింది. తిరుప‌తిలో తెలుగు మాట్లాడే వారికంటే అర‌వం మాట్లాడేవారే ఎక్కువ‌గా ఉన్నార‌న్న రాందాస్ ఈ కార‌ణం తోనే తిరుప‌తిని మాకు ఇచ్చేయాల‌ని కోరుతున్నామ‌న్నానరు. అయితే రాందాస్ వ్యాఖ్యల‌తో తిరుప‌తి విడిపోక‌పోయినా.. మనం పొరుగు రాష్ట్రాల దృష్టిలో ఎంత చుల‌క అయ్యామో మాత్రం అర్ధం అవుతుంది.

13 న డిల్లీకి సియం

  సీమాంద్ర నిర‌స‌న జ్వాల‌ల నేప‌ధ్యంలో సియం కిర‌ణ్‌కుమార్ రెడ్డి మ‌రోసారి డిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 13 న డిల్లీ వెళ్లనున్నా ఆయ‌న‌రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోని కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఇప్ప‌టికే డిల్లీలో ఉన్న పిసిసి చీఫ్ బోత్స స‌త్యనారాయ‌ణ కూడా అదే రోజు ఆంటోని క‌మిటీతో టేటి కానున్నారు.  13న డిల్లీ అందుబాటులో ఉండాల‌న్న హైక‌మాండ్ ఆదేశంతో ఇద్దరు నేత‌లు ఆ రోజు డిల్ల ఈ వెళ్లనున్నారు. సియం, పిసిసి చీఫ్‌ల‌తో స‌మావేశాల త‌రువాత ఆంటోని క‌మిటీ రాష్ట్ర పర్యట‌న‌కు సంభందించి ఓ ప్రక‌ట‌న విలువ‌డ‌నుంది. ఆంటోని కమిటీతో భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఇతర పెద్దలను కూడా సీఎం కలవనున్నారు. సోనియాగాంది అపాయింట్‌మెంట్ కోసం కూడా సియం ప్రయ‌త్నిస్తున్నారు.

హైద‌రాబాద్ చేరుకున్న మోడి

బిజెపి పార్టీ ఎన్నిక‌ల ర‌థ‌సార‌థి, గుజ‌రాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ  బేగంపేట‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ నేతలు కిషన్రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి. కృష్ణంరాజుల‌తోపాటు పలువురు ప్రముఖులు మోడీకి స్వాగతం పలికారు.  నగరంలోని ఎల్ బీ స్టేడియంలో మధ్నాహ్నం జరగనున్న నవభారత్ యువభేరి సదస్సులో మోడీ పాల్లొననున్నారు. కాసేపు పార్క్ హాయ‌త్ హోట‌ల్ లో బ‌స చేయ‌నున్న ఆయ‌న ప‌లువురు పారీశ్రామిక‌,సినీ, విద్యా రంగ నిపుణుల‌తో స‌మాశేం కానున్నారు. త‌రువాత ఎల్ బి స్టేడియంలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. ఆ త‌రువాత ఓ స్కూల్ ఆవ‌ర‌ణ‌లోని  స‌ర్దార్ వ‌ల్లాబాయ్ ప‌టేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.   ఎన్నిక‌ల సార‌థిగా ఎంపిక అయిన త‌రువాత త‌న తొలి ఎన్నిక‌ల ప్రచారాన్ని ఈ వేదిక నుంచే ప్రారంభిస్తున్నారు మోడి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసేందుకు దేశావ్యాప్తంగా వివిధ నగరాల్లో మోడీ 100 సభల్లో  పాల్గొనున్నారు. ఈ స‌భ వేదిక నుంచి మోడి చేసే ప్రసంగం కోసం యావ‌త్ భార‌తం ఉత్కంట‌గా ఎదురు చూస్తుంది.

తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర

రాష్ట్రంలో ఏర్పాడ్డ అనిశ్చితి నేప‌ధ్యంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మ‌రోసారి యాత్రకు సిద్దమ‌వుతున్నారు. ఈ సారి బ‌స్సులో రాష్ట్రవ్యాప్త ప‌ర్యట‌న చేయ‌నున్న ఆయ‌న ఈ యాత్రకు తెలుగు జాతి ఆత్మగౌర‌వ యాత్ర‌గా నామ‌క‌ణం చుశారు. తెలంగాణ కు అన్ని పార్టీలు అనుకూలంగానే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రక‌టించిన తీరు త‌రువాతి ప‌రిణామాల‌ను ఈయాత్రలో ప్రజ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. చంద్రబాబు నిర్వహించిన పాట పాద‌యాత్రకు మంచి స్పంద‌న వ‌చ్చిన నేప‌ధ్యంలో ఇప్పుడ చేప‌ట్టబోయే ఆత్మ గౌర‌వ యాత్రకు సూప‌ర్ స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజ‌ల అభిప్రాయ‌న్ని గౌర‌వించి తెలంగాణకు అనుకూలంగా ప్రక‌ట‌న చేశాం గాని ఇలా సీమాంద్రకు అన్యాయం చేయ‌మ‌న‌లేద‌న్నారు. రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్‌తోనూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల‌ను క‌లిసి రాష్ట్రప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నారు.

వెనక్కి త‌గ్గే ప్రస‌క్తే లేదు

  తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు ఏస్థాయిలో ఉన్నా విభ‌జ‌న విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ప్రక‌టించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ వ్యవ‌హారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ ప్రక్రియను కొనసాగించే బాధ్యత భారత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామ‌న్న ఆయ‌న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కొన‌సాగుతుంద‌న్నారు. ప్రక‌ట‌న నేప‌ధ్యంలో స‌మ్మె దిగ‌బోతున్న ఏపి ఎన్జీవోల‌ను స‌మ్మె విర‌మించుకోవాల‌ని కోరారు. ఏ ప్రాంత వారైన త‌మ అభిప్రాయాల‌ను ఆంటోని క‌మిటీకి విన్నవించుకోవ‌చ్చన్నారు. రాష్ట్ర విభజన జరిగినందువల్ల సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎవరు ఎక్కడైనా స్థిరపడవచ్చు, జీవించవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యల‌పై స్పందించిన దిగ్వజ‌య్‌, ఆయ‌న‌తో మాట్లాడాన‌న్నారు. సియంపై ఎలాంటి వివ‌ర‌ణ కోర‌లేద‌న్న ఆయ‌న ఎలాంటి చ‌ర్యలు కూడా ఉంబడ‌బోవ‌ని తేల్చిచెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడిన తరువాత ఊహించినట్లుగానే ఆయనపై జైపాల్ రెడ్డితో సహా తెలంగాణావాదులు అందరూ తీవ్ర విమర్శలు చేసారు. ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అయితే కిరణ్ కుమార్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదంటూ హేళన చేయడమే కాకుండా, ఆయన కావాలనుకొంటే హైదరాబాదులో ‘కర్రీ పాయింటు’ నడుపుకోవచ్చునని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేరు.   ఇక టీ-కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ కు ఎంత మాత్రం తీసిపోకుండా ముఖ్యమంత్రిని దుమ్మెత్తిపోశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే, ఏకంగా గంటకు పైగా మీడియా సమావేశం నిర్వహించి, ఆయన లేవనెత్తిన ప్రతీ అంశాన్ని తప్పుపడుతూ వాదనలు చేసి, కమాండరు ఎన్నడూ కూడా కుట్రదారుడుగా వ్యవహరించడం కూడదని సున్నితంగా వాతలు పెట్టారు. కొంత మంది టీ-కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి పిర్యాదు చేయడానికి కూడా సిద్దపడుతున్నారు.   అయితే, వారందరినీ నివ్వెరపరుస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకు వస్తూ “ఆయన విధేయుడయిన క్రమశిక్షణగల పార్టీ కార్యకర్త” అని వర్ణించారు. అంతే గాకుండా, “ఆయన పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించి తప్పు చేసాడని భావించడం లేదని, అందువల్ల ఆయనని సంజాయిషీ కోరడం లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని” కూడా స్పష్టం చేసారు.   ఇక, దిగ్విజయ్ సింగ్ నిన్నఆంటోనీ కమిటీ గురించి మీడియాతో మాట్లాడుతూ ‘ఆ కమిటీకి తెలంగాణతో, రాష్ట్ర విభజన ప్రక్రియతో ఖచ్చితంగా సంబంధం ఉందని’ కుండ బ్రద్దలు కొట్టడంతో, అంతవరకు అందుకు విరుద్దంగా వాదిస్తున్న టీ-కాంగ్రెస్ నేతలే కాదు తెరాస నేతలు కూడా ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ‘అంటోనీ కమిటీ తన పని పూర్తిచేయడానికి నిర్దిష్ట కాలపరిమితి కూడా ఏమీ విధించలేదని ఆయన మరో బాంబు కూడా ప్రేల్చారు.   విభజనకు వ్యతిరేఖంగా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డిని దండించకపోగా ఆయనను వెనకేసుకు రావడం, అంటోనీ కమిటీ గురించి దిగ్విజయ్ సింగ్ అన్నమాటలతో తెలంగాణా వాదులందరిలో మళ్ళీ ఆందోళన, ఆనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు మంత్రి శైలజానాథ్ ‘తామే విభజన ప్రక్రియను వాయిదాపడేలా చేసామని’ చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అందుకే, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందేవరకు తెలంగాణాలో ఎటువంటి సంబరాలు, సన్మానాలు పెట్టుకోవద్దని సూచించారు.

వైఎస్ జగన్, విజయమ్మ రాజీనామా

      వైఎస్ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద వైఖరిని నిరసిస్తూ తమ యంపీ, శాసనసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసారు. వారు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లో ఫాక్స్ చేశారు. జగన్ కడప లోక్ సభకు, విజయమ్మ పులివెందులకు శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వారు తమ రాజీనామాలకు చెపుతున్న కారణాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ పార్టీ తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన తరువాత కూడా, నేటికీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పకుండా, ఇటువంటి కుంటి సాకులు చెపుతూ రాజీనామాలు చేయడం ఆ పార్టీ రాజకీయ దౌర్భాల్యాన్ని సూచిస్తోంది.   తమ పార్టీ శాసనసభ్యుల చేత సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయించినప్పుడు కూడా ఆ పార్టీ దైర్యంగా ఆమాట చెప్పలేకపోయింది. అందువల్ల ఆ పార్టీకి చెందిన కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలను కోల్పోవడమే కాకుండా, తెలంగాణాలో మళ్ళీ కాలుపెట్టే అవకాశం లేకుండా చేసుకొంది. మళ్ళీ ఇప్పుడు కూడా తమ రాజీనామాలకు డొంక తిరుగుడు కారణాలు చెప్పడం నవ్వుతెప్పిస్తుంది.

దేశ విచ్చిన్నమే దేశ భక్తా?

      దేశ సమగ్రతను కాపాడుకోవటానికి,దేశ సంక్షేమాన్ని పరిరక్షించు కోవటానికి,ప్రపంచ దేశాలలో తనదైన స్థానాన్ని సుస్థిర పరుచుకోవటానికి స్వాతంత్ర్యాననంతరం ఆనాటి పెద్దలు 525 సంస్థానాలుగా ఉన్న భారతావనిని 25 రాష్ట్రాలుగా నెలకొల్పారు. దీని ఉద్దేశ్యం దేశ ప్రజలందరికి ఒక జాతిని నిర్దేశించి అందరిని ఒక్కతాటి మీదికి తీసుకు రావటం. ఈ 25 రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏర్పాటు చేయబడినవి. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ భాషా ప్రాతిపదికన ఏర్పడినవే. అలా భారత దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్ట మొదటి రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్. భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పటిష్టంగా ఉండాలంటే బలమైన రాష్ట్రాలు ఉండాలని ఆనాటి నాయకుల ముఖ్య ఉద్దేశ్యం.    నేటి ఆధునిక భారతదేశాన్ని  ఏలుతున్నవి సంకీర్ణ ప్రభుత్వాలు. వీటి నేపధ్యంలో అతి తక్కువమంది ఎమ్.పి లు ఉన్న పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తమ ఇష్టానుసారం శాసిస్తున్న కారణంగా నేటి మేధావులు కూడా దేశ సమగ్రతను కాపాడుకోవటానికి బలమైన రాష్ట్రాలు ఉండాలనే కోరుకుంటున్నారు.                    కాని బి.జె.పి వారు తాము అధికారంలో ఉన్న సమయంలో చిన్న రాష్ట్రాలు అయితేనే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందనే అజ్ఞానంతో ఉత్తర్ ప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ నుండి ఛత్తీస్ ఘడ్,బీహార్ నుండి జార్ఖండ్ అనే మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆ రాష్ట్రాలను అలా విభజించటం ద్వారా ఆయా రాష్ట్రాలు సాధించిన ప్రగతి ఏమిటో బి. జె. పి  వారు దేశ ప్రజలకు చెప్ప గలరా?                   ఛత్తీస్ ఘడ్ లోని చాలా భూభాగం మావోయిస్టుల అధీనంలో ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఉత్తరాఖండ్ ఏర్పడి ఇంత కాలమైన ఆ ప్రాంతం వారు అక్కడికి వచ్చే యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయం మీదనే ఆధారపడి బ్రతకవలిసి వస్తోంది. మొన్నటికి మొన్న వరదలోస్తే సహాయక చర్యల నిమిత్తం తక్షణ చర్యలు చేపట్టే సరైన ప్రభుత్వ యంత్రాంగం  కూడా లేని దుస్థితిలో ఆరాష్ట్రం ఉంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడి 11,12 సంత్సరాలు ఐన 9 ప్రభుత్వాలు మారి పూర్తి రాజకీయ అనిశ్చితిలో ఉంది.                     తమను తాము దేశ భక్తులుగా చెప్పుకొనే బి. జె. పి వారు ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేయటం ద్వారా సంభవించిన సంక్షోభానికి  ఏ మూల్యం చెల్లిస్తారు? కాంగ్రెస్ లౌకికవాద ముసుగుతో దేశాన్ని మోసం చేస్తుందని బి.జె.పి  విమర్శిస్తూ ఉంటుంది.బి.జె. పి మతవాదం తో దేశాన్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది. కానీ విధి విధానాల పరంగా ఈ రెండు పార్టీలకు ఎటువంటి భేదం కనిపించదు. ఉదాహరణకు ఎఫ్.డి.ఐ ల విషయం లో కాంగ్రెస్ ను బి.జె.పి  సమర్ధించింది. బి.జె.పి  వారు కోరుతున్నట్లుగా తెలంగాణ ఏర్పాటు చేయటానికి కాంగ్రెస్ ముందుకు వస్తోంది. వీరి చౌకబారు రాజకీయాల కారణంగా దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే,రాష్ట్రం అభివృద్ధి విషయంలో 10 సంత్సరాలు వెనక్కి పోయింది.                    సమైఖ్యాంధ్ర ఉద్యమంతో సీమాంద్ర  ప్రాంతం  అట్టుడికి పోతుంటే రాష్ట్రం నుండి బి.జె.పి కి ప్రముఖ పాత్ర వహిస్తున్న వెంకయ్యనాయుడు ఈ సంక్షోభానికి కారణం కాంగ్రెస్సే,ఆ పార్టీనే సమాధానం చెప్పుకోవాలి అని రాజ్యసభలో వ్యాఖ్యానించటం  ఆయన తద్వారా ఆయన పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం. రాష్ట్రంలో నేటి రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో అదే స్థాయిలో బి.జె. పి పాత్ర కూడా ఉందనే విషయం ప్రజలందరికి తెలుసు. ఈ రెండు పార్టీల రాజకీయదురుద్దేశ్యమే ఈ దుస్థితికి కారణం. చిన్న రాష్ట్రాల పేరుతో దేశాన్ని విచ్చిన్నం చేయాలనే కోరుకుంటుంటే బి. జె. పి  దేశభక్తి అనే ముసుగును తొలగించు కుంటే మంచిది.