అపాయింటెడ్ డేపై స్టేకి హైకోర్టు నో!

  ఆదివారం సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి చివరి రోజు. ఆదివారం అర్ధరాత్రి దాటి సోమవారం ప్రవేశించగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోనుంది. తెలంగాణ బిల్లులో పొందుపరిచిన అపాయింటెడ్ డే అనుసరించి జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం రెండు ముక్కలు కాబోతోంది. అయితే రాష్ట్ర విభజనను ఆపడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్న కొందరు సమైక్యవాదులు పట్టువదలని విక్రమార్కుల్లా తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. అయితే అవి ఫలితాన్ని ఇవ్వడంలేదు. రాష్ట్రాలను రెండుగా విభజించే అపాయింటెడ్ డేకి స్టే విధించాలని సంజీవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలుచేసిన హౌస్ మోషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్డులో పెండింగ్‌లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని, అపాయింటెడ్ డే పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అయిదు వారాలకు వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర విభజనకు ముందు రోజు కూడా సమైక్యవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారికి మరోసారి నిరాశే మిగిలింది.

హైదరాబాద్‌లో తల్లిపాల బ్యాంకు

  దేశంలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంక్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దీనిని ‘మదర్ మిల్క్ బ్యాంక్’ అని వ్యవహరిస్తారు. పుట్టుకతోనే తల్లులను కోల్పోయిన పిల్లలకు అమ్మపాలు అందించడం కోసం బాలల హక్కుల సంఘం ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకులో సభ్యురాళ్ళుగా చేరే మహిళలు తల్లిలేని పిల్లలకు కొంతకాలం పాలు అందిస్తారు. తద్వారా తల్లిలేని పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి తమవంతు సహాయాన్ని అందిస్తారు. ఈ బ్యాంకులో సభ్యురాలుగా చేరి తల్లిలేని పిల్లలకు పాలు అందించడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటి మహిళ పేరు లక్ష్మి. ఈమెలాగా ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి తల్లిలేని పిల్లలకు పాలు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ శ్రమ ఫలించినట్టు భావిస్తామని మదర్ మిల్క్ బ్యాంక్ నిర్వాహకులు అంటున్నారు.

యు.పి.ఎస్.సి. అభ్యర్థులకు శుభవార్త

  సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించడానికి, ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లు అవడానికి పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించే అభ్యర్థులకు ఒక శుభవార్త. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు యు.పి.ఎస్.సి. ఒక వెసులుబాటు కల్పించింది. గతంలో ఒక అభ్యర్థి నాలుగుసార్లు మాత్రమే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అవకాశం వుండేది. అయితే దానిని ఆరుసార్లకు పొడిగిస్తూ యు.పి.ఎస్.సి. నిర్ణయం తీసుకుంది. అలాగే 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు వున్న అభ్యర్థులు పరీక్షలు రాసుకోవచ్చని వయసు సడలింపును కూడా ప్రకటించింది. ఎస్.సి., ఎస్టీ అభ్యర్థులు మాత్రం గతంలో తరహాలోనే ఎన్నిసార్లయినా సివిల్స్ పరీక్షకు హాజరు కావొచ్చు. ఈసారి ఆగస్టు 24వ తేదీన సివిల్స్ పరీక్ష జరగబోతోంది. ఈ ఏడాది 1291 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో 26 స్థానాలను వికలాంగులకు కేటాయించారు.

పొగాకు వాడొద్దు.. బాధ పడొద్దు: మోడీ సందేశం

  ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నిర్వీర్యం చేసే అంశాల్లో పొగాకు కూడా ఒకటి. పొగాకు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది మరణిస్తున్నారు. ఏ రూపంలో వాడినా పొగాకు మనిషి జీవితాన్ని కబళిస్తూనే వుంది. అయితే పొగాకును పూర్తిగా నిషేధించే పరిస్థితులు లేవు. పొగాకు వాడకం మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్ప మరో మార్గం లేదు. మన భారతదేశంలో పొగాకు కారణంగా జనం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో క్యాన్సర్ మహమ్మారి విస్తరించడానికి పొగాకు ప్రధాన కారణంగా వుంటోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పొగాకు వినియోగాన్ని మానుకోవాలని జాతికి పిలుపు ఇచ్చారు. శనివారం నాడు పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజల్ని పొగాకు విషయంలో చైతన్యవంతులను చేయాలని భావించారు. అందుకే ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘పొగాకు వాడకం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల విషయంలో ప్రజలకు అవగాహన పెంచుదామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని ట్విట్ పోస్ట్ చేశారు. మోడీ చెప్పినట్టు విందాం. ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని కాపాడుకుందాం.

పులిని చూసి వాతలు పెట్టుకొన్నట్లు...టీ-కాంగ్రెస్ నేతలు

  సీమాంధ్రాలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో గెలవలేకపోయింది. అందుకు ప్రధాన కారణం టీ-కాంగ్రెస్ నేతలు ఎవరికీ వారు తమ స్వార్ధం చూసుకొన్నారే తప్ప, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని గట్టిగా ప్రయత్నించక పోవడమే. అందుకు మరో బలమయిన కారణం కూడా ఉంది. తమను నట్టేటముంచిన కేసీఆర్ ను టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసి కట్టుగా గట్టిగా ఎదుర్కొనే బదులు, ఆయన వ్యూహాలనే గుడ్డిగా అనుసరించే ప్రయత్నం చేసారు. హైదరాబాదులో సెటిలర్లు, సీమాంధ్ర ప్రభుత్వోద్యోగులకు మొదట అండగా నిలబడిన టీ-కాంగ్రెస్ నేతలు, ఆ తరువాత కేసీఆర్ వారిపై దాడి తీవ్రతరం చేసిన్నపుడు, వారికి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. వారికి అండగా నిలబడినట్లయితే తెలంగాణా ప్రజల ఓట్లు కోల్పోతామనే భయంతో వారిని విడిచి పెట్టేసారు. మునుపటిలా వారి భద్రతకు భరోసా ఇస్తూ గట్టిగా మాట్లాడలేదు. అందుకే వారి పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయి, చివరికి ఘోర పరాజయం పొందారు.   కనీసం తమ ఓటమి నుండి అయినా పాటాలు నేర్చుకొని, తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అదీ లేదు. మళ్ళీ అవే తప్పులు చేసేందుకు సిద్దపడుతున్నారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో కేసీఆర్ తెలంగాణా బంద్ కు పిలుపునిస్తే దానిపై ఏవిధంగా ప్రతిస్పందించాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయారు టీ-కాంగ్రెస్ నేతలు.   అయితే కేసీఆర్ మరియు తెరాస నేతలు ఈ అంశంపై కూడా తమకంటే ముందుకు దూసుకుపోతుండటం చూసి, టీ-కాంగ్రెస్ నేతలు తాము కూడా పోలవరం ముంపు గ్రామాలపై ఉద్యమించాలని నిశ్చయించుకొన్నారు. టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో నిన్న సమావేశమయిన టీ-కాంగ్రెస్ నేతలందరూ, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడాన్ని వ్యతిరేఖించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలో వారిలో కొందరు నేతలు ముంపు గ్రామాలను స్వయంగా సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి తరపున తాము పోరాడుతామని దైర్యం చెప్పాలని కూడా నిర్ణయించుకొన్నారు.   అయితే ఈ ఆత్రుతలో టీ-కాంగ్రెస్ నేతలు ఒక ముఖ్యమయిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆగ్రహంతో ఉన్నసీమాంధ్రులను శాంతింపజేసేందుకే, కాంగ్రెస్ అధిష్టానం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు బదలాయించేందుకు ఆర్డినెన్స్ సిద్దం చేసింది. కానీ సమయాభావం వల్ల ఆ ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేయించలేకపోయింది. అటువంటప్పుడు, టీ-కాంగ్రెస్ నేతలు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు పోలవరం అంశంపై తెరాస నేతల వ్యూహాలను గుడ్డిగా అనుకరిస్తే వారే నవ్వులపాలవడం ఖాయం.

మేకపాటికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నాయకత్వం

  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నెల్లూరు ఎంపి, జగన్‌కి మొదటి నుంచీ అండగా వున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ‘ఎంపి’కయ్యారు. పార్లమెంట్‌లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అరకు ఎంపి కొత్తపల్లి గీత, కార్యదర్శిగా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా కర్నూలు ఎంపి బుట్టారేణుక, విప్‌గా ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. వీరి పేర్లను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం పార్టీ సమావేశం జరిగిన అనంతరం పార్లమెంటులో వైసీపీని ముందుకు నడిపించే నాయకుల పేర్లతోపాటు తెలంగాణ అసెంబ్లీలో వైసీపీ వాణి వినిపించే నాయకుల పేర్లను కూడా ప్రకటించారు. అలాగే మరికొన్ని బాధ్యతలు ఎవరెవరికి అప్పగించిందీ ప్రకటించారు. పార్టీ అధికార జాతీయ ప్రతినిధులుగా తిరుపతి ఎంపి వి వరప్రసాదరావు, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి పివి మిథున్ రెడ్డిని నియమించారు. తెలంగాణ అసెంబ్లీ వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష నేతగా అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఉప నేతగా పాయం వెంకటేశ్వర్లు, విప్‌గా మదనలాల్ నాయక్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అంశాల వారీగా తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించడం తమ పనికాదని, ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే ఆహ్వానిస్తామన్నారు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు.

హైకోర్టు పేరు మార్పు

  జూన్ రెండవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడుతున్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో హైకోర్టు ఏర్పాటు అయ్యేవరకు, రెండు రాష్ట్రాలకు ప్రస్తుత హైకోర్టే ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుంది. అయితే ఈ మార్పుకు అనుగుణంగా ‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు’ అనే పేరును మార్చి హైకోర్టు ఆఫ్ జూడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణా అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంద్రప్రదేశ్’ గా మారుస్తూ హైకోర్టు రిజిస్త్రార్ జనరల్ నిన్న సాయంత్రం ఆదేశాలు జారీ చేసారు. ఇకపై హైకోర్టు పేరు క్లుప్తంగా ‘హైకోర్టు ఆఫ్ హైదరాబాద్’ అని చెప్పుకోవచ్చును. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే వైజాగ్ లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బహుశః దానినే ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్విత హైకోర్టుగా మార్చే అవకాశం ఉంది. అంటే రాజధాని గుంటూరు విజయవాడ మధ్య ఏర్పడితే, హైకోర్టు వైజాగ్ లో ఏర్పడబోతోందన్నమాట.

జూన్ 2నే సీఎంగా కేసిఆర్, గవర్నర్‌గా నరసింహన్

      జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని నరసింహన్ తెలిపారు. అదే రోజు ఉదయం 8.15 గంటలకు తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్రపతి పాలన ముగుస్తుందని పేర్కొన్నారు. ఏపీలో జూన్ 8 వరకు రాష్ట్రపతి పాలన ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సీఎంలు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ర్టాలు సమానంగా అభివద్ధి చెందుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. విద్యుత్ పంపిణీపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరగాలన్నారు. తెలంగాణకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తగిన జలవనరులు ఉన్నందున అక్కడ వినియోగం తక్కువగా ఉంటుందని చెప్పారు. వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయింపు ఉంటుందన్నారు. రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్రమోడీకి అన్ని వివరించాను.. అన్నీ సావధానంగా విన్నారని తెలిపారు. నాలుగేళ్ల పాటు ఎలాంటి బుల్లెట్ వాడకుండా శాంతిభద్రతలు కాపాడామని పేర్కొన్నారు.

ఏపి కొత్త రాజధానిగా విజయవాడ-గుంటూరే..!

      ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తమ పార్టీ నేతలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు సీఎం క్యాంపు కార్యాలయంగా విజయవాడ-గుంటూరు మధ్యన ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎంపిక చేసుకున్నారు. రాజధాని ఏర్పాటు పనులను ఇక్కడ్నుంచే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెంకయ్య నాయుడు కూడా హైదరాబాద్-సికింద్రాబాద్ లగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు కూడా. దేశంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ కన్నా విజయవాడ- గుంటూరు- తెనాలి- మంగళగిరి విస్తీర్ణం అతి పెద్దది. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ విస్తీర్ణం 6300 చదరపు కిలోమీటర్లు కాగా, విజిటిఎం విస్తీర్ణం 7068 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో అనుకున్న మాదిరిగా నగరాల్లో కాకుండా పట్టణాల్లోనే రాజధాని నిర్మించాలని భావిస్తే విజిటిఎం పరిధిలో ఉన్న నాలుగు మున్సిపాల్టీల్లో మంగళగిరి లేదా నూజివీడు మున్సిపాల్టీలను ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. చంద్రబాబు ఈ ప్రాంతాల్లోని రైలు, రోడ్డు, విమాన మార్గాలకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నారట. మరోవైపు గుంటూరు...విజయవాడల్లోనే రాజధాని అనే ప్రచారం నేపథ్యంలో భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి.  

చైనాలో భూకంపం

      చైనాలోని నైరుతి తీరంలోని యువాన్ ప్రావిన్స్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంపధాటికి 43 మందికి గాయాలయ్యాయి. దీంతో యింగ్ జియాంగ్‌లోని 15 టౌన్‌షిప్‌ల్లో సుమారు సుమారు ఒక లక్షా యాభై వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని కమ్యూనిస్టుపార్టీ నేత వాంగ్ జుంకియాంగ్ తెలిపారు. 50మందితో కూడిన సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మురం చేసినట్లు వాంగ్ తెలిపారు. సిబ్బంది 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల సుమారు 3,390 భవనాలు, ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా.. 18 వేలకు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

చంద్రబాబు కోర్కెల చిట్టా

  నిన్న డిల్లీలో వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు నాయుడు, చివరిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి, రాష్ట్రాన్ని ఆదుకొనే బాధ్యత కేంద్రానిదేనని మరోమారు గుర్తు చేసారు. మోడీతో సహా కేంద్రమంత్రులందరూ ఆయన అభ్యర్ధనకు సానుకూలంగానే స్పందించారు. వారితో సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం ముందు ఉంచిన తన జాబితా గురించి వివరించారు.   వాటిలో ప్రధానంగా రాష్ట్రా ఆర్ధిక లోటును కేంద్రమే భరించడం, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించడం, కొత్త రాజధాని నగరం కోసం ప్రత్యేకంగా 30 టీయంసీల నీరు కేటాయింపు, విద్యుత్ లోటును భర్తీ చేస్తూ రాష్ట్రానికి అదనపు విద్యుత్ మరియు నిధులు కేటాయింపు, వ్యవయంలో లోటును భర్తీ చేస్తూ కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక అధారిటీని ఏర్పాటు చేసి, నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం, కృష్ణ, గోదావరి నదీ జలాల పంపకానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, రాష్ట్రానికి వెనువెంటనే ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, పెట్రోలియం విశ్వవిద్యాలయ ఏర్పాటు, పారిశ్రామిక సంస్థలకు పన్ను రాయితీలు, యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చియా ఐదేళ్ళ ప్రత్యేక హోదాను అవసరాన్ని బట్టి మరికొన్నేళ్ళు పొడిగింపు, విభజన బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడం, ఈ పనులన్నిటినీ నిరంతరంగా పర్యవేక్షించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంవంటివి తాను కోరానని చంద్రబాబు తెలిపారు.

కేసీఆర్ మంత్రివర్గంలో బాలకృష్ణ

    కేసీఆర్ మంత్రివర్గంలో , కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు ఉంటారని ఇప్పటికే రూడీ అయ్యింది. ఇప్పుడు తాజాగా మరో ఇద్ద్దరి పేర్లు బయటపడ్డాయి. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే లక్ష్మి కూడా 15 మందితో కూడిన కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నట్లు తాజా సమాచారం. కేసీఆర్ తన మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటూనే, అదే సమయంలో తెలంగాణాలో పది జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కపిన్చినట్లు తెలుస్తోంది. ఎల్లుండి ఆయనతో బాటు ప్రమాణం స్వీకారం చేయబోయే మంత్రుల పేర్లను రేపు సాయంత్రం ఆయన గవర్నరుకు అందజేస్తారు. ఆ తరువాతనే వారందరి పేర్లు మీడియా చేతికి చిక్కే అవకాశం ఉంది. కేసీఆర్ మరియు ఆయన మంత్రివర్గ సభ్యులు జూన్ రెండున ఉదయం 8.45 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేరోజు ఉదయం ఆరు గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు గవర్నర్ గా నియమితులయిన నరసింహన్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఆయన కేసీఆర్ మంత్రి వర్గం చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ప్రభుత్వాలు మారితే పేర్లు కూడా మార్చాలా?

  శంషాబాద్ విమానశ్రయం పేరు మార్చేందుకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించారు. కానీ కాంగ్రెస్, తెరాస పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాయి. ప్రభుత్వాలు మారగానే విమానాశ్రయాలు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల పేర్లు మార్చుకొంటూ వెళితే అదొక వికృత సాంప్రదాయానికి బీజం వేసినట్లవుతుంది. సంస్థలకు, జిల్లాలకు మహనీయుల పేర్లను పెట్టడం హర్షణీయమే, కానీ దానిని మరొకరు వచ్చి తొలగిస్తే అది చాలా అవమానకరంగా ఉంటుంది. అది వారి గౌరవానికి భంగం కలిగించడమే కాక వారిని అభిమానించే ప్రజల మనసులు కూడా నొచ్చుకొంటాయి. అందువలన స్వర్గీయ యన్టీఆర్ పుట్టిపెరిగిన కృష్ణా జిల్లాలోనే ఏర్పాటు చేయబోతున్న అంతర్జాతీయ విమానశ్రయానికి ఆయన పేరు పెడితే అందరూ హర్షిస్తారు కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు కూడా ఇటువంటి సూచనే చేసారు. గత ప్రభుత్వ హయంలో పెట్టిన పేర్లను మార్చే ప్రయత్నం చేయవద్దని, ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థలు, నిర్మించబోయే భవనాలకు ప్రజాభీష్టం మేరకు పేర్లు పెట్టడం మంచిదని సూచించారు. అందువల్ల శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చే ఆలోచనను కూడా విరమించుకొంటే మంచిది.

పాపం చిదంబరాన్ని పట్టుకొని ఎంత మాటనేసారు...

  మాజీ ఆర్ధికమంత్రి పీ. చిదంబరం లెక్కలలో చాలా దిట్ట. ఆయన కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చాలా ముందుగానే చాలా ఖచ్చితంగా లెక్కగట్టారు. అందుకే ఈసారి ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ తన ముద్దుల కొడుకు కార్తిని తన స్థానంలో తమిళనాడులో శివగంగ పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీకి దింపారు. ఎందుకంటే ఓడిపోయినా కాసింత ఎన్నికల అనుభవమయినా వస్తుంది కదాని! ఆయన లెక్క తప్పలేదు. కొడుకు ఓడిపోయాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది.   కాంగ్రెస్ ఇప్పుడు ‘ఆత్మవిమర్శ మోడ్’ లో ఉంది. అంటే ‘ఓటమికి కారణాలు కనిపెట్టుకోవడం, వాటిని సరిదిద్దుకోవడం’ అని అందరూ పొరపడుతుంటారు. కానీ దానర్ధం ‘ఈ ఓటమికి మీదే బాధ్యత అంటే కాదు మీదే’ అని వాదించుకోవడం అన్నమాట.   ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు మీడియా వాళ్ళను పిలిచి ‘ఈ ఓటమికి మాదే బాధ్యత’ అని ప్రకటించినపటికీ, వీరవిధేయ కాంగ్రెస్ నేతలు మాత్రం ‘ఆ నేరం, భారం మా నెత్తినే వేసుకొంటాము, మీరే మమ్మల్ని ఏలండి ప్లీజ్!’ అని వేడుకొన్నారు. అలాగని ఏ ఒక్కరూ ఓటమికి బాధ్యత తమదేనని చెప్పుకొన్న దాఖలాలు లేవు. ప్రతీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి, ‘ఓటమికి మీదే బాధ్యత అంటే కాదు మీదే’ నని వాదించుకొంటూ ఎన్నికల కిక్కుని, వేడిని దించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.   ఇక మళ్ళీ కధలోకి వస్తే ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే పనిలో చాలా బిజీగా ఉన్నారు. “తమిళనాడులో కాంగ్రెస్ ఘోరపరాజయానికి ప్రధాన కారణం రాష్ట్ర పీసీసీ అసమర్దతే. ఎన్నికలలో పార్టీ నేతలందరిని ఏకత్రాటిపై నడిపించడంలో ఘోరంగా విఫలమయిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవి నుండి తప్పుకోవాలి,” అని చిదంబరం తనయుడు కార్తి, వారి అనుచరులు కొందరు కలిసి డిమాండ్ చేసారు.   అందుకు అటువైపు నుండి అంతే ధీటుగా, చాలా ఘాటుగా చిదంబరం బుర్ర తిరిపోయేలా సమాధానం వచ్చింది. “తమిళనాడు రాష్ట్రంలో పార్టీ ఓటమికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ కారణమని ఆరోపిస్తున్న వారందరూ, ఆయన (చిదంబరం) అవలంభించిన లోపభూయిష్టమయిన ఆర్ధిక విధానాల వల్లనే దేశమంతటా పార్టీ ఊడ్చిపెట్టుకొని పోయిందని గ్రహించాలి. ఆయన విధానాల వల్లనే దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ ఆయన వాటిని నియంత్రించాలని ఎన్నడూ గట్టిగా ప్రయత్నం చేయలేదు. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురయ్యి తుడిచిపెట్టుకుపోయింది."   "అంతే కాదు ఆయన నిర్వాకం వల్ల కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన కాంగ్రెస్ అధిష్టాన్ని తప్పు దారి పట్టించారు. అందుకే రెండు ప్రాంతాలలో పార్టీ ఘోరపరాజయం పాలయింది. ఈవిధంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగించిన ఆయన ఏవిధంగా తమిళనాడులో పార్టీ ఓటమికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ బాధ్యులని ఆరోపిస్తున్నారు?"   "కేంద్రమంత్రిననే అహంతో ఆయన ఏనాడు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం తన కొడుకు పోటీ చేస్తున్న శివగంగలో మాత్రమే ప్రచారం చేసుకొన్నారు. అయినప్పటికీ ఆయన తన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారు. అటువంటి వ్యక్తి ఏవిధంగా ఇతరులను నిందిస్తారు?” అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ అనుచరులు చిదంబరాన్ని ఎదురు ప్రశ్నించారు.   చిదంబరం అధికారంలో ఉన్నంత కాలం చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఒకవెలుగు వెలిగారు. దేశంలో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలను తన చిటికన వ్రేలుతో ఆడించారు. స్టాక్ మార్కెట్లను తన కనుసైగతో కదిలించేవారు. అటువంటి పెద్దమనిషిని పట్టుకొని స్వంత రాష్ట్రం వాళ్ళే ఎంతమాట అనేశారు? పాపం... చిదంబరం.

సచివాలయం విభజన జీవోలు జారీ

      సచివాలయం భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తూ 196,197 జీవోలు జారీ అయ్యాయి. తెలంగాణకు ఏ,బీ,సీ,డీ బ్లాక్‌లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు సౌత్ హెచ్, నార్త్‌హెచ్, ఎల్,కే, జే బ్లాక్‌లను కేటాయించారు. ఎల్ బ్లాక్ 8 వ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాంబర్, ఏడవ అంతస్థులో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఛాంబర్ ఉండనున్నాయి.   పాత అసెంబ్లీ భవనం, సమావేశం మందిరాన్ని ఏపీకి కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం, మంత్రుల గదులను తెలంగాణకు కేటాయించారు. అలాగే ప్రస్తుత శాసనమండలి భవనం ఏపీకి, తెలంగాణ శాసనమండలి కోసం జూబ్లీహల్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ క్యాంప్ ఆఫీస్‌గా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, కుందన్‌బాగ్‌లో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా నిర్దారించారు. జూబ్లీహిల్‌సలోని మంత్రుల క్వాటర్స్‌లో 1 నుంచి 15 వరకు తెలంగాణ మంత్రులకు 16 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించారు. ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 11 నుంచి 19 బ్లాక్‌లు, 20 నుంచి 23 డీలక్స్ బ్లాక్‌లు, హైదర్‌గూడలోని ఎంఎస్-1 బ్లాక్‌లను ఏపీ ఎమ్మెల్యేలకు కేటాయించారు. ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ 1 నుంచి 10 బ్లాక్‌లు, 24వ బ్లాక్(మూడంతస్థుల డీలక్స్ బిల్డింగ్), డాక్టర్స్ క్వార్టర్స్(రెండస్థుల భవనం), హైదర్‌గూడలోని ఎంఎస్-2 బ్లాక్‌లను తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయించారు.

టిడిపి డిప్యూటీ సీఎంగా నారాయణ..!

      ఎన్నికల సంధర్బంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే కాపులకు, బీసీలకు చెరోక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాపుల కోటా కింద డిప్యూటీ సీఎంగా నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పి.నారాయణకు చంద్రబాబు అవకాశం ఇవ్వలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారాయణ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ టీడీపీ టికెట్ల కేటాయింపుల్లో నేతల మధ్య భేదాలు రాకుండా ఉత్తరాంధ్రలో తనవంతు పాత్ర పోషించాడని కొంతమంది టిడిపి తమ్ముళ్ళు చెబుతున్నారు. అయితే ఈ పదవి పార్టీలో చాలా కాలంగా కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నేతలకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్నవారు.. ఉన్నట్టుండి నారాయణ పేరు ఆ పదవి విషయంలో వినిపిస్తుండటంతో కొంత గందరగోళానికి గురవుతున్నారు. అందులోనూ కాపు కోటాలో ఇప్పుడు పదవి పై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకొన్నారు. నారాయణకు గనుక ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవిని ఇస్తే కొంతమంది నేతలు బాబుపై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

ఢిల్లీలో బాబు బిజీ: జైట్లీతో ఏపీ రాయితీలపై చర్చ

      టిడిపి అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆప్రాంత అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యాచరణలో అప్పుడే నిమగ్నమయ్యారు. సీమాంధ్ర పునర్నిర్మాణం కోసం కావల్సిన నిధులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన రాయితీల చిట్టాలతో ఢిల్లీ వెళ్ళిన బాబు ముందుగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ జైట్లీతో భేటి అయ్యారు. ఈ సమావేశంలో బాబు జైట్లీని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రాయితీలపై స్పష్టత ఇవ్వలని కోరారు. సీమాంధ్రకు ఉత్తరాఖండ్ తరహా ప్యాకేజ్ కూడా ఇవ్వాలని కోరారు. సీమాంధ్రకు ఆర్థిక సాయానికి సంబంధించిన వ్యవహారాలపై ప్రణాళికా సంఘం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని జైట్లీ తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం సీమాంధ్రకు ఆర్థికంగా మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని కూడా జైట్లీ చెప్పారు. ఈ రోజంతా వరుస భేటీలతో ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడపబోతున్నారు.

బాబు ప్రమాణానికి మోడీ, పవన్..!

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూన్ 8న ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాబు మోడీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన పార్టీ నేతలకు కూడా చెప్పినట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున మోదీ రాగలుగుతారా అన్న సందేహాన్ని నేతలు వ్యక్తం చేయగా..స్వయంగా తానే మోదీని కలిసి ఆహ్వానిస్తానని బాబు తెలిపారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన సినీనటుడు పవన్ కల్యాణ్‌నూ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే నలుగురు ముఖ్యమంత్రులను కూడా బాబు ఆహ్వానించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గోవా ముఖ్యమంత్రి పారికర్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

      తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడం నిరసిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామాన్ని, సెంటు భూమిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టంచేశారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ముంపు గ్రామాలను వదులుకోబోమన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వంపై రాజ్యాంగ ఉల్లంఘన కింద సుప్రీంకోర్టు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మానవ విధ్వంసం చేయడం ద్వారా ఏ రకమైన అభివద్ధిని టీడీపీ, బీజేపీలు కోరుకుంటున్నాయని ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేసే వరకు పోలవరం ప్రస్తుత డిజైన్‌ను మార్పు చేసే వరకు సీపీఎం ప్రజాపోరాటం ఆగదని తేల్చిచెప్పారు.