వర్మకి శ్రీదేవి లాయర్ నోటీసులు

  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాను తీయబోయే ‘సావిత్రి’ అనే కళాఖండం తాలూకు స్టిల్స్ బయటపెట్టినప్పుడు కలకలం రేగిన విషయం తెలిసిందే. ఒక చిన్నకుర్రాడు తన టీచర్‌‌ని చూస్తున్న చిత్రాలు బయటపడగానే మహిళా సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. వర్మ ఏవోవే సుత్తి కబుర్లు చెప్పినప్పటికీ నిరసన ఆగలేదు. ఆ తర్వాత వర్మ ఆ సినిమా పేరును ‘శ్రీదేవి’ అని మార్చాడు. దాంతో ఇప్పుడు సినీ నటి శ్రీదేవి  వర్మకి నోటీసులు పంపింది. ఒక అసభ్యమైన సినిమాకి తన పేరు పెట్టడమేంటని ఆమె తన నోటీసులలో ప్రశ్నించింది. రామ్ గోపాల్ వర్మకి లాయర్లు పంపిన నోటీసులో- దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రీదేవి నటిగా మంచి పేరుందని, ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఆమె పేరుని.. అందులోనూ అభ్యంతరకరంగా ఉంటుందేమోననే భావనను ప్రచార చిత్రాలు కల్పించిన నేపథ్యంలో ఆమె పేరుని టైటిల్‌గా వాడటం తగదని శ్రీదేవి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయమై శ్రీదేవి భర్త రామ్‌గోపాల్ వర్మను వివరణ కోరాలని ఫోన్ చేస్తే, వర్మ ఒక వాట్సప్ మెసేజ్ పంపి ఊరుకున్నాడని, ఇది పద్ధతి కాదని పేర్కొన్నారు. వర్మ గతంలో పలు ఇంటర్వ్యూల్లో శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె భర్త బోనీని చూస్తే అసూయగా ఉందని వర్మ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా సదరు న్యాయవాది గుర్తు చేశారు. ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోగా స్పందించకపోతే తాము తీసుకునే తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా శ్రీదేవి తరఫున ఆ నోటీసులలో న్యాయవాది తెలిపారు. ఈ చిత్రం టైటిల్ మార్చుతున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వాలని, జాతీయ స్థాయి వార్తా పత్రికల్లో క్షమాపణలు చెబుతూ, ప్రకటన ఇవ్వాలని, వేరే కొత్త టైటిల్‌ని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

60 అడుగులు ముందుకొచ్చిన సముద్రం

  హుదూద్ తుఫాను ప్రభావంతో విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 60 అడుగులు దాటి ముందుకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సముద్ర తీరాల్లోని మత్స్యకారులందరూ ముందు జాగ్రత్తగా తెప్పలు, పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. చాలామందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్ళకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.

వరంగల్: మహిళా రైతు ఆత్మహత్య

  తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో కరెంటు సమస్య కారణంగా అప్పులు చేసి పండిస్తున్న పంట ఎండిపోవడంతో పార్వతి అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రంధన్ తండాలో ఈ దారుణం జరిగింది. ఈ గ్రామానికి చెందిన పార్వతికి ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది. అయితే రోజుకు రెండు మూడు గంటలు కూడా కరెంటు సక్రమంగా రాకపోవడంతో ఆ పొలం ఎండిపోయింది. డబ్బు మొత్తం పంటకే పెట్టడంతో తన కుమార్తెకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితికి ఈ మహిళా రైతు చేరుకుంది. ఈ సమస్యలతో పార్వతి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.

మోడీని కలిసిన ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్

  ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకి వచ్చిన జుకర్‌బర్గ్ ఇక్కడ మోడీని కలవటంతోపాటు ఇంటర్నెట్ మీద జరిగే ఒక సదస్సులో కూడా పాల్గొంటారు. మోడీని కలిసిన అనంతరం జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, ఫేస్‌బుక్ కారణంగా ప్రధాని నరేంద్రమోడీ గురించి భారతదేశంలోని మారుమూల గ్రామాలకు కూడా బాగా తెలిసిందని అన్నారు. భారతదేశంలో ఫేస్‌బుక్ సేవలను మరింత విస్తరించే ఆలోచన తనకు వుందని చెప్పారు. భారతదేశంలో ఇంకా వందకోట్ల మందికి ఇంటర్‌నెట్ సదుపాయం లభించాల్సి వుందని ఆయన అన్నారు. భారతదేశం తమకు చాలా ప్రధానమైన మార్కెట్ అని, ఇక్కడి మార్కెట్‌ని కాపాడుకుంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

దిక్కులు చూడకు రామయ్య స్వీట్ రివ్యూ

  తారాగణం: నాగశౌర్య, సనా మక్బూల్,అజయ్, ఇంద్రజ, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: కీరవాణి, దర్శకత్వం: త్రికోటి, నిర్మాత: రజనీ కొర్రపాటి.   ‘అమెరికన్ బ్యూటీ’ అనే సూపర్ హిట్ ఇంగ్లిష్ సినిమా ప్రేరణతో తయారు చేసుకున్న కథ అనిపించే ‘దిక్కులు చూడకు రామయ్య’ తెలుగులో సరికొత్త కథాంశంతో చేసిన ప్రయత్నమనిచెప్పవచ్చు. పదిహేనేళ్లకే గోపాలకృష్ణ అలియాస్ క్రిష్ (అజయ్)కి భవాని (ఇంద్రజ)తో పెళ్లయిపోతుంది. చిన్న వయసులోనే ఇద్దరి బిడ్దల తండ్రి అయిపోతాడు. టీనేజ్‌ని సరిగ్గా ఎంజాయ్ చేయలేపోయాననే వెలితి క్రిష్‌లో ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే మధు (నాగశౌర్య) క్రిష్ కొడుకు. అయితే ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చేయలేదన్న బాధలో సమీత (సనా మక్బుల్) అనే అమ్మాయికి క్రిష్ సైట్ కొడుతూవుంటాడు. తనకు పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ అమ్మాయినే మధు కూడా ప్రేమిస్తాడు. అయితే ఒక సందర్భంలో తన తండ్రి సమీతతో చనువుగా ఉంటున్నాడని తెలుస్తుంది. సమీత కూడా తన తండ్రిని పెళ్లాడటానికి రెడీగా ఉందని తెలుసుకున్న మధు, తన తల్లి కోసం ఏం చేశాడు? ఏ విధంగా తన తండ్రిని మార్చాడు? అనేది ఈ ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా కథ.   ఈ చిత్రానికి హీరో నాగశౌర్య అయినా, కథాపరంగా అసలు హీరో అజయ్. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ పాత్రను ఇందులో అజయ్ చేశారు. తల్లి బాగుకోసం పరితపిస్తూ, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో నాగశౌర్య చక్కగా ఇమిడిపోయాడు. తన పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేశాడు. సనా మక్బూల్ అందానికీ, అభినయానికీ ఆస్కారమున్న పాత్ర చేసింది. చాలాకాలం తర్వాత వెండితెరపై మెరిసిన ఇంద్రజ తల్లి పాత్రలో మెప్పించారు. బ్రహ్మాజీ చక్కని వినోదాన్ని పంచారు.   ఈ సినిమాలో ప్రేమ, బంధాలు, భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. చక్కని వినోదంతో ప్రేక్షకులకు విసుగు రాకుండా జాగ్రత్త పడ్డారు. తన సంగీతంతో కీరవాణి సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారాయన.

దళితుడు కాకుండా.. దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు: రేవంత్‌రెడ్డి

  తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తన తల తెగ నరుక్కుంటానని చెప్పాడని, అధికారం వచ్చాక తెలంగాణ ప్రజల్ని, దళితుల్ని మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన తెలంగాణకు ఓ దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గంలోని వారిని టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గర కేసీఆర్ కాపలాగా పెట్టాడని, టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి తీసుకురాకపోతే మంత్రి పదవుల నుంచి తప్పిస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం చేతకాకపోతే, చంద్రబాబును ఒప్పించి మేమే విద్యుత్ తీసుకువస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ ఈ సందర్భంగా అన్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ ఆచూకీ ఎక్కడ?

  గురువారం నాడు హైదరాబాద్ నగరంలో ఆఫీసుకు వెళ్తున్నానని వెళ్ళి అదృశ్యమైపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం అందుతోంది. భవ్యశ్రీ తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిన్న మొత్తం స్విచ్ ఆఫ్ చేసిన వున్న భవ్యశ్రీ సెల్ ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి వుంది. భవ్యశ్రీ తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు ఆచూకీ కనిపెట్టారు. అయితే భవ్యశ్రీ సెల్ ఫోన్ తూర్పు గోదావరి జిల్లాలో వుందా.. లేక భవ్యశ్రీయే తూర్పు గోదావరి జిల్లాలో వుందా అనేది తేలాల్సి వుంది. ఈ విషయంలో పోలీసులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తమ్మీద భవ్యశ్రీ చరిత మిస్సింగ్ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.భవ్యశ్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్ ప్రస్తుతం వైజాగ్‌‌ని సూచిస్తున్నాయి. పోలీసులు భవ్యశ్రీ కోసం  విశాఖపట్టణంలో వెతుకుతున్నట్టు సమాచారం.

కేసీఆర్‌కి ధైర్యం లేదు: లోకేష్

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మరోసారి ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో చర్చించేందుకు కేసీఆర్కు ధైర్యంలేదని రుజువైందని లోకేష్ అన్నారు. తనకు చంద్రబాబుతో చర్చించే ధైర్యం లేక సమయం వృధా చేయడానికే చంద్రబాబుతో చర్చలకు తమ మంత్రులను పంపుతామంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేష్ ట్విట్టర్లో విమర్శించారు. తెలంగాణలోని పలు అంశాలపై చంద్రబాబుతో చర్చకు రావాలని లోకేష్ గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. దీనిపై తెలంగాణ మంత్రులు జగదీశ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుతో చర్చకు తాము సిద్ధమేనని ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

నరేంద్రమోడీకి గొంతు సమస్య

  భారత ప్రధాని నరేంద్రమోడీ గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని వేల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ భారీ స్థాయిలో ప్రసంగాలు చేస్తున్నారు. అలా మాట్లాడీ మాట్లాడీ నరేంద్రమోడీకి గొంతు నొప్పి వచ్చింది. గొంతు కూడా బాగా బొంగురుపోయింది. శుక్రవారం నాడు ఆయన తన గొంతు సహకరించకపోవడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో తన ప్రసంగాన్ని కేవలం 9 నిమిషాలకే పరిమితం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన..  ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. గతరాత్రి వరకు మోడీ గొంతు బాగానే ఉందని, తెల్లవారుజామున ఉన్నట్లుండి బాగా ఇబ్బందిపడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. భారీస్థాయిలో వచ్చిన ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు తాను మాట్లాడలేకపోయినందుకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు.

నోబెల్ పీస్ ప్రైజ్... మోడీ, షరీఫ్‌కి మలాలా ఆహ్వానం

  భారతదేశం, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం నెలకొని వుంటే, ఈ రెండు దేశాలకు చెందిన వారికి నోబుల్ శాంతి బహుమతి లభించింది. పాకిస్థాన్‌లో మహిళా చైతన్యానికి కృషి చేస్తున్న బాలిక మలాలా యూసఫ్జాయ్‌కి, భారతదేశంలో బాలల హక్కుల సాధనకు కృషి చేస్తున్న కైలాష్ సత్యార్థికి 2014 సంవత్సరానికి గాను నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతులకు ఎంపిక చేసింది. కైలాష్ సత్యార్థి ఎంతోకాలంగా భారతదేశంలో బాలల హక్కులను కాపాడటానికి తాను స్థాపించిన బచపన్ బాచావో ఆందోళన్ సంస్థ ద్వారా సుదీర్ఘ కృషి చేస్తున్నారు. సత్యార్థి నోబెల్ పురస్కారం అందుకుంటున్న ఏడవ భారతీయుడు. కైలాష్ సత్యార్థి 1990 సంవత్సరం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చేస్తున్న తన ఉద్యమం ద్వారా దాదాపు 80 వేల మంది బాల కార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పించారు. ఇదిలా వుంటే, డిసెంబర్‌లో జరిగే నోబెల్ శాంతి బహుమతిని తాను స్వీకరించే కార్యక్రమానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌లకు మలాలా యూసుఫ్ జాయ్ ఆహ్వానం పలికింది. 

భవ్యశ్రీ మిస్సింగ్: దంపతుల మధ్య విభేదాలు లేవు

  హైదరాబాద్‌కి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ చరిత అదృశ్యం కేసులో దర్యాప్తు జరుగుతోందని మాదాపూర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. భవ్యశ్రీ చరితకి, ఆమె భర్త కార్తీక్ చైతన్య మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేవని డీసీపీ తెలిపారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ గురువారం ఉదయం ఆఫీస్కు క్యాబ్లో వెళ్తున్నట్లు భర్త సెల్ఫోన్లో మెసేజ్ పెట్టింది. అనంతరం ఆమె ఆచూకీ తెలియకపోవటంతో ఆమె భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్యాబ్ డ్రైవర్లను విచారిస్తున్నారు.

టాప్ హీరోయిన్ నగ్న ఫొటోలు లీక్...

  సినీ హీరోయిన్ నగ్నంగా ఫొటోలు దిగడం... వాటిని తన పర్సనల్ కంప్యూటర్లోనో, ఫోన్‌లోనే దాచుకోవడం... వాటిని హ్యాకర్లు స్వాధీనం చేసుకుని ఇంటర్నెట్‌లో పెట్టడం... నా నగ్న పొటోలు బయటపడిపోయాయి బాబోయ్ అని సదరు హీరోయిన్ లబోదిబోమనడం... ఈ సీను ఇటీవలి కాలంలో హాలీవుడ్‌లో మామూలైపోయింది. ఈమధ్యకాలంలో అరడజను మంది హీరోయిన్ల విషయంలో ఇలాగే జరిగింది. ఇలా జరిగే ప్రమాదం వుందని తెలిసి కూడా హాలీవుడ్ హీరోయిన్లు నగ్న ఫొటోలు దిగుతూనే వున్నారు. వాటిని కంప్యూటర్లు, ఫోన్లలో పెడుతూనే వున్నారు. ఇంతకీ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, తాజాగా మరో హాలీవుడ్ హీరోయిన్ నగ్న ఫొటోలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. కెల్లీ బ్రూక్ అనే మాంఛి పర్సనాలిటీ వున్న హాలీవుడ్ హీరోయిన్ తన నగ్న ఫొటోలు, నగ్న సెల్ఫీలను తన పర్సనల్ కంప్యూటర్లో పెట్టింది. హ్యాకర్లు ఎంచక్కా ఆమె కంప్యూటర్ని హ్యాక్ చేసేసి ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టేశారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు తన నగ్న ఫోటోలను ప్రపంచం మొత్తం చూసేసిన తర్వాత కెల్లీ బ్రూక్ లబోదిబోమంటోంది. ఇలా తన నగ్న ఫొటోలను లీక్ చేయడం మానభంగం చేయడంతో సమానమని మొత్తుకుంటోంది. దీనికి కారణమైనవాళ్ళను పోలీసులు అర్జెంటుగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది. అసలు నగ్న ఫొటోలు దిగడం ఎందుకు.. అవి లీక్ అయ్యాయని ఇప్పుడు లబోదిబో అనడం ఎందుకు.. ఏంటో.. అంతా మాయ!

జైల్లో జయలలిత డ్యూటీ.. ధూప్‌స్టిక్స్ మేకింగ్

  అక్రమ ఆస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు, 100 కోట్ల జరిమానా శిక్ష పడిన  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెంగుళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో వున్నారు. జైల్లో వున్నవారు నిబంధనల ప్రకారం ఏదో ఒక పని చేయాల్సి వుంటుంది. జైలు అధికారులు జయ తనకు ఇష్టమైన పని చేయవచ్చునని టైలరింగ్ సెక్షన్, కూరగాయలు కోయడం.. లేదా తనకు నచ్చిన ఏ ఇతర పని అయినా చేయవచ్చని సూచించారు. మొదట జయలలిత ఏ పనీ చేయకూడదని అనుకున్నప్పటికీ చివరికి ధూప్ స్టిక్‌లు చుట్టే పని చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. జైల్లో తీరిగ్గా వున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ధూప్ స్టిక్‌లను అనుభవజ్ఞులు తయారు చేసినట్టుగా చక్కగా చకచకా చుట్టేస్తున్నట్టు తెలుస్తోంది. జయలలిత శ్రద్ధగా చుట్టిన ధూప్ స్టిక్స్‌ని ఏ దేవుడి దగ్గరైనా వెలిగిస్తే, ఆ దేవుడు కరుణిస్తే అప్పటికైనా ఆమెకు బెయిల్ వస్తుందేమో చూడాలి.

జవహర్ కమిటీ... ఆర్టీసీ సమావేశంలో ఆగ్రహావేశాలు

  ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో ఆగ్రహావేశాల కారణంగా గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సంస్థ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి జవహర్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన నివేదిక ఈ గందరగోళానికి దారి తీసింది. ఈ సమావేశంలో నివేదికపై తెలంగాణకు చెందిన మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ల నాయకులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు భేటీలో రసాభాసకు దారితీశాయి. ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన కన్సల్టెన్సీ నివేదిక తప్పులతడకగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఆర్టీసీ రెండు ప్రధాన కార్మిక సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు.