శశిథరూర్‌ని పదవి నుంచి గెంటేశారు

  మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ మీద కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం బాగుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీని పొగడ్డమే శశిథరూర్ చేసిన తప్పు. పొగిడింది చాల్లే ఆపమన్నా శశిథరూర్ ఎంతమాత్రం వినలేదు. దాంతో కేరళ కాంగ్రెస్ పార్టీ శశిథరూర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే పార్టీలో సీనియర్ నాయకుడు అయిన దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నట్టు మాట్లాడ్డంతో శశి థరూర్ మీద చర్యలు వుండవన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయితే శశిథరూర్‌ని పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.

కల్లు దుకాణాల మీద కేసు

  హైదరాబాద్ నగరంలో వీధివీధినా కల్లు దుకాణాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంలో భాగంగా దసరా నుంచి కొన్ని దుకాణాలు కూడా ప్రారంభమయ్యాయి. కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు హైదరాబాద్‌ ప్రజలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన కల్లును అందించడమే ఈ కల్లు దుకాణాలు ప్రారంభించడం వెనుక వున్న ఉద్దేశం. అయితే ఈ కల్లు దుకాణాలు ఏర్పాటు చేయడం తగదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. అసలు హైదరాబాద్‌ నగరంలో తాటి, ఈత చెట్లే లేవని, అందువల్లో గతంలో హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలను రద్దు చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు తాటి, ఈత చెట్లు లేని హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల కల్తీకల్లు ఏరులై పారే ప్రమాదం వుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

తుఫాను ప్రభావం: చంద్రబాబు ఏరియల్ సర్వే

  హుదూద్ తుఫాను ప్రభావానికి లోనైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం తెల్లవారు జామున చంద్రబాబు ఏరియల్ సర్వేకి వెళ్ళారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం లతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని పరిస్థితులను కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్ సర్వే తర్వాత చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులందరిని విశాఖ చేరుకోవాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు.వారికి తుపాను సహాయ చర్యలపై కార్యాచరణ అప్పగించి, రంగంలోకి దించారు. ముప్పై మంది ఐఎఎస్‌లను సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణ నిమిత్తం కేటాయించారు. మండలానికో ఐఏఎస్‌కి బాధ్యతలు అప్పగించారు. సహాయక చర్యలు పూర్తి అయ్యే వరకు చంద్రబాబు నాయుడు విశాఖలోనే వుంటారు.

విద్యార్థినిపై వేట కొడవలితో దాడి

  హైదరాబాద్ శివార్లలోని బండ్లగూడ అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి మరో విద్యార్థినిపై కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. తనను ప్రేమించడం లేదనే సాకుతో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రవళిపై ప్రదీప్ అనే ఉన్మాది కత్తితోదాడి చేశాడు. దాడి చేసిన తర్వాత ప్రదీప్ అక్కడే విషం తాగాడు. కాలేజీలోని విద్యార్థులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో విద్యార్థినిపై పదునైన వేట కొడవలితో దాడి చేసి అక్కడే విషం తాగిన యువకుడు ప్రదీప్ మరణించినట్టు సమాచారం. దాడికి గురైన విద్యార్థిని రవళి చికిత్స పొందుతోంది. రవళి ప్రమాదం నుంచి బయటపడినట్టు సమాచారం.

నర్సుకి ఇబోలా... అమెరికాలో ఎలర్ట్

  ఇప్పటి వరకూ ఆఫ్రికన్ దేశాలను హడలెత్తిస్తున్న ఇబోలా వ్యాధి ఇప్పుడు అమెరికాని కూడా భయపెడుతోంది. అమెరికాకు చెందిన థామస్ ఎరిక్ డంకన్ అనే వ్యక్తి లైబీరియా నుంచి సెప్టెంబర్ 20న డల్లాస్‌కి వచ్చాడు. డల్లాస్‌కి వచ్చిన తర్వాత అతనికి ఇబోలా వైరస్ సోకిందని తెలిసి హడలిపోయిన అమెరికా అతనికి ప్రత్యేక పద్ధతులలో చికిత్స నిర్వహించింది. అయితే 42 సంవత్సరాల వయసు వున్న డంకన్ ఆ తర్వాత చనిపోయారు. డంకన్‌కి చికిత్స చేసిన ఒక అమెరికన్ నర్సుకు కూడా ఎబోలా వ్యాధి వైరస్ సోకినట్టు కనుగొన్నారు. డంకన్ దగ్గరకి చికిత్స నిమిత్తం వెళ్ళిన సమయంలో నర్స్ సరైన రక్షణ పద్ధతులు పాటించకపోవడం వల్ల సదరు నర్సుకు కూడా ఎబోలా వ్యాధి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎబోలా వ్యాధి ఇంకా విస్తరించకుండా వుండటానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

శ్రీదేవి టైటిల్ మార్చేదే లేదు... వర్మ

  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించాలనుకున్న కళాఖండం ‘సావిత్రి’ అనే సినిమా పేరును ‘శ్రీదేవి’గా మార్చిన విషయం తెలిసిందే. తన పేరును సినిమా పేరుగా పెట్టడానికి వీల్లేదంటూ ప్రముఖ నటి శ్రీదేవి రామ్ గోపాల్ వర్మకు లాయర్ నోటీసులు పంపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీదేవి తనకు పంపిన నోటీసులకు వర్మ స్పందించారు. నటి శ్రీదేవి జీవితానికి , తాను తీయబోయే శ్రీదేవి సినిమాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అంచేత తన సినిమాకు ‘శ్రీదేవి’ అనే టైటిల్‌ని మార్చనని స్పష్టంగా చెప్పేశారు. పాతికేళ్ల యువతికి, టీనేజ్ యువకుడికి మధ్య కథ ఇదని, పేర్లకు హక్కులు ఉండవని వర్మ శ్రీదేవికి సమాధానమిచ్చారు.

రేపు విశాఖకు వస్తున్న మోడీ

  హుదూద్ తుఫాన్ విశాఖపట్టణాన్ని అల్లకల్లోలం చేసింది. విశాఖపట్టణంలో ఇప్పుడు వాతావరణం చాలా భయానకంగా వుంది. ఎక్కడ చూసినా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయి వున్నాయి. ఇప్పుడిప్పుడే నగర ప్రజలు బయటకి వస్తున్నారు. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వుంది. కరెంటు లేదు. కమ్యునికేషన్ వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. విశాఖలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఫోన్‌లో మాట్లడానని చెప్పారు. విశాఖ ప్రజలకు అండగా వుండటానికి మంగళవారం నాడు తాను విశాఖను సందర్శించనున్నానని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తెలిపారు.

రైతుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలే

  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీటీడీపీ నాయకులు తెలంగాణలో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఎర్రబెల్లి ఆదివారం నాడు కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్లు వేసే కాంట్రాక్ట్ తన బంధువుకు రాలేదన్న అక్కసుతోనే కేసీఆర్ ఈ విద్యుత్ లైన్ నిర్మాణ నిర్ణయాన్ని మార్చుకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. అయితే అసలు విషయాన్ని మరుగున పెట్టేసి నక్సల్స్ సమస్య వల్లనే కరెంటు లైన్లు వేయడం లేదని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.

హుదూద్ తుఫాను ప్రభావం... విశాఖ అల్లకల్లోలం..

  ముంచుకొచ్చిన హుదూద్ తుఫాను విశాఖపట్టణం నగరాన్ని అల్లకల్లోలం చేసింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. సెల్ టవర్లు కూలిపోయాయి, అనేక ఇళ్లు కుప్పకూలాయి, అపార్టుమెంట్లు బీటలు వారాయి. పెద్దపెద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా విరిగి పడిపోయాయి. కమ్యూనికేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. హోర్డింగులు పడిపోయాయి. తుఫాను కారణంగా భారీ సంఖ్యలో జంతువులు మరణించాయి. అయితే రవాణాకు పరిస్థితులు ఎంతమాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల అధికారులు ఆ పశువులను తొలగించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రోడ్లమీద పడి ఉన్న పశు కళేబరాలు కుళ్ళిపోవడం కారణంగా అంటువ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం చంద్రబాబుకు రాజ్‌నాథ్ ఫోన్

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ఉదయం ఫోన్ చేశారు. హుదూద్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై ఎలా వుందని  ఆయన ఈ సందర్భంగా చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు తుఫాను నష్టం వివరాలతో, రాష్ట్రంలోని పరిస్థితిని రాజ్నాథ్ సింగ్‌కి  వివరించారు. పరిస్థితి అంచనాకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆంధ్రప్రదేశ్ రావాలని చంద్రబాబు కోరారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. తుఫాను ప్రభావ పరిస్థితిని వివరించారు. రాజ్ నాథ్ ఫోన్ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

వైద్య విద్యార్థిని ఆత్మహత్య

  హైదరాబాద్‌లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు కారణం ఒక వైద్యురాలని అంటూ సూసైడ్‌ నోట్‌లో ఆ విద్యార్థిని పేర్కొంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మాధవి ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసి హైదరాబాద్ విద్యానగర్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో పీజీలో చేరింది. హాస్టల్‌లో వుంటున్న మాధవి ఆదివారం నాడు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు మెడికో మాధవి గదిలో తనిఖీ చేయగా వారికి సూసైడ్‌నోట్‌ కనిపించింది. అందులో తాను ఆత్మహత్య చేసుకోవడానికి డ్యూటీ డాక్టర్‌ కారణమని మాధవి చేతిరాతతో రాసి ఉంది. ఈ విషయం తెలిసింది. మాధవి తల్లిదండ్రులు నగరానికి చేరుకుని, తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బోరుబావిలోనే చిన్నారి.. రోదనలు...

  రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో నాలుగున్నరేళ్ల బాలిక గిరిజ ప్రమాదవశాత్తు పడిపోయింది. 300 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిన గిరిజను వెలికి తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం గిరిజ తాత తన పొలంలో వేసిన బోరుబావిలో నీరు పడకపోవడంతో కేసింగ్‌ తీసి గోతిని పూడ్చివేయకుండా అలాగే వదిలేశాడు. ఆదివారం నాడు పొలంలో పెద్దలు పని చేసుకుంటూ వుండగా, గిరిజ ఆడుకుంటూ వెళ్ళి బోరు గోతిలో పడిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాధికారులు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. బాలిక బతికి వుండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే బాలికను వెలికితీసే పనులు మాత్రం జరుగుతూనే వున్నాయి.

తెలంగాణలో డిజిటల్ విప్లవం రానుంది... మంత్రి కేటీఆర్

  తెలంగాణలో డిజిటల్ విప్లవం రాబోతోంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. తెలంగాణలో రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్నీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చనున్నట్టు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన పెగా డెవలపర్స్ ద్వితీయ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ శుభవార్త చెప్పారు. త్వరలోనే టెక్నాలజీ ఇంక్యూబేటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో ఐదువేల కంపెనీలు భాగస్వాములు అవుతాయని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ వివరించారు.

విశాఖలో చెట్లన్నీ కూలిపోయాయి

  హుదూద్ తుఫాన్ బీభత్సం కారణంగా విశాఖపట్నంలోని చెట్లన్నీ దాదాపు కూలిపోయినట్టు తెలుస్తోంది. రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. సముద్రం దగ్గర్నుంచి గాజువాక వరకు రోడ్లన్నీ ఊడ్చిపెట్టుకుని పోయాయని సమాచారం. చెట్లు కూడా ఒకటీ అరా తప్ప అన్నీ కూలిపోయాయి. విశాఖలోనే అందంగా వుండే బీచ్ రోడ్డు భారీ స్థాయిలో కోసుకుపోయింది. ఒక దశలో సముద్రం రోడ్డు వరకు వచ్చేసింది. హార్బర్ సమీపంలో రోడ్డు కోతకు గురై రాకపోకలు ఆగిపోయాయి. జగదంబ సెంటర్ తో సహా పలు రోడ్డు జంక్షన్లి దెబ్బతిన్నాయి. ఎయిర్‌పోర్టు పూర్తిగా దెబ్బతింది. చిన్న చిన్న వర్షాలకే నీరు నిలిచే రన్‌వే మీద ఇప్పుడు భారీ స్థాయిలో నీరు ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నానికి ఈ తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేయడానికే రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

బాహుబలి సెట్‌లో అగ్ని ప్రమాదం...

  ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. శనివారం సాయంత్రం ఫైట్ సన్నివేశాల షూటింగ్ చేస్తూ వుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించి నలుగురు ఫైటర్లకు మంటలు అంటుకున్నాయి. భారీ మొత్తంలో కుంకుమ వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో మంటలు  భారీగా ఎగసిపడ్డాయి. ఆ మంటలు షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చి పక్కనే నిలుచుని వున్న నలుగురు ఫైటర్లకు అతి సమీపంగా ఎగసిపడ్డాయి. దీంతో నలుగురు ఫైటర్లు సతీష్, పాండు, గణేష్, సంతోష్‌లకు కాలిన గాయాలయ్యాయి.

ప్రేమ పేరుతో వేధింపులు.. నిర్భయ కేసు నమోదు

  జగిత్యాలలో రవి అనే డిగ్రీ విద్యార్థి సిమ్రాన్ బేగం అనే యువతిని ప్రేమపేరుతో వేధిస్తూ వుండటంతో ఆ యువతి ఈ వేధింపులు తట్టుకోలేక ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సిమ్రాన్ బేగం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రవి మీద నిర్భయ కేసు నమోదు చేశారు. రవి చాలాకాలంగా సిమ్రాన్‌ని ప్రేమ, పెళ్ళి పేరుతో వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక సిమ్రాన్ కాలేజీకి వెళ్ళడం కూడా మానేసింది. దాంతో రవి సిమ్రాన్ ఇంటి పక్కనే వుండే తన స్నేహితుడితోపాటు మరో ఇద్దరు యువతులను ఆమె దగ్గరకి ప్రేమ రాయబారానికి పంపించాడు. దానిని సిమ్రాన్ ఇంట్లోని పెద్దలు గమనించడంతో పెద్ద గొడవ జరిగింది. ఈ అవమానం తట్టుకోలేక సిమ్రాన్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

భవ్యశ్రీ మిస్సింత్ కేసు.. శభాష్ పోలీసు...

  తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకినీ పోలీసులు కనుగొన్నారు. ఆమెను తన కుటుంబ సభ్యలకు అప్పగించారు. ఈ కేసు విషయంలో పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించారని అభినందనలు అందుకుంటున్నారు. భవ్యశ్రీ మిస్సయినట్టు ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. భవ్యశ్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్‌ని ట్రాక్ చేసిన పోలీసులు ఆమె మొదట తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు తెలుసుకుని అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత భవ్యశ్రీ వైజాగ్‌ పరిసరాల్లో వున్నట్టు తెలుసుకుని అక్కడ అన్వేషణ జరిపారు. ఒక గెస్ట్ హౌస్‌లో వున్న భవ్యశ్రీ పోలీసులు రావడం గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పోలీసులు భవ్యశ్రీని వైజాగ్‌లోనే అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌‌కి తీసుకొచ్చారు. ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. భవ్యశ్రీ ఇలా వెళ్ళిపోవడానికి కారణాలను పోలీసులు ఇంతవరకు వెల్లడించనప్పటికీ ఈ కేసు విషయంలో పోలీసులు చేసిన నిర్విరామ కృషిని అందరూ అభినందిస్తున్నారు.