ఉండవల్లి సోనియాను అవమానించడమే.. వీహెచ్

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వీ హనుమంత రావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీరును విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపైన  చర్చ జరగాలని.. రాజ్యాంగం, పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఏపీ పునర్విభజన చట్టం ఉభయ సభల ఆమోదం పొందిందా? లేదా? అన్న విషయంపై సమగ్రంగా ఆరా తీసి జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని ఉండవల్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తూ పుస్తకం ఇచ్చారు. దీనికి వీహెచ్ స్పందిస్తూ ఉండవల్లి చేసిన పని సరైనది కాదని.. రాష్ట్ర విభజన ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత జరిగిందేనని.. ఇప్పుడు ఉండవల్లి ఇలా చేయడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అవమానించడమే అని అన్నారు.

కేసీఆర్ ఖాతాలో మరో సమస్య

  ఇప్పటికే రైతుల ఆత్మహత్యలతో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అందరూ. దీనికి తోడు మళ్లీ ఇప్పుడు వేరే అంశం ఒకటి కేసీఆర్ ఖాతాలో చేరింది. వేతనాల పెంపుదలపై ఆశావర్కర్లు ఛలో అసెంబ్లీని చేపట్టిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎక్కడి వారిని అక్కడే అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులకు, వర్కర్లకు మధ్య తోపులాటలు జరగాయి. ఈ తోపులాటలో కొంతమంది వర్కర్లకు గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదివేల మంది వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు.  సచివాలయం ముట్టడికి జిల్లాల్లో ఆందోళనలకు ప్రయత్నించిన 8805 మందిని అరెస్టు చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ స్వయంగా ప్రకటించడమే దీనికి నిదర్శనం. ఇదిలా ఉండగా రైతు సమస్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఈరోజు బంద్ కూడా నిర్వహించారు. దీనితో పాటు ఇప్పుడు ఈ అంశం పై కూడా అధికార పార్టీపై ఆందోళనకు దిగడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఇంతా జరుగుతున్న కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తన్నట్టు వ్యవహరించడం. 

అమరావతి శంకుస్థాపన.. ఇన్విటేషన్ కార్డ్ ఇదే

ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మందిని ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డును ఆవిష్కరించారు. ఈ కార్డును చూస్తుంటే ఏపీ ప్రభుత్వం దీనిని చాలా చక్కగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. పూర్ణకుంభం చిత్రంతో కూడిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించారు. మరోవైపు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి.. చేపట్టవలసిన బాధ్యతలను తదితర అంశాలను చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకునేలా చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంతో పాటు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చనున్నారు.

తెలంగాణలో మరో 12 కొత్త జిల్లాలు

  తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 10 జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 10 జిల్లాలు కాకుండా ఇంకా రాష్ట్రంలో జిల్లాలను పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకవేళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని అప్పుడే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో 12 జిల్లాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. దీనికి సంబంధించి ఒక ముసాయిదాను కూజా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు మరింత అసంతృప్తి సెగ రేపకుండా ఉండేలా.. జిల్లా ఏర్పాటుకు సంబంధించి నిరసనలు.. ఆందోళనలు లాంటివి చోటు చేసుకోకుండా ఉండాలన్న భావనలో తెలంగాణ సర్కారు ఉంది. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వచ్చే జూన్ నాటికి పూర్తి కావాలని.. తెలంగాణ ఆవిర్భావ రెండో వార్షికోత్సం నాటికి.. తెలంగాణ కొత్త జిల్లాలతో కళకళలాడిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే ఏడాదికి 22 జిల్లాల తెలంగాణగ కళకళలాడుతుంది.

అదిపోయే సరికి కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా... వెంకయ్య

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెప్పాలని అంటున్నకాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు పైగా కాలయాపన చేసి.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న తరువాత.. ఆఖరికి తమ పార్టీ ప్రయోజనాల కోసం తీరిగ్గా అప్పుడు రాష్ట్ర విభజన చేసింది. అలాంటిది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి వారు విమర్శించడం.. ప్రత్యేక హోదా విషయంలో మోడీ మాట మీద నిలబడలేదు అని అనడం ఎటకారంగా ఉందని అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే.. ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు.. చట్టంలో ఎందుకు పెట్టలేదు..ఇప్పుడు ప్రతిపక్ష హోదా పోయిన తరువాత ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీ ఇస్తే సరిపోతుందా’ అంటూ కాంగ్రెస్‌ను నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా పై నీతి అయోగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది.. దానిని బట్టి ఏపీకి ప్రత్యేకహోదాపై నిర్ణయం తీసుకుంటాం అని వెంకయ్య తెలిపారు.

తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం.. బలరాం సంచలన వ్యాఖ్యలు

  రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ప్రసంగాల్లో ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడి పార్టీకి తంటాలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కూడా చేసింది అలాగే ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేటంలో కాంగ్రెస్ నేతలు ఓసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బలరాం నాయక్ తోపాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని.. ఈసారి కనుక కాంగ్రెస్ ను గెలిపించకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తామని నోరు జారారు. అంతే బలరాం చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేతలు ఒక్కసారిగా షాకయ్యి.. ఏం మాట్లాడుతున్నావని బలరాం ను హెచ్చరించారు. దీంతో బలరాం తేరుకొని జస్ట్ జోక్ చేశా అంటూ కవర్ చేసుకున్నారు. అయితే ఒకసారి నోరు జారిన తరువాత ఆమాటలు వెనక్కి రావు కదా.. ఇప్పుడు బలరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దొరికిందే ఛాన్స్ కదా అని కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర నాయకత్వం చేస్తున్న కుట్రులను బలరాం మాటల్లో అర్థమవుతుందని అంటున్నారు. ఈ ఒక్క మాట చాలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తుందో అంటూ ఒంటి కాలు మీద లేస్తున్నారు. అసలే అంతంత మాత్రం ఉన్న కాంగ్రెస్ ఉనికికి బలరాం వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.

రాష్ట్ర వ్యాప్తంగా బంద్.. పలు పార్టీ నేతల అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై గత కొద్దిరోజుల నుండి అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పుడు రైతు రుణమాఫీలు అన్నీ ఒకే దఫా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ రోజు బంద్ ను నిర్వహించాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల బంద్ కొనసాగుతుంది. దీంతో పలు డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు. కొన్నిచోట్ల నిరసన కారులు తెల్లవారుజామునుంచే డిపోల వద్దకు చేరుకొని బస్సులను కదలకుండా ఆపేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నగరంలోని పలు డిపోల ఎదుట అఖిలపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నగరంలో పలుచోట్ల బంద్ నిర్వహిస్తున్న పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నేత నారాయణను.. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి సహా పలువురు నాయకులను..  అదే విధంగా జూబ్లీ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సమయంలో జగన్ దీక్ష.. జైలు ఖాయం..

  ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకపక్క ఈ నెల 22వ తేదీన జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతుంటే మరోపక్క ప్రతిపక్షనేత జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ చేస్తున్న దీక్షపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన శుభకార్యం జరుగుతున్న సమయంలో జగన్ ఇలాంటి దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. శుభకార్య సమయంలో జగన్ చేసే ఈ చర్యలకు ఆయన తప్పకుండా మూడు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. జగన్ అందరికీ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

రేపు తెలంగాణా బంద్

  రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసనగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రేపు (శనివారం) తెలంగాణా రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తరువాత వాయిదాల పద్ధతిలో మాఫీ చేస్తామని చెపుతున్నారు. రుణమాఫీ చేయకపోవడంతో ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్న రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కనుక తక్షణమే రూ. 8,500 కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కానీ అంత మొత్తం ఒకేసారి విడుదల చేయలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పడంతో ప్రతిపక్షాలు రేపు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చాయి. తెరాస తప్ప ప్రతిపక్ష పార్టీలన్నీ బంద్ కి మద్దతు ఇస్తున్నందున అది విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువ. రైతన్నల సమస్య కోసం జరుగుతున్న బంద్ కనుక ప్రజలు కూడా స్వచ్చందంగా సహకరించే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుకిపైయెత్తు వేస్తుంటారు. కనుక ప్రతిపక్షాలు ఊహించని విధంగా ఏదయినా నిర్ణయం తీసుకొనవచ్చును.

ప్రత్యేక హోదా ఏం జిందా తిలిస్మాత్ కాదు ఇవ్వడానికి.. వెంకయ్యనాయుడు

  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే కానీ.. దానితోనే అన్నీ తీరిపోవని ఆయన అన్నారు. అన్నీ సమస్యలకు పరిష్కారం జిందా తిలిస్మాత్ మాదిరి.. ప్రత్యేక హోదాతో అన్నీ సమస్యలు పరిష్కారం కావన్నారు. ఇప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కలిగిఉన్నాయి. కాని ఇప్పటికీ సమస్యల పరిష్కారానికి మావద్దకు వస్తున్నారని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా పై నీతి అయోగ్ పర్యవేక్షిస్తుంది.. ఈ కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడటం ఏంటంని ప్రశ్నించారు.

స్టాలిన్ మళ్లీ చెయ్యి చేసుకున్నారు

  డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్  మరోసారి ఓ సామాన్యుడి చెంప చెల్లుమనిపించి వార్తల్లోకెక్కారు. గతంలో కూడా ఒకసారి తను మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై చెయ్యి చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకుని తన ప్రతాపాన్ని చూపించారు. స్టాలిన్ కోయంబత్తూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో తన చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ స్టాలిన్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా అసహనానికి లోనైన స్టాలిన్ అతనిపై చేయి చేసుకుని పక్కకు నెట్టేశారు. అయితే స్టాలిన్ అతనిని చేయి చేసుకోవడం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో హల్ చల్ చేస్తుంది. అయితే దీనిని స్టాలిన్ ఖండిస్తున్నారు. ఈవీడియోలో నిజం లేదని.. గ్రాఫిక్స్ యాడ్ చేశారని తాను ఆవ్యక్తిని నెట్టలేదని.. జనాలకు అసౌకర్యం కలిగించవద్దని పార్టీ కార్యకర్తకు తాను చెప్పానని, ఈ సందర్భంగా అతడిని నెట్టిన మాట వాస్తవమేనన్నారు. ఇదిలా ఉండగా దీనిపై స్టాలిన్ మేనేజర్ చెప్పిన దానికి.. స్టాలిన్ చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా ఉంది. అది  యాదృచ్చికంగా జరిగిందని ...స్టాలిన్ను చుట్టుముట్టిన వారిని అదుపు చేసే సమయంలో అలా జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రి

అమ్మాయిలపై జరిగే అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత మంది రాజకీయ నేతలు బుక్కవుతుంటారు. గతంలో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేయలేరని, ఒకరు రేప్ చేస్తే మిగిలిన అందరి పేర్లూ పెట్టేస్తారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి కూడా అదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లో  22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని  కదులుతున్న వ్యానులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా ప్రతినిధులు కేజే జార్జిని ప్రశ్నించగా దానికి ఆయన ఇద్దరే మగవాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని.. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. కేజే జార్జి చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలపై జరిగుతున్న అఘూయిత్యాల గురించి ఒక ప్రజానాయకుడు ఇలా మాట్లాడటం సరికాదని.. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని అన్నారు.

జగన్ దీక్షకు ఆదినారాయణరెడ్డి దూరం.. దీంతో అర్ధమైపోయింది

 వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ పార్టీకే చెందిన కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అతని సోదరుడు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డికూడా దీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో ఎప్పటినుండో ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతున్నా అని వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టుంది. ఇదిలా ఉండగా ఎప్పటినుండో ఆదినారాయణ రెడ్డి వైకాపా ను వీడి టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే తాను టీడీపీ అధినేత చంద్రబాబు తో కూడా మంతనాలు జరిపారు. చంద్రబాబు కూడా ఈ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈలోపు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడాల్సి వస్తుందని టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఆదినారాయణ రెడ్డి ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు తెలస్తోంది. కానీ ఆదినారాయణను టీడీపీలోకి ఆహ్వీనించడానికే ఎక్కవ సముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని రామసుబ్బారెడ్డి నేరుగా ఫిర్యాదు చేసినప్పుడు చంద్రబాబు మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారే తప్ప పార్టీలో చేర్చుకోబోమని చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే రామ సుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారు. మరో వైపు వైకాపా నేతలు కూడా ఆదినారాయణను పార్టీలో ఉంచడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ ఆదినారాయణ రెడ్డి మాత్రం పార్టీ లో ఉంటానని ఏ ఒక్కరికి చెప్పిన దాఖలాలు లేవు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరాలంటే ఇంకా టైం పట్టేలా ఉన్నట్టు తెలుస్తోంది.

పొలిటికల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ గుడ్ బై!

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎపిసోడ్ ముగిసినట్లేనని మెగా కాంపౌండ్ నుంచి వార్తలు వస్తున్నాయి, ఆమధ్య ఎప్పుడో రాహుల్ అనంతపురం టూర్లో మెరుపులా మెరిసినా... ఆ తర్వాత అటువైపు చూడటమే మానేశారని, ఏదో పేరుకి కాంగ్రెస్ నాయకుడని అనిపించుకుంటున్నా ఆ దరిదాపులకే వెళ్లడం లేదంటున్నారు, ఇప్పుడు ఆయన దృష్టంతా 150వ సినిమాపైనే ఉందని... పొలిటికల్ ఎపిసోడ్ కి దాదాపు గుడ్ బై చెప్పేసినట్లేనని అంటున్నారు. రాహుల్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని, ఆ విషయాన్ని చిరంజీవితో డైరెక్ట్ గా చెప్పి చీవాట్లు కూడా పెట్టారంటున్నారు, చిరంజీవి తన 150వ సినిమాపై పెడుతున్న శ్రద్ధ... పార్టీ బలోపేతంపై పెట్టుంటే... ఏపీలో కొంచెమైనా కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడి ఉండేదని అన్నారట. రాహుల్ వ్యాఖ్యలతో నొచ్చుకున్న చిరంజీవి...టోటల్ గా పొలిటికల్ లైఫ్ కి గుడ్ బై చెప్పేయాలని డిసైడయ్యారట.

టీఆర్ఎస్ లో స్వేచ్ఛ లేదంటున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే

ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది, తీవ్ర తర్జనభర్జనల తర్వాత టీడీపీని వీడి... తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా... తెలుగుదేశం పార్టీపై మాత్రం ఇంకా మమకారం పోలేదని చెబుతున్నారు, టీడీపీ తనకు సొంతిల్లు లాంటిదంటున్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు... టీఆర్ఎస్ లో తాను సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందంటున్నారు. అయితే తనకు టీడీపీలో ఉన్నంత స్వేచ్ఛ... టీఆర్ఎస్ లో లేదని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు, మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలతో కంగుతిన్న ఆయన అనుచరులు, గులాబీ శ్రేణులు... బలవంతంగా టీఆర్ఎస్ లో చేరినట్లున్నారని మాట్లాడుకుంటున్నారు

రైతు ఆత్మహత్యలపై ర్యాలీ.. దానం నాగేందర్ అరెస్ట్

  తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు రుణమాఫీ చేయాలని దానివల్ల రైతులకు ఆర్ధికంగా సహాయపడినట్టు ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరుతూ తెలంగాణలోని కాంగ్రెస్తోపాటు వివిధ రాజకీయ పక్షాలు రేపు తెలంగాణలో బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు నిర్వహించే బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్లతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. దీంతో పోలీసులు  వారిని అదుపులోకి తీసుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు.

జగన్ మందకృష్ణ మద్దతు.. చంద్రబాబు అందుకే మాట్లాడటంలేదు

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు లో నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ  మద్దతు తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఏపీకి రాజధాని ఎంత అవసరమో అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా అవసరమని అన్నారు. ప్రత్యేక హోదా ఏపీలో ఉన్న ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆకాంక్ష అని.. దానికోసం పోరాడుతున్న జగన్ కు మద్దతుగా ఉంటామని.. ప్రత్యేక హోదా పై ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అంతేకాదు వైసిపి భవిష్యత్తులో చేపట్టే పోరాటాల్లో భాగస్వాములం అవుతామని చెప్పారు. అంతేకాదు జగన్ చేస్తున్న దీక్షను ఏపీ మంత్రులు, టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కుపోవడం వల్లే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటంలేదని అన్నారు.